Friday 29 June 2012

నా 'గురజాడ' కష్టాలు

"గురజాడ అప్పారావు!? ఎవరీ గురజాడ? స్వాతంత్ర సమరయోధుడా? రాజకీయ నాయకుడా? నాటకాలేస్తాడా? పాటలు పాడతాడా? సినిమాలు తీస్తాడా? వున్నాడా? పొయ్యాడా? పేరు గంభీరంగానే వుంది, గాంధీగారికి శిష్యుడా? గురజాడా! మై డియర్ గురజాడా! హూవార్యూ?" నన్నునేనీ ప్రశ్నలడుక్కోవడం ఇది డెబ్భైనాలుగోసారి, బట్ నో సమాధానం!

అది మా హైస్కూల్. ఇంకొంతసేపట్లో వ్యాసరచన పోటీ జరగబోతుంది. టాపిక్ - 'గురజాడ అప్పారావు' అని మొన్ననే తెలుసు. రెండ్రోజుల క్రితం క్లాసులోకి ఈ వ్యాసరచన తాలూకా నోటీసు వచ్చింది. మా క్లాస్ టీచర్ 'పాల్గొనువారు' అంటూ ఏకపక్షంగా కొందరిపేర్లు రాసేశారు. పిమ్మట 'మీకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ మహానుభావుడి గూర్చి నాలుగు ముక్కలు రాయడం ముఖ్యం!' అంటూ వాక్రుచ్చారు. ఆవిధంగా నా ప్రమేయం లేకుండానే వ్యాసరచన పోటీదారుణ్ని అయిపొయ్యాను. ఆరోజు స్కూల్ అయిపోంగాన్లే గురజాడ గూర్చి వివరాలు సేకరించే పనిలో పడ్డా.

శాస్త్రిగాడి నమ్మకద్రోహం నా కొంప ముంచింది. ఇప్పుడు శాస్త్రిగాడి గూర్చి నాలుగు ముక్కలు. శాస్త్రిగాడు నా క్లాస్మేట్. గత రెండేళ్ళుగా నాపక్కనే కూచుంటాడు, వాడికి నా పక్కన ప్లేసు చాలా ఇష్తం! ఎందుకని? పరీక్షల్లో వాడు నా ఆన్సర్ షీటుని జిరాక్స్ మిషన్ కన్నా వేగంగా కాపీ కొడతాడు. అదీ సంగతి! అందుకు కృతజ్ఞతగా కొన్ని సందర్భాల్లో వాడు నాకు అసిస్టెంటుగా వ్యవహరించేవాడు.

'ఉరేయ్! గురజాడ అప్పారావు గూర్చి నువ్వస్సలు వర్రీ అవ్వకు. మా బాబాయ్ దగ్గర ఇట్లాంటి విషయాల మీద మోపులకొద్దీ మెటీరియల్ ఉంటుంది. రేపు తెచ్చిస్తాను.' అని హామీ ఇచ్చాడు శాస్త్రి. విషయం చిన్నదే కాబట్టి శాస్త్రిగాణ్ణి నమ్మి, ఇంక నేనావిషయం పట్టించుకోలేదు.

మెటీరియల్ అదిగో, ఇదిగో అంటూ చివరి నిమిషందాకా లాగాడు శాస్త్రి. ఇప్పుడు మొహం చాటేశాడు. మిత్రద్రోహి! మొన్న క్వార్టర్లీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ కఠినంగా ఉన్నందున, శాస్త్రిగాడికి చూసి రాసుకునేందుకు ఎప్పట్లా పూర్తిస్థాయిలో 'సహకరించ'లేకపొయ్యాను. అదిమనసులో పెట్టుకున్నాడు, దుర్మార్గుడు! కుట్ర పన్నాడు. ఆ విషయం గ్రహించలేక కష్టంలో పడిపొయ్యాను.

ఇంక లాభం లేదు, ఈ గరజాడ ఎవరో అడిగి తెలుకోవాల్సిందే. 

"ఒరే నడింపల్లిగా! గురజాడ గూర్చి తెలిస్తే కాస్త చెప్పరా!"

"గురజాడా! ఎవరాయన? నాకు తెలీదు." అంటూ జారుకున్నాడు నడింపల్లిగాడు.

'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అంటూ బట్టీవేస్తున్న పంగులూరిగాడు, నన్ను చూడంగాన్లే హడావుడిగా కాయితం జేబులో పెట్టుకుని క్లాస్ రూములోకి పారిపొయ్యాడు.

"ఒరేయ్! నువ్వు ఇవ్వాళ మాక్కూడా చూపించు! ఎంతసేపూ ఆ శాస్త్రిగాడికే చూపిస్తావేం? ఊరికినే చూపించమనట్లేదు! సాయంకాలం మామిడి కాయలు తెచ్చిస్తాంలే!" అంటూ బేరంపెట్టారు జంటకవులైన భాస్కరాయ్, సత్తాయ్ ద్వయం.

భాస్కరాయ్, సత్తాయ్ ప్రాణస్నేహితులు. మా బ్రాడీపేట ఇళ్ళల్లో మామిడిచెట్లకి రక్షణ లేదు. కాయలు ఉన్నట్టుండి మాయమైపొయ్యేవి. అది వీరి చేతిచలవే! ఇలా కొట్టేసిన కాయల్తో వీరు వాణిజ్యం చేసేవాళ్ళు. పరీక్షల్లో కాపీకి సహకరించే స్నేహితుల, ఇన్విజిలేటర్ల ఋణం మామిడికాయల్తోనే తీర్చుకునేవాళ్ళు. పరీక్షలయ్యాక టీచర్ల ఇళ్ళకి వెళ్ళి 'మా పెరట్లో చెట్టుకాయలండి' అంటూ భక్తిప్రవృత్తులతో గురుపత్నులకి సాష్టాంగప్రణామం చేసి బుట్టెడు కాయలు సమర్పించుకునేవాళ్ళు. వీరీ మంత్రాంగంతో విజయవంతంగా అనేక పరీక్షల్లో పాసు మార్కులు సంపాదించారు.

"ఏంటి మీకు నేను చూపించేది! శాస్త్రిగాడు నన్ను మోసం చేశాడు. నాకే ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు." అన్నాను దీనంగా.

"నీకేం తెలీదు, శాస్త్రిగాడు నిన్ను మోసం చేశాడు, ఇదంతా మేం నమ్మాలి! బయటకొస్తావుగా, అప్పుడు తేలుస్తాం నీ సంగతి." అంటూ గుడ్లురిమారు జంటకవులు.

క్లాసురూములోకి అడుగుబెట్టాక అక్కడి వాతావరణం చూసి నీరుగారిపొయ్యాను. పబ్లిక్ పరీక్ష రాయిస్తున్నట్లు అందర్నీ దూరందూరంగా కూర్చోబెట్టారు, పక్కనున్నవాడిని అడిగే అవకాశం లేదు. నా మిత్రశత్రువులు, శత్రుమిత్రులు అందరూ వారివారి స్థానాల్లో ఆశీనులై ఉన్నారు. ఇప్పటిక్కూడా గురజాడ ఎవరో కనీసం ఒక చిన్న హింట్ కూడా నాదగ్గర లేదు!

నా వెన్నుపోటుదారుడైన శాస్త్రిగాడు కొత్త పెళ్ళికొడుకులా ముసిముసిగా నవ్వుకుంటూ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. నేను శాస్త్రిగాడి దగ్గరకెళ్ళాను. కసిగా, కర్కశంగా, కోపంగా ఒక్కోఅక్షరం వత్తిపలుకుతూ నిదానంగా, నెమ్మదిగా వాడిచెవిలో అన్నాను.

"ఒరే శాస్త్రిగా! దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా! పంది, ఎద్దు, దున్న! నీలాంటి నీచుణ్ణి నేనింతమటుకూ చూళ్ళేదు. నువ్వు గురజాడ గూర్చి చాలా విషయాలు బట్టీ కొట్టావని నాకు తెలుసురా. కనీసం ఇప్పుడయినా రెండు పాయింట్లు చెప్పిచావు, నిన్ను క్షమించేస్తాను." అంటూ వాడి పాపపరిహారానికి చివరి అవకాశం ఇచ్చాను. శాస్త్రిగాడు నామాట వినబడనట్లు మొహం పక్కకి తిప్పుకున్నాడు.

నేను కోపంగా నా స్థానంలోకొచ్చి కూర్చున్నాను. నాకు గురజాడ గూర్చి తెలీకపోవడం కన్నా.. నా స్నేహితులు నాకు ఇంతలా సహాయ నిరాకరణ చెయ్యడం చాలా అవమానకరంగా అనిపిస్తుంది. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. బహుశా బ్రిటీషోడిక్కూడా గాంధీగారు ఇంత ఘోర సహాయ నిరాకరణ చేసుండరు! 

వ్యాసరచన సమయం మొదలైంది. మిత్రులంతా కళ్ళు మూసుకుని, శబ్దం బయటకి రాకుండా పెదాలు కదుపుతూ సరస్వతీ ప్రార్ధన చేసుకున్నారు. అయోమయంగా వాళ్ళని చూస్తుండిపొయ్యాను. నా జీవితంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదు. 

కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. 'ఎలాగూ గంటదాకా బయటకెళ్ళనివ్వరు. ఏదోకటి రాస్తే నష్టమేముంది? అయినా గురజాడ అప్పారావు గూర్చి తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప!' అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. కొద్దిగా ఉత్సాహం వచ్చింది.

నా తెలుగు, సోషల్ పాఠాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం, గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్.. ఇట్లా గుర్తున్నవారందర్నీ బయటకి లాగాను. అందర్నీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బి, ఇంకుగా మార్చి పెన్నులో పోశాను. ఇంక రాయడం మొదలెట్టాను.

'అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు. వీరు భరతమాత ముద్దుబిడ్డ. అసమాన ప్రజ్ఞాసంపన్నుడు, మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం, పట్టుదల అనితరసాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగువారి హృదయం ఆనందంతో పులకిస్తుంది, గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన నడయాడిన ఈ పుణ్యభూమికి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి గురజాడవారి త్యాగఫలం! సూర్యచంద్రులున్నంత కాలం గురజాడవారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. గురజాడవంటి మహానుభావుని గూర్చి రాయడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం..... ' ఈ విధంగా రాసుకుంటూ పోయాను. నా చేతిరాత అక్షరాలు పెద్దవిగా వుంటాయి. ఒక పేజికి పదిలైన్లు మించి రాసే అలవాటు లేదు. తదేక దీక్షతో అనేక ఎడిషనల్ షీట్లు రాసేశాను.

ఎక్కడా పొరబాటున కూడా గురజాడ గూర్చి చిన్న వివరం ఉండదు! కానీ చాలా రాశాను, చాలాచాలా రాశాను. శాస్త్రిగాడు చేసిన ద్రోహానికి కోపంతో రాశాను, ఆవేశంగా రాశాను. అది ఒక రాత సునామి, ఒక రాతా తాలిబానిజం, ఒక రాతా రాక్షసత్వం. కోపం మనలోని భాషాప్రావిణ్యాన్ని బయటకి తెస్తుందేమో!

వ్యాసం రాయడానికి ముందు 'శ్రీరామ' అని పెద్దక్షరాలతో హెడింగ్ పెట్టుకుని ఏంరాయాలో తెలీక పక్కచూపులు చూస్తున్న సత్తాయ్, భాస్కరాయ్ గాళ్ళు నా రాతోన్మాదాన్ని చూసి కోపంతో పళ్ళు నూరుతున్నారు. నిక్కర్ లోపల్నించి చిన్నస్లిప్ తీసి మేటర్ మూణ్ణిమిషాల్లో రాసేసిన నడింపల్లిగాడు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. బట్టీకొట్టిన పదిపాయింట్లు పదినిమిషాల్లో రాసేసిన శాస్త్రిగాడు నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఆమాత్రం కూడా గుర్తురాని పంగులూరి గాడు బిత్తరచూపులు చూస్తున్నాడు. ఆరోజు ఆ వ్యాసరచన పోటీలో అందరికన్నా ఎక్కువ పేజీలు ఖరాబు చేసింది నేనేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!

ఓ పదిరోజుల తరవాత వ్యాసరచనా పోటీ ఫలితాల్ని ప్రకటించారు. దాదాపు యాభైమంది రాసిన ఆ పోటీలో నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ప్రధమ, తృతీయ స్థానాలు ఎవరివో గుర్తు లేదు. స్నేహద్రోహి శాస్త్రిగాడికి ఏ బహుమతీ రాలేదు. అది మాత్రం గుర్తుంది. నాక్కావల్సిందీ అదే. మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను.

ఆ రోజు స్కూల్ ఎసెంబ్లీలో ఫలితాల్ని ప్రకటిస్తూ హెడ్ మేస్టరుగారు అన్నమాటలు కూడా గుర్తున్నాయి. "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్కపదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్కకారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది." అని మెచ్చుకుంటూ తెగ బాధపడ్డారు.

నాకు గురజాడ 'రచయిత' అన్న పదం తెలీదని ఆయనకి తెలీదు. పాపం హెడ్ మేస్టరుగారు! విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!  

నా 'గురజాడ' కష్టాలు

"గురజాడ అప్పారావు!? ఎవరీ గురజాడ? స్వాతంత్ర సమరయోధుడా? రాజకీయ నాయకుడా? నాటకాలేస్తాడా? పాటలు పాడతాడా? సినిమాలు తీస్తాడా? వున్నాడా? పొయ్యాడా? పేరు గంభీరంగానే వుంది, గాంధీగారికి శిష్యుడా? గురజాడా! మై డియర్ గురజాడా! హూవార్యూ?" నన్నునేనీ ప్రశ్నలడుక్కోవడం ఇది డెబ్భైనాలుగోసారి, బట్ నో సమాధానం!

అది మా హైస్కూల్. ఇంకొంతసేపట్లో వ్యాసరచన పోటీ జరగబోతుంది. టాపిక్ - 'గురజాడ అప్పారావు' అని మొన్ననే తెలుసు. రెండ్రోజుల క్రితం క్లాసులోకి ఈ వ్యాసరచన తాలూకా నోటీసు వచ్చింది. మా క్లాస్ టీచర్ 'పాల్గొనువారు' అంటూ ఏకపక్షంగా కొందరిపేర్లు రాసేశారు. పిమ్మట 'మీకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ మహానుభావుడి గూర్చి నాలుగు ముక్కలు రాయడం ముఖ్యం!' అంటూ వాక్రుచ్చారు. ఆవిధంగా నా ప్రమేయం లేకుండానే వ్యాసరచన పోటీదారుణ్ని అయిపొయ్యాను. ఆరోజు స్కూల్ అయిపోంగాన్లే గురజాడ గూర్చి వివరాలు సేకరించే పనిలో పడ్డా.

శాస్త్రిగాడి నమ్మకద్రోహం నా కొంప ముంచింది. ఇప్పుడు శాస్త్రిగాడి గూర్చి నాలుగు ముక్కలు. శాస్త్రిగాడు నా క్లాస్మేట్. గత రెండేళ్ళుగా నాపక్కనే కూచుంటాడు, వాడికి నా పక్కన ప్లేసు చాలా ఇష్తం! ఎందుకని? పరీక్షల్లో వాడు నా ఆన్సర్ షీటుని జిరాక్స్ మిషన్ కన్నా వేగంగా కాపీ కొడతాడు. అదీ సంగతి! అందుకు కృతజ్ఞతగా కొన్ని సందర్భాల్లో వాడు నాకు అసిస్టెంటుగా వ్యవహరించేవాడు.

'ఉరేయ్! గురజాడ అప్పారావు గూర్చి నువ్వస్సలు వర్రీ అవ్వకు. మా బాబాయ్ దగ్గర ఇట్లాంటి విషయాల మీద మోపులకొద్దీ మెటీరియల్ ఉంటుంది. రేపు తెచ్చిస్తాను.' అని హామీ ఇచ్చాడు శాస్త్రి. విషయం చిన్నదే కాబట్టి శాస్త్రిగాణ్ణి నమ్మి, ఇంక నేనావిషయం పట్టించుకోలేదు.

మెటీరియల్ అదిగో, ఇదిగో అంటూ చివరి నిమిషందాకా లాగాడు శాస్త్రి. ఇప్పుడు మొహం చాటేశాడు. మిత్రద్రోహి! మొన్న క్వార్టర్లీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ కఠినంగా ఉన్నందున, శాస్త్రిగాడికి చూసి రాసుకునేందుకు ఎప్పట్లా పూర్తిస్థాయిలో 'సహకరించ'లేకపొయ్యాను. అదిమనసులో పెట్టుకున్నాడు, దుర్మార్గుడు! కుట్ర పన్నాడు. ఆ విషయం గ్రహించలేక కష్టంలో పడిపొయ్యాను.

ఇంక లాభం లేదు, ఈ గరజాడ ఎవరో అడిగి తెలుకోవాల్సిందే. 

"ఒరే నడింపల్లిగా! గురజాడ గూర్చి తెలిస్తే కాస్త చెప్పరా!"

"గురజాడా! ఎవరాయన? నాకు తెలీదు." అంటూ జారుకున్నాడు నడింపల్లిగాడు.

'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అంటూ బట్టీవేస్తున్న పంగులూరిగాడు, నన్ను చూడంగాన్లే హడావుడిగా కాయితం జేబులో పెట్టుకుని క్లాస్ రూములోకి పారిపొయ్యాడు.

"ఒరేయ్! నువ్వు ఇవ్వాళ మాక్కూడా చూపించు! ఎంతసేపూ ఆ శాస్త్రిగాడికే చూపిస్తావేం? ఊరికినే చూపించమనట్లేదు! సాయంకాలం మామిడి కాయలు తెచ్చిస్తాంలే!" అంటూ బేరంపెట్టారు జంటకవులైన భాస్కరాయ్, సత్తాయ్ ద్వయం.

భాస్కరాయ్, సత్తాయ్ ప్రాణస్నేహితులు. మా బ్రాడీపేట ఇళ్ళల్లో మామిడిచెట్లకి రక్షణ లేదు. కాయలు ఉన్నట్టుండి మాయమైపొయ్యేవి. అది వీరి చేతిచలవే! ఇలా కొట్టేసిన కాయల్తో వీరు వాణిజ్యం చేసేవాళ్ళు. పరీక్షల్లో కాపీకి సహకరించే స్నేహితుల, ఇన్విజిలేటర్ల ఋణం మామిడికాయల్తోనే తీర్చుకునేవాళ్ళు. పరీక్షలయ్యాక టీచర్ల ఇళ్ళకి వెళ్ళి 'మా పెరట్లో చెట్టుకాయలండి' అంటూ భక్తిప్రవృత్తులతో గురుపత్నులకి సాష్టాంగప్రణామం చేసి బుట్టెడు కాయలు సమర్పించుకునేవాళ్ళు. వీరీ మంత్రాంగంతో విజయవంతంగా అనేక పరీక్షల్లో పాసు మార్కులు సంపాదించారు.

"ఏంటి మీకు నేను చూపించేది! శాస్త్రిగాడు నన్ను మోసం చేశాడు. నాకే ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు." అన్నాను దీనంగా.

"నీకేం తెలీదు, శాస్త్రిగాడు నిన్ను మోసం చేశాడు, ఇదంతా మేం నమ్మాలి! బయటకొస్తావుగా, అప్పుడు తేలుస్తాం నీ సంగతి." అంటూ గుడ్లురిమారు జంటకవులు.

క్లాసురూములోకి అడుగుబెట్టాక అక్కడి వాతావరణం చూసి నీరుగారిపొయ్యాను. పబ్లిక్ పరీక్ష రాయిస్తున్నట్లు అందర్నీ దూరందూరంగా కూర్చోబెట్టారు, పక్కనున్నవాడిని అడిగే అవకాశం లేదు. నా మిత్రశత్రువులు, శత్రుమిత్రులు అందరూ వారివారి స్థానాల్లో ఆశీనులై ఉన్నారు. ఇప్పటిక్కూడా గురజాడ ఎవరో కనీసం ఒక చిన్న హింట్ కూడా నాదగ్గర లేదు!

నా వెన్నుపోటుదారుడైన శాస్త్రిగాడు కొత్త పెళ్ళికొడుకులా ముసిముసిగా నవ్వుకుంటూ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. నేను శాస్త్రిగాడి దగ్గరకెళ్ళాను. కసిగా, కర్కశంగా, కోపంగా ఒక్కోఅక్షరం వత్తిపలుకుతూ నిదానంగా, నెమ్మదిగా వాడిచెవిలో అన్నాను.

"ఒరే శాస్త్రిగా! దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా! పంది, ఎద్దు, దున్న! నీలాంటి నీచుణ్ణి నేనింతమటుకూ చూళ్ళేదు. నువ్వు గురజాడ గూర్చి చాలా విషయాలు బట్టీ కొట్టావని నాకు తెలుసురా. కనీసం ఇప్పుడయినా రెండు పాయింట్లు చెప్పిచావు, నిన్ను క్షమించేస్తాను." అంటూ వాడి పాపపరిహారానికి చివరి అవకాశం ఇచ్చాను. శాస్త్రిగాడు నామాట వినబడనట్లు మొహం పక్కకి తిప్పుకున్నాడు.

నేను కోపంగా నా స్థానంలోకొచ్చి కూర్చున్నాను. నాకు గురజాడ గూర్చి తెలీకపోవడం కన్నా.. నా స్నేహితులు నాకు ఇంతలా సహాయ నిరాకరణ చెయ్యడం చాలా అవమానకరంగా అనిపిస్తుంది. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. బహుశా బ్రిటీషోడిక్కూడా గాంధీగారు ఇంత ఘోర సహాయ నిరాకరణ చేసుండరు! 

వ్యాసరచన సమయం మొదలైంది. మిత్రులంతా కళ్ళు మూసుకుని, శబ్దం బయటకి రాకుండా పెదాలు కదుపుతూ సరస్వతీ ప్రార్ధన చేసుకున్నారు. అయోమయంగా వాళ్ళని చూస్తుండిపొయ్యాను. నా జీవితంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదు. 

కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. 'ఎలాగూ గంటదాకా బయటకెళ్ళనివ్వరు. ఏదోకటి రాస్తే నష్టమేముంది? అయినా గురజాడ అప్పారావు గూర్చి తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప!' అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. కొద్దిగా ఉత్సాహం వచ్చింది.

నా తెలుగు, సోషల్ పాఠాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం, గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్.. ఇట్లా గుర్తున్నవారందర్నీ బయటకి లాగాను. అందర్నీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బి, ఇంకుగా మార్చి పెన్నులో పోశాను. ఇంక రాయడం మొదలెట్టాను.

'అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు. వీరు భరతమాత ముద్దుబిడ్డ. అసమాన ప్రజ్ఞాసంపన్నుడు, మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం, పట్టుదల అనితరసాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగువారి హృదయం ఆనందంతో పులకిస్తుంది, గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన నడయాడిన ఈ పుణ్యభూమికి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి గురజాడవారి త్యాగఫలం! సూర్యచంద్రులున్నంత కాలం గురజాడవారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. గురజాడవంటి మహానుభావుని గూర్చి రాయడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం..... ' ఈ విధంగా రాసుకుంటూ పోయాను. నా చేతిరాత అక్షరాలు పెద్దవిగా వుంటాయి. ఒక పేజికి పదిలైన్లు మించి రాసే అలవాటు లేదు. తదేక దీక్షతో అనేక ఎడిషనల్ షీట్లు రాసేశాను.

ఎక్కడా పొరబాటున కూడా గురజాడ గూర్చి చిన్న వివరం ఉండదు! కానీ చాలా రాశాను, చాలాచాలా రాశాను. శాస్త్రిగాడు చేసిన ద్రోహానికి కోపంతో రాశాను, ఆవేశంగా రాశాను. అది ఒక రాత సునామి, ఒక రాతా తాలిబానిజం, ఒక రాతా రాక్షసత్వం. కోపం మనలోని భాషాప్రావిణ్యాన్ని బయటకి తెస్తుందేమో!

వ్యాసం రాయడానికి ముందు 'శ్రీరామ' అని పెద్దక్షరాలతో హెడింగ్ పెట్టుకుని ఏంరాయాలో తెలీక పక్కచూపులు చూస్తున్న సత్తాయ్, భాస్కరాయ్ గాళ్ళు నా రాతోన్మాదాన్ని చూసి కోపంతో పళ్ళు నూరుతున్నారు. నిక్కర్ లోపల్నించి చిన్నస్లిప్ తీసి మేటర్ మూణ్ణిమిషాల్లో రాసేసిన నడింపల్లిగాడు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. బట్టీకొట్టిన పదిపాయింట్లు పదినిమిషాల్లో రాసేసిన శాస్త్రిగాడు నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఆమాత్రం కూడా గుర్తురాని పంగులూరి గాడు బిత్తరచూపులు చూస్తున్నాడు. ఆరోజు ఆ వ్యాసరచన పోటీలో అందరికన్నా ఎక్కువ పేజీలు ఖరాబు చేసింది నేనేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!

ఓ పదిరోజుల తరవాత వ్యాసరచనా పోటీ ఫలితాల్ని ప్రకటించారు. దాదాపు యాభైమంది రాసిన ఆ పోటీలో నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ప్రధమ, తృతీయ స్థానాలు ఎవరివో గుర్తు లేదు. స్నేహద్రోహి శాస్త్రిగాడికి ఏ బహుమతీ రాలేదు. అది మాత్రం గుర్తుంది. నాక్కావల్సిందీ అదే. మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను.

ఆ రోజు స్కూల్ ఎసెంబ్లీలో ఫలితాల్ని ప్రకటిస్తూ హెడ్ మేస్టరుగారు అన్నమాటలు కూడా గుర్తున్నాయి. "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్కపదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్కకారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది." అని మెచ్చుకుంటూ తెగ బాధపడ్డారు.

నాకు గురజాడ 'రచయిత' అన్న పదం తెలీదని ఆయనకి తెలీదు. పాపం హెడ్ మేస్టరుగారు! విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!  

Friday 22 June 2012

అభిమానం.. ఆవేదనతో..



"కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

'అచ్చా తొ హమ్ చల్తీ హై! ' అంటూ 'కిషోర్ దా' దగ్గరకి వెళ్దామని తొందరపడకు.

'చలా జాతా హూ! ' అని పాడుతూ పంచమ్ ని చేరుకుందామనుకొని ఆశ పడకు.

'నన్ను వదలి నీవు పొలేవులే.. అదీ నిజములే!'

అందుకే..

నా దగ్గర నీ పప్పులేం ఉడకవ్ ఆనంద్!

ఇప్పుడే 'బాబూ మొషాయ్' ని పంపిస్తున్నాను.

నిన్నెలా హేండిల్ చెయ్యాలో బాబు మొషాయ్ కి బాగా తెలుసు.

అప్పుడు మనం..

'యే షామ్ మస్తానీ.. ' అంటూ పాడుకుందాం.

'మేరె సప్నోన్ కి రాణి.. ' అంటూ జీప్ లో చక్కర్లు కొడదాం.

'జైజై శివశంకర్.. ' అంటూ భంగ్ తాగి గంతులేద్దాం.

మిత్రమా! రాజేష్ ఖన్నా!

గమ్మత్తులు చేసి మమ్మల్ని మత్తులో ముంచేశావ్!

వెర్రివాళ్ళని చేసేశావ్!

అందుకే అడుగుతున్నాను.. బరువెక్కిన గుండెతో..

"కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

వుయ్ లవ్ యు! గెట్ వెల్ సూన్ మ్యాన్!


(photos courtesy : Google)

Wednesday 20 June 2012

బిరియానీయేనా? కాదుకాదు.. పులిహోరే

"నాకు మనసులొ ఒక ఆలోచన, బయటకో మాట ఉండదు డాక్టర్. ఉన్నదున్నట్లుగా మాట్లాడటం అలవాటు. అందుకే నాభార్యతో నాకు ఘర్షణ." ఆయన university professor. బట్టతల. పిల్లిగడ్డం. తనేదో న్యూటన్ కొత్తసూత్రం కనుక్కున్నట్లు వాపోయాడు. 
               
నాకు నవ్వొచ్చింది. ఈయనగారికి నరాల weakness కాదు. tongue weakness ఉందన్నమాట! ఉన్నదున్నట్లు మాట్లాడటానికి ఈయనేమన్నా సత్యహరిశ్చంద్రుడా? అందునా భార్యతో! అందుకే నా పేషంటయ్యాడు. 

మనసులోని ఆలోచనలకి సంబంధం లేకుండా అవతలవారికి నచ్చే అభిప్రాయాలు వ్యక్తం చెయ్యటం అనే కళలో నాకు చిన్నప్పుడే ట్రైనింగ్ అయిపోయింది. అందుకు నేను ఎన్టీరామారావుకీ, అక్కినేని నాగేశ్వరరావుకీ ఎంతైనా రుణపడివున్నాను.  

నాకు చిన్నప్పుడు ఎన్టీరామారావంటే అంతులేని ఆరాధన. ఆయనకి అసాధ్యం అనేదే లేదు. చైనా యుద్ధానికి రామారావుని పంపితే ఒకేఒక్కరోజులో యుద్ధం గెలిచేవాడని నమ్మేవాడిని. నెహ్రూకి నాఅంత తెలివిలేదు కాబట్టి రామారావుని వాడుకోలేదు. రామారావు నా super man, spider man, batman. 

కానీ.. నాకన్నా తెలివైనవాళ్ళని నేను అనుకునేవారందరూ.. ఏయన్నార్ అభిమానులు. నాగేశ్వరరావుతో నాకు చాలా ఇబ్బందులుండేవి. ఆయన ప్రేమ ఎంతకీ తెగదు. అసలు విషయం వదిలి ఘంటసాల పాటలు పాడుకుంటూ.. ఆత్రేయ రాసిన భారీడైలాగులు చెబుతూ.. వీలైతే మందు తాగుతూ.. కాలక్షేపం చేస్తుంటాడు. ఆపై హీరోయిన్ల త్యాగాలు, అపార్ధాలతో తలబొప్పి కట్టేది. ఈయనగారి ప్రేమకి మలబద్దకం లక్షణాలు కూడా ఉండేవి.    
               
ఇదే ఎన్టీవోడయితేనా.. "ఏం బుల్లెమ్మా" అంటూ హీరోయిన్ని ఒక్కలాగుడు లాగేవాడు. ఎంతలావు హీరోయినయినా (దేవిక , కేఆర్ విజయ, సావిత్రి నిజంగానే లావుగా ఉండేవాళ్ళు).. పక్కటెముకలు ఫటఫటలాడగా.. ప్రేమ చేతనో, ప్రాణభయం చేతనో రామారావు కౌగిలిలో ఒదిగిపోయేవారు. 

అందుకనే రామారావుకి ప్రేమ అనేది ఎప్పుడూ సమస్యే కాలేదు. కాబట్టే కధని ముందుకు నెట్టడానికి మొదట్లో రాజనాల.. తరవాత రోజుల్లో సత్యనారాయణ.. నడుం బిగించేవాళ్ళు. చివర్లో రామారావు చెయ్యబోయే ఫైటింగుల కోసం ఉగ్గబట్టుకుని ఎదురు చూసేవాణ్ణి. కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో.. క్షణక్షణానికి సెట్టింగులు మార్చుకుంటూ.. గంటలకొద్దీ ఫైట్లు చేసిన రామారావు నన్నెప్పుడూ నిరాశ పరచలేదు. అవన్నీ నాజీవితంలో ఈనాటికీ మరువలేని మధుర క్షణాలు.

ఇంత భయంకరంగా ఎన్టీఆర్ ని అభిమానిస్తూ కూడా.. బయటకి మాత్రం రామారావు అంటే ఇష్టం లేనట్లుగా నటించేవాడిని. ఎందుకు? ఎందుకంటే.. మేధావి అన్నవాడు నాగేశ్వరరావు జీళ్ళపాకం ప్రేమనే మెచ్చుకోవాలి. రామారావుని మనసులోనే ఆరాధించుకుంటూ.. బయటకి మాత్రం.. 'ఛీ ఛీ! అవేం సినిమాలు. నేలక్లాసోళ్ళు విజిల్స్ వేసుకోటానికి తీస్తారనుకుంటా.. ఒక కథా పాడా!' అంటూ రామారావు సినిమాలని విమర్శిస్తూ.. నన్ను నేను class audience category లోకి నెట్టుకునేవాడిని.   

మనసులో ఒక అభిప్రాయం ఉంచుకుని, బయటికి వేరొకటి మాట్లాడటం అనే కళని ఈవిధంగా చిన్నప్పుడే వంటపట్టించుకున్నా. తద్వారా తెలివైనోళ్ళ మధ్య తెలివితేటలు ఒలకపోస్తూ మాట్లాడే విద్య అబ్బింది. నేను బయటకి బిరియానీలా కనిపిస్తాను. కానీ నామనసు మాత్రం పులిహోర. నేను pizza లా కనిపించే పెసరట్టుని. లేకపోతే మన సత్యహరిశ్చంద్ర ప్రొఫెసరుగారిలా పేషంటునయిపోయేవాడినేమో!   

Monday 18 June 2012

సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ


'గుండమ్మకథ' సినిమా యాభయ్యేళ్ళ క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ తెలుగువాళ్ళ హృదయాల్లో గుండమ్మ స్థానం పదిలం. ఒకప్పటి సామాజిక స్థితిగతులు అంచనా వెయ్యడానికి ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక కొలమానం. ఇందుకు మంచి ఉదాహరణ గురజాడ 'కన్యాశుల్కం'. ఒక సినిమాకి సాహిత్యం స్థాయి లేకపోయినా, ఆనాటి సమాజాన్ని అర్ధం చేసుకోడానికి యెంతోకొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.

ఒక సినిమా యెలా పుడుతుంది? రచయిత తన ఆలోచనలతో ఒక పాత్ర సృష్టిస్తాడు. ఆ పాత్రకి దర్శకుడు - టెక్నీషియన్లు, నటీనటుల సహకారంతో ప్రాణం పోస్తాడు. ఇక్కడ అందరూ కలిసి చేసేది ఒకటే వంటయినా, ఎవరి వాటా వారికి ఉంటుంది. ఏ పాత్రనైనా ఒక సాధారణ ప్రేక్షకుడు identify చేసుకోకపోతే.. ఎవరూ చెయ్యగలిదేమీ ఉండదు. ఇప్పుడు గుండమ్మ పాపులారిటీకి కారణాలు ఆలోచిద్దాం.

ఈ సమాజం అనేక వ్యక్తుల, విభిన్న వ్యక్తిత్వాల సమాహారం. భిన్నఆలోచనల సంక్లిష్ట కలయిక. ప్రతి వ్యక్తి తన ప్రవర్తనని (అది ఎంత అసంబద్దమయినప్పటికీ) conscious mind తో సమర్ధించుకుంటాడు. కానీ అతని అసలు ఆలోచనల మూలాలు unconscious mind లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ unconscious mind ని బయటకి రానీకుండా అనేక defense mechanisms తొక్కిపెట్టి ఉంచుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'సైకోఎనాలిసిస్'గా ప్రాచుర్యం కల్పించాడు.

మానవ మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆలోచనాధోరణి నలుపు తెలుపుల్లో (flat గా) ఉండదు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తుల మధ్యగల సంబంధాలు.. ఇలాంటి అనేక variables ఒకవ్యక్తి యొక్క ఆలోచనలని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచనే మన ప్రవర్తననీ శాసిస్తుంది. ఈ నేపధ్యంలో గుండమ్మని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

గుండమ్మకి కూతురంటే చాలా అభిమానం, ఒకరకంగా గుడ్డిప్రేమ. ఎందుకు? మధ్యతరగతి కుటుంబాల్లో భర్త చనిపోయిన తరవాత ఒక స్త్రీ పడే social and emotional trauma దారుణంగా ఉంటుంది. ఆ తరవాత వాళ్ళు చాలా insecurity కి కూడా గురవుతారు. తమని ప్రేమించే తోడులేక, మనసులోని భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశంలేక, మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు.

'ప్రేమ' అనేది ప్రతివ్యక్తికీ ఒక మానసిక అవసరం. దేన్నీ ప్రేమించనివారికి బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. మానసికంగా ఏకాకిగా మిగిలిపోయినవారు.. తమ ప్రేమకి ఒక symbol గా ఒక వ్యక్తినో, జంతువునో, వస్తువునో ఎన్నుకుని తమ శక్తియుక్తులు ధారబోస్తూ అమితంగా ప్రేమిస్తారు. ఆ symbol పట్ల చాలా possessive గా కూడా ఉంటారు. ఆ సింబల్ని వదులుకోడానికి అస్సలు ఒప్పుకోరు. ఆ symbol చేజారితే depression లోకి వెళ్ళిపోతారు.

ఈ నేపధ్యంలో కూతురంటే గుండమ్మకి ఎందుకంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే తనకి ఇల్లరికపుటల్లుడు కావాలనుకుంటుంది గుండమ్మ. కూతురు భర్తని ఇంట్లోనే ఉంచుకోటంలో జమున సుఖం కన్నా, గుండమ్మ అవసరమే ఎక్కువన్నది మనం గుర్తించాలి.

గుండమ్మని గయ్యాళి అంటారు. అసలు ఈ 'గయ్యాళి' అన్న పదమే అభ్యంతరకరం. ఇది నోరున్న ఆడవారిని defame చెయ్యడానికి సృష్టించిన పదం అయ్యుండొచ్చు. గుండమ్మకి సంపద విలువ తెలుసు. సంపద ఎవరి దగ్గరుంటే వారిదే అధారిటీ అన్న కేపిటలిస్టు ఫిలాసఫీ కూడా తెలుసు! అందుకే తాళంచెవుల గుత్తి బొడ్లో దోపుకుని పెత్తనం చలాయిస్తుంటుంది.

గుండమ్మ సవతి కూతురి పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? ఈ సమాజం తనకి చేసిన అన్యాయానికి ప్రతిగా సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టడం ద్వారా కసి తీర్చుకుని sadistic pleasure పొందిందా? ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే ఇందుకు సమాధానం దొరుకుతుంది.

ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు. చాలాసార్లు కాన్పు కష్టమై తల్లి చనిపోవడం (maternal deaths) జరుగుతుండేది, అందుకే పిల్లల్ని కనడం స్త్రీకి పునర్జన్మ అనేవారు. వితంతువైన భర్త (నాకు ఇంతకన్నా సరైన పదం తోచట్లేదు) మరణించిన భార్య కన్న పిల్లల్ని సాకడనికి (బయటకి ఇలా చెప్పేవాళ్ళు గానీ, కుర్రపిల్లతో సెక్సు దురదే అసలు కారణం అని నా అనుమానం) రెండోపెళ్ళి చేసుకునేవాడు. ముసలి వెధవలు చిన్నపిల్లల్ని రెండోభార్యగా చేసుకోవటం ఆరోజుల్లో నిరాటంకంగా సాగిన ఒక సామాజిక అన్యాయం.

రెండోపెళ్ళివాడిని చేసుకునే అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, గతిలేని పరిస్థితుల్లో compromise అయ్యి ముసలాణ్ని చేసుకునేవాళ్ళు. ఈ అసంతృప్త అభాగినుల గూర్చి సాహిత్యంలో బోల్డన్ని ఆధారాలు ఉన్నయ్. (అయితే 'దేవదాసు'లో పార్వతి గంపెడు పిల్లల్ని 'చక్కగా' చూసుకుంటుంది. శరత్ కథల్లో మనలా నేలమీద నడిచే మనుషులకి తావులేదు. అందరూ ఆదర్శమూర్తులు, త్యాగధనులే).

తీవ్రమైన అసంతృప్తితో కాపురానికొచ్చిన యువతికి దిష్టిపిడతల్లాగా మొదటిభార్య సంతానం కనబడతారు, ఇంక తన కోపాన్ని పిల్లల మీదకి మళ్ళిస్తుంది. దీన్నే సైకాలజీ పరిభాషలో frustration - aggression - displacement  theory అంటారు. అంటే మనలోని నిస్పృహ, నిస్సహాయత క్రోధంగా మారుతుంది. ఆ aggression ని ఎదుటి మనిషిపై చూపే అవకాశం లేనప్పుడు.. అమాయకుల వైపు, అర్భకుల వైపు మళ్ళించబడుతుంది.

ఈ థియరీ ప్రకారం మనం గుండమ్మని అంచనా వేస్తే ఆమె సవతి కూతురు పట్ల యెందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అర్ధమవుతుంది. ఇక్కడ victim సవతి కూతురు. గుండమ్మని పుట్టింటివారు, భర్త కలిసి చేసిన అన్యాయానికి సవతి కూతురు బలయ్యింది. గుండమ్మని ఆపడానికి భర్త లేడు, సవతి కూతురు నిస్సహాయురాలు. ఇంతకన్నా soft target గుండమ్మకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే తన aggression కి ventilation కోసం సవతి కూతురు అనే soft target ని ఎంచుకుంది.

aggression theory లో ventilation కోసం soft targets ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. భార్య తాగుబోతు భర్తపై కోపంతో, ఏంచెయ్యాలో తోచక - పిల్లల్ని చావగొడుతుంది. 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' అనే సామెత ఉండనే ఉందిగదా!

సరే! గుండమ్మ ముసలి మొగుడు ఇద్దరు పిల్లల్ని పుట్టించి వెళ్ళిపోయాడు. మరప్పుడు భర్తమీద కోపం తన కూతురు, కొడుకుల మీద కూడా వుండాలి గదా? కానీ అలా ఉండదు. ఎందుకని? గుండమ్మది narcissistic personality. తాను, తన పిల్లలు మాత్రమే మనుషులు. 'తనది' అన్నదేదైనా అత్యంత ప్రీతిపాత్రం. 

అసలు గుండమ్మ ఎందుకలా నోరు పారేసుకుంటుంది? ఇక్కడ మనం ఫ్రాయిడ్ చెప్పిన reaction formation అనే defense mechanism ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో 'మగదిక్కు' లేని సంసారం అంటే అందరికీ అలుసు. గుండమ్మ తన ఆస్తిపాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అభద్రతా భావంలోంచి పుట్టుకొచ్చిన ప్రవర్తనే 'గయ్యాళితనం'. తన అశక్తతని, అమాయకత్వాన్ని బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండటం కోసం.. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటానికి గుండమ్మ 'గయ్యాళితనం' అనే ఆభరణం ధరించింది!

ఆ రోజుల్లో సమాజంలో గల సవతి లేక మారుతల్లి అనే stereotyping కూడా గుండమ్మ 'గయ్యాళి'తనానికి కారణం కావచ్చు. తెలిసోతెలీకో మనంకూడా ఒక్కోసారి ఈ సమాజంలో stereotypes గా మారతాం. మతం, కులం పట్ల కొందరి భావాలు ఒకే మూసలో ఉండటం ఈ stereotype కి ఒక ఉదాహరణ. గుండమ్మ కూడా చక్కగా ఈ stereotype లోకి దూరిపోయింది.

గుండమ్మలో మనకి projection కూడా కనిపిస్తుంది. 'సవతితల్లి రాచిరంపాన పెడుతుందంటారు గానీ.. నేను ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో!' అని గంటన్నతో అంటుంది. అంటే తన కఠినత్వానికి కూడా కారణం సావిత్రేననేది గుండమ్మ థియరీ! ఈ రకంగా తనకున్న అవలక్షణాలని, వికృత ఆలోచనలని ఎదుటివారికి ఆపాదించి సంతృప్తి చెందడాన్ని projection అంటారు.

సవతి కూతుర్ని ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వున్న పనివాడికిచ్చి పెళ్ళి చేస్తూ కూడా.. తనేదో ఆ తల్లిలేని పిల్లని ఉద్దరిస్తున్నట్లు పోజు కొడుతుంది. వాస్తవానికి గుండమ్మ సవతి కూతురికి చేసింది అన్యాయం. తాము చేసే తప్పుడు పనుల్ని అసంబద్ధ వాదనలతో సమర్ధించుకోవడాన్ని ఫ్రాయిడ్ భాషలో rationalization అంటారు. మన రాజకీయ నాయకులు ఈ కోవకి చెందినవారే!

గొప్ప సంబంధం అనుకుని నాగేశ్వరరావుని అల్లుడుగా చేసుకుంటుంది. అతనొట్టి తాగుబోతని, తాను మోసపోయ్యానని తెలుసుకుని హతాశురాలవుతుంది. మోసపోయిన కూతురి బాధ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు గుండమ్మ చాలా conflict కి గురవుతుంది. మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది, కానీ అతనంటే కూతురికి ఇష్టం.

ఇందాక చెప్పిన projection గుర్తుందికదూ? అల్లుడిని తిడితే కూతురు బాధ పడుతుంది. అది గుండమ్మకి ఇష్టం లేదు, కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అల్లుడి పట్ల కఠినంగా ఉండాలా? కూతురు భర్త కాబట్టి, కూతురు బాధపడుతుంది కాబట్టి, సహించి ఊరుకోవాలా? ఈ ద్వైదీభావాన్ని ambivalence అంటారు. ఈ ambivalent state లో ఉండి, నాగేశ్వరరావుని మందలిస్తున్న రామారావుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వాస్తవానికి గుండమ్మ కోపం రామారావుపై కాదు, నాగేశ్వరరావు మీద. మళ్ళీ displacement!

కూతురు దూరమై సగం చచ్చిన గుండమ్మని చాయాదేవి కొట్టి గదిలో బంధిస్తుంది. అప్పుడు గుండమ్మలో realization వస్తుంది. సావిత్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు guilt complex తో బాధ పడుతుంది. సావిత్రిని చూడంగాన్లే ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమించమని అడుగుతుంది. 'నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు.' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

గుండమ్మ వంటి egocentric personality ని catharsis స్థాయికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మంచి ఎత్తుగడలతో సన్నివేశాల్ని సృష్టించాడు. అందుకోసం చాయాదేవిని (నాకు ఈపాత్ర కూడా చాలా ఇష్టం) చక్కగా వాడుకున్నాడు. అందుకే గుండమ్మతో కూతుర్ని క్షమాపణ అడిగించిన మరుక్షణం ప్రేక్షకులంతా గుండమ్మ పక్షం వహిస్తారు. ఇది గుండమ్మ పాత్రపోషణలో నటిగా సూర్యకాంతం సాధించిన విజయం.

ఇంతకీ గుండమ్మ నెగటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఏదీ కాదు. మన మధ్యన తిరుగుతూ, మనతో పాటు జీవించిన ఒక సజీవ క్యారెక్టర్. మనలో, మన సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ గుండమ్మకి కూడా ఉన్నాయి, అందుకే ఈపాత్ర అంతలా పాపులర్ అయింది.

ఈ సినిమా సమయానికి సూర్యకాంతం గయ్యాళి అత్తగా career peak లో ఉంది, కోడళ్ళని పీడించే అత్తగార్లూ వీధివీధికీ ఉండేవారు. అంచేతనే - మనం సూర్యకాంతంతో identify చేసుకోగలిగాం, అత్తగా సూర్యకాంతానికి ఒక stardom ఇచ్చేశాం.

అయితే మనకిప్పుడు గుండమ్మలు కనిపిస్తారా? కనిపించరు. కారణం - ఇప్పుడు  వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మధ్యతరగతి వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. అందువల్ల స్త్రీలు కాన్పు సమయంలో చనిపోవడం లేదు.

ఆ రోజుల్లో ఆడామగా మధ్య భారీవయసు తేడాతో పెళ్ళి జరిగేది, ఇప్పుడలా జరగట్లేదు. ఒకప్పుడు మగవారి సగటు జీవితం ఆడవారి సగటు జీవితం కన్నా తక్కువ. ఇప్పుడు జీవితకాలాన్ని పెంచేసుకుని మగవారు కూడా ఆడవారితో సమానత్వం సాధించారు! అందువల్ల కూడా క్రమేణా గుండమ్మలు కనుమరుగయ్యారు.

'కన్యాశుల్కం' మొదటిసారి చదివినప్పుడు కన్యాశుల్కం అంటే ఏమిటో అర్ధం కాదు. అట్లాగే - వేగంగా మారుతున్న మన సమాజ పరిణామంలో కొంతకాలానికి మన ఉమ్మడి కుటుంబాలకి ట్రేడ్మార్క్ అయిన గయ్యాళి అత్తలు కనుమరుగై.. అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఇది సమాజానికి మంచిది కూడా!

(picture courtesy : Google)

Thursday 14 June 2012

రాష్టపతి మన్మోహన్ సింగ్


మమతా దీది రాష్ట్రపతిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రతిపాదిస్తుందిట!

ఇందులో విశేషమేముంది!!

ఆయన ఆల్రెడీ చాలా కాలంగా రాష్ట్రపతేగా!!!

(photo courtesy : Google)

Tuesday 12 June 2012

గడ్డం కష్టాలు


ఇన్నాళ్ళూ..

'పెంచుకునేవాడిదే గడ్డం, అది ఉన్నవాడికే దురద.' అనుకున్నాను.

కానీ.. కాదు!

ఎదుటివాడిక్కూడా దురదే!

పాపం! చంద్రబాబు నాయుడు!!

(photo courtesy : Google)

Friday 8 June 2012

అమ్మా! నువ్వు కూడానా!?


"కన్నా! నీ కోసం మన వి.హనుమంతరావు దగ్గరుండి మరీ చేయించాడు, హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో తెప్పించాను." అంటూ ఘుమఘుమలాడుతున్న హైదరాబాద్ బిరియానిని ప్రేమతో రాహుల్ గాంధీకి వడ్డించబోయింది సోనియా గాంధి.

మొహం చిట్లించాడు రాహులుడు.

"అమ్మా! బిరియాని నాకొద్దు, ఆ హైదరాబాదు పేరు వింటే చీమలు పాకినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నాయకులంటేనే నాకు ఎలెర్జీ!" అన్నాడు.

ఆశ్చర్యపోయింది సోనియా.

"అదేంటి కన్నా! తరతరాలుగా మన కుటుంబసేవలో తరించిపోతున్నారు ఆంధ్రానాయకులు. వాళ్ళు విశ్వాసానికి, వినయానికి మారుపేరు. ఏం? ఈ మధ్య నువ్వు కనపడినప్పుడల్లా పొర్లిగింతల దండాలు పెట్టటం తగ్గించారా? మరేం పర్లేదు. వయలార్ రవితో చెబుతాను. కావాలంటే రోజల్లా గుంజిళ్ళు తీయించుకో, గోడకుర్చి వేయించుకో." ఆనునయంగా అంది సోనియా.

"వాళ్ళు నన్ను ఉపఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారమ్మా!" కోపంగా అన్నాడు రాహుల్.

అర్ధమయ్యిందన్నట్లు తల పంకించింది సోనియా.

"నాకు తెలుసు, ఎండలు మండిపోతున్నాయి, నువ్వు తట్టుకోలేవు. అయినా నీవంటి గొప్ప దేశనాయకుణ్ణి ఉపఎన్నికల ప్రచారానికి పిలవటానికి వాళ్ళకసలు బుద్ధుందా? ఇదంతా ఆ గులాం నబి నిర్వాకం. నువ్వు సీరియస్ గా తీసుకోకు కన్నా!" అంది సోనియా.

"అమ్మా! నన్ను ప్రచారానికి రమ్మంటుంది మన పార్టీవాళ్ళు కాదు, జగన్ పార్టీవాళ్ళు. వాళ్ళకి తమ గెలుపు మీద డౌటుగా ఉందిట. నేవెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నది వారి నమ్మకమట!" పళ్ళు పటపటా నూరాడు రాహుల్.

సోనియాకి కూడా కోపం వచ్చింది.

"ఎంత పొగరు. ఇప్పుడే అహ్మద్ పటేల్ కి పురమాయిస్తాను. చిదంబరంతో చెప్పి జగన్ మీద ఇంకో రెండొందల కేసులు వేయిద్దాం, బెయిల్ వచ్చేప్పటికి ముసలాడయిపోతాడు. తిక్క కుదుర్తుంది వెధవకి!" కసిగా అంది.

రాహుల్ ఒక్కక్షణం ఆలోచించాడు. అప్పటికప్పుడే ఒక స్థిరనిర్ణయానికొచ్చేశాడు.

"ఇంక ఊరుకుని లాభం లేదమ్మా! నేనిప్పుడే ఉపఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రా వెళ్తున్నాను. జగన్ పార్టీవాళ్ళకి బుద్ధొచ్చేలా ప్రచారం నిర్వహిస్తాను." అన్నాడు.

సోనియా గాంధి కంగారుపడింది, ఆందోళన చెందింది, భయపడిపోయింది, తెల్లని మొహం నిండా చిరుచెమటలు!

"కన్నా! వద్దు, వద్దు. నువ్వంత కఠోరనిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఈ సమయంలో నువ్వెళ్ళావంటే మొదటికే మోసం.. " అని సోనియా అంటూండగా..

'దబ్బు'మన్న శబ్దం!

రాహుల్  గాంధీ డైనింగ్ టేబుల్ మీద నుండి కింద పడిపోయాడు. దొర్లుతూ, వెక్కివెక్కి ఏడుస్తూ అన్నాడు.

"అమ్మా! నువ్వు కూడానా!!"

(photo courtesy : Google)

Tuesday 5 June 2012

అధికారం - యుద్ధనీతి


"సుబ్బూ! నువ్వెన్నయినా చెప్పు. కాంగ్రెస్ మాత్రం దుర్మార్గమైన పార్టీ! రాజకీయంగా సీబీఐ ని వాడుకోవడం నీచం. ఇవ్వాళ జగన్ - మొన్నటిదాకా మూలాయం , మాయావతి , లాలూ.. ఈ లిస్ట్ ఇలా పెరుగుతూనే వుంటుందేమో?" అన్నాను.

కాఫీ సిప్ చేస్తున్న సుబ్బు ఆశ్చర్యంగా చూశాడు.

"ఇందులో దుర్మార్గం ఏముంది? ఇద్దరు వ్యక్తులు తన్నుకోవడం మొదలెట్టారు. ఒకడి చేతిలో కర్ర అనే ఆయుధం ఉంది. ఇంకోడి చేతిలో ఏ అయుధమూ లేదు. కర్ర చేతిలో ఉన్నవాడు, దాంతో వీలైనంత త్వరగా ఎదుటివాడి బుర్ర పగలగొట్టాలి. అలా చేతిలో ఉన్న ఆయుధం వాడుకోలేనివాడొట్టి పనికిమాలిన వాడి కింద లెక్క. అటువంటివాడిని యుద్ధభూమి నుండి తరిమివేయవలె! వాడికి యుద్ధం చేసే అర్హత లేదు." అన్నాడు సుబ్బు.

"ఏంటి సుబ్బూ? నేను రాజకీయాలు మాట్లాడుతుంటే.. నువ్వు కర్ర, యుద్ధం అంటూ ఏవో చెబుతున్నావ్!" విసుక్కున్నాను.  

"రవణ మావా! నే చెప్పేదీ రాజకీయాలే! నా ఉద్దేశ్యంలో కర్ర అంటే అధికారం! ఇప్పుడు రాష్ట్రంలో యుద్ధం మొదలయ్యింది. చతురంగ బలాలతో విజయమో, వీరస్వర్గమో తేల్చుకోడానికి అందరూ ఉపఎన్నికల క్షేత్రంలోకి దూకారు. కాంగ్రెస్ వాళ్ళు యుద్ధతంత్రంలో భాగంగానే జగన్ని లోపలేశారు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో! కానీ - మరీ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు కదా?" అన్నాను.

"రాజకీయాల్లో చౌకబారు అన్న పదానికి అర్ధం లేదు. గెలవడమే యుద్ధానికి పరమావధి. రాజకీయ పరుగు పందెంలో రజత కాంస్య పతకాలుండవు. ఒకటే మెడల్, ఆ మెడల్ కి నీ ఇష్టమైన పేరు పెట్టుకో. గెలుపు అరంగుళంలో మిస్సయినా, ఆరడుగుల్లో మిస్సయినా ఐదేళ్ళపాటు కుక్కబ్రతుకు బతకాల్సుంటుంది." అన్నాడు సుబ్బు.

"కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. "

"రాజకీయాల్లో రాజ్యాధికారం అనేది అత్యున్నతమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా! ఇందులో భాగస్వామ్యులైనవారికి అధికారంతో పాటు ధనకనకవస్తువాహానములు సంప్రాప్తించును. మధ్యతరగతి మేధావుల భాషలో జరిగేది ప్రజాపరిపాలన. సామాన్య ప్రజల కోణంలో చూస్తే జరుగుతుంది శాస్త్రబద్దంగా, రాజ్యాంగం సాక్షిగా ప్రజల్ని దోచుకోవటం అనే ప్రక్రియ." అన్నాడు సుబ్బు.

"మరీ అంత ఘోరమా!" ఆశ్చర్యపోయ్యాను. 

"రాజకీయాల్లో stakes చాలా ఎక్కువ, ఇక్కడంతా cut throat కాంపిటీషన్, winner takes it all, అందుకే రాజకీయాలు క్రూరమైనవి కూడా! అధికారంలో వున్నవారికి నీవల్ల రాజకీయంగా ఇబ్బందుందనుకుంటే నీ జాతకం మొత్తం తవ్వి తీస్తారు. పుట్టుక దగ్గర్నుండి నీ చరిత్ర మొత్తం పరిశోధించబడుతుంది, అందులో తొర్రలు కనుగొనబడతాయి. ఆ ఫైల్ దగ్గరుంచుకుంటారు, బెదిరిస్తారు. అప్పటికీ మాట వినకపోతివా? నీమీద కేసులు పెడతారు, అదేమంటే - చట్టం తన పని తను చేసుకుపోతుందంటారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అంటే జగన్ అమాయకుడంటావా?" అడిగాను.

"అస్సలు అనను. రాజకీయాల్లో అమాయకులకి స్థానం లేదు, ఇక్కడందరూ వాహినీ వారి పెద్దమనుషులే! అందరివీ రక్తచరిత్రలే. అందుకే సాధ్యమైనంతవరకూ బయటపడకుండా లోపాయికారిగా మేనేజ్ చేసుకుంటారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"అవుననుకో! కానీ పాపం జగన్!" నిట్టూర్చాను.

"పాపం జగనేమిటోయ్! అతను కడప ఎంపీ. వేల కోట్లకి అధిపతి, పెద్ద పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి క్యాండిడేట్. అందుకేగా చిన్న బెయిల్  పిటిషన్ కి కూడా ప్లీడర్లని ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపిస్తున్నాడు. అతను జరుగుతున్న పరిణామాల్ని ముందే అంచనా వేసుకునుంటాడు, అసలీ యుద్ధం ప్రారంభించింది జగనే కదా! లేకపోతే - హాయిగా బెంగుళూరులోనే వ్యాపారం చేసుకుంటూ ఆస్థుల్ని ఈపాటికి ఇంకో వందరెట్లు పెంచేసేవాడు, సోనియా గాంధీ చెప్పేది కూడా అలా పెంచుకుని హేపీగా ఉండమనే గదా!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ!" అన్నాను. 

"ఈ సత్యం బోధపడింది కాబట్టే కావూరి, లగడపాటి అధికారం అనే చల్లని మర్రిచెట్టు నీడకింద హాయిగా విశ్రమిస్తున్నారు. సోనియాకి ఎదురు తిరిగినట్లయితే, తమక్కూడా జైల్లో జగన్ పక్క సెల్ రిజర్వ్ అయిపోతుందని వీరికి తెలుసు. అందుకే వీరిది ఎల్లప్పుడూ ఢిల్లీ రాగం." అంటూ లేచి టైం చూసుకున్నాడు.

"మరి లగడపాటి ఎందుకంత హడావుడి చేస్తుంటాడు?" కుతూహలంగా అడిగాను.

"సినిమాలో హీరోతో పాటు కమెడియన్ షో కూడా సమాంతరంగా నడుస్తుంటుంది, అలాగే - లగడపాటిది ఓ సైడ్ షో. కాంగ్రెస్ లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఉన్నట్లుండి పదవేదైయినా ఒళ్ళోకొచ్చి వాలుతుందేమోనని లగడపాటి ఆశ. అందుకే లైమ్ లైట్ లో ఉండటానికి తిప్పలు పడుతుంటాడు. బెస్టాఫ్ లక్ టు లగడపాటి." అన్నాడు సుబ్బు.

"కానీ - కాంగ్రెస్ తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా బెదిరించడం అన్యాయం కదా." మళ్ళీ మొదటి పాయింటుకొచ్చాను.

సుబ్బు అర్ధం కానట్లు చూశాడు.

"అందుకు కాంగ్రెస్ ని తప్పు పట్టడం దేనికి? ఇక్కడ స్వచ్చమైన రాజకీయాలు నడిపేందుకు ఎవరూ లేరు. ఇదే అధికారం జగన్ చేతిలో ఉండుంటే.. ఇంతకన్నా కర్కశంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రత్యర్ధుల్ని అణిచేసేందుకు వాడుకునేవాడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు చాలా సమయం వృధా చేశారు, జగనయినట్లైతే ఆర్నెల్ల క్రితమే అందర్నీ అరెస్ట్ చేయించేవాడు. కొందరు జైల్లోనే చచ్చేవాళ్ళు, ఈ మాత్రం వాతావరణం కూడా వుండేది కాదు." అంటూ నిష్క్రమించాడు  సుబ్బు!

(picture courtesy : Google)

Sunday 3 June 2012

ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది


'ప్రేమ  పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది!' ఒక తీవ్రమైన భగ్నప్రేమికుడు తప్ప, ప్రేమని ఇంత దారుణంగా ఎవరూ తిట్టకపోవచ్చు. నేనీ పేరుతో ఒక కథ రాశాను. ఆ కథలో ముగ్గురు హీరోలు తమ ప్రేమ సఫలమైనందుకు, తమ  ప్రేమని తిట్టుకుంటారు. ప్రేమ విఫలమవడం సుఖాంతం, సఫలమవడం దారుణమైన విషాదం! భలే వెరైటీగా వుంది కదూ!

ముగ్గురు యువకులు ముగ్గురు యువతుల్ని ప్రేమిస్తారు. ఇంతటితో ఊరుకోకుండా తగుదునమ్మా అని పెళ్ళి చేసుకుంటారు. కొంతకాలానికి - ఈ పాడులోకంలో ప్రేమ అనేదే లేదనే వాస్తవాన్ని గ్రహించిన ఆ యువకులు , తమ దుస్థితికి తీరిగా దుఃఖిస్తూ ఇలా అనుకుంటారు - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'. అదే ఈ కథ పేరు. మగవాళ్ళు ఆడవారి అందచందాలకి ప్రాముఖ్యతనిస్తారు, ఆడవాళ్ళు మగవారిలోని బానిస మనస్తత్వానికి ప్రాధాన్యతనిస్తారనే 'గొప్ప'కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఒక సరదాకథ.

ముప్పైయ్యేళ్ళ క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ మేగజైన్ కోసం ఈ కథ రాశాను. అచ్చులో పడ్డ నా కథని నేను ఇంతవరకూ చదవలేదు. వున్నట్లుండి ఇప్పుడా కథపై అంత ప్రేమ ఏలనోయి? పాత ఫొటోల్లో మన మొహాలు చూసుకుని ముచ్చట పడతాం, ఇదీ అట్లాంటిదే. ఇప్పుడీ కథ గూర్చి నాలుగు కబుర్లు. 

అదొక దుర్దినం. లైబ్రరీ ఎదుటనున్న గార్డెన్లో సిమెంటు బల్లపై కూర్చుని యే సినిమాకి వెళ్ళాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎదురుగా కాలేజి మేగజైన్ ఎడిటర్.

"నా మేగజైన్లో ఆర్టికల్స్ సీరియస్‌గా వున్నయ్, వాటిని కొంత హ్యూమర్తో బేలన్స్ చెయ్యాలి. ఇలా ఖాళీగా కూర్చునే బదులు ఒక సరదా కథ రాయరాదా?" అడిగాడు.

ఒక్కక్షణం ఆలోచించాను.

"నేన్నీకంటికి కమెడియన్లా కనబడ్డం నీ దురదృష్టం. ప్రస్తుతం రావిశాస్త్రి సాహిత్యాన్ని చీల్చి చెండాడుతున్నా! నీక్కావాలంటే శ్రమజీవుల చెమట చుక్కలపై చక్కటి కథొకటి రాసిస్తాను, తీసుకో." అన్నాను.

"నాకు చెమట చుక్కలు వద్దు, సరదా కథొకటి చాలు!" అన్నాడు మా మేగజైన్‌గాడు.

'సరే! సినిమా ఎప్పుడూ వుండేదేగా, ఇవ్వాళో గొప్పకథ రాద్దాం' అనుకుంటూ లైబ్రరీలోకి వెళ్ళాను. కథావస్తువుగా దేన్ని తీసుకోవాలి? ఎంత ఆలోచించినా యే ఆలోచనా రావట్ళేదు. డాక్టర్, పేషంట్ల మధ్య బొచ్చెడన్ని జోక్స్ వున్నాయి. యేదోక జోక్ తీసుకుని కథ అల్లేస్తే యెలా వుంటుంది? భేషుగ్గా వుంటుంది, ప్రొసీడ్.

ఇంతలో పక్క టేబుల్ దగ్గర చదువుకుంటున్న నా క్లాస్‌మేట్ దగ్గరకి బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. ఆ అమ్మాయి చెవిలో అతనేదో చెప్పాడు. ఈ అమ్మాయి పుస్తకం మూసేసి నవ్వుకుంటూ అతన్తో బయటకి వెళ్ళింది. నాకు మండిపోయింది. ఈ అమ్మాయిలు ఎంత నిర్దయులు! నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్‌ని వదిలేసి యూజ్‌లెస్ ఫెలోస్‌ని ప్రేమిస్తుంటారు! 

పక్క టేబుల్ ప్రేమికురాలిపై నాక్కొంత పాతకక్షలు కూడా వున్నయ్. ఆ అమ్మాయి ఇంగ్లీషు స్పీడుగా మాట్లాడుతుంది. నేను ఇంగ్లీషు మాట్లాడాలంటే ముందు తెలుగులో ఆలోచించాలి, తదుపరి ఆ ఆలోచనని ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకోవాలి, గ్రామర్ చెక్ చేసుకోవాలి. మనసులో ఇన్ని స్టెప్పులేసుకుని నాలుగు ముక్కలు మాట్లాడేలోపు ఆ అమ్మాయి నలభై ఇంగ్లీషు మాటల్తో ఎడాపెడా బాదిపడేసేది. ఈ విధంగా నేను అనేకమార్లు అవమానం పాలయ్యి, గుడ్ల నీరు కుక్కుకుంటూ, పక్కకి తప్పుకున్న సందర్భాలున్నయ్.

వాళ్ళమీదా వీళ్ళమీదా రాసేసేకన్నా ఈ అమ్మాయి మీద కథ రాసిపడేస్తే ఎలా వుంటుంది? ఎస్, నా కథకి వస్తువు దొరికేసింది. అసలీ ఐడియా ఇందాకే రావాల్సింది, ఇంకానయం ఇంకేదో అంశంపై రాశాను కాదు. కథకి ప్రయోజనం వుండాలంటారు విజ్ఞలు, ఇంతకుమించి ప్రయోజనం యేముంటుంది? ఈ ఇంగ్లీషు సుందరికి శిక్ష పడాల్సిందే! మూడ్ కోసం రాజనాల స్టైల్లో ఒక విషపునవ్వు నవ్వుకున్నాను, ఆపై చకచకా కథ రాసి పడేశాను. 

ఆ అమ్మాయిది భీభత్సమైన నెగటివ్ పాత్ర అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆ స్వార్ధపరురాలు తియ్యని కబుర్లతో ఒక బకరాగాణ్ణి ప్రేమలోకి దించుతుంది, పెళ్ళి చేసుకుంటుంది. పాపం! ఆ అబ్బాయి జీవితం భయానకంగా, నికృష్టంగా, నిస్సారంగా మారిపోయింది. కథ పేరు 'ప్రేమ పిచ్చిది!'.

ఎడిటర్‌గాడు క్యాంటీన్లో యేవో కాయితాల బొత్తిలోకి తీక్షణంగా చూస్తున్నాడు, బహుశా ప్రింటుకి పంపాల్సిన మెటీరియల్ అయ్యుంటుంది. నా కథ చిత్తుప్రతిని వాడిచేతిలో పెట్టాను, నా గజిబిజి రాతని కష్టపడి కూడబలుక్కుంటూ చదివాడు.

"ఇది మన క్లాసమ్మాయి లవ్ స్టోరీ గదా? కథ చదివితే ఈజీగా తెలిసిపోతుంది. ఇలా రాయకూదదు, డిఫెమేటరీ అవుతుంది. ఒక పంజెయ్యి, అనుమానం రాకుండా ఇంకో జంటని కలుపు." అని ఉచిత సలహా ఇచ్చాడు.

"ఇదన్యాయం, నాచేత కూలిపని చేయిస్తున్నావు. అసలు నీ మేగజైన్ కనీసం నువ్వైనా చదువుతావా? యేదో ఆంధ్రప్రభ ఎడిటర్లా సజషన్లు!" అంటూ విసుక్కున్నాను.

ఆలోచించగా - మా ఎడిటర్‌గాడు చెప్పింది కరెక్టేనని తోస్తుంది. రచన ఎవర్నీ నొప్పించరాదు, తప్పు. రచయితకి స్వేచ్చ ఉండాలి కానీ దాన్నా రచయిత దుర్వినియోగపరచరాదు (అసలు సంగతి - ఆ ప్రేమజంటకి వాళ్ళమీద నేను కథ రాసిన విషయం తెలుస్తుందేమోనని భయం).

కేంటీన్లో నాయర్ చేత్తో మాంఛి కాఫీ తాగి, మళ్ళీ లైబ్రరీలోకి వచ్చి పడ్డాను. కథని రిపైర్ చేసి, రిఫైన్ చేసే పనిలో చేపట్టాను. ఇంకో రెండుజంటల్ని కలిపి మూడుజంటల కథ వండాను. ఇప్పుడు మగవాళ్ళు ముగ్గురయ్యారు. ఒకడికి అయోమయం ఆపాదించాను. ఇంకోడికి అమాయకత్వపు అజ్ఞానం పూశాను. మూడో కేరెక్టరుకి నా తెలివిని, మేధస్సుని దానంగా ఇచ్చేశాను! ఇప్పుడు మూడుజంటలయ్యారు, కాబట్టి 'ప్రేమ పిచ్చిది' అనే టైటిల్ని మార్చేసి - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'గా పొడిగించాల్సి వచ్చింది..

ఎడిటర్‌గాడు కథని పైపైన చదివాడు, కాయితాలు చంకలోనున్న ఫైల్లో పెట్టుకున్నాడు.

"చేతిరాత ఘోరంగా వుంది, ఫెయిర్ చేయించాలి." అంటూ వెళ్ళిపొయ్యాడు.

ఔరా మిత్రద్రోహి! ఈ ముక్క నాచేత కథ రాయించక ముందు చెప్పలేదే!

నా కథ కాలేజ్ మేగజైన్లో పబ్లిషయ్యింది, నేనైతే చదవలేదు. నా స్నేహితులు ఆ కథ చదివేప్పుడు ఏ రైలు ప్రమాదం వార్తనో, పాకిస్తాన్ యుద్ధవార్తనో చదువుతున్నట్లుగా మొహం పెట్టార్ట. ఎలా చదివినా - చదివిన వారెవ్వరూ పొరబాటున కూడా నవ్వలేదుట. అలా నా హాస్యకథ ఉదంతం విషాదాంతమైంది. అదీ - నా కథ! 

Friday 1 June 2012

case sheet ఆలోచనలు


ఈ మధ్య నా పోస్టుల పట్ల కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నేను గోడమీది పిల్లిలా, కర్ర విరక్కుండా పాము చావకుండా అందరితో మంచిగా ఉండాలన్నట్లుగా రాస్తున్నానని. 'నిజమా!' ఆని ఆశ్చర్యపోయాను. 'నిజమేనా?' అని ఆలోచించాను. 'నిజమే  కదా!' అని convince అయిపోయాను. మరైతే.. నేనెందుకిలా రాస్తున్నాను!?

నా రాతలు శరత్‌చంద్ర చటర్జీ కథల్లో మాత్రమే కనిపించే 'అందరూ మంచివారే!' తరహా కేరక్టర్లతో, ఆలోచనలతో రాసినట్లున్నాయా? అయితే - 'నేరం నాది కాదు, నా వృత్తిది' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నీ defense రాజకీయ జీవుల వాదనలా అధ్వాన్నంగా ఉందని విసుక్కోకుండా నా గోడు వినమని విజ్ఞప్తి.

నేను వృత్తి రీత్యా కొన్ని దశాబ్దాలుగా నాలుగ్గోడల మధ్య ఉండిపోయాను. ఏ రాజకీయపార్టీతోనూ ఎప్పుడూ సంబంధాల్లేవు. నాది కేవలం పుస్తక పాండిత్యం. ఎన్నిపుస్తకాలు చదివినా జనాలతో కలిసి పని చేయడం అనేది విలువైన అనుభవం. అది నాకులేదు. అంచేత mood of the common man నాకు తెలిసే అవకాశం లేదు. కావున నా బ్లాగుల్లో నేరాసే విశ్లేషణలు పూర్తిగా నా బుర్రలో పైత్యమే! నాకున్న పరిమితుల గూర్చి నాకు పూర్తి అవగాహన ఉంది.

మరెందుకు రాయడం? చేతిలో laptop ఉంది, దానికో wifi connection ఉంది, బుర్రలో కావలసినంత అజ్ఞానం ఉంది. రాయడానికి ఇంతకన్నా సరంజామా ఏంకావాలి? నేనేమీ టీవీల్లో కనబడే మేధావిని కాదు. వారు ప్రజలందరి తరఫున ఆలోచిస్తూ, మన అందమైన భవిష్యత్తు కోసం విలువైన సలహాలు ఇవ్వగలరు. నాకంతటి శక్తి లేదు. నేను నా తరఫున, నా ఆలోచనలని మాత్రమే రాయగలను, రాస్తున్నాను. నా అవగాహన పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా వుంది. ఆపాటి జ్ఞానం, స్పృహ నాకున్నాయని మనవి చేస్తున్నాను.

మొన్నో డాక్టర్ మిత్రుడితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా - ఆయన నవ్వుతూ "మనం చేసే రాజకీయ విశ్లేషణ medical case sheet లా ఉంటుంది. గమనించారా?" అన్నాడు. అప్పుడు వెలిగింది నాకు లైట్ - నేను ఇలా ఎందుకు రాస్తున్నానో!

ఇప్పుడు మీకు కొన్ని వైద్యశాస్త్ర విషయాలు. మీకు విసుగ్గలక్కుండా సాధ్యమైనంత సింపుల్ గా చెప్ప్డడానికి ప్రయత్నిస్తాను. వైద్యవిద్య శిక్షణలో case sheet రాయడం అనేది చాలా ముఖ్యమైనది. రోగలక్షణాలు (symptoms) తెలుసుకున్న తరవాత diagnostic formulation రాయాలి. అటుతరవాత differential diagnosis (DD) రాయాలి. ఆ DD కి అనుకూల, ప్రతికూల పాయింట్లు రాయాలి. prognosis (ప్రస్తుతం ఉన్న condition మున్ముందు ఎలా వుండబోతుంది) రాయాలి. చివరాఖరికి treatment గూర్చి చర్చించాలి. 

వైద్యవిద్య శిక్షణలో ఈ case sheet రాసే process ని చాలా repeated గా చేయిస్తారు. ఇది ఒక scientific approach. అందుకే అంతలా ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక సైకియాట్రీలో శిక్షణ మరీ భీకరం. కేస్ షీట్లు పేషంట్ల బయోగ్రఫీల్లా ఉంటాయి, అలాగే రాయాలి కూడా. ఇక్కడదాకా బాగానే ఉంది. అయితే - క్రమంగా వైద్యేతర విషయాల్లో కూడా case sheet kind of thinking వచ్చేస్తుంది. ఈ రోగాల లాజిక్‌తో రాజకీయాల్ని విశ్లేషించొచ్చా? 

విషయం అర్ధం అవడం కోసం జ్వరాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం (వాస్తవంగా ఈ జ్వరంతో నాకు సంబంధం లేదు. కానీ.. సైకియాట్రీ సబ్జక్ట్ సంగతుల్ని simplify చేసి వివరించేంత సమర్ధత నాకులేదు). ఒక వ్యక్తి నాల్రోజుల్నుండి జ్వరంతో డాక్టర్ దగ్గరకి వెళ్తాడు. జ్వరంతో పాటు దగ్గు, ఆయాసం, కళ్ళె కూడా ఉన్నాయా? అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కావొచ్చు. chest x ray తీయించి నిర్ధారించాలి.

చలి, వణుకు కూడా ఉండి.. జ్వరం తగ్గుతూ వస్తూ ఉందా? మలేరియా కావచ్చు. రక్తపరీక్ష చేయించాలి. platelet count పడిపోయిండా? డెంగీ కావచ్చు. Widal positive వచ్చిందా? టైఫాయిడ్ కావచ్చు. ఏదీకాకపోతే సాధారణ viral infection అనుకోవచ్చు. మొదట్లో కనిపించే symptoms, clinical condition బట్టి working diagnosis ఉంటుంది. మధ్యలో diagnosis మారిపోవచ్చు. final diagnosis ఇంకోటవ్వచ్చు! ఇవన్నీఅత్యంత టూకీగా వైద్యవిద్యకి సంబంధించిన సంగతులు. 

ఇప్పుడు మళ్ళీ నా సొంత గోడు. ఈ రకమైన శిక్షణ వల్ల నేనేది ఆలోచించినా case sheet రాస్తున్నట్లుగానే ఆలోచిస్తాను. అందువల్లనే కామోలు - నా ఆలోచనలు 'ఫలానా రాజకీయపార్టీది ఫలానా లక్ష్యం. ఫలానా నాయకులు ఇలా చెబుతున్నారు. ఈ మాటలు ప్రజలు నమ్మితే ఇలా ఉండొచ్చు, నమ్మకపోతే అలా ఉండొచ్చు.' అనే వాతావరణ శాఖ bulletin ధోరణిలో వుంటాయి. కావున అవి bland గా ఉండొచ్చు!

కానీ - దానికి నేనేం చెయ్యగలను? లేని మేధావిత్వాన్ని తెచ్చుకోలేను గదా? తోచింది రాస్తున్నాను. నాకు రాజకీయ పార్టీలు, నాయకులు - మలేరియా, టైఫాయిడ్‌లతో సమానం. ఎవరు గెలిచినా, ఓడినా నాకు కొంపలు మునిగేదేమీ లేదు. నా జీవితం సాఫీగానే గడిచిపోతుంది. ఒక సాధారణ జ్వరమే ఊసరవల్లిలా అనేక రంగులు మార్చగా లేనిది.. కొన్ని కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాజకీయాంశాలు ఎన్నిరకాలుగా మారిపోవచ్చు!?

కాబట్టి - వీడికి 'పని లేక.. ' AC గదిలో కూర్చుని (ఈ పాయింట్ ముఖ్యమైనది. చల్లదనంలోనే ప్రశాంతంగా ఆలోచించగలం అని నమ్ముతున్నాను) ఏదో రాసుకుంటున్నాళ్ళే పాపం! అనే సానుభూతితో మీరు చదవగలిగితే సంతోషం.

'మాకేం అవసరం? వంట రానివాడు వంట చేసి - ఏదో నేర్చుకుంటున్నాను. తినెయ్యండి ప్లీజ్! అంటే తిని నోరు పాడు చేసుకోవాలా? అవగాహన లేకుండా నువ్వు రాసే చెత్త మేమెందుకు చదవాలి?' అని మీరంటే నే చేసేదేమీ లేదు.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టడం మినహా!

(pictures courtesy : Google)