Saturday 25 May 2013

దిక్కులు పిక్కటిల్లిన గానం


తమిళ సినీ నేపధ్య గాయకుడు T.M.సౌందరరాజన్ ఇవ్వాళ మరణించాడు. ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ చూశాను.

నేను సినిమాలు చూసే రోజుల్లో అరవ సినిమాలు (ఇప్పుడంత కాకపోయినా) తెలుగు డబ్బింగులుగా వచ్చేవి. ఎక్కువ సినిమాల్లో శివాజీ గణేశన్, M.G.రామచంద్రన్ లు హీరోలు. వారి నటన అత్యంత తీవ్రంగా ఉండేది. 'కోటీశ్వరుడు' అని ఓ శివాజీ గణేశన్ డబ్బింగ్ సినిమా గుర్తుంది. అందు శివాజీ నటనా బీభత్స విశ్వరూపం గాంచి గజగజలాడితిని.

సినిమాకి హీరో ఎవరైనా సౌందరరాజన్ పాట మాత్రం ఉండేది. నాకు సౌందరరాజన్ పాడుతున్నట్లుగా అనిపించేది కాదు. దిక్కులు పిక్కటిల్లేట్లు పెడబొబ్బలు పెడుతున్నట్లుగా ఉండేది. పొత్తికడుపులోంచి నరాలు బిగబెట్టి.. కడుపులోంచి పేగుల్ని మెలితిప్పుతూ.. ఒంట్లోని రక్తాన్నంతా గొంతులోకి తెచ్చుకుని.. గుడ్లు పగిలేలా, గుండెలు అవిసేలా పాడటం సౌందరరాజన్ స్పెషాలిటీ. వామ్మో! ఏమి హై పిచ్ స్టోన్! ఆయన పాటే ఓ సుడిగాలి, సునామి, భూకంపం, ప్రళయం.

తెలుగులో జయభేరి సినిమాలో చివరిపాట మన సౌందరరాజన్ పాడాడు. వదినగారి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అర్ధిస్తూ (గద్దిస్తూ, గర్జిస్తూ) కాశీనాథశాస్త్రి సౌందరరాజన్ గొంతుతో పాడతాడు. అన్ని పాటలూ పాడిన ఘంటసాల ఈ పాట ఎందుకు పాడలేదు?

అప్పుడు నాకర్ధం కాలేదుగానీ.. ఇప్పుడర్ధమైంది. ఇది పి.పుల్లయ్య దర్శకత్వ ప్రతిభే. ఘంటసాల గొంతైనట్లైతే  మబ్బుల్లోంఛి దూసుకెళ్ళి దేవుడి దాకా చేరేది కాదు. చేరినా ఘంటసాలకి దేవుడు భయపడే వాడు కాదు. సౌందరరాజనా మజాకా! దెబ్బకి దేవుడు దడుచుకుని శాంతకుమారికి ప్రాణం ప్రసాదిస్తాడు. మీ కోసం ఆ పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి. 



(photo courtesy : Google)

క్విజ్


"మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎవరు?"

"సోనియా గాంధీ తండ్రి."

"ధోని భార్య పేరేమిటి?"

"సాక్షి."

"గుడ్. శ్రీరాముని భార్య పేరు?"

"నయనతార."

"2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచిలో ధోని ఎంత స్కోర్ చేశాడు?"

"ముప్పై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు. పాంటింగ్ రనౌట్ చేశాడు."

"సూపర్బ్. అంబేద్కర్ ఎవరు?"

"కలకత్తా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్."

"అమ్మ తోడు. అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్.. "

"జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సినిమా పేరు ఆది."

"వెరీ గుడ్. 'కన్యాశుల్కం' రాసిందెవరు?"

"సిరివెన్నెల సీతారామశాస్త్రి."

"పోకిరి సినిమాలో మహేశ్ బాబు ఎందర్ని చంపాడు?"

"ముప్పై మందిని కాల్చి చంపాడు. పదిమందిని గాల్లోకి ఎగరేసి చంపాడు. ప్రకాశ్ రాజ్ ని మాత్రం పీక్కోసి చంపాడు."

"ఎక్సెలెంట్. పొట్టి శ్రీరాములు ఎవరు?"

"మా తాతయ్య ఫ్రెండ్."

"కిలో వంకాయలు పది రూపాయిలైతే రెండు కిలోలు ఎంత?"

"వంకాయలంటే బ్రింజాలేనా?"

"అవును."

"ఈ లెక్క మాకు చెప్పలేదు. పోర్షన్లో లేదు."

(picture courtesy : Google)

Friday 24 May 2013

దేశమేరీతిన బాగుపడేను!


వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పట్నుండి కలిసే పెరిగారు. కలిసే ఏడో క్లాసు తప్పారు. వారి ఇళ్లూ పక్కపక్కనే.

వీరు రోజూ టీవీలో వార్తలు కలిసే చూస్తారు. ఆపై కలిసే సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు.

"మన దేశపోళ్ళు ఎంత మంచోళ్ళు! ఆ పాకిస్తాన్ సాలాగాళ్ళు మన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నార్రా!"

"అవునవును. మనం ఆ పాకిస్తాన్ని ఆక్రమించేస్తే పీడా ఇరగడవుద్ది."

"దేశంలో మతకలహాలు పెచ్చురేగిపొతన్నాయి."

"అవునవును. సాయిబుల్నందర్నీ పాకిస్తాన్లోకి తరిమిస్తే ఒక పనైపోద్ది."

"దేశంలో మా భాష గొప్పదంటే మా భాష గొప్పదని కొట్టుకు సస్తున్నారు."

"అవునవును. అందుకే భారద్దేశమంతా తెలుగుభాషే మాట్లాడాలని రూలు పెట్టాల."

"ఎదవ నాయాళ్ళు! ప్రాంతం, అసమానత అంటూ తెగ నీలుగుతున్నారు."

"అవునవును. మనూర్ని రాజధాని నగరంగా సేస్తేగానీ సమస్య తీరేట్టు లేదు."

"ఈ కులాల సమస్య కూడా రోజురోజుకీ ఎక్కువైపోతంది. దేశం ఎనక్కిపోతంది."

"అవునవును. తక్కువ కులం నా కొడుకులకి కొమ్ములొచ్చాయి. ఆళ్ళందరికీ ఓటు లేకండా సేస్తేగానీ దారికిరారు."

"పొలం తగాదాలు కూడా ఎక్కువైపోతన్నాయి. లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది."

"అవునవును. ఈ ఊరంతా మన పొలమే ఉండాల. అప్పుడే లా ఉంటది, ఆర్డరూ ఉంటది."

"దేశవంతా రాజకీయంగా యిడిపోయింది. ఇది దేశానికి మంచిది కాదు."

"అవునవును. అందుకే దేశవంతా మనోడి పార్టీయే ఉండాల."

"రాజకీయంగా నాయకుల మధ్య కీచులాట దేశానికి మంచిది కాదురా."

"అవునవును. అందుకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా మనోళ్ళే ఉండాల."

"భలే చెప్పావురా! నాదగ్గర సిగరెట్లైపొయ్యాయి. నీదగ్గిరేవైనా ఉన్నయ్యా?"

"నా దగ్గిరా అయిపొయ్యాయిరా. పద! అచ్చయ్య కొట్టు కాడికెళ్లి కొనుక్కొచ్చుకుందాం."

(photo courtesy : Google)

Monday 20 May 2013

సూర్యకాంతం సృష్టించిన సమస్య


కాలం నిరంతరంగా ముందుకు సాగిపోతుంది. సమాజం కాలానుగుణంగా మారుతుంటుంది. మార్పు అనేది సమాజ ధర్మం, సహజ గుణం. అదేవిధంగా మారుతున్న కాలాన్ననుసరించి, సమాజంలో మనం వహించాల్సిన పాత్ర కూడా మారుతూ ఉంటుంది. 

సమాజ చలన సూత్రాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. అందుక్కారణం ఈ సమాజంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రదేశం అంటూ అనేక వేరియబుల్స్ ఉండటం. అందువల్ల సమాజాన్ని ఒకే యూనిట్‌గా చేసి ఆలోచించడం సరైన విధానం కాదు. 

ఉదాహరణకి - కొన్ని కుటుంబాల్లో మద్యం పేరేత్తితేనే తప్పు. ఇంకొన్ని కుటుంబాల్లో మద్యం సేవించడం స్టేటస్ సింబల్. మరికొన్ని కుటుంబాల్లో మద్యం తాగడం కాఫీ తాగినంత చిన్న విషయం. అదే విధంగా ఆహారపు అలవాట్లు కూడా. ఇవన్నీ చిన్న విషయాలు. వీటిల్లోనే ఇంతలా తేడా వుంటే ఇక జీవన విలువల్లో ఇంకెంత వైరుధ్యాలు ఉండాలి!?

మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లాడి కోసం (ఈనాటికీ) తపించిపోతారు. ఆడపిల్లకి లేని అనేక ప్రివిలేజెస్ అనుభవిస్తూ మగవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం సంపాదించి ఒక 'ఇంటివాడు' అవుతాడు. ఇక అప్పట్నుండి అత్తాకోడళ్ళ సంవాదం మొదలౌతుంది. ఇందుకు ప్రధాన కారణం తరాల అంతరం.

అత్త తన కొడుకు కోడలితో ప్రవర్తించే తీరుని పెళ్లైన కొత్తలో తన భర్త తనతో ప్రవర్తించిన తీరుతో బేరీజు వేసుకుని ఆలోచిస్తుంది. తన భర్త కొడుకులా రొమేంటిక్ గా ఉండేవాడు కాదు. సినిమాలు, షికార్లు కాదు గదా - కనీసం సరదాగా కూడా మాట్లాడింది లేదు. ఒకప్పటి తన భర్త ప్రవర్తనతో పోల్చుకుంటే ఇవ్వాల్టి తన కొడుకు ప్రవర్తన చికాగ్గా అనిపిస్తుంది. ఈ విషయం మీద కుటుంబరావు చాలా కథలు రాశాడు. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే అతని రెఫరెన్స్ పాయింట్ - "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు, దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి, పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది. ఈ పాయింటు మీద ముళ్ళపూడి చాలా జోకులు రాశాడు.

ఒక పట్టణంలో ఓ సీనియర్ డాక్టర్ వుంటాడు. ఆయన ఎప్పట్నుండో జనరల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. క్రమేణా ఊరితో పాటు డాక్టర్లూ పెరిగారు. అదే ఊరికి ఓ కుర్ర స్పెషలిస్టు డాక్టర్ వస్తాడు. కొంతకాలానికి కుర్ర డాక్టర్ పేరుప్రఖ్యాతుల్లో సీనియర్ డాక్టర్ని మించిపోతాడు. సీనియర్ డాక్టర్ ఒకప్పటి తన ప్రాముఖ్యత తగ్గడానికి కారకుడుగా కుర్ర డాక్టర్ పట్ల విముఖత పెంచుకుంటాడు. వాస్తవానికి ఇందులో కుర్ర డాక్టర్ ప్రమేయం ఏమీ ఉండదు. సరీగ్గా అతాకోడళ్ళదీ ఇదే సమస్య.

ఇప్పుడు సూర్యకాంతం గూర్చి రెండు ముక్కలు. సూర్యకాంతం మంచినటి. 1950 లలో కుటుంబ కథలతో తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు ధరించిన సూర్యకాంతం తెలుగు ప్రజల్ని మెప్పించింది. తద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరవాత గయ్యాళి అత్తగా ఆవిడకి స్టార్డమ్ వచ్చిపడింది.

1960 ల కల్లా సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్ర ఒక బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. సినిమా రచయితలు సులభ సాధనాలని వదులుకోరు గదా! కథా వంటకంలో కూరలో కారం వేసినట్లు.. సూర్యకాంతం పాత్రకి ప్రాధాన్యతనిస్తూ కథలు వండారు. ఈ చర్య సినిమా విజయాలకి బాగానే తోడ్పడింది గానీ, తెలుగు (మధ్యతరగతి) సమాజానికి మాత్రం నష్టం చేకూర్చింది.

మీరు 1960 సినిమాలు చూడండి. ఆ సినిమాల్లో మైనస్ సూర్యకాంతం పెద్దగా కథ ఉండదు. సావిత్రిని ముప్పతిప్పలు పెట్టటానికి దర్శకులు సూర్యకాంతాన్ని వాడుకున్నారు. ఆ రకంగా దుష్టత్వానికి ప్రతీకగా మారిన సూర్యకాంతం పాత్రలు మనకి అత్తల పట్ల భయం, ఏవగింపు కలిగించేట్లుగా చేశాయి. అలా ఒక మంచినటి ప్రతిభావంతంగా పోషించిన పాత్రల వల్ల తెలుగు సమాజంలో సోషల్ డైనిమిక్స్ ప్రభావితం అయ్యాయి.

సినిమా ఒక వినోద సాధనం. సగటు తెలుగు ప్రేక్షకుని చదువు హైస్కూల్ స్థాయి. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి కార్టూన్ సిన్మాలా సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు. 

శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.

అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.

అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).

అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.

నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం తెలుగువారి కుటుంబ జీవితాల్లో అనుమానాలు రేకెత్తించి సమస్యలు సృష్టించిందని నా అభిప్రాయం.

(photo courtesy :Google)

సూర్యకాంతం సృష్టించిన సమస్య


కాలం నిరంతరంగా ముందుకు సాగిపోతుంది. సమాజం కాలానుగుణంగా మారుతుంటుంది. మార్పు అనేది సమాజ ధర్మం, సహజ గుణం. అదేవిధంగా మారుతున్న కాలాన్ననుసరించి, సమాజంలో మనం వహించాల్సిన పాత్ర కూడా మారుతూ ఉంటుంది. 

సమాజ చలన సూత్రాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. అందుక్కారణం ఈ సమాజంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రదేశం అంటూ అనేక వేరియబుల్స్ ఉండటం. అందువల్ల సమాజాన్ని ఒకే యూనిట్‌గా చేసి ఆలోచించడం సరైన విధానం కాదు. 

ఉదాహరణకి - కొన్ని కుటుంబాల్లో మద్యం పేరేత్తితేనే తప్పు. ఇంకొన్ని కుటుంబాల్లో మద్యం సేవించడం స్టేటస్ సింబల్. మరికొన్ని కుటుంబాల్లో మద్యం తాగడం కాఫీ తాగినంత చిన్న విషయం. అదే విధంగా ఆహారపు అలవాట్లు కూడా. ఇవన్నీ చిన్న విషయాలు. వీటిల్లోనే ఇంతలా తేడా వుంటే ఇక జీవన విలువల్లో ఇంకెంత వైరుధ్యాలు ఉండాలి!?

మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లాడి కోసం (ఈనాటికీ) తపించిపోతారు. ఆడపిల్లకి లేని అనేక ప్రివిలేజెస్ అనుభవిస్తూ మగవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం సంపాదించి ఒక 'ఇంటివాడు' అవుతాడు. ఇక అప్పట్నుండి అత్తాకోడళ్ళ సంవాదం మొదలౌతుంది. ఇందుకు ప్రధాన కారణం తరాల అంతరం.

అత్త తన కొడుకు కోడలితో ప్రవర్తించే తీరుని పెళ్లైన కొత్తలో తన భర్త తనతో ప్రవర్తించిన తీరుతో బేరీజు వేసుకుని ఆలోచిస్తుంది. తన భర్త కొడుకులా రొమేంటిక్ గా ఉండేవాడు కాదు. సినిమాలు, షికార్లు కాదు గదా - కనీసం సరదాగా కూడా మాట్లాడింది లేదు. ఒకప్పటి తన భర్త ప్రవర్తనతో పోల్చుకుంటే ఇవ్వాల్టి తన కొడుకు ప్రవర్తన చికాగ్గా అనిపిస్తుంది. ఈ విషయం మీద కుటుంబరావు చాలా కథలు రాశాడు. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే అతని రెఫరెన్స్ పాయింట్ - "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు, దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి, పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది. ఈ పాయింటు మీద ముళ్ళపూడి చాలా జోకులు రాశాడు.

ఒక పట్టణంలో ఓ సీనియర్ డాక్టర్ వుంటాడు. ఆయన ఎప్పట్నుండో జనరల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. క్రమేణా ఊరితో పాటు డాక్టర్లూ పెరిగారు. అదే ఊరికి ఓ కుర్ర స్పెషలిస్టు డాక్టర్ వస్తాడు. కొంతకాలానికి కుర్ర డాక్టర్ పేరుప్రఖ్యాతుల్లో సీనియర్ డాక్టర్ని మించిపోతాడు. సీనియర్ డాక్టర్ ఒకప్పటి తన ప్రాముఖ్యత తగ్గడానికి కారకుడుగా కుర్ర డాక్టర్ పట్ల విముఖత పెంచుకుంటాడు. వాస్తవానికి ఇందులో కుర్ర డాక్టర్ ప్రమేయం ఏమీ ఉండదు. సరీగ్గా అతాకోడళ్ళదీ ఇదే సమస్య.

ఇప్పుడు సూర్యకాంతం గూర్చి రెండు ముక్కలు. సూర్యకాంతం మంచినటి. 1950 లలో కుటుంబ కథలతో తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు ధరించిన సూర్యకాంతం తెలుగు ప్రజల్ని మెప్పించింది. తద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరవాత గయ్యాళి అత్తగా ఆవిడకి స్టార్డమ్ వచ్చిపడింది.

1960 ల కల్లా సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్ర ఒక బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. సినిమా రచయితలు సులభ సాధనాలని వదులుకోరు గదా! కథా వంటకంలో కూరలో కారం వేసినట్లు.. సూర్యకాంతం పాత్రకి ప్రాధాన్యతనిస్తూ కథలు వండారు. ఈ చర్య సినిమా విజయాలకి బాగానే తోడ్పడింది గానీ, తెలుగు (మధ్యతరగతి) సమాజానికి మాత్రం నష్టం చేకూర్చింది.

మీరు 1960 సినిమాలు చూడండి. ఆ సినిమాల్లో మైనస్ సూర్యకాంతం పెద్దగా కథ ఉండదు. సావిత్రిని ముప్పతిప్పలు పెట్టటానికి దర్శకులు సూర్యకాంతాన్ని వాడుకున్నారు. ఆ రకంగా దుష్టత్వానికి ప్రతీకగా మారిన సూర్యకాంతం పాత్రలు మనకి అత్తల పట్ల భయం, ఏవగింపు కలిగించేట్లుగా చేశాయి. అలా ఒక మంచినటి ప్రతిభావంతంగా పోషించిన పాత్రల వల్ల తెలుగు సమాజంలో సోషల్ డైనిమిక్స్ ప్రభావితం అయ్యాయి.

సినిమా ఒక వినోద సాధనం. సగటు తెలుగు ప్రేక్షకుని చదువు హైస్కూల్ స్థాయి. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి కార్టూన్ సిన్మాలా సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు. 

శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.

అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.

అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).

అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.

నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం తెలుగువారి కుటుంబ జీవితాల్లో అనుమానాలు రేకెత్తించి సమస్యలు సృష్టించిందని నా అభిప్రాయం.

(photo courtesy :Google)

Wednesday 15 May 2013

పిల్లల పాట్లు.. 'పింక్ ఫ్లాయిడ్' పాట


సమాజం అనగా వ్యక్తుల సమూహం. వ్యక్తుల అవసరాలు, మారుతున్న ఆలోచననా ధోరణుల ప్రభావంతో సమాజంలో మార్పుచేర్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుచేర్పుల వల్ల సమాజం ఏ దిశగా సాగుతుందనేది చూసేవాడి ద్రుష్టికోణాన్ని అనుసరించి ఉంటుంది.

నా చిన్నప్పుడు 'చదువు' అనగా జ్ఞానం. జ్ఞానం రెండు విధాలు. పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం. (అనుభవ జ్ఞానం లేకుండా కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం లేదు.) ఈ జ్ఞానమే వ్యక్తుల మెరుగైన ఆలోచనా సరళినికి మూలం. ఈ జ్ఞానమే సమాజ హితానికి పునాది. చివరగా.. ఈ జ్ఞానం భుక్తి కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు 'చదువు' అనగా పుస్తక జ్ఞానం మాత్రమే. ఈ చదువుతోనే మెరుగైన జీవితం, సుఖమయ జీవనం సాధ్యం. చదువు ఎంత ఎక్కువ చదివితే అంత గిట్టుబాటు. మంచి చదువు.. మంచి ఉద్యోగం.. మంచి జీతం.. మంచి పెళ్లి సంబంధం.. మంచి జీవితం. జీవితానికి ఇంతకన్నా అర్ధం లేదు.. పరమార్ధమూ లేదు. అందుకే చదువే సర్వస్వం. చదువే లోకం.

నీ పిల్లల్ని చదివించడం.. అందుకు తగిన ప్రణాళికల్ని రచించడంలోనే నీ ప్రతిభాపాటవాలు వెల్లడవుతాయి. నువ్వు బాగా చదువుకున్నావా? అందులో గొప్పేముంది! నీ పిల్లల్ని బాగా రాపాడించి గొప్ప చదువుల్లో ప్రవేశపెట్టలేకపోయ్యావ్. అంచేత నువ్వో వెధవ్వి. ఇంకా నీతో మాటలు కూడానా! తప్పుకో.

'అయ్యా! నా పిల్లలకి చదువబ్బలేదు. నా భార్య నన్ను రోజూ అసహ్యించుకుంటుంది. చుట్టపక్కాలు గేలి చేస్తున్నారు. నాకు బతకాలని లేదు. చావాలని ఉంది.' దానికేం భాగ్యం! తప్పకుండా చద్దువులే. కాకపొతే ఈ చావుక్కూడా అక్కడో పెద్ద క్యూ ఉంది. నువ్వెళ్ళి ఆ వరసలో నిలబడు.


మీ పిల్లల్ని రోజుకి ఇరవై గంటలు చదివిస్తాం. మిగిలిన నాలుగ్గంటలు కూడా చదువుకు వినియోగించుకోవాలనుకుంటే.. మేం పిలిపించే వ్యక్తిత్వవికాస నిపుణులు టిప్స్ చెప్పెదరు. మీ పిల్లాడిని మా స్కూలుకే పంపండి. మా దగ్గర MBBS సీటు గ్యారంటీ పథకము కూడా కలదు. మీ పిల్లవాని భవిష్యత్తు బంగారు బాటలో పెట్టండి.

సరే! ఈ విషయం పట్ల నా అభిప్రాయాల్ని స్పష్టంగా వివరిస్తూ "కోడి విలాపం! (బ్రాయిలర్ విద్యార్ధుల కథ కూడా.. !)" అని ఓ టపా రాశాను. ఓపికున్నవారు చదువుకోవచ్చు. ఇప్పుడీ టాపిక్ మీద కొత్తగా రాసేదేమీ లేదు.

'పాపం! పిల్లలు.' అని నాకనిపించినట్లే 'పింక్ ఫ్లాయిడ్' అనే ఓ బ్రిటీష్  రాక్ బ్యాండ్ క్కూడా మూడు దశాబ్దాల క్రితం అనిపించింది.

వాళ్ళు సంగీతకారులు కావున బోర్డింగ్ స్కూళ్ళని నిరసిస్తూ 1979 లో ఓ పాట రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో 'ఎనదర్ బ్రిక్ ఇన్ ద వాల్' (గోడలో మరొక ఇటుక' అని నా స్వచ్చమైన అనువాదం) పాట ఓ సెన్సేషన్.

గుంటూర్లో రేడియో BBC మ్యూజిక్ చానెల్ తుఫానులో మృత్యుఘోషవలె తెరలుతెరలుగా వచ్చేది. ట్రాన్సిస్టర్ని చెవికి ఆనించుకుని (చెవులు రిక్కించి వినడం అంటే ఇదేనా?).. కళ్ళు మూసుకుని దీక్షగా వినేవాణ్ని.

'పింక్ ఫ్లాయిడ్' సౌండ్ బాగుంటుంది. పాడే విధానం ఇంకా బాగుంటుంది. వీరి పాటల్లో 'సామాజిక స్పృహ' కూడా ఉంటుంది.

ఈ విడియో చూడండి.




విడియో అచ్చు ఇప్పటి మన కార్పోరేట్ విద్యాసంస్థలు అనబడే చదువుల దుకాణాల గూర్చి తీసినట్లుగా ఉంది కదూ! ప్రస్తుతం మన పిల్లల్ని ఈ దుష్టదుర్మార్గ కార్పోరేట్ బూచిగాళ్ళ నుండి కాపాడుకునే మార్గం లేదు.

అంచేత.. మనం 'ఎవరో రావాలి.. నీ హృదయం కదిలించాలి.' అంటూ ప్రేమనగర్లో వాణిశ్రీలా వీణ పాట పాడుకోవాలి.. లేదా వేళ్ళు నొప్పెట్టేలా కీ బోర్డు నొక్కుతూ టపా అయినా రాయాలి. అంతకు మించి చేసేదేం లేదు. నాకు వీణ తెలీదు. కాబట్టి రెండోది చేస్తున్నాను.

ఈ 'పింక్ ఫ్లాయిడ్' రికార్డ్ నా దగ్గర ఉండేది. నా స్నేహబృందంతో మైసూర్ కేఫ్ లో వేడివేడి ఇడ్లీసాంబార్ కడుపారా లాగించి.. నిద్ర ముంచుకొస్తుండగా.. అరమోడ్పు కన్నులతో ఈ పాట మళ్ళీమళ్ళీ వినేవాణ్ని.

సరే! ఎలాగూ ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారుగా. ఇంకొంచెం ఓపిక చేసుకుని.. 'పింక్  ఫ్లాయిడ్' లైవ్ పెర్ఫార్మెన్స్ విడియో కూడా తిలకించి ఆనందించండి.




(photos courtesy : Google)

Monday 13 May 2013

రావిశాస్త్రి కథ 'తలుపు గొళ్లెం'.. కొన్ని ఆలోచనలు


ఇది ఒక పైడిరాజు కథ. అప్పుడే పుట్టిన (ఒక గంట వయసులో) పైడ్రాజు మురిక్కాలవ పక్కన ఓ ముష్టి దంపతులకి దొరుకుతాడు. పైడ్రాజు రాకతో ముష్టి దంపతులకి 'రాజయోగం' పట్టింది. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడే ముష్టి. వీరి ముష్టి భోగానికి కన్నుకుట్టిన ఇంకో ముష్టి జంట నాలుగేళ్ల పైడ్రాజుని దొంగిలిస్తారు.

అయితే ఈ రెండో ముష్టి జంట ప్రధానవృత్తి దొంగతనం. పైడ్రాజు కొత్త తలిదండ్రులు వీధుల్లో అడుక్కుంటూనే దొంగతనాలు చేస్తుంటారు. వీరి మోడస్ ఒపరాండి ఏమనగా.. ఒక వీధిలో 'అమ్మా! లచ్చిం తల్లి, బిచ్చవమ్మా' అంటూ కొడుకుతో తల్లి యాచిస్తుండగా.. తండ్రి వారికి రెండిళ్ళ ముందుగా నడుస్తూ.. తాళం వేసున్న ఇళ్ళ తలుపుల గొళ్లెం క్షణంలో తీసేసి.. అడుక్కుంటూనే ముందుకెళ్తాడు.

"గదిలో కెల్లి గిన్నెలొట్టుకురా!" అని తల్లి పైడ్రాజుని లోపలకి పంపి అడుక్కుంటున్నట్లు బయట కాపలా ఉంటుంది. గిన్నెలు తీసుకొచ్చి తల్లి జోలెలో వేసేవాడు పైడ్రాజు. ఆ విధంగా ముష్టి ముసుగులో దొంగతనాలు చేస్తూ హాయిగా జీవించసాగారు. అందుకే ఎక్కడైనా 'తలుపు గొళ్లెం' చూస్తే పైడ్రాజు కి వళ్ళంతా పులకరింపుల్తో నిండిపొయ్యేది.

ఒకసారి జోలెలో చెంబులతో 'దొంగ' తల్లి పట్టుబడుతుంది. మనిషి కష్టాన్ని దోచుకునే దొంగని ఒక వెర్రి కుక్కని కొట్టినట్లు వాళ్ళంతా తన తల్లిని కళ్ళముందు కొడుతుంటే అతను గజగజ లాడేడు. చిల్లరపాముని వాకిట్లో నిర్దయగా మనుషులు కొడుతుంటే, వాకిట కాలవ కన్నం లోంచి పిల్లల తాచు ఆ దృశ్యం చూసినట్లు, అతను జనాన్ని అతిభయంతోనూ పరమ దుర్మార్గంగానూ చూసేడు. ఆ దెబ్బలకి ఆ మర్నాడు ఆ దొంగ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.

అటు తరవాత నేలమీద ఇళ్ళ బేరం కంటే నీటి మీద ఓడల బేరం ఎక్కువ లాభసాటిగా ఉందని అనుభవం మీద తెలుసుకుని, ఊర్లోంచి హార్బర్లోకి పైడ్రాజు తన సాహస రంగాన్ని మార్చేడు. దొంగతనం చెయ్యడం పైడ్రాజు డ్యూటీ. దొంగసొత్తుని డబ్బుగా మార్చడం దొంగతండ్రి డ్యూటీ.

ఒకసారి హార్బర్లో కొత్త ఓడొకటి వచ్చింది. దాని కడుపు నిండా ఇంగ్లీషు మందులే. పినిసిలిన్ గొట్టాల పాకేజీ పెట్టెల్ని కొట్టుకొస్తాడు పైడ్రాజు. వాటిని ఆప్యాయంగా బిడ్డల్లా కావిలించుకుని,

"చావుకారు కాడికి ఒట్టుకెల్దాం, రా" అన్నాడు దొంగ తండ్రి.

"ఏ చావుకారు?" అని ప్రశ్నించాడు దొంగకొడుకు.


"మందుల్చావుకారు, ఈ మందుల బేరాలన్నీ ఆడియే!"


'చావుకారు' తో బేరం కుదిరి.. కొత్త కన్నెపిల్లలా కరకరలాడిపొతున్న పది పదుల్ని జోబులో వేసుకుని కులాసాగా ఇంటికెళ్ళిపోయారు తండ్రీకొడుకు.

దొంగ తండ్రికి చాల్రోజులుగా దాంపత్య సుఖం లేని కారణాన.. సంచుల సూరిగాడి కంపెనీలో పాతిక ఖర్చు చేసి అమర సౌఖ్యం అనుభవించీసేడు. తద్వారా పోలీసువారి దృష్టిలో పడి.. ఆర్నెల్లు జైలు చేస్తాడు.

జైల్ల్లోంచి బయటకొచ్చాక 'చావుకారు'ని కలిసి.. సంగతి బయట పెడతానని అతన్ని బెదిరిస్తాడు. షావుకారు భార్య భారీ మెరుపు తీగ. షావుకారు మంచి సరసుడైతే ఆవిడ మంచి సరసురాలు. అతను వేరేగా సరసుడు. ఆమె వేరేవేరేగా సరసురాలు. ఒకరి యెడల ఒకరికి ఉండే కోపాలకే గాని రూపాలొస్తే అవి పులులుగా మారి ఒకదాని మీదొకటి విరుచుకుపడి దెబ్బలాడతాయి. ఆ రోజు షావుకారు ఖూనీ చెయ్యబడతాడు. ఆ కేసులో దొంగ తండ్రి ఇరుక్కుంటాడు.

కోర్టు హాల్లోకి వెళ్ళడం, కోర్టు వ్యవహారం దగ్గర్నుండి చూడ్డం అదే ప్రధమం పైడిరాజుకి.

"ఏటీ ఈ ఓసన?" అనుకున్నాడు.


అది కోర్టు వాసనని అతనికి తెలీదు.


"మద్దినాలపేళ దీపాలెట్టుకున్నారేటి?" అనుకున్నాడు.


ఆ గదులు కట్టినప్పుడే చీకటిగా కడతారని అతనికి తెలీదు.


"ఆలీబాబా చినీమాల్లో దొంగల్లా ఇంతమందున్నారు! ఈళ్ళెవుళ్ళు?" అని ప్రశ్నించుకున్నాడు.


"ఓహో! ఈళ్ళే కావోలు పీడర్లు!" అని సమాధానం చెప్పుకున్నాడు.


జడ్జీ పైడ్రాజు సాక్ష్యం నమ్మడు. జడ్జీగారు చాలా విట్టీగానూ, విపులంగానూ రాసిన జడ్జిమెంటు కొనావరకు అలా మెరుపుతీగలా సాగి, ఆఖర్న దొంగతండ్రికి ఉరిశిక్ష విధిస్తూ భగ్గున ముగిసింది.

పుట్టగానే ఏడ్చేడు. వాతలు వేసిన్నాడు ఏడ్చేడు. తల్లిని కొట్టిననాడు ఆమె చనిపోయిననాడూ ఏడ్చేడు. ఆ తీర్పు రోజున ఏడ్చేడు. ఆ తండ్రిని ఉరితీసిన రోజున ఏడ్చేడు - మరింక జీవితంలో ఏడవకూడదని భీకరంగా నిశ్చయించుకున్నాడు పైడ్రాజు.

అప్పుడు పైడ్రాజు దీర్ఘంగా ఆలోచిస్తాడు. పెద్దల్లా దోచుకుతినడం బెస్టు అన్న నిశ్చయానికి అతను రావడానికి అట్టేసేపు పట్టలేదు.

దోచుకు తినడం బెస్టు!!..

అనేటటువంటి పరమ ఘోరమైన నిశ్చయానికి ఏ మానవుడైనా వచ్చి సాహసంతో రంగంలోకి ఉరికి, మెలకువతో వ్యవహరించి పట్టుదలతో పనిచేస్తే!! - వాణ్ణి మరింక ఆపడం చాలా కష్టం. వాడు చాలా దూరం వెళ్తాడు, చాలా పైకి వెళ్తాడు. పాపభీతి, దైవభీతి, సంఘభీతి, ఏ భీతీ ఉండదు వాడికి. వాడు పెద్దపులిలా ఉంటూనే పరమ ధర్మరాజులా కనిపించగలడు. తన బాగు కోసం వాడు తల్లి గొంతు నొక్కగలడు, తండ్రి వెన్ను పొడవగలడు, తమ్ముడి నెత్తురు తాగ్గలడు. లొంగిన వాళ్ళని వాడు అణుస్తాడు, లొంగని వాళ్ళలో కలుస్తాడు. అవసరం తీరిపోయాక నివురంతా కప్పేసుకుంటాడు. దైవం, ధర్మం, అర్ధం, కామం, సంఘం, స్వర్గం అన్నీ తనకోసమే ఉన్నాయి కాని తనెవరికోసమూ ఉండనంటాడు. చెదలా తినేస్తాడు. పులిలా విరుచుకుపడతాడు. దేశాన్ని అమ్ముతాడు, ధర్మాన్ని చంపుతాడు. వాడు చాలా దూరం వెళ్తాడు.

పైడ్రాజు ఆ తరవాత చాలా మెట్లు పైకెక్కి చాలా దూరం వెళ్ళేడు. బ్యాంక్ లొంచి బయటకొచ్చిన ఒక వృద్ధుణ్ణి హత్య చేశాడు. బంగారం కాజెయ్యడం కోసం ఒక మేస్త్రమ్మని చేరదీశాడు. అవసరం తీరాక ఆమెని తన్ని తగలేశాడు. రిక్షా తొక్కిన పైడ్రాజు టీ కొట్టు, ఆపై ఓటేలు, ఒక ఫేక్టరీ, ఆపై చిన్న కాంట్రాక్టరు.. క్రమేణా అత్యంత ధనవంతుడు ఐపోయ్యాడు.

పైడ్రాజు ఇప్పుడెక్కడున్నాడు?

చాలా దూరంలో ఉన్నాడు.


ఆపై పైడ్రాజు భార్య, కొడుకు గురించి కొంత ప్రస్తావించి కథ ముగుస్తుంది.

(ఎర్రరంగు అక్షరాలు రావిశాస్త్రివి)

1965 లో రాయబడ్డ ఈ కథని మొదటిసారిగా ముప్పైయ్యేళ్ళ క్రితం 'ఋక్కులు' సంకలనంలో చదివాను. ఇప్పటిదాకా మొత్తం ఓ నాలుగైదుసార్లు చదివుంటాను. రావిశాస్త్రిని ఇలా మళ్ళీమళ్ళీ చదవడానికి నాకో కారణం ఉంది. నాకు ఉత్తరాంధ్ర మాండలికం సరీగ్గా అర్ధం కాదు. పైపెచ్చు రావిశాస్త్రి శైలి పదాలని కలిపేస్తూ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే నేను రావిశాస్త్రిని మార్కర్ తో అండర్ లైన్ చేస్తూ.. మార్జిన్లో అర్ధాలు రాసుకుంటూ.. ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లు శ్రద్ధగా చదువుతాను.


బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంపుటి 'రూపం - సారం' గూర్చి ఇంతకు ముందో టపా రాశాను. ఈ సంపుటిలో 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం' అని ఒక వ్యాసం ఉంది. నాకు తెలిసి రావిశాస్త్రిని ఇంత ప్రతిభావంతంగా విశ్లేషించిన వ్యాసం మరొకటి లేదు. "తలుపు గొళ్లంలో కోర్టు వర్ణన చాలా అద్భుతమైనది." అంటూ తన వ్యాసంలో ఈ కథని ప్రస్తావించాడు బాలగోపాల్. చాలామంది విమర్శకుల అభిప్రాయమూ ఇదే.

ఈ కథలో కోర్టుని వర్ణిస్తూ దాదాపు రెండు పేజీలు రాశాడు రావిశాస్త్రి. ప్రతి వాక్యమూ అపురూపమే (కోర్టు వర్ణన టపాకి అనుబంధంగా చివర్లో ఇచ్చాను). తెలుగు భాషలో మరి ఏ ఇతర రచయిత ఇంత అద్భుతంగా ఒక్క వాక్యం కూడా రాయలేడని నా విశ్వాసం. దటీజ్ 'చాత్రిబాబు'! చదివినప్పుడల్లా గొప్ప 'కిక్' వస్తుంది!

ఈ దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని వాదించేవారు ఈ కథ చదివి తీరాలి. ఈ సమాజంలో అన్యాయం ఎంతగా వ్యవస్థీకృతమై ఉందో రావిశాస్త్రి చాలా నిశితంగా చెబుతాడు. మంచి డాక్టర్ రోగాన్ని అసహ్యించుకోడు. రోగ కారణం గూర్చి ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి రోగ నివారణ ఎలాగో తెలుస్తుంది. మంచి రచయిత కూడా అంతే.

రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం గూర్చి వివరిస్తూ బాలగోపాల్ ఇంకా ఇలా అంటాడు.

'రాజ్యాన్ని గురించీ రాజ్యాంగ యంత్రాన్ని గురించీ వకీళ్ళకి అర్ధమైనంతగా మరెవ్వరికీ కాదేమో! నేరానికీ రాజ్యాంగ యంత్రానికీ మధ్యనున్న సంక్లిష్టమైన పరస్పరత రెండురకాల అమాయకులకి అర్ధం కాదు. అమాయకులైన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యాంగ యంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు. రెండవ రకంది దుస్సాహసిక అమాకత్వం. రాజ్యాంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.'

బాలగోపాల్ రావిశాస్త్రి పరిమితుల గూర్చి కూడా వివరంగా రాశాడు. లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది కేవలం వాస్తవిక దృక్పధంగా మాత్రమే మిగిలి పోతుందంటాడు బాలగోపాల్. ఆ రకంగా అంచనా వేసినా.. రావిశాస్త్రి ఎమిలీ జోలా, మొపాసా, చెహోవ్, దోస్తోవస్కీల సరసన ఒక బంగారు పీట వేసి కూర్చోపెట్టేంత గొప్ప రచయిత అని గట్టిగా నమ్ముతున్నాను.

చివరి తోక..

ఈ మధ్య టపాలు రాసే ఉత్సాహం తగ్గిపోయింది. ఇక నా బ్లాగ్జీవితం చరమదశలోకొచ్చిందనే అనుకుంటున్నాను. అయితే మొన్నో పీడకలొచ్చింది. తెలుగు సాహిత్యంలో 'గీకుడురాళ్ళు' రాసిన  ప్రముఖ రచయితకి తరవాత రావిశాస్త్రికి అదేదో ఒక పీట (ఇది కూర్చునే పీట కాదు) వచ్చిందిట.

ఆ సందర్భంగా ఓ ప్రముఖ కళాబంధువు.. నిలువెత్తు రావిశాస్త్రి బొమ్మకి సన్మానం చేయుచుండగా.. 'పాడుతా తీయగా' అనే ఓ ప్రముఖ గాయకుడు రావిశాస్త్రి గూర్చి శంకరాభరణం స్టైల్లో పాడుచుండగా.. వందేళ్ళ తెలుగు కథల వందనాలయ్య రావిశాస్త్రి గూర్చి తనకి మాత్రమే సొంతమైన భయానక బీభత్స వాగ్దాటితో కీర్తించుచుండెను.

ఆ దృశ్యము గాంచి.. భీతి చెందాను, వణికిపొయ్యాను, తల్లడిల్లిపొయ్యాను, దుఃఖించాను. ఫినాయిల్ తో నోరు పుక్కిలించినట్లుగా, గజ్జికుక్క చెక్కిలి నిమిరినట్లుగా, చెవిలో పిశాచాలు పాళీ భాషలో పాట పాడుతూ.. మెదడు పీక్కు తింటున్నట్లుగా అనిపించింది.

ఒక్కసారిగా మెళకువొచ్చింది. మనసంతా దిగులుగా అనిపించసాగింది. తెల్లవారు ఝాము కలలు నిజమవుతాయంటారు. ఏమో! గురజాడ, శ్రీశ్రీలకి లేని రక్షణ రావిశాస్త్రికి ఎక్కణ్నుంచి వస్తుంది? నా పీడకలకి విరుగుడుగా ఏదైనా ఓ రావిశాస్త్రి కథపై టపా రాసి ప్రక్షాళన చేద్దామనిపించింది. ఆ ఫలితమే ఈ పోస్ట్.

అనుబంధం (కొర్టు వర్ణన) :

ఏ దేశంలోనైనాసరే ఎక్కడైనాసరే ఏ ఖుషీ కుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండ ప్రయత్నించినాసరే నునుమెత్తని పులుల్లా ఉంటారు. అందమైన తోడేళ్ళలా ఉంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా ఉంటారే తప్ప జడ్జీలెవరూ దయగల మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

ఏ దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినాసరే, సరసరలాడే తాచులాగో పడగెత్తిన నాగులాగో లేక తోక మీద నిలబడి నడిచే జెర్రిపోతులాగో ఉంటాడే తప్ప ఏ ప్లీడరూ కూడా మనిషిలా మాత్రం ఉండడు.. ఛస్తే ఉండడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ మారుమూల ఏ కోర్టుకి వెళ్లి చూసినప్పటికీ అక్కడ కనిపించే పోలీసులూ బంట్రోతులూ గుమాస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటారే తప్ప మనుష్యుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ);

ఏ దేశంలోనైనాసరే ఎంత ఉన్నత న్యాయస్థానమైనాసరే దాని ఆవరణలో ఎంత మంచి పూలమొక్కలు పెంచినా వాటికి విషపుష్పాలు తప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ);

అక్కడ ఎంత మంచి చెట్టు ఎంత బాగా ఎదిగినప్పటికీ ఆకొక నాలికగా గల వింత రాక్షసిలా ఉంటుంది తప్ప చల్లని చెట్టులా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఏ పచ్చని తీగె సాగినా అది పసిరికపాములా ఉంటుందే తప్ప నును లేత పూతీగెలా ఉండదు (అనిన్నీ);

అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాచీలా ఉంటుందే తప్ప మరో విధం గా ఉండదు (అనిన్నీ);

అక్కడ మానస సరోవరంలాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకుపోతుందే తప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ);

అన్నెంపున్నెమెరుగని అమాయకపు చిలకల్ని అక్కడికి తెచ్చి పెంచితే అవి అక్కడ గెద్దలుగా ఎదుగుతాయి, చిలకలనే చంపుతాయి (అనిన్నీ);

అక్కడ తెల్లని మల్లెపూల మనసులు నాటితే అవి బ్రహ్మజెముడుడొంకలు గా ముళ్ళుముళ్ళుగా చావుచీకటిగా పెరుగుతాయి (అనిన్నీ);

నాలికలతో నిజం తప్ప వేరేదీ ముట్టని వారికి అక్కడికి వచ్చీ రాగానే వెయ్యి విషజిహ్వలొస్తాయి (అనిన్నీ);

అక్కడ చల్లటి నీడ ఉన్నప్పటికీ అది ఎండని మింగిన కొండచిలవలా ఉంటుందే తప్ప, తాపమార్చి ప్రాణమిచ్చే నీడలా ఉండదు (అనిన్నీ);

అక్కడ ఎండ ఉన్నప్పటికీ అది నీడని చంపి నిప్పులు చిమ్మే రక్కసి డేగలా పెనురెక్కల విసురులా ఉంటుందే తప్ప, దివాకరుని దివ్యాతి దివ్యమైన అనుగ్రహం లా ఉండదు (అనిన్నీ);

అక్కడ భగవంతుడు పుట్టించిన దేదీ భగవంతుడు పుట్టించినట్టుగా ఉండదు (అనిన్న్నీ);

అక్కడ దేముడే వెలిస్తే అతను ఠారున చచ్చి అక్కడ తప్పక దెయ్యమే అవుతాడు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో అయినా సరే తడిగుడ్డలు చల్లగా గొంతుకులు పిసుకుతాయి ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు గదలు ఢీకోవు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృశ్చికాలు తోకలతో నవ్వినట్లుంటుందే కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ);

ఏ దేశంలో ఏ కోర్టయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలిచినప్పటికీ అది వెన్వెంటనే గుండె లేని గోరీగా మారితీరుతుంది (అనిన్నీ);

ఆ కోర్టు ఎంత "కళ"గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా ఉండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ);

ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా ఉండరు (అనిన్నీ);

(photos courtesy : Google)