Showing posts with label fb post. Show all posts
Showing posts with label fb post. Show all posts

Thursday, 28 June 2018

ఎన్నికల సమయం

అవి నా స్కూలు రోజులు. నా స్నేహితుడొకడు సంవత్సరం పొడుగునా చదువుకోడం తప్పించి అన్ని పనులూ చేసేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో.. Imp (important) అంటూ ఏవో ప్రశ్నల్ని సంపాదించే వాడు. పరీక్ష పేపర్ ఔట్ అవుతుందేమోననే ఆశతో చివర్రోజు వరకు వుండేవాడు. పరీక్షల్లో అడిగే ప్రశ్నలు తెలుసుకోడానికి అతను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా వుండేవి.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ.. ప్రజల సెంటిమెంట్/ఎమోషన్స్ తెలుసుకుని, ఎలాగైనా గెలవాలనే రాజకీయ పార్టీల లక్ష్యం చూస్తుంటే, నా చిన్ననాటి స్నేహితుడు గుర్తొస్తుంటాడు.
ఒకాయన విదేశాల్లో నల్లధనం అంటాడు, సంవత్సరానికో కోటి ఉద్యోగాలు అంటాడు. ఇంకొకాయన ఋణమాఫీలంటాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు. విశేషం ఏమంటే.. తామివన్నీ చెయ్యాలని వీళ్లూ అనుకోరు, చేస్తారని ఓటర్లూ అనుకోరు. అందుకే కొందరు తెలివైన ఓటర్లు ఓటేసేందుకు డబ్బుచ్చుకుంటారు.
అమలు చెయ్య(లే)ని వాగ్దానాల్ని చేసే రాజకీయ నాయకులు, వారిని నమ్మని ప్రజానీకం.. ఇదంతా సైకిల్ చక్రం తిరిగినట్లు ఐదేళ్ల కోసారి వస్తుంటుంది. దీన్నే మనం ముద్దుగా 'ప్రజాస్వామ్యం' అని పిల్చుకుంటున్నాం.
ప్రజలు తమని నమ్మినా, నమ్మకపోయినా రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం కాకుండా మానుకోవు. ఏదోక అంశం తీసుకుని పాదయాత్రలనీ, ధర్నాలనీ, నిరాహారదీక్షలనీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటయ్.
ప్రజలు/ఓటర్లు గుంభన జీవులు. 'వురే రాజకీయ నాయకులూ! మాకు ఫలానా సమస్య ముఖ్యం, యిందుకోసం ఎవరైతే కొట్లాడతారో వారికి మా ఓటు.' అని తేల్చి చెప్పరు (పరీక్షల్లో ప్రశ్నల్లాగే). అంచేత రాజకీయ పార్టీలు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ 'యెందుకైనా మంచిద'ని ప్రతి సమస్యనీ ప్రజల సమస్యగా మార్చడానికి కృషి చేస్తుంటాయ్.
మరప్పుడు మనమేం చెయ్యాలి?
అదేంటి మేష్టారూ! ప్రతొక్కటీ విడమర్చి చెప్పాలా? మన "పవిత్రమైన" ఓటు కోసం కుస్తీపోటీలు పడుతున్న రాజకీయ పార్టీల విచిత్ర విన్యాసాల్ని యే విస్కీనో, ఫిల్టర్ కాఫీనో చప్పరిస్తూ ఎంజాయ్ చెయ్యండి. ఇవ్వాళ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే వినోదం ఎక్కువగా వుంది!

(fb post)

కథ రాసేద్దామనే దుస్సాహసం

కథ రాసేద్దామనే దుస్సాహసం, పూర్తి చెయ్యలేని అసహయం ---
ఒక చల్లని సాయంకాలం, పక్షుల కిలకిలలు, కోయిల కుహుకుహులతో వొడలు (తినే వడలు కాదు) పులకరించగా.. మనసు ఆనందంతో గంతులేసింది.
ఇట్లాంటి సమయాల్లో ప్రతివ్యక్తీ తనకి నచ్చిన విషయాల్ని ఆలోచిస్తాడు. కిరాయి హంతకుడు తను చెయ్యబొయ్యే హత్యకి స్కెచ్ రచిస్తే, రసికోత్తముడు ముండల కంపెనీ కొత్తపిట్ట గూర్చి ఆలోచిస్తాడు. రాక్షస ప్రేమికుడు చెయ్యబొయ్యే బలాత్కారం గూర్చి ఆలోచిస్తే, తిండిపోతు వెధవ బూందీలడ్డుని తల్చుకుని లొట్టలేస్తాడు.
ఇలా ఒక్కో కేటగిరీ వాడు తమతమ స్పెషాలిటీ సంబంధిత ఆలోచనల్ని చేస్తాడు. ఇంతమందిని పలువిధములుగా పులకింపజేసిన ప్రకృతికి పులకరించకపోడానికి నాకేం తక్కువ? అంచేత నేనూ తీవ్రంగా పులకించేసాను. కానీ పులకించేశాక ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించిన తరవాత 'ఒక గొప్పకథ రాసెయ్యాలి' అని నిర్ణయించేసుకున్నవాడనై.. laptop వొళ్ళో పెట్టేసుకుని (ఆ రోజుల్లో ఫోన్లో రాయడం నాకు తెలీదు).. కథ టైపడం మొదలెట్టాను.
తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రిని మించిన మొనగాడు లేడు (ఉన్నాడని ఎవరైనా చెప్పినా ఒప్పుకోడానికి నేను సిద్ధంగా లేను). రావిశాస్త్రి తనకి తెలిసిన ప్లీడర్లు, దొంగల గూర్చి రాశాడు. అంచేత గురువుగార్ని ఫాలో అయిపోతూ నేనూ డాక్టర్లు, పేషంట్ల గూర్చి ఒక కథ రాయాలని డిసైడ్ అయిపొయ్యాను. రాయడానికి ఒక లైన్ తళుక్కుమంది. 'వార్నీ, కథ రాయడం అంటే ఇంతేనా' అనుకుని టైపుతూ వెళ్లిపొయ్యాను. సాయంకాలం రాత్రిగా మారింది. కొద్దిసేపటికి వేళ్లు నొప్పెట్టి, విసుగ్గా అనిపించింది. 'హాయిగా సింగిల్ మాల్ట్ చప్పరిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చెయ్యక, ఈ కథ రాసే కూలిపని నేనెందుకు చెయ్యాలి?' అనే ధర్మసందేహం కలిగి, టైపడం ఆపేశాను.
కొద్దిసేపటికి 'నన్నేం చేస్తావ్?' అంటూ నే టైపిన కథ ట్రాఫిక్కులో చిక్కుకుపోయిన చిన్నపిల్లాళ్లా నన్ను దీనంగా ఆడిగినట్లనిపించింది. నిజమే! ఇప్పుడీ stillborn baby ని నేనేం చెయ్యాలి? 'డోంట్ వర్రీ, నీకు తర్వాతెప్పుడైనా మార్పులు చేర్పులూ చేసి ప్రాణం పోస్తాలే!' అని సముదాయించి దాన్ని డ్రాఫ్టుగా అవతల పడేశాను.
తరవాత అప్పుడప్పుడూ కథ గూర్చి గుర్తొచ్చినా.. 'కథకులు గొప్పవారు. వ్యక్తుల్నీ, సమాజాన్నీ లోతుగా, సునిశితంగా పరిశీలించిన మేధావులు. నాకు సాధారణ విషయాలు తెలుసుకోడానికే బుర్ర సహకరించదు. అటువంటి నేను కథ రాయడమా!' అని నవ్వుకోడం మినహా, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
అదీగాక - సాయంకాలం పక్షుల కిల కిలాలు, కోయిల కుహుకుహులు నాకు మళ్లీ వినిపించలేదు, మూడూ రాలేదు. కాబట్టి కథని ఎడిట్ చేసే అవకాశం రాలేదు.
ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - ఆ కథని వెదికి గుంజుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేద్దామని. పోస్ట్ చెయ్యడం ఎందుకంటే - దాన్ని ఓ సాయంత్రం కూచుని రాశాను కాబట్టి.. ఎక్కడో ఒకచోట పోస్ట్ చేస్తే కథ 'అనుకుని' నేను చేసిన కూలిపనికి ఒక logical conclusion ఇచ్చేశానన్న తృప్తి కోసం.
ఇప్పటిదాకా నా 'పూర్తికాని కథ' ఆడియో రిలీజ్ ప్రోగ్రాం చదివారు. త్వరలో అసలు కథ చదువుతారు. కథని సరిచేసే ఓపిక లేనందున మీకు అనేక టైపో కనిపించవచ్చు. అందుగ్గానూ నన్ను క్షమించాలని మందుగా.. సారీ, ముందుగా కోరుకుంటున్నాను. ఇక్కడదాకా చదూకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు/కృతజ్ఞతలు (రెంటికీ తేడా తెలీనందున ఫోర్స్ కోసం రెండూ వాడేశాను).

(fb post)

Friday, 16 June 2017

సిన్మా లాజిక్

'సిన్మా ఎంజాయ్ చెయ్యాలంటే ప్రేక్షకుడు లాజిక్ అప్లై చెయ్యకూడదు' - వొప్పుకుంటున్నాను. కానీ లాజిక్‌ని అప్లై చెయ్యడం, చెయ్యకపోవడం ప్రేక్షకుడి చేతిలో వుండదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రేక్షకుడు అంటే నేనే కనుక, నా సంగతే రాస్తాను.

నా లాజిక్ కండిషన్డ్‌గా, బయాస్డ్‌గా, సెలక్టివ్‌గా వుంటుంది. 

చార్లీ చాప్లిన్, రాజ్ కపూర్ సినిమాల్లో లాజిక్ నాతోపాటుగా (with rapt attention) సిన్మా చూస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్ సిన్మాలకి నిద్రపోతుంది.  కె.రాఘవేంద్రరావు BA సినిమాలకి లాజిక్ హాల్లోక్కూడా రాదు, బయట క్యాంటీన్ దగ్గర తచ్చాడుతుంటుంది.

అందువల్ల నా లాజిక్ కొన్ని సిన్మాల్లో డాక్టర్ పేషంట్ పల్స్ చూసి 'కంగ్రాచ్యులేషన్స్! మీరు తల్లి కాబోతున్నారు' అంటే నవ్వేసుకుంటుంది, ఇంకొన్ని సినిమాల్లో అదే సీన్ వుంటే వొప్పుకోదు - కోపం తెచ్చుకుంటుంది.  

'అమర్ అక్బర్ ఆంథోని'లో ఒకేసారి ముగ్గురు హీరోలు తల్లికి రక్తదానం చేస్తారు. మన్మోహన్ దేశాయ్ సిన్మా కాబట్టి లాజిక్‌గాడు పట్టించుకోలేదు. ఇదే సీన్ యే శ్యామ్ బెనెగల్ సిన్మాలోనో వుంటే లాజిక్‌గాడు చిందులేసేవాడు. 

అలాగే -

అందరూ సిన్మాల్ని ఒకేరకంగా చూడరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దృష్టికోణం వుంటుంది. 'ఆకుచాటు పిందె తడిసె' పాటలో తడిసిన శ్రీదేవి కోసం ఆరుసార్లు సినిమా చూశా (భరించా)! నా క్లాసమ్మాయిలు 'అసలు 'వేటగాడు' ఆరుసార్లు చూసే సినిమానేనా?' అంటూ నన్ను విసుక్కున్నారు, వాళ్ళకెలా చెప్పేది? 

నాకు నచ్చిన ప్రేక్షకుడు -

నా చిన్ననాటి స్నేహితుడు మాతోపాటు అన్ని సినిమాలకీ వచ్చేవాడు, సిన్మా మొదలవ్వంగాన్లే నిద్రపొయ్యేవాడు. 'శుభం' కార్డు పడ్డాక లేపుకొచ్చేవాళ్ళం. శంకరాభరణం సిన్మాక్కూడా నిద్రపోయిన ఘనత నా స్నేహితుడిది. మరప్పుడు సిన్మాకెందుకు రావడం? 'స్నేహధర్మం' అని సమాధానం చెప్పేవాడు!  

(fb post)

Tuesday, 13 June 2017

గర్భ విజ్ఞాన సంస్కారం

మీకు తెల్లగా, పొడుగ్గా వుండే పురుష సంతానం కావాలా? అట్లైన ఈ క్రింది సూత్రములు పాటించవలెను.  

- ముందుగా దంపతులు మూణ్నెళ్లపాటు 'శుద్ధికరణం' పాటించాలి (అంటే బ్రహ్మచర్యం).

- దంపతుల తమతమ జాతకరీత్యా గ్రహస్థితుల్ని అనుసరించి పండితుల్తో పెట్టబడిన ముహూర్త సమయాన ఒక్కటవ్వాలి ('సెక్స్' పదం అత్యంత అసభ్యకరం, అంచేత వాట్టానికి వీల్లేదు). 

- దంపతులు కలిసే ముహూర్తానికి ముందు ఒక మాసంపాటు బాబా రామ్ దేవ్ ఫార్మసీవారి  'దివ్యపుత్రజీవక్' ఔషధం సేవించాలి (లేనట్లైనా స్త్రీ సంతానం కలిగే ప్రమాదం కలదు). 

- గర్భం ధరించిన స్త్రీ యెట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టరాదు, శాకాహారం మాత్రమే తీసికొనవలెను (ఇంగ్లీషు వైద్యులు మాంసాహారంలో చక్కటి ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఉంటాయని చెత్తకబుర్లు చెబుతారు - వారిది విదేశీ అజ్ఞానం అని గ్రహించగలరు) 

- పురుషుని గూర్చి అసభ్య ఆలోచనలు (అనగా స్త్రీపురుష సంయోగ ఆలోచనలు) మనసులోకి రానివ్వరాదు, ఇందుకు భర్త అతీతుడు కాదు (ఇంగ్లీషు వైద్యులు గర్భం నాలుగో నెల నుండి సంయోగం చేసుకోవచ్చునని అంటారు - వారిది విదేశీ విచ్చలవిడి జ్ఞానం అని గ్రహించవలెను). 

- గర్భం సమయాన చెడ్డవారికి, ముఖ్యంగా భర్తకి, దూరంగా వుండవలెను (వాడు మిమ్మల్ని సంయోగం కొరకై కెలకవచ్చును). 

- గదినిండా రాముడు, కృష్ణుడు కేలండర్లు వేలాడదీసి వాటినే చూస్తుండవలెను (మహేశ్ బాబు, ప్రభాస్‌ల కేలండర్లు నిషిద్ధము). 

- ఎల్లప్పుడూ ఘంటసాల భగవద్గీత, సుబ్బులక్ష్మి సుప్రభాతంలను మాత్రమే వినవలెను (సినిమా పాటలు నిషిద్ధము). 

- నెలలు నిండాక మంత్రసానికి కబురంపండి. పవిత్రమైన మంత్రోచ్చరణ కావిస్తూ 'స్వదేశీ డెలివరీ' చేయించుకోండి. 

ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి - దబ్బపండులా, తెల్లని మేనిఛాయలో కిలకిలా నవ్వుతున్న (పవిత్ర పసిపాపలు యేడవరాదు) మీ బిడ్డని గాంచండి. 

మేరా భారత్ మహాన్! భారత్ మాతా కీ జై!!

(fb post 14/6/2017)

Tuesday, 6 June 2017

బండబారిన బుర్రలు

మనుషులకి మెదడు వుంటుంది, బుర్ర వుంటుంది, ఆలోచనలుంటయ్. అయితే ఆ ఆలోచనల్ని యే స్థాయికి తీసుకెళ్ళాలనేది ఆ మనిషి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. బుర్రకి కత్తితో సారూప్యత వుంది. రెండూ కూడా సాను పెట్టిన కొలదీ పదును దేరుతాయి. వాడకం తగ్గిస్తే రెండూ తుప్పట్టి బండబారిపోతాయి.

ఈమధ్య బండబారిన బుర్రలు యెక్కువయ్యాయి. మన దేశం గొప్పది, మన సైన్యం గొప్పది, మన మతం గొప్పది, మన ప్రాంతం గొప్పది, మన భాష గొప్పది, మన కులం గొప్పది. 'మనది' అన్నది ప్రతిఒక్కటీ గొప్పదే! అన్నింటిలో బల్లగుద్ది మొహం మీద చరిచే 'స్పష్టమై'న భావాలు. ఈ అభిప్రాయాల్ని ప్రశ్నిస్తే ఖోపం వస్తుంది!

ఉదాహరణకి -

కాశ్మీర్ లోయలో రాళ్లు విసిరేవాళ్ళు టెర్రరిస్టులు, కాదన్నవాళ్ళు టెర్రరిస్ట్ సమర్ధకులు! హురియత్ నాయకుల్తో మాట్లాడాలనేవాళ్ళు దేశద్రోహులు (ఈ లెక్కన నెహ్రు నుండి వాజపేయి దాకా అందరూ దేశద్రోహులే)! సమస్యని అర్ధం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించుకుందామనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు సూడో-సెక్యులరిస్టులు! కాశ్మీర్ సమస్యని క్రిటికల్/రేషనల్ గా ఆలోచించమన్నవాళ్ళు సూడో-మేధావులు!

ఒక క్లిష్టమైన సమస్యని yes or no స్థాయికి దించెయ్యడం రాజకీయ అవకాశవాదం. అధికారానికి మోకరిల్లి బాకాలూదే నేటి బ్రతక నేర్చిన మీడియా ప్రజల్ని దేశభక్తి మత్తులో ముంచి తన పబ్బం గడుపుకుంటుంది. ఇక్కడ కొందరికి బుర్ర ఉపయోగించడం తెలీదు, ఇంకొందరికి తెలిసినా చెప్పరు. మనమీ దుస్థితి నుండి బయటపడే అవకాశం ఇప్పుడప్పుడే లేదని అనుకుంటున్నాను.

(fb post 6/6/2017)

Sunday, 4 June 2017

మీడియా దొంగాట

యుద్ధం పాశవికమైనది, మానవాళికి నష్టదాయకమైనది. అనాదిగా ఈ ప్రపంచం యుద్ధాలకి పరిహారాన్ని చెల్లించుకుంటూనే వుంది. చిన్నపాటి పొలంగట్టు తగాదాలే వైరిపక్షాలకి కోలుకోలేని దెబ్బ తీసేస్తాయి. రెండుదేశాల మధ్య తగాదాలు ఆ రెండుదేశాల అభివృద్ధిని అడ్డుకుంటాయి, తీవ్రసంక్షోభంలోకి నెట్టేస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని యెన్నుకుంటారు. ప్రభుత్వం ప్రజల తరఫున, ప్రజల కొరకు పనిచెయ్యాలి. ప్రభుత్వం పనిచెయ్యడంలో తేడాలు రాకుండా ప్రజల పక్షాన నిలబడ ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన పాత్ర మీడియాది. 

ఇవ్వాళ దేశప్రజలకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలేదు, యెందుకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యెందుకు? విద్యారంగంలో లోపాలు సవరించుకోలేకపోతున్నాం, యెందుకు? నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, యెందుకు? వినిమయ వస్తువుల ధరలు తగ్గట్లేదు, యెందుకు? ఈ 'యెందుకు?'కి సమాధానం దిశగా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. మీడియా తన బాధ్యతని యెందుకు విస్మరిస్తుంది? 

టీవీ చర్చలు - ఒకప్పుడు రాత్రిళ్ళు మాత్రమే జరిగేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్‌లాగా రోజంతా కొనసాగుతున్నయ్! యెక్కువ శాతం యెడతెగని ఊకదంపుడు కాశ్మీర్ చర్చలే! పోనీ చర్చల్లో 'కాశ్మీర్ సమస్యని పరిష్కరించేందుకు కేంద్ర హోమ్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలేంటి?' అంటూ చర్చించరు. యెంతసేపటికీ - 'దేశద్రోహ హురియత్', 'రాళ్లు విసుర్తున్న ముష్కర మూకలు' వంటి చౌకబారు టాగ్ లైన్లతో రెచ్చగొట్టే కేకలే!

'పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, యుద్ధం చెయ్యాలి, అవసరమైతే అణుబాంబు పేల్చాలి!' ఇట్లాటి భీభత్సమైన ఆలోచనల్తో మిలిటరీ నిపుణుల సలహాలు! 'యుద్ధం వద్దు' అంటే - ఆర్మీ నైపుణ్యాన్ని కించపరుస్తున్నావంటూ హేళన! ప్రస్తుతం మన టీవీ చానెళ్ల పరిస్థితి ఇదీ!

ప్రజల రోజువారీ సమస్యలకి వందోవంతు ప్రాధాన్యతనిస్తూ, సరిహద్దు సమస్యని వందరెట్లు పెద్దదిగా చూపిస్తున్న మీడియా విశ్వాసనీయత ఏంటి? ప్రభుత్వం 'అసలు' సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొన్ని నకిలీ సమస్యల్ని సృష్టిస్తుంది. మీడియా ఈ అప్రధాన నకిలీ వార్తలకి వత్తాసు పలకడంలో బయటకి కనపడని కోణం ఇంకేదైనా వుందా? అసలు ఇండియా కాశ్మీర్‌లో అంతర్భాగమా? కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా? 

ఆదివారం పదినిమిషాలు టీవీ చూస్తేనే ఇన్నేసి ప్రశ్నలొస్తున్నయ్! ఈ ప్రశ్నలకే కాదు, యే ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సినవాళ్ళు చెప్పరు. మనం మాత్రం రోజువారీ మీడియా తమాషాని గుడ్లప్పగించుకుని చూస్తూనే ఉంటాం, ఇంతకన్నా దురదృష్టమేముంది!

(fb post 4/6/2017)

Friday, 2 June 2017

గొప్పసినిమాకి నా క్రైటీరియా

సినిమాలు అన్నీ అందరికీ నచ్చవు. నచ్చిన సినిమాలోనూ అందరికీ ఒకే విషయం నచ్చదు. మృదువైన సింగిల్ మాల్ట్, ఘనమైన ఉప్మాపెసరట్టులు కూడా కొందరికే నచ్చుతాయి. నాకు 'డాక్టర్ చక్రవర్తి'లో జగ్గయ్య అర్ధమయ్యాడు, నాగేశ్వరరావు చిర్రెత్తించాడు. 'ముత్యాలముగ్గు'లో సంగీత బోరు కొట్టించింది, హలం భలేగా నచ్చింది! 

ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - మొన్నటిదాకా తెలుగు సినిమాలు భీభత్సంగా చూసేశానని అనుకున్నాను. కానీ - విశ్వనాథ్ ఫాల్కే ఎవార్డ్ సమయంలో, దాసరి మరణం సందర్బంగా నాకు అర్ధమైందేమనగా.. నేను గొప్ప సినిమాలు అతితక్కువ చూశానని!

సినిమా అనేది పూర్తిగా కాలక్షేపం వ్యవహారం - పన్లేనివారు అదేపనిగా చూస్తారు, లేకపోతే లేదు. కానీ - యెన్నో సినిమాలు చూసిన నేను గొప్ప సినిమాలకి కిలోమీటర్ల దూరంలో యెందుకుండిపొయ్యాను? నాకు వెంటనే తట్టిన సమాధానం.. 'నా సినిమా జానర్ వేరు' అని. 

గొప్పసినిమాకి నా క్రైటీరియా యేమనగా -

శ్రీదేవి సినిమాలన్నీ గొప్ప సినిమాలే! సినిమాలో జ్యోతిలక్ష్మి లేక జయమాలిని డ్యాన్స్ వుంటే అది మరింత గొప్ప సినిమా అవుతుంది. కథకి అవసరం కాబట్టి హీరో వుంటాడు గానీ నా దృష్టిలో హీరో విలువ పూచికపుల్ల కన్నా తక్కువ. అదీగాక - ఒక మగాడు ఒక మగ నటుణ్ని తీవ్రంగా అభిమానించి, ప్రేమించడం latent homosexuality అయ్యుండొచ్చనే అనుమానం నాకుంది.  

పచ్చని పారాణి, ఎర్రని కుంకుమ, ప్రాచీన సాంప్రదాయాలు, పవిత్ర కళలు నా వొంటికి సరిపడవు.. విశ్వనాథ్ ఔట్. పరిషత్తు నాటకాల్లా చాంతాడు డైలాగులంటే భయం.. దాసరి ఔట్! కుదిర్తే పౌరాణిక శ్రీరాముడు, కుదరకపోతే సాంఘిక శ్రీరాముడు - ఆసక్తి లేదు.. బాపు ఔట్!  

నేనిలా నాదైన exclusion criteria ఫాలో అయిపోవడం వల్ల ప్రజలు మెచ్చిన అనేక గొప్ప చిత్రరాజముల్ని మిస్సైతిని. ఇందుకు నేనేమీ చింతించడం లేదు, కారణం - నాక్కావాల్సిన సినిమాలు నే చూసుకున్నాను, అందుగ్గానూ మిక్కిలి సంతోషిస్తున్నాను!

(fb post .. )

Saturday, 27 May 2017

'సూపర్ కాప్'



పంజాబ్ 'సూపర్ కాప్' గిల్ వృద్దాప్యంతో చనిపొయ్యాట్ట. ఈ సూపర్ కాప్‌ల పట్ల మధ్యతరగతి మేధావుల్లో ఆరాధనా భావం వుంది. అయితే వారి ఆరాధనలో కొంతభాగం సూపర్ కాప్ సృష్టించినవారికి చెందాలని డిమేండ్ చేస్తున్నాను. యెవరా సృష్టికర్తలు? యేమా కథ?

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగర్ బత్తీ అయితే పాలకులకీ ప్రజలకీ అనుసంధానమైనది పోలీసు వ్యవస్థ. కాబట్టే పోలీసు వ్యవస్థని పాలకులు తమ కనుసన్నల్లో నడుచుకునేట్లు చూసుకుంటారు. అప్పుడు పోలీసు వ్యవస్థ నేరాల్ని అదుపు చేస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' అదుపు అయ్యుంటుంది, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' నిస్పాక్షికత అయ్యుంటుంది.

రాజకీయ వ్యవస్థలో అధికార పక్షం, ప్రతిపక్షం వైరిపక్షాలని అనుకుంటాం గానీ, వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకటే! చదరంగంలో నలుపు తెలుపు పావులకున్న తేడా మాత్రమే వుంటుంది. అధికారంలో ఉన్నవారిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికార పక్షం  రాజకీయ చదరంగం అడుతుంటాయి. ఇవన్నీ దాయాదుల మధ్య పొలం గట్టు తగాదాలు.. ప్రజలకి యే మాత్రం సంబంధం లేని వ్యవహారాలు.

ఇలా రాజకీయ పక్షాలు ఒకళ్ళకొకళ్ళు హేపీగా నిప్పెట్టుకొంటుండగా.. ఒక్కోసారి నిప్పు కాస్తా మంటగా మారి.. ఆపై అగ్నిప్రమాదంగా మారిపోయి.. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది (ఇందుకు ఇందిరా గాంధీ - భింద్రన్‌వాలె ఉదంతం ఒక ఉదాహరణ). 

అప్పుడు పాలకులు కొత్త ఎత్తుగడలేస్తారు. అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్‌ని దించుతారు. ఆ ఫైర్ ఫైటరే కనిపించని నాలుగో సింహమైన సాయికుమార్! బోనులోంచి బయటకొచ్చిన ఈ నాలుగో సింహానికి సింహం హక్కుల పట్ల తప్పించి ఇతరుల హక్కుల పట్ల నమ్మకం వుండనందున.. మానవ హక్కుల్ని విచ్చలవిడిగా హరించేస్తూ.. యథేచ్ఛగా మారణ కాండ సాగిస్తూ.. పరిస్థితిని 'అదుపు'లోకి తెస్తుంది. 

ఇప్పుడో ధర్మసందేహం. అసలీ కనిపించని నాలుగో సింహం సాయికుమార్ దేనికి? పాలకులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగొచ్చుగా? దిగొచ్చు, కానీ సాయికుమార్ పద్ధతుల్తో ప్రభుత్వాలకి ఇబ్బందులున్నాయ్, తేడా వొస్తే వ్యవహారం బెడిసికొడుతుంది. అలాంటి తేడానే వస్తే సాయికుమార్‌నే బలిపశువు చేసి ప్రజాస్వామ్య విలువల్ని 'కాపాడొచ్చు' - ఇదొక win win situation, అందుకని!

పాలకులకి పోలీసు వ్యవస్థని వాడటంలో ఖచ్చితమైన పద్దతులున్నాయి. పోలీసు వ్యవస్థ పద్ధతిగా - అస్మదీయుల పట్ల అక్కినేని నాగేశ్వరరావు కన్నా సున్నితంగా వుంటుంది, తస్మదీయుల పట్ల ఆర్.నాగేశ్వరావు కన్నా క్రూరంగా వుంటుంది. ఈ సూత్రం గుర్తుంచుకుంటే పోలీసు వ్యవస్థ - గోరక్షకులు, శ్రీరామసేన, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పట్ల వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

'సూపర్ కాప్' సాయి కుమార్ బోనులో సింహంలాంటివాడు, రాజ్యం అవసరమైనప్పుడు మాత్రమే బోను తలుపులు తెరుస్తుంది. అందుకే అతను 1984 లో ఢిల్లీలో కనపళ్లేదు, 2002 లో గుజరాత్‌లోనూ కనపళ్లేదు. ఎందుకు కనపళ్ళేదో ఈ పాటికే మీకు అర్ధం అయ్యుంటుంది, కాబట్టి విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.

(fb post 27/5/2017)

Friday, 26 May 2017

అరుంధతీ రాయ్


చూడమ్మాయ్ అరుంధతీ రాయ్!

చక్కటి పేరు, మొహంలో లక్ష్మీదేవి కళ, మొదటి రచనతోనే అంతర్జాతీయ గుర్తింపు. ఆడపిల్లకి ఇంతకన్నా ఇంకేం కావాలి?

బోల్డన్ని బుక్ రిలీజు ఫంక్షన్లు, శాలువా సన్మానాలు, సినిమా అవకాశాలు, పద్మ ఎవార్డులు నీకోసం యెదురుచూస్తుంటే.. నువ్వేం చేశావ్?

యేమాత్రం తెలివి లేకుండా -

నర్మదా బచావో అన్నావ్! నక్సలైట్లతో తిరిగావ్! ఆదివాసీ హక్కులన్నావ్! కాశ్మీర్ ప్రతిపత్తి అన్నావ్!

ఆహ్లాదకర జీవితాన్ని వద్దనుకుని రాజ్యానికి వ్యతిరేకంగా మారిపొయ్యావెందుకు?!

ఇప్పుడు నీకర్ధమైందా?

ఈ దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తాం, మాతృమూర్తిగా గౌరవిస్తాం.

కానీ -

స్త్రీ "అభిప్రాయాలు" కలిగుంటే మాత్రం తాట తీస్తాం, బూతులు తిడతాం, బెదిరిస్తాం, అణగదొక్కడానికి యెంత స్థాయికైనా దిగజారతాం!

(fb post 26/5/2017)

Wednesday, 24 May 2017

తీవ్రవాద గొట్టంగాళ్ళు


సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. సినిమాగా ఓ కథని అనుకుంటారు, నెలల తరబడి ప్రణాళికలేస్తారు, తరవాతే తాపీగా సినిమా తీస్తారు. ఈ సౌకర్యం టీవీల వాళ్లకి లేదు, ఎందుకంటే వాళ్లకి ప్రతిరోజూ ఒక సినిమానే! రోజూ ఏదొక juicy story పట్టుకోవాలి, దాన్నుండి రోజంతా జ్యూస్ పిండుతూ టెంపో maintain చెయ్యాలి.

వాస్తవానికి మనం న్యూస్ చానెల్స్ అని పిల్చుకుంటున్నవి న్యూస్ చానెల్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ - వీటిల్లో ఆవేశం ఉంటుంది గానీ వార్తలుండవు. న్యూస్ ఏంకర్లుగా మనం పీల్చుకుంటున్నవాళ్ళు ఏంకర్లు కాదు, బఫూన్లు!

యెలా చెప్పగలవ్? 

సింపుల్! ఈ దేశంలో యేటా వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపాల్తో చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి చాలా పెద్దవార్తలు కావాలి. కానీ టీవీల వాళ్లకి ఇవసలు వార్తలే కాదు!

మరి వీరికి వార్తలేమిటి?

పేజ్ 3 వారి అసహజ మరణాలు! ఇవి మాత్రం వారాల తరబడి లాగుతారు. వీటితో ప్రజలకేం సంబంధం? తెలీదు!

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా టీవీల వాళ్ళు 'మర్డర్' మిస్టరీని తమదైన శైలిలో పీకి  పాకం పెట్టారు. తరవాత పోలీసులు కేసు కోర్టుకి పంపారు. విషయం అక్కడితో అయిపొయింది. 

ఈమధ్య అర్ణబ్ గోస్వామి అనే కేకాగ్రేసరుడు సొంతదుకాణం పెట్టాడు. ఈ దుకాణానికి అధిపతి ఎన్డీయే నాయకుడు, శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ సీటుపై కన్నేసినవాడు. అందువల్ల మన కేకల మాంత్రికుడు అర్జంటుగా సునంద పుష్కర్ కేసు యెత్తుకున్నాడు, ఆధారాలంటూ  యేవో పాత టేపులు వినిపించి శశి థరూర్ ఒక 'హంతకుడు' అని తేల్చేశాడు. 

తేల్చేసిన దరిమిలా - గోస్వామి తన తీవ్రవాద గొట్టం గాళ్లనీ థరూర్ మీదకి తోలాడు. గొట్టాలకి సమాధానం చెప్పకపోతే శశి థరూర్ పారిపోతున్నాడు అంటాడు! చెబితే మీడియాపై దాడి అంటాడు! అంటే ఇదో win-win situation అన్నమాట!

ప్రభుత్వ సేవలో పూర్తి స్థాయిలో పునీతం అయిపోడం, సైన్యాన్ని కీర్తించడమే దేశభక్తికి పరాకాష్టగా ప్రచారం చెయ్యడం కేకాధాముడి ఛానెల్ పాలసీ! అందుకే సంఘపరివార్ శక్తులు అరుంధతి రాయ్ ఇచ్చిందని ప్రచారం చేసిన (లేని) ఇంటర్వ్యూ ఆధారంగా, ఆమెపై తట్టల కొద్దీ బురద చల్లే ప్రోగ్రామ్ రోజువారీగా తలెత్తుకున్నాడు. 

అర్ణబ్ గోస్వామి వాచాలత్వాన్నీ, రౌడీయిజంనీ గొప్ప జర్నలిజంగా భావించేవాళ్లు.. ఈ చౌకబారు ట్రిక్కుల్ని ఆసక్తిగా చూసే చౌకబారు వీక్షకులు వున్నంతకాలం మనం ఈ చెత్తని భరించక తప్పదు. ఆలస్యంగానైనా ఈ చెత్త కొట్టుకుపోతుంది భావిస్తున్నాను.

(fb post 24/5/2017)

Saturday, 20 May 2017

అభిమానుల బానిసబుద్ధి


మనం ఇనుప వస్తువుల్ని వాడకపోతే అవి తుప్పట్టిపోతాయి. అలాగే - శరీరంలో యేదన్నా భాగాన్ని సరీగ్గా వాడకపోతే అది atrophy అయిపోతుంది. కొత్తవిషయాల్ని తెలుసుకోవడం, ఆలోచించడం, మనని మనం refine చేసుకోవడం.. ఇవన్నీ నిరంతర ప్రక్రియలు. ఇలా చెయ్యకపోతే మెదడుకి పని తక్కువవుతుంది.. బద్దకంగా అయిపోతుంది.. ఆలోచించడం మానేస్తుంది.

మన సినిమా హీరోల అభిమానులు మెదడు వాడటం మానేసిన శాపగ్రస్తులని నా నమ్మకం. బానిస వ్యవస్థ రద్దైనా, బుర్రలో కొండంత బానిసబుద్ధితో బ్రతికేసే ఈ అమాయకుల్ని చూసి జాలి పడదాం!

యెందుకు?

మనిషితో పోలిస్తే కుక్క మెదడు సైజ్ తక్కువ, అంచేత కుక్కకి బుర్ర తక్కువ, కాబట్టే అది తన యజమాని పట్ల విశ్వాసంగా వుంటుంది. ఇలా విశ్వాసంగా పడుండటం తప్ప కుక్కకి వేరే చాయిస్ లేదని మనం గుర్తుంచుకోవాలి. మెదడు సైజ్ పెద్దదిగా వుండి, ఆలోచించే చాయిస్ వుండికూడా కుక్కలా విశ్వాసపాత్రంగా జీవించడం దురదృష్టం కాక మరేమిటి?!

అంచేత ఈ సినిమా హీరోల అభిమానుల్ని చూసి మనం జాలిపడాలే తప్ప విసుక్కోకూడదని నా అభిప్రాయం.

(fb post 20/5/2017)