Wednesday 28 November 2012

చంద్రబాబు.. ఒక నడుస్తున్న చరిత్ర!


'ఈ టీవీ' లో చంద్రబాబు నాయుడు పాదయాత్రని చూస్తున్నాను. మనిషి బాగా చిక్కిపోయ్యాడు. కర్రకి బట్టలు తోడిగినట్లున్నాడు. కోట్ల రూపాయిలున్నాయి. అయినా ఏం లాభం? పాపం! కడుపు నిండా తినలేడు. కంటినిండా నిద్రపోలేడు. ఏమిటీ ఖర్మ? నా మనసు దిగులుగా అయిపొయింది.

"రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో  సుబ్బూ! పాపం  చంద్రబాబుని  చూడు. వృద్ధాప్యంలో ఎన్నికష్టాలు  పడుతున్నాడో!" దిగాలుగా  అన్నాను.

సుబ్బు ఆశ్చర్యపొయ్యాడు. క్షణకాలం టీవీలో చంద్రబాబుని చూశాడు.

"నీ దుఃఖానికి కారణం అర్ధం కావట్లేదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంది తనకి పెన్షన్ అందట్లేదనో, ఇంటిస్థలం పట్టా కావాలనో కాదు. ఆయనక్కావలసింది ముఖ్యమంత్రి పదవి. అది మన చేతిలోనే లేదు. చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా నీకులా జాలిపడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తారేమో. కానీ నాకెందుకో అది చాలా కష్టం అనిపిస్తుంది." అన్నాడు సుబ్బు.

"కష్టమా! ఎందుకని?" అడిగాను.

"అసలు చంద్రబాబు ఏం చెబుతున్నాడో నాకర్ధం కావట్లేదు. ఒక పక్క అభివృద్ధి చేశానంటాడు. ఇంకోపక్క తప్పులు తెలుసుకున్నానంటాడు. మారిన మనిషినంటాడు. అంటే ఇంతకుముందు ఆయన చేసిన తప్పు రాష్ట్రాన్నిఅభివృద్ధి చెయ్యడమేనా? అంటే తను చేశానని చెబుతున్న అభివృద్ధిని disown చేసుకుంటున్నట్లే కదా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! చంద్రబాబు 'మారిన మనిషి' సందేశం పార్టీ కాడర్ కోసం. పార్టీపరంగా తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకుంటున్నాడు." అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రాజకీయాల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు లెక్కలే ఉండవు! ఎక్కాల ప్పుస్తకంలో రెండురెళ్ళు నాలుగనే ఉంటుంది. రాజకీయాల్లో రెండురెళ్ళు పది అవ్వచ్చు. సున్నా కూడా కావచ్చు."

"సుబ్బు! నీకు లెక్కలు రావన్న సంగతి నాకు తెలుసు. కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పు." విసుక్కున్నాను.

"రాజకీయంగా ఇవ్వాళ ఉన్నపరిస్థితి రేపు ఉండదు. కొత్తసమస్యలు రావచ్చు. పాతసమస్యలు పెద్దవిగా మారవచ్చు. ఉన్నట్లుండి కొన్నికారణాల వల్ల పరిస్థితి పూర్తిగా ఒకపార్టీకి అనుకూలంగా మారిపోవచ్చు. దరిద్రం నెత్తి మీదుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల్లాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బు! ఎప్పుడో అరుదుగా జరిగే ఎమోషనల్ సంఘటనలని ప్రస్తావించడం రాజకీయ విశ్లేషణ అవ్వదు. కష్టేఫలి అన్నారు పెద్దలు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కష్టపడుతున్నాడు. కష్టపడ్డప్పుడు ఫలితం ఎందుకుండదు?" చిరాగ్గా అన్నాను.

"కూల్ డౌన్! ముందుగా నువ్వు గ్రహించవలసింది నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే. రాజకీయాల్లో భగవద్గీతలకీ, తెలుగు నిఘంటువులకీ కూడా చోటులేదు. అంచేత కష్టం, ఫలితం వంటి మాటలకి విలువ లేదు. అదృష్టం బాగుంటే పదవి ఫెవికాల్ లా పట్టుకుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు?"

"అవును గదా!" సాలోచనగా అన్నాను.

"చంద్రబాబు ఈ రాష్ట్రానికి CEO నని తనకితానుగా ప్రకటించుకున్నాడు. CEO లు ప్రభుత్వాలకి ఉండరు. కార్పొరేట్ కంపెనీలకి ఉంటారు. తధాస్తు దేవతలు ఆయన్ని దీవించారు. అందుకే తెలుగు దేశం పార్టీకి CEO గా మిగిలిపొయ్యాడు. అయితే ఈ TDP కంపెనీ పాతబడిపోయింది." అంటూ ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

ఒకక్షణం ఆలోచించి నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"ఒకప్పుడు కారంటే ఎంబాసిడర్ మాత్రమే కారు. కలర్ టీవీ ఒక పెద్ద డబ్బాలా ఉండేది. సెల్ ఫోన్ కిలో బరువుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబాసిడర్ కారు చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అన్నిఇళ్ళల్లో విస్తరాకుల్లాంటి LED లు. అందరి చేతుల్లోనూ తమలపాకుల్లాంటి ఐ ఫోన్లు. మార్పు ప్రకృతి ధర్మం. ఇప్పుడెంత కష్టపడ్డా చంద్రబాబు తన పాత మోడల్ కారు, టీవీ, సెల్ ఫోనూ అమ్మడం కుదరదు. రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలు  కుర్రాళ్ళు. లేటెస్ట్ మోడల్ కార్లు, 3D LED, సామ్సంగ్ గెలాక్సీల్లాగా పెళపెళ లాడుతున్నవారు. వాళ్లకి ఆ మేర ఎడ్వాంటేజ్ ఉంది. మన CEO చంద్రబాబుకి ఈ సంగతి తెలియనిది కాదు. కానీ ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు."

"సుబ్బు! నువ్వు చెప్పే కార్లు, టీవీల బిజినెస్ థియరీ రాజకీయాలకి వర్తించదు. నేను ఒప్పుకోను." అన్నాను.

"పోనీ ఇంకోభాషలో చెబుతా విను. తెలుగు దేశం పార్టీ ఒక పెద్ద ఇల్లు వంటిది. ఒకప్పుడు ఆ ఇల్లు లేటెస్ట్ మోడెల్. కళకళలాడింది. ఇప్పుడది పెచ్చులూడిపోయిన పాతబడ్డ బిల్డింగ్. మామూలు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మాసికలు వేయించి, దట్టంగా wall care పెట్టించి ఏదోరకంగా నెట్టుకొచ్చేవాడే. కాకపొతే ఆ పాతబిల్డింగ్ కి తెలంగాణా వాదం అనే పెద్ద తొర్ర పడింది. బిల్డింగ్ ఒక వైపు కూలిపోయింది. రిపైర్ చేయించడానికి ఇసుక, సిమెంట్ సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడు. అయితే రిపైర్ పనులు ముందుకు సాగనీయకుండా ఢిల్లీ KCR అనే మేస్త్రీని కాపలా పెట్టింది. KCR పని ఆ తొర్ర పూడకుండా, వీలయితే ఇంకా పెద్దదయ్యేట్లు చెయ్యటమే! అందుకే ఒక్కోసారి పాతఇల్లు రిపైర్ చేయించేకన్నా కొత్తఇల్లు కట్టుకోవటం సులువు." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు వంద చెప్పు. చంద్రబాబుని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ వయసులో చంద్రబాబు అంత కష్టపడటం అవసరమా?" అన్నాను.

"పూర్తిగా అనవసరం. ఈ బుట్టలల్లడాలు, ఇస్త్రీ చెయ్యడాలు, చెప్పులు కుట్టడాలు చేస్తే మిగిలిది ఆయాసం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎసెంబ్లి స్థాయి నాయకులు ఓట్లడుక్కునేప్పుడు చేసే చౌకబారు విన్యాసాలు. చంద్రబాబు స్థాయి చాలా ఎక్కువ. ఆయన తన హయాంలో ఆర్ధిక సంస్కరణలు ప్రజలకి మేలు చేస్తాయని నమ్మాడు. వేగవంతంగా అమలు చేశాడు. ఆ విధంగా భారత రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు." అంటూ తలుపు తీసుకుని వెనక్కి తిరిగాడు సుబ్బు.

"మళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు." అంటూ హడావుడిగా వెళ్ళిపొయ్యాడు సుబ్బు.


(photos courtesy : Google)

Monday 26 November 2012

పిల్ల సందేహాలు - పిడుగు సమాధానాలు


అప్పుడు నాకు పదేళ్ళు. అమ్మానాన్నల మధ్య కూర్చుని 'కన్యాశుల్కం' సినిమా చూస్తున్నాను (అవునురే! పదేళ్ళ వయసులో ఏ ఎన్టీవోడి సినిమానో చూసుకోక - కన్యాశుల్కాలు, వరకట్నాలు నీకుందుకురా? అయ్యా! సినిమాలు చూచుట అనేది పరమ పవిత్రమైన కార్యము. మనం ప్రతిరోజూ ఎంతమంది దేవుళ్ళకి మొక్కట్లేదు? అట్లే, అన్నిరకముల సినిమాలు చూడవలెననీ, ఎన్ని సినిమాలు చూచినచో అంత పుణ్యము లభించునని నా ప్రగాఢ విశ్వాసము).

తెర మీదకి ఎవరెవరో వస్తున్నారు. ఏవిటేవిటో మాట్లాడుతున్నారు. సినిమా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. కనీసం ఒక్క ఫైటింగు కూడా లేదు. సినిమా పరమ బోర్!

ఉన్నట్టుండి సావిత్రి 'లొట్టిపిట్టలు' అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. అట్లా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఎందుకంత పడీపడీ నవ్వుతుంది? నాకర్ధం కాలేదు.

"అమ్మా! సావిత్రి ఎందుకట్లా నవ్వుతుంది?"

"సావిత్రి మధురవాణి వేషం వేస్తుంది. మధురవాణి వేశ్య!" అంది  అమ్మ.

ఓహో అలాగా! వేశ్యలు పెద్దగా నవ్వెదరు.

అంతలోనే ఇంకో సందేహం.

"వేశ్య అంటే?"

అమ్మ చిరాగ్గా మొహం పెట్టింది. ఒక క్షణం ఆలోచించింది.

"వేశ్య అంటే సంపాదించుకునేవాళ్ళు." అంది.

ఓహో అలాగా! సంపాదించుకునేవారిని వేశ్యలు అందురు.

ఇప్పుడింకో సందేహం.

"అమ్మా! నాన్న సంపాదిస్తున్నాడుగా. మరి నాన్న కూడా వేశ్యేనా?"

అమ్మ చిటపటలాడింది.

"నీ మొహం. అన్నీ కావాలి నీకు. నోర్మూసుకుని సినిమా చూడు." అంటూ కసురుకుంది.

నా మొహం చిన్నబోయింది.

          *                     *                   *                    *                        *                    
మళ్ళీ చిన్నప్పుడే!

అది మధ్యాహ్నం. సమయం సుమారు మూడు గంటలు. అమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకునే సమయం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతూ, తిరగలి తిప్పుతూ, ఊరగాయ పచ్చడికి ముక్కలు తరుగుతూ లోకాభిరామాయణం చెప్పుకుంటుంటారు. నేనా కబుర్లు ఆసక్తిగా వినేవాణ్ని.

ఆరోజు ఎదురింటి విజయక్కయ్య, పక్కింటి భ్రమరాంభ పిన్ని, రెండిళ్ళవతల ఉండే గిరిజత్తయ్య చెవులు కొరుక్కుంటున్నారు. ఒక చెవి రిక్కించి అటు వేశా.

"చూశావా భ్రమరా! ఎంత అమాయకత్వంగా ఉండేవాడు. అంతా నటన! నంగి వెధవ. చదువుకున్నాడు గానీ ఏం లాభం? నేనైతే చెప్పుతో కొట్టే్దాన్ని." అంది విజయక్కయ్య.

"పాపం! ఆ పిల్ల ఎంత అమాయకురాలు! ఈ మధ్యనే పెళ్ళికూడా కుదిరిందట. ఇట్లాంటి దరిద్రుల్ని గాడిద మీద ఊరేగించాలి." అంది గిరిజత్తయ్య.

కొంతసేపటికి నాకర్ధమైనదేమనగా.. వీధి చివర శంకరం గారింట్లో  స్కూల్ మాస్టరు రంగారావు అద్దెకుంటారు. ఆయన వాళ్ళావిడ ఇంట్లోలేని సమయమున పనిమనిషి చెయ్యి పట్టుకున్నాట్ట. అదీ సంగతి!

విషయం అర్ధమైంది గానీ.. మర్మం అర్ధం కాలేదు.

ఒక సందేహము బుర్ర తొలుచుచుండెను.

"విజయక్కయ్యా! మాస్టారు పనిమనిషి చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది?" అడిగాను.

అమ్మ నోర్మూసుకోమన్నట్లు గుడ్లురుమింది.

విజయక్కయ్య సిగ్గు పడుతూ చెప్పింది.

"మగవాడు ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు. చాలా తప్పు." అంది.

ఓహో అలాగా! మగవాడు ఆడవారిని ఎక్కడైనా పట్టుకొనవచ్చును గానీ.. చెయ్యి మాత్రం పట్టుకొనరాదు!

ఇప్పుడింకో సందేహం.

"మరయితే ఆ గాజులమ్మేవాడు ఇందాక మీఅందరి చేతులూ పట్టుకున్నాడుగా?"

నా డౌటుకి విజయక్కయ్య తికమక పడింది. భ్రమరాంభ పిన్ని చీరకొంగు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.

అమ్మ కసురుకుంది.

"వెధవా! అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. అయినా ఆడాళ్ళ మధ్య నీకేం పని? అటుపొయ్యి ఆడుకో పో!"

నా మొహం మళ్ళీ చిన్నబోయింది!

(photo courtesy : Google)

Wednesday 21 November 2012

అంతా భ్రాంతియేనా! పార్వతికి నిరాశేనా?


దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది.

దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో!

ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని.

తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత్యంతరం లేని అనివార్య పరిస్థితులు తనకుతానే సృష్టించుకున్నాడు. తనని తాను హింసించుకుంటూ తనచుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెట్టాడు. అందుకే సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist గా తేల్చేశారు. తాగుడు వల్ల బాధ మర్చిపోవచ్చనుకుంటే.. తాగుబోతు అవ్వాల్సింది పార్వతి. దేవదాసు కాదు!

పార్వతి చేసుకున్న పాపం దేవదాసు పొరుగున పుట్టటమే. పిచ్చిపిల్ల.. దేవదాసుని  unconditional గా ప్రేమించేస్తుంది. ధైర్యవంతురాలు. తమ ప్రేమ సంగతి తండ్రికి చెప్పమని దేవదాసుని కోరుతుంది. దేవదాసు తండ్రి తన వంశంని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అహం దెబ్బతింటుంది. జీవితంలో మొదటిసారి దేవదాసుని ప్రశ్నిస్తుంది.

పెళ్లి కుదిరిన తరవాత కూడా అర్ధరాత్రి దేవదాసు ఇంటి తలుపు తడుతుంది. తనని తీసుకెళ్ళిపొమ్మని ప్రాధేయపడుతుంది. పార్వతికున్న ధైర్యంలో ఒక నలుసు దేవదాసుకి కూడా ఉండిఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ దేవదాసు అర్భకుడు. పార్వతి ప్రేమకు అపాత్రుడు. సమాజ (కృత్రిమ) విలువలకి తలవంచిన పిరికివాడు. 'ధైర్యం' అన్న పదానికి అర్ధం దేవదాసు dictionary లోనే లేదు.

దేవదాసు గూర్చి పార్వతికి సరియైన అవగాహనే ఉన్నట్లు 'అంతా భ్రాంతియేనా!' అనే ఈ పాట వింటే తెలుస్తుంది. అందుకే ఆ అమ్మాయి దేవదాసు కోణం కూడా అర్ధం చేసుకుని పాడింది. నాకర్ధం కానిదల్లా.. ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!

(photo courtesy : Google)

Monday 19 November 2012

నేరము - శిక్ష (శునక శిక్షణ)


"ఓసి కుక్కమొహందానా.. బుద్ధిలేదా? ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా?" కోపంగా అరిచాను. వెంటనే నవ్వొచ్చింది. కుక్కని పట్టుకుని కుక్కమొహమని అనడం తిట్టు కిందకొస్తుందా?

విషయమేమంటే.. మా ఇంట్లో ఒక కుక్కముండ ఉంది. మగకుక్క కాబట్టి ఆంగ్లంలో అయితే 'ఉన్నాడు' అనాలి. కానీ మనది తెలుగుభాష కాబట్టి 'ఉంది' అనే రాస్తున్నాను. 

ఈ శునకుడి నామధేయము స్నూపీ. కుక్కలకి ఇంగ్లీషు పేర్లు పెట్టడాన్ని తెలుగు భాషోద్యమకారులు ఎందుకు ignore చేస్తున్నారు? బహుశా గ్రామసింహాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టుటయే కరెక్టని అనుకుంటున్నారేమో!  

స్నూపీకి క్రమశిక్షణ ఎక్కువ. ఠంచనుగా తింటుంది. సమయపాలనన్న మిక్కిలి మక్కువ. అందుకే అందరికన్నా ముందే AC బెడ్రూంలోకి దూరి గురకలు పెట్టి నిద్రబోతుంది. తెల్లారేదాకా బాంబులు పడ్డా నిద్ర లేవదు. 'జగమంతా కుటుంబం నాది!' అని నమ్ముతుంది. అంచేత ఇంట్లోకి ఎవరొచ్చినా పట్టించుకోదు.

ఆ మధ్య పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు వీధివీధంతా మేల్కొంది. అంతా గోలగోల. స్నూపీ మాత్రం తన గాఢనిద్రలోంచి మేలుకోలేకపోయింది. ఇరుగుపొరుగుల ముందు పరువు పోయింది. తల కొట్టేసినట్లైంది. ఇక్కడదాకా నాకేం ఇబ్బంది లేదు. 

కానీ ఈమధ్య ఉదయాన్నే నాతోబాటు వెనకాలే బాత్రూంలోకి దూరి.. తను కూడా bladder empty చేసుకుంటుంది. నిద్రమత్తులో నా వెనకాలే నీడలా వచ్చే ఈ నాలుక్కాళ్ళ జీవిని గమనించలేకున్నాను.
                          
లాభం లేదు. ఈ శునకాధముని క్రమశిక్షణలో పెట్టవలె. కానీ కుక్కకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? కుక్కకి child psychology అప్లై అవుతుందని విన్నాను. పిల్లల్లో discipline కోసం ఉపయోగించే behavioral techniques నాకు తెలుసు. పిల్లల కోసం అమలు చేసే privilege stop అనే శిక్షణలాంటి శిక్ష కుక్కలకి పనికొస్తుందా? ట్రై చేస్తే పోలా! 

తప్పు చేసిన పిల్లలకి వారి ఆటవస్తువుల్లాంటివి దాచడం privilege stop అంటారు. స్నూపీకి ఆట సామాగ్రి లేదు కాబట్టి ఆహారమే ఒక privilege. అంచేత తిండి పెట్టకుంటే అదే దారికొస్తుంది. కొద్దిగా మొరటు పధ్ధతి. కానీ తప్పదు.

స్నూపీకి రోజూ breakfast అలవాటు. మాతోపాటే ఇడ్లీలు, అట్లు తింటుంది. ఇవ్వాళ దీనికి breakfast కట్ చేస్తాను. అప్పుడు కుక్కలా (కుక్కలా ఏమిటీ? కుక్కే గదా!) దారికి వస్తుంది. 

మేఘన కాలేజీకీ, బుడుగు స్కూలుకి వెళ్ళిపోయారు. treadmill చేసుకుంటూ స్నూపీకి breakfast ఇవ్వొద్దని నా భార్యకి చెప్పాను. ఆవిడ హడావుడిగా హాస్పిటల్ కి వెళ్ళిపోయింది. 

ఓరకంటతో స్నూపీని గమనిస్తూనే ఉన్నా. దానికి ఆకలేస్తుంది. ఎవరూ తనని పట్టించుకోకపోవడం దానికి అర్ధం కావట్లేదు. ఇంట్లోకి నేను ఎటు వెళితే అటే వచ్చి ఎదురుగా నిలబడి తీవ్రంగా తోక ఊపుతుంది.      

ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని.. కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ వేసుకున్నాను. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ.. నిదానంగా ఇడ్లీలు ఆరగించడం మొదలెట్టా. టీవీలో ఏదో రాజకీయ చర్చ జరుగుతుంది. చర్చ పరమ నాసిగా ఉంది.

స్నూపీకి ఇడ్లీలంటే ఇష్టం. ఎదురుగా నించొని ఇడ్లీలకేసి ఆశగా చూస్తుంది. నేను పట్టించుకోలేదు. ఇంక ఆగలేకపోయింది. తనక్కూడా ఆకలేస్తుందన్నట్లుగా ముందు కాలుతో నాకాలుని గీరడం మొదలెట్టింది. 

యాహూ! నా punishment regime విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు నేను punishment ఎందుకు ఇచ్చానన్నది స్నూపీ మైండ్ కి కనెక్ట్ కావాలి. ఇది నా థెరపీలో important step. అందుకోసం కొంత verbal reinforcement చెయ్యవలసి ఉంది. 

"స్నూపీ! you are a good boy. బాత్రూముల్లో ఉచ్చ పొయ్యకూడదు. తప్పు. open place లో పోసుకో. అప్పుడు నీకు బోల్డెన్ని ఇడ్లీలు పెడతాను. అర్ధమైందా?" 

నా నీతిబోధనా కార్యక్రమం పూర్తి కాకముందే.. తల పైకీ, కిందకి ఊపుతూ.. 'ఖయ్.. ఖయ్.. ఖయ్' మంటూ గోళీసోడా కొడుతున్నట్లు.. మూలుగుతున్నట్లు.. ఏడుస్తున్నట్లు.. విచిత్రంగా మొరగడం ప్రారంభించింది. 
                                         
స్నూపీ విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోయా. నా punishment వికటించి దీనికి పిచ్చిగానీ పట్టలేదు గదా! అర్జంటుగా ఇడ్లీ పెట్టకపోతే కరుస్తుందేమో! దీని మొహం. దీనికి పిల్లిని చూస్తేనే భయం. నన్ను బెదిరించి ఇడ్లీలు కాజేయ్యడానికి వేషాలేస్తుంది! కానీ.. ఏమో! ఎవరు చెప్పగలరు? basic animal instincts అంటూ ఉంటాయి గదా! 

ఒక్కక్షణం ఆలోచించా. నేనిప్పుడు దీని బెదిరింపులకి లొంగితే నన్ను పిరికిసన్నాసి అనుకుంటుంది. అప్పుడిక భవిష్యత్తులో నన్నసలు లెక్క చెయ్యదు. అంచేత స్నూపీకి ఇడ్లీలు పెడితే నేనోడి పోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లో నేనోడిపోరాదు. స్నూపి గెలవరాదు. కానీ.. ఎలా? ఎలా? ఏం చెయ్యాలి?

మెరుపు మెరిసింది. ఐడియా. స్నూపీకి మనుషుల తిండంటేనే ఇష్టం. బిస్కట్లు, కేకులు, స్వీట్లు, నూడిల్స్, ఇడ్లీలు, దోసెలు బాగా లాగిస్తుంది. కుక్కల ఆహారంగా చలామణి అయ్యే branded dog foods దానికస్సలు ఇష్టం ఉండదు. 

సృష్టిలో అత్యంత దుర్వాసన వచ్చు పదార్ధ మేమి? 'pedegree' నామధేయ బహుళజాతి కుక్కల ఆహారం. నా ముక్కుకి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. వాసన శక్తి బాగా తక్కువ. ఇదొకరకమైన అంగవైకల్యం. అటువంటి నాక్కూడా 'పెడిగ్రీ' దుర్వాసన భరింపరానిదిగా అనిపిస్తుంది. 

ఆ కంపుకొట్టే బహుళజాతి కుక్కల ఆహారం దాని ప్లేట్లో పోసాను. ప్లేట్లోని గుళికల్ని పైపైన వాసన చూసింది. ఆవదం తాగిన మొహం పెట్టింది. మళ్ళీ నా దగ్గరకొచ్చి ఆశగా ఇడ్లీల వైపు చూస్తుంది. అయితే ఇప్పుడా విచిత్ర ప్రవర్తన మానేసింది. 

ధైర్యం పుంజుకుని మళ్ళీ నా క్లాస్ మొదలెట్టాను. "బాత్రూములో ఉచ్చ పొయ్యకు. understand?" అంటూ ఇడ్లీ తుంచుకుని కొబ్బరి పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకున్నాను. ఇడ్లీపై ఆశలొదిలేసుకున్న స్నూపీ నిరాశగా, దీర్ఘంగా నావైపు చూసింది. 

నిదానంగా దాని ప్లేట్ దగ్గరకి వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపు 'పెడిగ్రీ'ని వాసన చూసింది. 'ఇవ్వాల్టికి నాకిదే ప్రాప్తం. ఖర్మ!' అనుకున్నట్లుంది. దిగులుగా, అత్యంత నిదానంగా 'పెడిగ్రీ' తిని ఆకలిబాధ తీర్చుకుంది.

అమ్మయ్య! నా థెరపీ పూర్తయ్యింది. ఇక స్నూపీతో నాకే ఇష్యూ లేదు. అంచేత దాని ప్లేట్ లో రెండిడ్లీ వేశాను. స్నూపీ కళ్ళల్లో వెలుగు! ఆవురావుమంటూ ఆ ఇడ్లీలని క్షణంలో మింగేసింది. గిన్నెలో మంచినీళ్ళన్నీ గటగటా తాగేసింది.  

ఆపై నా దగ్గరకి వచ్చి తోకని విపరీతంగా ఊపుతూ, తన ఒళ్ళంతా నా కాళ్ళకేసి రుద్దుతూ.. నా ఎడమ చెయ్యిని నాకసాగింది. దాని కళ్ళనిండా ప్రేమ. కృతజ్ఞత. 'థాంక్యూ బాస్!' అన్న భావన!     
                
'అయ్యో పాపం! దీన్ని ఇంత ఇబ్బంది పెట్టానా?' అనిపించి జాలేసింది. 

అసలు స్నూపీ చేసిన తప్పేంటి? పిల్లలు గారాబం చేసి దీన్ని ఇట్లా తయరుచేసారు. ఇప్పుడిది తను కుక్కనన్న సంగతి మర్చిపోయింది. తను కూడా ఓ మనిషి ననుకుంటుంది. అందుకే బెడ్రూంలోంచి నేరుగా బాత్రూంలోకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటుంది.  

పిల్లలు చేసిన తప్పుకి నోరులేని జీవిని శిక్షించడం న్యాయం కాదు. కాబట్టి నేను పోలీసు మార్క్ మొరటు శిక్షలు మాని.. ఏదైనా sophisticated పద్ధతి ఆలోచించాలి. ఆ పద్ధతులేంటబ్బా?! 


చివరి తోక.. ఇది ఒక యదార్ధ గాధ!

(photos courtesy : meghana & budugu)    

Wednesday 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)

Monday 5 November 2012

భానుమతి వద్దు! రాజసులోచనే ముద్దు!!


అబ్బ! బుర్ర వేడెక్కిపోయింది. భార్యాభర్తల మధ్య తగాదా కేసు. చాలా టైం పట్టింది. ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మనసంతా చికాగ్గా అయిపోతుంది. లాభం లేదు. ఒక మంచి తెలుగు సినిమా పాట చూసి రిలాక్స్ అవ్వాలి.

ఈ వేడెక్కిన బుర్రని చల్లార్చుకోడానికి నాకు యూట్యూబ్ పాత పాటలు ఎంతో ఉపయోగపడతాయి. నాకు కొత్త పాటలు తెలీదు. అంచేత పాత పాటల్లోనే తిరుగుతుంటాను.




'మనసున మల్లెలు మాలలూగెనే.. ఎంతహాయి ఈరేయి.. ఎంత మధురమీ హాయి!' మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడిన ఈపాట నాకు చాలాచాలా ఇష్టం. ఇప్పటికి వెయ్యిసార్లు విని ఉంటాను. అయినా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. ఎప్పుడువిన్నా మనసంతా హాయిగా, తేలిగ్గా అయిపోతుంది.

అంచేత ఇప్పుడు మళ్ళీ 'మనసున మల్లెలు మాలలూగెనే.. ' వినడం మొదలెట్టాను. కంప్యూటర్ మానిటర్ పై పాటని చూస్తూ తన్మయత్వం, పరవశం చెందుచుండగా..

"రవణ మావా! కాఫీ." అంటూ సుబ్బు వచ్చాడు.

శబ్దం చెయ్యొద్దన్నట్లుగా చూపుడువేలు నోటివద్ద పెట్టుకుని సైగచేస్తూ.. అరమోడ్పు కన్నులతో పాట వినడంలో పూర్తిగా మునిగిపొయ్యాను. పాట అయిపోయింది. తపస్సులోంచి అప్పుడే బయటకొచ్చిన మునివలే ఫీలయ్యాను. గదంతా నిశ్శబ్దం.. ప్రశాంతత.

"ఆహాహా ఏమి ఈ భానుమతి గానమాధుర్యము! ఒక ప్రేయసి తన ప్రియుడి కోసం ఎంత అద్భుతంగా పాడింది! ఈపాట విన్నవాడి జన్మధన్యం. విననివాడి ఖర్మం. సందేహము వలదు. ఈ భూప్రపంచంలో ఇంతకన్నా గొప్పపాట లేదు. ఇకముందు రాదు కూడా!" తన్మయత్వంతో అన్నాను.

"నేనలా అనుకోవడం లేదు." సుబ్బు గొంతు విని ఉలిక్కిపడ్డాను.

కర్కశంగా సుబ్బుని చూశాను. ఈ దరిద్రుడి వల్ల నాజీవితంలో నేనుపొందే చిన్నచిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నాను. వీడు మొన్న నీలం తుఫాన్లో కొట్టుకుపొయినా బాగుండేది.

"నువ్వు కోపంతో అలా పిచ్చిచూపులు చూడనవసరం లేదు. భానుమతి పాట అద్భుతం. ఒప్పుకుంటున్నాను. కానీ నాదృష్టిలో 'సడిసేయకోగాలి.. ' ఇంతకన్నా అద్భుతం." అన్నాడు సుబ్బు.




"నువ్వు చెబుతుంది 'రాజమకుటం' పి.లీల పాడిన పాట గురించేనా? ఆపాట గూర్చి నువ్వు చెప్పేదేముంది? చాలా మంచి పాట. నాక్కూడా చాలా ఇష్టం. మాస్టర్ వేణు సంగీతం అమోఘం. కానీ ఆపాటని భానుమతి పాటతో పోలిక తేవడం నీ పూర్ టేస్ట్ సూచిస్తుంది. నా స్టేట్మెంట్ ఖండిద్దామనే దుగ్ద తప్ప నీవాదనలో పసలేదు." చికాగ్గా అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది.

"నాది ఇంటలిజెంట్ టేస్ట్ అనుకుంటున్నాను. పూర్ టేస్ట్ ఎలానో చెబితే విని సంతోషిస్తాను." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"మల్లీశ్వరి బి.ఎన్.రెడ్డి అద్భుతసృష్టి." అన్నాను.

"మరి రాజమకుటం ఎవరి సృష్టో!" నవ్వాడు  సుబ్బు.

"దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన.. "

"నా 'సడిసేయకోగాలి.. ' కూడా అక్కణ్ణుండే జాలువారింది మిత్రమా!" అందుకున్నాడు సుబ్బు.

"సరే! నీ సడిసేయకోగాలి నా మనసునమల్లెల కన్నా ఎలా ఎక్కువో నువ్వే చెప్పు. ప్రూవ్ యువర్ పాయింట్!" అన్నాను.

"అలా అడిగావ్ బాగుంది. రెండు పాటలు రాసింది కృష్ణశాస్త్రే. కానీ రాయడంలో ఎంత తేడా చూపించాడో గమనించు. మల్లీశ్వరి పాట సబ్జెక్టివ్ గా ఉంటుంది. రాణీవాసంలో మగ్గిపోతున్న మల్లి ఎంతోప్రయత్నం మీద తనబావ నాగరాజుని తుంగభద్ర ఒడ్డున కలుసుకుని.. ఆనందంతో పరవశం చెందుతూ.. తన భావాల్నికవితాత్మకంగా పాట రూపంలో వర్ణిస్తుంది. అద్భుతమైన పాటే! కానీ మనమెవరం? మగాళ్ళం. మన దృష్టికోణం మగవాడివైపు నుండి ఉండాలి." అన్నాడు సుబ్బు.


"అంటే!" ఆసక్తిగా అడిగాను.

"రాజమకుటం పాట విను. 'సడిసేయకోగాలి.. సడిసేయబోకే! బడలి ఒడిలో రాజు పవలించేనే!' ప్రియుడు అలసిసొలసి ఉన్నందున గాలిని శబ్దం చెయ్యొద్దని అడుగుతుంది. అతన్ని రారాజు, మహారాజుగా భావిస్తుంది. తనకంటూ ఏమీ కోరుకోదు. ఏమగాడికైనా కావలసింది తనకోసం వరాలు కోరుకునే నిస్వార్ధ నారీమణిగానీ, తన భావాలు అందంగా వ్యక్తీకరించే కవియిత్రి కాదు. కవిత్వం కడుపు నింపదు. అందుకే రామారావు అదృష్టానికి రాజనాల కుళ్ళుకుంటాడు." అంటూ నవ్వాడు సుబ్బు.

"నేనీ ఏంగిల్లో ఆలోచించలేదు." ఆలోచనగా అన్నాను.


"గాలికూడా శబ్దం చెయ్యరాదంటూ మనని అపురూపంగా చూసుకునే యువతి భార్యగా వస్తే ఎంత సుఖం! రోజూ గుత్తొంకాయ, దోసకాయ పప్పు చేయించుకుని కడుపునిండా భోంచెయ్యొచ్చు. ఎన్నిసార్లడిగినా విసుక్కోకుండా ఫిల్టర్ కాఫీలిస్తుంది. ఈరోజుల్లో ఎన్నిలక్షలు పోసినా ఒక్కరోజుకూడా ఇంతసుఖం దక్కదు." అన్నాడు సుబ్బు.

"భానుమతికేం తక్కువ?" నేనివ్వాళ భానుమతిని వదలదల్చుకోలేదు.

"ఏమీ తక్కువ కాదు. అన్నీ ఎక్కువే. అసలు భానుమతి, రాజసులోచన మొహాల్ని నువ్వెప్పుడన్నా పరిశీలనగా చూశావా? మనమేం చెప్పినా నమ్మేట్లుగా.. అమాయకంగా, బేలగా ఉండే రాజసులోచనతో.. తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎసెర్టివ్ గా ఉండే భానుమతిని పోల్చడానికి నీకు బుర్రెలా వచ్చింది? బుద్ధున్న ఏమగాడైనా రాజసులోచనని వదులుకుంటాడా!" అన్నాడు సుబ్బు.

"నువ్వు భానుమతిని మరీ తక్కువ చేస్తున్నావు." ఓడిపోతున్నాని తెలిసి కూడా బింకంగా అన్నాను.

"రవణ మావా! నేను భానుమతిని తక్కువ చెయ్యట్లేదు. ఆవిడొక అద్భుతనటి. బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆవిడకి శతకోటి వందనాలు. భానుమతి స్థాయి మనకన్నా లక్ష మెట్లు ఎక్కువనే చెబుతున్నాను. ఆడవారిలో తెలివి ఆటంబాంబు కన్నా ప్రమాదకరమైనది. వారికి ఎంతదూరంలో ఉంటే మనకంత మంచిది. తెలివైన యువతిని కట్టుకుని బాగుపడ్డ మగాడు చరిత్రలో లేడు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.


"నేను చరిత్ర చదువుకోలేదు సుబ్బు!" నవ్వుతూ అన్నాను.



"బి.ఎన్.రెడ్డిది కూడా నా అభిప్రాయమే! అందుకే పాటల చిత్రీకరణలో చాలా తేడా చూపాడు. 'మల్లీశ్వరి'లో భానుమతి పాట పాడినంతసేపూ రామారావు పక్కనే కూర్చునుంటాడు. పైగా భానుమతి తనమీదకి ఒరిగినప్పుడు ఆవిడ బరువు కూడా మోస్తాడు. ఎంత ఘోరం! అదే 'రాజమకుటం' పాట చూడు. హాయిగా రాజసులోచన ఒడిలో తల పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. తనకి లభించిన ఈ ప్రమోషన్ రామారావుకి కూడా సంతోషం కలిగించినట్లుంది." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.


"ఇన్నాళ్ళు భానుమతి పాటే అద్భుతమనుకున్నానే!" డిజప్పాయింటింగ్ గా అన్నాను.

వెళ్ళబోతూ ఆగి, వెనక్కితిరిగి అన్నాడు సుబ్బు.

"ఇవన్నీ పబ్లిగ్గా చెప్పే మాటలు కాదు మిత్రమా! యే అందర్ కి బాత్ హై! ఇప్పుడైనా ఎవరన్నా అడిగితే భానుమతి పాటే గొప్పని చెప్పు. లేకపోతే నిన్నో పురుష దురహంకారిగా భావించే ప్రమాదముంది. అసలే రోజులు బాలేవు!" అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.

(photos courtesy : Google)

Friday 2 November 2012

గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది


మనుషులు రెండురకాలు - ఆడ, మగ. సినిమాలు రెండురకాలు - మంచిసినిమా, చెత్తసినిమా. అలాగే వేడుకలు రెండురకాలు - ఒకటి అధికారికం, మరోటి అనధికారం. అనగా ప్రభుత్వ లాంచనాలతో, అధికార దర్పంతో జరపబడేది అధికారిక వేడుక. ప్రభుత్వ ప్రమేయం లేకుండా డబ్బుగలవారి వితరణతో అట్టహాసంగా జరపబడేది అనధికార వేడుక.

ఉదాహరణకి ఉగాదినే తీసుకుందాం. ప్రభుత్వం ఉగాదినాడు 'అధికారయుతం'గా పంచాంగ పఠనం ఏర్పాటుచేస్తుంది. ఆ పంచాంగం వింటుంటే అప్పుడెప్పుడో లక్ష్మణకుమారుడు పాడిన 'సుందరి నీవంటి దివ్యస్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా!' అనేపాట గుర్తొస్తుంది. రాజకీయపార్టీలు వారి పార్టీఆఫీసుల్లో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసుకుంటాయి. ఇది అనధికారిక కార్యక్రమం. ఆయా ఆఫీసుల్లో అన్ని రాజకీయ పక్షాలకి 'ఉందిలే మంచికాలం ముందుముందునా!' అంటూ శ్రవణకర్త అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు.

'అధికారిక కార్యక్రమం' అంటే నా ఈడువారికి వెంటనే గుర్తొచ్చేది గాంధీ జయంతి. మర్చిపోవటానికి అదేమన్నా సాదాసీదా బాదుడా! ఆ సందర్భంగా ఊళ్ళో మునిసిపల్ స్కూళ్ళు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పిల్లల్ని ఉదయం నుండి గంటల తరబడి మండుటెండలో, ఓపెన్‌గ్రౌండ్‌లో కూర్చోబెడతారు. మంత్రిగారు తాపీగా వచ్చి గాంధీజయంతి సందర్భాన జాతికి పునరంకితమవుతానని ప్రకటించుకుంటారు.

పాపం! గాంధీ ఎవరో తెలీని ఆ పిల్లలు ఎండకి సొమ్మసిల్లి, విలవిలలాడిపోతారు. అంతేనా? ఆరోజు మాంసాహారం దొరకదు, బ్రాందీ విస్కీలు అసలే దొరకవు. ఆ ఒక్కరోజూ అవి ముట్టినవాడు మహాపాపి! అందుకే ఆరోజు టీవీ చానెల్‌వాడు ఈ ఏక్ దిన్ కా పాపుల్ని పట్టే పనిలో బిజీగా వుంటాడు!

'కళాబంధు' స్పూర్తిగా ఇప్పుడు వీరకళోద్ధారకులు ఎకాడెమీలు  ఏర్పాటు చేస్తున్నారు. తమ కళాతృష్ణ తీర్చుకోవటానికి పొగాకు కంపెనీలు, పత్తి వ్యాపారస్తులు, మిర్చి కమిషన్  ఏజంట్లు, క్వారీ యజమానులు, బెల్ట్ షాపుల నిర్వాహకుల చందాలతో (దీన్నే 'స్పాన్సర్‌షిప్' అనికూడా అంటారు) అవార్డు ప్రదానోత్సవం అంటూ ఒక రియాలిటీ షో నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్నవారిని పిలిచి 'సావిత్రి అవార్డు', 'ఘంటసాల అవార్డు' అంటూ సత్కరిస్తారు. ఇదో ప్రొఫెషన్ అంటాడు మా సుబ్బు. మంచిదే కదా! కూటికోసం కోటివిద్యలు.

కొంతకాలంగా పాతతరం రచయితలు, కళాకారుల్ని గుర్తు చేసుకోవడం ఒక తంతుగా జరపబడుతుంది. అందుకోసం జయంతులు, వర్ధంతులు మంచి అవకాశం. అసలు ఈ పుట్టిన్రోజులు, చచ్చిన్రోజుల గోల నాకు చికాకుని కలిగిస్తుంది. ఈ రెండ్రోజులు హడావుడి చేస్తే.. మిగిలిన అన్ని రోజులూ వీరిని మర్చిపోవడానికి పాస్‌పోర్ట్ లభించినట్లేమో!

ఎప్పుడో చనిపోయిన ఈ కవులు, కళాకారుల పేరిట ప్రస్తుతం జరపబడుతున్న హడావుడిని బట్టి స్థూలంగా మూడు తరగతులుగా విభజించుకోవచ్చు. అందరికన్నా దిగువున జనతా కేటగిరీ కవులు. వీరికోసం ఆరోజున పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. అంతే, ఇంకేమీ ఉండదు. వీరికన్నా పైస్థాయి డీలక్స్ కేటగిరీ. వీళ్ళు ప్రముఖులేగానీ, ప్రభుత్వ గుర్తింపు ఉండదు. వీరు అనధికార ఫ్రొఫెషనల్ సంస్థల కార్యక్రమాలకి పెన్నిధి. అత్యున్నతమైనది డీలక్స్ కేటగిరీ. వీరు ప్రభుత్వ అధికార లాంచనాల్నీ, కార్యక్రమాల్ని అందుకుంటారు.

కాలానుగుణంగా మారుతున్న రాజకీయ అవసరాలననుసరించి జనతాక్లాస్ కవి డీలక్స్ స్థాయికి ఎగబాకుతాడు. డీలక్స్‌ని సూపర్ డీలక్స్‌కి పంపాలని తెలుగుభాషా సేవకులు లాబీయింగ్ చేస్తుంటారు. ఇందులో కులాలు, ప్రాంతాలు గణనీయపాత్ర పోషిస్తుంటాయి. తెరవెనుక కాంగ్రెస్పార్టీ మార్కు రాజకీయాలు కూడా జరపబడతాయి.

క్రికెట్ ఆటలో వందపరుగులు చేస్తే సెంచరీ సాధించాడంటారు. ఆ ఆటగాడికి ఇదో గొప్ప ఎచీవ్‌మెంట్. ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొడతారు. ఇప్పుడిది సాహిత్యంలో కూడా వచ్చేసింది. నాకైతే ఈ వంద సంఖ్యకున్న పవిత్రత ఏమిటో అర్ధం కాదు. తొంభైతొమ్మిది సంఖ్య ఎందుకంత పనికిరానిదై పోయిందో కూడా తెలీదు.

ఇవ్వాళ నేనుతిన్న మసాలాదోశకి కూడా వందేళ్ళ తరవాత వందేళ్ళు నిండుతాయి గదా! మరప్పుడు ఈ నూరేళ్ళ ఆబ్సెషన్ ఎందుకు? ఇదొక మార్కెటింగ్ టెక్నిక్కా? అప్పటిదాకా ప్రశాంతంగా వాయించబడే మేళతాళాలు తాళికట్టే సమయయానికి కొంపలు మునిగిపోయే హడావుడి చేసినట్లు.. ఈ రచయితల వందో సంవత్సర హడావుడి మేళాలు వినలేకపోతున్నాను.

ఈ వందేళ్ళ జయంతులు, వర్ధంతులు పురస్కరించుకుని పుణ్యజీవులకి ధన్యజీవులుగా ప్రమోషన్ కల్పించబడుతుంది. విప్లవకవి శ్రీశ్రీని అభ్యదయకవిగా మార్చేసి సిపియంవారు తమ ఖాతాలోకి వేసేసుకున్నారు (మతమార్పిడి పీడనకు చచ్చినవారు కూడా అతీతులు కారు). రేపు శ్రీశ్రీ భావకవిగా మార్చబడి ప్రభుత్వం ఖాతాలోకి కూడా నెట్టబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎల్లుండి చెగువేరాలాగా టీషర్టుల మీద దర్శనమిస్తూ ఒక ఫేషన్ ఐకాన్ అయిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరంలేదు.

ఇప్పుడు గురజాడకి ప్రభుత్వం ప్రమోషనిచ్చింది. ఆయన జయంతి ప్రభుత్వం అధికారయుతంగా జరిపిస్తుందట! అనగా కొన్ని కోట్లరూపాయిలు బజెట్ విడుదలవుతుంది. ఇక గురజాడకి డిజైనర్ షర్టులు, షేర్వానీలు వేసేస్తారు. అమెరికా తెలుగుసంఘాలకి ప్రీతిపాత్రుడైపోతాడు (ఎచట డబ్బు ఉండునో అచట కళలు పోషించబడును). సందుగొందుల్లో కంచువిగ్రహాలు ప్రతిష్టిస్తారు.

వచ్చీరాని తెలుగులో గౌరవ ముఖ్యమంత్రిగారు మనకి గురజాడవారి గొప్పదనాన్ని వివరిస్తారు. తదుపరి కళాకారులు 'కన్యాశుల్కం' ప్రదర్శిస్తారు. ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే కవులు, కళాకారులు ఘనంగా సత్కరింపబడతారు. ఇట్లా నిధులు ఖర్చయ్యేదాకా అనేకానేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రమేణా గురజాడ దేవుడైపోతాడు. ఆయన రచనల మంచిచెడ్డలు చర్చించబూనడం దైవదూషణ అయిపోతుంది. ఆవిధంగా అధికారయుతంగా గురజాడ సాహిత్యం.. తద్వారా తెలుగుభాష ఉద్దరింపబడుతుంది!
                                 
అసలు రచయితల్ని పురస్కరించటం అంటే ఏమిటి? శిలావిగ్రహాలు ఏర్పాటు చెయ్యటమెందుకు? 'మహాప్రస్థానం' చదవకుండా శ్రీశ్రీకీ, 'కన్యాశుల్కం' తెలీకుండా గురజాడకి అర్పించే నివాళి యేమి!? నాకు ఈ హడావుడి చూస్తుంటే  చిన్నప్పడు చదివిన భమిడిపాటి రాధాకృష్ణ 'కీర్తిశేషులు' నాటకం గుర్తొస్తుంది.

ఒక కవి పేదరికంలో మగ్గిపోతుంటాడు. చచ్చిపోయాడని పుకారు పుడుతుంది. కవిగా ఆయనేం రాశాడో ఆ ఊరివారికి తెలీదు. అయితే ఆయనకి శిలావిగ్రహం కట్టించాలని ఊళ్ళో 'పెద్దమనుషులు' చందాలు పోగేస్తారు. ఇంతకీ - ఆ కవి చావడు. ఏదోరోగం నుండి 'చచ్చి' బ్రతుకుతాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దమనుషులు ఆందోళనకి గురవుతారు. వసూలు చేసిన చందాలు తిరిగివ్వడానికి మనసొప్పదు. అంచేత ఆ కవి చావాల్సిందేనని ఒత్తిడి చేస్తారు. నాకు గుర్తున్నమటుకు 'కీర్తిశేషులు' కథ ఇది. గురుదత్ కూడాఈ సబ్జక్టుతో ఓ సినిమా తీశాడు.

ఒక కవికి నిజమైన నివాళి ఏమిటి? ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ, జ్ఞానపీఠలు కాదు. వారి ఇలాకాల్ని సన్మానించడం అసలే కాదు. వారు చేసిన కృషి సమాజ పురోగమనానికి తోడ్పడాలి. వారి రచనలు సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, విస్తృతంగా చర్చింపబడాలి. ముఖ్యంగా యువత ఆ రచయితని ఓన్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మన యువత కులసంఘాల రాజకీయాల్లో, సినిమానటుల అభిమానంలో పీకల్లోతు మునిగిపోయి క్షణం తీరిక లేకుండా వున్నారు.

గురజాడని చదివేవాళ్ళ సంఖ్య పెరగడం అటుంచండి, తగ్గిందని అనుకుంటున్నాను. ఇవ్వాళ నూటికి తొంభైమందికి గురజాడ ఎవరో తెలీదు. కొందరైతే గురజాడ సాహిత్యాన్ని చదవకుండానే చదివామని చెప్పుకుంటారు. ఇలా క్లైం చేసుకోవడం వారికో ఓ స్టేటస్ సింబల్. ఆంధ్రదేశంలో ఒకరోజు అమ్ముడయ్యే విస్కీసీసాల సంఖ్య - గత వందేళ్ళల్లో అమ్ముడయిన 'కన్యాశుల్కం' కాపీలకన్నా ఎక్కువని అనుకుంటున్నాను. జనాలకి గురజాడ రచనలకన్నా విస్కీ నిషాలోనే మజా ఎక్కువగా ఉందేమో, మంచిదే!

(picture courtesy : Google)