Sunday 28 December 2014

పుస్తకావిష్కరణ సభలు! ఇవి చాలా గొప్పవి!!


"సభకి నమస్కారం. 'పక్కింటావిడ' పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన సాహిత్యాభిమానులకి స్వాగతం. ఇన్నాళ్ళూ తెలుగు సాహిత్యంలో తల్లీ, చెల్లి గూర్చి రాసినవారున్నారు. కానీ, మన రచయితగారు పక్కింటావిడని ప్రధానపాత్రగా చేసుకుని రచన చెయ్యడం గొప్పవిశేషం. ఇలా పక్కింటి స్త్రీ పట్ల స్పందించి సాహిత్యం సృష్టించినవారు మరే భాషలోనూ లేరనీ, ఇది తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం అనీ.. "

"బావా! బావోఁయ్! ఈడేం జరుగుతుంది" 

"ష్! బయట తాటికాయంత అక్షరాల్తో బేనర్ రాసుంది, చూళ్ళేదా? ఇది పుస్తకావిష్కరణ సభ."

"పుస్తకావిష్కరణా! అంటే?"

"రచయితలు పుస్తకాలు రాస్తారు."

"ఆఁ! రాస్తే?"

"ఆ పుస్తకం మార్కెట్లోకి వదిలేముందు పుస్తకావిష్కరణ చేస్తారు."

"అర్ధం కాలా!"

"సినిమా పబ్లిసిటీ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తారే? ఇదీ అట్లాంటిదే!"

"అర్ధమయ్యేట్టు చెప్పు బావా!"

"సరే! నువ్వో పుస్తకం రాశావనుకో! ఆ పుస్తకం రాసినందుకు నీకో మీటింగు పెట్టి అభినందిస్తారు. ఖర్చులు నీవే!"

"అబినందనా! అంటే?"

"అంటే రచయితకి కావలసినవాళ్ళు, రచయిత కావలసినవాళ్ళూ, అందరూ ఒకచోట కూడి ఆ రాసినాయన గూర్చి మైకులో తలా నాలుగు మంచిముక్కలు చెబుతారు."

"ఎందుకు?"

"ఎందుకేమిటి!?"

"మంచో చెడ్డో, ఆ ముక్కలేదో పుస్తకం చదివినోడు జెప్పాలి గానీ, మధ్యలో ఈళ్ళందుకు చెప్పడం?"

"ఎందుకంటే, రేపు నీలాటి ముక్కుసూటిగాడు పుస్తకం పరమ చెత్తగా వుందని, వున్నది వున్నట్లుగా చెప్పొచ్చుగా! ఆ ప్రమాదం లేకుండా వీళ్ళు ముందుగానే మంచిగా మాట్లాడేసుకుంటారు."

"అదేంటి!"

"అదంతే!"

"బావా! ఇప్పుణ్ణాకు అర్ధమైంది. తెలుగు రచైతలు ఆళ్ళల్లోఆళ్ళు స్నేహితులు. ఆళ్ళే పుస్తకాలు రాసుకుని, ఆళ్ళే మీటింగులెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటా వుంటారు. ఇదోరకంగా ఒకళ్ళనొకళ్ళు వీపు గోక్కడం లాంటిది!"

"ష్! నెమ్మదిగా మాట్లాడు. నీకు బుర్ర లేదు బామ్మర్దీ! పుస్తకావిష్కరణ సభలు గొప్ప సాహిత్యసేవ చేస్తున్నాయి, వీటి గూర్చి ఘోరంగా మాట్లాడకు!"

"సర్లే బావా! అయినా మోటోణ్ని! నాకిసుమంటి పెద్దిషయాలు ఎందుగ్గానీ, నువ్వు మీటింగు ఇనుకో బావా! నేబోతా!"

"నీదే ఆలస్యం!"

ఉపన్యాసాలు ఇంకా కొన'సాగుతూ'నే వున్నయ్ -

"ఈ రచయిత తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం. 'పక్కింటావిడ' వంద నోబెల్ పైజులకి అర్హమైన గొప్ప రచన అని నా ప్రగాఢ విశ్వాసం. రచయితగారు నాకు బాగా తెలుసు. ఆయన ఉత్తముడు, నిగర్వి, నిరాడంబరజీవి, నిరంతర సత్యాన్వేషి..... "

(Updated and posted in fb)

Saturday 27 December 2014

రచయితల రోగం


"బావా! బావోయ్!"

"వూఁ!"

"ఒక డౌటు."

"అడుగు."

"రచైత అంటే ఏంటే ఎవురు బావా?"

"రచనలు చేసేవాళ్ళని రచయిత అంటారోయ్!"

"రచన్లా! అంటే ఏంది?"

"కథలు, నవలలు, వ్యాసాలు.. ఇట్లా చాలా వున్నైలే!"

"అబ్బో! చాలా యవ్వారవేఁ వుంది. ఇంతకీ రచైతలు రచన్లు ఎందుకు చేస్తారంటావ్?"

"మనోల్లాసానికి, మనోవికాసానికి.. "

"కొద్దిగా తెలుగులో చెప్పు బావా!"

"రచయితలు గొప్ప ఆలోచనాపరులు. పాఠకులకి కొత్త విషయాలు తెలియజెయ్యడానికి రచనలు చేస్తారు."

"పాటకులా! ఆళ్ళెవరు? చీటీపాట పాడేవాళ్ళా?"

"కాదు కాదు, రచయిత రాసింది చదివేవారిని పాఠకులు అంటారు."

"బావా! రచైత అంతేసి ఆలోచించడం దేనికీ? అన్నేసి పేజీల్తో బుక్కులు రాయటం దేనికి? తోచకపోతే నాలాగా హాయిగా సుట్ట కాల్చుకుంటా గమ్మునుండొచ్చుగా?"

"వుండొచ్చు. కానీ - వారి సామాజిక స్పృహ అందుకు వొప్పుకోదు."

"అర్ధవైఁంది బావా! ఇది కూడా ఒక యసనం అన్నమాట!"

"వ్యసనమా!"

"అవును బావా! మన అబ్బిగాణ్ని చూడు - పేకాడకుండా వుండలేడు. సూరిగాడు తాక్కుండా వుండలేడు. అట్టాగే రచైతలు కూడా రచన్లు చెయ్యకుండా వుండలేరన్నమాటేగా?"

"సరే! అలాగే అనుకో!"

"బావా! ఇదేవఁన్నా రోగవాఁ?"

"వురే! ఇందాకట్నుండి చూస్తున్నాను, ఒకటే వాగుతున్నావు. పొద్దస్తమానం పొలం పన్జేసుకునేవాడివి - నీకివన్నీ అవసరం అంటావా?"

"అదేంది బావా అట్టా కోపం జేస్తావు? ఏదో సదువు లేనోణ్ని - యివరంగా చెప్పొచ్చుగా?"

"నాకు వివరంగా చెప్పేంత ఓపిక లేదు. నీకో నమస్కారం, దయచేసి దయచెయ్యి!"

"అట్టాగే పోతా! ఇంత మరియాదగా చెప్పినా యినకుంటానికి నేనేవఁన్నా రచైతల్లాగా పనీపాటా లేనోణ్నా?"

(Updated and posted in fb)

Friday 26 December 2014

నేనో ఆవఁదం చెట్టుని!


అదొక సైకియాట్రీ కాన్ఫరెన్స్ రోజు. పగలంతా ఎకడెమిక్ కార్యక్రమాలతో వేడెక్కిన బుర్రని చల్లబరచడానికి సాయంకాలం ఓ పార్టీ. పేద్ద హాల్, అందులో పెద్దసైజు అప్పడాల్లా - తెల్లటి గుడ్డతో ముసుగేసుకున్న గుండ్రటి టేబుళ్ళు. సరదా కబుర్లు. వెచ్చని గ్లాసులు, చల్లని మగ్గులు.

ఓ టేబుల్ చుట్టూ సీనియర్ సైకియాట్రిస్టులు. వాళ్ళల్లో ఒకాయన నన్ను చూడంగాన్లే దగ్గరగా రమ్మని సైగ చేశాడు, ఆప్యాయంగా యోగక్షేమాలు విచారించాడు.

వున్నట్టుండి పక్కనున్నవారితో - "మనవాడికి తెలుగు సాహిత్యంలో మంచి నాలెడ్జ్ వుంది." అన్నాడు.

ఇట్లాంటి స్టేట్‌మెంట్ నేనూహించలేదు. అందువల్ల బోల్డెంత సిగ్గుగా అనిపించింది.

"అబ్బే! అదంతా ఒకప్పుడు లేండి, ఇప్పుడు కాదు." మొహమాటంగా అన్నాను.

"అదేంటయ్యా? ఆరోజు మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగు రచయితల గూర్చి చెప్పావుగా!?" పెద్దాయన ఆశ్చర్యపొయ్యాడు.

"ఆ రోజు మీకు రావిశాస్త్రి, పతంజలి గూర్చి మాత్రమే చెప్పానండీ!" సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు చెప్పాను.

ఒక సీనియర్ డాక్టర్ నా వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడు.

"ఐసీ! వాళ్లిప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాదులోనా?"

"వాళ్ళిప్పుడీ లోకంలో లేరు." ఇబ్బందిగా అన్నాను.

"తెలుగు రైటర్స్ ఇంగ్లీష్ లిటరేచర్‌ని కాపీ కొట్టి రాస్తారంటారు, నిజమేనా?" ఇంకో సీనియర్ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. వారి సైకియాట్రీ జ్ఞానం పట్ల నాకు గౌరవం వుంది. వారికి తెలుగు సాహిత్యం గూర్చి అసలేమీ తెలీదని అర్ధమవుతుంది. ఏదో నేను దొరికాను కదాని - కాలక్షేపంగా ధర్మసందేహాలు అడుగుతున్నారు.

"అంత లోతైన విషయాలు నాకు తెలీదండీ!"

ఇంకా అక్కడే వుంటే ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయంతో - "ఎక్స్యూజ్ మి" అంటూ ఏదో పనున్నవాళ్ళా అక్కణ్నుండి పారిపొయ్యాను.

అయితే - నేనిప్పుడు ఇంతకుముందులా సిగ్గు, మొహమాటం ఫీలవ్వట్లేదు! ఇక్కడ - పాతికేళ్ళ క్రితం ఓ పాతిక తెలుగు పుస్తకాలు చదివిన నేనే గ్రేట్!

దీన్నే 'ఏ చెట్టు లేని చోట ఆవఁదం చెట్టే గొప్ప' అంటారనుకుంటాను. అయితే - తన చుట్టూతా ఏ చెట్టూ లేకపోవడం ఆవదం చెట్టు తప్పు కాదని మనవి చేసుకుంటున్నాను!

Saturday 20 December 2014

టీవీ యాంకరుడు


"బావా! బావోయ్!"

"వూఁ!"

"నాకో తెలుగు టీవీలో యాంకరుద్యోగం వొచ్చింది బావా!"

"నువ్వా! టీవీ యాంకరా! ఉద్యోగవిఁచ్చిన గాడిదెవరు?"

"గాడిద కాదు బావా - మనిషే! తుళ్ళూర్లో పదెకరాల పొలం - రోడ్డు పక్కనే అద్దిరిపొయ్యే బిట్టు -  ఒక ఐదరాబాద్ పార్టీకి ఇప్పించాలే! పార్టీ ఫుల్లు హేపీసు! ఆ పార్టీకి ఐదరాబాదులో ఏదో టీవీ చానెలుందంట! నాకందులో యాంకరుద్యోగం ఇచ్చేసారు."

"వార్నీ! బ్రోకరేజితో పాటు ఉద్యోగం కూడా కొట్టేశావన్న మాట. గుడ్!"

"సర్లేగానీ బావా! ఇంతకీ టీవీ యాంకరంటే ఏంజెయ్యాలి?"

"రోజూ టీవీలో ఏదోక విషయం మీద చర్చలొస్తుంటయ్ కదా! వాటిని మోడరేట్ చెయ్యడాన్నే ఏంకరింగ్ అంటారు."

"అటూ ఇటూ మనుషుల్ని కూర్చోబెట్టుకుని కొచ్చిన్లు అడుగుతారు! యాంకర్లంటే ఆళ్ళేనా?"

"అవును."

"కానీ నాకు కొచ్చిన్లు అడగడం రాదే! ఏదైనా సలా ఇవ్వు బావా!"

"దాన్దేవుఁంది! 'దేవుడున్నాడా? లేడా? భగవద్గీత పవిత్ర గ్రంధమా? కాదా? అమ్మాయిలు లంగా వోణీలే వేసుకోవాలా? ఇవ్వాళ తెలుగు సినిమాల్లో నంబర్ వన్ హీరో ఎవరు?' అంటూ వివాదాస్పద విషయాల్ని చర్చకి పెట్టు. అవుననేవాళ్ళని, కాదనేవాళ్ళనీ చెరిసమంగా పిలువ్. వాళ్ళు అరుచుకుంటూ వుంటారు - నువ్వు వింటూ వుండు, చాలు."

"అంతేనా! సర్లే - అట్లాగే ఓ మంచి దమ్మున్న ప్రోగ్రాం కూడా చెప్పు బావా!"

"దమ్ము కోసం ఏకంగా ఒక చానెలే వుంది, ఇంక నువ్వు కొత్తగా చేసేదేముందిలేగానీ - ఒక పన్జెయ్! ఊళ్ళల్లో మొగుడూ పెళ్ళాల తగాదాలు, వివాహేతర సంబంధాలు వున్న కుటుంబాల్ని వెతుక్కో - వాళ్ళని లైవ్‌లోకి తీసుకో! వాళ్ళింక గంటల కొద్దీ తిట్టుకు ఛస్తారు, నీ అదృష్టం బాగుంటే కొట్టుకు ఛస్తారు కూడా!"

"అంతా బాగానే చెబ్తున్నావ్ గానీ - నీకు తెలుసుగా బావా? నాకు రాజకీయాలు తెలీదు, ఏం చెయ్యాలంటావ్?"

"ఏముంది! అధికార, ప్రతిపక్ష పార్టీలవాళ్ళని పిల్చి స్టూడియోలో కూర్చోబెట్టుకో. ఆ పిల్చేదేదో పాయింటు లేకుండా పెద్దగా అరుస్తూ పోట్లాడేవాళ్ళనే పిలువ్ - అప్పుడే నువ్వు సేఫ్! ఆ రోజు తెలుగు దినపత్రికల్లో వార్తలు ఒకటొకటిగా చదువు! ఇంక వాళ్ళే ప్రోగ్రాంని నడిపిస్తారు. మధ్యలో వేడి తగ్గినప్పుడు కూసింత మంట రాజెయ్యి - చాలు."

"ఓస్! యాంకరింగంటే ఇంతేనా! వుంటా బావా! అక్కనడిగానని చెప్పు."

(Updated and posted in fb)

Tuesday 16 December 2014

సావిత్రితో ఓ పాట




"శిష్యా! ఏవిఁటోయ్ ఫోనునలా తినేసేలా చూస్తున్నావ్?"

"గురుగారు! యూట్యూబులో సావిత్రి పాటని చూస్తున్నాను.. మైమరచిపోతున్నానండి."

"ఏవిఁటో ఆ పాట?"

"సంతానం సినిమాలో 'చల్లని వెన్నెలలో' అంటూ ఓ పాటుందండి! పాటలో సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను గురుగారు? చచ్చేంత అందంగా వుంది! సావిత్రినే చూస్తూ ఆనందంగా, హాయిగా పాడుతూ.. ఆహాహా! నాగేస్సర్రావు ఎంతదృష్టవంతుడు! అసూయగా వుందండి!"

"ఒహో అదా నీ సమస్య? నీ అసూయ తగ్గే మార్గం చెబుతా శిష్యా!"

"చెప్పండి గురుగారు."

"ఇంట్లో మంచం వుందా?"

"వుంది."

"దుప్పటుందా?"

"వుంది."

"ఒక పన్జెయ్! మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని సావిత్రినే తలచుకుంటూ.. ఆ పాట నువ్వే పాడుతున్నట్లు.. సావిత్రి ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు.. ఊహించేసుకో!"

"కానీ.. "

"ఊఁ! అడుగు, మొహమాటమెందుకు?"

"నాకు పాడ్డం రాదు గురుగారు!"

"నాగేస్సర్రావుకి మాత్రం పాడ్డం వచ్చా శిష్యా? ఘంటసాల స్టోన్‌ని అరువు తెచ్చుకోలేదూ?"

"అవును కదా!"

"లే మరి! ఇంక నీదే ఆలీసెం, దుప్పటి తన్ని కళ్ళు ఘాట్టిగా మూసుకుని - 'సావిత్రి రా! సావిత్రి రా!' అంటూ పిలుస్తూనే వుండు! దెబ్బకి సావిత్రి దిగొస్తుంది!"

"కానీ గురుగారు.. "

"మళ్ళీ డౌటా శిష్యా! సర్లే - అడుగు."

"నాకు పియానో వాయించడం రాదు గురుగారు!"

"ఓరి దౌర్భాగ్యుడా! నీకు సావిత్రితో డ్యూయెట్ పాడుకునే మార్గం చెప్తుంటే దిక్కుమాలిన డౌట్లతో సమయం వృధా చేస్తావేం! ఇంక నిన్ను బాగు చెయ్యడం నావల్ల కాదు. ఎందులోనన్నా దూకి చావు, పీడా విరగడౌతుంది - నే వెళ్తున్నా!"

"గురుగారు! గురుగారు!!"

(posted in fb on 22/7/2017)

Wednesday 10 December 2014

తెలుగుదేశం రాజధాని డిల్లీ!


"బావా! యిన్నావా? తొర్లోనే మన్దేసం సింగపూరైయిపోతంది."

"అనెవరన్నారు?"

"చెంద్రబాబు. పేపర్లో యేసారుగా? సూళ్ళేదా?"

"లేదు."

"బావా! యిన్నావా? తొర్లోనే మన్దేసం జపానైయిపోతంది."

"అనెవరన్నారు?"

"చెంద్రబాబు. పేపర్లో యేసారుగా? సూళ్ళేదా?"

"లేదు."

"ఏంది బావా? అంత సదూకున్నావు, ఇంత చిన్నిషయాలు కూడా తెలవదా నీకు!"

"ముందు నువ్వు తెలుసుకోవల్సింది ఒకటుంది - ఆంధ్రప్రదేశ్ అనేది భారద్దేశంలో ఒక రాష్ట్రం. సింగపూర్, జపాన్లు దేశాలు."

"జగన్ పార్టీవోళ్ళా గోరంగా మాట్టాడతన్నావేంది బావా! చెంద్రబాబు పార్టీ పేరేంది?"

"తెలుగుదేశం."

"అవును కదా? మరప్పుడు మనది దేశం అవుద్ది కాని రాష్టం ఎట్టాగవుద్ది?"

"తెలుగుదేశం అనేది ఎన్టీఆర్ తన పార్టీకి పెట్టుకున్న పేరు. మన దేశానికి ప్రధానమంత్రి వుంటారు."

"నేన్జెప్పేదీ అదే బావా! మన్దేసానికి ప్రెదానమంత్రి చంద్రబాబేగా!"

"ప్రధానమంత్రి చంద్రబాబు కాదు, నరేంద్ర మోడీ."

"బావా! నరేంద్ర మోడీ ఏ పార్టీ?"

"భారతీయ జనతా పార్టీ."

"కదా? కూసేపు మోడీనే ప్రెదానమంత్రిగా అనుకుందాం. మరప్పుడా పార్టీ పేరు బారద్దేస జనతా పార్టీ అనుండాల కదా? ఎందుకు లేదు?"

"నువ్వు చెప్పేది నాకర్ధం కావట్లేదు. మరి మోడీ ఎవరంటావ్?"

"అదీ అలా అడిగావ్ బాగుంది. చెబుతా విను. మన్దేశం పేరు తెలుగుదేశం. మన ప్రెదాని చెంద్రబాబు. దీనికి రాజధాని ఢిల్లీ. చెంద్రబాబు మోడీని గెలిపించి ఢిల్లీలో కూర్చోబెట్టాడు. ఇంకనైనా ఆ పాడు ఇంగిలీషు పేపర్లు సదవటం ఆపెయ్ బావా!"

"..............."

"బావా! బావా!! ఏందట్లా మిడిగుడ్లేసుకుని నీలుక్కుపొయ్యావ్! కొంపదీసి పోయ్యావా యేంది!"

Monday 8 December 2014

వాస్తు మహిమ


"ఎవరదీ?"

"నేను మావాఁ!"

"వార్నీ! నువ్వా అల్లుడూ! రా రా, ఆ కుర్చీ లాక్కుని కూర్చో!"

"ఎలాగున్నావ్ మావాఁ?"

"బాగానే వున్నానల్లుడూ! వయసయిపోతుందిగా! ఆమధ్య కొద్దిగా దెబ్బ తిన్నాన్లే!"

"తెలుసు, అమ్మ చెప్పింది. అందుకే చూసి పోదావఁనొచ్చా."

"మంచిది."

"అత్త ఇంట్లో లేదా మావాఁ?"

"ఏం చెప్పమంటావల్లుడూ? మీ అత్తకీ మధ్య మూతి పక్షవాతం వచ్చింది. పక్కూళ్ళో రమణయ్యని గొప్ప సిద్ధాంతిగారున్నారు. ఆయనేదన్న పరిష్కారం చెబుతాడేమోనని వెళ్ళింది."

"రోగవొఁస్తే డాక్టర్ దగ్గరకెళ్ళాలిగానీ.. సిద్ధాంతెందుకు మావాఁ!?"

"రోగాలెందుకొస్తాయల్లుడూ? వాస్తుదోషంతోనో, గ్రహబలం బాగోకే కదా? అట్లాంటప్పుడు డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు?"

"రోజులు మారాయి మావాఁ!"

"అదేంటల్లుడూ? రోజులెక్కడ మారాయి? చంద్రబాబు ఇప్పటివాడేగా!"

"మధ్యలో చంద్రబాబేం చేశాడు మావాఁ?"

"చంద్రబాబు మొదట క్రిష్ణాజిల్లాలోనే రాజధాని అన్నాడు కదా! ఇప్పుడు గుంటూరు జిల్లా వైపుకి ఎందుకు మళ్ళాడంటావ్?"

"రాజకీయ కారణాలు..."

"కాదు కాదు! వాస్తు, వాస్తు ఒప్పుకోలేదల్లుడూ!"

"వాస్తు ఒప్పుకోలేదా?!"

"మన తెలుగునాట గొప్ప జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు వున్నారు. వారంతా జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకాలు చెబుతుంటారు. వారిలో ఒకాయన చాలా లోతుకెళ్ళి - ఆడవారి రజస్వల సమయం బట్టి వారి మనస్తత్వం నిర్ణయమవుతుందని ఓ గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ పండితులవారే మన చంద్రబాబుకిప్పుడు ముఖ్య సలహాదారుడు."

"అలాగా! నాకు తెలీదు."

"జగనెందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపొయ్యాడంటావ్?"

"జగన్ తండ్రినే నమ్ముకున్నాడు. చంద్రబాబు మోడీనీ, రైతుల ఋణమాఫీ హామీనీ నమ్ముకున్నాడు."

"గాడిదగుడ్డేం కాదు! జగన్ హిందువు కాదు, అందుకే గ్రహాలు మొరాయించాయి."

"గ్రహాలు హిందువులకేనా మావాఁ?"

"ఇట్లాంటి గొప్పవిషయాలు నీలాంటి సామాన్యులకి అర్ధం కావులే అల్లుడూ!"

"మావాఁ! జాతకాల్ని, వాస్తుని నమ్మడం వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి. ఆ నమ్మకాల్ని వారు తమ సొంతపనులప్పుడు పాటిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ - కొన్ని కోట్లమందికి సంబంధించిన రాజధాని విషయంలో ఈ వాదనేంటి మావా?"

"చంద్రబాబు గురువుగారు క్రిష్ణా నదికి గుంటూరు వైపునైతేనే తెలుగువారు సుఖసంతోషాలతో ప్రకాశిస్తారని సెలవిచ్చారు. ఆయన మాట చంద్రబాబుకి వేదవాక్కు. కాదన్డానికి నువ్వెవరు?"

"సర్లే మావాఁ! ఇక నేవెళ్తా. అత్తని అడిగానని చెప్పు."

"అడగడం మర్చేపొయ్యాను. నీ కొడుక్కి డాక్టర్ సీటొచ్చిందా?"

"కష్టపడి చదివాడు. అయినా రాలేదు, ఈసారి లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటాట్ట మావాఁ!"

"వాడికి సీటెలా వస్తుంది? రాదు. కష్టపడి చదివితే సరిపోతుందా? వాస్తు సహకరించొద్దూ?"

"మావాడి చదువుక్కూడా వాస్తు లింకుందా మావాఁ?"

"నాకన్నీ తెలుసులేవోయ్! మీ అత్తెప్పుడో చెప్పింది. నీ ఇంట్లో ఈశాన్యం మీద బరువు పెడుతున్నావంట!"

"ఈశాన్యం మీద బరువా!?"

"అవును, నీ కారు పార్కింగ్ ఇంటికి ఈశాన్యం వైపుందిట. ఇవ్వాళ్టినుండి ఆ పాడు కారు అక్కణ్నించి తీసెయ్! ఈశాన్యం మీద బరువుండకూడదు."

"మరి కారెక్కడ పెట్టుకోను?"

"రోడ్డు మీద పెట్టుకో."

"కారుని రోడ్డు మీద పడేస్తే దొంగలెత్తికెళ్ళరూ!"

"పోతే పొనీ! వెధవ కారు. ఒకటిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, నీకు పిల్లాడి సీటు ముఖ్యమా? కారు ముఖ్యమా? అయినా ఇంకెన్నాళ్ళు? వొచ్చే నెల్లో నాకు మీ ఊళ్ళో కొద్దిగా పనుంది. వచ్చేప్పుడు రవణయ్య సిద్ధాంతిని తీసుకొస్తాను. ఆయన్నీ ఇంటికి చేయించాల్సిన మార్పుచేర్పులు చెబుతారు. ఆ ప్రకారం ఇల్లు బాగుచేసుకో."

"మావాఁ! వెళ్ళొస్తాను."

"మంచిది. నీదే ఆలస్యం, నాకు పూజకి వేళైంది."

(posted in fb on 26/07/2017)

Thursday 4 December 2014

విగ్రహాల తయారీకి అచ్చులు పోసిన కార్మికులెవ్వరు?


అభిమానం రకరకాలుగా వుంటుంది. అనేకానేక ప్రాంతాల్లో, అనేకానేక వ్యక్తులు, అనేకానేక కారణాలతో కొన్నివిషయాల పట్ల, వ్యక్తుల పట్ల అభిమానం పెంచుకుంటారు. ఆ అభిమానానికి అనేక కారణాలు వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక కవినో, కళాకారుణ్నో అభిమానించేవాళ్ళు వుండొచ్చు. కానీ - మన తెలుగునాట మాత్రం ఆ ఆనవాయితీ వున్నట్లుగా లేదు.

తెలుగు ప్రాంతం గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగువాడు గొప్పవాడు! ఇట్లా మనవాళ్ళు తమకుతామే ఉదారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసుకుంటారు (ఇంకో భాషవాడైవడైనా వచ్చి కాదండానికి వాడికి మన భాష రాదు కాబట్టి). ఎంతో గొప్పవాడైన ఈ తెలుగువాడు ఎవర్నైనా అభిమానించాలంటే ఆ వ్యక్తి - ఒక సినిమా నటుడో, రాజకీయ నాయకుడో అయ్యుండాలి. కొందరైతే - క్రికెట్ ఆటగాడైనా, అమెరికా ప్రెసిడెంటైనా - తమ కులంవాడైతేనే అభిమానిస్తారు! అవును మరి - వారిది రాజీ లేని, కల్తీ లేని కులాభిమానం! వారికి నా అభినందనలు.

ఇప్పుడు కొంచెంసేపు తెలుగు సినిమా హీరోల వీరాభిమానుల గూర్చి -

నా కాలేజి రోజుల్లో ఎన్టీఆర్‌కి వీరాభిమానులుండేవారు. వారు మాటలో, నడకలో ఎన్టీఆర్‌ని అనుకరించేవాళ్ళు. ఎవరైనా ఎన్టీఆర్‌ని చిన్నమాటన్నా సహించేవాళ్ళు కాదు, తన్నులాటకి దిగేవాళ్ళు, తన్నులూ తినేవాళ్ళు (ఇంతకన్నా గొప్ప అభిమానం వుంటుందనుకోను)! ఆనాడు సమాజంలో డబ్బు చాలా తక్కువ. కాబట్టి తమ కల్తీలేని నిఖార్సైన అభిమానాన్ని గుండెల్లో నింపుకుని తృప్తినొందేవారు (అంతకన్నా చేయగలిగిందేమీ లేక).

రోజులు మారాయి. తెలుగు సమాజంలో డబ్బుతో పాటు అభిమానాన్ని చాటుకునే మార్గాలూ పెరిగాయి. మొదటిరోజు మొదటి ఆటకి సినిమా హాల్లో నలిగిన పూలు, నిరోధ్ బూరలు ఎగరేసి ఆనందం పొందిన అభిమానులు - ఆ తరవాత రోజుల్లో హాలు ముందు తమ అభిమాన నటుడితో కలిపి దిగిన ఫొటోల్ని పెద్దపెద్ద ఫ్లెక్సీ బేనర్లుగా ప్రదర్శించే స్థాయికి ఎదిగారు.

సమాజంలో డబ్బు మరింత పెరిగింది, విలువా తరిగింది!  అంచేత - అభిమానులకి "ఫ్లెక్సీ అభిమానం" చీప్‌గా అనిపించసాగింది! ఫ్లెక్సీ కిక్కు తగ్గి ఇంకా మరేదో కావాలనుకునే స్థితికి చేరుకున్నారు. ఆ 'ఇంకా మరేదో కిక్కు' ఇచ్చునది ఏమిటి? అని తీవ్రంగా మథనపడసాగారు.

ఈ సినిమా హీరోల అభిమానులు ఇలా వుండగా -

ఒకపక్క - రాజకీయ నాయకుల అభిమానులు చాలా ముందుకు వెళ్లిపొయ్యారు. వారి అభిమానులు తమ నాయకుల విగ్రహాల్ని ఊరూర ప్రతిష్టించుకుని తృప్తినొందసాగారు. ఈ విగ్రహాల ట్రెండ్ సినిమా హీరోల అభిమానుల్ని తాకడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ - ఎప్పుడోకప్పుడు తప్పదు. 

ఈ లోకంలో డబ్బున్నవాళ్ళకి మల్లే - చదువుకున్నవాళ్ళకీ అహంకారం వుంటుంది. అందువల్ల సామాన్యుల ఇష్టాయిష్టాల్ని అర్ధం చేసుకోవడంలో వాళ్ళెప్పుడూ వెనకే వుంటారు. ఆ రోగం నాకూ వుండటం వల్ల - ఒకప్పుడు ఈ విగ్రహాల సంస్కృతిని విసుక్కుంటూ (నాకిప్పటికీ ఈ విగ్రహాలకున్న పవిత్రతేంటో అర్ధమయ్యి చావదు) - విగ్రహామా! భవిష్యత్తు నీదే!!  అంటూ ఒక పోస్టు రాశాను. ఈమధ్య నా మేధావిత్వాన్ని కొంత తగ్గించుకుని - ఈ విగ్రహాల వెనకనున్న సామాజిక అర్ధిక కోణాల్ని వెతికే పన్లో పడ్డాను!

చరిత్రకారులు చరిత్రని (దిండ్లని మరిపించే) పుస్తకాల్లో రాస్తారు. ఆ దిండ్ల వంటి పుస్తకాలు లైబ్రరీలో నిలువుగా పేర్చి వుంటాయి. ఆ లైబ్రరీలో (నిశ్శబ్దం పాటిస్తూ) ఆ దిండ్ల మధ్య రోజుల తరబడి కూర్చుని చదివి చరిత్రని అర్ధం చేసుకోవడం ఒక పద్ధతి. దీనికి చాలా ఓపిక కావాలి, అందరివల్లా అయ్యే పని కాదు.

అసలు - చరిత్రని అంత శాస్త్రీయంగా పడీపడీ చదవడం అవసరమా? ఈ సందేహం నాక్కలగడానికి ఒక కారణం వుంది. మా గుంటూరు గూర్చి రోజుల తరబడి పుస్తకాలు చదవండి - మీరు గుంటూరు నైసర్గిక స్వరూపం, చరిత్ర వంటి సమాచార "పాండిత్యం" పొందగలరు.

చదివే ఓపిక లేదా? రోడ్డు పక్క టీ స్టాల్లో టీ తాగి, క్రేన్ వక్కపలుకులు చప్పరిస్తూ - ఒక పూట అలా రోడ్లంట పడి తిరగండి. చక్కటి కల్తీలేని దుమ్ము, నిండైన మురుక్కాలవలు, గుంపుల కొద్దీ దోమలు, దారీతెన్నూ లేని ఆటోలు -  మీరు మర్చిపోలేని "అనుభవం" పొందుతారు.

అంచేత - 'అనుభవం అనేది పాండిత్యం కన్నా మిన్న' అని నేననుకుంటూ వుంటాను (ఎన్నో దశాబ్దాల క్రితం రాహుల్ సాంకృత్యయేన్ కూడా నాలాగే అనుకున్నాడు).

మీకు నా పాండిత్యం, అనుభవం థియరీ నచ్చిందా? అయితే మీకు విగ్రహాల సంస్కృతి కూడా ఈజీగా అర్ధమవుతుంది. పండితుడికి విగ్రహాలు చికాకు కలిగిస్తాయి, అనుభవజ్ఞుడికి విగ్రహాలు చరిత్రకి ఆనవాళ్ళుగా అగుపిస్తాయి.

ఫలానా వూళ్ళో ఫలానా విగ్రహం వుందంటే - అనుభవజ్ఞుడైతే ఆ ఊరివాళ్ళు ఫలానా కులం వాళ్ళని తెలుసుకుంటాడు, ఫలానా పార్టీ అభిమానులనీ అర్ధం చేసుకుంటాడు. ఈ చరిత్ర లైబ్రరీల్లో దొరకదు కదా! ఒకప్పడు అభిమానుల అభిమానం గుళ్ళో పెళ్ళీలాంటిదైతే - ఇవ్వాల్టి అభిమానం పెద్ద కన్వెన్షన్ హాల్లో భారీ పెళ్ళి లాంటిది!

నేను విగ్రహాల పట్ల ఇంత నిగ్రహంగా ఆలోచించడానికి ఇంకో కారణం కూడా వుంది. మా గుంటూరుకి దగ్గర్లో తెనాలి పట్టణం వుంది. చాలామంది పేషంట్లు తెనాలి నుండి వస్తుంటారు. అనాదిగా తెనాలి కళలకి నిలయం. 'అనాదిగా' అని రాయడానికి నాకున్న కారణం - కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు మొదలైన లబ్దప్రతిష్టులైన సినిమా నటులు కాదు. అందుక్కారణం - బి.వీరాచారి!

నలభయ్యేళ్ళ క్రితం సినిమాలు చూసినవాళ్ళకి - 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు', 'హాలులో పొగ త్రాగరాదు', 'ఏ కారణము చేతనైనా ఆట ఆగినచో డబ్బు వాపసు ఇవ్వబడదు' మొదలైన స్లైడ్స్ గుర్తుండే వుంటాయి. ప్రతి స్లైడ్‌కి కింద ఓ మూలగా చిన్న అక్షరాలతో - 'బి.వీరాచారి, తెనాలి' అని వుంటుంది.

ఆవిధంగా - రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళల్లో తన స్లైడ్స్ ద్వారా తెనాలికి ఖ్యాతి తెచ్చిన బి.వీరాచారిని అభినందిస్తున్నాను. బి.వీరాచారిని కన్న పుణ్యభూమియైన తెనాలి పట్టణంలో అనేకమంది శిల్ప తయారీ నిపుణులు, శిల్ప వ్యాపారులు వున్నారు. వారిలో కొందరు నాకు తెలుసు.

కొన్నేళ్ళ క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అటుతరవాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన విగ్రహాలకి విపరీతమైన గిరాకీ వచ్చింది. ఆ సీజన్లో తెనాలి శిల్పులకి రాంత్రింబగళ్ళు ఒకటే పని. వాళ్ళు తమ పాత అప్పులు తీర్చేసుకున్నారు, భార్యలకి కొత్తగా నగలు చేయించుకున్నారు. తామంతా రాజశేఖరరెడ్డికి ఎంతో ఋణపడి వున్నామని ఆ కుటుంబాలవాళ్ళు నాకు చెప్పారు.

'ఆ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టిస్తారు? ట్రాఫిక్‌కి అడ్డం కాదా?' వంటి చెత్తప్రశ్నలు మధ్యతరగతి మేధావులకి రావొచ్చు - మనం పట్టించుకోనవసరం లేదు. విగ్రహం చేయించినవాడే ఏవో తిప్పలు పడి - ఎక్కడోక చోట నిలబెడతాడు. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన పార్టీలవాళ్ళు ఎలాగూ ఆ విగ్రహాల్ని తొలగిస్తారు. కానీ - తొలగించిన విగ్రహం స్థానంలో వాళ్ళు తమ పార్టీ నాయకుని విగ్రహం పెట్టుకుంటారుగా? అంటే పాతచొక్కా బదులు కొత్తచొక్కా కొనుక్కున్నట్లన్నమాట! అప్పుడు - తెనాలి శిల్పులకి మళ్ళీ గిరాకీయే కదా?

నాయకులు - ఖద్దరు కట్టి నేతకార్మికుల్ని ఆదుకోమంటున్నారు. మరి - విగ్రహాలు తయారుచేయించి శిల్పకళా కార్మికుల్ని ఆదుకొమ్మని ఎందుకు చెప్పరు? ఎందుకో నాకు తెలీదు. కానీ - భవిష్యత్తులోనైనా వాళ్ళీ మాట చెప్పాలి, చెప్పి తీరాలి అనేది నా అభిప్రాయం.

ఇదంతా ఎందుకు రాశానంటే - ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే ఒక తెలుగు సినిమా నటుడి విగ్రహం తయారైందిట. అది త్వరలో ఎక్కడో నిలబడబోతుంది.  ఈ వార్త చదవంగాన్లే - నేనూహించింది జరుగుతున్నందుకు చాలా ఆనందం కలిగింది. త్వరలోనే మనం మరిన్ని సినీనటుల విగ్రహాలు చూడబోతున్నాం (ఆ నటుడి ఎగస్పార్టీవాళ్ళు దద్దమ్మలు కాదు). అంటే - శిల్ప కళాకారులకి మరింత ఉపాధి.

సినీ హీరో అభిమానులు కాలుష్య కారణమైన ఫ్లెక్సీ పరిశ్రమ వదిలి - ఎంతో క్రియేటివిటీ వున్న శిల్పకళని పోషించే దిశగా వెళ్తున్నదుకు ఆనందిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను కూడా! ఈ స్పూర్తితో తెలుగునాట శిల్పకళ గొప్పగా అభివృద్ధి చెందుతుందని కూడా నేను భావిస్తున్నాను.

ముగింపు -

ఈ పోస్ట్ చదివారుగా! ఇకనుండి మీకు ఏ విగ్రహం కనిపించినా - ఆ విగ్రహం మొహం పట్టించుకోకండి. అది ఎవరిదైనా కావచ్చు - మనకనవసరం. మీకా విగ్రహంలో - విగ్రహానికి అచ్చులు పోసి మెరుగులు దిద్దిన కార్మికులు కనిపిస్తే సంతోషిస్తాను.

(ఈ పోస్ట్ టైటిల్‌కి ప్రేరణ శ్రీశ్రీ 'దేశచరిత్రలు' పంక్తులు.) 

Monday 1 December 2014

ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!


ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముషిరుల్ హసన్ మొన్న ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని హిందూలో చదివాను. ఈ వార్త చదివాక చాలా దిగులుగా అనిపించింది. నేను చాలాయేళ్ళుగా హిందూలో ప్రచురితమయ్యే ముషిరుల్ హసన్ వ్యాసాలు చదువుతున్నాను. దేశ విభజన, విభజనాంతర పరిణామాలు, మతరాజకీయాలు.. ఇలా అనేక విషయాలపై ఆయన ఆలోచింపజేసే రచనలు చేశాడు.

ముషిరుల్ హసన్ అంతకుముందు కొన్ని ఎకెడెమిక్‌ పుస్తకాలు రాసినప్పటికీ.. నాలాంటివాడికి బాగా తెలీడానికి కారణం - సల్మాన్ రష్దీ! రష్దీ రాసిన 'సెటనిక్ వెర్సెస్' అన్న పుస్తకం ముస్లిం మతచాందసులకి కోపం తెప్పించింది. దాంతో ఆయతొల్లా ఖొమైనీ రష్దీని చంపెయ్యమని ఓ ఫత్వా (?) జారీ చేశాడు. ముస్లిం వోట్లని దృష్టిలో వుంచుకుని - ఆనాటి భారత ప్రభుత్వం హడావుడిగా రష్దీ పుస్తకాన్ని నిషేధించింది (ఎంతైనా పుస్తకాల్ని నిషేధించడంలో ప్రభుత్వాలు భలే ఉత్సాహంగా వుంటాయి)!

అనాడు - 'సెటనిక్ వెర్సెస్' నిషేధించడాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా - జామియా మిలియా ఇస్లామియా హిస్టరీ ప్రొఫెసర్‌ ముషిరుల్ హసన్ వార్తలకెక్కాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా మతవాదులకి లిబరల్స్ ఆలోచన బూతుగానే అనిపిస్తుంది. అంచేత - ముస్లిం మతచాందసులు - క్లాసుల్లో పాఠాలు చెప్పుకుంటూ, పుస్తకాలు రాసుకునే మన ప్రొఫెసర్‌గార్ని తుక్కుబడ తన్నారు. పాపం! ఆ దెబ్బలకి ఆయన ఆస్పత్రి పాలయ్యాడు.

ముషిరుల్ హసన్ రాసిన ఓ పుస్తకం కొన్నాను గానీ - చదవలేకపొయ్యాను. ఆకలిగా లేనప్పుడు మసాలాదోసె ఆర్డరివ్వం కదా? మరప్పుడు చదివే ఓపిక లేనప్పుడు పుస్తకం కొనడం దేనికి? ఎందుకో నాకు తెలీదు. తెలిస్తే - చాలా పుస్తకాలు కొనేవాణ్నే కాదు

ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!

Friday 28 November 2014

అమాయకుల ఆందోళన


ఒకానొకప్పుడు - ఎక్కడైనా, ఎప్పుడైనా అంతిమంగా న్యాయమే జయిస్తుందని నమ్మేవాణ్ని. యిలా నమ్మడం నా అమాయకత్వం మాత్రమేనని కొన్నాళ్ళకి అర్ధం చేసుకున్నాను. అప్పుడు నేను - నా అమాయకత్వానికి నవ్వుకున్నాను.

ఈ తరహా అమాయకత్వం ఏ వొక్కడి సొత్తూ కాదనుకుంటాను. ఎందుకంటే - ఈ లోకంలో ఎప్పుడూ కావల్సినంతమంది అమాయకులు వుంటూనే వున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. యిలా జాలి పడటం నాకేమీ సంతోషంగా లేదు.

ఒకప్పుడు అజ్ఞానంతో - 'మీ చర్మం రంగు తెల్లగా మార్చేస్తాం' అంటూ క్రీముల కంపెనీలు గుప్పించే ప్రకటనలు చూసి - 'చర్మం ఆరోగ్యంగా వుండాలి గానీ ఏ రంగులో వుంటేనేం?' అని విసుక్కునేవాణ్ని. నేనిప్పుడా ప్రకటనల్ని అర్ధం చేసుకున్నాను, సమర్ధిస్తున్నానుకూడా! అవును - మనం తెల్లగా వుండాలి! వుండి తీరాలి!

'హిందూ మతవాదులు గోవుల్ని చంపడం నిషేధించండి! అంటూ నినదిస్తారే గానీ, అదే జాతైన గేదెల్ని చంపొద్దని ఎందుకు అనరు?' ఇది కంచె ఐలయ్య ప్రశ్న. తెల్లగా వుండటమే గోవుల పవిత్రతకి కారణమా? అయ్యుండొచ్చు! 'ఎరుపంటే కొందరికి భయం భయం!' అన్నాడే కానీ - నలుపు తెలుపుల సంగతి చెప్పలేదు శ్రీశ్రీ.

కాబట్టి - మనిషైనా, జంతువైనా చర్మం నల్లగా వున్నట్లైతే - ప్రాణాలకి రక్షణ ఉండదని అర్ధమవుతుంది. మన పేదదేశాలవారికి అమెరికా ఒక సుందర స్వప్నం. కానీ ఆ అమెరికాలో నివసించే నల్లవారికి మాత్రం ఒక పీడకల. ఈ విషయం మాల్కం ఎక్స్, మార్టిన్ లూధర్ కింగ్ వంటి హక్కుల నాయకులు హత్య చేయబడ్డప్పుడే అర్ధమైంది.

కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఓ 'నల్లతోలు' యువకుణ్ని కర్తవ్య నిర్వహణయే పరమావిధిగా భావించిన 'తెల్లతోలు' పోలీసు దొర అనుమానంగా, హడావుడిగా కాల్చి చంపేశాట్ట.

ఇదసలు వార్తేనా? కాదు కదా! మరీ ఆందోళనలేమిటి? ఎందుకంటే - మొదట్లో నే చెప్పినట్లు - ఈ ప్రపంచం అమాయకుల నిలయం. ఈ అమాయకులు అజ్ఞానంతో అరుస్తారు. అలా అరవగా అరవగా - కొంతకాలానికి వారే విజ్ఞానవంతులవుతారు.

ఒక మాజీ అమాయకుడిగా నొక్కి వక్కాణిస్తున్నాను - ఇవన్నీ మనం పట్టించుకుని సమయం వృధా చేసుకోరాదు. ఎంత అన్యాయం! అమెరికా ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎక్కడెక్కిడికో వెళ్ళి దుష్టుల్ని సంహరించి ప్రపంచశాంతిని కాపాడుతుంది కదా! అటువంటి ఒక గొప్పదేశానికి - తన పౌరుడ్ని (వాడు నల్లవాడో తెల్లవాడో మనకనవసరం) చంపుకునే అధికారం, హక్కు వుండకూడదా? వుండాలి! వుండితీరాల్సిందే!!

Monday 24 November 2014

నేరమంతా ఒక్క రాంపాల్ బాబాదేనా?



గత కొన్నిరోజులుగా సంత్ రాంపాల్ అనే ఒక బాబా వార్తల్లో వ్యక్తిగా మారాడు. మీడియా రాంపాల్ అరాచకాల్ని కథలు కథలుగా రాసేస్తుంది. ఆశ్చర్యమేమంటే - రాంపాల్ ఆశ్రమ రహస్యాలు కొందరికి ఆశ్చర్యంగా అనిపించడం! ఈ ఆశ్రమాలు, భక్తుల హడావుడి.. నాకైతే ఇదంతా ఓ deja vu. ఈ బాబాలేం రాత్రికి రాత్రి పుట్టుకు రాలేదు, ఇవన్నీ మనకి కొత్తేం కాదు.

బ్రతకడానికి అనేక వృత్తులు - డాక్టర్లు, న్యాయవాదులు, మెకానిక్కులు.. మొదలైనవి. అలాగే - 'బాబాగిరి' కూడా ఒక వృత్తేనని అనుకుంటున్నాను! నిజం చెప్పాలంటే - మిగతా వృత్తులతో పోలిస్తే ఈ బాబావృత్తిలోనే తీవ్రమైన పోటీ నెలకొని వుంది. వందలమంది బాబాల అవతారం ఎత్తుతారు - అతికొందరికి మాత్రమే 'గుర్తింపు' లభిస్తుంది.

గొంగళిపురుగు సీతాకోక చిలగ్గా మారేముందు అనేక దశలు. అలాగే - బాబాలక్కూడా అనేక దశలు. ముందుగా ఫలానా బాబా మహిమ కలవాడని లోకల్‌గా ప్రచారం చేసుకుంటారు. మందీమార్భలం, శిష్యగణంతో హడావుడి చేస్తారు. నిదానంగా రాజకీయ నాయకుల్ని, ఉన్నతాధికారుల్ని ఆకర్షిస్తారు. ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది.

క్రమేణా - పాపులారిటీతో పాటు భక్తులూ పెరుగుతారు. భక్తుల్ని జాగ్రత్తగా హేండిల్ చేస్తూ - రాజకీయ నాయకులకీ, ఉన్నతోద్యోగులకీ, కాంట్రాక్టర్లకీ liaison work చెయ్యడం మొదలెడ్తారు. ఉన్నత వర్గాలవారికి నమ్మకమైన బ్రోకర్‌గా వ్యవహరిస్తారు. కొంతకాలానికి - ఆ వర్గాల వారు తమ నల్లధనాన్ని బాబాల దగ్గర పార్క్ చేస్తారు. ఇలా - ఇంతమందీ కలిస్తేనే ఒక 'బాబాసామ్రాజ్యం' తయారవుతుంది. కొన్నిచోట్ల బాబాలకి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వున్నాయంటే - వీరి స్థాయేమిటో అర్ధం అవుతుంది.

బాబాల భక్తులుగా - సైంటిస్టులు, డాక్టర్లు వంటి గౌరవనీయమైన వృత్తుల్లో వున్నవాళ్ళు కూడా వుంటారు. ఈ దేశంలో చదువుకున్నవాళ్ళకి అనవసరమైన గౌరవం ఇస్తుంటారు కాబట్టి - 'ఫలానా సైంటిస్టే బాబా కాళ్ళకి మొక్కుతున్నాడు. మనమేమైనా ఆయనకన్నా తెలివైనవాళ్ళమా?' అని కొంతమంది అనుకుంటారు. మనం ఫలానా భక్తుడి కన్నా తెలివైనవాళ్ళం కాకపోవచ్చును, తెలివితక్కువ్వాళ్ళం మాత్రం ఖచ్చితంగా కాదు.

ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి.. పేరేదైతేనేం? modus operandi మాత్రం ఒకటే. వీళ్ళకి యోగా అనో, వనమూలికల వైద్యమనో - ఏదోక సైడ్ బిజినెస్ కూడా వుంటుంది. సినిమాల్లో అమ్రిష్ పురీ ఇట్లాంటి బాబా వేషాలు చాలానే వేశాడు. ఒకప్పుడు మన రాష్ట్రంలో బాబాల ఆశ్రమాల్లో కాల్పులు జరిగి మనుషులు చస్తేనే అతీగతీ లేదు. గత కొన్నేళ్ళుగా న్యాయస్థానాలు మాత్రం ఈ బాబాలకి కునుకు లేకుండా చేస్తున్నాయి!

'ఆవారా'లో రాజ్‌కపూర్, కె.ఎ.అబ్బాస్‌లు - నేరమయ వ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎలా మారతాడో చెప్పారు. 'గాడ్‌ఫాదర్'లో రాజకీయ వ్యవస్థ, నేర సామ్రాజ్యాన్ని తన అవసరాలకి ఎలా వాడుకుంటుందో మేరియో పూజో, ఫ్రాన్సిస్ కొప్పోలా చూపారు. 'నేరం' అనే ఒక మొక్క - 'నేరవ్యవస్థ' అనే వృక్షంగా రూపాంతరం చెందడంలో తలా ఒక చెయ్యేస్తే గానీ సాధ్యం కాదు.

అయితే - బాబాల నేరాలు బయటపడ్డప్పుడు - బాబాలు మాత్రమే జైలు పాలవుతున్నారు (ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్న బాబాల సంఖ్యేమీ తక్కువ కాదు). వీళ్ళతో hand in glove గా వుండి, నేరసామ్రాజ్యాన్ని పెంచి పోషించిన రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం తప్పించుకుంటున్నారు (నేను బాబాల్ని సమర్ధించడం లేదు - వారి సహనేరస్తులు తప్పించుకుంటున్నారని చెబుతున్నాను.)

ఇకనుండి బాబా రాంపాల్ మాత్రమే విలన్. మీడియాలో ఆయన గూర్చి రోజుకో దుర్మార్గమైన నిజం వెలుగులోకొస్తుంది. ఇన్ని కేసులున్న రాంపాల్ ఇప్పుడప్పుడే బయటకొచ్చే అవకాశం తక్కువ. బాబాకి ఇప్పటిదాకా సహకరించినవారు దూరంగా సర్దుకుంటారు. కొన్నాళ్ళకి ఇంకో 'దుర్మార్గ' బాబా భాగోతం బయటపడుతుంది - అంతా మామూలే!

ప్రజల్లో అజ్ఞానం పోనంత వరకూ బాబాలకి కొదవుండదు. రాజకీయ నాయకులకి బాబాల అవసరం వుంది. కావునే - ప్రభుత్వాలకి బాబాల నేరాల్ని కట్టడి చేసే ఆసక్తి వుండదు. మనం బాబాల నేరమయ నేపధ్యం మూలాల్ని అర్ధం చేసుకోకపోతే - ఆ మకిలంతా ఒక్కడికే అంటించేసి, వాణ్ని మాత్రమే విలన్‌గా చేసి చేతులు దులుపుకునే పరిమిత అవగాహనలో వుండిపోతాం.

(posted in fb on 25/8/17)

Thursday 20 November 2014

పాలగుమ్మి సాయినాథ్




మనిషికి డబ్బుతో ఏం పని? బ్రతకడానికి డబ్బు అవసరం, సుఖమయ జీవనానికీ డబ్బు చాలా అవసరం. ఆపై ఆ డబ్బు అవసరం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళి బట్టి వుంటుంది. 

మనిషి జీవనానికి అనేక వృత్తులు. అన్ని వృత్తులు ఒకేలా వుండవు. కొన్ని వృత్తులు రెండువైపులా పదునున్న కత్తిలా ప్రత్యేకమైనవి.  

ఇందుకు ఒక ఉదాహరణ - వైద్యవృత్తి. ఈ వృత్తిలో ఎంతగానో సంపాదించే అవకాశం వున్నా.. అసలా ఆలోచనే లేకుండా.. రోగుల సేవ కోసం మాత్రమే పరితపించిన వైద్యులు నాకు తెలుసు. అలాగే, సంపాదనే ధ్యేయంగా రోగుల రక్తం పీల్చి బలిసిన వైద్యులూ నాకు తెలుసు.

ఇంకో ఉదాహణ - పత్రికా రంగం. ఈ రంగంలో - కనీస విలువలు లేనివారి నుండి, ఎంతో నిబద్దత కలిగినవారిదాకా అనేకరకాలైనవారు వుంటారు. పత్రికా విలేకరులు భాధ్యతా రాహిత్యంగా పన్జేస్తారని ఒకప్పుడు అనుకునేవాణ్ని. పతంజలి 'పెంపుడు జంతువులు' నవల చదివాకా - నా అభిప్రాయం మార్చుకున్నాను.

దేవాలయాలు పవిత్రమైనవే - అందులో పన్జేసే ఉద్యోగులు పవిత్రులు కానక్కర్లేదు. ధర్మాసుపత్రులు పేదలసేవ కోసమే - ఆ ఆస్పత్రి వైద్యులు సేవాతత్పరులు కానక్కర్లేదు. పత్రికా రంగం భాధ్యతాయుతమైనదే - ఆ పత్రికల్ని నడిపే యాజమాన్యాలు భాధ్యాతాయుతులు కానక్కర్లేదు.  

కావున - కొన్నివృత్తులు ఒకవైపు నుండి బాధ్యతాయుతమైనవిగానూ.. ఇంకోవైపు నుండి దుర్మార్గమైనవిగానూ నేను భావిస్తున్నాను. అనగా - ఇవి విఠలాచార్య సినిమాలో కత్తి వంటివి. ఆ కత్తిని హీరో ఎన్టీఆర్ సద్వినియోగం చేస్తే, విలన్ రాజనాల దుర్వినియోగం చేస్తాడు.

'ది హిందూ' పత్రిక రూరల్ రిపోర్టర్‌గా పన్జేసిన పాలగుమ్మి సాయినాథ్ తన వృత్తికి వన్నె తెచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన రైతు సమస్యల గూర్చి అనేక వ్యాసాలు ప్రచురించాడు. ఆ వ్యాసాలు చదివిన నేను యెన్నో కొత్తవిషయాలు తెలుసుకున్నాను. రైతుల జీవనం గూర్చి ఏమాత్రం అవగాహన లేని నేను - రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో అర్ధం చేసుకున్నానంటే - అందుక్కారణం పి.సాయినాథ్ రచనలే.

పి.సాయినాథ్ తెలుగువాడు, మనిషన్నాక ఏదోక భాషలో పుట్టక తప్పదు. అంచేత ఫలానా వ్యక్తి 'తెలుగు తేజం' అంటూ తెలుగు వార్తాపత్రికల వికారభాష నేను రాయను. ఈ దేశంలో ఆకలికి, దరిద్రానికి మూలాల్ని శోధించే వ్యక్తి - తమిళ తేజమైనా, కొంకిణీ తేజమైనా మనకొచ్చిన ఇబ్బంది లేదు. 

పత్రికా రంగంలో పి.సాయినాథ్ చేసిన కృషి చాలా విలువైనది. ఈనాడు మనక్కనిపించే మనిషి మనిషి కాదు, వార్త వార్త కాదు. వార్తలు వినోద స్థాయికి దిగజారుతున్న సరికొత్త యుగంలో మనమున్నాం. అంచేత (ఇంతకుముందుకన్నా) నిజాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా, నిబద్దతతో రాయగలిగే మరింతమంది సాయినాథ్‌ల అవసరం మనకుంది.  

సాయినాథ్ ఈమధ్య హిందూలోంచి బయటకొచ్చేశాడు. మంచిది! ఇప్పుడింక బంధాలేవీఁ వున్నట్లుగా లేవు - హాయిగా, ప్రశాంతంగా పన్జేసుకోవచ్చు. 

పాలగుమ్మి సాయినాథ్‌కి అభినందనలు. 

Monday 17 November 2014

చరిత్ర చెరశాలలో.. పటేల్ - నెహ్రూ


ఇప్పుడు సినిమా కబుర్ల కోసం అనేక మాధ్యమాలు వున్నాయి. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. అయితే మా సినిమా కబుర్లకి మాత్రం తక్కువేమీ లేదు.

'మా ఏయన్నార్ చేసిన దేవదాసు పాత్రని మీ ఎన్టీవోణ్ని చేసి చూపించమను. సినిమా ఒక్కరోజు కూడా ఆడదు.' అని ఒకడు సవాల్ చేస్తే -

'మా ఎన్టీఆర్ చేసిన బందిపోటు మీ నాగ్గాణ్ని చెయ్యమను. జనాలు తెర చించేస్తారు.' అని వేరొకడు వెక్కిరించేవాడు.

సరదాగా మొదలైన కబుర్లు ఒక్కోసారి తన్నులాటకిక్కూడా దారి తీసేవి. ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యర్ధులైనా.. ఇద్దరూ సినిమా నటులే. ఆ విషయం తెలీంది మాకే!

ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఈ.వి.రామస్వామి (పెరియార్) రాసిన రామాయణం కొంత చదివాను. 'కొంత' అని ఎందుకంటున్నానంటే మొత్తం చదవడం నావల్ల కాలేదు కాబట్టి. పెరియార్ నాస్తికుడు. ఆనాటి సమాజంలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సాంస్కృతిక నాయకుడు. ఆయన ఉద్యమానికి ఏం చెప్పాలి? 'ఆధిపత్య శక్తులు తమ పెత్తనం సాగించుకోడం కోసం సృష్టించబడ్డ ఒక హిందూ మైథాలజి రామాయణం. దాన్ని చదవకండి, చెత్తబుట్టలో పడెయ్యండి!' అని చెప్పాలి. కానీ ఆయనలా చెప్పలేదు.

మనం ఏవైతే రాముడి లక్షణాలు అనుకుంటామో, అవి తీసుకెళ్ళి రావణుడికి ఆపాదించాడు. సీత లక్షణాలు శూర్పణక, మండోదరిలకి ఆపాదించాడు. అంటే పాజిటివ్ నెగెటివ్‌గానూ, నెగెటివ్ పాజిటివ్‌గానూ రాశాడు. ఆయాన్రాసింది చదువుతుంటే - విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ రాజనాలతోనూ, రాజశ్రీ విజయలలితతోనూ పాత్రలు మార్చుకున్నట్లుగా అనిపించి నవ్వొచ్చింది. కాకపొతే పెరియార్‌కి రామాయణం పట్ల తీవ్రమైన కోపం వుందని మాత్రం అర్ధమవుతుంది. 

ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమానులు తిట్టుకున్నట్లుగానే - ఇప్పుడు నెహ్రూ, పటేల్ అభిమానులు గ్రూపులుగా విడిపొయ్యి వాదించుకుంటున్నారు. ఆనాడు పెరియార్ ఆపాదించినట్లుగా - పటేల్ అభిమానులు నెహ్రూని విలన్‌గా చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ అభిమానులకి రాజకీయ కారణాలు తప్ప మరే కారణం లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇప్పుడు బీజేపి అధికారంలోకి వచ్చింది కాబట్టి పటేల్ కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఐతే - హిందుత్వ శక్తులకి పటేల్ మీద అంత ప్రేమెందుకు? పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్.. అందరూ నెహ్రూ నాయకత్వంలోనే పన్జేశారు కదా? అందరూ కాంగ్రెస్ నాయకులేగా! అయితే అందరూ మంచివాళ్ళవాలి లేదా చెడ్డవాళ్ళవాలి. కానీ - వారికి నెహ్రూ ఒక్కడే చెడ్డవాడు ఎలా అవుతాడు?

భారద్దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది (అంతకుమించి మనకి వేరే గతి లేదు). ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల్లో.. ఇప్పటి పార్టీల్లోలానే - అనేక లుకలుకలున్నాయి, కుమ్ములాటలున్నాయి, ఎత్తుకు పైయ్యెత్తులున్నాయి. పన్లో పనిగా మన జాతిపితగారు కూడా తన వంతు పాత్రని పోషించారు - నెహ్రూని ప్రధానిగా చేశారు. ఇట్లాంటివన్నీ ఒక రాజకీయ పార్టీలో సహజమే. కాకపోతే చిన్నప్పుడు పాఠాల్లో వీళ్ళ గూర్చి గొప్పగా చదువుకున్నాం కాబట్టి - వీళ్ళంతా దేవతలన్నట్లుగా ఫిక్సైపొయ్యాం.

ఒక ప్రభుత్వం - దేశానికి మంచి చేసినా, చెడు చేసినా మంత్రివర్గం సమిష్టి బాధ్యత వుంటుంది. పటేల్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా నెహ్రూ ఆలోచన వుండాలి, అలాగే నెహ్రూ తప్పుల్లో పటేల్‌కీ వాటా వుంటుంది. ఒక వ్యక్తికి - ఒక పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా ఒక నిర్ణయం నచ్చనప్పుడు వ్యతిరేకించాలి, వ్యతిరేకించినా కుదరనప్పుడు బయటకి వచ్చెయ్యాలి. ఏ దేశంలోనైనా ఇదే డెమాక్రటిక్ ప్రిన్సిపుల్‌ అప్లై అవుతుంది. మంచంతా ఫలానా ఆయన గొప్పదనం, చెడంతా ఇంకోకాయన నిర్వాకం అని బుకాయిస్తే.. నమ్మేవాళ్ళు నమ్మవచ్చు గాక - నైతికంగా సరికాదు (పటేల్ చివరిదాకా కాంగ్రెస్‌లోనే వున్నాడని మర్చిపోరాదు).

ఒకప్పుడు పెరియార్‌ రాసినట్లుగా - ఇవ్వాళ సుగుణాలన్నీ పటేల్‌కే వున్నట్లు హిందూత్వ శక్తులు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నాస్తికుడైన పెరియార్‌కి రావణుడు హీరో అయినట్లుగా, చివరిదాకా కాంగ్రెస్‌వాదిగా మిగిలిన పటేల్ బీజేపీకి హీరో అయ్యాడు! తమ అన్న ధర్మరాజు జూదం ఆడ్డం ఇష్టం లేకపోయినా - నలుగురు తమ్ముళ్ళు నోర్మూసుకుని కూర్చున్నారంటే - వారిక్కూడా ఆ జూదంలో భాగం వుంటుంది. అందుకే ఇవ్వాళ ప్రజలకి మన్‌మోహన్‌సింగంటే అంతే కోపం. పటేల్, నెహ్రూ, అంబేడ్కర్‌లని వేరు చేసి చూపడం అంటే - ఒకే తానులో ముక్కల్ని విడివిడిగా అంచనా వెయ్యబూనడమే.

పాపం! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీవాళ్ళది విచిత్ర సంకటం. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కూడా తమ నాయకులే. ఇన్నాళ్ళూ ఉద్దేశ్యపూర్వకంగా పటేల్‌ని పక్కన పెట్టారు. కానీ - నెహ్రూవియన్ విజన్‌ని అవసరానికి మించి పొగుడ్తుంటారు. అందుకు వారికున్న రాజకీయ ప్రయోజనాలే కారణం. వాళ్ళకి నెహ్రూ లెగసీ పూర్తిగా తమ సొత్తేనని, తామే నెహ్రూ వారసులమనీ ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకి వున్న కోపం నెహ్రూ మీదక్కూడా వెళ్తుంది!

ఈ విధంగా - ప్రస్తుతం హిందుత్వ వాదులు పటేల్నీ, కాంగ్రెస్ వాదులు నెహ్రూని చెరొక పక్కా దొరకబుచ్చుకుని (ఆ నాయకులిద్దరూ ఎంత గింజుకున్నా) వదలట్లేదు. ఆ నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేప్పుడు, వచ్చిన తరవాత - రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వుండి, దేశగతినే మార్చేసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంతనేది తెలుసుకోవాలనుకోడం ఎలా వుంటుందంటే - 'వంకాయ కూరకి ఉప్పు ముఖ్యమా? కారం ముఖ్యమా?' లాగా!

సంఘ పరివారానికి స్వాతంత్రోద్యమంలో పెద్దగా పాత్ర లేదు, వున్నదంతా కాంగ్రెస్‌దే (అదెంత దరిద్రపు దయినప్పటికీ). ప్రస్తుతం ఆ కాంగ్రెస్ అవినీతి రొచ్చులో పీకల్దాకా కూరుకుపోయింది (ఇప్పుడల్లా బయటకొచ్చే అవకాశాలు కనపడట్లేదు). చరిత్ర లేని సంఘ పరివార్ సమస్య - ఐడెంటిటీ క్రైసిస్. అందుకే తెలివిగా పటేల్‌ని తమ పార్టీలో కలిపేసుకున్నారు. ఇదోరకంగా - మన తెలుగు సినిమా సమస్య. వంశచరిత్ర వున్నవాడికేమో నటన రాదు, నటన తెలిసినవాడికేమో వంశచరిత్ర లేదు!

ఈ దేశగతి మార్చిన - ఏ రాజకీయ ఆలోచననైనా చర్చకి, శల్యపరీక్షకి గురి చెయ్యాల్సిందే. అయితే - అది జరగాల్సింది చరిత్రకారుల శాస్త్రీయ విశ్లేషణల ద్వారా మాత్రమే తప్ప పార్టీ ఆఫీసుల్లో కాదు. ఎందుకంటే నెహ్రూ, పటేల్ వంటి నాయకులు చాలా భిన్నమైన ఆలోచన ధోరణి కలిగినవారు. ఎక్కడైనా, ఎప్పుడైనా - రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు అనేక పరిమితులకి లోనై వుంటాయి. వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచి ఫలితాల్నిస్తే, మరికొన్ని బెడిసికొడతాయి. కానీ - అప్పటి నాయకుల్లో వున్నదీ, ఇప్పటి నాయకుల్లో లేనిదీ ఒకటి వుంది - నిజాయితీ!

ముగింపు -

జైళ్ళు బ్రతికున్నవాళ్ళ కోసం వుపయోగిస్తారు. కానీ - పాపం! పటేల్, నెహ్రూలు చనిపోయినా కూడా రెండు రాజకీయ పార్టీలవారి బందిఖానాలో యిరుక్కుపొయ్యారు. వారి స్థితి జీవిత ఖైదీల కన్నా ఘోరం! వారికి చెరసాల నుండి త్వరలో విముక్తి కలగాలని ఆశిస్తున్నాను!

Friday 14 November 2014

సిగ్గుతో తల దించుకుందామా?


ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు చనిపొయ్యారు. ఈ చావులు ఆ కుటుంబాలకి తీరని నష్టం. ఈ సంఘటన దేశపౌరులుగా మనమందరం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. 

ఈ చావులకి కారణం తెలుసుకోడానికి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఆ కమిటీ ఏదో రిపోర్టునిస్తుంది. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకున్నామని కూడా చెబుతుంది. ఇదంతా ఓ తమాషా మాత్రమేనని అర్ధం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. 

అవడానికి మనది ఒకటే దేశమైనా - ఒకదేశంలోనే అనేక దేశాలున్నాయి. ఒకదేశంలో ప్రపంచస్థాయి వైద్యం జరిగితే, ఇంకోదేశంలో కుక్కల కన్నా హీనమైన వైద్యం జరుగుతుంది. ఒకదేశంలో చిటికెన వేలు దెబ్బకి పదిమంది వైద్యుల బృందం వైద్యం ఆపరేషన్ చేస్తే, ఇంకోదేశంలో సరైన ప్రసూతి సౌకర్యాలు లేక చనిపోతారు.

ఈ దేశంలో పేదలకి రక్షణ లేదు. పేదల పట్ల ధర్మకర్తలుగా వుండాల్సిన ప్రభుత్వాలు.. తమ కర్తవ్యాన్ని వదిలేసి అగ్రరాజ్యాలకీ, అంతర్జాతీయ వ్యాపారస్తులకీ మోకరిల్లుతున్నారు. అదేమంటే - ఏవో అర్ధం కాని లెక్కల్తో ఆర్ధిక పాఠాలు చెబుతారు. 

ఏ దేశంలోనైనా పేదవాడి బ్రతుకు హీనమే. దరిద్రులంటే దోమలకి లోకువ, రోగాలకి లోకువ, బొచ్చుకుక్కలకి లోకువ. ఇంతమందికి లోకువైన ఈ ప్రత్యేకజాతి ఐదేళ్ళకోసారి ఓట్లేయించుకోటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదని ప్రభుత్వం వారిక్కూడా లోకువే. 

అందుకే - పేదవాళ్ళు ఆకలికి అలమటించి చస్తారు, చలికి నీలుక్కుపొయ్యి చస్తారు, ఎండకి ఎండిపొయ్యి చస్తారు, వరదలకి కొట్టుకుపొయ్యి చస్తారు. ఇన్నిరకాలుగా చచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని కూడా చస్తున్నారు. ఇకనుండి వాళ్ళు చచ్చేందుకు మరో కొత్తకారణం!

విచారణలో అనేక విషయాలు ప్రస్తావనకి రావొచ్చు. సరైన ప్రీ ఆప్ చెకప్స్ జరగలేదనీ, లేపరోస్కోపీ పరికరాన్ని సరీగ్గా స్టెరిలైజ్ చెయ్యలేదనీ, గేస్ కలుషితమైందనీ, డాక్టర్ నిర్లక్ష్యమనీ, పోస్ట్ ఆప్ కేర్ సరీగ్గా ఇవ్వలేదనీ, మందులు మంచివి కావనీ.. ఇలా. సరే! ఈ లోపాల్నన్నింటినీ సరిచేసుకుని - భవిష్యత్తులో పొరపాటున కూడా మళ్ళీ ఇలా జరక్కుండా చేసుకునే కట్టుదిట్టమైన వ్యవస్థ మనకుందా? లేదని నేననుకుంటున్నాను.  

వీధికుక్కల సంఖ్య పెరక్కుండా వాటికి స్టెరిలైజ్ చెయ్యాలని కొన్ని స్వచ్చంద సంస్థలు చెబుతుంటాయి. ఈ గోలంతా లేకుండా - చాలా మునిసిపాలిటీల్లో వీధికుక్కల్ని ఊరి బయటకి పట్టుకెళ్ళి మూకుమ్మడిగా చంపేస్తారు. ఒకవేళ ప్రభుత్వాలకి కూడా జనాభా నియంత్రణకి కుక్కల మోడెల్లో ఏదైనా హిడెన్ ఎజెండా వుందేమో తెలీదు. వున్నా అవి మనకి చెప్పవు.

ఎందుకంటే - బహుళజాతి మందుల కంపెనీలు పేదవారిపై తమ మందుల్ని ప్రయోగించి పరిశీలించుకునే సౌలభ్యాన్ని కల్పించిన దేశం మనది. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఇలా జరుగుతుందని బయటపడ్డప్పుడు మాత్రం ఎంతోకొంత నష్టపరిహారం ప్రకటించి, ఒక విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య. 

చివరిగా -

లేపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుని హీనంగా, దారుణంగా చనిపోయిన మహిళలకి - సిగ్గుతో తల దించుకుని - నివాళులర్పిస్తున్నాను. 

Thursday 13 November 2014

ఖడ్గం! 'ఎందుకు?'


'భారద్దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజలే పాలకులు. అంచేత ప్రజలే ఓట్లేసుకుని పాలకుల్ని ఎన్నుకుంటారు.' అని చిన్నప్పుడు చదువుకున్నాను.

ఈ వాక్యాలు చదువుకోడానికి రొమేంటిగ్గా వుంటాయి గానీ - వాస్తవానికి సాధారణ ప్రజలు వేరు, పాలకులు వేరు. పాలక వర్గాలు, పాలిత వర్గాలు - ఆవకాయలో ఆవగింజంత సంబంధం కూడా లేకుండా ఎప్పుడో విడిపొయ్యారు.

అయితే ఈ పాలకులు తాము కూడా ప్రజల్లోనే భాగమని కోడై కూస్తుంటారు. కొందరు అమాయకులు, ఆశావహులు నమ్ముతూనే వుంటారు!

అయితే పులి మనముందు పులిహోర, దద్దోజనం మాత్రమే తింటూ తను శాకహారిని మాత్రమేనని మనని ఎంత నమ్మించినా - దానికి ఏ జింకో, కుందేలో కనిపించినప్పుడు నోరూరుతుంది, లొట్టలేస్తుంది. అలా అనిపించడం పులి తప్పుకాదు - అదా జాతి లక్షణం.

అదేవిధంగా పాలకులు తాము ప్రజల్లో భాగమేనని ఎంతగానో చెబుతుంటారు కానీ - కాదని కూడా వాళ్ళే సంకేతాలు ఇస్తుంటారు!

ఆ సంకేతమేమి? ఒక ఉదాహరణనిమ్ము!

(ఇది ఐదు మార్కుల ప్రశ్న. అంచేత సంగ్రహముగా వివరింపుము.)

ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అనేక ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ బోల్డంత హడావుడి చేస్తాయి. ఆ సందర్భంలో ముఖ్యనాయకులు తలపాగా పెట్టుకుని, ఒక పొడవాటి ఖడ్గాన్ని ప్రజలకి చూపిస్తారు.. కార్యకర్తలు హర్షధ్వనాలు చేస్తారు.

ఏ నాగలో, కొడవలో చూపిస్తే 'రైతుబంధు', 'రైతుమిత్ర' అని మార్కులు కొట్టెయ్యొచ్చు గానీ - ఇట్లా ఖడ్గాల్ని చూపించడం ఎందుకు?

త్రిపురనేని గోపిచంద్ "ఎందుకు?" అన్న ప్రశ్న ఎంతో గొప్పదనీ, అందులోంచే అనంతమైన జ్ఞానం పుడుతుందనీ సెలవిచ్చాడు. అంచేత ఇప్పుడు నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను.

ఈ ఖడ్గప్రదర్శన "ఎందుకు?"

నాకు తోచిన కొన్ని కారణాలు :

A - పాజిటివ్ (బ్లడ్ గ్రూప్ కాదు) కారణాలు -

1 - సాంప్రదాయ చేతివృత్తుల్ని ప్రోత్సాహించడం మన కర్తవ్యం. అంచేత - మీరు కత్తులు విరివిగా వాడండి. కత్తులు తయారుచేసే కమ్మరి వృత్తిని బ్రతికించండి.

2 - భారద్దేశం స్వతంత్రం రాక ముందు రాచరిక దేశం. అంచేత కొన్ని పార్టీలవాళ్ళు వాళ్ళ ప్రాంతం రాజుల్ని ప్రమోట్ చేసుకుంటారు. ఇందుకో ఉదాహరణ శివసేన! చిన్నప్పుడు శివసేన అంటే శివుడి గుళ్ళో సైనికుల్లా పన్జేసే వాలంటీర్లేమోనని ఆనుకునేవాణ్ని! అదో రాజకీయ పార్టీ పేరని తెలిసినప్పుడు ఆశ్చర్యపొయ్యా! శివసేన వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంటే తరగని ప్రేమట! మరాఠాల చరిత్ర నాకు తెలీదు. అంచేత - శివాజీ వారసులు ఖడ్గం ఎందుకు చూపిస్తారో తెలీదు. అయితే - ఆ ఖడ్గాన్ని ఎప్పుడోకప్పుడు మరాఠాలు కానివారిపై వాడతారేమోననే భయం మాత్రం నాకుంది.

3 - అవినీతికి పాల్పడేవారిని నరికేస్తా! (ఇది కేవలం మార్కుల కోసం రాసిన పాయింటు - పూర్తిగా అబద్దం.)

B - నెగెటివ్ కారణాలు -

1 - మీరంతా మా పార్టీకే ఓట్లెయ్యలి. వెయ్యకపోతే - 'అమ్మతోడు! అడ్డంగా నరికేస్తాం!'

2 - ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి. సాధారణ పౌరుల్ని ఈ కత్తితోనే నరుక్కుని కూరొండుకు తినేస్తాం.

3 - ఖడ్గం మన జాతీయ చిహ్నం. అంచేత - మీరీ ఖడ్గాలతో మర్డర్లు చేసినట్లైతే కేసులుండవని హామీ ఇస్తున్నాం (ఈ పాయింటు సర్దాగా రాసిందే గానీ - అసలు పాయింటే కాదు).

(ఇంతటితో నా "ఎందుకు?" అనే ప్రశ్నకి సమాధానం సమాప్తం.)

సరే! ఖడ్గం, నాగలి, కుక్క, పిల్లి.. ఏదైతేనేం? ఏం చూపించినా, ఏం చెప్పినా - రాజకీయ పార్టీలు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక వాటి పని అవి (క్రమశిక్షణ కలిగిన సైనికుల వలె) చేసుకుపోతాయి. ఒక్కో పార్టీకి వారి (తెర వెనుక) లాబీలు 24 x 7 పన్జేస్తేగానీ అధికారం రాదు. ఆ లాబీలని లిక్కర్ లాబీ, ఎడ్యుకేషనల్ లాబీ, మీడియా లాబీ.. అంటూ క్లాసిఫై చేసుకోవచ్చు గానీ.. అదీ పోస్టుతో సంబంధం లేని అంశం కాబట్టి ఇంతటితో వదిలేస్తాను.

అయితే - ఒక్కటి మాత్రం నిజం. అధికార ఫలాల్ని పంచుకోవడంలో ఈ లాబీలు 24 x 7 పాటు న్యాయమైన వాటాలు వేసుకుంటూ పంచుకుంటారు. ఈ విషయంలో వీరికి ఆలీబాబా నలభై దొంగల్లో - నలభై దొంగలకున్నంత ఐకమత్యం వుంటుంది.

మరప్పుడు మన్లాంటివాళ్ళేం చెయ్యాలి? మీ సంగతేమో నాకు తెలీదు కానీ - నేను మాత్రం ఏం చెయ్యాలో తెలీక - ఇలా బ్లాగుల్రాస్తుంటాను! జైహింద్!