Showing posts with label మీడియా. Show all posts
Showing posts with label మీడియా. Show all posts

Sunday, 4 June 2017

మీడియా దొంగాట

యుద్ధం పాశవికమైనది, మానవాళికి నష్టదాయకమైనది. అనాదిగా ఈ ప్రపంచం యుద్ధాలకి పరిహారాన్ని చెల్లించుకుంటూనే వుంది. చిన్నపాటి పొలంగట్టు తగాదాలే వైరిపక్షాలకి కోలుకోలేని దెబ్బ తీసేస్తాయి. రెండుదేశాల మధ్య తగాదాలు ఆ రెండుదేశాల అభివృద్ధిని అడ్డుకుంటాయి, తీవ్రసంక్షోభంలోకి నెట్టేస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని యెన్నుకుంటారు. ప్రభుత్వం ప్రజల తరఫున, ప్రజల కొరకు పనిచెయ్యాలి. ప్రభుత్వం పనిచెయ్యడంలో తేడాలు రాకుండా ప్రజల పక్షాన నిలబడ ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన పాత్ర మీడియాది. 

ఇవ్వాళ దేశప్రజలకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలేదు, యెందుకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యెందుకు? విద్యారంగంలో లోపాలు సవరించుకోలేకపోతున్నాం, యెందుకు? నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, యెందుకు? వినిమయ వస్తువుల ధరలు తగ్గట్లేదు, యెందుకు? ఈ 'యెందుకు?'కి సమాధానం దిశగా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. మీడియా తన బాధ్యతని యెందుకు విస్మరిస్తుంది? 

టీవీ చర్చలు - ఒకప్పుడు రాత్రిళ్ళు మాత్రమే జరిగేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్‌లాగా రోజంతా కొనసాగుతున్నయ్! యెక్కువ శాతం యెడతెగని ఊకదంపుడు కాశ్మీర్ చర్చలే! పోనీ చర్చల్లో 'కాశ్మీర్ సమస్యని పరిష్కరించేందుకు కేంద్ర హోమ్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలేంటి?' అంటూ చర్చించరు. యెంతసేపటికీ - 'దేశద్రోహ హురియత్', 'రాళ్లు విసుర్తున్న ముష్కర మూకలు' వంటి చౌకబారు టాగ్ లైన్లతో రెచ్చగొట్టే కేకలే!

'పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, యుద్ధం చెయ్యాలి, అవసరమైతే అణుబాంబు పేల్చాలి!' ఇట్లాటి భీభత్సమైన ఆలోచనల్తో మిలిటరీ నిపుణుల సలహాలు! 'యుద్ధం వద్దు' అంటే - ఆర్మీ నైపుణ్యాన్ని కించపరుస్తున్నావంటూ హేళన! ప్రస్తుతం మన టీవీ చానెళ్ల పరిస్థితి ఇదీ!

ప్రజల రోజువారీ సమస్యలకి వందోవంతు ప్రాధాన్యతనిస్తూ, సరిహద్దు సమస్యని వందరెట్లు పెద్దదిగా చూపిస్తున్న మీడియా విశ్వాసనీయత ఏంటి? ప్రభుత్వం 'అసలు' సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొన్ని నకిలీ సమస్యల్ని సృష్టిస్తుంది. మీడియా ఈ అప్రధాన నకిలీ వార్తలకి వత్తాసు పలకడంలో బయటకి కనపడని కోణం ఇంకేదైనా వుందా? అసలు ఇండియా కాశ్మీర్‌లో అంతర్భాగమా? కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా? 

ఆదివారం పదినిమిషాలు టీవీ చూస్తేనే ఇన్నేసి ప్రశ్నలొస్తున్నయ్! ఈ ప్రశ్నలకే కాదు, యే ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సినవాళ్ళు చెప్పరు. మనం మాత్రం రోజువారీ మీడియా తమాషాని గుడ్లప్పగించుకుని చూస్తూనే ఉంటాం, ఇంతకన్నా దురదృష్టమేముంది!

(fb post 4/6/2017)

Wednesday, 24 May 2017

తీవ్రవాద గొట్టంగాళ్ళు


సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. సినిమాగా ఓ కథని అనుకుంటారు, నెలల తరబడి ప్రణాళికలేస్తారు, తరవాతే తాపీగా సినిమా తీస్తారు. ఈ సౌకర్యం టీవీల వాళ్లకి లేదు, ఎందుకంటే వాళ్లకి ప్రతిరోజూ ఒక సినిమానే! రోజూ ఏదొక juicy story పట్టుకోవాలి, దాన్నుండి రోజంతా జ్యూస్ పిండుతూ టెంపో maintain చెయ్యాలి.

వాస్తవానికి మనం న్యూస్ చానెల్స్ అని పిల్చుకుంటున్నవి న్యూస్ చానెల్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ - వీటిల్లో ఆవేశం ఉంటుంది గానీ వార్తలుండవు. న్యూస్ ఏంకర్లుగా మనం పీల్చుకుంటున్నవాళ్ళు ఏంకర్లు కాదు, బఫూన్లు!

యెలా చెప్పగలవ్? 

సింపుల్! ఈ దేశంలో యేటా వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపాల్తో చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి చాలా పెద్దవార్తలు కావాలి. కానీ టీవీల వాళ్లకి ఇవసలు వార్తలే కాదు!

మరి వీరికి వార్తలేమిటి?

పేజ్ 3 వారి అసహజ మరణాలు! ఇవి మాత్రం వారాల తరబడి లాగుతారు. వీటితో ప్రజలకేం సంబంధం? తెలీదు!

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా టీవీల వాళ్ళు 'మర్డర్' మిస్టరీని తమదైన శైలిలో పీకి  పాకం పెట్టారు. తరవాత పోలీసులు కేసు కోర్టుకి పంపారు. విషయం అక్కడితో అయిపొయింది. 

ఈమధ్య అర్ణబ్ గోస్వామి అనే కేకాగ్రేసరుడు సొంతదుకాణం పెట్టాడు. ఈ దుకాణానికి అధిపతి ఎన్డీయే నాయకుడు, శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ సీటుపై కన్నేసినవాడు. అందువల్ల మన కేకల మాంత్రికుడు అర్జంటుగా సునంద పుష్కర్ కేసు యెత్తుకున్నాడు, ఆధారాలంటూ  యేవో పాత టేపులు వినిపించి శశి థరూర్ ఒక 'హంతకుడు' అని తేల్చేశాడు. 

తేల్చేసిన దరిమిలా - గోస్వామి తన తీవ్రవాద గొట్టం గాళ్లనీ థరూర్ మీదకి తోలాడు. గొట్టాలకి సమాధానం చెప్పకపోతే శశి థరూర్ పారిపోతున్నాడు అంటాడు! చెబితే మీడియాపై దాడి అంటాడు! అంటే ఇదో win-win situation అన్నమాట!

ప్రభుత్వ సేవలో పూర్తి స్థాయిలో పునీతం అయిపోడం, సైన్యాన్ని కీర్తించడమే దేశభక్తికి పరాకాష్టగా ప్రచారం చెయ్యడం కేకాధాముడి ఛానెల్ పాలసీ! అందుకే సంఘపరివార్ శక్తులు అరుంధతి రాయ్ ఇచ్చిందని ప్రచారం చేసిన (లేని) ఇంటర్వ్యూ ఆధారంగా, ఆమెపై తట్టల కొద్దీ బురద చల్లే ప్రోగ్రామ్ రోజువారీగా తలెత్తుకున్నాడు. 

అర్ణబ్ గోస్వామి వాచాలత్వాన్నీ, రౌడీయిజంనీ గొప్ప జర్నలిజంగా భావించేవాళ్లు.. ఈ చౌకబారు ట్రిక్కుల్ని ఆసక్తిగా చూసే చౌకబారు వీక్షకులు వున్నంతకాలం మనం ఈ చెత్తని భరించక తప్పదు. ఆలస్యంగానైనా ఈ చెత్త కొట్టుకుపోతుంది భావిస్తున్నాను.

(fb post 24/5/2017)