Showing posts with label ఎన్టీఆర్. Show all posts
Showing posts with label ఎన్టీఆర్. Show all posts

Saturday, 28 March 2015

నేడు శ్రీరామనవమి - 'థాంక్స్ టు ఎన్టీఆర్'


చదువు వల్ల జ్ఞానం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ సుఖమయ జీవనం మాత్రం వస్తుంది. యెప్పుడైతే చదువుకోవడం అవసరమైపోతుందో అందుక్కావలసిన సరంజామా సమకూర్చుకోక తప్పదు, యిందులో ముఖ్యమైనది దేవుడి దయ. యీ అవసరార్ధం నాకు చిన్నప్పుడు దేవుళ్లకి మొక్కడం బాగా అలవాటు.

నేను తొమ్మిదో క్లాసులో వుండగా ఆ దేవుడికే పరీక్షాసమయం వచ్చింది. వున్నట్లుండి చదువులో నాకో గట్టి పోటీదారుడు తగిలాడు. అతగాడు నాకన్నా నాలుగైదు మార్కులు యెక్కువ తెచ్చుకుంటూ నన్ను రెండో స్థానానికి నెట్టెయ్యసాగాడు. వెంటనే - మిలిట్రీవాడు ఫిరంగుల్ని దించినట్లు మరింతమంది దేవుళ్లని రంగంలోకి దించాను.

ఒక్కోవారం ఒక్కో దేవుడు. కుంకుడు రసంతో శుచిగా తలంటుకుని అనేక గుళ్లకెళ్లి కొబ్బరికాయలు కొట్టాను. యెగిరెగిరి (అప్పుడు నాకు గుడిగంటలు సరీగ్గా అందేవికావు) గంటలు మోగించాను. ధ్వజస్తంభాల ముందు మోకరిల్లాను. రోజూ స్వచ్చమైన, నిర్మలమైన, పవిత్రమైన మనసుతో పదేపదే 'స్వామీ! నాకే ఎక్కువ మార్కులొచ్చేట్లు చూడు!' అనే మంత్రాన్ని ఉచ్చరించాను. అప్పుడప్పుడు - 'దేవుళ్లూ! మీరు నా కోరిక తీర్చకపోతే నాకు మీ ఉనికి మీద నమ్మకం పోతుంది, మీ భక్తుణ్ని సంరక్షించుకోండి!' అనే హెచ్చరికలూ జారీ చేశాను!

ఈ విధంగా మనసంతా దేవుళ్లనే నింపుకుని మిక్కిలి పరిశుద్ధాత్మతో, పరిపూర్ణ శ్రద్ధాశక్తులతో పరీక్షలు వ్రాసితిని. యింత ఘోరమైన, కఠోరమైన నిష్టతో పరీక్షలెన్ని రాసినా మార్కులు మాత్రం పెరగట్లేదు. క్లాసులో నా రెండోస్థానం గోడక్కొట్టిన పిడకలా అలా స్థిరపడిపోయింది.

కొన్నాళ్లపాటు తీవ్రంగా ఆలోచించిన మీదట నాకో సత్యం బోధపడింది.

'దేవుడు వున్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ వున్నా - ఆ దేవుడికి నాకు సహాయం చేసే ఉద్దేశం లేదు! నాకు సహాయం చెయ్యని ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే మాత్రం నాకెందుకు?' 

ఈ జ్ఞానోదయం అయ్యాక, ఆనాటి నుండి దేవుణ్ని పట్టించుకోవటం మానేశాను!

ఇవ్వాళ శ్రీరామనవమి. జీవితమంతా పరీక్షల్లో మార్కుల కోసమే చదివిన నాకు చాలా విషయాలు తెలీదు. ఇలా తెలీని వాటిల్లో రామయణం వొకటి. రాముడి భార్య సీత. భార్యని అనుమానించిన రాముడు తమ్ముడు లక్ష్మణుణ్ని పిలిచి రథంలో సీతని అడవిలో దింపిరమ్మన్నాడు. ఆ తరవాత ఆమెకి ఇద్దరు మగపిల్లలు! యిది 'లవకుశ' సినిమా కథ. నేను లవకుశ చూడ్డానికి ప్రధాన కారణం నా అభిమాన నటుడు ఎన్టీఆర్. ఈ సినిమా చూడకపోయినట్లైతే నాకు రామాయణం తెలిసేది కాదు, అప్పుడు నేనూ మా పిల్లల్లాగా రాముడి తండ్రి భీష్ముడని 'గెస్' చేస్తుండేవాణ్ని! 

అందువల్ల -

'థాంక్స్ టు ఎన్టీఆర్' 

(updated/re-written on 25/3/18)

Saturday, 26 November 2011

శ్రీరామరాజ్యం


"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. 



టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ నడుస్తుంది. 

టీవీ వైపు చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అన్నాడు సుబ్బు.

"ఓపికుంది, తీస్తున్నాడు. మనకెందుకు చెప్పు!" నవ్వుతూ అన్నాను.

"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. మన ఆనందభవన్లో అట్టు మాస్టర్ ముత్తు గుర్తున్నాడా? నలభయ్యేళ్ళుగా అట్లు పోస్తున్నాడు. మనిషి కాలిన పెనంలా, ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?" 

"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. ఆ టకటక - 'ఆర్డర్ రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.

"విషయానికి రా." విసుక్కున్నాను.

"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!" అన్నాడు సుబ్బు. 

"అవునా?!" ఆశ్చర్యపొయ్యాను. 

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు - "తెలుగు సినిమారంగం 'ముత్తు'ల మయం!"

"యెలా?" ఆసక్తిగా అడిగాను.  

"విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! హీరో యెవరైనా - పులులు, పిల్లులు, కప్పలు మాత్రం రెగ్యులర్ ఆర్టిస్టులు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.

"అవును, ఆయన్ని 'జానపద బ్రహ్మ' అంటారు." అన్నాను.

"కె.ఎస్.ఆర్.దాస్ లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. ఆయన దగ్గర ఇంకా పిండి మిగిలే ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."

"అవును, ఆయన సినిమాల్ని ఫైటింగుల్తో చుట్టేశాడు!" అన్నాను.

"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి  తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."

"ఒప్పుకుంటున్నాను." నవ్వుతూ అన్నాను.

"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ మెత్తగా పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, బాపు గుండ్రంగా అట్టు పోసేస్తాడు. ఒకసారి ముత్తుని - అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యమని అడిగాను. మొహం చిట్లిస్తూ 'నా వల్లకాదు! చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అని విసుక్కున్నాడు ముత్తు."

"నిజమా!" ఆశ్చర్యపోయాను.

"అవును. మలయాళ దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. కానీ - బాపురమణలు ముత్తుకి సోదరులు, కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో, కానీ - బాపు రమణలు ప్రతిభావంతులు." అన్నాను.

"కాదని నేనన్లేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.

"నీ ఎనాలిసిస్ బాగానే ఉంది. మరి 'శ్రీరామరాజ్యం' చూడవా?" అడిగాను.

"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మన్లాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా!" అన్నాడు సుబ్బు.

"బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.

"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు!"

"ఈ విషయం ఇంకెక్కడా అనకు, వాళ్ళ భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.

సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.

"వాళ్ళకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశారు. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.

"మొత్తానికి నీ అట్టు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.

"థాంక్యూ! ముత్తు అట్లు పోస్తూనే ఉన్నాడు, బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు. 

(updated & posted in fb on 1/2/2018)

Sunday, 23 October 2011

సినిమాలు మంచివే! కానీ మనం?



'సినిమాల్లో చెడు ఉండరాదు, బలహీన మనస్తత్వం కలవారు చెడిపోతారు.'

ఇది నేను నా చిన్నప్పట్నించీ వింటున్న సుభాషితం. ఓకే! ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. మరి - సినిమాల్లో మంచిని చూసి బాగుపడినవాళ్ళు ఎందరున్నారు? ఫలానా సినిమాలో ఫలానా పాయింటు నాకళ్ళు తెరిపించింది. కావున - ఫలానా విధంగా నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను, ప్రవర్తిస్తున్నాను. అన్నవాళ్ళు  మీకెక్కడైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు.

'దేవదాసు'లో ఎస్వీరంగారావు - అంతస్తు తక్కువ పిల్లని చేసుకుంటే తుపాకీతో కాల్చుకు చస్తానని బెదిరించి మరీ నాగేశ్వర్రావుని సావిత్రి నుండి వేరు చేస్తాడు. ఆ తరవాత దేవదాసు, పార్వతిలు తెలుగువాళ్ళని దారుణంగా ఏడిపించారు. అరవైయ్యేళ్ళ క్రితం ఈ ఫార్ములా సూపర్ హిట్టు. తమ పిల్లలు దేవదాసు, పార్వతిల్లా భ్రష్టుపట్టిపోతారనే భయంతో  పిల్లల ప్రేమని ఒప్పుకునే దయార్ధ్ర హృదయులు ఈరోజుక్కూడా నాక్కనిపించట్లేదు.
                             
నా చిన్నప్పుడు అమ్మ, పక్కింటి పిన్నిగారితో కలిసి ఎన్నో ఏడుపుగొట్టు సినిమాలు చూశాను. 'అన్నా! నీ అనురాగం' అంటూ గుండెలు పగిలే గుడ్డి చెల్లెలి ఆక్రందనల్ని - ఎర్రటికళ్ళతో, మొహం వాచిపోయేలా బిగ్గరగా రోదిస్తూ సినిమాని చూశారు పిన్నిగారు. ఇంటికెళ్ళంగాన్లే బండెడు ఇంటి చాకిరీ సరీగ్గా చెయ్యలేదని తన విధవాడపడుచుని ఇల్లెగిరిపొయ్యేలా కేకలేసింది!

శారద నటించిన 'మనుషులు మారాలి'  సినిమా తెలుగువాళ్ళ హృదయాన్ని పీల్చి పిప్పి చేసింది. శోభన్ బాబు హత్య, ఆపై శారద దుర్భర దరిద్రాన్ని తట్టుకోలేక తన పిల్లల్ని చంపేసుకోవటం.. నాకు తెలిసి తెలుగులో ఇంతకన్నా సీరియస్ సినిమా మరోటి లేదు. జనాలు విరగబడి చూసి యేడ్చేశారు. ఆ సినిమా విజయవంతమై నిర్మాతలకి కాసులు తెచ్చింది గానీ జనాల్లో మార్పు తేలేకపోయింది. 

'రోజులు మారాయి'లో దళిత వర్గానికి చెందిన షావుకారు జానకిని వ్యవసాయ వర్గానికి చెందిన నాగేశ్వర్రావ్  ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ దళిత అగ్రవర్ణాల పెళ్ళి అలనాటి 'మాలపిల్ల' దగ్గర మొదలై - 'కాలం మారింది', 'బలిపీఠం' లాంటి సూపర్ హిట్ల మీదుగా చాలా పెద్దప్రయాణమే చేసింది. మనం కూడా సమాంతరంగా కారంచేడు, చుండూరు, నీరుకొండల మీదుగా ఇంకో పెద్దప్రయాణం చేస్తున్నాం!
                           
నేను ఈ ఉదాహరణల్ని సినిమా ప్రభావం సమాజం మీద ఉండదని చెప్పటానికి రాయట్లేదు. ఉంటుందని అన్డానికి తగినంత ఆధారాల్లేవని చెప్పటానికి మాత్రమే రాస్తున్నాను.
                             
సినిమా మన ఈగోని సంతృప్తి పరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మనకున్న తోర్రల్ని పూడ్చి ఆకాశంలో విహరించే ఆదర్శవంతమైన పాత్రల్ని భలే ఇష్టపడతాం. అసలా పాత్రల విలువల పట్ల దర్శక రచయితలకే నమ్మకం ఉండదు. ఆదర్శవంతమైన ఆలోచనలు, సాధ్యంకాని కోరికలు, లేని విలువలు ఆపాదించుకోవటానికి డబ్బుతో కొనుక్కునే సాధనం సినిమా.

ఇవ్వాళ్టికీ వాస్తవ జీవితంలో కులమతాలు, ఆస్తిఅంతస్తులు చాలా ముఖ్యం. కానీ సినిమాల్లో పడవ నడిపే వ్యక్తి ఆమాయక ప్రేమ (మూగమనసులు), నల్లటివాడి కవితాత్మక ప్రేమకథ (చెల్లెలి కాపురం), పనివాడి మొరటు ఆత్మీయత (ఆత్మబంధువు), రిక్షా కార్మికుని కుటుంబ మమకారాలు (శభాష్ రాముడు) ముచ్చట గొలుపుతయ్. అంటే - నిజ జీవితంలో మనకేది ఉండదో అదే సినిమాల్లో చూసుకుని తృప్తినొందుతాం!
                             
కాబట్టి నా పాయింటేంటంటే - జనం చెడిపోతున్నారని ఎవరూ గుండెలు బాదుకోనక్కర్లేదు. మీరూ నేనూ ఈ జనంలో భాగమే. ఎంత గొప్ప సినిమా చూసినా మీరూ నేనూ ఆవగింజంతైనా బాగుపడనట్లే, ఎవరూ కూడా చెడిపోరు. కాకపోతే తెలుగువాళ్ళల్లో కొందరు మేధావులున్నారు. వాళ్ళు సామాన్య ప్రజల కన్నా పైస్థాయివాళ్ళు కాబట్టి - సినిమాల్లో చెడు చూసి జనాలు చెడిపోతున్నారంటూ స్టేట్మెంట్లు పడేస్తారు! 

పోనీ - చిన్నపిల్లలయినా సినిమా ప్రభావానికి లోనవుతారా? ఇదీ అనుమానమే! గుండమ్మకథ పదిసార్లు చూసిన నా అన్న నన్ను ఎన్టీఆర్ నాగేశ్వర్రావుని చూసినట్లు ఆప్యాయంగా చూసుకోకపోగా, నామీద నాన్నకి పితూరీలు చెప్పి తన్నించేవాడు. 'రక్తసంబంధం'లో తీవ్రమైన అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ వుంది. సినిమా చూస్తూ హాల్లో కడవల కొద్దీ కన్నీరు కార్చిన అక్క - నేను తన పెన్సిలూ, ఎరేజరు వాడేస్తున్నాని రాక్షసిలా రక్తమొచ్చేట్లు గిచ్చింది. ఆరకంగా మాదీ రక్తసంబంధమైపోయింది! మరి పిల్లల మీద సినిమాల ప్రభావం ఏంటి?!

సినిమాల ప్రభావం ఉండదని నిరూపించడానికి అన్నీ నెగెటివ్ పాయింట్లు రాస్తున్నాను కదూ! కాబట్టి ట్రాక్ మారుస్తా. చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని కోరికలు కలిగేవి. 'శభాష్ రాముడు' చూసి రామారావులా రిక్షా తొక్కుదామనే కోరికతో తహతహలాడాను, కాలేజీకి వచ్చాక నా రిక్షా తొక్కుడు కోరిక తీరింది. 

కొంచెం పెద్దయ్యాక ఏడుపుగొట్టు ఇల్లాళ్ళు నచ్చడం మొదలెట్టారు. మొగుడు 'ఇంకోదాన్తో పోతాను మొర్రో!' అంటున్నా పట్టించుకోకుండా మొగుడిగాడి కాళ్ళమీద పడి భీభత్సంగా కన్నీరుగార్చే పతివ్రతా శిరోమణులు నా మనసు దోచారు. ఆరోజుల్లో నాకు నచ్చిన డైలాగ్ - "ఏవఁండీ! మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి, కనీసం మీఇంట్లో పనిమనిషిగా ఉండనిస్తూ ఇంత ముద్ద పడెయ్యండి." ఇట్లాంటి సీన్లు చూసినప్పుడల్లా అర్జంటుగా పెళ్లి చేసుకుని ఏడిచే భార్యతో బ్రతిమాలించుకోవాలని తెగ ముచ్చటపడేవాణ్ని. కానీ - పదోక్లాసులో పెళ్లి చేసుకునే సౌలభ్యం, సౌకర్యం లేక ఆగిపొయ్యా! రిక్షా ముచ్చటైతే తీరింది గానీ, ఈ పాదాల దగ్గర చోటు ముచ్చట తీరలేదని ప్రత్యేకంగా రాయడం అనవసరం. 

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - సినిమా చూడ్డం అనేది కేవలం కాలక్షేపం మాత్రమే. అది తీసేవాడికీ తెలుసు, చూసేవాడికీ తెలుసు. మరి తెలీన్ది ఎవరికి? 'సినిమాల్లో చెడు ఉండరాదు. బలహీన మనస్తత్వం గలవారు చెడిపోతారు.' అనేవాళ్లకి. ఇంతకీ ఆ చెడిపొయ్యే బలహీన మనస్తత్వ దుర్భలులు ఎక్కడ వుంటారో, ఎలా వుంటారో వాళ్లెప్పటికీ చెప్పరు. అదే తంటా!

(posed in fb on 3/2/2018)