Thursday 23 July 2015

రాజకీయ నటనా శిల్పం


తెలీని విషయాల్ని అర్ధం చేసుకోడానికో పద్ధతుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలని క్రమపద్ధతిలో పేర్చుకుంటూ.. తద్వారా తెలీని విషయాల్ని అర్ధం చేసుకోవడం అనేది సులువైన పధ్ధతి. అంచేత నేనూ ఇదే ఫాలో అయిపోతుంటాను. అందుకే - చాలాసార్లు విషయాన్ని అర్ధం చేసుకోడానికి నాకు తెలిసిన నా సినిమా జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాను!

ఇప్పుడు కొంచెంసేపు సినిమాల గూర్చి -

తెర మీద కదిలే బొమ్మలు చూడ్డం తప్పించి కథ సరీగ్గా అర్ధం కాని దశలో.. ఒక సినిమాలో చనిపోయిన నటుడు ఇంకో సినిమాలోకి ఎలా వస్తాడో అర్ధమయ్యేది కాదు. ఈ దశలో 'పాండవ వనవాసం' చూశాను. ఎన్టీఆర్ గద తిప్పుతూ 'ధారుణి రాజ్యసంపద.. ' అంటు పద్యం మొదలెట్టంగాన్లే ఆవేశంతో ఊగిపొయ్యాను. సినిమా చూశాక.. ఎన్టీఆర్ ఎస్వీరంగారావులు శత్రువులనీ, పొరబాటున ఎదురు పడితే గదల్తో కొట్టుకుంటారని ఘాట్టిగా నమ్మాను. కొన్నాళ్ళకి 'గుండమ్మకథ' చూశాను. ఆశ్చర్యం - అందులో రంగారావు ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులు! ఈ సినిమాలన్నీ నిజం కాదనీ, దర్శకుడి సూచనలకి అనుగుణంగా నటులు నటిస్తారనీ కొన్నాళ్ళకి అర్ధమైంది.

సినిమాలకి సంబంధించిన నా అమాయకత్వం తొలగిపోయింది గానీ రాజకీయాల్లో మాత్రం కంటిన్యూ అయ్యింది. ఇందిరాగాంధీ మనకి ఎంతో మంచి చేస్తుందనీ, ఆమెనలా చెయ్యనీకుండా ఇతర నాయకులు అడ్డు పడుతున్నారనీ నమ్మాను. ఆ తరవాత ఇందిరాగాంధీ ఎవరో నాయకుడితో కబుర్లు చెబుతున్న ఫొటో చూసి ఆశ్చర్యపొయ్యాను. వీళ్ళు ఎదురు పడ్డప్పుడు తిట్టుకోవాలి గానీ - ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారేవిఁటి!? అటుతరవాత రాజకీయ నాయకుల మధ్య రాజకీయ విబేధాలే గానీ వ్యక్తిగత వైరాలు వుండవని అర్ధం చేసుకున్నాను. ఆ విధంగా నా రాజకీయ అమాయకత్వాన్నీ వదిలేసుకున్నాను.

నా సినిమాల, రాజకీయాల అమాయకత్వానికి కారణమేమి? ఇప్పుడీ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.

మానవ శరీరం నిర్మాణపరంగా ఒకే విధంగా వున్నా - మెదడు ప్రత్యేకమైనది. గుండె అందర్లో ఒకేరకంగా కొట్టుకుంటుంది. కాళ్ళూ చేతులూ ఒకేరకంగా పని చేస్తాయి. కానీ - మనిషి మేధస్సు, అవగాహన, ఆలోచనా విధానం ఒక్కోవ్యక్తికి ఒక్కోరకంగా వుంటుంది. ఒకడు ఒక స్త్రీని గౌరవించాలన్నా, ఇంకోడు అదే స్త్రీని రేప్ చేసి చంపాలన్నా - వారిద్దరికీ సిగ్నల్స్ ఇచ్చే నాడీవ్యవస్థకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మెదడులో వుంటుంది.

మానవుని ఆలోచింపజేసేదీ, నడిపించేదీ మేధస్సు. అయితే ఈ మేధస్సు ఎక్కువమందిలో తక్కువ స్థాయిలో, తక్కువ మందిలో ఎక్కువ స్థాయిలో వుంటుందని నా అభిప్రాయం. అంచేత - మెదడు ఏ విషయాన్నైనా నలుపు తెలుపులుగా చేసుకుని అర్ధం చేసుకోడానికి మొగ్గు చూపుతుంది (బహుశా మన్లాగే మన మెదడుకీ బద్దకమేమో). అంతేనా? మెదడు బోల్డంత వినోదాన్నీ కోరుకుంటుంది, అందుకోసం విషయాల్ని సింప్లిఫై చేసుకుంటుంది. ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్‌లో - 'మనం vs వాళ్ళు' అనే కాన్సెప్ట్ తయారవుతుంది.

ఇంకిప్పుడు మన ఆలోచనలు ఇలా మారిపోతాయి - 

నా దేశం vs వాడి దేశం, నా సంస్కృతి vs వాడి సంస్కృతి, నా మతం vs వాడి మతం, నా ప్రాంతం vs వాడి ప్రాంతం, నా కులం vs వాడి కులం, నా ఇల్లు vs వాడి ఇల్లు, నా పిల్లలు vs వాడి పిల్లలు.. ఇలా చాలా రాసుకుంటూ పోవచ్చు. అన్ని మంచి లక్షణాలు కుప్పపోసి 'నా'కి అప్లై అయితే, అన్ని చెడ్డలక్షణాలు గుంపగుత్తగా 'వాడి'కి అప్లై అవుతాయి.

భారత్ పాక్ సరిహద్దులో ఇరువర్గాల మధ్యా కాల్పులు ఏదోక స్థాయిలో జరుగుతూనే వుంటాయి. ఈ వార్త మన్దేశంలో ఇలా రిపోర్ట్ అవుతుంది - భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చి దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్ సైనికులు. ఎదురు కాల్పుల్తో ధీటుగా సమాధానం చెప్పిన మన వీరజవాన్లు. పాకిస్తాన్‌ లో కూడా ఇలాంటి వార్తే రాస్తారు, కాకపోతే అట్టు తిరగబడుతుంది - అంతే తేడా!

సైనికుల్ని ఉదాహరణగా చూసినంత సులభంగా రాజకీయాల్లోకి డివిజన్ చూడ్డం మెదడుకు కష్టం. ఎందుకంటే - ఇక్కడ నేను vs వాడు కూడా మనమే కనుక. కానీ - మెదడు ఇన్‌పుట్స్ రిసీవ్ చేసుకోడానికి ఏదోరకంగా డివిజన్ అవసరం. ఇప్పుడెలా!?

ఈ దేశంలో అనేక కులాలున్నాయి, సామాజిక అసమానతలున్నాయి. కాబట్టి కులాల్ని అధారంగా చేసుకుని పార్టీలు పుట్టుకొచ్చాయి. దక్షిణ భారతంలో బ్రాహ్మణ వ్యతిరేకతతో ద్రవిడ పార్టీ పుట్టుకొస్తే, ఉత్తర భారతంలో జాట్‌ల కోసం లోక్‌దళ్ పుట్టుకొచ్చింది. ఈ ప్రయోగాలు ఆయా ప్రాంతాల్లో విజయవంతం కావడంతో ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. పార్టీ మనది, మన కులానిది అంటూ అర్ధిక వనరులు సమకూర్చే స్థితిమంతులు (ఆఫ్ కోర్స్, అంతకి పదింతలు రిటర్న్స్ గ్యారెంటీ అనుకోండి).. మన కులం పార్టీ అంటూ గుడ్డిగా అభిమానించే సాధారణ కార్యకర్తలూ (వీళ్ళు మాత్రం అమాయకులు) ప్రాంతీయ పార్టీలకి బలం.

ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిద్దాం. ప్రాంతీయ పార్టీల్లాగా ఒక కులాన్నో, ప్రాంతాన్నో నమ్ముకుంటే కేంద్రంలో అధికారం దక్కదు. ఇంకా విశాలమైన ప్రాతిపదికతో ఓటర్లని రెండుగా విడగొట్టాలి. అప్పుడే పార్టీలకి తమకంటూ ఒక ఓటు బ్యాంక్ సృష్టింపబడుతుంది. అందువల్ల మెజారిటీ, మైనారిటీ రాజకీయ వాదాలు పుట్టుకొచ్చాయి.

ఒకవైపు రాజకీయ పక్షం మైనారిటీల హక్కులు రక్షిస్తామని హామీ గుప్పిస్తుంది. ఇంకో పక్షం మెజారిటీకి అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. ఇరు పక్షాలు ఎన్నికలప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని ఊదర కొడతారు. అటు మైనారిటీకి వాళ్ళు గానీ, ఇటు మెజారిటీకి వీళ్ళు గానీ ఏదీ చెయ్యరు! ఐదేళ్ళ పాటు ప్రజలు ఒక రాజకీయ పక్షాన్ని ఆశగా నమ్మి - ఆపై విసుగు చెంది, మరుసటి ఎన్నికలప్పుడు అవతలి రాజకీయ పక్షం వైపు మొగ్గుతారు. ఇదో seesaw battle.

ఇప్పుడు మళ్ళీ 'పాండవ వనవాసం'కి వద్దాం. భీముడికీ, ధుర్యోధనుడికీ పద్యాలు రాసింది ఒకరే, సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాలే. ఎన్టీఆర్ ఆవేశంతో తొడగొట్టినా, ఎస్వీఆర్ 'బానిసలు' అంటూ ఈసడించుకున్నా.. ఇద్దరూ కమలాకర కామేశ్వరరావు డైరక్షన్‌లోనే చేశారు. మిక్కిలినేని సావిత్రి చీర లాగలేదు, లాగినట్లు నటించాడు. లాగని చీర కోసం సావిత్రి ఎందుకంత తీవ్రంగా దుఃఖించింది? దీన్నే నటనా కౌశల ప్రదర్శన అందురు! అసహాయంతో గుమ్మడీ, వీరావేశంతో ఎన్టీఆర్, యారోగెన్స్‌తో ఎస్వీఆర్ మనని బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ వైపు నెట్టారు. అంచేత నేను పాండవుల పక్షం వహించి సినిమాని ఎంజాయ్ చేశాను. అందుకే సినిమా సూపర్ హిట్టైంది!

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - రాజకీయ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే. అవి అత్యంత తెలివిగా, జాగ్రత్తగా తమలో తాము విబేధాలు ఉన్నట్లుగా నటిస్తాయి. పార్లమెంటుని స్తంభింపజేసేందుకు మేచ్ ఫిక్సింగ్ కుట్రలు చేసుకుంటాయి. అవి సృష్టించిన - మనం vs వాళ్ళు అనే ట్రాప్‌లో పడిపోయి రెండుగా విడిపొయ్యి విమర్శించుకుంటాం. వాస్తవానికి ఇక్కడ మనం లేదు, వాళ్ళు లేదు! ఉన్నదల్లా సామాన్య ప్రజలు, వారి అవసరాలు, కష్టాలు మాత్రమే!

సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ మాత్రమే చాలెంజిలు చేసుకోవాలి, పద్యాలు పాడుకోవాలి. వాళ్ళ గోలలేవో వాళ్ళకున్నాయి. మధ్యలో ఏ విదురుడో, వికర్ణుడో దూరబోతే - ఇద్దరూ కలిసి పద్యాలు పాడ్డం కొద్దిసేపు ఆపుకుని, తమ గదల్తో వాళ్ళ బుర్ర రాంకీర్తన పాడించేస్తారు! అలాగే ప్రధాన రాజకీయ పక్షాలవాళ్ళు వారి రాజకీయం చేసుకుంటూ వుంటారు. మధ్యలో ఇంకెవరికీ అవకాశం రాకూడదు. ఎప్పుడైనా ఆ ప్రమాదమే వస్తే - ఇరు పక్షాలు ఏకమై ఆ మూడోవాడి పని పడతాయి - అదీ సంగతి!

అంకితం -

'రాబర్ట్ వద్రా ఇంకా జైలుకెళ్ళలేదేమిటి!?'
'అయోధ్యలో రాముడి గుడి ఇంకా మొదలెట్టలేదేమిటి!?'
ఇట్లాంటి ప్రశ్నలతో బుర్ర ఖరాబు చేసుకునే అమాయకులకి..   

(picture courtesy : Google)

Friday 17 July 2015

మనసు భారమైన సమయం..


కొన్ని సంఘటనలు మనసుని కలచివేస్తాయి. ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా మనసు మాట వినదు. రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయినవారి వారి మృతదేహాలు చూసినప్పట్నుండి మనసు గ్లూమీగా అయిపోయింది. పాపం - పిల్లలు, వృద్ధులు, ఆడవారు.. వాళ్ళేం పాపం చేశారు? కుసింత పుణ్యం మూట కట్టుకుందామని పుష్కర స్నానం కోసం పడిగాపులు కాశారు. ఇదేనా వాళ్ళు చేసిన నేరం?

వారి నుదుటిన అలా రాసిపెట్టుంది అంటూ ప్రవచనకారులు తమదైన వేదాంత ధోరణిలో విశ్లేషించవచ్చు. రాజకీయ నాయకులు రెండు పక్షాలుగా విడిపొయ్యి తిట్టుకోవచ్చు. కరుణా హృదయులు 'అయ్యో' అని జాలి చెందవచ్చును. ఎవరేది చేసినా.. ఈ వార్త కొన్ని రోజుల పాటు మాత్రమే వార్త! అటు తరవాత ఇంకో సంఘటన జరుగుతుంది. మనం ఇదంతా మర్చిపోతాం. 

మర్చిపోలేనిదీ, జీవితమంతా ఏడుస్తూ తల్చుకునేదీ ఆయా కుటుంబ సభ్యులే. చనిపోయినవారికి సివిక్ సెన్స్ లేదనీ, ఆత్రంగా తోసేసుకున్నారనీ ఏవేవో కథనాలు! ఆ రోజు నిజంగా ఏం జరిగిందో చనిపోయినవారొచ్చి సాక్ష్యం చెప్పరు, అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు నిజం చెప్పరు. 

చనిపోయినవారికి దుస్తులు తొలగిపోయున్నాయి. చెరుగ్గడల్లా నలిగిపొయ్యి చాలా ఆక్వర్డ్ పొజిషన్లో పడున్నారు. ఆ దురదృష్టవంతుల ఫొటోలు అదేపనిగా అన్నిసార్లు చూపించడం ఏ రకమైన న్యూస్ రిపోర్టింగ్? బ్రతికున్నవాళ్ళకి గౌరవం ఎలాగూ ఇవ్వం, కనీసం విగత జీవుల పట్లనైనా మనకి గౌరవం వుండనక్కర్లేదా!

ఇసుకకి విలువుంది, కందిపప్పుకి విలువుంది.. ఏ విలువా లేనిది సామాన్యుల ప్రాణానికేనా! తిండి లేక చస్తాం, దోమ కుట్టి చస్తాం, ఎండలకి మాడి చస్తాం, వరదలకి కొట్టుకుపోతాం, రోడ్డు దాటుతూ చస్తాం, పంట పండక చస్తాం. ఇప్పుడు స్నానం చెయ్యడానికి వెళ్ళి చస్తున్నాం! మనం ఎక్కడున్నా, ఏం చేసినా.. అసలేం చెయ్యకపోయినా చావు మాత్రం వెతుక్కుంటూ వస్తూనే వుంటుంది.

దైన్యంగా బ్రతకడాన్ని కుక్క బ్రతుకు అంటారు, హీనంగా చావడాన్ని కుక్కచావు అంటారు. కుక్కలకి కడుపు నింపుకోవడం, బద్దకంగా పడుకోవడం తప్పించి పెద్దగా ఆశలున్నట్లు తోచదు. అంచేత - ఆశానిరాశల్లేని కుక్కలన్నీ మనని చూసి జాలిపడుతున్నాయని నా అనుమానం!  

ఓయీ అజ్ఞానాధమా! అధిక ప్రసంగం కట్టిపెట్టు. ఈ చావులన్నీ లలాట లిఖితము! ఎంతటివారైనా సరే - పూర్వజన్మలో చేసిన పాపపుణ్యముల ఫలితము అనుభవించక తప్పదు. తుచ్చమైన ప్రాణముల గూర్చి కలత చెందక దైవాన్ని మరింతగా ప్రార్ధింపుము, కనీసం వొచ్చే జన్మలోనైనా నువ్వు ఈర్ష్య చెందుతున్న ఆ కుక్కగా జన్మించగలవు!   

(picture courtesy : Google)

Thursday 16 July 2015

గాయకుడు రామకృష్ణ


కాలం గడియారం ముల్లులా నిదానంగా, నిరంతరంగా తన పని తను చేసుకుపోతుంటుంది. పుట్టేవాళ్ళు పుడుతుంటే పొయ్యేవాళ్ళు పోతుంటారు. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, అసలు గొప్పవాళ్ళే కాకపోయినా కాలమహిమకి తలొంచక తప్పదు. మన రాజకీయ నాయకులకి లేకపోయినా కాలానికి మాత్రం గొప్ప డెమోక్రటిక్ స్పిరిట్ వుందని భావిస్తున్నాను.

గాయకుడు రామకృష్ణ మరణించాడు. ఆయన సినిమాల్లో పాడి చాలా కాలమే అయింది. సినిమా రంగం విచిత్రమైంది. ఇక్కడ ఎవరు ఎందుకు ఎంతకాలం సక్సస్‌ఫుల్‌గా వుంటారో తెలీదు. రామకృష్ణ కెరీర్ మొదలవడం మాత్రం చాలా ప్రామిసింగ్‌గా మొదలైంది. అందుకు ఆయనకి సమయం కూడా అనుకూలించింది. ఘంటసాల తన అనారోగ్యం వల్ల పాటలు తగ్గించుకున్న సమయంలో సినిమావాళ్ళకి అచ్చు ఘంటసాలని అనుకరించే రామకృష్ణ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. 

ఆనాడు సినిమాల్లో రామారావు, నాగేశ్వరరావులది అగ్రస్థానం. కృష్ణ, శోభన్‌బాబులది తరవాత స్థానం. ఎప్పుడైనా అగ్రనటులకి పని చేసినవారిదే టాప్ బిల్లింగ్. అలా రామకృష్ణ సినిమా రంగం ఎంట్రీనే టాప్ గేర్‌లో మొదలైంది. మరి ఆ తరవాత ఏం జరిగిందో తెలీదు గానీ.. వెనకపడ్డాడు, బాగా వెనకపడ్డాడు. ఆ తరవాత కొన్నాళ్ళకి కచేరీల్లో మాత్రమే పాడాడు. సినిమాల్లో కెరీర్ అప్ అండ్ డౌన్‌లు సహజం. కానీ రామకృష్ణ మాత్రం మళ్ళీ కోలుకోలేకపొయ్యాడు. 

ఎప్పుడైనా ఒక అగ్రస్థాయి గాయకుడిని మక్కికిమక్కిగా అనుకరిస్తూ లాంగ్ కెరీర్ నిర్మించుకోవడం కష్టం, అసాధ్యమేమో కూడా. ఈ విషయం రఫీ, ముకేశ్, కిశోర్‌లని అనుకరిస్తూ తొందరగా లైంలైట్‌లోకి వచ్చినా.. అర్జంటుగా ఫేడౌట్ అయిన అనుకరణ గాయకులని గమనిస్తే అర్ధమవుతుంది. 

సరే! రామకృష్ణ గొప్ప గాయకుడా? అయితే ఎంత గొప్ప గాయకుడు? లాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం వుండదు. ఎందుకంటే ఇక్కడ నేన్రాస్తుంది గాయకుడు రామకృష్ణ గూర్చి నా ఆలోచనలు, జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి.

రామకృష్ణా! మీరు మంచి గాయకులు. మీరు పాడిన పాటలు విని నేను ఆనందించాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతానికి గురువు ఘంటసాల గారితో కబుర్లు చెప్పుకోండి. నేనక్కడికి వచ్చినప్పుడు మీ గాయకులందర్నీ ఒకచేట చేర్చి పసందైన జుగల్‌బందీ ఎరేంజ్ చేస్తాన్లే!

(picture courtesy : Google)

Saturday 11 July 2015

ఒమర్ షరీఫ్


ఒమర్ షరీఫ్ చనిపొయ్యాడు. ఆయన కొన్నాళ్ళుగా ఆల్జైమర్స్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నాట్ట. కాబట్టి ఆయనకి తను చనిపోతున్నానని తెలిసుండకపోవచ్చు. చనిపోవడం కన్నా చనిపోతున్నామన్న ఆలోచనే భయం కలిగిస్తుంది. ఈ భయమేమి లేకుండా హాయిగా చనిపోయిన ఒమర్ షరీఫ్ అదృష్టాన్ని అభినందిస్తున్నాను.  

ఒమర్ షరీఫ్ నాకు చిన్నప్పుడే తెలుసునని చెప్పడానికి మిక్కిలి గర్విస్తున్నాను. అవి బెజవాడలో ఊర్వశి సినిమా హాల్ కొత్తగా కట్టించిన రోజులు. నాన్న, మావయ్య, అన్న సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. సినిమా ప్రోగ్రాంలని పసిగట్టడంలో నేను కుక్కలాంటివాణ్ని. వాళ్ళు బయల్దేరే సమయానికి ప్రోగ్రాంలోకి నేనూ దూరిపోయ్యాను, బెజవాడ బండెక్కాను. సినిమా పేరు 'మెకన్నాస్ గోల్డ్'. 

నాకప్పటికి 70 mm సినిమా తెలీదు. ఆ పెద్ద తెర చూసి నోరెళ్ళబెట్టాను. సినిమా మొదట్లో వచ్చే గ్రెగరీ పెక్ షూటింగ్ సీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్.. వేరే లోకంలో ఉన్నట్లుగా అనిపించింది. విలన్ ఒమర్ షరీఫ్ మన తెలుగు హీరోల కన్నా బాగున్నాడు. ఇంటర్మిషన్‌లో కొనుక్కున్న సమోసా సినిమా కన్నా బాగుంది. ఆ రోజుల్లో మా గుంటూరుకి బెజవాడ అమెరికా కన్నా దూరం! స్నేహితులకి మెకన్నాస్ గోల్డ్ సినిమా కథని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సహా చెప్పేవాణ్ని, వాళ్ళు నోరు తెరుచుకుని వినేవాళ్ళు. 

ఒమర్ షరీఫ్ ఈజిప్ట్ దేశం వాడనీ, గొప్ప నటుడనీ, బ్రిడ్జ్ చక్కగా ఆడతాడనీ.. ఇలాంటి విశేషాలు ఆ తరవాత తెలిశాయి. ఆంగ్ల సినిమాల గూర్చి అపారమైన జ్ఞానం కలిగున్న నా మిత్రుడొకడు పీటర్ ఒటూల్ అభిమాని. అతగాడు 'లారన్స్ ఆఫ్ అరేబియా' గూర్చి అనేకమార్లు చెప్పినందున ఆ సినిమా చూశాను. నాకు 'లారన్స్ ఆఫ్ అరేబియా' ఒమర్ షరీఫ్ కన్నా 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫే నచ్చాడు - నాది చౌకబారు టేస్ట్ అయ్యుండటం ఒక కారణం కావచ్చు! 

ఆ తరవాత బెజవాడ 'మేనక'లో చెంగిజ్ ఖాన్ చూశాను. పోస్టర్లో సినిమా పేరు జెంగిస్ ఖాన్! ఈ పేరులో వున్న తికమకే సినిమాలోనూ వుంది. ఒమర్ షరీఫ్ ఎంత గొప్ప నటుడో 'డాక్టర్ జివాగో' చూస్తే తెలుస్తుంది అంటారు. నేను చూళ్ళేదు కాబట్టి తెలీదు. కానీ 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫ్ మాత్రం నా బుర్రలో తిష్ట వేసుకుపొయ్యాడు. ఆ చురుకైన కళ్ళు, సూటి ముక్కు.. ఒమర్ షరీఫ్ ముఖం నటనకి అనుకూలంగా వుంటుంది. అందుకే అతగాడు క్షణకాలంలో హావభావాలు మార్చెయ్యగలడు. 

మనుషులు శాశ్వతం కాదు. పుట్టిన వాడు గిట్టక మానడని భగద్గీతలో శ్రీకృష్ణులవారు సెలవిచ్చారు. తదనుగుణంగా ఒమర్ షరీఫ్ కూడా చనిపొయ్యాడు. ఆ సందర్భాన ఇలా ఓ నాలుగు ముక్కలు రాశాను. ఒమర్ షరీఫ్! ఎక్కడో ఈజిప్టులో పుట్టి అమెరికాలో నటించి బెజవాడలో కనిపించిన నీకు గుంటూరు నుండి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, గైకొనుము!  

(picture courtesy : Google)

Thursday 9 July 2015

చిత్తప్రసాద్

కళాకారులు - రాసేవాళ్ళు, గీసేవాళ్ళు, పాడేవాళ్ళు అంటూ అనేక రకాలుగా వుంటారు. అందులో మళ్ళీ పాలక పక్షం, మధ్యతరగతి పక్షం, ప్రజల పక్షం అంటూ అనేక తరగతులుగా విడిపోయ్యుంటారు. కొందరి ప్రస్తానం ప్రజాకళాకారులుగా మొదలై కాసులకి, కీర్తికి లొంగిపొయ్యి పాలక పక్షంలోకి మారిపోతారు. వీరిని 'ఉభయచర జీవులు' అంటారని ఓ సందర్భంలో రంగనాయకమ్మ వెక్కిరించగా చదివాను, మిక్కిలి సంతసించాను. 

పాలకుల ప్రాపకం (ఒకప్పుడు రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు) సంపాదించి తమ విద్యని వారికి దాసోహం చేసి, వారిని వేనోళ్ళ కీర్తిస్తూ బాగుపడే కళాకారులని 'పాలక వర్గ కళాకారులు' అంటారు. కోడికి ఈకల్లాగా, పందికి బురదలాగా వారికి ప్రభుత్వంవారి అవార్డులు, రివార్డులు మిక్కిలి శోభనిస్తాయి! వీరిని 'బ్రతకనేర్చిన కళాకారులు' అనికూడా అనవచ్చును. 

మధ్యతరగతి ఆలోచనలకి అందంగా,  ఆహ్లాదంగా, చతురంగా ప్రెజెంట్ చేసేవారిని 'మధ్యతరగతి కళాకారులు' అంటారు. వీరినే 'ఉబుసుపోని కళాకారులు' అని కూడా అనవచ్చు. ఈ జాతివారు స్త్రీలని చారడేసి కళ్ళతో ఆరడుగుల చీరకట్టుతో అందంగా, వయ్యారంగా చూపిస్తారు. పెద్ద వాక్యాన్ని ముక్కలుగా నరికేస్తూ తల్లి మీదా, పిల్లి మీదా 'హృదయం పిండేలా' పాడతారు. ప్రవాస భారతీయుల సాంస్కృతిక సంస్థల్లో లాబీయింగ్ చేయగలగడం వీరికి గల అదనపు అర్హత (ఎచట డబ్బులుండునో అచటనే కళలూ రాణించును). 

ఇక చివరిగా - ప్రజల పక్షం నిలబడిన కళాకారులు. వీరిని 'ప్రజా కళాకారులు' అనవచ్చు. అభివృద్ధికి దూరంగా సమాజపు అడుగున వున్నవారి సమస్యల్ని, కష్టాల్ని ప్రపంచ దృష్టికి వచ్చేలా ఎంతగానో కృషి చేస్తారు. వీరు కళ కళ కోసం కాదు, ప్రజల కోసం మాత్రమేనని ఘాట్టిగా నమ్మినవారు. అయితే - వీరు నమ్ముకున్న ప్రజలు గోచీ పాతర రాయుళ్లైనందున వీరూ దరిద్రులుగానే మిగిలిపోతుంటారు.  

ఇదంతా ఎందుకు రాశానంటే -

ప్రజాకళాకారులకి అసలు సిసలు ప్రతినిథి చిత్రకారుడు చిత్తప్రసాద్. ఆయన చిత్రాలకి ముడిసరుకు అట్టడుగు వర్గాల ప్రజల జీవనమే. చిత్తప్రసాద్ గీసిన ఏ బొమ్మైనా మనకిదే చెబుతుంది. ఆ చిత్రాల్లో ఆయా వర్గాల వేదనా, కసి స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. 

నాకు చిత్రలేఖనంలో సాంకేతిక అంశాలు తెలీదు. కానీ - ఒక బొమ్మ ఎవరికోసం గీయబడిందో, ఎందుకు గీయబడిందో స్పష్టంగా గుర్తు పట్టగలను. నాకు చిత్తప్రసాద్ బొమ్మల్లో జీవితం కనిపిస్తుంది, మండే గుండెని చీల్చేసే చురకత్తుల వాడితనం కనిపిస్తుంది. అందుకే చాలాసార్లు ఆ బొమ్మల వైపు అలానే చూస్తుండిపోతాను. 

సరే! చిత్తప్రసాద్ దరిద్రంలో దరిద్రంగా బ్రతికాడు. ఎందఱో ప్రజా కళాకారులకి మల్లె చిత్తప్రసాద్ కూడా అనామకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపొయ్యాడు. ఈ సంగతి నేను ప్రత్యేకంగా రాయనవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు ప్రజల మనుషుల జీవితాలు దుర్భరంగానే ముగుస్తాయి. 

చిత్తప్రసాద్! మీ పట్టుదలకీ, ప్రతిభకీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హేట్సాఫ్ టు యు! 


(pictures courtesy : Google)

Tuesday 7 July 2015

హేమమాలిని! గెట్ వెల్ సూన్!

హేమమాలిని నా అభిమాన నటి. అసలు హేమమాలినిని నటి అనవచ్చునా? ఎందుకంటే నాకు తెలిసి ఆమె ఎప్పుడూ నటించలేదు, నటించడానికి ప్రయత్నించనూ లేదు. తన వీక్ పాయింట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించువారే విజ్ఞులు. హేమమాలిని విజ్ఞురాలు. అందుకనే - ఏ సినిమాలోనూ నటించకుండా సాధ్యమైనంత ఎక్కువ అందంగా వుండటానికి ప్రయత్నించింది. అయినా కూడా హేమమాలిని నా అభిమాన నటి అని గర్వంగా ప్రకటించుకుంటున్నాను. 

నాల్రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంటు ద్వారా హేమమాలిని మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయింది. యాక్సిడెంట్ తరవాత గాయపడిన వారిని వారి చావుకి వదిలేసి ఆమె మాత్రమే వేరే కార్లో హడావుడిగా ఆస్పత్రికి వెళ్లిపోవడం సరి కాదని విమర్శకుల అభిప్రాయం. సరే! ఒప్పుకుంటున్నాను. కానీ మేధావులందరూ కట్ట గట్టుకుని హేమమాలి ఏటిట్యూడ్‌ని చెండుకు తిండం నాకు బాధగా వుంది. ఎంతైనా నేనామెకు అభిమానిని కదా. నా డ్రీమ్ గాళ్ కష్టాల్లో వున్నప్పుడు ఆమెని సమర్ధిస్తూ నాలుగు ముక్కలు రాయడం నా బాధ్యతగా భావించి ఈ పోస్ట్ రాస్తున్నాను.  

దక్షిణ భారద్దేశాన్ని ఇడ్లీ సాంబార్ ల్యాండ్‌గా మాత్రమే చూసే హిందీ వాళ్ళతో నెగ్గుకు రావడం అంత తేలిక కాదు. అట్లాంటి హిందీ సినిమా రంగంలో చాలా తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి చేరుకుంది హేమమాలిని. ఇందుకు హేమమాలినిని అభినందిస్తున్నాను. ఆ తరవాత ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనాదిగా అందమైన సినిమా హీరోయిన్లు పెళ్లై పిల్లలున్నవారినే ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. సరే! ఇది ఆయా నటీమణుల వ్యక్తిగత వ్యవహారం కనుక ఇంతటితో ఈ విషయం వదిలేస్తాను.

ఒకప్పుడు సినిమా నటులు సినిమాల్లో, రాజకీయ నాయకులు రాజకీయాల్లో వుండేవాళ్ళు(ట)! గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ దెబ్బ తినడం చేత ఎన్నికల సమయంలో పాపులారిటీ వున్న సినిమా నటులకి టిక్కెట్లిచ్చి గెలిపించుకోవడం మొదలైంది. సినిమా వాళ్ళు ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున నిలబడతారు. గెలిచినా ఓడినా వీరికి పెద్దగా రాజకీయ జ్ఞానం వుండదు. అందరూ గొప్ప జ్ఞానవంతులైతే ప్రపంచం పరమ బోరుగా వుంటుంది. ఎప్పుడైనా అజ్ఞానమే ముచ్చటగా వుంటుంది!

పుచ్చలపల్లి సుందరయ్య వంటి పార్లమెంటేరియన్లు సైకిల్ తొక్కేవారని విన్నాను. ఇవ్వాళ సైకిల్ తొక్కేవాళ్ళకి వోటు హక్కు మాత్రమే మిగిలింది. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఎన్నికల సమయంలో టికెట్ కొనుక్కుంటున్నారు. సెలబ్రిటీలు వారి గెలుపు అవకాశల బట్టి టికెట్ పొందుతున్నారు. ప్రజల సమస్యల గూర్చి వీరెవ్వరికి అవగాహన వుండదు. వీరికా జ్ఞానం వుండాలని ఆయా రాజకీయ పార్టీలూ అనుకోవట్లేదు. ఆ పార్టీల నాయకత్వానికి కావాల్సింది విప్ జారీ చేసినప్పుడు బుద్ధిగా ఓటేసే అజ్ఞాన ప్రజా ప్రతినిథులు మాత్రమే.

టూకీగా చెప్పాలంటే వీళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలుగా కాకముందు ఫైవ్ స్టార్ మనుషులు. ఎన్నికల్లో గెల్చినంత మాత్రానికే రాత్రికి రాత్రి ప్రజల మనుషులుగా ఎలా మారిపోతారు? మరప్పుడు హేమమాలిని ఒక ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వుండాలని ఎందుకు ఆశిస్తున్నారు!? సోషల్ మీడియా మేధావులు నా అభిమాన నటి గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఎంపీ అయ్యిందని నమ్ముతున్నారా!?

ఒక కారు ఇంకో కారుతో గుద్దుకుంది. ఇదసలు విషయం కాదు. ఒక బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దింది. ఇదీ అసలు విషయం! భారద్దేశంలో బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దుకుంటే ఏమవుతుందో - భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హసన్ వంటి అమాయకులకి తప్ప అందరికీ తెలుసు. స్పీడుగా వెళ్ళే మన మంత్రిగార్ల కాన్వాయ్ గుద్దుకుని ఎంతమందికి దెబ్బలు తగల్లేదు? నాకు తెలిసి ఏ మంత్రిగారూ పన్లాపుకుని బాధితుల్ని ఆస్పత్రికి తీసుకెళ్ళిన సందర్భం లేదు. మరి - హేమమాలిని విషయంలోనే ఎందుకింత పట్టింపు!?

రామచిలక అందంగా వుందని వెండి సింహాసనంపై కూర్చుండబెట్టాం. తన అందచందాలతో మన మనసుని ఆనంద పరచడమే దానికి తెలిసిన విద్య. ఇవ్వాళ అవసరం పడిందని రామచిలకని కోయిలలా పాట పాడాలని కోరుకోవడం సబబా? అది రామచిలక పని కాదు గదా? అంచేత - ఒక చిన్నపిల్ల చనిపోయిందనే బాధ తగుమాత్రంగా మాత్రమే పడి, అందమైన హేమమాలిని మొహంపై గాట్లేమైనా పడ్డాయేమోనని కలత చెందుదాం! వ్యధ చెందుదాం!

హేమమాలిని! గెట్ వెల్ సూన్!

చివరి తోక -

హేమమాలినిపై 'పని లేక.. ' బ్లాగులో 'హేమమాలిని! బెస్టాఫ్ లక్' అంటూ ఒక పోస్టు రాశాను. ఓపిక వున్నవాళ్ళు చదువుకోవచ్చు.

(picture courtesy : Google) 

Friday 3 July 2015

పంచాగ్ని


జీవితం చిత్రమైంది. ఒక్కోదశలో ఒక్కోఅనుభవం హాయిగా వుంటుంది. ఆ తరవాత కొన్నాళ్ళకి అదే అనుభవం చిరాగ్గా కూడా వుండొచ్చు. ఒకప్పుడు నాకు స్నేహితుల్తో కలిసి సినిమా చూడ్డం అనేది గొప్ప అనుభవం. చదువైపొయ్యాక స్నేహితులు తలోదిక్కూ వెళ్ళిపొయ్యారు. ఆ తరవాత సినిమాలు చూడ్డానికి ప్రయత్నించాను గానీ - నా వల్ల కాలేదు. హఠాత్తుగా తెలుగు సినిమాస్థాయి దిగజారిందా? లేక స్నేహితుల్తో చెత్తసినిమాల్ని కూడా సరదాగా చూసేశానా?

ఒకానొకప్పుడు ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే దూరదర్శన్ మాత్రమే వుండేది. దూరదర్శన్‌వాళ్ళు ఎవార్డ్ పొందిన ప్రాంతీయ చిత్రాల్ని ప్రసారం చేసేవాళ్ళు (ప్రభుత్వం అప్పుడప్పుడు మంచిపన్లూ చేస్తుంటుంది). ఆవిధంగా ఒకానొక ఆదివారం మధ్యాహ్నం యాక్సిడెంటల్‌గా ఒక మళయాళం సినిమా చూశాను. సినిమా పేరు 'పంచాగ్ని'.

కథలో ప్రధాన పాత్ర ఇందిర, నక్సలైట్ పార్టీ కార్యకర్త. ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ సెంటెన్స్‌కి తెలుగులో ఇంతకన్నా తేలిక పదం వుంటే బాగుణ్ను) అనుభవిస్తున్న ఖైదీ. ఆవిడ కొన్నాళ్ళకి పెరోల్‌పై బయటకొస్తుంది (ఖైదీలకి సెలవలుంటాయని అప్పటిదాకా నాకు తెలీదు). ఈమధ్య కాలంలో బయటి ప్రపంచం చాలా మారింది, మానవ విలువలూ మారాయి. ఈ మారిన మనుషుల్తో ఇందిర అనుభవాల సమాహారమే ఈ కథ. సినిమా చివర్లో ఇందిర ఇంకో హత్య చేసి మళ్ళీ జైలుకెళ్తుంది. కథకి లింక్ ఇస్తున్నాను, ఓపిక వున్నవాళ్ళు చదూకోవచ్చు.

నాకు ADHD వుందేమోనని నా అనుమానం. ఏ సినిమానైనా మరీ బాగుంటే గానీ కుదురుగా కూర్చొని చూళ్ళేను. 'కొద్దిసేపు చూద్దాంలే' అనుకున్న నన్ను ఈ సినిమా రెండు గంటల పైగా తనతో వుంచేసుకుంది. నన్నిలా తనతో వుంచేసుకునే ఏ సినిమా అయినా మంచి సినిమా అని నా నమ్మకం. అట్లాంటి మంచి సినిమా తీసిన వాడే మంచి దర్శకుడు. తీసినవాడు అకిరా కురసోవా అవ్వచ్చు లేదా సత్యజిత్ రే అవ్వచ్చు - ఎవరికైనా సరే! ఇదే సూత్రం వర్తిస్తుంది.

అటు తరవాత కొన్నాళ్ళకి పీజిలో చేరాను. అక్కడ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ నిండా మలయాళీలు! నా సీనియర్ పి.ఎస్.శశిధరన్ (శశి) నాకు సన్నిహితుడయ్యాడు. శశి ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు, తక్కువగా మాట్లాడతాడు. ఓసారి శశితో 'పంచాగ్ని' సంగతి ప్రస్తావించాను. శశి తన భీభత్సమైన మలయాళీ యాసతో సినిమా రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ (MT) గూర్చి యెన్నో వివరాలు చెప్పాడు. అటు తరవాత శశితో కలిసి ఒకట్రెండు మలయాళీ సినిమాలు చూశాను. ఆ సినిమాలేంటో గుర్తు లేవు కానీ - రెండూ మోహన్‌లాల్ సినిమాలే అన్న విషయం మాత్రం గుర్తుంది.

ఎప్పుడో చూసిన సినిమాని గుర్తు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది (నాకింకా డిమెన్షియా రాలేదన్న సంతోషం కూడా ఇంకో కారణం కావచ్చు). నాకు కొన్నివిషయాలు నచ్చుతయ్, ఇంకొన్ని నచ్చవు. నచ్చేవి నచ్చనివీ కాలానుగతంగా interchangeable. 'అందరికీ ఇంతేనా? నా వొక్కడికి మాత్రమేనా?' అన్నది తెలీదు.

ఇవ్వాళ నేను 'పంచాగ్ని' సినిమాని మొత్తం చూడగలనా? చూసినా సినిమా మళ్ళీ నచ్చుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం నాదగ్గర లేదు. ఒకానొకప్పుడు నాకీ సినిమా నచ్చిందని గుర్తు చేసుకోవడమే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. కావున -  ఈ పోస్ట్ చదివి పంచాగ్ని సినిమా చూసి.. సినిమా బాలేదనీ, అనవసరంగా సమయం వృధా అయిందనీ ఎవరైనా చింతించిన యెడల - వారికి (ముందుగానే) నా సానుభూతి తెలియ జేసుకుంటున్నాను (ఇది మాత్రం కచ్చితంగా disclaimer).

ముగింపు -

నే చదూకునే రోజుల్లో మళయాళీ బూతు సినిమాలు కృష్ణ సినిమాల కన్నా స్పీడుగా ఠపీఠపీమంటూ వచ్చేవి. రతినిర్వేదం, సత్రంలో ఒక రాత్రి.. ఇలా టైటిల్స్‌తోనే కుర్రకారుని కిర్రెక్కించేవి. ఈ సినిమాలకి మా గుంటూరు రంగమహల్ నూన్ షోలతో నిలయంగా వుండేది. బయట ఎర్రని ఎండవల్లనూ, లోపల వేడి నిట్టూర్పులవల్లనూ - వాతావరణం భగభగా మండిపొయ్యేది!

నా ఆత్మీయ మిత్రుడొకడు బట్టలు తక్కువగానున్న స్త్రీల యెడల మిక్కిలి ఆసక్తి కలిగుండేవాడు. అంచేత రంగమహల్ అతగాడి కేరాఫ్ అడ్రెస్‌గా విలసిల్లేది! ఏ సినిమాలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు 'గిట్టుబాటు సీన్లు' వుండేవో అతనికి కొట్టిన పిండి, దంచిన కారం. ఓసారి 'పంచాగ్ని చూశావా?' అనడిగాను. క్షణకాలం ఆలోచించి 'కామాగ్ని చూశాను. పంచాగ్ని చూళ్ళేదు' అని చెప్పాడు!