Friday 24 August 2012

నో ప్రోబ్లెం

అది  ఢిల్లీలో  ఆంధ్రాభవన్. ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  దిగాలుగా  ఉన్నాడు. ధర్మాన  రాజీనామాని అమోదింపజేద్దామని  ఢిల్లీ  వచ్చాడు. ఇప్పుడు  అధిస్టానం  తన  రాజీనామాని  అమోదించే  పనిలో  ఉంది!

రేడియోలో  మంద్ర స్థాయిలో  పాట.

'తలచినదే  జరిగినదా  దైవం  ఎందులకు?'

ముఖ్యమంత్రికి  చికాకేసింది. సెక్రెటరీని  విసుక్కున్నాడు.

"సెక్రెటరీ! చేంజ్  ద  సాంగ్." అజ్ఞాపించాడు.

సెక్రెటరీ  హడావుడిగా  రేడియో  స్టేషన్  మార్చాడు.

'ఏ  నిమిషానికి  ఏమి  జరుగునో  ఎవరూహించెదరు.. విధి విధానమును  తప్పించుటకు  ఎవరు.. '

ముఖ్యమంత్రి గారి  చిరాకు  ఇంకా  ఎక్కువవడాన్ని  గమనించిన  సెక్రెటరీ  కంగారుగా  రేడియో  ఆఫ్  చేశాడు. టీవీ  ఆన్  చేశాడు.

టీవీలో  కేంద్రమంత్రి  బేణీప్రసాద్ వర్మ  మాట్లాడున్నాడు. "ద్రవ్యమాంద్యం  రైతులకి  మంచిది. ఇందువల్ల  రైతులకి  గిట్టుబాటు  ధర  పెరుగుతుంది.... " శ్రద్ధగా  వినసాగాడు  ముఖ్యమంత్రి.

ఇంతలో  సెక్రెటరీ  అడిగాడు.

"సార్! మన  తెలుగు  జర్నలిస్టులు. మీ  ఇంటర్వ్యూ  కావాల్ట. పంపించమంటారా?"

పంపించమన్నట్లు  చేత్తో  సైగ చేశాడు  ముఖ్యమంత్రి.

బిలబిల మంటూ  వచ్చేశారు  జర్నలిస్టులు. మూణ్ణిమిషాల్లో  మైకులు  ఎరేంజ్  చేసుకున్నారు.

"ముఖ్యమంత్రిగారు! కరెంట్  లేక  పంటలు  ఎండిపోతున్నాయి. కరువొచ్చే  పరిస్థితులున్నాయి. మీ  రియాక్షన్?"

"నో  ప్రోబ్లెం! కరువొస్తే  ఫార్మర్స్ కి  మంచిదే. వంద బస్తాల  రేటు  ఒక  బస్తాకే  వచ్చేస్తుంది. రైతులకి  కూలీల  ఖర్చు  మిగుల్తుంది. విత్తనాలు  కొనుక్కునే  అవసరం  కూడా  ఉండదు." బేణీప్రసాద్ వర్మని  గుర్తు  చేసుకుంటూ  అన్నాడు  ముఖ్యమంత్రి.

"రాష్ట్రంలో  రోడ్డు  ప్రమాదాలు  పెరిగిపోతున్నాయి. మీ  ప్రభుత్వం  చర్యలు  తీసుకోటల్లేదని  చంద్రబాబు  తిట్టిపోస్తున్నాడు. మీ  సమాధానం?"

చంద్రబాబు  పేరు  వినంగాన్లే  కిరణ్ కి  కోపమొచ్చింది.

"నో  ప్రోబ్లెం! రోడ్డు  ప్రమాదాల  విలువ  చంద్రబాబుకేం  తెలుసు? మెకానిక్ లు  లాభపడుతున్నారు. కార్ల  ఇండస్ట్రీ  బాగుపడుతుంది. ఇన్సూరెన్స్  కంపెనీల  నుండి  పరిహారం  పొందడంలో  మనమే  అగ్రస్థానంలో  ఉన్నాం. ఇవన్నీ  కేంద్రం  నుండి  వచ్చే  నిధులుగానే  భావించాలి."

"రాష్టంలో  అంటురోగాలు, విషజ్వరాలు  విజృంభిస్తున్నాయి. అయినా  ప్రభుత్వం  నిమ్మకి  నీరెత్తినట్లు  ఉందని  మీ  పార్టీకే  చెందిన  రవీంద్రారెడ్డి  విమర్శిస్తున్నారు."

ఈ  సారి  కిరణ్  కోపం  తారాస్థాయికెళ్ళింది.

"నో  ప్రాబ్లెం! యు మస్ట్  అండర్ స్టాండ్  దట్  వి హేవ్ ఏ స్టేటజీ! రోగాలు  రాకపోతే  హాస్పిటల్స్ కి  లాభాలెలా వస్తాయి? డాక్టర్లు  ఎలా  బతుకుతారు? సీ! అవర్  స్ట్రాటెజీ  ఈజ్.. "

ఇంతలో  సెక్రెటరీ   ముఖ్యమంత్రి  చెవిలో  ఏదో  ఊదాడు. కిరణ్  ముఖంలో  రంగులు  మారాయి. హడావుడిగా  బయటకి  పరిగెత్తాడు  ముఖ్యమంత్రి.

"ముఖ్యమంత్రిగారికి  మేడం గారితో  ఇంటర్వ్యూ  ఉంది. అన్ని  విషయాలు  తరవాత  మాట్లాడతారు." అంటూ  దయచెయ్యండన్నట్లు  విలేఖరులకి  నమస్కరించాడు  సెక్రెటరీ.

"నో  ప్రోబ్లెం!" అంటూ  విలేఖరులు  కూడా  నిష్క్రమించారు.

Wednesday 22 August 2012

ముక్యమంత్రి యాడుండాడు?


"ష్! అబ్బా! సలి పెడతాంది. పొద్దుగూకులు  ఈ  సలిపెట్టె  ముందు  కూకుంటా వెందుకు? ఆపెయ్!" నా  కన్సల్టేషన్  చాంబర్లోకి  అడుగు  పెడుతూనే  హుకుం  జారీ  చేశాడు  పేరయ్య.

పేరయ్యది  దుర్గి  మండలంలో  ఒక  చిన్న  పల్లెటూరు. మనిషి  నల్లగా, పల్చబడ్డ  తెల్ల జుట్టుతో, ముడతలు  పడ్డ  చర్మంతో  కాయబారుగా  ఉంటాడు. వయసు  అరవై  పైనే. కానీ  చాలా  హుషారుగా  ఉంటాడు. ఒక  ఎకరం  పొలముంది. కూతుళ్ళ  పెళ్ళి  చేశాడు. ఒకడే  కొడుకు. ఆ  అబ్బాయికి  మానసిక వ్యాధి. రెండేళ్ళుగా  నా  దగ్గర  కొడుక్కి  వైద్యం  చేయిస్తున్నాడు. ఈ  మధ్య  కొడుకు  రానని  మొరాయిస్తుండటంతో.. ఒక్కడే  వచ్చి  పరిస్థితి  వివరించి  మందులు  తీసుకెళ్తున్నాడు.

మానసిక వైద్యం  ఒక  ప్రత్యేకత  కలిగి  ఉంటుంది. రోగి, రోగి  తరఫున వారు  ఎక్కువసార్లు  వైద్యుణ్ణి  కలుస్తుంటారు. ఆ  ప్రాసెస్ లో  బాగా  పరిచయస్తులైపోతారు. ఇనీషియల్  కన్సల్టేషన్స్లో  రోగ లక్షణాలు, మందులు  వగైరా  విషయాలే  మాట్లాడుకున్నా.. తర్వాత్తర్వాత  సంభాషణల్లో  పిచ్చాపాటి  కూడా  చోటు  చేసుకుంటుంది. వీరు  స్నేహితులు  కారు. కాని  స్నేహం  ఏర్పడుతుంది. అదే విధంగా  పేషంట్లకి, వైద్యుడికి  మధ్య  చనువు  కూడా  ఏర్పడుతుంది.

ఇదిగో  ఆ  చనువే  పేరయ్య  చేత  ఏసీ  ఆపెయ్యమని  ఆజ్ఞ  జారీ  చేయించింది.

"ఏంటి  పేరయ్యా! ఏసీ  ఆపేస్తే  ఐదు  నిమిషాల్లో  గది  వేడెక్కిపోతుంది. ఆ  తరవాత  చచ్చూరుకుంటాను." అన్నాను  నవ్వుతూ.

పేరయ్య  మొహం  చిట్లించాడు.

"నువ్వింత  సలిలో  కూకుంటావేమో! నా  వల్ల  గాదు. ఒణుకు  పుడతాంది." అన్నాడు  పేరయ్య.

హఠాత్తుగా  జ్ఞానోదయం! అవును. పేరయ్యే  కరెక్ట్. వాతావరణం  వేడిగా, ఉక్కుపోతగా  ఉంది. ఇది  ప్రకృతి  సిద్ధం. ఈ  వాతావరణానికి  పేరయ్య  శరీరం  చాలా  సహజంగా  అలవాటు  పడిపోయింది. నా  గది  కృత్రిమంగా  చల్లబరచబడింది. డబ్బు, నాగరికత  నన్ను  సుకుమారంగా  మార్చేశాయి.


వెంటనే  ఏసీ  ఆపేశాను.



"కూర్చో  పేరయ్యా! ఏమంటున్నాడు  మీ అబ్బాయి?" అంటూ  ఫేన్  స్విచాన్  చేశాను.



పేరయ్య  సమాధానం  చెప్పలేదు. భయంగా  ఫేన్  వైపు  చూస్తూ..



"అదొద్దంటే  మళ్ళిదేశావేంది? నువ్వు  కుదురుగా  కూకోవా  ఏంది!" అన్నాడు.



నాకు  చికాకేసింది.


"పేరయ్యా! ఏసీ  వద్దన్నవ్. ఆపేశా. ఇప్పుడు  ఫేన్  వద్దంటున్నావ్. నేనీ  గదిలో  కూర్చోవాలా వద్దా? ఫేన్  కేమయ్యింది?" అంటూ  విసుక్కున్నాను.

"నాకు  కరెంట్  గాలి  పడదు. ఏడి  సేస్తది." అన్నాడు.

నాకు  నవ్వొచ్చింది.

"మైడియర్  పేరయ్యా! కరెంట్  ఫేన్  రెక్కల్ని  తిప్పుతుంది. అంతే! ఆ  రెక్కలు  పైనున్న  గాలిని  కిందకి  తోస్తాయి." అన్నాను  న్యూటన్ లా.

పేరయ్య  ఫేన్  వైపు  అనుమానంగా  చూస్తూ  అన్నాడు.

"అయితే  ఏంది? కరెంటే గదా  రెక్కల్ని  తిప్పేది." అన్నాడు.

"రెక్కల్ని  కరెంట్  తిప్పినా.. " చెప్పబోతూ  ఆగిపొయ్యాను.

ఇప్పుడు  మహీధర  నళినీ మోహన్, కొడవటిగంటి  రోహిణీ  ప్రసాదుల్లా  పేరయ్యని  నేను  ఎడ్యుకేట్  చెయ్యల్సిన  అవసరం  ఉందా? లేదు. లేదు  గాక  లేదు. అదీగాక.. బయట  పేషంట్లు  చాలా  మంది  వెయిట్  చేస్తున్నారు.

ఫేన్  ఆపేస్తూ  అన్నాను.

"పేరయ్యా! నీలాంటోళ్ళు  ఉండబట్టే  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  మా లాంటివాళ్ళకి  కొద్దో  గొప్పో  పవర్  ఇవ్వగలుగుతున్నాడు."

పేరయ్య  మళ్ళీ  మొహం  చిట్లించాడు.

"నీకు  నాతో  యేంది  ఆసికాలు? మనకి  ముక్యమంత్రి  యాడుండాడు? ఎప్పుడో  సచ్చిండుగా!" అన్నాడు.

వామ్మో! ఈ  పేరయ్యని  బాగు  చెయ్యడం  నా  వల్ల కాదు. అయినా  ప్రయత్నిస్తాను.

"చూడు  పేరయ్యా! నువ్వు  చెప్పే  ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి  చనిపొయ్యాడు. మనుషులు  చనిపోయినా  ముఖ్యమంత్రి   పదవి  చనిపోదు. అందుకే  ఆ  తరవాత  రోశయ్య, ఇప్పుడు  కిరణ్ కుమార్ రెడ్డి  ముఖ్యమంత్రులయ్యరు."  అన్నాను.


పేరయ్య  నన్ను  నమ్మలేదు.


"నీకాడ  మా  కుంటెంకళ్ళా  శానా  ఎకసెక్కలుండాయే! మనకి  ముక్యమంత్రి  ఏడుండాడు? యాడైనా  సచ్చినోడు  బతికొస్తాడా  ఏంది?" అన్నాడు.

నాకూ  మళ్ళీ  జ్ఞానోదయం! అవును. నిజమేగా! మనకి  ముఖ్యమంత్రి  ఎక్కడున్నాడు? ప్రస్తుతం  రాష్ట్రం  పరిస్థితి  చూస్తుంటే  ఎవరికైనా  కలిగే  అభిప్రాయం  ఇదే! అవును  పేరయ్యా! నువ్వే  కరెక్ట్! ఒప్పుకుంటున్నాను. మనకి  ముఖ్యమంత్రి  లేడు!


(photo courtesy: Google)

Tuesday 21 August 2012

రావిశాస్త్రి 'పక్కింటి అబ్బాయి'


నిరంజనరావుకి తండ్రి లేడు. భూమ్మీద పడగానే అతనికి అమ్మా, ఆకలి తప్ప మరేం దక్కలేదు. అందుకే పరిస్థితుల్ని జయించి పైస్థాయికి వెళ్ళాలనే కసి కూడా అప్పుడే కలిగింది. 

అతని మాటలు వేసవికాలంలో మల్లెపువ్వుల్లా మధురంగా ఉండవు. చలికాలంలో వానచినుకుల్లా చురుక్కుమంటాయి... నిశ్చలంగా ఉన్నప్పటికీ అతను ధ్యానంలో ఉన్న యోగిలా నిర్మలంగా కనిపించడు. సత్రంలో బైరాగిలా చవగ్గా కూడా కనిపించడు. పుట్టలో పాములా భయంకరంగా కనిపిస్తాడు.

నిరంజనరావుకి తనచుట్టూ ఉండే దారిద్ర్యపు వాతావరణం అన్నా, తనచుట్టూ ఉండే తనలాంటివారన్నా తెగ ద్వేషం ప్రబలింది... అంతా ఒకే జెయిల్లో ఉన్నప్పటికీ అమెరికాలో తెల్లఖైదీలు నల్లఖైదీలని చూసినట్లు సాటివారిని చూసి అసహ్యించుకోనారంభించాడు... జీవితంలో అమరసౌఖ్యాలున్నాయనీ, వాటిని "చదువు" ద్వారా సంపాదించుకోవచ్చని అతను గ్రహించాడు.

పోటీ పరీక్షకి ప్రిపేర్ అవ్వటం కోసం చేస్తున్న చిన్నఉద్యోగాన్ని వదులుకొని.. పట్నంలో ఒక గది అద్దెకి తీసుకుంటాడు. ఇంటి ఓనర్ పక్కగదిని దగ్గర్లోనే ఉన్న ధర్మాసుపత్రి వైద్యనిమిత్తం వచ్చేవారికి రోజువారి అద్దె పద్ధతిన ఇస్తుంటాడు. పరీక్షల కోసం నిరంజనుడు భీకరంగా చదువుతుండగా పక్కగదిలోకి ఒక పేదకుటుంబం అద్దెకొస్తుంది.

ఆ కుటుంబంలోని భర్తకి చర్మం, దంతం, ఎమిక, దగ్గు తప్ప అతన్లో ఇంకేమి ఉన్నట్లులేవు... ఆ ఆడమనిషి పుల్లలా ఉంది. ఆమె గుండెలు అర్చుకుపోయాయి. ఆమె ముఖం పీక్కుపోయింది. ఆమె కళ్ళు పిల్లిని చూసిన ఎలక కళ్ళల్లా లేవు! పులిని చూసిన లేడి కళ్ళల్లా వున్నాయి. ఆ లేడైనా అర్నెల్లనించీ ఏఆకూ, అలమూ దొరక్క ఉప్పునీళ్ళు తాగి బతుకుతున్న లేడన్నమాట... ఆవిడ పెద్దడాక్టర్ల ముందు నగ్నంగా నిల్చున్న జబ్బుమనిషిలా చాలా దీనంగా కనిపిస్తుంది. ఆ పిల్లవాడి ఏడుపు చాలా ఘోరంగానూ, భయంకరంగానూ ఉంది.

ఆ పిల్లవాడి ఏడుపు తన చదువుకి తీవ్రఆటంకంగా పరిణమిస్తుంది. భర్త ధర్మాసుపత్రిలో చేరతాడు. ఓ అర్ధరాత్రి ఆ పిల్లవాడికి ప్రాణం మీదకొస్తుంది. ఆ ఆడమనిషి నిరంజనరావుని ఆస్పత్రి దాకా తోడు రమ్మని దీనంగా అర్ధిస్తుంది. అప్పటికే చిర్రెత్తిపోయున్న నిరంజనం గావుకేకలు వేస్తాడు.

"పిలవను. రిక్షా పిలవను! రాను. ఆస్పత్రికి రాను. చెయ్యను. సహాయం చెయ్యను. మీకోసం నేను పూచికపుల్ల మొయ్యను. నా చూపుడువేలు చూపిస్తే చాలు మీరంతా బాధల బురదల్లోంచి బైటపడి బంగారులోకాల్లో విహరిస్తానంటే నేను చూపుడువేలు చూపించను! ఎందుకు చూపించాలి?" అంటూ తలుపులు ఫెడిల్మంటూ మూసేసుకున్నాడు.

తెల్లారి చూస్తే ఆ ఆడమనిషి గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కధని రావిశాస్త్రి తనకి అలవాటైన ధోరణిలో ఈ విధంగా ముగిస్తాడు.

"ఇదంతా జరిగి ఎన్నాళ్ళయిందండీ?"

"పదిహేనేళ్ళయింది సార్!"

"మరైతే - రంజనుడో నిరంజనుడో - అతనేం చేస్తున్నాడండీ ఇప్పుడు?"

"వాడిప్పుడు ప్రజలపై పన్నులు విధించే ప్రభుత్వ ప్రత్యేకశాఖలో ప్రధానోద్యోగిగా ఉంటున్నాడు సార్!"

తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వారపత్రిక (14 - 07 - 1967)

పుస్తక రూపం - బాకీ కధలు

జీవితంలో అమరసౌఖ్యాలని సంపాదించుకోవటానికి "చదువు" మార్గన్నెంచుకున్న నిరంజనరావుని.. చదువులు, పోటీపరీక్షలు ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుని.. సమాజం పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రభుత్వోద్యోగులకి ప్రతీకగా తీసుకున్నాడు.

నిరంజనమంటే మనకి అసహ్యం కలిగేట్లు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా.. అనుమానం వచ్చిందేమో!.. వెంకట్రావనే చిన్ననాటి స్నేహితుడిని నిరంజనుడు ఎలా చంపేశాడో చెప్పి.. మనకి నిరంజనుడి పట్ల రోత కలిగేట్లు రాశాడు. బహుశా.. మంచికి చెడు చెయ్యరాదు. చెడుకు మంచి చెయ్యరాదనే తన రచనా పాలసీననుసరించి.. ఈ (అతి) జాగ్రత్త తీసుకునుంటాడు. 

చదువు లేనివాడు చదువుకున్నవాడిని ఎందుకు గౌరవిస్తాడు? చదువు జ్ణానాన్నిస్తుందని. సమసమాజ కాంక్షని పెంచుతుందని. కానీ.. కేవలం ఉన్నత స్థానాల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదించుకునేందుకు 'చదువు' ఒక మార్గంగా ఎంచుకునేవారు సమాజానికి కీడే చేస్తారని ఈ కధలో రావిశాస్త్త్రి చెబుతాడు.

నేనీ కథని ఇరవైసార్లు చదివుంటాను. తన పాయింట్ ని కథారూపంలో మలచడానికి రావిశాస్త్రి  ఎంచుకున్న శైలి అనితర సాధ్యం. అందుకే ఎన్నిసార్లు చదివినా.. 'ఇంత గొప్పగా ఎలా రాశాడబ్బా!' అని ఆశ్చర్యపోతూ చదువుతుంటాను.

రావిశాస్త్రి ఈ కధ రాసి 45 సంవత్సరాలు నిండాయి. ఇప్పుడు నిరంజనుడి వారసులు ఉద్యోగాలేం ఖర్మ! అన్ని రంగాల్లో చెలరేగిపోతున్నారు. రోజురోజుకీ వీరి సంఖ్య పెరిగి పోతుందేమోనన్న భయాందోళనలు చెందవలసిన పరిస్థితులు ప్రస్తుతం మనకున్నాయి. 

(italics రావిశాస్త్రివి)

Friday 17 August 2012

సినిమా పాటల ప్రత్యేకత


ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని మైసూరు పాక్ తింటున్నారు, వారిద్దరికీ ఆ స్వీట్ ఎంతగానో నచ్చింది. ఆ ఇద్దర్లో ఒకాయన జ్ఞాని, వంటలో కూడా అనుభవం ఉంది, పైగా కవి. అంచేత - ఆయన తనకెంతగానో నచ్చిన ఆ స్వీటుని మెచ్చుకుంటూ.. దాని రుచికి కారణమైన పంచదార పాకాన్ని, నెయ్యిని వర్ణిస్తూ మాట్లాడసాగాడు. అంతేనా! కొద్దిసేపటికి అద్భుతంగా కవిత్వం చెప్పడం కూడా మొదలెట్టాడు.

ఆ రెండోవాడు అజ్ఞాని. వాడికసలు మైసూర్ పాకం తయారీలో శెనగ పిండి, నెయ్యి వాడతారని కూడా తెలీదు. కానీ - తియ్యతియ్యగ, మెత్తమెత్తగా నోట్లోకి జారిపోతున్న మైసూరు పాకాన్ని ఆపకుండా మింగుతూనే ఉన్నాడు. వాడు కవిగారి కవిత్వాన్ని వింటున్నాడు గానీ అర్ధం చేసుకోలేకపోతున్నాడు! అయితే - మైసూర్ పాక్ ముక్కల్ని కవిగారి కన్నా ఎక్కువే పొట్టలోకి పంపేశాడు.

ఇదంతా నే రాయదలచుకున్న విషయానికి ఉపోద్ఘాతం. పై కథలో అ అజ్ఞానిని నేనే! నాకు సంగీత పరిజ్ఞానం లేదు, కానీ పాటలు వింటాను, చాలా పాటలు చాలాసార్లు వింటాను. కొన్ని పాటలంటే మరీమరీ ఇష్టం. పాటలకి ముడిసరుకు సంగీతం. మరి సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను పాటల్ని ఎందుకు ఇష్టపడుతున్నాను? ఇందుకు కారణాలు (నాకు తోచినవి) రాస్తాను.

ఆలోచించగా - నా 'ఫలానా పాట ఇష్టం' అనేది, నా 'ఫలానా సినిమా ఇష్టం'తో కలిసిపోయి ఉందని అనిపిస్తుంది. నేను సినిమా పాటని సినిమాలో భాగంగా మాత్రమే చూస్తాను. సినిమాని ఒక 'ఇల్లు'గా ఊహించుకుంటే, పాట ఆ ఇంట్లో ఒక గది వంటిది. ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే ఆ గదికూడా శుభ్రంగా ఉంటుంది, లేకపోతే లేదు. అంతే! ఇంకొంచెం వివరంగా చెబుతాను.

సినిమా దృశ్యప్రధానమైనది. పాటలు కథలో కలిసిపోయి ఉంటాయి, అంటే - పాట అనేది ఒకకథ చెప్పేవిధానంలో భాగం. దర్శకుడు కథని ముందుకు నెట్టడానికో, విషయాన్ని మరింత గాఢంగా చెప్పడానికో పాటని వాడుకుంటాడు. అంచేతనే మనకి బాగా నచ్చిన పాటలు రేడియోలో వింటున్నా ఆ సినిమా సన్నివేశం గుర్తొస్తుంది. అంటే ఒకపాట మెదడులో దృశ్యపరంగా స్టోర్ అయ్యుంటుంది, సినిమా పాటలకి మాత్రమే ఈ రకమైన కండిషనింగ్ ఉంటుంది. క్లాసికల్ సంగీతం ధ్వని ప్రధానమైనది, కాబట్టి ఈ లక్షణం కలిగుండదు.

ఒక పాట సాహిత్యం కాగితంపై చదువుతాం, 'బాగుంది'. అదే పాటని ఒక మంచి గాయకుడు భావయుక్తంగా ఆలపించాడు, 'ఇంకా బాగుంది'. అదే పాటకి నటనని జోడించి సినిమాలో దృశ్యపరంగా చూశాం. ఇప్పుడు మనసు సాహిత్యాన్ని ఫాలో అవుతుంది, చెవి శబ్దాన్ని (సంగీతం) ఫాలో అవుతుంది, కన్నుదృశ్యాన్ని ఫాలో అవుతుంది.  ట్రిపుల్ ధమాకా! జ్ఞానేంద్రియాల్లో visual impact బలమైనది. అంచేత ఇప్పుడా పాట ఇంకాఇంకా బాగుంటుంది. ఈ విషయం మరింత వివరించడానికి నాకెంతో ఇష్టమైన ఆవకాయ ఉదాహరణ రాస్తాను.

ఇవ్వాళ మీరు డైటింగ్ చేస్తున్నారు, కాబట్టి - ఈ రోజంతా ఏమీ తినకూడదని డిసైడైపొయ్యారు. ఇంతలో ఎదురుగా - ఒక గిన్నెలో అప్పుడే కలిపిన కొత్తావకాయ కనిపిస్తుంది. కమ్మని ఆవఘాటు ముక్కుపుటాల్ని తాకింది - ఇది  olfactory (వాసన) sense. ఎర్రటి ఆవకాయ చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది - ఇది visual sensory (కంటిచూపు) impact. ఇప్పుడు olfactory + visual sensory organs మెదడులోని hypothalamus లో ఆకలిని కలిగించే నాడీవ్యవస్థని stimulate చేస్తాయి - నోట్లో నీరూరుతుంది. ఇక్కడ ఆవకాయ రుచి gustatory (రుచి) sense, కావున - ఆకలి నకనకలాడుతుంది.

ఇంక ఆ ఆవకాయని వేడివేడి అన్నంలో ఎర్రెర్రగా కలుపుకుని తినకుండా ఆపడం ఎవరి తరం? ఎవడన్నా ఆపుదామన్నా మర్డర్ చేసెయ్యమా? ఆవకాయని కళ్ళు మూసుకుని వాసన చూసినా, ముక్కు మూసుకుని కంటితో చూసినా ఇంత ఆకలి వెయ్యదు. అంటే - ఇక్కడ మూడు sensory organs ఒకదాన్ని ఇంకోటి compliment చేసుకున్నాయి, అదీ సంగతి! 'ఒక దృశ్యరూపం మైండ్ లో స్థిరంగా స్థిరపడిపోతుంది.' అన్న నగ్నసత్యం మీక నా ఆవకాయ పచ్చడి ఉదాహరణ ద్వారా అర్ధమైందని అనుకుంటున్నాను. ఇక్కడిదాకా నా వాదన మీరు ఒప్పుకున్నట్లయితే, ఇప్పుడు ఇదే వాదనని సినిమా పాటల్లోకి  లాక్కెళ్తాను.

ఇందుకు ఉదాహరణగా 'మూగ మనసులు'లోని పాటొకటి తీసుకుంటాను. ఈ సినిమాలో 'పాడుతా తీయగా చల్లగా.. ' అనే పాట నాకు చాలా ఇష్టం. దిగుల్లో ఉన్న అమ్మాయిగార్ని ఓదార్చడానికి గోపి పడే వేదనలో చావుపుట్టుకల మర్మమంతా వండి వార్చేశాడు ఆత్రేయ. నాకీ పాట వింటున్నప్పుడల్లా సావిత్రి, నాగేశ్వరరావులే కళ్ళముందు కనిపిస్తారు. దుఖాన్ని గొంతునిండా నింపుకున్న ఘంటసాలని భారంగా కె.వి.మహాదేవన్ సంగీతం ఫాలో అవుతుంది. ఈ పాట ఇంతలా నాకు గుర్తుండిపోడానికి కారణం ఘంటసాల, ఆత్రేయ, కె.వి.మహదేవన్, నాగేశ్వరరావు, సావిత్రి. ద స్కోర్ ఈజ్ పెర్ఫెక్ట్ టెన్!

అయితే - వీళ్ళంతా ఎవరికేవారే గొప్పప్రతిభావంతులు. వీళ్ళని సరీగ్గా వాడుకోగలగడమే అసలైన సవాల్. వీళ్ళ ప్రతిభని తన వంటలో దినుసులుగా సమపాళ్ళలో దట్టించి కమ్మగా వంట చేసిన హెడ్ చెఫ్ ఆదుర్తి సుబ్బారావు. నాకు టోపీ లేదు, అయినా - హేట్సాఫ్ టు యు ఆదుర్తి! ఇక్కడ దర్శకుడి కాంట్రిబ్యుషనే ఈ పాటకి ఇంత చిరస్మరణీయతని ఇచ్చింది. ఆయనీ పాటని సినిమాలో చొప్పించిన సందర్భం, సన్నివేశం అద్భుతం. ఇప్పుడో చిన్న ప్రయోగం. ఈ పాట వింటూ పాట సన్నివేశ దృశ్యాన్ని, సావిత్రి, నాగేశ్వరరావుల ఇమేజెస్ ని బలవంతంగా పక్కనపెట్టటానికి  ప్రయత్నిద్దాం. చాలా వెలితిగా, ఇబ్బందిగా ఉంది కదూ (ముక్కు మూసుకుని కొత్తావకాయని చూసినట్లు)!

నే చెప్పదలచుకుంది ఇదే. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి మొదలైనవారు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్ని గుర్తు తెచ్చుకోండి. దాదాపు అన్నిపాటలూ దృశ్యంగానే కళ్ళముందు కదలాడుతాయి. అందుకే - సినిమా పాటల్ని కేవలం సంగీతపరంగా అంచనా వెయ్యరాదని నా అభిప్రాయం. పాట బాగుంది, కాని సన్నివేశం బాలేదనిపిస్తే.. స్వీట్ బాగుంది, కానీ నెయ్యి ఎక్కువైందన్నట్లుగా ఉంటుంది. అప్పుడు స్వీట్ వెగటుగా ఉంటుంది.

ఇప్పుడు చెడిన వంటకి ఉదాహరణ చెబుతాను. నే చదువుకునే రోజుల్లో 'కన్నెవయసు' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' అనే పాట సూపర్ హిట్. సత్యం చక్కగా స్వరపరిచాడు. బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే గాయకుడిగా నిలదొక్కుకుంటున్నాడు. పాపం కష్టపడి పాడాడు. హీరో మా గుంటూరబ్బాయే! సినిమా చూడ్డానికి నాకింతకన్నా కారణమేం కావాలి? రిలీజ్ రోజే  సినిమాని శేషమహాల్లో చూశాను - పరమ చెత్త. పాటని చెడగొట్టటానికే సినిమా తీసినట్లున్నారు!

'కన్నెవయసు' హీరో సున్నిత మనస్కుడు, కవి. హీరోయిన్నికావ్యకన్యగా భావిస్తాడు. దాశరధి, సత్యం, బాలుల మేజిక్ 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' పాట. మంచిభోజనం పెట్టేముందు పరచిన చక్కటి అరిటాకులా, ఈపాట సినిమా మొదట్లోనే వచ్చేస్తుంది. కానీ అక్కడ అరిటాకు తప్ప భోజనం ఘోరం! ఇంత మంచిపాట ఆ సినిమాకి ఉపయోగపళ్ళేకపోయింది. 'పాడుతా తీయగా.. ' పాటని ఆదుర్తి ఆకాశమంత ఎత్తుకి తీసికెళితే, ఇక్కడ ఇంకో దర్శకుడు ఒక మంచిపాటని పాతాళానికి తొక్కేశాడు. అదీ కథ! అందువల్ల - 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. '  పాట మాత్రమే 'మంచిపాట' అన్నట్యాగుతో అలా మిగిలిపోయింది.

అవడానికి రెండూ మంచి పాటలే. ఒకటి మంచిసినిమాలో స్థానం సంపాదించుకుని వన్నె పెంచుకుంటే, మరోటి బురదలో మందారంలా అక్కడే ఉండిపోయింది. నాకు చింతపండు పులిహోర భలే ఇష్టం. పులిహోర తయారీలో పచ్చిమిరపకాయల్ని ముందుగా చింతపులుసులో ఉడికించాలి. అప్పుడా చింతపులుపు పట్టిన పుల్లమిరపకాయల్ని పులిహోరలో నంజుకుంటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. అలాగే - ఒక మంచిపాట కూడా 'కథ' అనే పులుసులో బాగా ఉడకాలి, అప్పుడే రుచి!

అమెరికా రోడ్ల మీద గుంపులుగా కనిపించే అందమైన కార్లు, అక్కడి రోడ్లమీద తిరిగితేనే బాగుంటాయి. అక్కడ బాగున్నాయి కదాని వాటిని మనూళ్ళో తిప్పితే దిష్టిపిడతల్లా ఉంటాయి, అట్లే - మనూరికి మూడుచక్రాల ఆటోలే అందం (అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది). అమెరికా భారత సంతతి బోల్డెంత సొమ్ము పోసి నేర్చుకున్న కూచిపూడి నాట్యాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తేనే శోభిస్తుంది (గొప్పకళని ఖరీదైన కళారాధకులు మాత్రమే ఆస్వాదించగలరు), శ్రీరామనవమి పందిళ్ళలో కాదు. కావున - ఒక మంచి పాటకి మంచి సన్నివేశం జత అయితేనే మరింతగా ప్రకాశిస్తుంది, లేకపోతే లేదు, అదీ సంగతి!              

(photo courtesy : Google)

Tuesday 14 August 2012

ఉసైన్ బోల్ట్! నువ్వు మాతో పరిగెత్తగలవా?


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

టీవీలో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ చూస్తున్నాను.

"సుబ్బూ! భలే సమయానికొచ్చావు. బోల్ట్ ని చూడు, అదరగొట్టేస్తున్నాడు. హేట్సాఫ్ టు ఉసైన్ బోల్ట్ , ద గ్రేటెస్ట్ ఎథ్లెట్." అన్నాను ఉత్సాహంగా.

సుబ్బు మొహం చిట్లించాడు.

"బోడిగుండు బోల్టుగాడు ఆ గ్రౌండులో పరిగెత్తడం నాకేమంత గొప్పగా అనిపించట్లేదు." అన్నాడు సుబ్బు. 

నా ఉత్సాహం మీద నీళ్ళు కుమ్మరించినట్లయ్యింది.

"సుబ్బూ! నీకు బుర్ర సరీగ్గా పన్జేస్తున్నట్లులేదు, అతను గ్రౌండులో పరిగెత్తక ఇంకెక్కడ పరిగెత్తుతాడోయ్?" అన్నాను.

"జీవితంలో పరిగెత్తాలి, పరిగెత్తడంలో మనకిలా కొత్త రికార్డులు సృష్టించుకోవాలి." కవితాత్మకంగా అన్నాడు సుబ్బు. 

ఇంతలో కాఫీ వచ్చింది, సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన పిల్లల జీవితాలు చూడు. వాళ్ళని పుట్టంగాన్లే కేజీల్లో పడేస్తారు. ఇంక చదువుల పరుగు, పరీక్షల పరుగు. కార్పొరేట్ స్కూళ్ళు, నిర్బంధ ర్యాంక్ సాధన పధకాలు. మెడిసిన్ సీటు, IIT సీటు అనే పతకాలు సాధించాలి.. ఆపకుండా పరిగెత్తుతూనే ఉండాలి."

"మంచిదే కదా! కాంపిటీటివ్ గా లేకుంటే మంచి భవిష్యత్తు ఎలా సాధ్యం?" అడిగాను. 

"మంచిదా! ఎవరికి మంచిది? ఎందుకు మంచిది? ఇక్కడ మంచిదో కాదో నిర్ణయించుకునే అవకాశం, సమయం ఎవ్వరికీ లేదు నాయనా! వేలం వెర్రిగా పరిగెత్తడమే అందరి పని." అన్నాడు సుబ్బు.

"ఇంతకీ నీ కంప్లైంట్ ఏంటి? చదవొద్దనా? మంచి భవిష్యత్తు సంపాదించొద్దనా?" చికాగ్గా అన్నాను.

"నాకే కంప్లైంట్  లేదు, జరుగుతున్నది చెబుతున్నానంతే. మనవాళ్ళు స్పీడుగా పరిగెత్తుకుంటూ 'మంచి' ఉద్యోగంలోకొచ్చి పడతారు. కానీ ఇక్కడ ఫినిష్ లైన్ ఉండదు. విజయవంతంగా పరిగెత్తినందుకు 'మంచి' పెళ్ళిసంబంధం అనే పతకం ఇవ్వబడుతుంది. సినిమాల్లో హీరోకి పెళ్ళవ్వంగాన్లే 'శుభం' కార్డు పడుతుంది, ఇక్కడా సౌలభ్యం లేదు. కాళ్ళు లాగేస్తున్నాయి, పరుగు స్పీడు తగ్గిద్దామనుకున్నా.. కొత్తభార్య అందుకు ఒప్పుకోదు. కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పెద్దఇల్లు, పెద్దకారు, అనేక ఇన్వెస్టిమెంట్ ప్లాన్లు, ఖరీదైన వెకేషన్లు.. ఇవొక అంతులేని లక్ష్యాలు. ఇక్కడ ఫినిష్ లైన్ కి తావులేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రం గుండెలు పగిలేలా పరిగెత్తాల్సిందే." అన్నాడు సుబ్బు.

"అందుకేనా నువ్వు పెళ్ళి చేసుకోంది?" నవ్వుతూ అన్నాను.

సుబ్బు కూడా నవ్వాడు.

"అన్నీ అమర్చుకున్నాం, అమ్మయ్య! అంటూ కొద్దిసేపు ఆ పక్కన కూర్చుని అలుపు తీర్చుకుందామనుకునేలోపు, పిల్లలు పెద్దవాళ్ళవుతుంటారు. వారికి 'మంచి భవిష్యత్తు' కోసం.. గుర్రం మళ్ళీ పరుగో పరుగు. అంత పరిగెత్తుతూ కూడా అభద్రతా భావం, భయం, ఆందోళన. అంచేత - బిపి, షుగరు బోనస్. ఆ తరవాత రిటైర్మెంట్ ప్లాన్లంటూ మళ్ళీ కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పడుతూ లేస్తూ కుంటి గుర్రంలా మళ్ళీ పరుగు షురూ." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"సుఖమయ జీవనానికి ఇవన్నీ అవసరమోయీ! వీటిని నొప్పిగా భావించరాదు." అన్నాను.

"సుఖమయ జీవనమో, భారమయ జీవనమో.. అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది మిత్రమా!" అంటూ టైమ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.

"సుబ్బూ! పొరబాటున కూడా సజావుగా మాట్లాడవు గదా! బట్టతలకి మోకాలికి ముడేస్తూ ఏదేదో వాగుతావు." అన్నాను.

సుబ్బు పెద్దగా నవ్వాడు. 

"నీకలాగే ఉంటుందిలే. నువ్వా బోల్టో, నట్టో.. వాణ్నే పొగుడుకో. నేకాదన్నానా? కాకపోతే - వాడు పరిగెత్తేది మాత్రం వంద మీటర్లు, పది సెకండ్లే! కానీ మనవాళ్ళు పరిగెత్తేది వందేళ్ళు. పరిగెత్తడానికి మనకి మంచి బూట్లుండవు, నున్నటి ట్రాకులుండవు, ఉత్సాహపరిచే ప్రేక్షకులుండరు, మైమరిపించే గర్ల్ ఫ్రెండులుండరు. నెత్తిన ట్రంకు పెట్టెలో బాధ్యతల బరువు, ఎగుడు దిగుడు రోడ్డు, గులకరాళ్ళు, దుర్భర వాతావరణం, ఎంత పరిగెత్తినా కనపడని ఫినిష్ లైన్. నా మటుకు నాకు ఆ బోల్టుగాడి కన్నా మనమే పరుగుల చాంపియన్లం అనిపిస్తుంది. పనుంది, వస్తా మరి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Saturday 11 August 2012

చైనా ఆటలు - ఇండియా చదువులు




మొన్న  నేరాసిన  "నీచనికృష్ట చైనా! దీన్ని మెడబట్టి గెంటండి!" టపాపై  చర్చ  జరిగింది. ఆ  టపాలోని  కొన్ని వ్యాఖ్యలకి  సమాధానం  రాసే  కార్యక్రమం  మొదలెట్టగా  నిడివి  ఎక్కువైపోయింది. మన  కార్పొరేట్  విద్య  చర్చకి  వచ్చింది. అంచేత  ఆ  ఆలోచనల్ని  ఇప్పుడు  ఒక post గా publish చేస్తున్నాను. కావున  ఈ post  చైనా పిల్లల  గూర్చి  చర్చ  కొనసాగింపుగా  అనుకోవచ్చు.



విద్యార్ధులు - ప్రతిభ :



'merit'. నిజంగా  ఈ  పదం  చాలా  గౌరవప్రదమైనది. అయితే.. ప్రస్తుతం  మనం  ఏదైతే merit అనుకుంటున్నామో  అది  నిజమైన  మెరిటేనా? అసలు  ప్రతిభ  అంటే  ఏమిటి? ఉదాహరణకి  ఒక వందమంది  విద్యార్ధులు  రోజుకి  ఆరు గంటలు  క్లాసుల్లో  పాఠాలు  నేర్చుకుని, రెండు గంటలు  ఆటలాడుకుని, ఇంకో గంట  టీవీ  చూసి  నిద్ర  పోతారు. అప్పుడే  వారు  మానసికంగా, శారీరకంగా  ఆరోగ్యవంతులై  ఉంటారు. అందుకే  ఎటువంటి  పరిస్థితుల్లో  ఒక  నిర్ణీత  సమయాన్ని  మించి  వారిపై  పాఠాల  ఒత్తిడి  పెంచరాదనే  నియమం  ఉండాలి. కఠిన  చట్టం  ఉండాలి.



ఇలా  అందరికీ  ఒకే  రకమైన  curriculum  ఉన్నప్పుడు  మాత్రమే  వారి  ప్రతిభని  కొలవాలి. ఈ  కొలమానం  కూడా  చాలా ఖచ్చితత్వంతో  ఉండాలి. ఎవరెవరికి  ఏ  వృత్తి  పట్ల ఆసక్తి ఉందో.. వారు  ఆ  కోర్సుల్ని  అభ్యసించే  అవకాశం  ఉండాలి. అప్పుడే  మనకి  ఆటల్లో  కూడా  ప్రవేశం  ఉన్న  సైంటిస్ట్  తయారవుతాడు. సమాజం  పట్ల  అవగాహన  ఉన్న  వైద్యుడు  దొరుకుతాడు. లైబ్రరీల్లో, పుస్తకాల  మధ్యన  మాత్రమే  తయారయ్యే  నిపుణుడు  చిన్న వయసులోనే  రోగిష్టివాడైపోతాడు. దేశానికి  నష్టం.



కార్పొరేట్  విద్యా సంస్థల  పుట్టుక :



'పరీక్షల్లో  మార్కులే  కొలమానం  అయినప్పుడు  ఆటలకి, పాటలకి  సమయం  కేటాయించడం  దండగ! హాయిగా  ఆ  సమయాన్ని  కూడా  చదివించడానికి  ఉపయోగిస్తే  మరిన్ని  మార్కులు  సాధించొచ్చు!' అన్న  ఆలోచనతో  పుట్టిందే  కార్పొరేట్  విద్య. ఇది  కస్టమర్ల  అవసరాలు  తీర్చే  దుకాణదారుల  తరహా  ఆలోచన.



అయితే.. ఈ  అలోచన  అశాస్త్రీయమైనది. ఒక  విద్యార్ధి  శారీరకంగా, మానసికంగా  ఆరోగ్యంగా  ఉండాలి. చిన్నపిల్లలు  కూడా  ఈ  దేశ పౌరులే. రోజూ  కొంతసమయం  ఆడుకోవడం  వారి  హక్కు. వారికి  రాజ్యాంగమే  ఈ  హక్కుని  కల్పించింది. జైళ్ళల్లో  ఖైదీలకి  కూడా  ఆటలాడుకునే  సౌకర్యం  ఉంది. అయితే.. ఖైదీలక్కూడా  ఉన్న  హక్కు  బాలలకి  ఎందుకు లేదు?!



విద్యార్ధులు - తలిదండ్రులు :



తమ  పిల్లలు  బాగా  చదివి  మంచి  ఉద్యోగంలో  స్థిరపడాలని  తలిదండ్రులు  అనుకోవడం  సహజం. అయితే.. నా  కొడుకు  కావున  రోజంతా  చదివిస్తాననే  హక్కు  చట్టరీత్యా  నేరంగా  పరిగణింపబడాలి. అందుకే.. 'మీ  పిల్లాడు  ఆటలాడి  చెడిపోతాడు. మేం  దాన్ని  కట్టడి  చేసి.. ఆ  సమయాన్ని  కూడా  చదువుకే  కేటాయింపజేస్తాం.' అంటూ  ఎవడన్నా  చదువుల  దుకాణం  తెరిస్తే.. వాణ్ణి  తక్షణం  జైల్లో  పెట్టాలి.



కొడుకు  పెద్దయ్యాక  పోలీసాఫీసర్  కావలనుకునే  తలిదండ్రులు.. వాడికి  ఐదేళ్ళకే  పిస్టల్  షూటింగ్ లో  ట్రైనింగ్  ఇప్పించలేరు గదా! పిల్లల్ని  చదువుల  పేరుతో  ఒత్తిడి పెడితే.. వాళ్ళు మంచి  మార్కులు  సాధించవచ్చును గానీ.. భవిష్యత్తులో  మానసిక సమస్యల  పాలవుతారు. 'ఏం  పర్లేదు. రిస్క్  బేర్  చేసేది  మేమే గదా!' అన్న  వాదనకి  తావు  లేదు. అప్పుడు  తిండి  లేక  పిల్లల్ని  అమ్ముకునే  తల్లుల్ని  కూడా  మనం  సపోర్ట్  చెయ్యవలసి ఉంటుంది.



ప్రభుత్వ పాత్ర :



'ఇవ్వాళ  వందరూపాయలు  డిపాజిట్  చెయ్యండి. ఎల్లుండికల్లా  వెయ్యి రూపాయిలు  ఇస్తాం.' లాంటి  మోసపూరిత  ప్రకటనల  ప్రచారం  చేసుకోడానికి  ప్రభుత్వాలు  అనుమతినివ్వవు. ఒకవేళ  ప్రభుత్వం  ఉదాసీనంగా  ఉందనుకుందాం. ఆశ పడి  కొందరు  మోసపోతారు. వందకి  వెయ్యి  సంపాదించాలనే  దురాశపరులుగా  ఆ  మోసపోయినవారిని  మనం  చూడొచ్చు. కానీ.. అందర్నీ  రక్షించవలసిన  బాధ్యత  ప్రభుత్వాలదే. మనకి  రక్షణ  కల్పించడానికే  కదా ఈ  ప్రభుత్వాలుంది. అందుకే  ప్రభుత్వాలు  డిపాజిట్ deposit సేకరణ  విషయంలో అనేక  నిబంధనలని  పెట్టాయి.



డబ్బు  విషయంలోనే  ఇన్ని rules ఉన్నప్పుడు.. పిల్లల  విషయంలో  ఇంకెన్ని  కఠిన నిబంధనలుండాలి? కానీ.. అసలు  రూల్సంటూ  మనకున్నాయా? 'పిల్లల  విషయంలో  ఎందుకంత  కఠిన నిబంధనలు  ఉండాలి?' ఎందుకంటే  సమాజంలో  బలహీనులు  రక్షించబడాలి. అందుకే  వీరిని  రక్షించే  చట్టాలు  మరింత  పకడ్బందీగా, ఖచ్చితత్వంతో  ఉండాలి.



పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం  కలవారు.. వీరంతా  ఒక special category. వీరిని  ఇబ్బంది  పెట్టే వారిని  నాగరిక  సమాజాలు  క్షమించరాదు. వీరిని  ఇబ్బంది  పెట్టే  సమాజం  రాతియుగానికి  చెందిందిగా  భావించాలి. వీరిని  కాపాడవలసింది  మనం  ఓట్లేసే  ప్రభుత్వాలు. కానీ  మన  ప్రభుత్వాలకి  ఈ spirit ఉందా?


ప్రభుత్వం + కార్పొరేట్  విద్యా సంస్థల  కుట్ర :


కానీ  మన  ప్రభుత్వాలు  చదువుల  దుకాణదారుల lobbying కి  లొంగిపోయాయి. ఉదాసీనంగా  ఉండటం  మూలానా.. ఈ  దుకాణ దారులు  ఒకరిని  మించి  ఒకరు  పిల్లల  హక్కుల్ని  హరించడంలో  పోటీ  పడుతున్నారు. ఒక  మాఫియాగా  రూపాంతరం  చెందారు. ఇది  మన  జాతికే  నష్టం. కొందరంటారు.. 'ఆ  పిల్లలు  విజయం  సాధిస్తున్నారుగా!' అని. నిజమే! వాళ్ళకి  మంచి  జీతం  వచ్చే  ఉద్యోగ  భవిష్యత్తు  ఉంటుంది. కానీ.. at what cost?




పిల్లల  భవిష్యత్తు  బాగుంటుందని  తలిదండ్రుల్ని  నమ్మించి.. పసి పిల్లల్ని  హింసించే  చదువుల  కార్ఖానాలే  ఈ  కార్పొరేట్  విద్యాసంస్థలు. ఇవి  పూర్తిగా  చట్టవ్యతిరేకం. ఈ  కార్ఖానాలే  లేకుండా  చెయ్యాల్సిన  బాధ్యత, అధికారం  ప్రభుత్వానికే  కదా  ఉంట! మన  ఊళ్ళో  కనీసం  లెబోరేటరీ  ఫెసిలిటీ laboratory facility కూడా  లేకుండా..shopping malls పైనా, ఎపార్ట్ మెంటుల్లో  నడుపుతున్న  కార్పొరేట్  కాలేజిలు.. కూతవేటు  దూరంలో  ఉన్నా  ఉన్నత  విద్యశాఖాధికారులకి  తెలీదు! వందలమంది  విద్యార్ధుల్ని  కుక్కే ఒక  పెద్ద physical structure అధికారులకి  కళ్ళకి  కనబడదు!!



EAMCET ప్రహసనం :



ఇప్పుడు  ఇంకో  పాయింట్. కొందరు  వాదించవచ్చు. 'quality డాక్టర్, ఇంజనీర్  అవ్వాలంటే  కష్టపడకపోతే  ఎలా?' అని. ఇక్కడ  మనం  ఆ  రకంగా  కూడా fail అవుతున్నాం. ఉదాహరణగా  మన  EAMCET  నే  తీసుకుందాం. ఒక  విద్యార్ధి doctor course లో  చేరాలంటే intermediate board పరీక్ష  పాసయితే  చాలు. కానీ  మనకి  అభ్యర్ధులు  ఎక్కువమంది  ఉండటం  చేత  మళ్ళీ  ఇంకో  రకం వడపోత (objective type) పరీక్ష  పెడుతున్నాం. పోనీ  ఇందులో  ఏమన్నా creativity చూపిస్తున్నామా? అంటే  అదీ  లేదు. అరిగిపోయిన  ప్రశ్నల్నే  మళ్ళీ మళ్ళీ  అడుగుతూ  కేవలం  ఒక  విద్యార్ధి  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తున్నాం. (జ్ఞాపక శక్తి  తెలివితేటల్లో  ఒక  భాగం  మాత్రమే.)



ఎప్పుడైతే  కేవలం  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తామో.. అప్పుడు  బండగా  చదువే  వారికి advantage ఉంటుంది. ఉదాహరణకి  వానపాము  గూర్చి  ఐదు సార్లు  చదివిన వాడి  కన్నా  ఇరవై సార్లు  చదివినవాడికి  ఎక్కువ  మార్కులు  వచ్చే  అవకాశం  ఉంది. అంటే.. అతను  రాష్ట్ర స్థాయిలో  ప్రధమ స్థానాన్ని  సంపాదించినా.. "తెలివైన"వాడన్న భరోసా  లేదు. మంచి  "చదువరి" మాత్రమే  అయ్యుండొచ్చు.



అయితే.. ఈ  మాత్రం  మన  ప్రభుత్వాలకి  తెలీదా? తెలుసు. కానీ.. ఈ  రకమైన  బట్టీయం  వేసే  విధానం  కార్పొరేట్  కాలేజిలకి  అనుకూలం. అక్కడ repeated గా  చదివిస్తారు. పరీక్షలు  పెడుతుంటారు. కాబట్టే  ఒక  పాఠాన్ని  ఎక్కువసార్లు  చదివించి, అరగదీసే  కార్పొరేట్  కాలేజిల  హవా  నడుస్తుంది. ప్రభుత్వం  మాత్రం  నిద్ర  పోతుంటుంది!



వైద్య విద్య - లోపభూయిష్టం :



ఇక  మన  వైద్య విద్యా విధానం. ఒక medical college నుండి  ఒక యేడాది వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారనుకుందాం. వారందరూ  ఏవరేజ్  స్టూడెంట్లే. కానీ  సాధారణ  వ్యాధుల  పట్ల  అవగాహన ఉంది. పేషంట్లు  చెప్పేది  ఓపిగ్గా  విని  వైద్యం  చేసేంత నాలెడ్జ్ ఉంది. కామన్  సెన్సూ  ఉందివారిలో  ఏ ఒక్కరూ  గొప్ప cardialogist కాదు. గొప్ప  నెఫ్రాలజిస్టూ  కాదు. కానీ.. పేషంట్  పట్ల గౌరవంగా, నిజాయితీగా  వ్యవహరించే  విషయంలో  మంచి training పొందినవారు. పేషంట్ల  పట్ల  నిజాయితీ  అనేది  ఒక  డాక్టర్ యొక్క  ప్రాధమిక  గుణం  అయ్యుండాలి. మిగిలినవన్నీ secondary. శంకర్ దాదా MBBS  సినిమా  చూశారుగా.



ఇప్పుడు  ఇంకో  మెడికల్  కాలేజి. ఇక్కడ  నుండి  కూడా  ఇంకో  వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారు. వాళ్ళు  అసాధారణ  మేధావులు. అద్భుతమైన  నాలెడ్జ్  ఉంది. అందరూ  అనేక  స్పెషాలిటీల్లో  నిష్టాతులు. ఈ  కాలేజి product ని  అన్ని కార్పొరేట్  ఆస్పత్రులు  ఎర్ర తివాచీ  పరిచి  మరీ  చేర్చుకుంటారు. మన  దేశానికి  ఆధునిక  వైద్యంలో  వీరే  దిక్సూచిలు. కానీ.. వారికి  పేషంట్ల  ఆర్ధిక స్థితిగతుల  పట్ల  తేలిక  భావం  ఉండొచ్చు. 'డబ్బుల్లేకపోతే  ధర్మాసుపత్రికి  పోవచ్చు కదా! మా  టైం  చెడగొట్టటం  దేనికంటూ'  చిరాకు  పడే  మనస్తత్వం  కలిగినవారై ఉండొచ్చు.



నా  దృష్టిలో  ఈ  మేధావుల  కాలేజి  కన్నా.. ఇందాక  సాధారణ  నాలెడ్జ్  కలిగిన  డాక్టర్లని produce చేసిన  కాలేజియే  గొప్పది. దేశానికి ఉపయోగపడేది. ఎందుకో  తెలీదు.. వైద్యవిద్యలో  పేషంట్లతో  ఎలా  మసులుకోవాలో  తెలిపే  సబ్జక్ట్  లేదు. ఇందువల్ల  చాలా  సమస్యలు  వస్తున్నాయి. ఈ  కాలేజిల  ఉదాహరణ  నే చెప్పే  విషయానికి  సపోర్ట్  కోసం  తెచ్చానే  తప్ప  స్పెషలిస్ట్  డాక్టర్ల  పట్ల  నాకేవిధమైన  వ్యతిరేకత  లేదని  మనవి  చేసుకుంటున్నాను.



అందరికీ అనారోగ్యం - కొందరికే వైద్యం :



దగ్గు, జ్వరం, విరేచనాలు.. ఇవి  సాధారణ  సమస్యలు. షుగరు, బిపి  సాధారణ  దీర్ఘకాలిక  రోగాలు. ఈ  రోగాలకి reasonable treatment జరుగుతుందంటే  ఆ ఊరు  వైద్యపరంగా  బానే  ఉందని  అర్ధం. వారికి speciality సేవలు  కూడా  ఉంటే  మంచిదే. కానీ  అవి  సెకండరీ.



ఈ  పాయింటునే  తిరగేద్దాం. ఇంకో  ఊళ్ళో open heart surgery లు  అద్భుతంగా  జరుగుతాయి. కానీ  జ్వరాలు, దగ్గులకి  వైద్యం  దొరకదు. ఒక  పక్క  మలేరియాతో  మనుషుల  చస్తున్న  ఊళ్ళో  గుండె  ఆపరేషన్లు  అద్భుతంగా  జరుగుతున్నాయంటే.. పరిస్థితి  బాలేదని  అర్ధం. ఒక  వ్యక్తి  గుండెజబ్బుతో  చావడం  గౌరవప్రదం. మలేరియాతో  చచ్చిపోవడం  దేశానికి  సిగ్గుచేటు. 'ఆరోగ్యశ్రీ' లో  జరుగుతుందిదే!



సమాజం - ఆటల స్పూర్తి - Olympic medals :



ఇప్పుడు  ఈ  పాయింటునే  ఆటలకీ  అన్వయించుకోవచ్చు. ఆటలనేవి  మనిషికి  తిండి, గాలి, నీరంత  ముఖ్యం. ఒక ఊళ్ళో  బోల్డన్ని  స్కూళ్ళు, ఆ  స్కూళ్ళకి  ఆట స్థలాలు  ఉన్నాయనుకుందాం. పిల్లలు  రోజూ  సాయంకాలం  హాయిగా  ఆడుకుంటారు. ఆ  ఊళ్ళో  పెద్దా చిన్నా  తమదైన  రీతిలో  ఏదోక  క్రీడ (చాలా  సాధారణ స్థాయిలో)  ఆడతారనుకుందాం. ఎవరూ  కూడా  చెప్పుకోతగ్గ  ఆటగాళ్ళు  ఉండరు. కానీ.. ఊరంతా  కనీసం  ఒక గంట పాటు  ఆటలాడతారు. మంచి fitness తో  ఉంటారు.



ఆ  ఊరికి  పక్క  ఊళ్ళో  ఆట మైదానాలు  లేవు. ఊళ్ళో  జనాలకి  క్రీడలు  అంటే  ఏంటో  తెలీదు. అందరికీ  షగరు, బిపి  రోగాలు. కానీ.. ఆ  ఊళ్ళో  ఒక  అభినవ్ బింద్రా  ఉన్నాడు. అతను  పొద్దున్నుండి  సాయంకాలం  దాకా  నాలుగ్గోడల  మధ్య  గంటల కొద్దీ  షూటింగ్  ప్రాక్టీస్  చేస్తూనే  ఉన్నాడు. అతను  అరుదుగా  బయటకొస్తాడు. ఒలింపిక్స్ లో gold medal సాధించాడు. ఆ  ఊరికి  గొప్ప  పేరు  సంపాదించాడు. కానీ  నా  దృష్టిలో  ఘనత  వహించిన  ఈ  రెండో  ఊరి  కన్నా  మొదటి ఊరే  ఉత్తమమైనది.



పిల్లలపై ఒత్తిడి :



పాసవడం  వేరు, select కాబడటం  వేరు. రెంటికీ  చాలా  దూరం  ఉంది. ఆటలు, చదువు.. ఎప్పుడయితే  మొదటి స్థానంలో  ఉండాలనుకుంటూ  శిక్షణ  పొందుతుంటారో  వారి  మానసిక క్షోభ  వర్ణనాతీతం. ఒక్కోసారి  ధైర్యం, మరెన్నోసార్లు  దైన్యం! పోటీలో  ఎక్కడుంటామో  తెలీక  సతమతమైపోతుంటారు.



నేను  వృత్తి రీత్యా  అనేకమంది long term coaching students చూస్తుంటాను. వారికి  అనేక రకాల నొప్పులు, నీరసం, నిరాశ, నిర్లిప్తత, ఆత్మహత్య ఆలోచనలు.. చాలా  జాలేస్తుంటుంది. వారితో  మీరు  మాట్లాడినట్లయితే  నేను  రాసేది  చాలా  తక్కువని  అర్ధమవుతుంది.



మన పిల్లల్ని రక్షించుకుందాం :



ఒక  దేశ పరిస్థితుల్ని  అంచనా  వెయ్యలంటే  మొత్తం  సమాజాన్ని  ఒక unit గా  తీసుకోవాలి. కేవలం  ఒక  వ్యక్తి  యొక్క  "గొప్ప" వ్యక్తిగత ప్రతిభ  అనేది  దేనికీ  సూచిక  కాదు. talent hunt పేరుతో  చైనావాడు  పిల్లల్ని  హింసిస్తూ  భవిష్యత్  బంగారు పతాక  గ్రహీతల్ని  తయారు  చెయ్యబోవడం.. ఇండియాలో  కార్పొరేట్  విద్య వాడు  పిల్లల్ని  కాల్చుకు  తింటూ  భవిష్యత్  IIT వాడిగా  తయారు  చెయ్యబూనడం.. చట్టరీత్యా  "ఘోరమైన"  నేరంగా  ప్రకటింపబడాలి. ఈ  చట్టాల్ని  అమలు  చెయ్యని  అధికారుల్ని  కఠినంగా  శిక్షేంచేందుకు  కూడా  "పకడ్బందీ"గా  చట్టాలుండాలి.




(photos courtesy : Google)

Monday 6 August 2012

నీచనికృష్ట చైనా! దీన్ని మెడబట్టి గెంటండి!


మనం రాజకీయాల్ని మాట్లాడుకోవద్దు. వాస్తవాలు మాట్లాడుకొందాం.

సర్వకాలములందు సత్యం సత్యంగానే వుంటుంది, అసత్యంగా మారదు. రక్తం ఎర్రగా ఉంటుంది. గిచ్చితే నొప్పిగా ఉంటుంది. ఆకలేస్తే నీరసంగా ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇవన్నీ జీవిత సత్యాలు.

అలాగే - ఒక వ్యక్తి ఆకలి చావు ఈ మానవాళి సిగ్గుతో తల దించుకోవాల్సిన నేరం. అది ఇథియోపియాలో కావచ్చు, ఇండియాలో అయినా కావచ్చు. ఇందులో మినహాయింపులు ఉండవు, ఉండరాదు. కాబట్టి ఒక మనిషిగా, ఒక ప్రపంచ పౌరునిగా సిగ్గుతో తల దించుకుందాం.

అదేవిధంగా - పిల్లల్ని హింసించే వ్యవస్థ దుర్మార్గమైనది, నీచమైనది, నికృష్టమైనది అనే ఖచ్చితమైన అభిప్రాయం నాకుంది. ఇక్కడ ఎటువంటి వాదప్రతివాదనలకి తావు లేదు. మన దేశంలో చదువుల కోసం పిల్లల్ని హింసించడం చట్టవ్యతిరేకం. శిక్షార్హమైన నేరం. అదే విషయాన్ని మనమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం కూడా.

ఆహారానికి అవసరమైన పశువధ కూడా 'డీసెంట్'గా జరగాలని కోరుకుంటాం. కానీ - చైనాలో ఏం జరుగుతుంది? చట్టబద్దమైన హింసోన్మాదం. అందునా పసిమొగ్గలు. ఇదేమి రాజ్యం! ఒలింపిక్ మెడల్స్ కోసం పిల్లల్ని పశువుల కన్నా హీనంగా హింసిస్తున్నారు. వీళ్ళేమీ కేజెస్ లో పక్షులు కారుగా!

అమ్మా సైనా! అయ్యా గగనూ! ఒక దరిద్రపుగొట్టు వెధవ మెడల్స్ కోసం పసికూనల అందమైన బాల్యాన్ని చిదిమేస్తున్నాడు. వాడికి తమ దేశపౌరుల సంక్షేమం కన్నా అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యమట! మీదగ్గరున్న మెడల్స్ ఆ దౌర్భాగ్యుడి బిక్షాపాత్రలో ముష్టిగా వెయ్యమని నా సలహా! అప్పుడైనా బుద్ధొస్తుందేమో దొంగ గాడిద కొడుక్కి!

ఒరే బూచోడా! నీక్కావలంటే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ బంగారు ఆభరణాలు నీమొహాన కొడతాం లేరా! దాంతో ఇంకో వంద బంగారు పతకాలు చేయించుకుని మెళ్ళో వేసుకుని ఊరేగి చావు! కానీ - ఆ పసికూనల్ని నీ కబంధ హస్తాల నుండి వదిలెయ్యరా దౌర్భాగ్యుడా!

చివరగా - ఈ ఒలింపిక్ ఆటల్లో మెడల్స్ కోసం మానవ హక్కుల్ని హరిస్తున్న  చైనాని చెప్పుతో కొట్టి, మెడబట్టి ఒలింపిక్స్ నుండి బయటకి తన్నాలని అన్నిదేశాల ప్రభుత్వాలకి, క్రీడా సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాను

(photo courtesy : Google)

Saturday 4 August 2012

మా సుబ్బు ఒలింపిక్ స్పూర్తి!




"రమణ మామ! కాఫీ!" అంటూ  వచ్చాడు  సుబ్బు.



"కూర్చో  సుబ్బూ! ఒలింపిక్స్ లో  మన  పరిస్తితి  పెద్దగా  బాలేదు." దిగులుగా  అన్నాను.



"ఆ  పోనిద్దూ! ఈ  వార్త  చిన్నప్పట్నించి  నాలుగేళ్ల కోసారి  వినేదేగా! ఆ  ఒలింపిక్స్ లో  చాలా  ఆటలు  నాకు  అర్ధం కావు! అర్ధం  కాని  ఆటల్లో  మెడల్స్  గూర్చి  చింతన  ఏల?" అన్నాడు  సుబ్బు.



"సుబ్బూ! ఒలింపిక్స్ లో  కొన్ని  ఈవెంట్స్  నాకూ  అర్ధం  కావనుకో. అంత మాత్రానికే  మెడల్స్  పట్టించుకోకపొతే  ఎలా?" అన్నాను.



సుబ్బు  చిన్నగా  నవ్వి  అన్నాడు.



"మన దేశానికి  ఒలింపిక్స్  ఆటల  గోల  అంత  అవసరం  లేదేమో! అవన్నీ  యూరోపియన్ల  ఆటలు. వాళ్ళకి  జనాలు  తక్కువ. డబ్బులెక్కువ. ఆరడుగులుంటారు. బాగా  తింటారు. స్టామినా  ఎక్కువ. మనకి  తిండే  సమస్య. మనవాళ్ళు  మాత్రం  వారి  ఆటల్ని.. బోల్డంత  డబ్బు  పోసి  దిగుమతి  చేసుకున్న  వారి  పరికరాల్తోనే  నేర్చుకుంటూ.. వారితో  పోటీ  పడుతూ.. పతకాలు  రాలేదని  జనాలతో  నాలుగేళ్ళకోసారి  తిట్లు  తింటూ  ఉంటారు."



"దీన్నే 'అందని  ద్రాక్ష  పుల్లన' అంటారు  నాయనా! ఒలింపిక్స్  కేవలం  ఆటలు  కాదు. ఒక  గొప్ప  స్పూర్తి."



"ఒప్పుకుంటున్నాను. కాకపోతే  అది  అమెరికా, యూరప్  ఖండాల  స్పూర్తి  మాత్రమే  అంటాను. ఈ  ఆటలు  పుట్టింది  గ్రీస్  దేశంలో. ఆ  కాలంలో  ఉన్న  యూరోపియన్  ఆటల్ని  క్రీడాంశాలుగా  చేశారు. ప్రపంచంలో  తర్వాత్తర్వాత  చాలా  మార్పులు  చోటు  చేసుకున్నాయి. ఈ  మార్పుల్ని  గమనిస్తూ.. అన్ని  ఖండాల్లో, అన్ని  దేశాల  ప్రజల  ఆసక్తులని  పరిగణనలోకి  తీసుకుంటూ  ఎప్పటికప్పుడు  మార్పులు  చెయ్యవలసి ఉంది."



ఇంతలో  కాఫీ  వచ్చింది. సిప్  చేస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"కానీ  అలా  మార్పుచేర్పులు  చెయ్యడం  జరుగుతుందా? లేదనుకుంటున్నాను. లేకపోతే  మన  దేశీయ ఆటలు  ఈ  ఒలింపిక్ స్పూర్తిలో  ఎందుకు  చోటు  చేసుకోవు? ఏం?  ఇన్ని  మెడల్సే  ఉండాలని  మెడల్స్  నెత్తిన  ఏవన్నా  మేకు  దించారా? మన  కేరళ  పడవలు, కబాడీ, ఖోఖోలు  ఒలంపిక్స్ లో  ఎందుకు  కనబడవు?"



"ఆ  విషయాల్ని  చూడాల్సింది  మన  క్రీడా సంఘాలు." అన్నాను.



"సురేష్ కల్మాడీ లాంటివాళ్ళు  మన దేశానికి  ప్రాతినిధ్యం  వహిస్తున్నారంటేనే  అర్ధమౌతుంది.. అక్కడుండే  మిగతావాళ్ళు  ఎంత  దరిద్రులో! ఒక్కో  దేశానికి  ఒక్కో  బలం, బలహీనతా  ఉంటాయి. అవి  పరిగణనలోకి  తీసుకుంటూ  ఆటల్లో  మార్పుచేర్పులు  జరుగుతుండాలి. నా  వాదనకి  ఋజువు  లాంగ్ డిస్టెన్స్  రన్ లో  కెన్యా  విజయం. ఈ  క్రీడాంశం  ఎప్పట్నించో  ఉన్నా.. మెడల్  కోసం  పేద దేశాలు  కూడా  పోటీ  పడగల  అవకాశం  ఉంది. పరిగెత్తే  క్రీడాంశాల్లో  గొప్ప  ఇన్ఫ్రా  స్ట్రక్చర్  అవసరం లేదు. పరిగెత్తడం  ఆఫ్రికన్లకి  అలవాటే. అందుకనే  కెన్యన్లు  పతకాలు  కొట్టేస్తున్నారు."



"ఇంతకీ  నువ్వు  చెప్పేదేంటి  సుబ్బూ?" విసుగ్గా  అన్నాను.



"రమణ మామా! నే  చెప్పేది  శ్రద్దగా  విను. కొద్దిసేపు  ఒలింపిక్స్  ఆటల  పోటీల్ని  పక్కన బెట్టు. ఇప్పుడు  ఒలింపిక్స్  వంటల  పోటీల్ని   ఊహించుకో. ఈ  వంటల  పోటీలకి  పోటీ అంశాలని  ఎలా  నిర్ణయిస్తాం? అన్ని  దేశాలకి  రిప్రజంటేషన్  వహిస్తూ  కొన్ని  వంటకాలని  సెలక్ట్  చేసుకోవాలి. అమెరికా వాడి  పిజాతో  పాటు  మన  గుంటూరువాడి  గోంగూర  పచ్చడి  తయారీ  కూడా  పోటీలో  అంశంగా  ఉండాలి. అంటే.. అన్ని  వంటలకి   సమాన అవకాశాలు  ఇవ్వబడాలి. అప్పుడే  ఈ  ఈవెంట్  అంతర్జాతీయ  వంటలకి  స్పూర్తిగా  నిలబడుతుంది."



ఇంతలో  ఇంటర్ కమ్  మోగింది. ఒక  పేషంట్  గూర్చి  నర్స్  అడిగిన  సమాచారం  చెప్పాను.



సుబ్బు  చెప్పసాగాడు.



"అంతర్జాతీయ వంటల  స్పూర్తి  ప్రకారం  అమెరికావాడు  మనతో  మన  గోంగూర పచ్చడి  చెయ్యడానికి  పోటీ  చెయ్యాలి. వాడు  అలా  చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే  వాడి  దృష్టిలో  గోంగూర  పచ్చడి  అసలు  తినే  పదార్ధమే  కాదు! కానీ  మనం  మాత్రం  వాడి  పిజాలు, బర్గర్లని.. వాడి  కత్తులు, వాడి  ఓవెన్లూ  వాడుతూ.. వాడితోనే  పోటీ  పడాలి. అప్పుడు వాడు  మనల్ని  అలవోకగా  ఓడించి  మెడల్స్  కొట్టేస్తాడు. ఈ  రకమైన  అసమాన  పోటీ విధానాన్ని  ఏ విధంగా  అంతర్జాతీయ  వంటలు  అనరో.. ఒలింపిక్స్  కూడా  అంతే."



"అంతేనంటావా?" సాలోచనగా  అన్నాను.



"అంతే! ఒలింపిక్  ఆటల  పోటీలకి  ప్రిపేర్  అవడం  చాలా  ఖర్చుతో  కూడుకున్న  విషయం. అందుకు  వాడే  క్రీడాపరికరాలు  చాలా  ఖరీదైనవి. కనీస  శిక్షణక్కూడా  లక్షల్లో  ఖర్చవుతుంది. అందుకే  మన  జనాభాలో  కనీసం ఒక  శాతం  కూడా  ఒలింపిక్స్  క్రీడాంశాల్లో  శిక్షణ  తీసుకోలేరు. జనాభా  ఎక్కువ  ఉండి, వనరులు  తక్కువున్న  మన  పేద దేశాలకి  ఏ  మాత్రం  అనుకూలం  కానివి  ఈ  ఒలింపిక్స్." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.



జేబులోంచి  క్రేన్ వక్క పొడి  ఐదు రూపాయల  పేకెట్  తీసి  ఒక  పలుకు  నోట్లో  వేసుకుని  చప్పరిస్తూ  చెప్పసాగాడు  సుబ్బు.



"ఉదాహరణకి  ఈత పోటీలు. ఇందులో  డజన్ల  కొద్దీ  పతకాలున్నాయి. వాళ్ళ  దేశాల్లో  స్కూళ్ళల్లో  ఈత కొలనులు  ఉంటాయి. మనకి  రాష్ట్ర  స్తాయిలో  కూడా  ఆ  సౌకర్యాలు  ఉండవు. ఈ  ఒలింపిక్స్  పేద దేశాల  ముందు  ధనిక  దేశాలు  ఆడే  ఒక  అహంకార క్రీడ. ఇంతకు ముందు  ఆధిపత్యం  కోసం  అమెరికా, రష్యాలు  పోటీ  పడేవి. ఇప్పుడు   చైనా, అమెరికాలు  పోటీ  పడుతున్నయ్. అందుకోసం  చైనాలో  పిల్లల్ని  చపాతి పిండిలా  పిసికేస్తున్నారు. అన్ని విషయాల్లో  అమెరికాతో  పోటీ  పడాలనే  చైనా  ఆబ్సెషన్  ఒక  రోగ స్థాయికి  చేరుకుంది. ఒక రకంగా  మనమే  చాలా  నయం. జెండా  ఊపేసి, క్రీడా స్పూర్తిని  ప్రదర్శించేసి  వచ్చేస్తాం. అంతకన్నా  చేయగలిగేది  ఏంలేదు గనక!" అన్నాడు సుబ్బు.



"నిజమేనుకో! కానీ  ఇంతమంది  జనాభాకి  ఒక్క  మెడల్  కూడా  రాకపోడం  అవమానం  కదూ!" అన్నాను.



"కానే కాదు. జనాభా  లెక్కే  ప్రాతిపదికైతే  మన  గుంటూరు  జనాభా  యూరపులో  కొన్ని  దేశాల కన్నా  ఎక్కువ. ఎంతమంది  జనం  ఉన్నారన్నది  ప్రాతిపదిక  కాదు. ఎన్ని  ఈత కొలనులు, ఆటస్థలాలు  ఉన్నాయన్నది  మాత్రమే   ప్రధానం. ఇక్కడ  మనకి  ఆట స్థలాలు, మైదానాలు  సంగతి  దేవుడెరుగు.. కనీసం  నడవడానికి  కూడా  జాగా  లేదు. చీమల పుట్టల్లా  ఒకటే  జనం. కరెంటు  కటకట. తాగడానికి  నీరు, పీల్చడానికి  గాలి  లేకుండా  ఇబ్బందులు  పడుతుంటే  నీకు  మెడల్స్  కావాలా  మిత్రమా?"



"మరి  మన  దేశానికి  మెడల్స్  వచ్చే  అవకాశమే  లేదా?" నీరసంగా  అన్నాను.



"లేకేం! మనకి  మెడల్స్  రావాలంటే  ఒలింపిక్స్  ఈవెంట్స్  మార్చాలి. అమెరికా, యూరపుల  పిల్లలకి  మన  పిల్లలతో  చదువుల  పోటీ  పెట్టాలి. మన  పిల్లల్ని  పొద్దున్నే  దొంగల బండిలా  స్కూల్ బస్  వచ్చి  ఎత్తుకుపోతుంది. పొద్దున్నుంచి  రాత్రి  దాకా  చదువు  రోట్లో  పడేసి.. పరీక్షల  రోకటితో  దంచుతారు. ఇలా  పిల్లల్ని  నలిపేసే కార్యక్రమానికి  కొన్ని  మెడల్స్  పెడదాం. అప్పుడవన్నీ  మనకే. కాకపోతే  చైనావాడి  గూర్చి  జాగ్రత్తగా  ఉండాలి. పిల్లల  హక్కుల్ని  అణిచేసే  విషయంలో  వాడు  మనకన్నా  నీచుడు!" అంటూ  నవ్వాడు  సుబ్బు.



"సుబ్బు! చదువుల  పోటీ  ఆటల పోటీ  ఎలా అవుతుందోయ్?" అన్నాను.



"అవును గదా! సరే!  సైక్లింగ్  పోటీలో  మనదే  మెడల్. ఐతే  పోటీ  స్టేడియంలో  కాదు. మన  రోడ్ల  మీద.. మన  సైకిల్ తో.. మన  ట్రాఫిక్ లో  తొక్కాలి. ఈ  గతుకుల  రోడ్ల  మీద.. ఈ  బస్సులు, ఆటోల  మధ్య.. మన వాళ్ళు  తప్ప  అన్ని  దేశాల  సైకిల్  వీరులు  సిటీ బస్సుల  క్రింద పడి  చచ్చూరుకుంటారు. అంచేత  ఈ  కేటగిరీలో  భవిష్యత్తులో  మనతో  ఏ  దేశం వాడు  పోటీక్కూడా  రాడు." అన్నాడు  సుబ్బు.



"ఏం  సుబ్బూ! నీకు  మన దేశం మరీ  లోకువైనట్లుందే." చికాగ్గా  అన్నాను.



"కూల్  మామా  కూల్! మెడల్స్  కావాలంటావ్! ఎగతాళి  చేస్తున్నానంటావ్! త్వరలోనే  మనం  కూడా  సూపర్ పవర్  కాబోతున్నమని  లోకం  కోడై  కూస్తుంది. భవిష్యత్తులో  అంతర్జాతీయ  ఒలింపిక్  సంఘం  మన  లగడపాటి  రాజగోపాల్  వంటి  యంగ్  డైనమిక్  లీడర్ల  పాలనలోకి  వస్తుంది. అప్పుడీ  ఈవెంట్లని  పెట్టించడం  పెద్ద  కష్టం  కాదు. అంతగా  అయితే  మన  తరఫున  లాబీయింగ్ కి  మాంటెక్ సింగ్  ఆహ్లూవాలియా  ఉన్నాడుగా. ఒలింపిక్  ఈవెంట్లకీ, ఒక  MNC  రిటైల్  మార్కెట్  పర్మిషన్ కి  కనెక్షన్  పెట్టేస్తాడు. అప్పుడు  ఇంచక్కా  మన  గోళీలు, బొంగరాలాటల్ని  కూడా  క్రీడాంశాలుగా  చొప్పించేద్దాం." అంటూ  లేచాడు  సుబ్బు.



"అప్పటిదాకా?"



"ఈ  ఒలంపిక్స్ ని  ఒక  రియాలిటీ  షోగా  చూడు. రియాలిటీ  షోల్లో  రియాలిటీ  ఉంటుందా? అయినా  చూడట్లేదూ! ఒక  పూరీ జగన్నాథ్  తెలుగు సినిమాగా  చూడు. పూరి  సినిమాల్లో  పాత్రలు  తెలుగు భాషని  మాట్లాతాయే గానీ.. అవి  తెలుగు సినిమాలు  కాదుగా. అయినా   టైమ్ పాస్  కోసం  చూడట్లేదూ! ప్రస్తుతానికి  మనకి  ఒలంపిక్స్  కూడా  అంతే!" అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు.

Wednesday 1 August 2012

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

ఇవ్వాళ సోమవారం. ఆస్పత్రి పేషంట్లతో హడావుడిగా వుంది. ఆవిడకి సుమారు ముప్పయ్యేళ్ళుండొచ్చు. నల్లగా వుంది, పొట్టిగా వుంది, గుండ్రంగా ఉంది. విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. ఔట్ పేషంట్ స్లిప్ మీద ఆవిడ పేరు చూశాను. 

'వెంకట రమణ'

అబ్బా! మానుతున్న గాయంలో నిమ్మరసం పిండినంత బాధ. ఈ గాయం ఈ జన్మకి మానదేమో - నాదీ ఒక పేరేనా?! హ్మ్ .. !

'నేములో నేమున్నది?' అంటారు. కానీ - నేములోనే చాలా వుంది, ఇంకా మాట్లాడితే - చచ్చేంత ఉంది. నా పేరు చూడండి - 'వెంకట రమణ'. ఈ పేరు నాకస్సలు నచ్చదు. ఇది ఉభయలింగ నామం. అర్ధం కాలేదా? తెలుగులో చెబుతాను - ఈపేరుకి లింగం లేదు! అనగా ఆడా, మగలిద్దరికీ ఈపేరు ఉంటుంది!

నాపేరు నాన్న పూర్వీకులది. ఆయన నానమ్మ పేరు రమణమ్మ. ఇంకానయం! ఆపేరు ఏ పిచ్చమ్మో అవలేదు. అప్పుడు నేను పిచ్చయ్య నయిపోయేవాణ్ణి. నాన్నకి దేవుడు లేడు కానీ తన వంశం గొప్పదని నమ్మకం. అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. ఈ విధంగా - అన్ని విషయాల్లో కీచులాడుకునే అమ్మానాన్న, నాపేరు విషయంలో మాత్రం వొక అంగీకారానికొచ్చి - 'వెంకట రమణ' అని పెట్టేశారు.

నన్ను చిన్నప్పుడు 'రమణి!' అంటూ ముద్దుగా పిలిచేవారు. స్కూల్  ఫైనల్ చదువుతుండగా - ఒకరోజు 'రమణి' అనబడు శృంగార కథల పుస్తకం (వెచ్చటి ఊపిరి, వేడినిట్టూర్పులతో) చదవడం తటస్థించినది. ఆ మేగజైన్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. కథలయితే బాగున్నాయిగానీ, అర్జంటుగా నన్ను 'రమణి' అని ఎవరూ పిలవకుండా కట్టడి చేసేశాను!

నాకు హైస్కూల్లో స్థాయిలో కూడా 'ణ' రాయడం సరీగ్గా వచ్చేది కాదు. తెలుగు లిపిలో అనేక మెలికలతో కూడిన 'ణ' అక్షరం అత్యంత కష్టమైనదని నా నిశ్చితాభిప్రాయం. మా తెలుగు మేస్టరు 'నీ పేరు నువ్వే తప్పు రాసుకుంటే ఎలా?' అంటూ విసుక్కునేవారు. మహానుభావుడు! ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు - మూడేళ్ళపాటు సవర్ణదీర్ఘ సంధి మాకు నేర్పడానికి విఫలయత్నం చేశారు. నాకు మాత్రం గుణసంధి కూడా కొద్దిగా వచ్చు, మాక్లాసులో నేను బ్రిలియంటుని లేండి!

ఎనాటమి పరీక్ష మార్కుల లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు. నాపేరు పక్కన (F) అని ఉంది! హడావుడిగా ఎనాటమి ట్యూటర్ని కలిశాను. ఆయనకి నా జెండర్ ఘోష అర్ధం కాలేదు. అందుకే కూల్ గా 'నీ నంబరు, మార్కులూ సరీగ్గానే ఉన్నాయిగా? ఈసారికి ఎడ్జస్టయిపో!' అన్నాడు. నాకు మండింది. నేను ఆడవాడిగా ఎలా ఎడ్జస్టయ్యేది! 

గట్టిగా అడగాలంటే భయం, మొహమాటం. నాపేరు పక్కన ఈ మాయదారి (F) వల్ల అమ్మాయిలు నన్నుచూసి 'రవణమ్మ' అంటూ కిసుక్కుమనుకోవడం గుర్తుంది. నేనంటే పడని ఒకళ్ళిద్దరు కసిగా 'ఒరే! వంకర్రవణా!' అని పిలవడం కూడా గుర్తుంది.

ఇడ్లీసాంబార్ తిందామని హోటలుకి వెళ్తాను. అక్కడ టేబుళ్ళు తుడిచే చింపిరిజుట్టువాడు రమణ! 'అరేయ్ రవణగా! ఈ టేబులు మీద ఈగలేందిరా? సరీగ్గా తుడవరా దున్నపోతు!' కత్తితో పొడిచినట్లుండేది. నేను వర్గ ధృక్పదంతో రాయట్లేదు, నామ ధృక్పదంతో రాస్తున్నాను.

నా డొక్కుస్కూటర్ పంక్చర్. నెట్టుకుంటూ, రొప్పుకుంటూ.. పంక్చర్ షాపుకెళ్ళాను. అక్కడా నాఖర్మ కాలింది. అక్కడి బక్కచిక్కిన అసిస్టెంటు రమణ! 'క్యాబే సాలా! చక్రం హిప్పటం హెంతసేపురా సువ్వర్ కా బచ్చా!' 

నా పేరుని హత్య చెయ్యడంలో తెలుగు సినిమావాళ్ళు కూడా తమదైన పాత్ర పోషించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ తమ్ముడి పేరు రమణ! ఆ వెధవ ఏ తిక్కలోడో, తింగరోడో అయ్యుంటాడు. వాణ్ణి పోషించటానికి హీరోయిన్ నానా కష్టాలు పడుతుంది. సినిమాలో ఆ దరిద్రుడి పాత్ర ప్రయోజనం హీరోయిన్ కష్టాలు పెంచడం తప్ప మరేదీ కాదు. 

నాకు అర్ధం కానిది.. పొరబాటున కూడా ఏ ఉత్తముడికో, ఏ డాక్టరుకో (ఒక మనిషి ఉత్తముడో, డాక్టరో.. ఏదో ఒకటే అయ్యుంటాడని.. డాక్టర్లల్లో ఉత్తములుండరని మా సుబ్బు అంటుంటాడు.) -  'వెంకట రమణ' అన్న పేరు ఎందుకుండదు అనేది. 

తెలుగేతరులకి నాపేరు 'రమన' అవుతుంది! వారి 'న'ని.. 'ణ'గా మారుద్దామని తీవ్రప్రయత్నాలు చేశాను. ఆ ప్రాసెస్ లో నాపేరు 'రామన్న', 'రావణ్ణ' అంటూ మరింత ఖూనీకి గురయ్యేది. ఆవిధంగా నేను MD చేస్తున్న రోజుల్లో పంజాబీలు, బెంగాలీయులు నాపేరుని సామూహికంగా పిసికి పరోటాలు వేసేవాళ్ళు.

నాకెందుకో ఈ 'రమణ' అన్నపేరు బోడిగా, తోకతెగిన బల్లిలా ఉంటుంది. అందుకే కామోలు - నా పేషంట్లు నన్ను రమణయ్యగారు, రమణారావుగారు, రమణమూర్తిగారు అంటూ తోకలు తగిలిస్తారు. అప్పుడు నేను దిగులు చెందుతాను. 

నాపేరు ఏ నరసింహారావో, రంగారావో అయితే ఎంత బాగుండేది! ఈపేర్లలో ఎంత గొప్ప మెసేజుంది! ఈ నామధేయుడు మగవాడు, తెలుగువాడు, గంభీరమైనవాడు.. ఇంకా చాలా 'వాడు'. నాకా లక్జరీ లేదు. నన్ను చూస్తేకానీ నేనెవరో తెలీదు. 

కాలం గడుస్తున్న కొద్దీ నాకు నాపేరుపై గల 'పేరు న్యూనతాభావం' పోయింది. ఇప్పుడు పెద్దమనిషినయినాను. పరిణితి చెందాను (ఇదిమాత్రం డౌటే). అంచేత నాపేరు గూర్చి వర్రీ అవడం మానేశాను. అయితే - కొందరు పేషంట్లు అప్పుడప్పుడు ఇట్లా గుండెల్లో కత్తులు, కొడవళ్ళు గుచ్చుతుంటారు.

ఇవ్విధముగా బ్రతుకుబండిని గవాస్కరుని బ్యాటింగు వలె స్తబ్దుగా లాగుచుండగా, ఒక దుర్దినాన నా కజిన్ ప్రసాదుగాడు తగలడ్డాడు. నా చిన్నాన్న కొడుకైన ప్రసాదు చిన్నాచితక వ్యాపారాలు చేసి, అన్నిట్లో నష్టపోయి (వాడు నష్టపోతాడన్న సంగతి వాడికితప్ప అందరికీ ముందే తెలుసు) ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజంటుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు (ఇళ్ళస్థలాల బ్రోకర్లని స్టైలుగా రియల్ ఎస్టేట్ ఏజంటందురు).

వీడుచేసే ఎస్టేట్ ఎంత రియలోగానీ, ప్రిస్టేజి మాత్రం ఫాల్సే! ప్రసాదుకి నిమిషానికో ఫోన్ వస్తుంది. వంద ఎకరాలంటాడు, సింగిల్ సిట్టింగంటాడు, డెవలప్మెంటంటాడు, పది కోట్లకి తగ్గేది లేదంటాడు.  

ప్రసాదుగాడి ఫోనుకి క్షణం తీరికుండదు, నోటికి తాళం ఉండదు. అనేక ప్రముఖుల పేర్లు ఫోను సంభాషణల్లో విరివిగా దొర్లుతుంటాయి. వీడి భార్య మాత్రం ఇల్లు గడవడం కష్టంగా ఉందని వాపోతుంటుంది!     

ఓ రోజున - మా ప్రసాదుగాడితో పాటు ఒక శాల్తీ రంగప్రవేశం. నల్లటి శరీరం, తెల్లటి బట్టలు, మెళ్ళో పులిగోరు చైను, సెంటుకంపు! పులిగోరు సెంటుగాళ్ళు సంఘవిద్రోహశక్తులని నా నమ్మకం.  

చికాకుని అణుచుకుంటూ 'ఏంటి సంగతి?' అన్నట్లు ప్రసాదుని చూశాను. 

ప్రసాదు మాట్లాడలేదు, బదులుగా సెంటుకంపు పులిగోరు మాట్లాడింది.

"సార్! మీపేరు చాలా బాగుంటుంది."

ఊహించని స్టేట్ మెంట్! ఆ శాల్తీని ఆశ్చర్యంగా చూశాను.

"నాకు వెంకటరమణ అన్న పేరు చాలా ఇష్టమండి. ఈపేరు విన్నప్పుడల్లా నాకు ముళ్ళపూడి వెంకటరమణ గుర్తొస్తాడు!"

అవునుకదా! ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన బుడుగు, రెండుజళ్ళ సీత , సీగానపెసూనాంబ.. అందరూ కళ్ళముందు కదిలారు. నిజమే! ఇన్నాళ్ళూ నాకీ చిన్న సంగతి తోచలేదేమి! పోన్లే - ఇంతకాలం హోటల్ క్లీనర్లకి మాత్రమే పరిమితమైన నాపేరు మీద ఒక ప్రముఖుడు ఉన్నాడు. సంతోషం. సెంటుకంపు కొడితే కొట్టాడు గానీ చాలా మంచివాళ్ళా ఉన్నాడే!

"ఎవరైనా తమ పిల్లలకి వెంకటేశ్వరస్వామి పేరు పెడదామనుకుంటే వెంకట్రమణే బెస్ట్ నేమండి!"

అవునా! నాచెవుల్లో 'ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గొవిందా.. గొవిందా!' అంటూ గోవిందనామ స్మరణం వినిపించసాగింది! తిరువణ్ణామలై రమణ మహర్షి కనబడసాగాడు. 

ఛ.. ఛ.. నేనెంత అజ్ఞానిని! ఇంతటి పవిత్రమైన పేరుని ఇన్నాళ్ళూ ఎంతలా అవమానించితిని. ఎంతలా కించపరిచితిని. అయ్యా! సెంటుకంపు పులిగోరు బాబూ! నాకళ్ళు తెరిపించావ్. నీకు థాంక్సురా అబ్బీ!

"అసలు 'ణ' అక్షరం స్వచ్చమైన తెలుగు నుడికారానికి ప్రతీక! ఈ అక్షరమే లేకపోతే తెలుగుభాష పేదరికంలో మగ్గిపొయ్యేది!"

అవును సుమీ! ఇదీ కరెక్టే! ఈ 'ణ' ఎంత గొప్పక్షరం! ఉన్నట్టుండి తెలుగు లిపి రక్షకుడిగా ఫీలవడం మొదలెట్టాను. తరచి చూడగా.. నాపేరు తెలుగుభాషకే మకుటాయమానంగా తోస్తుంది. సడన్ గా నాకు నేను చిన్నయ సూరిలా, గిడుగు రామ్మూర్తిలా ఫీలవడం మొదలెట్టాను!

ఈయనెవరో దైవదూత వలె నున్నాడు, నా అజ్ఞానాంధకారమును ఎవెరెడీ టార్చ్ లైటు వెలుగుతో పారద్రోలినాడు. సందేహము వలదు. ఇతగాడు మహాజ్ఞాని, మహామేధావి, మహానుభావుడు. అయ్యా! మీకు శిరసు వంచి నమస్కృతులు తెలుపుచున్నాను, నమోన్నమః.

గర్వంతో, స్వాతిశయంతో గుండెలుప్పొంగగా.. నాపేరు గొప్పదనాన్ని విడమర్చిన ఆ మహానుభావుని పట్ల కృతజ్ఞతతో తడిసిపోతూ ఒకక్షణం అతన్నే చూస్తుండిపోయాను. ఎంతయినా, గొప్పవారికే గొప్పపేర్ల గూర్చి అవగాహన ఉంటుంది. వారే సరైన అంచనా వెయ్యగలరు. వారు కారణజన్ములు. 

ఒరే ఫాల్స్ ప్రిస్టేజి రియల్ ప్రసాదుగా! ఒక గొప్పవ్యక్తిని పరిచయం చేశావ్! నీ ఋణం తీర్చుకోలేనిది.

అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! నేనెంత మర్యాద తక్కువ మనిషిని! నాపేరుని ఇంతలా అభిమానిస్తున్న ఈయన నామధేయము తెలుసుకొనవలెనన్న కనీస మర్యాదని మరచితిని.

"అయ్యా! తమరు.. " అంటూ అగాను.

"నా పేరు చినపుల్లయ్య సార్! మీ తమ్ముడు ప్రసాదు క్లాస్మేట్నండి. చిట్స్ బిజినెస్ చేస్తాను."

ఒహో అలాగా! చిట్స్ వ్యాపారం చేస్తూకూడా నాపేరు మీద ఎంత రీసెర్చ్ చేశాడు! జీతే రహో బేటా! ఒకవేళ దేవుడనేవాడే ఉంటేగింటే నీ చిట్టీల వ్యాపారం బాగా సాగాలని ఆయన్ని కోరుకుంటున్నాను. లేదులేదు, ప్రార్ధిస్తున్నాను.

చినపుల్లయ్య గొంతు సవరించుకున్నాడు.

"సార్! రేపట్నించి కొత్తచీటీ మొదలెడుతున్నాను. మీరుకూడా ఒక చీటీ వెయ్యాల్సార్! అంతా మీ డాక్టర్లే సార్! మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్! చినపుల్లయ్య ఎట్లాంటివాడని ఎవర్నైనా అడగండి సార్! చీటీ పాడిన రోజే ఎమౌంట్ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తా సార్! నాకు మార్కెట్లో ఉన్న గుడ్‌విల్ అట్లాంటిది.. " చినపుల్లయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. 

'టప్'మని బెలూన్ పగిలిన శబ్దం! ఉప్పొంగిన నాగుండె ఫ్లాట్ అయిపోయింది!

నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !

(నిట్టూర్చుచూ, వగచుచూ, వాపోవుచూ, చింతించుచూ, ఖేదించుచూ, దుఃఖించుచూ, శోకించుచూ.. ఇంకా చాలా 'చూ'లతో.. )

చివరి తోక -


'వెంకట రమణ' నామధేయులకి క్షమాపణలు.