Monday 28 October 2013

భారతదేశము నా మాతృభూమి



'భారతదేశము నా మాతృభూమి,



భారతీయులందరూ నా సహోదరులు.



నేను నా దేశమును ప్రేమించుచున్నాను.'



ఇది మన భారతదేశ ప్రతిజ్ఞ.



ఈ ప్రతిజ్ఞ మనకి తారక మంత్రము. ఎంతో స్పూర్తిదాయకము.



ప్రజలందరూ అన్నదమ్ముల వలే శాంతిసౌభాగ్యములతో వర్ధిల్లాలి.



ప్రజలందరూ అక్కచెల్లెళ్ళ వలె సుఖసంతోషములతో పరిఢవిల్లాలి.



ప్రజలందరూ జాతీయ భావములతో నిండుపున్నిమి లాగా ప్రకాశించాలి.



ఏమిటీ నీతివాక్య ప్రలాపములు?



పక్కరాష్ట్రంవాడు మనకి రావాల్సిన నిధుల్ని దోచేస్తున్నాడు.



ఏందుకలా గగ్గోలు పెడుతున్నావ్? పక్క రాష్ట్రం వాడు మాత్రం మన సహోదరుడు కాడా?



రండి, కదలండి. కాలవలకి తూములు కొట్టేసి పక్క జిల్లావాడికి నీళ్ళు పోకుండా అడ్డం కొట్టేద్దాం.



ఏందుకంత ఆవేశం? పక్క జిల్లావాడు మాత్రం మన సహోదరుడు కాదూ?



నువ్వు చెబుతున్నదేదీ నాకు అర్ధం కావట్లేదు. అన్నట్లు ఇది విన్నావా? మా పక్కింటి వాడొట్టి దౌర్భాగ్యుడు. వాడికి ఉద్యోగం పోయింది. వెధవకి తిక్క కుదిరింది.



ఏం? పక్కింటివాడు నీ సహోదరుడు కాదా? వాడి కష్టం అర్ధం చేసుకోవా? మరి నీ భారతదేశం ప్రతిజ్ఞ ఏమైంది?



ఏవిటోయ్ నీ గోల? ఈ దేశం ఎటు పొతే నాకెందుకు? నేను బాగుండాలి. నా బేంక్ బ్యాలన్స్ బాగుండాలి. నా పిల్లలు గొప్పగా సెటిలవ్వాలి. ఊళ్ళో నేను కొన్నవైపు స్థలాలకి రేట్లు పెరగాలి. అన్నట్టు వడ్డీకి డబ్బులైమైనా కావాలా బ్రదర్? ధర్మవడ్డీ. పది రూపాయిలే. అదీ నీకు మాత్రమే సుమా!



భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు.



చూస్తుంటే ఒట్టి వెర్రిబాగులవాళ్ళా ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే అర్ధమవుతుందిలే.



నువ్వు స్వార్ధపరుడివి.



సర్లే! ఈ దేశంలో తెలివైనవాణ్ని అంతే అంటార్లే మిత్రమా! 



మరి నీ సోదరులైన డాక్టర్లు, గవర్నమెంటు ఉద్యోగులు, ప్లీడర్లు నిన్నెందుకు నిలువుదోపిడీ చేస్తున్నారు?



మరి మన భారతీయ సోదరులు తమ సోదరుల్ని కారంచేడు, చుండూరుల్లో వెంటాడి, వేటాడి నిలువునా నరికేశారెందుకు?



ముందు వాళ్లకి చెప్పి ఆ తరవాత నాకు చెప్పు నీ నీతులు.



నువ్వీ భారమాత ముద్దు బిడ్డవు. నీ తల్లికి సేవ చేసుకో.



భారతమాతకి సేవ చెయ్యాలా! ఎందుకు?



భారతదేశంలో ఒంటరిగా కనిపించిన ఆడపిల్లపై అత్యాచారం చెయ్యొచ్చు.



భారతదేశంలో పారిశ్రామిక వ్యర్ధాల్ని నిక్షేపంగా, నిరాటంకంగా త్రాగే నీళ్ళల్లో వెదిలేసుకోవచ్చు.



భారతదేశంలో అడవుల్ని అడ్డగోలుగా నరికేసుకోవచ్చు.



భారతదేశంలో గనుల పేరుతో భూమికి బొక్క పెట్టేసి ఖనిజ సంపదని అడ్డదిడ్డంగా అమ్మేసుకోవచ్చు.



భారతదేశంలో త్రాగే నీటిని, పీల్చే గాలినీ ఎడాపెడా కలుషితం చేసుకోవచ్చును.



నీకు బాధగా ఉండదా? గిల్టీగా ఉండదా?



అస్సలు ఉండదు. నా చేతికంటిన రక్తం మరకలు తుడిచేసుకునే ఉపాయం కూడా నా దగ్గర ఉంది.



ఎవర్రా అక్కడ? రేపు నా పుట్టిన్రోజు. పెద్దాసుపత్రిలో రోగిష్టి దరిద్రులకి బిస్కట్లు, పండ్లు పంచిపెట్టండి. వికలాంగులకి ట్రై సైకిళ్ళు పంచండి. వితంతువులకి కుట్టు మిషన్లు ఇవ్వండి. ప్రెస్సోళ్ళకి మంచిమంచి కానుకలు పంపండి. నాపేరు మీద గొప్ప సమాజ సేవ జరిగినట్లు వార్తలు ప్రముఖంగా వచ్చేలా చూడండి.



ఒరే వెర్రిబాగులాడా! ఇప్పుడు చెప్పు ఏం చెబ్తావో!



అవును, నీ కీర్తీ దశదిశలా వ్యాపించును. నిన్ను ప్రజలు వేనోళ్ళ శ్లాఘించెదరు.



అవును, నువ్వు దయామయుడవు. భారతదేశం ప్రతిజ్ఞ నీకు నరనరాల జీర్ణించుకుపోయింది.



అవును, ఇపుడు నీకు పాపపరిహారం అయిపోయింది. ఇక నిశ్చింతగా జీవింపుము బిడ్డా!



అవును, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.



నేను వెర్రిబాగులాణ్నే!



(picture courtesy : Google)

Thursday 24 October 2013

మన్నాడే


ఈరోజు ప్రముఖ హిందీ సినిమా నేపధ్య గాయకుడు మన్నాడే మరణించాడు.

మన్నాడే మధుర గాయకుడు, శాస్త్రీయ సంగీతంలో నిష్టాతుడు.. ఇలా అనేక విశేషాలతో రేపటి పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. ఆసక్తి ఉన్నవారు రేపటిదాకా ఆగవలసి ఉంటుంది.

మన్నాడే తన పాటలతో నన్ను అలరించాడు. ఆయనది చాలా క్లీన్ వాయిస్.

శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రతిభ కలవారు సినిమా పాటలు పాడటానికి ఇబ్బందిగా ఫీలవుతారు. కారణం.. సినిమా అనేది పూర్తిగా డిఫెరెంట్ మీడియం. అక్కడ సన్నివేశాన్ని అనుసరిస్తూ, సందర్భాన్ని బట్టి నటీనటుల బాడీ లాంగ్వేజికి అనుగుణంగా పాడవలసి ఉంటుంది.

రాకెట్ సైంటిస్టుని రాకెట్ ఎలా ఎగురుతుందో ఒక చందమామ కథలాగా చెప్పమంటే ఇబ్బంది పడతాడు. వెయ్యిమందికి అవలీలగా వంట చేసేవాణ్ణి.. ఇద్దరికీ కాఫీ పెట్టమంటే చికాకు పడతాడు. రోజూ గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్ని.. గొంతు నొప్పికి మందడిగితే చాలాసేపు ఆలోచిస్తాడు. ఇవన్నీ సింపుల్ గా కనిపించే ఇబ్బందికరమైన అంశాలు.

అట్లాంటి ఇబ్బందే గొప్ప గాయకులకి కూడా ఉంటుంది. మనకి తెలిసిన ఘంటసాల, రఫీలు శాస్త్రీయ సంగీతాన్ని పద్దతిగా నేర్చుకున్నారు. మంచి ప్రతిభావంతులు. అయితే వారు తమ ఇబ్బందిని అధిగమించి.. సినిమా పాటలకి తగ్గట్టుగా తమని తాము మలచుకున్నారు. గొప్ప విజయాలు సాధించారు. ఇదేమీ మామూలు విషయం కాదు. మన్నాడే కూడా ఈ మహాగాయకుల కోవకి చెందినవాడేనని నా అభిప్రాయం.

రచయితలకైతే ఫలానా కథ అని గుర్తు చేసుకుంటాం. గాయకులకైతే ఫలానా పాట అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లింక్ ఇచ్చుకుని చూసుకునే సౌకర్యం ఉంది కాబట్టి.. నాకు నచ్చిన సినిమాలోంచి, నచ్చిన మన్నాడే పాటొకటి  ఇస్తున్నాను. చూసి ఆనందించండి.

Wednesday 23 October 2013

చుట్టతో చుట్టరికం


నాకో స్నేహితుండేవాడు. అతగాడు స్నేహశీలి, సిగరెట్టుశీలి కూడా. ఆ రెండు శీలాలు నాక్కూడా ఉన్నందున మా ఇద్దరి స్నేహం విస్కీసోడాలా కలిసిపోయింది. ఎక్కువసేపు కబుర్లు చెప్పుకోవడమే మంచి స్నేహానికి కొలమానం అయినట్లైతే మాది మంచి స్నేహంగా చెప్పొచ్చు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాల గూర్చి బోల్డన్ని కాఫీలు తాగుతూ తీవ్రంగా బాధ పడేవాళ్ళం. (కాఫీ తాగుతుంటేనే సమాజం, దేశం గూర్చి ఆలోచనలు వస్తాయి).

నా స్నేహితుడి తల్లి మహమాతృమూర్తి (అనగా 'మాతృమూర్తి'కన్నా ఒకడిగ్రీ ఎక్కువ). ఆవిడ తన కొడుకు పట్ల ప్రేమని వంటలో భారీగా రంగరించేది. అందువల్ల నా స్నేహితుడు తినే సింగిల్ గారె, డబుల్ ఇడ్లీ కోసం కష్టపడి పెద్ద వంట చేసేది. చివర్లో మాత్రం ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. అది అత్యంత మధురంగా ఉండేది. అంచేత అన్ని దానాల్లోకి కాఫీ దానమే గొప్పదనే నమ్మకం నాలో ఏర్పడిపోయింది.

నా స్నేహితుడి మేనమామ ఈ పోస్టుకి హీరో, పేరు శాస్త్రి. తెలుగు పండితుడు. ఆయన చొక్కా వేసుకోంగా నేను చూళ్ళేదు. బక్కగా ఎండిపోయిన బెండకాయలా ఉండేవాడు. కడుపు లోపలికి పోయి, డొక్కలు ముందుకు పొడుచుకొచ్చి ఎనాటమీ విద్యార్ధుల డిసెక్షన్ కోసం మెడికల్ కాలేజికి పంపడానికి రెడీగా ఉన్న శవంలా ఉండేవాడు. నాకాయన్ని చూస్తుంటే కొన్నిసార్లు గాంధీ తాత, ఇంకొన్నిసార్లు కస్తూరి శివరావు జ్ఞాపకం వచ్చేవాళ్ళు.

నా స్నేహితుని ఇల్లు పెద్దది. వరండా కూడా పెద్దదే. అందులో ఓ మూలగా ఓ చెక్కబల్ల. శాస్త్రిగారు ఆ యింట్లో ఉన్నంతసేపూ ఆ చెక్కబల్లపైనే కూర్చునుండేవాడు. నాకెందుకో ఆ చెక్కబల్ల, శాస్త్రిగారు అన్నదమ్ముల్లా కనిపించేవారు. ఆయన ఏదో స్కూల్లో ఫుల్ టైం తెలుగు మాస్టారు, మరేదో గుళ్ళో పార్ట్ టైం పూజారి.

శాస్త్రిగారు పొద్దస్తమానం చుట్టతో చాలా బిజీగా ఉండేవాడు. అంటే ఆయన ఎక్కువ చుట్టలు కాల్చేవాడని అర్ధం కాదు. అసలాయన చుట్ట తాగుతుండంగా నేను అతి తక్కువసార్లు చూశాను. పొగాక్కాడని శ్రద్ధగా పేలికలు చేసేవాడు. ఆపై వాటిని ఏకాగ్రతగా చుట్ట చుడుతుండేవాడు. ఆ చుట్ట ఓపట్టాన వెలిగేది కాదు. అనేక అగ్గిపుల్లలు ఖర్చు చేసి, ఎంతో కష్టపడి చుట్ట కొన ముట్టించేవాడు. ఒకసారి పొగ వదిలి ఏదో చెప్పేలోపు ఆ చుట్ట ఆరిపొయ్యేది. ఇక మళ్ళీ ఆ చుట్ట వెలిగింపుడు కార్యక్రమం మొదలు.

శాస్త్రిగారు ఈవిధంగా పట్టు వదలని విక్రమార్కుడిలా, నిరంతరంగా చుట్టతో విన్యాసాలు చేస్తూ.. 'చుట్ట కాల్చడం' అనే విద్య నేర్చుకునే వయోజన విద్యార్ధిలా అగుపించేవాడు. ఒక్కోసారి ఆయన చుట్ట బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపొయ్యేది!

నన్ను చూడంగాన్లే "అక్కయ్యా! బుల్లి డాక్టరొచ్చాడు. కూసిని కాఫీనీళ్ళు తగలెట్టు." అని అరిచేవాడు.

శాస్త్రిగారికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. స్టీలు గ్లాసులోని కాఫీని ఆప్యాయంగా చూసుకుంటూ.. చిన్న సిప్పులతో చప్పరిస్తూ (కొండకచో లొట్టలేస్తూ) తాగేవాడు. కాఫీని తాగుతూ ఎంతగా ఎంజాయ్ చెయ్యొచ్చో శాస్త్రిగార్ని చూసిన తరవాతే నాకర్ధమైంది. మందుకు బానిసైనవాణ్ని మందుబాబు అంటారు. ఆ లెక్కన శాస్త్రిగార్ని కాఫీబాబు అనొచ్చు.

ఆయన చుట్ట కాల్చడానికి తీవ్రంగా కృషి చేస్తూనే నాతో కబుర్లు చెబ్తుండేవాడు.

"కట్నం తీసుకోవడం మహాపాపం. కట్నం అడిగే గాడ్దెకొడుకుల్ని నిలువునా పాతెయ్యాలి. గాంధీగారేమన్నారు? గురజాడ ఏమన్నాడు?" అంటూ ఆవేశపడేవాడు.

గాంధీగారు, గురజాడలు కట్నాల విషయంలో ఏమన్నారో నాకు తెలీదు కావున మౌనంగా ఉండేవాణ్ని.

ఆయనకొక కూతురు, ఒక కొడుకు. కూతురికి సంబంధం వెతికే ప్రయత్నంలో తలమున్కలుగా ఉండేవాడు. అయినా ఆయనకి కాఫీపై ఉన్నంత శ్రద్ధ పిల్లదాని పెళ్ళిసంబంధం చూట్టంలో లేదని.. ప్రతిరోజూ భార్య 'తలంటు' పోసేది. ఆ వేడెక్కిన బుర్రతో దిక్కుతోచక అక్కగారి పంచన చేరి కాఫీ తాగుతూ ఆ చెక్కబల్లపై కాలక్షేపం చేస్తుండేవాడు.

"దేనికైనా సమయం కలిసి రావాలి. ప్రతి తలకిమాసిన వెధవా వేలకివేలు కట్నాలు పట్రమ్మంటే ఎక్కణ్నించి తెచ్చేది? ఇక్కడేమన్నా డబ్బులు చెట్లకి కాస్తున్నయ్యా? పెళ్ళిఖర్చులు ఆడపిల్ల తండ్రి నెత్తిన రుద్దడమేంటి? కట్నంలోనే సరిపుచ్చుకు చావొచ్చుగా? పోలీసు రిపోర్టిస్తాను. ముండాకొడుకుల్ని బొక్కలో వేసి మక్కెలిరగ తంతారు. నేను మాత్రం ఖాళీగా కూర్చున్నానా? ఎన్నిచోట్లకి తిరగట్లేదు?"

శాస్త్రిగారు ఇలా తనకి తనే ప్రశ్నలు వేసుకుంటూ కాఫీ చప్పరిస్తూ ఉండేవాడు.

నా స్నేహితుని అన్న అమెరికాలో డాక్టరు, గాస్ట్రో ఎంటిరాలజిస్ట్, సొంత హాస్పిటల్ వుందిట. శాస్త్రిగారు తన మేనల్లుణ్ని 'డాక్టరు' అని రిఫర్ చేస్తాడు కావున నేను బుల్లి డాక్టర్నయినాను.

ఎందుకనో శాస్త్రిగారికి అమెరికా అంటే చిరాకు.

"అదేం దేశం! ఒట్టి దరిద్రపుగొట్టు దేశం. అక్కడందరూ మేక మాంసాన్ని కత్తుల్తో కోసుకు తింటార్ట! మరి అజీర్ణం చెయ్యమంటే చెయ్యదూ? ఆ దరిద్రానికి మన డాక్టరు పైనుండి, కిందనుండి గొట్టాలేస్తాట్ట! ఎంత డబ్బులిస్తే మాత్రం అక్కడ గొట్టాలెయ్యడవేంటి! అసలింతోటిదానికి గొట్టాలెందుకు? హాయిగా ఇంగువ, శొంఠి రుచి చూపిస్తే అజీర్ణం ఆమడ దూరం పరిగెత్తదూ? ఆ తెల్లతోలు గాడిదలకి డాబుగా కార్లల్లో తిరగడం తప్ప ఒంటి శుభ్రత కూడా ఉండదట! పాడు దేశం, పాడు మనుషులు." అని విసుక్కునేవాడు.

అటు తరవాత కొన్నాళ్ళకి ఆయన కూతురి పెళ్ళి చేశాడు. మంచి సంబంధం. అల్లుడు కూడా బుద్ధిమంతుడు. మొత్తానికి శాస్త్రిగారి కష్టాలు గట్టెక్కాయి. నాకేదో పరీక్షల హడావుడి ఉండటం వల్ల కొంతకాలం పాటు నా స్నేహితుడి ఇంటికి వెళ్ళడం కుదర్లేదు.

చాల్రోజుల తరవాత ఒకరోజు నా స్నేహితుని ఇంటికెళ్ళాను.

వరండాలో ఎదురుగా చెక్కబల్లపై చెక్కమనిషి! ఆరోజు కూడా యధావిధిన ఆయన తన చుట్టతో కుస్తీ పడుతున్నాడు.

నన్ను చూడంగాన్లే "అక్కయ్యా! బుల్లి డాక్టరొచ్చాడు. కాసిని కాఫీనీళ్ళు తగలెయ్యి." అనరిచాడు.

ఎప్పుడూ అన్యమస్కంగా, ఆందోళనగా ఉండే ఆయన ఇవ్వాళ ప్రశాంతంగా ఉన్నాడు. బహుశా కూతురి పెళ్ళి బాధ్యత తీరి.. భార్య 'తలంటు' పోటు తప్పినందువల్ల కావచ్చు.

ప్రశాంతంగా కాఫీ చప్పరిస్తున్న ఆయన నోట్లోంచి బాంబులాంటి డైలాగొకటొచ్చింది.

"ఎంతైనా అమెరికా అమెరికానే! అది తెల్లోళ్ళ దేశం. దొరల తెలివి ముందు మనమెంత?"

ఆశ్చర్యపొయ్యాను. కొద్దిసేపటి తరవాత విషయం అర్ధమైంది.

శాస్త్రిగారి కూతురి పెళ్ళి కోసం అమెరికా మేనల్లుడు డబ్బు పంపాట్ట. పెళ్ళిఖర్చులన్నీ పోంగా కొంత సొమ్ము కూడా ఆయన మిగుల్చుకున్నాట్ట! అంచేత ఉన్నట్టుండి ఆయనకి అమెరికా మంచి దేశమైపోయింది!

సరే! ప్రపంచ దేశాలే అమెరికా పట్ల సమయానుకూలంగా తమ అభిప్రాయాలు మార్చుకుంటుంటే ఈ సగటు మనిషి ఏపాటి?

"ఇప్పుడింక మీ అబ్బాయికి పెళ్ళి చెయ్యాలి గదా. కట్నం లేకుండా వాడికో మంచి సంబంధం చూడనా?" నవ్వుతూ అన్నాను.

చుట్టపొగ గుప్పున వచ్చింది. ఉన్నట్లుండి ఆయన గొంతు గంభీరంగా మారింది.

"కట్నం తీసుకోకపోతే పిల్లడికేదో లోపముందనుకుంటారు. అయినా ఆ సొమ్ము నాకోసం కాదుగదా? ఆ రాబోయే పిల్లదాని పుట్టబొయ్యే పిల్లల కోసమేగా? అసలే కరువు రోజులు. అయినా ఎన్టీఆర్ కట్నం తీసుకోలేదా? మర్రి చెన్నారెడ్డి పుచ్చుకోలేదా?"

యధాప్రకారం చుట్ట ఆరిపోయింది. అది వెలిగించడానికి అగ్గిపుల్లలు గియ్యడం మొదలైంది.

ఎన్టీఆర్, చెన్నారెడ్డిలు కట్నం తీసుకున్నారో లేదో నాకేం తెలుసు? ఇప్పుడు తెలుసుకునే ఓపిక్కూడా లేదు. కానీ ఈయన తన కొడుక్కి కట్నం తీసుకోడానికి రెడీగా ఉన్నాడని మాత్రం బాగా అర్ధమైంది.

'నీ కూతురుకి కట్నం ఇవ్వడానికి ఇష్టపడనివాడివి కొడుక్కి కట్నం ఎలా ఆశిస్తావు?' అని ఆయన దగ్గర లా పాయింట్ లాగితే ఆయన ఏం చెప్పేవాడో తెలీదు. ఎందుకంటే - అడగటం దండగని నాకు తెలుసు కాబట్టి నేనాయన్ని ఆ ప్రశ్న అడగలేదు.

కొన్నాళ్ళకి నా స్నేహితుడు అమెరికాలోని అన్న దగ్గరకి వెళ్ళిపొయ్యి అక్కడే స్థిరపడ్డాడు. అంచేత అటు తరవాత శాస్త్రిగారిని నేను కలవలేదు.

శాస్త్రిగారు! ఇప్పుడు మీరు రిటైర్ అయ్యి శేషజీవితం గడుపుతూ ఉండవచ్చు. మీరెక్కడున్నా కానీ.. చుట్టతో మీ చుట్టరికం చిరకాలం హాయిగా కొనసాగాలని.. జీవితంలో కనీసం ఒక్క చుట్టైనా నిరాటంకంగా, ఏకబిగిన కాల్చగలిగే అదృష్టం మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!

Friday 18 October 2013

యుద్ధం కబుర్లు


మహాభారత యుద్ధంలో ఎవరిమాట చెల్లుబాటయ్యింది?

ఒకవైపు ధుర్యోధనుడి మాట శిలాశాసనం.. ఇంకోవైపు ధర్మారాజు మాట వేదవాక్కు.

ఇద్దరూ యుద్ధం కావాలనుకున్నారు.. చేసుకున్నారు.

జీతాల కోసం పనిచేస్తున్న సైనికులు ఇద్దరి తరఫున కొట్టుకుని.. కుప్పలుతెప్పలుగా చచ్చారు.

దుర్యోధన ధర్మరాజులిద్దరూ యుద్ధం వద్దనుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆపేసుకోవచ్చు.

అందుకు వారు కారణం కూడా చెప్పనక్కర్లేదు.

వారిద్దర్లో ఒకరికి వీపు దురద పుట్టినా.. గోక్కోడానికి కూడా తాత్కాలిక యుద్ధవిరామం ప్రకటించవచ్చు.

వీరికి సలహాలు అనేకులు అనేక రకాలుగా ఇవ్వవచ్చును.. కానీ నిర్ణయాత్మక శక్తి మాత్రం వీరిద్దరిదే.

ఈ యుద్ధం అనేక యుగాల క్రితం జరిగింది.

ఈనాటిక్కూడా మనకి కొద్దిపాటి జ్ఞానమైనా వచ్చిన దాఖలా లేదు.

మన పైవాళ్ళకి యుద్ధం ఆపే ఉద్దేశ్యం ఉండదు.

కానీ - లీకులతో, తియ్యనైన కబుర్లతో మభ్యపెట్టెదరు.

కౌరవుల్లో వందోవాడికి విరోచనాల్ట.. యుద్ధం ఆగిపొయ్యేట్లుంది.

సహదేవుడి గుర్రానికి గుగ్గిళ్ళు అయిపొయ్యాయి.. యుద్ధం కేన్సిల్.

భీష్ముడికి గెడ్డం మరీ పెరిపోయిందట.. యుద్ధం వాయిదా వేస్తారా?

యుద్ధానికయ్యే జమాఖర్చులు రాసే వేతనశర్మలు సహాయ నిరాకరణ చేస్తున్నార్ట!

'అయితే ఏంటంట?'

నిర్ణయం తీసుకున్న ధుర్యోధనుడు, ధర్మరాజు.. వాళ్ళ మానాన వాళ్ళు యుద్ధం చేసేసుకుంటూ పోతున్నారు.

వాళ్ళతో మాట్లాడే ధైర్యం ఇంకా ఎవరికీ వచ్చినట్లు లేదు.

ఒకప్పుడు నర్తనశాల సినిమాలో ఉత్తరకుమారుణ్ని చూసి పగలపడి నవ్వుకున్నాం.

ఇప్పుడు సర్వం ఉత్తరకుమారుల మయం.

'చేతనైతే యుద్ధం ఆపేస్తున్నామని చెప్పాల్సినవాళ్ళతో చెప్పించు.. అంతేగానీ ఈ చీకట్లో రాళ్ళు విసరడం మానెయ్యి.' అని అనకు.

నిన్నొక శతృగూఢచారిగా జమ కట్టెదరు.

మనందరం గాంధీగారి కోతుల్లాంటివాళ్ళం.

అందుకే మనకి నచ్చింది మాత్రమే చూస్తాం, వింటాం, మాట్లాడతాం.

ఇదొక అంతులేని అజ్ఞానం, అది మనకెంతో ఆనందదాయకం.

'ఉరే అబ్బాయ్! ఏనాదైతే కిష్టుడి రాయబారం ఫెయిలయిందో, ఆరోజే మహాభారత యుద్ధం జరగాలని నిర్ణయమైపోయింది. కత్తి పదును పెట్టుకోడానికి ఆకురాయి కనబళ్ళేదని మర్డర్ చెయ్యడం మానుకుంటామా ఏమిటీ? అందుకే - ఈ వెర్రిమొర్రి ఆలోచనాలు కట్టిపెట్టి జరగాల్సిందేవిటో ఆలోచించు.'

'ఎవడ్రా వీడు? వీణ్ని తన్ని తగలెయ్యండి.'

Friday 11 October 2013

తెలంగాణా! ఎందుకు?


"సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." బాధగా అన్నాను.

కాఫీ తాగుతున్న సుబ్బు చిన్నగా నవ్వాడు.

"నేనైతే అలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లుండి తెలంగాణా ప్రాంతంపై ప్రేమ పుట్టుకురాలేదు. ఆ పార్టీకి తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత ఏర్పడింది." అన్నాడు సుబ్బు.

"అంటే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని చీలుస్తుందా?" అన్నాను.

"ముందు నువ్వా 'తెలుగు జాతి' అంటూ పరుచూరి బ్రదర్స్ మార్కు డైలాగులు కొట్టడం ఆపు. రాజకీయాలు మాట్లాడేప్పుడు రాజకీయ భాషనే వాడు. సినిమా భాష వాడకు. అవును ఏ పార్టీకైనా రాజకీయ లబ్దే అంతిమ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. డాక్టర్లు వైద్యం చేస్తారు. వంటవాడు వంటే చేస్తాడు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇంకోటి చెయ్యవు. దేశంలో రాజకీయ లబ్ది చూసుకొని రాజకీయ పార్టీ ఏదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"అవుననుకో. కానీ నాకెందుకో బాధగా ఉంది." అన్నాను.

"అవును. కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన ఒక రాజకీయ అంశం. రాజకీయ అంశాలని emotional గా చూడరాదు మిత్రమా! ఒకరకంగా కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వటానికి నరేంద్ర మోడీ ముఖ్యకారకుడు. కాంగ్రెస్ పార్టీ 2014 లో రాహల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికి రోడ్ మేప్ వేసుకుంది. బిజెపి నరేంద్ర మోడీతో రోడ్ మేప్ సిద్ధం చేసుకుంటుంది. ఈ రెండు మ్యాపుల్లో ఒక మ్యాప్ మాత్రమే సక్సస్ అవుతుంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో నిధి కోసం వేసుకునే ఎత్తులు, పైయ్యెత్తులు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఈ వాతావరణమే నెలకొని ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి పార్లమెంటు సీటు కీలకంగా మారింది." అన్నాడు సుబ్బు.

"అందువల్ల రాష్ట్రం విడగొట్టాలని దుర్మార్గమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటావ్?" అడిగాను.

"మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుతున్నావ్. ఇక్కడ దుర్మార్గం, సన్మార్గం ఏముంది? అంతా రాజకీయ  మార్గమే! నువ్వు రాష్ట్ర రాజకీయాల్ని ఢిల్లీ వైపు నుండి చూట్టం నేర్చుకో. విషయం చాలా తేలికగా అర్ధమవుతుంది." అన్నాడు సుబ్బు.

"నేను నిఖార్సైన తెలుగువాణ్ని. సమస్యని నా ప్రాంతం నుండి మాత్రమే చూస్తాను. ఇంకేవైపు నుండి చూడను." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఖాళీ కాఫీకప్పు టేబుల్ పై పెట్టి కుర్చీలోంచి లేచాడు. నా ఎదురుగా నించొని.. నా నుదిటిపై తన కుడిచేతి చూపుడు వేలు ఆనించాడు.

"ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది.. వస్తుంది. హాయిగా నిద్ర పోతున్నావ్. నిద్ర పోయ్యావ్. నిద్ర పో.. య్యా .. వ్." అన్నాడు.

ఆశ్చర్యం! నాకు నిజంగానే నిద్రోచ్చింది. అలాగే కుర్చీలో ఒరిగిపొయ్యాను.

"మిత్రమా! ఇప్పుడు నువ్వు సాధారణ పౌరుడివి కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడవి. నువ్విప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగులో ఉన్నావు. నేను సోనియా గాంధీని. అదిగో చూడు.. ఎదురుగా అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్, ఆంటోని.. కనిపిస్తున్నారా?"

"అవును. స్పష్టంగా కనిపిస్తున్నారు మేడం." అన్నాను.

"మీరు CWC లో ఆంద్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యులు. పార్టీ అధ్యక్షురాలిగా ఏపీలో మన పార్టీ పరిస్థితిపై మీ నివేదిక అడుగుతున్నాను. ఏం చెబుతారో చెప్పండి." అన్నాడు సుబ్బు.

నేను గొంతు సరి చేసుకుని చెప్పటం మొదలెట్టాను.

"నమస్తే మేడం! ఏపీలో మన పార్టీ పరిస్థితి అస్సలు బాలేదు మేడం. సీమాంధ్రలో జగన్ పార్టీ దూసుకుపోతుంది. తెలంగాణా కెసిఆర్ కోటగా మారిపోయింది. తెలంగాణలో బిజెపి కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్ట్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోటా మన పార్టీ డిపాజిట్టు కోల్పోయింది. కాబట్టి మన రాష్ట్ర నాయకుల మాటలకి విలువనివ్వడం శుద్ధదండగ." అన్నాను.

"అలాగా? సరే! మీరేం చేస్తారో నాకనవసరం. ఎట్లాగైనా సరే అక్కడ మన పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి. మనకి ఏపీ నుండి మేక్జిమం పార్లమెంటు సీట్లు రావాలి. ఏం చేద్దామంటారు?" అడిగాడు సుబ్బు.

ఒక్క క్షణం ఆలోచించాను.

"మేడం! మనం అర్జంటుగా తెలంగాణా ఇచ్చేద్దాం. అందువల్ల ఇరవై మూడు జిల్లాల్లో పది జిల్లాలు మన ఖాతాలో పడతయ్. ఈ దెబ్బకి తెలంగాణలో బిజెపి అవుట్. కెసిఆర్ ఎలాగూ మనతో కలిసిపోతాడు. కాబట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాని స్వీప్ చేసేస్తాం." ఉత్సాహంగా అన్నాను.

"వెరీ గుడ్. మరప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఏం చేద్దాం?" అడిగాడు సుబ్బు.

"అక్కడ రాజకీయం చెయ్యడానికి మనకి వెసులుబాటు ఉంది మేడం. జగన్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రంగం సిద్ధం చేశాను. ద డీల్ ఈజ్ జగన్ బాబు CM, మన రాహుల్ బాబు PM."

"ఇప్పుడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నడుస్తుంది. మరి తెలంగాణా ఆపేద్దామా?" అడిగాడు సుబ్బు aka సోనియా గాంధీ.

"అదెలా కుదురుతుంది. ఇప్పుడు రాష్ట్ర విభజనని పెండింగ్ లో పెడితే అన్నింటికి చెడతాం మేడం. దీన్నే మా తెలుగు భాషలో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారు. మనకి ముందుకు పోవడం మించి వేరే దారి లేదు మేడం." అన్నాను.

"అంతేనంటారా?"

"అంతే మేడం. మీరు తెలంగాణా ఇస్తానని ఒకసారి ఎలక్షన్ మీటింగులో చెప్పారు. ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే మాట నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.. రాజకీయంగా లాభమూ చేకూరుతుంది. తెలంగాణా ఇవ్వకుండా రాష్ట్రం మొత్తం నష్టపొయ్యేకన్నా.. ఇచ్చి ఒక భాగాన్ని మన ఖాతాలో వేసుకోవడం ఉత్తమం."

"మరి రాష్ట్రవిభజన విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నారేమిటి?" అడిగాడు సుబ్బు.

"చూడండి మేడం! ఎదురుగా మసాలా దోశ విత్ అల్లం పచ్చడి అండ్ కొబ్బరి చట్నీలతో రెడీగా ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్లు తిందాం. హడావుడిగా తినవలసిన అవసరం మనకేంటి?" అన్నాను.

"అర్ధం కాలేదు." అన్నాడు సుబ్బు.

"కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో మనమే ఉన్నాం గదా మేడం. ఎన్నికల సమయానికి క్లైమేక్స్ వచ్చేట్లుగా మనం రాజకీయాలు నడిపిద్దాం. మా  తెలుగు సినిమాల్లో పదోరీల్లోనే పోలీసులు వస్తే హీరో ఫైటింగు చెయ్యని అసమర్ధ వెధవగా మిగిలిపోతాడు. కాబట్టి దర్శకుడు పద్నాలుగో రీలు దాకా పోలీసుల్ని ఆపుతాడు. అంచేత తెలంగాణా ఇవ్వాల్సిన టైమింగ్ మన ఇష్టప్రకారం మాత్రమే ఉంటుంది. చివరిదాకా ఎవరికీ ఇంకే అవకాశం లేకుండా చెయ్యడమే మన మాస్టర్ ప్లాన్." అన్నాను.

కుర్చీలోంచి లేచాడు సుబ్బు. తన కుడిచేతి చూపుడు వేలుతో నా నుదురు తాకాడు.

"ఇప్పుడు నువ్వు నిద్ర లోంచి లేస్తున్నావు. నిదానంగా కళ్ళు తెరుస్తున్నావు. ఇప్పుడు నేను సోనియా గాంధీని కాను. నువ్వు CWC సభ్యుడవి కాదు.. సభ్యుడవి కాదు. నువ్వొక సాధారణ పౌరుడివి." అన్నాడు సుబ్బు.

నిద్రలోంచి మెలకువ వచ్చినట్లు నిదానంగా కళ్ళు తెరిచాను. వెలుగు భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. ఎదురుగా నవ్వుతూ సుబ్బు.

ఇందాక ఏదో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఆఁ.. గుర్తొచ్చింది. రాష్ట్ర విభజన గూర్చి సుబ్బుతో చర్చిస్తున్నాను.

" సుబ్బూ! కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిట్టనిలువుగా చీల్చి చాలా తప్పు చేసింది." అన్నాను.

"అవునా? అయితే ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఒక్కటే! రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం చెయ్యడం. బెస్టాఫ్ లక్." అంటూ నవ్వుతూ గదిలోంచి నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Thursday 10 October 2013

తోక పేరు.. ఒక చల్లని నీడ



"హాయ్! ఐయాం ఫలానా చౌదరి. బాగున్నావా?" పొద్దున్నే ఫోన్లో ఒక లేడీ స్టోన్.

ఆశ్చర్యపొయ్యాను. ఈ లేడీ చౌదరి ఎవరబ్బా? నా PG రోజుల్లో 'చౌదరి' అనే తోకతో ఒక హర్యానా మనిషి ఉండేది. ఆవిడకి ఖచ్చితంగా తెలుగు రాదు. అందుకే నా పేరుని రకరకాలుగా పిలుస్తూ మూడేళ్ళపాటు నన్ను మానసిక అశాంతికి గురి చేసింది. ఇప్పుడు హర్యానాలోని రోహ్టక్ అనే ఊళ్ళో బిజీబిజీగా వైద్యం చేసుకుంటుంది. మరీ తెలుగు మాట్లాడే ఆడ చౌదరి ఎవరబ్బా?

"క్షమించాలి. నాకు మీరెవరో గుర్తు రావట్లేదు." అత్యంత వినయంగా అన్నాను.

'అతి వినయం ధూర్తలక్షణం' అన్నారు పెద్దలు. కాకపోతే ఇక్కడ నా వినయంలో ధూర్తత్వం ఏమాత్రం లేదని మనవి చేసుకుంటున్నాను. ఈ వినయం కేవలం ఒక ముందు జాగ్రత్త చర్య మాత్రమే. నాకు అపరిచిత ఆడవారితో ఫోన్లో మాట్లాడానికి గల భయానికో బలమైన కారణముంది.

గతంలో నాకో చేదు అనుభవం ఎదురైంది. కొన్నాళ్ళక్రితం నా స్నేహితుడొకడు అమెరికా నుండి అరుదెంచిన సందర్భంగా ఒక పార్టీ ఏర్పాటయ్యింది. ఆ పార్టీ విషయం చెప్పడానికి ఇంకో స్నేహితుడికి నంబర్లు నొక్కి ఫోన్ చేశాను.

'రాత్రి తొమ్మిదింటికల్లా ఫలానా హోటల్ కి వచ్చెయ్. కావాలంటే కారు పంపిస్తాను.' హడావుడిగా అన్నాను.

నా ఖర్మకాలి ఆ నంబర్ పొరబాటున ఇంకో నంబరుకి పోయింది. ఆ నంబర్ ఎవరో ఆడలేడీసుది. ఆవిడ నా హడావుడి ఆహ్వానానికి సమాధానం చెప్పకుండా 'ఏవండి' అంటూ ఒక మగజెంటుకి ఫోనందించింది.

ఆ మగజెంటు 'ఎవడ్రా నువ్వు నా పెళ్ళాన్ని హోటల్కి రమ్మంటున్నావ్?' అంటూ నన్ను దుర్భాషలాడ్డం మొదలెట్టాడు. పోలీస్ రిపోర్టిస్తానన్నాడు. పొరబాటుని క్షమించమని వేడుకుంటూ.. నేను ఫలానా అని చెప్పాను.

'డాక్టరైయ్యుండి ఇట్లాంటి పాడుపనులు చెయ్యడానికి సిగ్గులేదా?' అంటూ మళ్ళీ తిట్టాడు.

చివారకరికి పక్కనే ఉన్న నా భార్య మాట సాయంతో బయటపడ్డాను. ఆ రోజు నా భార్యే సాయం చెయ్యకపోతే నేనేమైపొయ్యేవాణ్ణోగదా అని ఇప్పటికీ అనుకుంటుంటాను (బహుశా 'మానసికి వైద్యుడి మనో వికారం' అంటూ మర్నాడు జిల్లా ఎడిషన్లోకెక్కేవాణ్ణేమో)!

ఈ భీభత్స సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. దీన్నే మానసిక వైద్య పరిభాషలో PTSD అని అందురు. ఈ కారణాన.. ఆనాటి నుండి ఫోన్ నంబర్లు నొక్కడం మానేశాను. అవతల్నుండి మాట్లాడేది ఆడ స్టోనయినట్లైతే అత్యంత జాగ్రత్తగా ఉందును.

"You idiot. I will kill you. నేను నీ క్లాస్మేట్ని. నన్నే మర్చిపొయ్యావా?" అంటూ ఆ చౌదరమ్మ తన maiden name చెప్పింది.

"నువ్వా తల్లీ! పేరు చివర 'చౌదరి' విని జడుసుకున్నాను." అంటూ కబుర్లలో పడ్డాను.

ఈవిధంగా నాకు కొన్నిసార్లు నా క్లాసమ్మాయిలతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ఇంటిపేరు మార్చేసుకున్నారు. కొందరికి పేరు చివర కులం పేరో, భర్త పేరో తగులుకుంది. మామూలుగానే నాకు తికమక.. ఇక ఈ కొత్తపేర్లు నా జ్ఞాపకశక్తికి పరీక్షలు పెట్టనారంభించాయి.

ఇప్పుడు నా చదువుకునేప్పటి ముచ్చటొకటి. మన ప్రాంతంలో రెడ్డి కులస్తుల్లో మగవారికి పేరు చివర్న 'రెడ్డి' అని ఉంటుంది (ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తమ పేరుకి ఈ 'రెడ్డి' తగిలిస్తున్నారనుకోండి). రెడ్లకి మాత్రమే ఉన్న ఈ ప్రత్యేక ప్రతిపత్తికి ఈర్ష్య చెందిన నా క్లాస్మేట్టొకడు తన పేరు చివర్న తన కులానికి చెందిన 'చౌదరి' అని తగిలించుకుని మిక్కిలి తృప్తినొందాడు. అక్కడతో ఆగాడా? లేదు. 'చౌదరి' చరణ్ సింగు కూడా తమ వాడేనని ప్రకటించుకున్నాడు.

'ఆ చౌదరి వేరురా నాయనా! చరణ్ సింగ్ ఉత్తర భారతీయుడు, జాట్ కులస్తుడు.' అంటే ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు.

'చరణ్ సింగ్ కొడుకు మా మేనత్త తోడుకోడలి మేనమామకి బావమరిది.' అంటూ ఏదో చుట్టరికం కూడా చెప్పేవాడు.

సరే! ఈ పోస్టు ఉద్దేశ్యం కులాల పేర్ల గూర్చి రాసి.. అట్టి పేర్లు గల చదువరుల మనోభావాలు దెబ్బతియ్యడం కాదు కాబట్టి అసలు విషయంలోకొస్తాను.

డబ్బున్నవాడు ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. ధనవంతులైన ఆడవారు విలువైన దుస్తులకి తోడుగా బరువైన ఆభరణాలు కూడా ధరిస్తారు. అంటే.. ఖరీదైన వేషధారణతో వాళ్ళు తమ ఆర్ధికస్థితి గూర్చి సమాజానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారని మనం అర్ధం చేసుకోవాలి. ఈ ప్రకటన వారికి ఆనందాన్నీ, తృప్తినీ కలిగిస్తూ ఉండి ఉండాలి. ఏదోక ప్రయోజనం లేకుండా మన ఉక్కపోత వాతావరణంలో ఎవరూ అంతగా ఇబ్బంది పడరు గదా!

ఈ మధ్య సమాజంలో అనేక రకాలైన విశ్వాసాలు చూస్తున్నాం. ఫలానా రంగురాళ్ళు మీ భవిష్యత్తునే మార్చేస్తాయ్. ఈశాన్యం పెంచి, ఆగ్నేయం తగ్గిస్తే పట్టిందల్లా బంగారమే. ఫలానా బాబాగారి ఉంగరం, తాయెత్తు ధరిస్తే అష్టైశ్వర్యాలు గ్యారెంటీ. మీ పేరులో ఒక అక్షరం పీకేసి, ఇంకో అక్షరం కలిపితే ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఈ రకమైన అదృష్టం, ఐశ్వర్యం కలిగించే వ్యాపారాలు మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్నాయ్. ఇవన్నీ నమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలు. ఆచరించేవారికి ఆత్మస్తైర్యం కలిగిస్తాయి.

ఈ లాజిక్ ని తోక పేర్ల విషయంలోకి తీసుకొద్దాం. నేను ఫలానా కులంలో పుట్టాను. ఇది నాకు మిక్కిలి గర్వకారణం. కావున ఆ కులం పేరుని తోకగా తగిలించుకుందును. ఫలానా మా ఇంటిపేరు చాలా గొప్పది. కావున ఆ ఇంటిపేరుతో నాపేరు రాసుకుందును. ఫలానావాడు భర్తగా దొరకడం నా అదృష్టం.. అంచేత అతనిపేరు నా పేరుకి తోకగా జత చేసుకుంటాను. వీరందరికీ ఇట్లాంటి పేరు తోకల్ని చేర్చుకోవడం వల్ల అమితమైన ఆనందం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మంచిదే కదా!


ఇలా కులం పేరుతోనో, భర్తల పేరుతోనో తోకలు ఉండొచ్చా? 'కూడదు' అంటూ సామాజిక కారణాలతో కొందరు వాదిస్తారు. ఈ కులం తొకలన్నీ ఇరవైయ్యేళ్ళల్లో మాయమైపోతాయని నా మిత్రుడు గోపరాజు రవి ముప్పయ్యేళ్ళ క్రితం బల్లగుద్ది వాదించేవాడు. అతనేమీ వీరబ్రహ్మేంద్రస్వామి కాదు. అంచేత ఈ ధోరణి తగ్గకపోగా.. మునుపటికన్నా ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇది ఒక సీరియస్ అంశం. అందుకే నేనీ పోస్టులో ఆ కోణం జోలికి పోవట్లేదు.

కొందరికి వారి కులం, వంశం, భర్త వగైరా వివరాలు తమ పేరు ద్వారా ప్రకటించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. చల్లని నీడలో సేద తీరినట్లుగా కూడా అనిపిస్తుంది. మంచిది. కాదనడానికి మనమెవరం? మతవిశ్వాసాలు, ఆర్ధిక స్థితుల ప్రకటనల్లో లేని అభ్యంతరం తోకపేర్ల విషయంలో ఎందుకుండాలి? ఈ ప్రపంచంలో అందరూ తమ ఆనందం కోసం తమకిష్టమైన పనులు మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు. ఈ సంగతి ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!  అనే పోస్టులో నొక్కి వక్కాణించాను. 

పేర్లు అనేవి గుర్తుల కోసం పెట్టుకునే XYZ లాంటివని నా అభిప్రాయం. అంతకుమించి వీటికి ప్రాధాన్యం లేదు. ఈ సంగతి పేరులోనే అంతా ఉంది  అని ఇంతకుముందు రాశాను. అందువల్ల పేర్లకి కొత్త తగిలింపులు, పొడిగింపులకి పవిత్రతా లేదు, అపవిత్రతా లేదు. ఇన్ని కబుర్లు చెబుతున్న నేనూ నాపేరు గూర్చి మధనపడ్డ సందర్భం ఉంది. ఆ విషయాన్ని నాదీ ఒక పేరేనా?! హ్మ్.. ! అంటూ ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను

ఇప్పుడు నా మనసు విప్పి ఒక రహస్యం చెప్పదలిచాను. 'రమణ' అన్న పేరుయందు నాకు అమితమైన అభిమానం. అందువల్ల ఆ పేరు కల పేషంట్లని కొద్దిగా ప్రత్యేకంగా చూస్తాను. చాలాసార్లు ఫీజులో రాయితీ కూడా ఇస్తాను. అయితే ఇలా ఒక పేరు వినంగాన్లే మదిలో వీణలు మోగడాన్ని నేను సూత్రరీత్యా వ్యతిరేకిస్తాను. భాష, ప్రాంతీయ దురభిమానాల వలే.. ఇదికూడా ఒక రోగమేమోనన్న అనుమానం నన్ను పీడిస్తుంది.

ఒకానొకప్పుడు నా పేరుకి ముందు నాకెంతో ఇష్టమైన నా జన్మస్థలం 'బ్రాడీపేట' తగిలించి ప్రఖ్యాతి నొందుదామని ఒక మాస్టర్ ప్లానేశాను. అంచేత నాపేరు 'బ్రాడీపేట రమణ'గా మార్చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. కొన్ని కొత్తవిషయాలు తెలిశాయి. మావూళ్ళో కొత్తపేట శివ, సంగడిగుంట శీను, చుట్టుగుంట సాంబ, కొరెటిపాడు ఉమా.. అంటూ ఆల్రెడీ పేట పేర్లని తమ పేర్లకి prefix గా చేసుకున్న ప్రముఖులు కొందరు ఉన్నార్ట. అయితే వీరందరూ A+ రౌడీషీటర్లుట! అందువల్ల నాపేరు మార్చుకుని వారి సరసన చేరే సాహసం చెయ్యలేక నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.

నా భార్య తన పేరు పదోతరగతి సర్టిఫికేట్లోని పేరునే కొనసాగిస్తుంది. ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. ఒకటి ఆవిడ నా పేరులోని ఎటువంటి శకలం అవసరం లేని అత్మవిశ్వాసి అయినా అయ్యుండాలి లేదా ఆవిడ దృష్టిలో నా పేరుకి అంత విలువైనా లేకుండా ఉండి ఉండాలి. నాపేరు నాకు విలువైనదే. కానీ నా భార్యకి కూడా విలువైనదై ఉండాలని రూలు లేదు. కారణం ఏదైతేనేం.. ఆవిడ నాపేరు జోలికి రాలేదు.

అంతే గదా? ఎక్కడైనా ఒకటి తరవాత సున్నాలకి విలువ ఉంటుంది గానీ.. ఒకటి ముందున్న సున్నాలకి విలువుండదు! ఇలా పైసా కూడా విలువ చెయ్యని పేరు కలవాడిని కాబట్టే.. కుళ్ళుబోత్తనంతో ఈ పోస్ట్ రాస్తున్నానని ఎవరైనా అనుకుంటే.. ఆ అనుకోడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను!

(photo courtesy : Google)