Saturday 25 February 2017

ప్రొఫెసర్ కోదండరాం


'Appearances are deceptive' అన్నారు పెద్దలు. అందుకు మంచి ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం! ఈయన చూడ్డానికి ఎవర్నైనా సులువుగా నమ్మేసే అమాయకుళ్లా అగుపిస్తాడు. యెదుటివాడు చెప్పేది ఓపిగ్గా వింటాడు. యెంత ప్రవోక్ చేసినా ఆ మొహంలో కోపం కనపడదు. క్లిష్టమైన ప్రశ్నలక్కూడా క్లాస్ రూములో పాఠం చెప్తున్నట్లు ప్రశాంతంగా, నిదానంగా మృదువుగా, చక్కటి పదాలతో సమాధానం చెబుతాడు! కోదండరాంలో ఎడ్రినలిన్ లెవెల్స్ తక్కువని నా అనుమానం.

నాకు కోదండరాం పరిచయం టీవీ ద్వారానే. ఈ మందపాటి కళ్ళజోడు వ్యక్తి మెత్తగా కనిపించే గట్టివాడు అని అప్పుడే గ్రహించాను. సరే! అటు తరవాత తెలంగాణా ఉద్యమంలో కోదండరాం నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే.

తెలంగాణా వచ్చాక - కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణా మేధావుల్లో అధికుల్ని పదవుల్లో నింపేసింది. మిగిలిన కొందర్ని అవార్డులు, రివార్డుల్తో ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. కేసీఆర్‌కి వీరవిధేయత చూపించకపోవడమో మరేదో తెలీదు కానీ కోదండరాం మాత్రం పదవుల్లేకుండా తెలంగాణా రాష్ట్రంలో అలా మిగిలిపొయ్యాడు.

రాజకీయ పార్టీలు గెలవడానికి అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటాయి (అలా చెయ్యటం అనైతికం అని ఎన్నికల కమిషన్ కూడా అనుకోవట్లేదు). తెలివైన ప్రజలు డబ్బులో, బ్రాందీసీసానో తీసుకుని ఓట్లేస్తారు (దేశంలో వీళ్ళే ఎక్కువ అని నా అనుమానం). తెలివి తక్కువ్వాళ్లు నాయకుల మాటలు నమ్మి ఓట్లేస్తారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు బోల్డన్ని ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మా ఉద్యోగాల సంగతేంటని తెలంగాణా యువత అడుగుతుంది. అసలు మాకు సమైక్య ఆంధ్ర రాష్ట్రానికీ, తెలంగాణా రాష్ట్రానికి తేడా తెలీటల్లేదని ఉస్మానియా విద్యార్థులు వాపోతున్నారు. రోహిత్ వేముల సంఘటనతో దళితులకీ తెలంగాణలో తమ స్థానం అర్ధమైంది.

కొన్నాళ్లుగా ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తున్న కోదండరాం ఇప్పుడు స్పీడు పెంచాడు. నిరుద్యోగుల తరఫున గళం విప్పాడు. నా చిన్నప్పుడు ఈ అసంతృప్తుల్ని ప్రభుత్వాలు పట్టించుకునేవి, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అగత్యం తప్పింది. అధికారంలో ఉన్నవాళ్లు రాజులు, వారి కొడుకులు యువరాజులుగా చలామణి అయిపోతున్నారు.

అంచేత సహజంగానే ప్రభువుల్లో అసహనం పెరిగింది. ఈ అసహనంలో రాష్ట్రప్రభుత్వాలకీ, కేంద్రప్రభుత్వానికీ పోటీ వుంది. ప్రభుత్వాలకి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా కనపడసాగాయి. తమని ప్రశ్నించేవారు ఉగ్రవాదులుగా నమ్మసాగాయి. కాబట్టి నిరసన తలపెట్టిన కోదండరాంని ఇంట్లోనే అరెస్ట్ చేసేసి, తెలంగాణా ప్రభుత్వం తన ప్రజానీకాన్ని 'కోదండరాం' అనే పెనుప్రమాదం నుండి రక్షించింది.

ఇందుకు ప్రభుత్వం చెపుతున్న కారణాలు గమ్మత్తుగా ఉన్నాయి.

"ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు ఇస్తుంటే కోదండరాం నిరుద్యోగుల్ని రెచ్చకొడుతున్నాడు!"

అంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే ఇక కోదండరాం మాట నిరుద్యోగులు మాత్రం ఎందుకు వింటారు? కోదండరాం వెనక్కి తిరిగి చూసుకుని, తన వెనుక యెవరూ లేకపోతే ఇంట్లోనే వుండిపోతాడు కదా! అప్పుడు ప్రభుత్వానికి ఇంకా హాయి కదా!

"కోదండరాం కాంగ్రెస్ ఏజంట్!"

అయితే ఏంటీ? అదేమన్నా నేరమా? కాంగ్రెస్ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ ఏజంట్లకి నిరసన తెలిపే హక్కు ఉండదా?!

"కోదండరాం సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది, అందుగ్గానూ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు."

సో వాట్? ఈ దేశంలో అందర్లాగానే ఆయనకీ పార్టీ పెట్టుకునే హక్కుంది! ఆ పార్టీ పెట్టుకునేందుకు ఒక ప్లాట్‌ఫాం యేర్పాటు చేసుకుంటున్నాడు! చేసుకోనీండి, ఎవరైనా పార్టీ పెట్టేముందు చేసేదదే కదా!

ప్రస్తుతం తెలంగాణాలో మీడియా అధికారానికి దాసోహం అంటుంది. అందుక్కారణం మీడియా ఆస్తులు హైదరాబాద్‌లో ఉండటం, ఆ హైదరాబాద్ తెలంగాణలో ఉండటం కావచ్చు. యేదియేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కెయ్యడం ప్రభుత్వాలకి ఒక విధానంగా మారిపోయింది.

తెలంగాణా ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న పాటగాళ్లు, రాతగాళ్ళు, గీతగాళ్ల ఎడ్రెస్ ఎక్కడుందో కూడా తెలీడం లేదు. ఇటువంటి సమయంలో కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీయడం సాహసోపేతమైన చర్యగా భావించాలి.

నా ఉద్దేశం - అసలు కోదండరామ్ అవసరం తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యెక్కువగా వుంది. కానీ - మొదట్నుండీ ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సంపాదనపరులు తప్ప మేధావులు లేరు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల దురదృష్టం!

(picture courtesy : Google)