Monday 28 May 2012

'అపరిచితుడు' అప్పారావు


"జగన్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నట్నుండి మా వంటింట్లో పొయ్యిమీద గండుపిల్లి గురకలు పెట్టి నిద్రోతుంది. రెండునెల్ల పసిగుడ్డుతో సహా ఎవరూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. నా భార్య జగన్  జైల్నుండి విడుదలయ్యే దాకా కాపురం చెయ్యనంటూ పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది. మా నాన్న 'జగన్బాబూ!' అంటూ గుండెనొప్పితో మెలికలు తిరిగిపోయాడు. ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన అటూఇటుగా ఉన్నాడు. మా అమ్మ 'జగన్! జగన్!' అంటూ పిచ్చిపట్టి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అన్నా! జగనన్నా! నువ్వు పోరాటం సాగించన్నా! నీ వెనక మేమున్నామన్నా! నువ్వు దేవుడవన్నా! జై జగన్!" అంటూ భోరున విలపిస్తూ కూలిపోయాడు అప్పారావు.

"కట్!" చెప్పాడు 'సాక్షి' చానెల్ విలేఖరి

కెమేరామెన్ కెమేరాని సర్దుకుంటున్నాడు.

"ఏం బాబు! ఎమోషన్ బాగా కేరీ అయ్యిందా? కావలంటే ఇంకో టేక్ తీద్దాం." అన్నాడు అప్పారావు.

"అవసరం లేదు. ఇప్పటికే ఎక్కువ చెప్పారు." అన్నాడు 'సాక్షి' విలేఖరి.

అటు తరవాత అప్పారావు భార్య వారికి జీడిపప్పు ఉప్మా, నేతి పెసరట్లు వడ్డించింది.

వాళ్ళ పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మీ ఎడిటర్ తో మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా శృతి పెంచమన్నా పెంచుతాను, తగ్గించమన్నా తగ్గిస్తాను. మీ చానెల్ కి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తా!" ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు అప్పారావు.

అప్పారావు భార్య ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

"మీకు ఏ టాపిక్ మీద బైట్ కావలన్నా నన్ను సంప్రదించండి. రూపాయి పతనాన్ని ఆపలేక దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశాడు. ఆయనతో నాకు లైవ్ షో ఏర్పాటు చెయ్యండి. నా సలహాలకి సుబ్బారావు స్పృహ తప్పిపోవాలి." గర్వంగా అన్నాడు అప్పారావు.

వారికి వేటపాలెం జీడిపప్పు ప్యాకెట్లు చేతిలో పెట్టాడు.

"ఇవి ఉంచండి. గుర్తుంచుకోండి, అప్పడం నుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టుల్నీ కరకరలాడించి మింగేశాను. 'పనామాలో పందిమాంసం రేటెందుకు డౌనయ్యింది? ఇరాక్ లో ఉబ్బసానికి చేపమందు పని చేస్తుందా?' వంటి ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాల్లో కూడా నా అభిప్రాయం తీసుకోండి." ప్రాధేయపడ్డాడు అప్పారావు.

అప్పారావు ఆతిధ్యాన్ని స్వీకరించి 'బ్రేవ్!' మంటూ సెలవు తీసుకున్నారు 'సాక్షి' వారు.

అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో కూలబడ్డాడు అప్పారావు. తన 'అభిప్రాయం' సాక్షి చానెల్ వాళ్ళకి చెప్పడానికి 'మూడ్' (కన్నీళ్ళు) కోసం వంటింట్లో నాలుగు ఉల్లిపాయలు తరిగాడు. అంచేత కళ్ళు మండుతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.


"అప్పు! అప్పు! లేలే! నీ కోసం ఇంకో చానెల్ వాళ్ళొచ్చారు." అంటూ భార్య అరవడంతో ఉలిక్కిపడుతూ లేచాడు.

"నమస్తే! మేం ABN ఆంధ్రజ్యోతి చానెల్ నుండి వచ్చాం. జగన్ అరెస్టు గూర్చి మీ అభిప్రాయం చెబుతారా?" అంటూ ఆ చానెల్ వాళ్ళు వచ్చీ రావడంతోనే మొదలెట్టారు.

అప్పారావు వంటింట్లోకి పరిగెత్తాడు. నిమ్మకాయని కత్తితో రెండు బద్దలుగా కొశాడు. ఒక్కోకంట్లో ఒకబద్ద పిండుకున్నాడు. కళ్ళు ఎర్ర్గగా, చింతనిప్పుల్ల్లా మారిపొయ్యాయి. హాల్లోకొచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు.

"కెమెరా స్టార్ట్!"

"జగన్! జగన్! జగన్! అసలెవరీ జగన్? అఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. విక్రమార్కుడా? కాదు, అక్రమార్కుడు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్. ఈ దేశం ఏమైపోతుంది? జగన్ని సమర్ధించేవాళ్ళలారా! ఖబడ్దార్! ఒక విషయం గుర్తుంచుకోండి!" అంటూ కెమెరాలోకి కౄరంగా చూశాడు.

"జగన్ని సమర్ధిస్తే మీరు సద్దామ్ హుస్సేన్, ఒసమా బిన్ లాడెన్ని సమర్ధించినట్లే! జగన్ అవినీతి వల్లే ఎండలు మండిపోతున్నయ్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నయ్, సినిమాలు ఫ్లాపయిపోతున్నాయి." అంటూ గర్జించాడు అప్పారావు.

ఆంధ్రజ్యోతి వారిక్కూడా టిఫిన్లూ, కాఫీలు ఎరేంజ్ చేయబడ్డయ్.

తింటున్నవారి పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మొన్నామధ్య మీరు మా ఎదురింటి మంగతాయారుకి, పక్కింటి కృష్ణారావుకీ గల అక్రమ సమ్మందమ్మీద ఎనిమిది గంటల చర్చా కార్యక్రమం నడిపారు. ఎంత బ్రతిమాలినా నాకు మాట్లాడ్డానికి ఛాన్సివ్వలేదు. దయచేసి విలువైన నా అభిప్రాయం కూడా తీసుకోండి. నాకు బయాలజీ నుండి బూర్లెపాకం దాకా అన్ని  సబ్జక్టుల మీద మంచి గ్రిప్పుంది."

ఆంధ్రజ్యోతివాళ్ళు వెళ్ళేప్పుడు నూజివీడు రసాలు, ఆవకాయ జాడీలతో నిష్క్రమించారు.

అప్పారావు భార్యకి అనుమానం వచ్చింది.

"అప్పు! నువ్విట్లా చానెల్ చానెల్ కీ 'అపరిచితుడు'లో హీరోలాగా రంగులు మార్చేస్తున్నావ్. జనాలకి తెలిస్తే ప్రమాదమేమో?"

అప్పారావు నవ్వాడు.

"పిచ్చిమొహమా! అలా చెబితేనే వాళ్ళు చూపిస్తారు. అయినా - ఎవడికి నచ్చిన చానెల్ వాడు చూస్తాడు. ఒకవేళ అన్ని చానెళ్ళు చూసే పని లేని సన్నాసి ఎవడైనా ఉంటే అది వాడి ఖర్మ. సర్లే! నువ్వు వంట పని చూడు. ఈ దెబ్బకి మన పేరు ఆంధ్రదేశంలో మోగిపోవాలి." అన్నాడు అప్పారావు! 

(picture courtesy : Google)

Saturday 26 May 2012

జగన్ అవినీతి - కాంగ్రెస్ రాజనీతి


ఉదయాన్నే కాఫీ తాగుతూ 'ఆంధ్రజ్యోతి' తిరగేస్తున్నా. 'జగన్ అవినీతిపరుడు.' ఒప్పుకున్నాం! ఇంకేమన్నా వార్తలున్నాయా? ఎంత వెతికినా వేరే వార్తలు కనిపించట్లేదు. ఈ ముక్క రాయడానికి ఇన్ని పేజీలు  దేనికబ్బా!

ఇంతలో "రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! జగన్ని లోపలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా హర్షించదగిన మంచి పరిణామం. ఒక అవినీతిపరుణ్ణి లోపలేస్తే గాని మిగిలినవారికి బుద్ధిరాదు." అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"నేనలా అనుకోవడం లేదు. జగన్ని అరస్టు చెయ్యడం కాంగ్రెస్ చేస్తున్న చివరి తప్పిదం అవుతుందేమో. రాజకీయంగా ఆలోచిస్తే జైలుకెళ్ళడం జగన్ కే మంచిదిగా అనిపిస్తుంది. అవినీతి రాజకీయాల గూర్చి మాట్లాడే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ దేశంలో ఎవరు అవినీతిపరులు కాదు? ములాయం, మాయావతి, లాలూ, కరుణానిధి.. వీళ్ళంతా ఎవరు? సీబీఐ కేసులనేవి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం చేతిలో ఉండే ముకుతాళ్ళు. నువ్వు నీతిసూత్రాల్ని, న్యాయసూత్రాల్ని ఖచ్చితంగా అప్లై చేస్తే ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాల్సి వుంటుంది." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! యువార్ టాకింగ్ నాన్సెన్స్! జగన్ని ఎలా సపోర్ట్ చేస్తావు?"అన్నాను.

"నేను ఎవ్వర్నీ సపోర్ట్ చెయ్యడం లేదు మిత్రమా! వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాను. మనది రాజకీయంగా నిరక్షరాస్య దేశం. మధ్యతరగతి మేధావులు ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తుంటారు. తల్లిని చంపేశారని రాజీవ్ గాంధీకి బంగారు పళ్ళెంలో అధికారమిచ్చాం. రాజీవ్ గాంధీని చంపేశారని సోనియాకి పట్టం కట్టాం. ఇంత పెద్దదేశంలో రాజకీయాలు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపర్చే పథకాలతో కాకుండా సెంటిమెంటుతో నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా లేదూ!" అన్నాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన అనుభవంలో ఉన్న విషయాల్ని మాత్రమే మనం అర్ధం చేసుకోగలం, అనుభూతి చెందగలం. ఈ అనుభూతి లేనిదే ఫలానావాడు దుష్టుడు, దుర్మార్గుడు అని ఎంత చెప్పినా మనకి అర్ధంకాదు. ఇవన్నీ మన మైండ్ కి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి - అమెరికావాడు అంతర్జాతీయంగా చేస్తున్న రౌడీయిజం మనకి పట్టదు. అదే ఒక వీధిరౌడీ అరాచకానికి మాత్రం కోపం తెచ్చుకుంటాం. విమానం కూలి నాలుగొందల మంది మరణించారన్నా పెద్ద బాధగా ఉండదు, అదే ఏ రైలేక్సిడెంట్లోనో ఇద్దరు చనిపోయినా చాలా బాధ పడతాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నువ్వు జగన్ అవినీతి గూర్చి మాట్లాడకుండా ఏదేదో చెబుతున్నావ్." గుర్తు చేశాను.

"నేను రిలవెంట్ గానే మాట్లాడుతున్నాను. అమెరికావాడి రాజకీయం లాగే, సమాజంలో సామాన్య జనాలకి అర్ధం కాని, ఐడెంటిఫై చేసుకోలేని అవినీతి ఉంటుంది. 2 జి స్పెక్ట్రమ్ అంటే ఏంటి? క్విడ్ ప్రోకో (quid pro quo) అంటే ఏదో తిట్టులా లేదు? గాలి జనార్ధనరెడ్డి చేసిన తప్పేంటి? ఏవో గనులు అక్రమంగా తవ్వాట్ట! మనకి మనూళ్ళో మునిసిపాలిటీవాడు అడ్డదిడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన గుంటలు మాత్రమే తెలుసు. అట్లాంటి మనం - ఎక్కడో కొండల్లో తవ్వే గనులు, గుంటలు ఎలా ఊహించుకోగలం? నువ్వూహించుకోగలవా?" అడిగాడు సుబ్బు.

"నావల్ల కాదు." అన్నాను.

"లక్షకోట్ల అవినీతి అంటారు. ఎవడన్నా కోటిరూపాయిలు ఎప్పుడన్నా లెక్కబెట్టాడా? కనీసం కంటితో చూశాడా? ఇవన్నీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాని, కాలేని తెలివైన భారీనేరాలు. ఈ నేరాలు అర్ధం చేసుకోవాలంటే మనం సి.ఎ. చదివుండాలి." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"సుబ్బూ! నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకోని సమాజం మనది అంటావ్. అంతేనా?" అడిగాను.

"నా పాయింట్ అది కాదు! మనం మన స్థాయికి తగ్గ నేరాల్ని మాత్రమే గుర్తించగలం. జేబుదొంగల్ని తన్ని పోలీసులకి అప్పజెబుతాం. అర్ధరాత్రి ఇళ్ళల్లో పడే దొంగల్ని కరెంటు స్థంబానికి కట్టేసి చావగొడతాం. ఆస్పత్రిలో పది, ఇరవై అడుక్కునే వార్డ్ బాయ్ ని అసహ్యించుకుంటాం. అందుకే శంకర్ తీసిన 'భారతీయుడు' అంత హిట్టయ్యింది, అన్నాహజారే అంత పాపులరయ్యాడు." అన్నాడు  సుబ్బు.

"అవును కదా!" ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"ఒక తప్పుడు జీవోతో, అదే ఆస్పత్ర్లి భూమిని కాజేసి వందకోట్లు లబ్ది పొందే ప్రభుత్వ పెద్దల్ని పెద్దగా పట్టించుకోం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేసి వేల కోట్ల అవినీతి చేస్తే, అసలా ప్రాసెస్సే అర్ధం కాక, కొద్దిసేపు బుర్ర గోక్కుని వదిలేస్తాం." అన్నాడు సుబ్బు.

"జగన్ అవినీతి సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యేది కాదంటావ్! అంతేగా? మరి జగన్ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో చెప్పలేదు." అడిగాను.

"కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఎన్నికల్లో గెలిచే దాకా వదిలేట్టులేరు! నా లాజిక్ సింపుల్. దొంగని రెండు దెబ్బలేస్తే జనాలు తృప్తినొందుతారు, 'తిక్క కుదిరింది వెధవకి' అనుకుంటారు. అదే దొంగని చెట్టుకి కట్టేసి కొడితే 'అయ్యో పాపం!' అనుకుంటారు. కాంగ్రెస్ జగన్ని ఒకస్థాయిదాకా ఇబ్బంది పెడితే జనాలు పట్టించుకోరు. అవినీతికి శిక్ష పడిందనుకుంటారు. కానీ - దానికొక లక్ష్మణ రేఖ ఉంది, ఆ రేఖని కాంగ్రెస్సోళ్ళు దాటుతున్నారు. ఇది కాంగ్రెస్ కి సూసైడల్." అన్నాడు సుబ్బు.

"సోనియాగాంధీకి జగనంటే కోపం ఉండి ఉండొచ్చు." అన్నాను.

"రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకి తావులేదు. ఇందిరాగాంధీకి బేడీలు వేయించి కక్ష తీర్చుకున్న చరణ్ సింగ్ ఏమైపొయ్యాడు? నిండు కొలువులో జయలలిత చీరని లాగించిన కరుణానిధి తరవాత ఎలక్షన్లో మట్టి కరిచాడు. ముసలి కరుణానిధిని అర్ధరాత్రి ఎత్తి అవతల పడేయించిన జయలలితని ఆ తరవాత ఎలక్షన్లో ప్రజలే ఎత్తి అవతల పడేశారు!" అన్నాడు సుబ్బు.

"అదంతా సానుభూతి కోసం రాజకీయ నాయకులు చేసిన నటన సుబ్బూ!" నవ్వుతూ అన్నాను.

"అదేంటి మిత్రమా నటనని అంత తేలిగ్గా తీసిపడేశావ్? 'రక్తసంబంధం'లో రామారావు, సావిత్రి నిజమైన అన్నాచెల్లెళ్ళనుకుని ఆంధ్రదేశం యావత్తూ రోదించిందా? ఎన్టీరామారావు నిజమైన రాముడని ప్రజల నీరాజనం అందుకున్నాడా? గత వారం రోజులుగా అన్ని న్యూస్ చానెళ్ళు జగన్ని తప్పితే వేరేదీ చూపించట్లేదు. జనాలు కూడా ఏడుపుగొట్టు సీరియళ్ళు చూడ్డం మానేసి జగన్ అరెస్టు గూర్చి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇది జగన్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. లక్ష్మణ రేఖని దాటుతున్న కాంగ్రెస్ నాయకత్వం జగన్ని అధికారం అనే గారెల బుట్టలోకి తంతుంది." అన్నాడు సుబ్బు.

"ఆ లక్ష్మణరేఖ ఎక్కడుందో నీకుమాత్రం ఎలా తెలుసు?" అడిగాను.

"నాకు తెలుసని నీకు చెప్పానా? నాకూ తెలీదు. కానీ అమ్మకి తెలుసు! ఆవిడ నిన్నట్నించి 'పాపం! తండ్రి లేని పిల్లాడు, ఆ అబ్బాయిని ఎందుకంతలా వేధిస్తున్నారు?' అనడం మొదలెట్టింది. ఇది కాంగ్రెస్ కి దుర్వార్త. మా పనమ్మాయి 'పాపం! వాళ్ళ నాన్న మా నాన్నకి ఫ్రీగా గుండాప్రీషన్ చేయించాడు. ఆ బాబుని జైల్లో యేయించినోడు పురుగులు పడి చస్తాడు.' అని పొద్దున్న అంట్లు తోముతూ అంది. ఇది జగన్ కి శుభవార్త. మన ప్రభుత్వాల్ని నిర్ణయించేది వీళ్ళే." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు.

"రాజకీయ విషయాలు మాట్లాడేప్పుడు ఏ ఎన్.రామ్ నో, రామచంద్ర గుహానో కోట్ చెయ్యాలి. నువ్వు మీ అమ్మనీ, పనిమనిషినీ కోట్ చేస్తావేమిటి?" చికాగ్గా అన్నాను.

"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా! ఇంక మళ్ళీ నేనెందుకు? ఈ దేశంలో మధ్యతరగతి మేధావులు వాస్తవాల్ని గుర్తించడం మానేసి చాలాకాలం అయ్యింది, అందుకే నేను వాళ్ళ ఆలోచనలు పట్టించుకోను. ఇంక నేవెళ్తా! దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

గమనిక : ఈ పోస్ట్ రాసేప్పటికి జగన్ అరెస్టవ్వలేదు.

కృతజ్ఞత :  ఆత్మీయ మిత్రుడు గోపరాజు రవికి.. 

(photo courtesy : Google)

Thursday 24 May 2012

ధారుణి రాజ్యసంపద (బీడీలబాబు కథ)

"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి" పద్యం భీకరంగా మొదలయ్యింది. వింటున్న కొద్దీ గుండెలు ఉప్పొంగసాగాయి, మరుగుతున్న రక్తం మరిపోసాగింది, హృదయం ఉరకలు వెయ్యసాగింది. భుజంమీద గద వుంచుకుని, ఠీవీగా మీసం మెలేస్తున్న భీముడు కళ్ళముందు నిలిచాడు.

నాకు పద్యాలు అంటే యేంటో తెలీదు, అర్ధం అసలే తెలీదు, పాడిందెవరో కూడా తెలీదు. మరేం తెలుసు? భీముడు తెలుసు! తల్చుకుంటే ఆ సభలోని వాళ్ళనందరినీ గదతో మోది క్షణంలో చంపేయగలడు. కానీ - చంపనీకుండా ధర్మరాజు ఆపుతున్నాడు. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక భీముడు పద్యాలు పాడేశాడు, పాపం! అంతకన్నా భీముడు మాత్రం ఏం చెయ్యగలడు?

నా చిన్నతనంలో ఇప్పట్లా సంస్కృతిని, సంప్రదాయాన్ని పరిరక్షించే సంస్థలు లేవు. కళాబంధువులు, కళాసేవకులు అసలే లేరు. ఈ పనంతా ఒంటిచేత్తో శ్రీరామనవమి పందిళ్ళు చేసేవి. పాట కచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. అన్నీ కూడా శ్రీరామనవమి చలవే.

గుంటూర్లో వీధివీధికీ పోటాపోటీగా పందిళ్ళు ఉండేవి. రవి కాలేజీ ముందున్న పందిరి మా ఇంటికి బాగా దగ్గర. ఈ పందిరి నిర్వాహకులకి అక్కడ బడ్డీకొట్టుంది. వీరిది ఆ ఏరియాలో ఏకైక ముస్లిం కుటుంబం, అంచేత ఈ కొట్టుని 'సాయిబు కొట్టు'గా వ్యవహరించేవాళ్ళం. వీళ్ళు ఐదుగురు సోదరులు. వీరిలో సత్తార్, రజాక్ ముఖ్యులు.

ఈ పందిళ్ళల్లో - ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటకచేరీలు, డ్యాన్సులు, నాటికలు, నాటకాలు.. ఇలా రకరకాల ప్రోగ్రాంలు వుండేవి. రాత్రిళ్ళు భోంచేసి చాపలు తీసుకెళ్ళి స్టేజ్ ముందర పరిచేసేవాళ్ళం. ఒక్కొక్క చాప ఒక్కో కుటుంబానిది. వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, పాండవోద్యోగ విజయాలు, చింతామణి.. చాలా నాటకాలు పడుకునే చూసేవాళ్ళం. నాటక కళాకారులు యాంత్రికంగా ఎవరి పద్యం వాళ్ళు పాడేసేవాళ్ళు. పాత్రధారుల మేకప్ దట్టంగా వున్నందున మొహంలో ఫీలింగ్స్ కనబడేవి కాదు, అక్కడ నటన కన్నా పద్యాలకే ప్రాధాన్యం. కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం విచిత్రంగా అనిపించేది.

ఇప్పుడు మళ్ళీ అసలు కథలోకొద్దాం. పాండవ వనవాసము సినిమా రికార్డులో భీముడి పద్యాలు సైడ్ 'బి'లో ఉండేవి. సైడ్ 'ఎ' ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట - "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా" వుండేది. నాకీ పాటంటే చిరాకు, అస్సలు  నచ్చదు. అయితే - సైడ్ 'ఎ' పాట తరవాతే, సైడ్ 'బి' పద్యాలు వేసేవాళ్ళు. నాకా  మూణ్నిమిషాలు మూడుగంటల్లాగా అనిపించేది.

అయితే - ఈ ఏడుప్పాట వల్ల ఒక ప్రయోజనముంది. లౌడ్ స్పీకర్లో ఆ పాట మొదలవ్వంగాన్లే ఇంట్లోంచి  పరుగందుకుని పందిట్లో వాలేవాణ్ణి. పందిట్లో మూలనున్న సీతారాములకి ఒక దణ్ణం పడేసి, ప్రసాదం నోట్లో వేసుకుని, భీముడి పద్యాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండేవాణ్ణి. "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి.. " మొదలు. మళ్ళీ గుండెలు.. రక్తం.. హృదయం.. షరా మాములే!

నాకీ పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేదికాదు. రోజంతా వినాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ ఏం చెయ్యను? ఆ రికార్డులు వేసే వ్యక్తిని అడిగే ధైర్యం లేదు. అతని పేరు షేక్ బాబు. ఎర్రగా, పొడుగ్గా, పీలగా నలిగిపోయిన వానపాములా ఉండేవాడు. అతను పొద్దస్తమానం బీడీలు తాగుతుండేవాడు, దగ్గుతుండేవాడు. దగ్గుతూ కూడా దీక్షగా బీడీలు కాలుస్తుండేవాడు! అంచేత కొందరతన్ని 'బీడీలబాబు' అనేవాళ్ళు.

గ్రామఫోన్ రికార్డులు మట్టివి. అవి పెట్టడానికి వీలుగా నిలువు అరలతో భోషాణం లాంటి చెక్కపెట్టె. పక్కన రికార్డ్ ప్లేయెర్. ప్లేయర్‌కి మూల బుల్లిఅరలో సూదులు. 'కీ' ఇవ్వడానికి 'జెడ్' ఆకారపు స్టీల్ పరికరం. బాబు రికార్డుల్నీ, గ్రామ్ ఫోన్‌నీ సున్నితంగా, ఎంతో నైపుణ్యంతో హేండిల్ చేసేవాడు. రికార్డుల్ని ప్లే చెయ్యడంలో అతనికేదో క్రమం వుంది, అన్ని రికార్డులు సమానంగా అరిగిపోవాలనే నియమం అయ్యుండొచ్చు.

బీడీలబాబు పద్యాలు మళ్ళీ ఎప్పుడు పెడతాడు? ఆ పద్యాల కోసం ఎదురుచూస్తూ అక్కడే ఎంతసేపు పడిగాపులు కాయాలి? పోనీ ఒక గంటదాకా ఆ పద్యాలు వెయ్యడా? అదేంలేదు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔటాఫ్ ఆర్డర్లో వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగుసార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు ఏడుపొచ్చింది. 

అప్పటికి వందోసారి నిర్ణయించుకున్నాను. పెద్దయ్యాక నేనూ బీడీలబాబులా రికార్డులేసే ఉద్యోగంలోనే చేరతాను. పిల్లలు అడిగిన పాటలన్నీ వేస్తాను. భీముడి పద్యాలు వెంటవెంటనే వేసే బుద్ధి బాబుకి ప్రసాదించమని.. ద్రౌపది పాడినట్లు నేను కూడా 'హే కృష్ణా!' అంటూ ప్రార్ధించుకునేవాణ్ని. మనమెంత ప్రార్ధించినా ప్రయోజనం లేదని, బాబు సాయిబు అయినందున మన హిందుదేవుళ్ళు బాబు మనసు మార్చలేరని ఎదురింటి రాము అనేవాడు. పైన మబ్బుల్లో దేవుళ్ళంతా ఒకటేననీ, అక్కడ మన దేవుళ్ళు అల్లాకి రికమండ్ చేస్తారని పక్కింటి ఫణి వాదించేవాడు.

నా "ధారుణి రాజ్య సంపద.. " వీరాభిమానం కేవలం విన్డానికే పరిమితమా? కానేకాదు, ఇంట్లో భీముడుగా మోనో ఏక్షన్ చేసేవాణ్ని. పొయ్యి పక్కనున్న సరివికట్టె నా గదాదండము, దారం కట్టిన అట్టముక్క కిరీటం. ఈ రెండూ వొంటి మీదకి రాంగాన్లే నన్ను భీముడు పూనేవాడు. (లేని) మీసం మెలేస్తూ, తొడ కొడుతూ ఆవేశంతో ఊగిపొయ్యేవాణ్ణి.

"ఓరోరీ మాయాజూద వినోదా, మధు మదోన్మత్తా, దుర్యోధనా! నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా!" అని పెడబొబ్బలు పెట్టి, తొడ గొట్టుకుంటూ "ధారుణి రాజ్యసంపద" అంటూ గర్జిస్తూ పద్యం అందుకునేవాణ్ణి. ఇంటికి ఎవరొచ్చినా వారికి భీముణ్ణి చూపేవాణ్ణి. కొన్నిసార్లు నా ప్రదర్శనకి రెండుపైసలు పారితోషకం కూడా లభించేది. ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువైనందున, తొడ వాచిపోయి ఏడుస్తుంటే అమ్మ కొబ్బరినూనె రాసి ఓదార్చింది.

కొన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు - మా పక్కింటి సత్తిగాడి రూపంలో! సత్తిగాడు నాకన్నా ఒకేడాది పెద్ద. లావుగా, పొట్టిగా గుండ్రాయిలా ఉంటాడు. తండ్రికి పక్కవీధిలో కిరాణా కొట్టుంది. సత్తిగాడు మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం కేరేజ్ తీసుకెళ్ళేవాడు. తండ్రి అటుతిరిగి అన్నం తింటుంటే మనవాడు గల్లాపెట్టె వద్ద తన హస్తలాఘవం చూపేవాడు.

వచ్చేప్పుడు కేరేజ్ ఖాళీది తెచ్చేవాడు, జేబులు మాత్రం నిండుగా ఉండేవి. కొట్టుకొచ్చిన డబ్బుల్తో మాకు నిమ్మతొనలు, నువ్వు జీళ్ళు, తాటి చాపలు, కలరు డ్రింకులు ఇప్పిస్తుండేవాడు. మేం వాడి వంధిమాగధులం. వీధి మూలనున్న పొట్టి చెట్టుకున్న వంకర కొమ్మ మీద విలాసంగా పడుకుని మాతో పనులు చేయించుకునేవాడు. ఎంతయినా డబ్బుకున్న దర్జా దేనికీ లేదు!

పాండవవనవాసము, భీముడి పద్యాలు అంటూ సత్తిగాణ్ణి ఊదరగొట్టేశాను. నా అదృష్టవశాత్తు మా సత్తిగాడిక్కూడా భీముడి పద్యాలు తెగ నచ్చేశాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? సత్తిగాడు ఆర్డర్ పాస్ చేసేవాడు. బీడిలబాబు వినయంగా, డ్యూటిఫుల్గా 'ధారుణి రాజ్య సంపద' వేసేవాడు. చెవులారా వింటూ మైమరచిపొయ్యేవాణ్ని.

ఇంతకీ బీడీలబాబు సత్తిగాడి బంటు ఎలా అయ్యాడు? సింపుల్! బాబుకి, సత్తిగాడికి మధ్య బీడిల ఒప్పందం కుదిరింది. ఆ పద్యాలు ఒకసారి ప్లే చేస్తే రెండు హస్తం బీడీలు ఫ్రీ. లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. ఆ విధంగా భావిభారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్‌గా పనులవుతాయని గుర్తించితిమి.

ముగింపు -

చిన్నప్పటి నా యాంబిషన్ అయిన మట్టిరికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత, మనమందరం విధి చేతిలో పావులం!

మొన్న టీవీలో 'ధారుణి రాజ్యసంపద' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీలబాబు, సత్తిగాళ్ళే కనిపించారు. ఔరా! కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది!      

Monday 21 May 2012

పేరులో ఏముంది?!

"నీకు నా ఇష్టదైవం పేరు పెట్టుకున్నాను, అందుకైనా ఒక్కసారి ఆ దేవుడికి దణ్ణం పెట్టుకోరాదా!" ఇది అమ్మ ఆర్గ్యుమెంట్.

"నువ్విట్లా కొత్త రూల్స్ పెట్టకు. నాకీ పేరు పెట్టమని నేనడిగానా? నాకు చెప్పకుండా నాపేరు పెట్టటమే కాక, ఆ పేరుకు తగ్గట్లు ప్రవర్తించమని డిమేండ్ చెయ్యడం అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా!" ఇది నా కౌంటర్ ఆర్గ్యుమెంట్.

అసలు పేరుకీ, ప్రవర్తనకీ సంబంధం ఉంటుందా? ఉండాలా?

నా చిన్నప్పుడు మా పక్కవీధిలో నెయ్యి అమ్మేవాళ్ళు. 'ఇచ్చట స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి అమ్మబడును.' అని పెద్ద బోర్డుండేది. ఆ నెయ్యి మాత్రం ఎలుక చచ్చిన పాడు కంపు కొడుతుండేది.

'కేర్' ఆస్పత్రి అంటారు. అక్కడ పేషంట్లని కేర్‌లెస్సుగానూ, బిల్లుల్ని కేర్‌ఫుల్లుగానూ చూస్తారని అభిజ్ఞువర్గాల భోగట్టా. ఈ మధ్య కొన్ని ఆస్పత్రులకి 'హెల్ప్' అని పేరు పెడుతున్నారు. వాళ్ళ బిల్లుల్ని చూసి జనాలు ఘొల్లుమంటున్నారు, ఇంక 'హెల్ప్' ఎక్కడ!

పాతతరం కమ్యూనిస్టులు పిల్లలకి లెనిన్ బాబు, స్టాలిన్ బాబు అని పెట్టుకునేవాళ్ళు. వారి పిల్లల బుల్లిఅడుగుల్లో భవిష్యత్ విప్లవకారుని 'లాంగ్ మార్చ్' చూసుకుని మురిసిపొయ్యేవారు. తదనంతరం ఆ బుల్లి విప్లవకారులు 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' చేసి - వడ్డీ వ్యాపారస్తులుగానూ, లిక్కర్ సిండికేట్లుగానూ 'ఎదిగి' తలిదండ్రులకి గొప్ప పేరు తెచ్చిపెట్టారు 'గోరా' తండ్రి కొడుక్కి రామచంద్రరావు అని రాముడి పేరు పెట్టుకున్నాడు. మరి గోపరాజు రామచంద్రరావు ఏం చేశాడు? 'గోరా'గా మారిపోయి ఆ దేవుడే లేడన్నాడు!

గురజాడ అప్పారావు మాత్రం తన నాటకానికి సాంప్రదాయక పద్ధతుల్నే నమ్ముకున్నాడు. 'కన్యాశుల్కం'లో పాత్రల పేర్లు వారి బుద్ధిననుసరించి ఉంటాయి. లుబ్దావధాని, అగ్నిహోత్రావధాని, కరటకశాస్త్రి, సౌజన్యారావు.. ఇది ఈ నాటకానికి నెగెటివ్ పాయింటని పలువురు విజ్ఞులు వాకృచ్చారు.

అమ్మకి 'కన్యాశుల్కం' సినిమా మాత్రమే తెలుసు. ఆవిడకి మధురవాణిగా సావిత్రి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అంతే! అయితే కన్యాశుల్కం ఒక గొప్ప నాటకమని.. గురజాడ పాత్రలు బుద్ధిగా తమ పేర్లననుసరించే ప్రవర్తించాయని తెలీదు. తెలిసినట్లయితే ఆవిడ ఈ పాయింటుని తన డిఫెన్సుకి వాడుకునేది. ఆమెకి తెలీదని నాకు తెలుసు కాబట్టే.. పేర్లకీ, ప్రవర్తనకీ సంబంధం లేదని, ఉండదనీ బల్ల గుద్ది వాదిస్తున్నాను.

ఇంట్లో ఏదో వ్రతం. అమ్మ కొత్త ఎత్తు వేసింది.

"కనీసం ఇవ్వాళయినా ఒక్కసారి దణ్ణం పెట్టుకో.. నాకోసం!" అంటూ సెంటిమెంటుతో కొట్టింది.

చచ్చితిని. ఇరుక్కుపొయ్యానా? ఒక్కక్షణం ఆలోచించాను.

"అమ్మా! నాకయితే ఇటువంటివి నమ్మకం లేదు. నీకోసం తప్పకుండా పెడతాను. కానీ నమ్మకం లేకుండా దణ్ణం పెట్టుకోవడం మహాపచారం. అసలే నీకీ మధ్య బిపి ఎక్కువైంది, ఆ తర్వాత నీ ఇష్టం." హెచ్చరిస్తున్నట్లుగా అన్నాను.

నా మంత్రం పని చేసింది. "సరెసరే! వద్దులే." అంది కంగారుగా.

అమ్మకి కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకుని.. నవ్వుకున్నాను!! 

Thursday 17 May 2012

సుబ్బు! ది గ్రేట్ సెఫాలజిస్ట్!!



ఉదయం  పది గంటలు. ఆంధ్రజ్యోతి  పేపర్  ఎడిట్  పేజ్  చదువుతున్నాను. మొత్తానికి  ఉప ఎన్నికల  వేడి  రాజుకుంది.

"రవణ మావా! కాఫీ!" అంటూ  హడావుడిగా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"కూర్చో  సుబ్బు! ఏంటి  ఉప ఎన్నికల్లో  ఎవర్ని  గెలిపించబోతున్నావ్?" అడిగాను.

"ఉప ఎన్నికల  గూర్చి  ఇప్పటిదాకా  ఏమీ  ఆలోచించలేదు. ఫలితాన్ని  బట్టి  కిరణ్ కుమార్ రెడ్డి, సత్తిబాబుల  ఉద్యోగాలు  ఉండేదీ, ఊడేదీ  తేలిపోతుంది. చంద్రబాబు, జగన్ల  షేర్  వేల్యూ  పెరిగేదీ, తరిగేదీ  తెలుస్తుంది."

"నేను  ఎవరు  గెలుస్తారు  అనడిగాను. నీ  ఎనాలిసిస్  కాదు."

"అదేమంత  కష్టమైన  పనా? సంగడిగుంట, చుట్టుగుంట, కంకరగుంట... " నవ్వుతూ  అన్నాడు  సుబ్బు.

"ఇవన్నీ  మనూళ్ళో  పేటలు. నేనడిగింది.. "

సుబ్బూ  ఇంకా  నవ్వుతూనే "లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, రింగ్ రోడ్.. " అన్నాడు.

"సుబ్బూ! ఏంటి  నీ  అసందర్భ  ప్రేలాపన? ఒక  సీరియస్  ప్రశ్న  అడిగాను. నువ్వేమో సిటీ బస్  కండక్టర్లా  ఏవేవో  పేటల  పేర్లు  వాగుతున్నావ్ ! నీతో  ఇదే  తంటా!" విసుక్కున్నాను.

"ఉప ఎన్నికల్లో  ఎవరు  గెలుస్తారని  అడిగావుగా? వెళ్దాం  పద. ఆ  పేటల్లో  సర్వే  చేద్దాం. కొద్దిసేపట్లోనే  నీకు  ఎవరెవరు  ఎంత  మెజారిటీతో  గెలుస్తారో  చెప్పేస్తాను."

"వార్నీ! సర్వేనా. ఈ  పేటల్లో  తిరిగి  సర్వే  ఏమిటోయ్! అసలు  మనూళ్ళో  ఉప ఎన్నికలే  లేవు. సరే గానీ.. చివరకి  నువ్వు  కూడా  సర్వే  అంటూ  బయల్దేరావా  సుబ్బూ! లగడపాటి  డబ్బేమన్నా ఇచ్చాడా?"

"రవణ మావా! ఫలానా  నియోజక వర్గం  అని  నేను  చెప్పట్లేదు. ఎన్నికలు  ఉన్నా, లేకున్నా  ప్రజల  మూడ్  అనేది  ఒకటి  ఉంటుంది. కాబట్టే  ఎలెక్షన్లలో  కూడబలుక్కున్నట్లు  ఇచ్చాపురం  నుండి  తడ  దాకా  ఓటింగ్ లో  ఒక  పేటర్న్  ఉంటుంది. అందువల్ల.. నేనిప్పుడు  ఒక  కొత్త రకం  ఎలెక్షన్   సర్వేని   ప్రపోజ్  చేస్తున్నాను. కంట్రోల్  గ్రూప్స్, శాంపిల్  కలెక్షన్, మెథడాలజీ, స్టాటిస్టిక్స్.. అంతా  కొత్తగా  ఉంటుంది."

సుబ్బు  వైపు  ఆసక్తిగా  చూస్తూ  ఆంధ్రజ్యోతి  పేపర్ని  మడిచి పక్కన  పడేశాను.

ఆలోచిస్తూ  నిదానగా  చెప్పసాగాడు  సుబ్బు. "కంపేరిటివ్  గ్రూప్స్  రెండు. వంద  సంఖ్యకి  స్టాండర్డైజ్  చేద్దాం. మొదటి  గ్రూప్  అప్పర్  మిడిల్  క్లాస్. రెండో  గ్రూప్  లోయర్  మిడిల్  క్లాస్."

"ఇంటరెస్టింగ్  సుబ్బు! యూ  సౌండ్  లైక్  యోగేంద్ర  యాదవ్!"

"రింగ్  రోడ్  మనూళ్ళో  పోష్  ఏరియా. కాబట్టి  మన  స్టడీకి  ఫస్ట్  గ్రూప్  రింగ్  రోడ్  వాసులు. ఈ  స్టడీకి  ఇంక్లూజన్  క్రైటీరియా  రోజూ  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. ఇంగ్లీష్  పేపర్  చదివేవాళ్ళయితే  మరీ  మంచిది. వీరి  అభిప్రాయం  మనకి  చాలా  విలువైంది. ఎలెక్షన్లలో  ఎవరు  ఓడిపోతారో నిర్ణయించేది  వీరే! ఈ  స్టడీ  అర్ధం  కావడం  కోసం  కొన్ని  ఫిగర్స్  ఇస్తాను. రింగ్ రోడ్  శాంపిల్  ఒపీనియన్   రిజల్ట్  ఇలా  ఉందనుకుందాం. చంద్రబాబు  50, జగన్  30, కాంగ్రెస్  15, లోక్ సత్తా 5. మొత్తం  100. ఇప్పుడు  100/10 = 10. ఇదే  రేషియోలో  అన్ని  పార్టీలకి  ఓట్లు  పదో వంతుకి  పడిపోతయ్."

ఇంతలో  కాఫీ  వచ్చింది.

"సుబ్బూ! నీకు  లెక్కలు  రావని  నాకు  తెలుసు. కానీ  మరీ ఇంత  పూర్  అని  అనుకోలేదు."


"నా  లాజిక్  చాలా  సింపుల్! ఈ  శాంపిల్  గ్రూప్ కి  విషయం  తక్కువ. హడావుడి  ఎక్కువ. 'సామాజిక సృహ' తో  పేపర్లకి  ఉత్తరాలు  రాస్తుంటారు. టీవీల్లో  ఉపన్యాసాలు  చెప్తుంటారు. అవినీతిపై  పోరాటం  అంటూ  కొవ్వొత్తుల  ప్రదర్శనలు  చేస్తారు. కొవ్వొత్తుల  ఫ్యాక్టరీ  వాడికి  వ్యాపారం  పెరగడం  తప్ప  ఒరిగేదేముండదు. ఎయిడ్స్ కి  వ్యతిరేకంగా  పరిగెత్తుతారు. మనకి  ట్రాఫిక్  కష్టాలు. వాళ్ళకి  పిక్కల  నొప్పులు. వీళ్ళ  హడావుడి  బట్టి  ఫలానా  అభ్యర్ధి  గెలుస్తాడనే  భ్రమలు  పెట్టుకోకూడదు. ఇన్ ఫాక్ట్  ఆపొజిట్  ఈజ్  ఆల్వేస్  కరెక్ట్. అందుకే  రాజకీయ  పార్టీలు  కూడా  వీళ్ళని  పట్టించుకోవు."

"ఎందుకని?"

"ఈ  గ్రూపుకి  ఎలెక్షన్  కన్నా  క్రికెట్  మ్యాచ్ లకే  ప్రాముఖ్యత. అందుకనే  ప్రభుత్వాలు  కూడా  ఎలెక్షన్   రోజు  క్రికెట్  మ్యాచ్  ఉండేట్లు  ఏర్పాట్లు  చేస్తున్నాయ్. టీవీలో  లేటెస్ట్  సినిమా  ప్రసారం  చేయిస్తాయి. ఎండా కాలంలో ఎలక్షన్లు  ఒచ్చేట్లు  జాగ్రత్తలు  తీసుకుంటాయి. వీళ్ళు  ఇన్ని  అవరోధాలు  దాటుకుని  రోడ్డేక్కే  అవకాశం  లేదు. కాబట్టి  నూటికి  తొంభై మంది  ఓటే  వెయ్యరు. అందుకే  పదితో  డివైడ్  చేశాను."

"ఒకే! ఒప్పుకుంటున్నా!"

"మనమిప్పుడు  సెకండ్  గ్రూపుకి  వద్దాం. కంకరగుంట.. "

"ఆపు  సుబ్బూ! ఇందాక  ఆ  గుంటలన్నీ  చెప్పేశావ్. దిగువ  మధ్య తరగతి  ఏరియాలని  చెప్పు. చాలు." అన్నాను.

"ఓకే! ఇప్పుడు  మన  సెకండ్  గ్రూప్  స్టడీకి  exclusion  క్రైటీరియా  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. పొరబాటున  కూడా  న్యూస్ పేపర్  కేసి  చూడని వాడయితే  మరీ మంచిది. ఇది  చాలా  ముఖ్యమైన  గ్రూప్. ఏ  రాజకీయ  పార్టీ  గెలుస్తుందో  నిర్ణయించేది  వీరే్! ప్రజాస్వామ్యాన్ని  కాచి  వడబోసిన వారు  ఈ  గ్రూపులో  ఉంటారు. ఏ  పార్టీ  అధికారం లోకొచ్చినా  చేసి  చచ్చేదేమీ  లేదని  గ్రహించిన  మహానుభావులు  వీరు. అందుకే  హాయిగా  'దమ్ము', 'గబ్బర్ సింగ్'  సినిమాలు  ఒకటికి  రెండు సార్లు  చూసుకుంటూ.. ఎలెక్షన్   రోజున  ఐదొందలు, వెయ్యి  నోటు  తీసుకుని  ఓటేస్తారు."

ఇంతలో  ఏదో  ఫోన్. ఆన్సర్   చేసి  సుబ్బు  వంక  చూశాను. సుబ్బు  మళ్ళీ  చెప్పసాగాడు.

"ఇప్పుడు  మన  రెండో  గ్రూప్  ఒపీనియన్   రిజల్ట్  ప్రకటిస్తున్నాను. సాధారణంగా  ఈ  రెండు  గ్రూపుల  ఓటింగ్  ఆపొజిట్  డైరక్షన్లో  ఉంటాయి. ఇందాక  చంద్రబాబుకి  ఎక్కువొచ్చాయి. ఇప్పుడు  జగన్ కి  ఎక్కువ  రావాలి. కాబట్టి  జగన్   50. చంద్రబాబు  35. కాంగ్రెస్  14. లోక్ సత్తా 1. మొత్తం  100. ఇప్పుడు  100 x 2 = 200.


"చూడు  మైడియర్  ప్రన్నొయ్ రాయ్! ఈ  డివిజన్లూ, మల్టిప్లికేషన్లు.. "  ఏదో  చెప్పబోయాను.

నన్ను  మాట్లాడొద్దన్నట్లుగా  చేత్తో  సైగ  చేశాడు  సుబ్బు.

"ఇందాక  చెప్పాగా. వీళ్ళు  ఎండలో  ఎండుతూ.. క్యూలో  నించుని  మరీ  ఓట్లేస్తారు. కుర్రకారు  తమ  అభిమానాన్ని ఒకటికి  రెండు సార్లు (రెండు  ఓట్లతో) నిరూపించుకుంటారు. వీరికి  ఓటు  'విలువ'  తెలుసు. అందుకే  మన  శాంపిల్ని  రెండుతో  హెచ్చవేశాను. ఇప్పుడు  ఈ  రెండు గ్రూపుల్ని  కలిపెయ్యి. ఫైనల్  రిజల్ట్  ఇలా  ఉంటుంది."

   పార్టీ  పేరు                                                గ్రూప్ 1                గ్రూప్  2           మొత్తం.
తెలుగు దేశం ....................................   05  (50/10)     +    70   (35 x 2)   =   75        
YSR కాంగ్రెస్  పార్టీ ............................   03  (30/10)     +   100  (50 x 2)   =  103                    
కాంగ్రెస్ ............................................    1.5  (15/10)    +     28  (14 x 2)    =   29.5
లోక్ సత్తా ..........................................   0.5  (5/10)      +     02  (1 x 2)      =   2.5

"నువ్వు  జగన్ని  గెలిపించావేమిటి? చంద్రబాబు  వ్యతిరేకివా?"

"నాకెవరైనా  ఒకటే. ఏదో  ఉదాహరణ  కోసం  ఆ  ఫిగర్స్  చూపించాన్లే. నాకు  ఇల్లూ, ఆనంద భవన్  తప్ప  వేరే  ప్రపంచం  తెలీదు. ఆ మాటకొస్తే  నీకు  మాత్రం  ఏం  తెలుసు? పొద్దస్తమానం  ఈ  నాలుగ్గోడల  మధ్య  సెంట్రల్  జైలు  ఖైదీలాగా  గడిపేయడం  తప్ప! అందుకే  నిన్ను  బయటకి  రమ్మంటుంది. అప్పుడు  మనకి  కరెక్ట్  పొజిషన్ తెలుస్తుంది."

"ఏడిసినట్లుంది. ఇదొక  సర్వే! నువ్వొక  సెఫాలజిస్ట్ వి! ఒకడికి  ఒక  ఓటే  ఉంటుంది. అంతేగాని  ఒకసారి  పదో వంతు  వోటు, ఇంకోసారి  రెండు  ఓట్లు  ఎలా  సాధ్యం? అంతా  గందరగోళంగా  ఉంది. నీ  లెక్క  నాకు  నచ్చలేదు."


"నీ  ఖర్మ! చంద్రబాబుకి  జ్ఞానోదయం  అయ్యిందిగానీ.. నీకు  మాత్రం  అవ్వలేదు." అన్నాడు  సుబ్బు.

"ఏంటోయ్  నీ  గోల?"

"అవును రవణ మావ! రింగ్ రోడ్  వాడి  కారు  కోసం  చంద్రబాబు  రోడ్లు  వెడల్పు  చేశాడు. ఆ  ప్రాసెస్ లో  చుట్టుగుంట, సంగడి గుంట, కంకరగుంట  వాళ్ళ  అరటికాయ బళ్ళూ, పూల బుట్టలు, బడ్డీ కొట్లూ  కోల్పోయారు. వీళ్ళకి  కడుపు  మండింది. ఆ  సెగకి  చంద్రబాబు  మసాలా అట్టులా  మాడిపొయ్యాడు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  రాజశేఖరరెడ్డి?"

"చంద్రబాబు  ఒక  మనిషి  ఒక  ఓటుతో  సమానం  అనుకున్నాడు. కాబట్టే  ఈ  సెఫాలజీ  కేలిక్యులేషన్  అర్ధం  చేసుకోలేకపోయాడు. రాజశేఖరరెడ్డికి  విషయం  బాగా  అర్ధమయ్యింది. అందుకే  ఫస్ట్  గ్రూప్ ని  వదిలేసి  సెకండ్  గ్రూప్  మీద  దృష్టి  పెట్టాడు. వాళ్ళకి  ఆరోగ్యశ్రీ  అన్నాడు. ఫీజ్  రీ ఇంబర్స్ మెంట్  అన్నాడు. జనాలు  కూడా  తెలివి  మీరి  పొయ్యారు. జంధ్యాల  తీసిన  'అహ! నా పెళ్ళంట!' సినిమా  చూశావుగా? అందులో  కోట  శ్రీనివాసరావు  అడుగుతుంటాడు  'నాకేంటి?' అని! ప్రజలు  కూడా  ఎవరికి వారే 'నాకేంటి?' అని  అడుగుతున్నారు. అందుకే  ప్రాజెక్టులే  లేకుండా  కాలవలు  తవ్వుతూ  డబ్బులు  దోచేస్తున్నారని  నెత్తీ, నోరూ  కొట్టుకుంటున్నా.. 'అయితే  ఏంటంట?' అంటూ  వంకరగా  నవ్వుతున్నారు."

"సుబ్బూ! రోజూ  ఉప్మా పెసరట్టు  తిని  గొప్ప  జ్ఞానివైపొయ్యావు." అన్నాను.

సుబ్బు  నవ్వాడు. " ప్రజలు  మాత్రం  అజ్ఞానులు  కారు. డబ్బు  విలువ  పెరిగిపోయింది. ఎవరి  ఎజెండా  వారికుంది. ఓటుకి  వెయ్యి రూపాయిలు  నిలబెట్టి  వసూలు  చేసుకుంటారు. అర్హత  లేపోయినా  తెల్లకార్డు  పుట్టించి  ఆరోగ్యశ్రీని  వాడుకుంటారు. పక్కనోడు  చస్తున్నా  పట్టించుకోవడం  మానేశారు. 'నువ్వు  ఎంతైనా  తిను. నాకెంతిస్తావ్ ?' అంటున్నారు. ఇది  గమనించిన  చంద్రబాబు  డబ్బులు  నెలనెలా  ఇళ్ళకి  పంపిస్తానని  వాగ్దానం  చేశాడు. తను  మారిన  మనిషినని  ఘోషించాడు. బట్  టూ  లేట్, టూ  లిటిల్! అందుకే  జనాలు  నమ్మలేదు. ఇంక  దానం  చెయ్యడానికి  రాజకీయ పార్టీలకి  సెక్రటేరియట్  తప్ప  ఏమీ  మిగల్లేదు."

"కానీ  రాజకీయాల్ని  ప్రక్షాళన  చెయ్యాలంటే.. "

"ప్రక్షాళన  చెయ్యాల్సిన  రాజకీయ  నాయకులు  ఓట్ల  భిక్షాటనలో  పడ్డారు. ఈ  దేశంలో కడుపు  నిండిన వాడే  మేధావి. బోలెడు  నీతులు  చెబుతాడు. వాటినే  నువ్వు  పరమ పవిత్రంగా  న్యూస్ పేపర్లలో  వార్తలుగా  చదువుతుంటావ్. తీవ్రంగా  ఆలోచిస్తూ  బుర్ర  పాడు  చేసుకుంటావ్. కానీ  ఈ  మేధావులకి  కూడా  హిడెన్   ఎజెండా  ఉంటుందని  గుర్తుంచుకో. నా  దృష్టిలో  డబ్బు  తీసుకుని  ఓటేసేవాడి  కన్నా ఈ  మేధావులే  ప్రమాదకారులు." అని  టైం  చూసుకుంటూ..

"నేవెళ్ళాలి. దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ  నిష్క్రమించాడు  సుబ్బు! ది  గ్రేట్  సెఫాలిజిస్ట్!


Monday 14 May 2012

గల్తీ బాత్ మత్ కరో భాయ్!

"ఛీఛీ! అసలు తెలుగొక భాషేనా? కాదు. మరి భాషంటే ఎలా ఉండాలి? ఉర్దూలా ఉండాలి. ఉర్దూ భాషలో మావిడి కాయంత తియ్యదనముంది, నిమ్మకాయంత పులుపుంది, ఇడ్లీసాంబారంత కమ్మదనముంది. గొప్పభాషకి నిర్వచనం ఉర్దూ! ఆ భాష రానివాడిది జనాభా లెక్కకి తప్పించి ఇంకెందుకూ పనికిరాని జన్మ."

అప్పటికి మావాడు మమ్మల్ని రెండొందల నలభయ్యోసారి విసుక్కున్నాడు. మాకు ఉర్దూ రాదు, తెలుగు మాత్రమే వచ్చు. అంచేత - మేం కూడా అప్పటికి సిగ్గుతో రెండొందల నలభయ్యోసారి తల దించుకున్నాం. 

"ఎవడ్రా రేడియోలో తెలుగు పాటలు పెట్టింది? పల్లెటూరి బైతుల్లారా! వివిధ భారతికి మార్చండి. మనోరంజన్ ప్రోగ్రాం పెట్టండి. ఎంతసేపటికీ ఆ గరగరలాడే ఘంటసాల పాటలేనా? ఇకనుండి రఫీ, కిశోర్ పాటలే వినండి - లైఫ్‌లో పైకొస్తారు." గద్దించాడు మావాడు.

"వివిధ భారతి రేడియో స్టేషన్ సరీగ్గా రాదు, తుఫానులో కుక్క ఏడుపులా తెరలు తెరలుగా వస్తుంది." మా వినయపూర్వక సంజాయిషీ.

"అయినా సరే! వివిధ భారతి పెట్టాల్సిందే. తెలుగంటే నాకు చిరాకు. రాత్రి బినాకా గీత్ మాలా వస్తుంది, అమీన్ సయాని హిందీని ఫాలో అవ్వండి, మీ బావిలో కప్ప జన్మ ధన్యమౌతుంది." ఆర్డర్ పాస్ చెయ్యబడింది.

'ఎందుకు? ఎందుకు మా బ్రతుకులిలా బుగ్గి పాలయ్యాయి? వేసని సెలవలు మా జీవితాల్ని ఎంతగా దగా చేశాయి! మేమీ తెలుగు నేలపై జన్మించనేల! మావాడు హైదరాబాద్ పోనేల!'

ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం -

అవి మాకు జూనియర్ ఇంటర్ సెలవలు. క్రికెట్ ఆడుకోడం, సరదా కబుర్లు, చిన్నచిన్న తగాదాలు, షికార్లు, సినిమాలు.. ఇదే మా స్నేహబ్రందం జీవితం. అయితే - మాలో ముఖ్యుడొకడు ఆ సెలవల నెలరోజులు మాయమైపొయ్యి, సీనియర్ ఇంటర్ క్లాసులు మొదలయ్యేప్పటికి ప్రత్యక్షమయ్యాడు.

ఇప్పుడు మా వాడి రూపు ఎన్టీఆర్్‌కి మారువేషం వేసినట్లుగా, పూర్తిగా మారిపోయింది. పొడుగు జుట్టు, బొచ్చె క్రాఫింగు, చేతికి కడియం, మందపాటి గోనెగుడ్డతో బెల్ బాటం ప్యాంటు. ఆ గోనెగుడ్డ ప్యాంటుని నెలకోసారి కూడా ఉతక్కూడదుట! అది మా గుంటూరు చెమటకి తడిసి, నాని.. పాడుకంపు కొడుతుండేది. ఆ కంపే ఫ్యాషన్ట! ఆ గోనెగుడ్డని 'జీన్స్' అంటార్ట! 

మావాడు సెలవల్ని హైదరాబాదులో ఉంటున్న వాడి మేనమామ ఇంట్లో గడిపాడు. హైదరాబాదు ముచ్చట్లు డైలీ సీరియాల్లా రోజూ చెప్పేవాడు, మేం నోరు తెరుచుకుని వినేవాళ్ళం. మాకు మావాడి అనుభవాలు సింద్‌బాద్ అద్భుత యాత్రలా అనిపించింది. హైదారాబాదులో తెలుగు ఎవడికీ అర్ధం కాదుట. ఎక్కడ చూసినా గడ్డం సాయిబులు, షెర్వాణీలు, రూమీ టోపీలుట. కొండరాళ్ళు కొండల్లో కాదు, ఇళ్ళల్లోనే ఉంటాయిట!

ఈమధ్య మావాడు ఆలోచించడం కూడా ఉర్దూలోనే చేస్తున్నాట్ట! ఈ ఉర్దూ పాండిత్యం మావాడి స్థాయిని మేమందరం అసూయతో కుళ్ళుకునేంత ఎత్తుకి పెంచేసింది. ఈ విధంగా మావాడు తన ఉర్దూతో మాపై ఆధిపత్యం చెలాయించసాగాడు. మేం గుడ్ల నీరు కుక్కుకుంటూ మా బానిస జీవితాన్ని భారంగా ఈడుస్తున్నాం, అదీ కథ!

మా ఊరికి ప్రతి సంవత్సరం ఎక్జిబిషన్ వస్తుంది. పిట్టలు కొట్టే తుపాకీతో బుడగల్ని పేల్చటం, మడ్డినూనెలో వేయించిన బజ్జీలు, అప్పడాలు తిన్డం, తుప్పు పట్టిన జైంట్ వీల్లో తిరగడం.. మాగొప్పగా వుంటుంది! మా గుంటూరు సూర్యుడికి అతి తక్కువ దూరంలో వుంది, ఎండల వేడికి తారురోడ్లు కరిగిపోతుంటాయి. సాయంకాలాలు ఈ ఎగ్జిబిషన్ మాకు హాయినిచ్చేది.

గుంటూర్లో ఇంకేమి హాయి ఉన్నది? నాజ్ అప్సర ఉంది. ఎవరా అప్సర!? అబ్బే, అప్సర అంటే మనిషి కాదు, ఒక ఏసీ సినిమా హాలు! నా జీవితంలో మొదటి ఏసీ చల్లదనం అనుభవం అక్కడే. చల్లగా, సెంటు వాసనతో హాయిగా వుంటుంది. కానీ ఏం లాభం? అక్కడన్నీ హిందీ సినిమాలే, మాకు తెలుగు తప్ప ఏ భాషైనా పాళీభాషతో సమానం!

ఒకసారి 'పాకీజా' వెళ్ళాం. సినిమా మొదలవ్వంగాన్లే మాలో సగంమంది ఆ చల్లదనానికి నిద్రపొయ్యారు. నేను పట్టుదలగా నిద్ర ఆపుకుని మరీ సినిమా చివర్దాకా చూశాను. మీనాకుమారి డాన్సులు చేస్తుంంటుంది, డాన్సుల మధ్య ఏడుస్తుంంటుంది. అంతే అర్ధమైంది! ఏవీఁ అర్ధం కాకపోయినా, సినిమా గొప్పకళాఖండమని మాత్రం అర్ధమైంది. 

ఎప్పట్లాగే ఆ యేడాది కూడా మిత్రులందరం ఎక్జిబిషన్‌కి వెళ్ళాం. ఇప్పుడంటే సెల్ ఫోన్లతో ఎడాపెడా ఫోటోలు తీసేస్తున్నారు గానీ, ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా అపురూపం. ఫొటోలో చక్కగా 'పడాలని' తపన పడుతూ బాగా 'దిగేవాళ్ళం'! అంచేత ఎక్జిబిషన్లలో ఫోటో స్టూడియో స్టాల్స్ చాలా పాపులర్. అక్కడ రూపాయికో ఫోటో తీస్తారు. నల్లటివాళ్ళని కూడా గోడక్కొట్టిన సున్నంలా తియ్యడం వారి స్పెషాలిటీ, బహుశా ట్రేడ్ సీక్రెట్ కూడానేమో!

ఆ రోజు మేం ఫొటోలు 'దిగిన' స్టూడియో స్టాల్ నార్తిండియావాళ్ళది. వాళ్ళల్లో ఒకడు ఎర్రగా, పొడుగ్గా ఉన్నాడు. ఏదో ఆకుని గారపళ్ళతో మేక నమిలినట్లు పరపరా నముల్తున్నాడు. రూపాయి టికెట్లు కొనుక్కుని కృష్ణతో ఫైటింగ్ పోజు, ఎన్టీఆర్‌తో షేక్ హ్యాండ్ పోజు.. రకరకాలుగా ఫొటోలు దిగాం. ఆ ఆకులు నమిలేవాడు ఓ గంట తరవాతొచ్చి ఫొటోలు తీసుకొమ్మన్నాడు.

సరే! కొంతసేపు బజ్జీలు, అప్పడాలు నమిలాం. పన్లోపనిగా కనబడ్డ అమ్మాయిల్ని కూడా నమిలేసేట్టు చూశాం. ఆవిధంగా ఉదరపోషణా, కళాపోషణా చేసుకుని గంట తరవాత ఫోటో స్టూడియో స్టాల్‌కి వెళ్ళాం. స్టూడియో ముందు ఒక తెల్లగుడ్డ ఏటవాలుగా వేళ్ళాడుతుంది. ఆగుడ్డ మీద తడితడిగా ఫోటోలు వున్నాయి, ఓ మూలగా వెకిలి నవ్వుతో మా సుందర వదనాలు. ఫోటోలకి పక్కనే ఆకులు నముల్తూ గారపళ్ళ స్టూడియోవాడు. వీడింక అన్నం తినడా? రోజంతా మోపుల కొద్దీ ఆకుల్ని నమిలేసి బ్రతికేస్తుంటాడా! 

గారపళ్ళ మేకకి మా ఫోటోల తాలూకా కౌంటర్ ఫాయిల్స్ ఇచ్చాం, వాడు ఆ ఫాయిల్స్ వెనక్కి తిప్పి చూశాడు. ఉర్దూలో ఏదో చెప్తూ వెనక్కిచ్చేశాడు, ఒక్కముక్క అర్ధం కాలేదు. ఇంతకీ వాడు చెప్పేది ఏంటబ్బా! కొద్దిసేపటికి అర్ధమైందేమనగా - మేం వాడికి ఇంకా కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉందిట. టికెట్ల వెనక ఏదో మా అప్పు తాలూకా యేదో అంకె వేసి ఉంది, వాస్తవానికి మేం ఒక్కపైసా కూడా ఇవ్వనక్కర్లేదు. మాక్కోపం తన్నుకొచ్చింది, కానీ నోరు తెరిచే అవకాశం లేదు, భాషా సమస్య!

"మేం డబ్బులు మొత్తం ఇందాకే ఇచ్చేశాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకివ్వాలి?" అంటూ మాలో ఒకడు ధైర్యం చేసి తెలుగులో ఘోషించాడు.

"తెలుగు నహీ ఆతా, ఉర్దూ మే బోల్" అన్నాడు స్టూడియోవాడు విసుగ్గా.

మాలో ఇంకోడు ఇంకో అడుగు ముందుకేశాడు. 

"భాయ్ సాబ్! హమ్ ఉర్దూ నహీ, డబ్బులు భీ నహీ!" అంటూ గొణిగాడు.

"ఉర్దూ మే బోల్!" అంటూ విదిలించాడు మేకాధముడు.

లాభం లేదు. ఇక్కడ తెలుగుభాష దారుణంగా ఓడిపోయింది. తెలుగు నేల మీద తెలుగుభాష పనికి రాకుండా పోయింది! హఠాత్తుగా గుర్తొచ్చింది, మా హైదరాబాదీ ఉర్దూ మాస్టర్ ఉన్నాడుగా! ఇప్పటిదాకా అనవసరంగా మేకగాడితో కష్టాలు పడ్డాం, అవమానాలూ పడ్డాం, ఎక్కడ్రా వాడు? మావాడు ఆ పక్కగా కొద్దిదూరంలో ఒక అమ్మాయి దృష్టిలో పడ్డానికి తన పొడుగు జుట్టు స్టైల్‌గా ఎగరేస్తూ, ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని పోజులు కొడుతున్నాడు.

'ఇంక చాల్లే! నీ జీవితమంతా ఇక్కడే గడిపినా, ఆ అమ్మాయి నీ దరిద్రప్మొహాన్ని చూసే చాన్స్ లేదు.' అంటూ వాణ్ణి ఫోటో స్టూడియోకి లాక్కొచ్చాం, సమస్య వివరించాం.

'ఇంక నీ ఇష్టం. ఈ మేకారావుని వాడి భాషలోనే దంచు, మన ఫొటోలు సంపాదించు.' అని ముందుకు నెట్టి గర్వంగా పక్కన నించున్నాం.

మా హైదరాబాద్ ఉర్దూగాడు నోరు తెరవలేదు, అలా చూస్తూ నించున్నాడు. మేగ్గాడు ఈసారి స్వరం పెంచాడు. వాడు మమ్మల్ని తిడుతున్నాడని అర్ధమైంది. 

"మాట్లాడు, మన ఫొటోలు లాక్కో!" అంటూ మావాణ్ని వెనకనించి గిల్లుతున్నాం.

ఎంత గిల్లినా మావాడు ఉలకడు, పలకడు. మా గిల్లుడు రక్కుడుగా మారి, బాధ భరింపరానిదిగా తయారైన కారణాన, ఎట్టకేలకు మావాడు నోరు తెరిచాడు - 

"గల్తీబాత్ మత్ కరో భాయ్!"

మేకగాడు ఈసారి రంకెలెయ్యడం మొదలెట్టాడు. మా హైదరాబాదుగాడు ఆ తిట్లన్నీ ఓపిగ్గా పడుతున్నాడు. ఎంతసేపటికీ అరిగిపోయిన రికార్డులా ఒకటే మాట - 

"గల్తీబాత్ మత్ కరో భాయ్!" 

కొంతసేపటికి - మావాడికి 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' మించి పరాయి భాషలో ఇంకోముక్క కూడా రాదని మాకు అర్ధమైపోయింది. 

ఓరి దరిద్రుడా! ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంతలా హింసించావ్? అయ్యో! మా ఫొటోలు వదిలేసుకోవలసిందేనా? భగవంతుడా! దారి చూపవయా!

భగవంతుడు దారి చూపాడు - రజాక్ రూపంలో! రజాక్ కుటుంబానికి మా ఇంటి దగ్గర బడ్డీ కొట్టుంది. ఆ కొట్టు మేం పుట్టకముందు నుండీ వుంది. దాన్ని సాయిబు కొట్టుగా అనేవాళ్ళు. సాయిబు కొట్టు రజాక్‌కి మా గోడు వెళ్ళబోసుకున్నాం. 

ఇంక చూడండి! నా సామిరంగా! రజాక్ అగ్నిహోత్రుడైపొయ్యాడు. ఉర్దూలో ఆ మేకాధముణ్ణి తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. స్టాల్ పీకిచ్చేస్తానని బెదిరించాడు. మాలో ఒకడు పెద్ద పోలీసాఫీసరు కొడుకని బెదిరించాడు.

సడన్‌గా మేక కాస్తా పిల్లిలా మారిపోయింది! 

"మాఫ్ కర్నా సాబ్!" అంటూ గుడ్డమీద ఫొటోల్ని అత్యంత వినయంగా ఇచ్చాడు.

"ఫొటోలన్నీ వచ్చాయో లేదో చూసుకోండి. తాగున్నాడు సాలాగాడు, పిల్లలు గదాని బెదిరించి డబ్బులు గుంజుదామనుకున్నాడు." అంటూ రజాక్ వెళ్ళిపొయ్యాడు.

మిత్రులారా! ఇంతటితో కథ అయిపోయింది, ఉర్దూ రాదని తేలిన మరుక్షణం మావాడి ప్రభ తగ్గిపోయింది. అప్పటిదాకా తెలుగు మాత్రమే తెలిసి ఉన్నందుకు సిగ్గుతో దించుకున్న మా మొహాలు 'తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది' అంటూ గర్వంగా తలెత్తుకున్నాయి. 

థాంక్యూ! థాంక్యూ మై డియర్ ఎక్జిబిషన్!

అటు తర్వాత మావాడు ఏం చెప్పినా - 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' అంటూ గద్దించాం, నోరు తెరిచే అవకాశం లేకుండా సీల్ చేసేశాం. ఆ విధంగా హైదరాబాదు ఉర్దూని శాశ్వతంగా నిర్మూలించేశాం, గుంటూరా మజాకా!

మా చదువులు అయిపొయ్యాయి. మావాడు బ్యాంకు ఉద్యోగస్తుడయ్యాడు. అప్పట్నించి నాకు భారత బ్యాంకింగ్ వ్యవస్థ కుప్ప కూలిపోతుందేమోనని భయం పట్టుకుంది. రెండో ఎక్కం కూడా సరీగ్గారాని మావాడు కంప్యూటర్ల సాయంతో ఉద్యోగం లాక్కొస్తున్నాడు.

మొన్నామధ్య కలిసినప్పుడు మావాణ్ని హెచ్చరించాను - "ఉద్యోగం జాగ్రత్తరోయ్!" 

మావాడు పెద్దగా నవ్వి అన్నాడు - "గల్తీబాత్ మత్ కరో భాయ్!"    

Monday 7 May 2012

ఉడిపి హోటళ్ళు.. రాజకీయ విశ్లేషణ


సమయం ఉదయం తొమ్మిది గంటలు, ఈ సమయంలో రోజూ నేను 'హిందూ'లో వార్తలు చదువుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాను. 

ఇంతలో హడావుడిగా సుబ్బు వచ్చాడు.

వస్తూనే - "రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"ఇందాక  మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ కొడుకు కనిపించాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎట్లాంటి గుంటూరు ఎట్లా అయిపొయింది మావా! ఒకప్పుడు మైసూర్ కేఫ్, శంకర విలాస్ ఊరికి మకుటాయమానంగా ఉండేవి. ఇప్పుడవి మాయమైపొయ్యాయి, ఎంతైనా ఆ రోజులే వేరు." నిట్టూర్చాడు సుబ్బు.

"సుబ్బూ! ఆపుతావా నీ వెధవ హోటళ్ళ గోల. దేశ రాజకీయ పరిస్థితి అస్సలు బాలేదు. నీకేమో పొద్దస్తమానం తిండి, హోటళ్ళే ప్రపంచం. వాటిల్లోంచి కొద్దిగా బయటకి రా! ఆలోచనా స్థాయి పెంచుకో!" విసుక్కున్నాను.

సుబ్బుకి నా మాటలు నచ్చలేదు.

"ఏంటీ? నాది వెధవ గోలా! 'హిందూ' చదివి దేశ రాజకీయాలు అర్ధం చేసుకునే దుస్థితిలో నువ్వున్నావు - నేన్లేను. కాదేది కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ, కాదేది రాజకీయ విశ్లేషణ కనర్హం అంటున్నాడీ సుబ్బు. కాఫీ హోటళ్ళ చరిత్రతోనే దేశ రాజకీయాలు కూడా అర్ధం చేసుకోవచ్చు, కానీ - ఆ విషయం నీకు తెలీదు. ఐ పిటీ యు!" అన్నాడు సుబ్బు. 

'హిందూ' పక్కన పడేశాను.

"ఏంటి సుబ్బూ నువ్వు చెబ్తుంది? కాఫీ హోటళ్ళకి దేశ రాజకీయాలకి సంబంధం ఉందా? ప్రూవ్ ఇట్." చాలెంజింగ్ గా అన్నాను.

సుబ్బూ ఒక్కక్షణం ఆలోచించాడు.

"ఓకే! మనకి ప్రతి ఊళ్ళో ఉడిపి హోటళ్లున్నాయ్. ఉడిపి వారు కష్టజీవులు, వారిలో ఎక్కువమంది అడ్డ పంచెలతో, పొట్టచేత పుచ్చుకుని ఉడిపి నుండి వలస వచ్చినవారే. వచ్చిన కొత్తలో తమ ఉడిపి హోటళ్ళలోనే వంటవాళ్ళగానో, సప్లైయర్లుగానో పనిచేస్తారు. వ్యాపార మెళకువలు నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, స్నేహాలు పెంచుకుంటారు. కొంతకాలానికి హోటల్ వ్యాపారానికి అనువైన ప్రదేశం గుర్తిస్తారు. కొద్ది పెట్టుబడితో చిన్న టిఫిన్ సెంటర్ మొదలెడతారు. శుచి, శుభ్రత, రుచి మైంటైన్ చేస్తూ, చాలా కస్టమర్ ఫ్రెండ్లీగా, నిజాయితీగా వ్యాపారం చేస్తారు. సహజంగానే వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొంతకాలానికి ఆ టిఫిన్ సెంటర్ ఒక చిన్నహోటల్ గా, అటుతరవాత ఒక పెద్దహోటల్ గా అభివృద్ధి చెందుతుంది."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీని సిప్ చేస్తూ, ఆలోచిస్తూ మాట్లాడటం కోనసాగించాడు సుబ్బు.  

"ఇప్పుడు మనం ఈ హోటళ్ళ సక్సెస్ స్టోరీని రాజకీయాల్లోకి తీసుకొద్దాం. మనదేశంలో వామపక్షాలు, బిజెపికి (కనీసం ఆన్ పేపర్) కొన్ని సిద్ధాంతాలున్నాయ్. కాబట్టి వాటిని పక్కన పెడదాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకవ్యక్తి పార్టీలే. ఆ పార్టీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కులం, ప్రాంతం వంటి అంశాలని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయ్. ప్రజల అవసరాలు, అవస్థలకి ప్రతిభావంతంగా స్పందించిన పార్టీలకి సహజంగానే ప్రజాదరణ వస్తుంది, అధికారమూ వస్తుంది. కాబట్టి - ఒక రాజకీయ పార్టీ పుట్టుక, ఎదుగుదల ఉడిపి హోటల్ చరిత్రని పోలి ఉంటుంది."

ఇంతలో నాకు ఫోనొచ్చింది.

"డాక్టర్ గారు! మా అబ్బాయికి ఎల్కేజీ పబ్లిక్ పరీక్షలో అరమార్కు తగ్గింది, ఇంక నేను బ్రతకడం అనవసరం, చచ్చిపోవాలనిపిస్తుంది." అంటూ ఓ కన్నతల్లి ఏడవసాగింది.

"అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది! టెన్షనొస్తే వేస్కోమని ఓ మాత్రిచ్చా గదా? అది మింగి పడుకో తల్లీ!" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. 

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"మన ప్రాంతీయ పార్టీల పునాది, పెట్టుబడి ఆ పార్టీ స్థాపకునికి ఉన్న జనాకర్షణే. ఇందుకు ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లే ఉదాహరణ. కొన్నాళ్ళకి వాళ్ళు ముసలాళ్ళైపోతారు. మారుతున్న సమాజానికి కొత్త సమస్యలు ఎదురౌతుంటాయి. కుర్రఓటర్ల ఆలోచనలకి తగ్గట్లుగా ఈ పార్టీలలో మార్పులు రావాలి. అనగా ఓటర్లలో తరం మారినట్లే నాయకత్వంలో కూడా తరం మారాలి. అయితే ఈ మార్పు ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది. అంటే - నెమ్మదిగా తండ్రుల స్థానంలో కొడుకులు రంగంలోకి రావాలి, తండ్రి ఆస్థి చెందాల్సింది కొడుక్కే గదా!"  

ఇప్పుడింకో పేషంట్ దగ్గర్నుండి ఫోన్.

"డాక్టరు గారు! నాకు చేతబడి చేయించిన వాడెవడో తెలిసి పోయింది. వాడెవడో కాదు, మా బామ్మర్దే!" అవతలి గొంతు చాలా ఉత్సాహంగా ఉంది.

"ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లో మాట్లాడుకుంటే కుదర్దు. మీరే రండి, మాట్లాడుకుందాం."అంటూ ఫోన్ పెట్టేశాను.

సుబ్బు చెప్పసాగాడు.

"నాకు తెలిసి హోటళ్లు మేన్ మేనేజ్మెంట్ కి గొప్ప ఉదాహరణ. క్లీనర్లు, సప్లయర్లు, వంటవాళ్ళు.. అనేక వయసులవారు నిరంతరం పన్జేస్తూనే ఉంటారు. కొందరు హోటల్ పుట్టుక నుండి విశ్వాసంగా ఉంటారు, ఇంకొందరు పనిదొంగలు. ఎవరేమిటి? అన్నది ఓనర్ గ్రహించాలి. హోటల్ కష్టమర్లూ రకరకాలు. ఎక్కువమంది రెగ్యులర్ కస్టమర్లు, వారితే సత్సంబంధాలు కలిగుండాలి. ఇదంతా చెయ్యాలంటే - ఎంతో తెలివి, ష్రూడ్ నెస్ కలిగుండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టాడు గనకనే మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ అద్భుత విజయం సాధించాడు. నా అభిప్రాయం ఆయనకి బిజినెస్ మేనేజ్మెంటులో ఒక గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. అంతేకాదు - IIM లో ఉపన్యాసం ఇప్పించాలి." 

"సుబ్బూ! మనం మైసూర్ కేఫ్ లో సాంబారు కనీసం లక్షలీటర్లు తాగుంటాం కదూ!" తన్మయత్వంతో అన్నాను.

"లక్షలీటర్లు కాదు, లక్షగ్యాలన్లు అన్నది కరెక్ట్. శంకరనారాయణ ఏనాడూ ఓనరుగా ప్రవర్తించలేదు. పనివాళ్ళతో కలిసిపోయి హోటల్ని నడిపాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన పిల్లలు చదువుకున్నారు, అంచేత వాళ్లకి హోటల్ పని మోటుగా అనిపించింది. వయసు మీద పడటంతో తన హోటల్ వ్యాపారం కొడుకులకి అప్పజెప్పాడు శంకరనారాయణ. వాళ్ళవి రాంగ్ స్ట్రాటజీస్, అందుకే - డైరక్టుగా క్యాష్ కౌంటర్ ముందు కూర్చున్నారు. వంటగది వైపు తొంగి కూడా చూసేవాళ్ళు కాదు. ఫలితంగా ఇడ్లీ వేడి తగ్గింది, సాంబారు రుచి తగ్గింది, హోటలుకి బిజినెస్ తగ్గింది." అన్నాడు సుబ్బు.

"శంకరనారాయణ బిజినెస్ మోడల్ గూర్చి నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ దాంతో దేశ రాజకీయాలకేం సంబంధమేంటి?" ఆసక్తిగా అడిగాను.

"చాలా సంబంధం వుంది. ఉదాహరణకి - ఉత్తర ప్రదేశ్ లో మూలాయం మంచి హోటల్ నడిపాడు. మనిషి పాతబడ్డాడు, బిజినెస్ తగ్గింది. ఈలోగా కొడుకు అఖిలేష్ చేతికందొచ్చాడు. అఖిలేష్ హోటల్లో డైరెక్టుగా క్యాష్ కౌంటర్లో కూర్చోకుండా, ప్లేట్లు కడగడం దగ్గర్నుండి దోశెలెయ్యడం దాకా అన్నిరకాల పనులు చేశాడు. వ్యాపారంలో కష్టనష్టాలు అర్ధం చేసుకోడానికి సైకిల్ యాత్రంటూ కష్టపడ్డాడు, పార్టీకి కొత్తరక్తం ఎక్కించాడు. ఫలితంగా హోటల్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు తండ్రి కొడుక్కి క్యాష్ కౌంటర్ అప్పచెప్పాడు. కుర్ర కస్టమర్ల అభిరుచులు కొడుకు చూసుకుంటుంటే, ముసలి కస్టమర్ల కోసం తండ్రి ఎలాగూ ఉన్నాడు. ఇది డెడ్లీ కాంబినేషన్." అన్నాడు సుబ్బు.

"ఓకే! మరి మన ఆంధ్రా రాజకీయాలు?" అడిగాను.

"తెలుగు దేశం పార్టీ అనే ఉడిపి హోటల్ని చంద్రబాబు బాగానే నడిపాడు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. కుర్ర కస్టమర్లకి చంద్రబాబు మెనూ నచ్చడం లేదు. ఇప్పుడిక తెలుగు దేశం పార్టీ నాయకత్వ మార్పిడి స్మూత్ గా జరగవలసిన సమయం ఆసన్నమైంది." అన్నాడు సుబ్బు.

"మరింక లేటెందుకు? హాయిగా లోకేశ్ కుప్పం నుండి సైకిల్ యాత్ర మొదలెట్టెయ్యొచ్చుగా?" అడిగాను.

"వచ్చు, కానీ - ఇక్కడొక చిక్కుంది. తెలుగు దేశం హోటల్ ఓనర్షిప్ చంద్రబాబుది కాదు, ఆ హోటల్ ఆయనకి పిల్లనిచ్చిన మామది. వంటశాలలో ఓమూల ఇడ్లీలేసుకుంటూ బ్రతికేస్తానని మామని నమ్మబలికి, క్రమంగా మామ క్యాష్ కౌంటర్ కే ఎసరుబెట్టాడు చంద్రబాబు. అసలు ఓనరైన ఎన్టీఆర్ వారసులకి హోటల్ నడిపే ఓపికా, యోగ్యతా లేవు. కానీ - ఎప్పటికైనా ఆ హోటల్  తమమదేనని అప్పుడప్పుడు గర్జిస్తుంటారు. చంద్రబాబు మింగాలేడు, కక్కాలేడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి." అన్నాడు సుబ్బు.

"మరి జగన్ సంగతి?"

"రాజశేఖర రెడ్డి 'కాంగ్రెస్' అనే హోటల్ని అద్భుతంగా నడిపాడు. అయితే - ఆయన 'కాంగ్రెస్ హోటల్'కి యజమాని కాదు, బ్రాంచి మేనేజర్ మాత్రమే. గాంధీ కుటుంబానికి చెందిన ఆ హోటల్ హెడ్డాఫీసు ఢిల్లీలో ఉంది. సోనియా గాంధీకి తన హోటల్ హైదారాబాద్ బ్రాంచి మీద హక్కులు జగన్ లాగేసుకుంటాడనే భయం పట్టుకుంది. తమ హోటల్ కి వ్యాపారం తగ్గినా పర్లేదు గానీ, అన్ని హక్కులు తన ముద్దుల కొడుకు రాహులుడికి చెంది ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే జగన్ కి మొండిచెయ్యి చూపింది." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"జగన్ తొందరపడ్డాడేమో?"

"నేనలా అనుకోవడం లేదు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డికి క్యాష్ కౌంటర్ అప్పచెప్పారో అప్పుడే జగన్ కి ఢిల్లీ తాత్పర్యం అర్ధమైపోయింది. అతనికి ఎదురుగా చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి కొడుకులు కనిపిస్తున్నారు. వాళ్ళు సంవత్సరాలు తరబడి సప్లయిర్లుగా పనిచేస్తూనే ఉన్నారు. సోనియాగాంధి వాళ్ళకి కనీసం జీతం పెంచిన పాపాన పోలేదు. ఆవిడ ఉద్దేశ్యం జగన్ని కూడా సప్లయిర్ గా నిరంతరం పని చెయ్యమనే!" అన్నాడు సుబ్బు.

"అవును గదా! ఈ పాయింట్ నాకు తట్టనేలేదు సుమీ!" అన్నాను.

"జగన్ క్యాష్ కౌంటర్ పోస్ట్ కి తప్ప దేనికీ ఒప్పుకోడు. అంచేత - అతనికిప్పుడు వేరే ఆప్షన్ లేదు. అందుకే ఫ్రెష్షుగా ఇడ్లీపాత్ర, పెనం కొనుక్కుని, కాంగ్రెస్ హోటల్ ఎదురుగానే చిన్నహోటల్ సొంతంగా మొదలెట్టాడు. తన తండ్రి వంట రుచి చూసి ఆదరించిన పాత కస్టమర్లు వస్తారని ఆశ. అలాగే కస్టమర్లక్కూడా జగన్ హోటల్ టిఫిన్ల గూర్చి అవగాహన ఉంది. సక్సెస్ కి అడ్డదారులు లేవు మిత్రమా! కష్టపడాలి, అందుకే - జగన్ కష్ట పడుతున్నాడు. ఎండనకా, వాననకా ఓదార్పు యాత్రంటూ తిరుగుతున్నాడు." అన్నాడు సుబ్బు. 

"కిరణ్ కుమార్ రెడ్డి?"

"మన ముఖ్యమంత్రికి ఇడ్లీకి, అట్టుకి తేడా తెలీదు. అతనికి ఇంతకుముందు రాజశేఖరరెడ్డి హయాంలో క్లీనర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ తెలీకపోవడమే అతని అర్హత, అదే అతనికి ప్లస్సయింది.. ఢిల్లీ పెద్దలకి భలే నచ్చింది. అందుకే ఇప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. అందుకే - ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో (సప్లయిర్లుగా) పన్జేసిన సత్తి బాబు, డి.ఎల్. రవీంద్రారెడ్డిలు కిరణ్ని చూసి గుర్రుమంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! బాగా చెప్పావు. ఉడిపి హోటళ్ళ చరిత్రని తెలుసుకుంటే దేశరాజకీయాలు కూడా అర్ధమైపొతాయన్నమాట! నీ హోటల్ రాజకీయ పురాణం బాగుంది." నవ్వుతూ అన్నాను.

సుబ్బూ టైమ్ చూసుకుంటూ లేచి నిలబడ్డాడు.

"రవణ మావా! నేవెళ్తున్నా. దార్లో అమ్మకి చింతలూరివారి మాదీఫల రసాయనం కొనుక్కెళ్ళాలి. నువ్వు నీ 'హిందూ' శ్రద్ధగా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకో. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(picture courtesy : Google)

Friday 4 May 2012

చిరంజీవి, బాలకృష్ణల సమస్య


నేను చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చాలా చూశాను. అతని సినిమాల్లో కథ ఉండదు. పక్కన రాధిక అనే అరవమ్మాయి హీరోయిన్ గా చేస్తుండేది. నెలకి రెండు కొత్తసినిమాలు రిలీజ్ అయ్యేవి. దాదాపు అన్నీ 'ఢిషుం.. ఢిషుం' సినిమాలే. ఇట్లాంటి కథలేని సినిమాలు స్నేహితులతో మంచి కాలక్షేపం. నాకున్న స్నేహితులు కూడా కబుర్లు చెప్పుకుంటూ సరదా కాలక్షేపంగా సినిమా చూసేవాళ్ళేగానీ.. అంతకుమించి సినిమాల గూర్చి పట్టించుకునేవాళ్ళు కాదు. అంత టైమూ ఉండేది కాదు.

సరే! చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పట్నించి తెలుగు న్యూస్ చానెళ్ళలో తరచుగా కనబడటం మొదలెట్టాడు. ఆవిధంగా.. సినిమాలు చూడ్డం మానేసిన నావంటి దుష్టుల దృష్టిలో మళ్ళీ పడ్డాడు. చెప్పుల కొట్లో పని చేసేవాడు అప్రయత్నంగా అందరి కాళ్ళకేసి చూస్తుంటాడు. అటులనే (నా వృత్తిరీత్యా) నాక్కూడా ఎదుటివాడు చెప్పే విషయం కన్నా చెప్పు (కాలికి తొడుక్కునే చెప్పు కాదు) విధముపై ధ్యాస మెండు.

టీవీలో కనబడుతున్న చిరంజీవిని జాగ్రత్తగా గమనించండి. అతనికి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు అర్ధం కావు. అయినా సరే! మొండిగా సమాధానం చెప్పబోతాడు. thought process మొదలవ్వంగాన్లే.. సడన్ బ్రేక్ పడుతుంది. ఇంజన్ స్టార్ట్ చేసి గేరెట్లా వెయ్యాలో తెలీనివాడిలా తెల్లమొహం. మైండ్ బ్లాంకయిపోతుంది.

ఆలోచనాదారాన్ని అందుకోవడానికి desperate గా ప్రయత్నిస్తుంటాడు. కానీ.. సాధ్యం కాదు. ఏవో నాలుగు ముక్కలు గొణుగుతాడు. ప్రశ్నే అర్ధం కాలేదు కావున గొణిగిన ఆ నాలుగు ముక్కలకి ఏ అర్ధమూ ఉండదు. అసలు సంగతి తెలీని అతని తమ్ముళ్ళు .. అన్నయ్య చెప్పేదేంటో అర్ధం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటారు. అందుకే అన్నయ్య తమ్ముళ్ళందరికీ బట్టతల వచ్చేసింది.

paid news లాగా paid రిపోర్టర్లని చిరంజీవి ఎరేంజ్ చేసుకుంటే మంచిది. ఈ paid రిపోర్టర్లు అడగమన్న ప్రశ్నలే అడుగుతారు. నిదానంగా.. ఆలోచిస్తూ సమాధానం చెబుతున్నట్లు.. spontaneous interaction లాగా చిరంజీవి వీక్షకుల్ని నమ్మించాలి. కానీ అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ అవుటవరాదు. అలాగే.. శత్రుక్యాంపుదారులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పోర్షన్లో లేని ప్రశ్నలడిగి తికమక పెట్టొచ్చు. అప్పుడు అన్నయ్య పని ఇంటర్ ఫిజిక్స్ పేపరయిపోతుంది!"

ఇప్పుడు మనం బాలకృష్ణ గూర్చి చెప్పుకుందాం. బాలకృష్ణకి జర్నలిస్టులడిగే ప్రశ్న అర్ధమవుతుంది. ఆలోచన కూడా ఉన్నట్లుంది. కానీ మెదడులోంచి నోటికండరాలకి కనెక్షన్లొ ప్రాబ్లెం! చిరంజీవి సమస్య స్టార్టింగ్ ట్రబులైతే బాలకృష్ణ ది బ్రేకుల్లేని డ్రైవింగ్. స్టార్టింగే డైరక్ట్ గా టాప్ గేర్. అందుకే అతను మాట్లాడుతుంటే ఏదో speed race చూస్తున్నట్లుంటుంది. మాటల్లో సూపర్ స్పీడ్. కళ్ళు మూసుకుని, చెవులు రిక్కించి, తీవ్ర ఏకాగ్రతతో విన్నా ఒక్కముక్క కూడా అర్ధమయ్యిచావదు. మొన్నామధ్య మా సుబ్బు అరగంటపాటు బాలకృష్ణ స్పీచ్ విని రెండు మాటలు పట్టాడు. అవి.. నాన్నగారూ.. ఊ.. ఊ.. . ఇంకోటి నందమూరి వంశం.. ఊ.. ఊ.. ! మూడో మాట పట్టడం సుబ్బు వల్ల కాలేదు.

బాలయ్యబాబు స్పీడుకి బ్రేకులెయ్యడం ఎవరికీ సాధ్యంకాదు. అందుకని బాలకృష్ణ టీవీ చానెళ్ళ ఓనర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది. అతని ఇంటర్వ్యూ ముందే రికార్డ్ చేసుకుని.. తరవాత స్లో మోషన్లో replay చేస్తే బెటర్. అప్పుడు మాట slow అయ్యి.. చూసేవాళ్లకి కొద్దోగొప్పో అర్ధం అవ్వొచ్చు. కానీ lip sync కుదరకపోవచ్చు. ఈ సాంకేతిక సమస్య అధిగమించడం అంత కష్టం కాకపోవచ్చు.

చిరంజీవి, బాలకృష్ణలు అమాయకులు కాదు. తాము చెప్పేది జనాలకి అర్ధం కావట్లేదని వాళ్ళకీ అనుమానం ఉన్నట్లుంది. అందుకే మీసాలు మెలేయ్యడం, తొడలు కొట్టడంలాంటి విన్యాసాలు చేస్తున్నారు.

నా కజినొకడు తెలుగు సినిమా వీరాభిమాని. రాజకీయాలు అస్సలు తెలీవు. అతగాడు చిరు, బాలయ్యలిద్దర్లో ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు కేంద్రమంత్రి కావాలని పూజలు చేస్తున్నాడు. నాక్కోపం వచ్చింది. "ఎంత సినిమా పిచ్చోడివైనా.. నీపిచ్చి సినిమాలతో ఆపెయ్యి. రాజకీయాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని పూజలు చెయ్యడం టూ మచ్." అన్నా.

నా కోపానికి నొచ్చుకున్న నా కజిన్ "నిజంగా నాకు రాజకీయాలు తెలీవు. కానీ వాళ్ళు మినిస్టర్లు కాకపొతే మళ్ళీ సినిమాల్లో నటిస్తారనే భయమే నాతో ఈ పూజలు చేయిస్తుంది. వాళ్ళు లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమా హాయిగా, ప్రశాంతంగా ఉంది." అన్నాడు!

నిన్న నా స్నేహితుడు నాదగ్గరకి తన కొడుకుతో వచ్చాడు. కుర్రాడు చాకులాగున్నాడు. తెలివైనవాడు. ఏవో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట.

నేను నా స్నేహితుడితో "మీ వాణ్ణి జర్నలిజం స్కూల్లో చేర్పించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఇతనిలో  పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు. ఇంత తెలివైనవాణ్ణి వెధవ జీతాల కోసం పనిచేసే ఉద్యోగాల్లో పడేసి వృధా చెయ్యకు." అన్నా.

అతగాడు నన్ను ఎగాదిగా చూశాడు. "నీ ప్రాక్రీస్ పెంచుకోవాలంటే వేరే మార్గాలు చూసుకో. నీకన్ను నాకొడుకు మీదే పడిందా!" నిష్టూరంగా అన్నాడు.

అర్ధం కాలేదు. బిత్తరపోయి చూస్తున్న నన్ను చూసి పెద్దగా నవ్వాడు.

"నువ్వు పెద్దగా టీవీ చూడవనుకుంటా. మా తమ్ముడు హైదరాబాదులో జర్నలిస్టు. ప్రస్తుతం తెలుగు జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు జానారెడ్డి, కేశవరావులే జర్నలిస్టుల్ని తికమక పెట్టేవాళ్ళు. జానారెడ్డి గంటసేపు మాట్లాడినా ఒకట్రెండు పాయింట్లు వెతికి పట్టుకుని దాన్నే సాగదీసి రాసి.. పని అయిందనిపించేవాళ్ళు. కేశవరావు ఏభాషలో ఏంచెబుతున్నాడో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించిన ఇద్దరు రిపోర్టర్లు ఎర్రగడ్డలో తేలారు. ఉన్నవాళ్ళతోనే చస్తుంటే ఇప్పుడు కొత్తగా చిరంజీవి, బాలకృష్ణలు వచ్చి చేరారు. ఇప్పుడున్న జర్నలిస్టులే ప్రాణాలకి తెగించి.. యుద్ధ వార్తలు కవర్ చేస్తున్నట్లు పనిచేస్తుంటే.. నాకొడుకుని జర్నలిస్టు అవ్వమంటావేమిటి!" అన్నాడు.

"సారీ మిత్రమా! నాకు తెలీదు." అన్నాను.

నా మిత్రుడు చిన్నగా నవ్వాడు.

"ఇంత చిన్నదానికి సారీలు ఎందుగ్గానీ.. నా అభిమాన రాజకీయ నాయకులు మాత్రం జానా కేశవ చిరు బాలయ్యలే! రాజకీయనాయకులు తియ్యటి ప్రసంగాలు చేస్తారు. చక్కటి వాగ్దానాలు చేస్తారు. వాళ్ళు చెప్పేది విని మనం మోసపోతాం. దానికన్నా ఏవీ అర్ధం కాకుండా మాట్లాడేవాళ్ళే బెటర్." అన్నాడు.

(photos courtesy : Google)