Tuesday 5 December 2017

మాయాబజార్

నా దృష్టిలో 'మాయాబజార్' వొక కార్టూన్ సినిమా.
తెలుగువాళ్లకి ఇదే యెక్కువ, యెంత చెట్టుకి అంతే గాలి!

'మాయాబజార్' నాకూ ఇష్టమే, ఒకప్పుడు చాలాసార్లు చూశాను. ఆ సినిమా పట్ల అయిష్టతతోనో, వ్యతిరేకతతోనో ఈ రాతలు రాయట్లేదని గుర్తిస్తే సంతోషం. ఆ సినిమా గూర్చి "మంచిగా" కాక ఇంకెలా చర్చించినా మనోభావాలు దెబ్బతిని గుండెలు బాదుకునేవారు ఈ రాత చదవకపోడం మంచిదని నా సలహా. ఇదొక పాయింటాఫ్ వ్యూ మాత్రమే.
ఒక సినిమా మనకి యెందుకు నచ్చుతుంది?
ఇందుకు అనేక కారణాలున్నా, ముఖ్యమైంది - emotional identity. వ్యక్తుల కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, అనుభవాలు.. ఇవన్నీ సినిమాకొక emotional identity నిస్తాయి. We are greatly influenced by this emotional identity. ఈ అనుభవం మనకి మాత్రమే సొంతం. ఈ variables లో ఏది మారినా మనకా సినిమా నచ్చదు.
ఇందుకు ఉదాహరణ - ఓ ఇరవై సంవత్సరాల కుర్రాడికి 'మాయాబజార్' చూపిస్తే, సినిమా మనకి (50 to 70 age group) నచ్చినంత గొప్పగా వుండదు.. విసుగ్గా కూడా అనిపించొచ్చు. కారణం - అతనికి సావిత్రి, ఎస్వీ రంగారావు, ఘంటసాల తెలీదు. నా పిల్లలు 'మాయాబజార్' చూడరు, ఓ నిమిషం చూసి విసుక్కుంటారు. అంతేకాదు - ఆ రోజుల్లో ఈ ముసలి సినిమా యెట్లా ఇష్టపడ్డారా అని బోల్డంత ఆశ్చర్యపోతారు.

మాయాబజార్ - 2
'మాయాబజార్' టైముకి నేను పుట్టలేదు. నా మేనమామలు, అన్నయ్య స్నేహితులు ఫలానా సినిమాలు ఫలానాందుకు బాగున్నాయి అని మాట్లాడుకోడం విన్నాను. ఆ రకంగా మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ.. చూడకముందే మంచిసినిమాలు అని మెదడులో conditioning జరిగిపోయింది.
పాత సినిమాలతో నాకు అనేక అనుభవాలు. స్కూలెగ్గొట్టడాలు, సినిమాకి వెళ్లడం కోసం వేసిన దొంగవేషాలు, అమ్మతో సినిమా గూర్చి ధర్మసందేహాలు.. ఇవన్నీ నాకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకాలు. ప్రతి వ్యక్తి బుర్రలో వొక సినిమాతో పాటు, దానికి సంబంధించిన అనేక స్పృతులు పెనవేసుకునుంటయ్. వీటన్నింటినీ emotional investment అనుకోవచ్చు.
ఒక ఉదాహరణ - మాధవపెద్ది సత్యం మా గుంటూరు బ్రాడీపేట వాసి, నాన్నకి పరిచయం. స్నేహితుల కోసం మాధవపెద్ది హార్మోనియం పెట్టెతో అనేక పాటలు, పద్యాలు పాడతాడనీ.. ఆ గంభీర స్వరానికీ, బక్కపల్చని ఆకారానికీ అస్సలు సంబంధం వుండదనీ నాన్న చెబుతుంటే నోరు తెరుచుకుని వినేవాణ్ని. అందువల్ల వివాహ భోజనంబు పాట వింటున్నప్పుడు నాన్న గుర్తొస్తాడు! అంటే జ్ఞాపకాలు వొక emotional thread, అవి ఫెవికాల్ గమ్ములాగా మనల్ని వదలవు, అంబుజా సిమెంట్ గోడలా ధృఢంగానూ వుంటాయి.
యెప్పుడైతే వొక సినిమా వెనుక ఇంత కథుందో.. అప్పుడు మనం bias అయిపోతాం. Objective assessment కి అర్ధం మర్చిపోతాం. ఆ సినిమా గొప్పది అని బుర్రలో ప్రతి న్యూరాన్‌లో imprint అయిపోయి వుంటుంది. ఇవ్వాళ ఆ పాత సినిమాలో ఫలానా సన్నివేశం బాలేదని చెబితే వొప్పుకోం.

మాయాబజార్ - 3
పాతసినిమాలు ఇప్పటి తరానికి యెందుకు నచ్చవో కొత్తసినిమాలు నాకు అందుకే నచ్చవు. ఇప్పటి హీరోల హావభావాలు నాకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొన్నాళ్లక్రితం వొక మాజీహీరో కొడుకు సినిమాకెళ్లాను. అతని మొహంలో chronic constipation భావం తప్ప మరేమీ కనిపించలేదు. ఇంకో హీరో కొడుకు మొహంలో rectal examination చేయించుకుంటున్న ఫీలింగ్ కనిపించింది. నా పిల్లలకి నచ్చిన ఈ హీరోలు నాకు నచ్చకపోడానికి కారణం emotional detachment. ఇవ్వాల్టి సినిమాలు మంచివే అయ్యుండొచ్చు, కానీ నాకు నచ్చవు. ఇవ్వాల్టి హీరోలు మంచినటులే అయ్యుండొచ్చు, కానీ నాకు నచ్చరు. ఇందుక్కారణం - emotional investment లేకపోడం!
'మాయాబజార్' కార్టూన్ సినిమా యెందుకయింది?
అది ఫక్తు కార్టూన్ కేరక్టర్ల సినిమా కాబట్టి! కార్టూన్ కేరక్టర్‌కి గూగుల్ అర్ధం ఇస్తున్నాను - a person or portrayal lacking in depth or characterized by exaggerated or stereotypical features. "in the films, Bond is a cartoon character"
'మాయాబజార్' యేమిటి?
వొట్టి చందమామ మార్క్ చిన్నపిల్లల కథ. ఒకవైపు పూర్తి మంచివాళ్లు, ఇంకోవైపు పూర్తి చెడ్డవాళ్లు, పాటలు పద్యాలు, మాయలు మంత్రాలు.. పైసా వసూల్ సినిమా. విజయా బ్యానర్, నటీనటుల ఇమేజ్, ఘంటసాల సంగీతం.. ఇంతకుమించి ఇంకేమీ లేదు. ఈ conditioning లేనందువల్ల ఇప్పటి తరం ప్రేక్షకులకి మాయాబజార్ పట్టదు.
మరప్పుడు 'మాయాబజార్‌'ని యెందుకంతలా పొగట్టం?
మా ఊళ్లో లెనిన్, స్టాలిన్, మావోలకి జయంతి/వర్ధంతి సభలు జరుగుతుంటయ్. వక్తల వయసు కనీసం డెబ్భై! వింటుంటే ఉద్రేకం వస్తుంది, ఆవేశం వస్తుంది. సమావేశం అయ్యాక వక్తలు యెవరింటికివాళ్లు వెళ్లి బీపీ, షుగర్ మాత్రలేసుకుని అన్నం తిని నిద్రోతారు. ఇవో పిండప్రదాన కార్యక్రమాలు.
పాతసినిమా అభిమానులూ అంతే! యాభైయ్యేళ్లనీ, సష్టి పూర్తనీ యేవో రాసుకుని లేదా మాట్లాడుకుని తృప్తినొందుతారు (వీళ్లు పొయ్యాక ఈ సినిమాల్ని తల్చుకునేవాళ్లు వుండరని నా అనుమానం). వీళ్లపట్ల నాకు వ్యతిరేకత లేదు, కానీ ఆశ్చర్యంగా వుంటుంది.

మాయాబజార్ - 4
disclaimer -
I am not writing this to spoil the party of మాయాబజార్ fans, just recording my random thoughts on movies.
ఇప్పుడు కొద్దిసేపు నా పీజీ రోజుల అనుభవం. అక్కడంతా నానాజాతి సమితి, అన్ని రాష్ట్రాలవాళ్లూ వుండేవాళ్లు. సినిమాల్లో సామాజిక కోణం/ప్రయోజనం, సన్నివేశ బలం, పాత్రల స్వభావం అంటూ వారాంతాల్లో మేధోమధనం సాగేది (దీనికింకో పేరు intellectual masturbation).
బెంగాలీయుడైన సమిత్ రాయ్ సత్యజిత్ రే, రుత్విక్ ఘటక్, మృణాల్ సేన్ సినిమాల గూర్చి విశ్లేషణ చేస్తుంటే యెంతసేపైనా వినాలనిపించేది. శశిధరన్ పేరలల్ సినిమాకి అదూర్ గోపాలకృష్ణన్ ప్రాముఖ్యత గూర్చి తన మళయాళీ ఇంగ్లీషులో చెప్పేవాడు. ఇక మా తారానాధ్ కన్నడం ప్రపంచ భాషనీ, సంస్కృతానిక్కూడా మాతృకనీ నమ్మిన భాషా తీవ్రవాది. గిరీశ్ కర్నాడ్, గిరీశ్ కాసరవెళ్లి అంటూ కన్నడీయుల పేర్లతో చర్చని డామినేట్ చేసేవాడు. ఇంక హిందీవాళ్లయితే చెప్పనక్కరలేదు.
నేనెంత ఆలోచించినా జాతీయస్థాయి తెలుగు పేర్లు తట్టేవి కావు. ఒకసారి "మాయాబజార్" అన్నాను. మా ES కృష్ణమూర్తిగాడు పెద్దగా నవ్వాడు - "అది తమిళంలో వచ్చింది, బొత్తిగా పిల్లల సిన్మాగా!" అన్నాడు. "మిస్సియమ్మ వొక absurd comedy" అని కూడా తేల్చేశాడు. నాకింక సినిమాలేం మిగల్లేదు. మనం గొప్పగా చెప్పుకునే సినిమాలు రాష్ట్రం దాటితే వీసమెత్తు విలువ చెయ్యవని అర్ధమైంది. దాసరి గూర్చి చెబుదామంటే అవి నాటకాలో సినిమాలో తెలీదు! రాఘవేంద్రరావు soft porn తప్ప ఇంకే సిన్మాలూ తియ్యలేదాయె! విశ్వనాథ్ సిన్మాలన్నీ పిలక బ్రామ్మలు, వాళ్ల 'పవిత్ర' సాంప్రదాయాలే! బాపురమణలకి 'రామాయణం' తప్ప ఇంకోటి పట్టలేదు! ఇంకేం చెప్పాలి?
అప్పుడు నాకు తట్టిన సినిమా 'రోజులు మారాయి'. భూమిలేని పేదరైతుల సమస్యల్నీ, వడ్డీవ్యాపారంలో మోసాల్నీ, కులాంతర వివాహాల్నీ, కరణం మున్సబుల కుట్రల్నీ ప్రతిభావంతంగా చర్చించిన సినిమా 'రోజులు మారాయి'. ఆనాటి సామాజిక రాజకీయ సమస్యల్ని అద్దం పట్టి చూపిన సినిమా 'రోజులు మారాయి'.
విజ్ఞులైన స్నేహితులు అర్ధం చేసుకోవాల్సింది - ఇక్కడ మనకి నచ్చిన తెలుగు సినిమాలు అనేకం వున్నా అవతలివాడు పథేర్ పాంచాలి, చెమ్మీన్, అంకుర్, సంస్కారలతో కొడ్తుంటే యేవీ మనని రక్షించలేవు. అట్టి దుస్థితిలో నన్ను కాపాడింది 'రోజులు మారాయి'. అందుగ్గానూ 'రోజులు మారాయి'కి రుణపడి వున్నాను.
ఉపసంహారం -
నేను పాత తెలుగు సినిమాలకి వ్యతిరేకిని కాను. సినిమా అనేది వొక వ్యాపారం. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. తెలివితక్కువ్వాడు బోల్డంత టైమ్ వృధా చేసుకుంటూ ఇలాంటి రాతలూ రాస్తుంటారు, తెలివైనవాడు వీటిని చదవకుండా 'లైక్' కొట్టేస్తాడు! అదీ సంగతి!
(అయిపొయింది)

(fb post written in 4 instailments)

Wednesday 15 November 2017

"జై మా అభిమాన హీరో!"

అనగనగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏదో గొప్ప కోసం 'ఇండస్ట్రీ' అంటున్నానే కానీ.. ఇది రెండుమూడు కుటుంబాలు అహోరాత్రులు కష్టపడి నిలబెట్టిన కుటీర పరిశ్రమ. స్థూడియోలు/హీరోలు/సినిమా హాల్స్.. మొత్తం ఆ కుటుంబాల చెమటతోనే తడిసుంటాయి. ఈ కుటుంబ హీరోలు నువ్వుతున్నారో, యేడుస్తున్నారో తెలుసుకోడం బహుకష్టం అని కిట్టనివాళ్లు అంటారు.

ప్రభుత్వాలు ప్రజల బాగు కోసం పని చేస్తుంటయ్. సినిమాల మంచిచెడ్డలు యెన్నడం కూడా ప్రజాసేవలో ఒక పవిత్ర కార్యం కావున నంది అవార్డుల యెంపిక కోసం ఒక నిస్పాక్షక జ్యూరీని నియమించారు. ఆ జ్యూరీ యెంతో బాధ్యతతో అవార్డుల్ని ప్రకటించింది.

ఇప్పుడో సమస్యొచ్చి పడింది. ఆస్తుల పంపకంలోలా అవార్డుల పంపకంలో ఒక కుటుంబానికే న్యాయం జరిగి, మిగిలిన కుటుంబాలకి అన్యాయం జరిగిందని ఫ్యాన్సాభిమానులు దుఃఖించసాగారు. ఇవన్నీ అన్నదమ్ముల కలహాల వంటివేననీ, తెర వెనుక వాళ్లంతా వొకటేననీ అంటారు గానీ నిజానిజాలు మనకి తెలీదు.

తెలుగు హీరోల అభిమానులకి తెలుగు భాషంత చరిత్ర వుంది. ఆనాడు ఎన్టీఆర్, ఏయన్నార్ పోస్టర్ల పేడసుద్దల ముద్దల నుండి ఈనాటి ఫేస్బుక్ పోస్టుల్దాకా.. ఇదో పురాతనమైన సంస్కృతి. ఆవకాయ పచ్చడి, గుత్తొంకాయలాగే తెలుగు హీరోల వీరాభిమాన థ్రిల్లింతా తెలుగోడి సొంతం.

బాధ యెవరికైనా బాధే! తెలుగు హీరోల అభిమాన కట్టప్పల బాధని సానుభూతితో అర్ధం చేసుకుంటూ.. వారీ బాధ నుండి త్వరలో బయటపడాలని ఆశిస్తున్నాను.

(fb post)

Sunday 17 September 2017

యేసుపాదం! ఐ మిస్ యూ!


యేసుపాదం పొయ్యాట్ట! మనసు బరువుగా అయిపోయింది. యేసుపాదంతో నా అనుబంధం రెండు దశాబ్దాల పైమాటే! 

యేసుపాదం స్కిజోఫ్రీనియా బాధితుడు. అనుమానాలు, భయాలు.. తన్లోతాను మాట్లాడుకుంటాడు. స్నానం చెయ్యాలి, అన్నం తినాలి అన్న ధ్యాస లేనివాడు. నల్లటి పొడవాటి ఇనప స్థంభానికి యెర్రటి కళ్లు అతికించినట్లు కొంత ఆకర్షణీయంగా, మరింత భయంకరంగా కనిపిస్తాడు. భార్యని తన్నేవాడు, ఆమె పుట్టింటికి పారిపొయ్యింది. ఆ సౌలభ్యం లేని తలితండ్రులు యేసుపాదంతో తన్నించుంకుంటూనే వుండేవాళ్లు.

యేసుపాదం నాకో పేషంట్ ద్వారా పరిచయం. అతను కడుపేదవాడని తెలుసుకొని  ఫీజు తీసుకోలేదు. కొన్నాళ్లకి యేసుపాదం మందులూ కొనుక్కోలేడని అర్ధమై physician samples తో వైద్యం కొనసాగించాను. 

సైకియాట్రీ ప్రాక్టీస్ కొంత విభిన్నంగా వుంటుంది. పేషంట్లు డాక్టర్లని నమ్మరు, నిర్లక్ష్యంగా వుంటారు. యేసుపాదానికి నేనంటే చులకన భావం.

"నువ్విచ్చే మందులకి నరాలు లీకైతన్నయ్, నిన్ను చావదెం..తా."

"మందులెవడు మింగుతాడ్రా, నీయమ్మ మొగుడా?"

ఇట్లాంటి భాషతో నన్ను ప్రేమపూర్వకంగా పలకరించేవాడు. 

కాలక్రమేణా తలిదండ్రులు మరణించారు, అన్నం తింటున్నాడో లేదో పట్టించుకునేవాళ్లూ కరువయ్యారు. యెండల్లో వానల్లో రోడ్లమ్మట తిరగడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు యేసుపాదాన్ని ఊళ్లోవాళ్లు పట్టుకొచ్చేవాళ్లు, మనిషి అస్థిపంజరంలా మారిపొయ్యాడు. అటుతరవాత ఆ ఊరివాళ్లెవరన్నా వస్తే, యేసుపాదం కోసం వాళ్లతో శాంపిల్స్ పంపేవాణ్ని. వేసుకున్నాడో లేదో తెలీదు.

ఇప్పుడు యేసుపాదం పొయ్యడని వార్త! మంటల జ్వరంతో రోడ్లమ్మట అలా తిరుగుతూనే వున్నాట్ట. తిరిగీ తిరిగీ యెక్కడో రోడ్డు పక్కన పడి చనిపొయ్యాడు.

పుష్కరాలు పద్నాలుగేళ్లకోసారి వస్తాయి, సీజనల్ జ్వరాలు ప్రతేడాదీ వస్తాయి. వాటికి పేదవాళ్లంటే ఇష్టం, మానసిక జబ్బున్న పేదవాడంటే మరీ ఇష్టం. తనెవరో, తనేవిఁటో తెలీని యేసుపాదం జ్వరానికి బలైపొయ్యాడు. 

ఇకముందు, నాకేసి యెర్రగా చూస్తూ - 

"నీయమ్మా! నీ లంజకబుర్లు నాదగ్గర కాదు!" అంటూ ప్రేమగా పలకరించే యేసుపాదం నాక్కనపడడు, అదీ సంగతి!

యేసుపాదం! ఐ మిస్ యూ!  

(fb post)

Friday 1 September 2017

అర్జున్ రెడ్డి (ఇది రివ్యూ కాదు)


మెదడు భాగాల్ని సరీగ్గా వాడకపోతే అవి atrophy అయిపోతాయనీ, ఇందుకు తెలుగు హీరో అభిమానులు ఒక ఉదాహరణనీ చెప్పాను. అలాగే, active గా పన్జేసే మెదడుకు కొన్నిభాగాల్లో రక్తప్రసరణ తగ్గినప్పుడు (ischemia).. విషయం సరీగ్గా అర్ధం కాకుండా పోతుంది. నేను నా మెదడులో film appreciation center కి రక్తప్రసరణ తగ్గిపోయిందని నమ్ముతున్నాను.

నా నమ్మకానికి అనేక సాక్ష్యాలున్నయ్.

మొన్నామధ్య 'బాహుబలి' సినిమా టీవీలో వస్తుంటే పిల్లలు నోరు తెరుచుకు చూస్తున్నారు. ఓ రెణ్ణిమిషాలు చూశాక విసుగనిపించి, పక్క గదిలోకి వెళ్లిపొయ్యాను. ప్రభాస్, రానాల్లో యెవడు రాజైతే మాత్రం సామాన్యుడికి వొరిగేదేముంది? ఇది - ప్రజల దగ్గర పన్నులు కట్టించుకునే హక్కు కోసం పొట్లాడుకుంటున్న ఇద్దరు యువకుల మధ్య తగాదా మాత్రమే! అలా అని, 'బాహుబలి' విసుగ్గా అనిపించడం నాకేమీ సంతోషాన్నివ్వలేదు. in fact, దిగులుగా అనిపించింది. ఒకప్పుడు చందమామ కథల్ని ఆసక్తిగా చదివిన నేను, ఆ కథల్లాంటి సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోవడం దురదృష్టం.

నా ఈ సమస్యకి చాలా చరిత్ర వుంది. అప్పుడెప్పుడో స్నేహితుల్తో 'శంకరాభరణం' చూశాను. తులసి అనే అందమైన అమ్మాయి శంకరశాస్త్రి సంగీతం అంటే పడి చస్తుంది. శంకర శాస్త్రి ఆమెతో sexual relationship పెట్టుకుంటే (సెక్స్ ఆరోగ్యానికి మంచిది), ఆ ఆనందంతో శాస్త్రిగారు మరింత గొప్ప సంగీత విద్వాంసుడిగా ఎదిగేవాడని నా ఆలోచన. అప్పుడు వర్షమేం ఖర్మ, వరదలే సృష్టించేవాడు! ఆ మాటే బయటకి అన్నాను, నా స్నేహితులు 'గయ్'మన్నారు. పవిత్రమైన శాస్త్రీయ సంగీతంలో అపవిత్రమైన సెక్సుని కలపడం నా స్నేహితులకి నచ్చలేదు!

నాగార్జున 'శివ' సూపర్ హిట్టని నా స్నేహితుడొకడు బలవంతంగా లాక్కెళ్లాడు. నాకు సినిమా నచ్చలేదు. కెమెరా కన్ను కాలేజీలో, క్లాసు రూముల్లో పరుగులెట్టడాన్ని నా స్నేహితుడు థ్రిల్లింగుగా ఫీలయ్యాడు, నాకందులో గొప్పేంటో అర్ధం కాలేదు. సినిమా కథపై కూడా నాకు సమస్యే!

"ఒక రౌడీ నుండి ప్రజల్ని రక్షించడానికి హీరో ఇంకో రౌడీ అవతారం ఎత్తడం ఏమిటి?! Absurd గా లేదూ?" అన్నాను నా స్నేహితుడితో.

"నిజమే, కానీ - హీరో మంచి రౌడీ! నీకసలు సినిమా చూడ్డం రాదు!" విసుక్కున్నాడు నా స్నేహితుడు.

సినిమా యెలా చూడాలి? టిక్కెట్టు కొనుక్కోవాలి, కుర్చీలో కూచోవాలి, తెరపై కదుల్తున్న బొమ్మల్ని చూడాలి. ఇలా కాకుండా - ఇంకోరకంగా సినిమా చూసే ప్రత్యేకమైన టెక్నిక్ నాకు తెలీదు. అంచేత -

"అవును, నాకు సినిమా చూద్దాం రాదు!" అని అర్జంటుగా ఒప్పేసుకున్నాను.

ఇలా అనేక అనుభవాల తరవాత, నాకు సినిమా చూడ్డం రాదని డిసైడైపొయ్యాను. ఆ తరవాత మెదడు గూర్చి ఎక్కువగా చదివేసినందున, నా మెదడులో film appreciation center కి రక్తప్రసరణ తగ్గిపోయిందని కనిపెట్టాను! అంచేత, నా మెదడుని గౌరవిస్తూ సినిమాలు చూడ్డం మానేశాను.

ఈ సోదంతా యెందుకు రాస్తున్నానంటే - ఇప్పుడు అందరూ 'అర్జున్ రెడ్డి' గూర్చి రాస్తున్నారు. నాకు యెలాగూ 'అర్జున్ రెడ్డి' నచ్చడు. ఎప్పణ్ణుంచో వున్న మెదడు సమస్యకి తాజాగా నడుం నొప్పి తోడైంది. సినిమా చూస్తే ఏదోటి రాస్తాను. నచ్చలేదంటే 'నువ్వు యూత్ కాదు, నీది ముసలి టేస్ట్' అంటారు. పోనీ - యూత్ అనిపించుకోడానికి సినిమా బాగుందని అబద్దం చెబితే ఉతికి ఆరెయ్యడానికి ఇంకోవైపు మిత్రులు రెడీగా వున్నారు!

అందువల్ల - ప్రస్తుత పరిస్థితుల్లో (నా ఆరోగ్యరీత్యా) 'అర్జున్ రెడ్డి'ని చూడకుండా వదిలేస్తున్నాను.

(fb post)

Thursday 31 August 2017

బానిసలు మళ్లీ పుట్టారు

అది అబ్రహం లింకన్ కాలం -

బానిసత్వంపై అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది. బానిసలు స్వతంత్రులవుతున్నారు. అయితే - అన్ని రంగాల్లో dissent వున్నట్లే, బానిసల్లో కూడా కొందరికి బానిసత్వ విముక్తి నచ్చలేదు.

వారిలో - "మనకి బానిసత్వం బాగానే వుంది కదా! ఇప్పుడు దీన్ని వదులుకోడం దేనికి?" అనే వాదన మొదలైంది.

ఈ వాదనకారుల్లో ఒకడు యాభై సంవత్సరాలు బానిసత్వంలో పండిపోయినవాడు. అతను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పాడు.

"ఉరే బానిసబ్బాయిలూ! అమెరికా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి, బానిసత్వం అంతరించిపోయే ప్రమాదం కనుచూపు మేరలోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం 'మేం బానిసలుగానే మిగిలిపోతాం' అంటే మన తోటి బానిసలే మన్ని బ్రతకనివ్వరు." అంటూ నిట్టూర్చాడు.

"అంతేనా, మనం మన అమూల్యమైన బానిసత్వాన్ని వదులుకోవాల్సిందేనా? అయ్యో!" అంటూ బానిసలు సామూహికంగా పెడబొబ్బలు పెడుతూ రోదించసాగారు.

'ఇంక చాలు, ఆపండి' అన్నట్లు కుడిచెయ్యి పైకెత్తి వారిని వారించాడు సీనియర్ బానిస.

"మనం ఇంతలా రోదించనవసరం లేదు. నిన్నరాత్రి అంజనం వేసి చూశాను. అక్కడెక్కడో 'భారద్దేశం' అనే దేశం వుందిట, అందులో 'తెలుగు' అనే భాష మాట్లాడే జనులున్నారట! వాళ్లదీ అచ్చు మనలాంటి బానిసబుద్ధేట! మనం పునర్జన్మలో మళ్లీ అక్కడ పుడతాం. తెలుగు సినిమాలకి అభిమానులుగా వుంటాం. హీరోలకీ, వారి కుటుంబాలకీ, వంశాలకీ సేవ చేసుకుంటూ.. ఇంచక్కా బానిసల్లా బ్రతికేస్తాం." అంటూ కఫం అడ్డొచ్చి దగ్గాడు.

బానిసలకి వొళ్ళు పులకరించింది, ఆనందంతో గెంతులు వేసుకుంటూ - "బానిసత్వం వర్ధిల్లాలి, బానిసలూ జిందాబాద్!" అంటూ నినాదాలు చేశారు.

(రావిశాస్త్రి 'వేతనశర్మ' సౌజన్యంతో)

(fb post)

Wednesday 30 August 2017

అభిమానుల దురభిమానం

నా చిన్నప్పుడు NTR, ANR అభిమాన సంఘాల మధ్య భీభత్సమైన వైరం వుండేది. అభిమానులు యెదుటి హీరో సినిమా పోస్టర్ మీద పేడసుద్దలు కొట్టి ఆనందించేవాళ్లు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత చదువు లేదు, టెక్నాలజీ లేదు.. కాబట్టి సినిమా హీరోల వీరాభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఇవ్వాళ టెక్నాలజీ పెరిగింది. సమాజంలో చదువులు/ఉద్యోగాలు/డబ్బులు పెరిగాయే గానీ సినీహీరోల అభిమానుల బుర్ర మాత్రం అలాగే వుండిపోయింది (ఈ బుర్ర తక్కువతనం కార్పొరేట్ చదువుల నిర్వాకం). ఆనాటి పేడసుద్దలు ఈనాడు online abuses గా రూపాంతరం చెందాయి.

ఈ మనస్తత్వం కలిగున్నవాళ్లే - గోవధ/sexual offences/దొంగతనం సమయాల్లో దొరికిన నిందితుల్ని తీవ్రంగా హింసించి చంపేస్తున్నారు. దీన్ని సైకాలజిలో lynch mob mentality అంటారు. ఇందుక్కారణం సమాజంలో హింస పెరిగిపోవడం, అది యే చిన్న అవకాశం దొరికినా ఇలా ventilate అవుతుంది. గాంధీ పుట్టిన దేశం ఇలా మారిపోవడం ఒక విషాదం.

తమ హీరోని/బాబాని విమర్శించినవారిపై మూకుమ్మడి దాడి చెయ్యడం ఒక సామాజిక రుగ్మత. ఈ జబ్బు యెంత తొందరగా తగ్గితే సమాజానికి అంత మంచిది (లేకపోతే multi organ failure తో చచ్చిపోతుంది). ఈ మూకలు అనాగరికులనీ, అందుకే వారిని తాము దూరంగా పెట్టేస్తామనే పెద్దమనుషులు.. తాము safe zone లో వుండొచ్చు గాక.. కానీ - వారూ ఈ రోగం పెరగడానికి కారకులే!

(fb post)

అంతులేని అజ్ఞానం

కొందరు వ్యక్తులు వయసొచ్చి పరిమాణంలో మాత్రమే పెరుగుతారు. విషయం తెలుసుకోవాలని ప్రయత్నించరు, చెప్పినా అర్ధం చేసుకోరు, పుస్తకం చదివే ఓపిక వుండదు. పూర్తిస్థాయి ఆజ్ఞాని మాత్రమే తన కులం/మతం/ప్రాంతం/భాష/దేశం గొప్పదని విర్రవీగుతాడు.

అందువల్ల - సాధారణంగానే వీళ్లు తమ కులానికి చెందిన రాజకీయ పార్టీనో/సినిమా నటుడినో వెర్రిగా అభిమానిస్తూ బ్రతుకు వెళ్ళమారుస్తుంటారు. ఇలా ఆలోచించే అవసరం లేకుండా బ్రతికేస్తుండటం వల్ల, వీరికి మెదడులో language centers కూడా సరీగ్గా develop అవ్వవు. అందుకే కోపాన్ని వ్యక్తీకరించడానికి బూతుభాషనీ, బెదిరింపుల్నీ ఎంచుకుంటారు.

భారతదేశ ప్రజాస్వామిక విలువల్నీ, భావప్రకటనా స్వేచ్చనీ అర్ధం చేసుకోవడం వీరికి శక్తికి మించిన పని. ఒకప్పుడు ఆధునిక భావజాలంతో కళకళ్లాడిన యువత, నేడు ఆలోచించే శక్తిని కోల్పోయి.. బానిస భావజాలంతో కునారిల్లడం నవీన భారద్దేశంలో ఒక విషాద సమయం.

(ఈ కారణాన, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతూ తీవ్రంగా దుఃఖిస్తున్నాను)

(fb post)

Friday 25 August 2017

గోరఖ్‌పూర్ విషాదం


మనకి స్వతంత్రం వచ్చి డెబ్భైయ్యేళ్ళైంది, గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో డెబ్భైమంది చిన్నారులు పీల్చుకోడానికి ఆక్సిజన్ లేక మరణించారు. What an irony!

మనం అభివృద్ధి పేరుతో ఎత్తైన బిల్డింగులు కడుతున్నాం, వెడల్పాటి రోడ్లని వేస్తున్నాం, రికార్డ్ నంబర్లో శాటిల్లైట్స్ పైకి పంపిస్తున్నాం.. జబ్బుతో తీసుకుంటున్న పసిపిల్లలకి మాత్రం ఆక్సిజన్ అందేలా మాత్రం చెయ్యలేకపోతున్నాం!

Poor living conditions లో జీవిస్తున్న పేదవారికి దోమలు బంధువులు! అంచేత అవి యెడాపెడా వారిని కుట్టేసి vector borne diseases తెప్పించేస్తయ్, నీళ్ళు కలుషితమై water borne diseases వచ్చేస్తయ్.

మనం public health delivary system ని పటిష్టపరచాలంటే మరిన్ని ఆస్పత్రులు కావాలి.. trained personnel కావాలి.. మందులు కావాలి.. వసతులు కావాలి.. రీసెర్చ్ జరగాలి.. వీటన్నింటికీ నిధులు కావాలి.

అందువల్ల తగినంత నిధులు వెచ్చిస్తూ.. అవి సద్వినియోగం అయ్యెలా పర్వవేక్షణ చేస్తూ.. పరిస్థితి మెరుగయ్యేలా చేసుకోవడం బాధ్యత కల ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని.

కానీ - మన దేశం health budget allocation అభివృద్ధి చెందిన దేశాల్తో పోలిస్తే చాలా చాలా తక్కువ. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల్తో పోల్చినా తక్కువే.

అంచేత - ప్రభుత్వాలు health budget allocation ని తక్షణమే పెంచి, public health delivery system ని మెరుగు పరచాలి. లేకపోతే గోరఖ్ పూర్ సంఘటన పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

కాబట్టి - కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై war foot basis న దృష్టి సారించి పరిస్థితుల్ని మెరుగు పర్చాలని కోరుకుంటున్నాను.

(fb post)

Wednesday 16 August 2017

రోజులు మారాయి


సినిమాలు అనేక రకాలు. ఒక్కొక్కళ్లకి ఒక్కోసినిమా ఒకందుకు నచ్చుతుంది/నచ్చదు. చిన్నప్పుడు హాల్లో ఎక్కువగా ఫైటింగ్ సినిమాలు చూశాను, ఆ సినిమాలన్నీ తరవాత చూస్తే విసుగ్గా అనిపిస్తుంటాయి. ఇదొక పరిణామ క్రమం.

తెలుగులో నచ్చిన సినిమాల గూర్చి రాద్దామంటే నాకిప్పుడో భయం పట్టుకుంది. కారణం - వాటి ఇంగ్లీష్ మూలం చెప్పేస్తున్నారు. కాపీ ఐడియాతో సినిమా యెంత గొప్పగా తీసినా, అది మంచి సినిమా అవ్వొచ్చేమోగానీ.. గొప్ప సినిమా మాత్రం అవ్వదని నా అభిప్రాయం.

'తెలుగు సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా యేది?' అని అడగంగాన్లే గత కొన్నేళ్లుగా ఠక్కున 'రోజులు మారాయి' అని చెబుతున్నాను. ఈ సినిమా గూర్చి వివరంగా రాద్దామనే కోరిక తీరలేదు, ఇక తీరే అవకాశమూ లేదని అర్ధమైంది.

'రోజులు మారాయి' పూర్తిగా గ్రామీణ జీవితం. సినిమాలో రైతు జీవితం వుంటుంది, ఇంకేదీ వుండదు. రైతుల భూమిసమస్య, భుక్తి సమస్య, బ్రతుకు సమస్య.. వారి దృష్టికోణంలో చూపిస్తుంది. కులాల కట్టుబాట్లు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తీరు సూటిగా చెబుతుంది. సన్నివేశాల చిత్రీకరణ, కథ మనమధ్యే జరుగుతున్నంత సహజంగా వుంటుంది.

మీరు చూడకపోయినట్లైతే, ఒకసారి చూడదగ్గ సినిమా 'రోజులు మారాయి'. మీకీ సినిమా నాకు నచ్చినంత గొప్పగా నచ్చకపోయినా.. ఎంతోకొంత నచ్చుతుందని నమ్ముతున్నాను.

'రోజులు మారాయి'లోంచి ఒక ముఖ్యమైన సీన్ ఇక్కడ ఇస్తున్నాను (ఆ రోజుల్లో కలెక్టర్లు నిజాయితీ, నిబద్దత కలిగిన మంచి ఆఫీసర్లు - ఈ రోజుల్లోలా కాదు). 

(fb post)

Monday 7 August 2017

విగ్రహాల దుస్థితి


ఈమధ్య మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం చూశాను, విగ్రహం వీణ మీటుతుంది! కలాం పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ శాకాహారాన్నే భజిస్తూ, వీణ మీటుతూ, భగవద్గీత పారాయణం చేస్తూ, హిందూ సన్యాసుల కాళ్లకి మొక్కుతూ.. ఆచరణలో బ్రాహ్మణవాదిగా ప్రచారం పొందాడు. కాబట్టి ఆయన విగ్రహంలో వీణ వుండటం politically correct అనుకుంటాను. 

ఇప్పుడు ఘంటసాల విగ్రహం చూద్దాం - 

ఘంటసాల విగ్రహం తంబురా మీటుతూ వుంటుంది! నాకు తెలిసి ఘటసాల శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినా, ఆ రంగంలో కచేరీలు చెయ్యలేదు. ఒక professional singer గా - సినిమా సన్నివేశాలకి తగ్గట్టు తాగుబోతు పాటలూ, యెట్టాగో ఉన్నాది ఓలమ్మీ! అంటూ గంతులేసే పాటలూ పాడుకున్నాడు. మరి ఘంటసాల విగ్రహంతో తంబురాకేం పనో మనకి తెలీదు.

నాకు తోచిన కారణం - సినిమా పాటల ఘంటసాలకి శాస్త్రీయ సంగీత ఘంటసాలగా ప్రమోషన్ కల్పించడంలో భాగంగా తంబురా వచ్చి చేరింది. అవ్విధముగా ఘంటసాలవారికి పవిత్రత చేకూరింది! ఇదో cultural identity issue.

ఈవిధంగా - విగ్రహాల ద్వారా కూడా వర్తమాన స్థితిగతుల్ని అంచనా వెయ్యొచ్చని నా అభిప్రాయం. 

(fb post)

ఉసైన్ బోల్ట్


ఉసైన్ బోల్ట్ రిటైర్ అయిపొయ్యాడు. 'ఆయనో గొప్ప క్రీడాకారుడు, ఒక శకం ముగిసింది' అంటూ అరిగిపోయిన వాక్యాలు రాయను కానీ.. ఈ సందర్భంగా మన క్రీడాకారుల గూర్చి నాలుగు ముక్కలు.

వంకాయకూర యెంత బాగున్నా మర్నాడు తిండానికి పనికిరాదు. క్రీడాకారులూ అంతే! యెంత గొప్ప క్రీడాకారుడైనా, యెప్పుడోకప్పుడు రిటైర్ అవ్వాల్సిందే. ఈ రిటైర్‌మెంటుల్లో ఒక్కక్కళ్లది ఒక్కోబాణి. కొందరు క్రీడాకారుల రిటైర్‌మెంట్ 'అప్పుడేనా!' అనిపిస్తే, ఇంకొందరు 'యెప్పుడు?' అనిపిస్తారు. ఈ 'యెప్పుడు?' బ్యాచ్‌లో యెప్పుడూ మనవాళ్లే వుంటారు.

గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, టెండూల్కర్.. షెల్ఫ్ లైఫ్ అయిపోయినా టీముని పట్టుకు వేళ్లాడిన ఈ లిస్టు పెద్దది (లేటెస్ట్ ఉదాహరణ ధోనీ). అభిమానులకి రోతపుట్టి 'యాక్' అనేదాకా వీళ్లు రిటైర్ అవ్వలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెలక్టర్లు వీళ్లని చాలా ముందుగానే ఇంటికి పంపేవారు. కానీ మనదేశంలో వీళ్లు సూపర్ స్టార్లు, తీసేసే ధైర్యం సెలక్టర్లకి వుండదు.

మనవాళ్లకీ వేళ్లాడే తత్వం యెందుకు? అందుకు ప్రధాన కారణం "డబ్బు" అని అనుకుంటున్నాను. పేదదేశాల్లో భవిష్యత్తు గూర్చి అబద్రత వుంటుంది, అందువల్ల సంపాదించే అవకాశం వున్నచోట గ్రీడీగా వుంటారు. సంపాదనలో 'చివరి రూపాయిదాకా పిండుకుందాం' అనే కక్కుర్తిలోంచి పుట్టిందే ఈ కెరీర్ పొడిగింపు. 

నా అభిమాన క్రీడాకారుడు ఉసైన్ బోల్ట్ రిటైర్డ్ జీవితం సరదాగా, హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. 

(fb post) 

Saturday 5 August 2017

రెండుకోరికలు


"దశరధ మహారాజా! ఆనాడు మీరు నాకు రెండుకోరికలు ప్రసాదించారు, ఇప్పుడు కోరవచ్చునా?"

"నీదే ఆలస్యం కైకా!"

"అయితే వినండి. మొదటి కోరిక - అర్నబ్ గోస్వామిగాడి నోరు మూతబడాలి. రెండో కోరిక - పెట్రోల్ రేట్లు GST పరిధిలోకి రావాలి."

"కైకా! నీకిది న్యాయం కాదు. నువ్వు కోరాల్సింది రాముణ్ని అడవులకి పంపించమని, భరతుడికి పట్టాభిషేకం చేయించమని."

"రాత్రి 'సంపూర్ణ రామాయణం' సినిమా చూశాను. కైకేయిని విలన్‌గా చూపించారు, నాకు నచ్చలేదు. అందుకే స్వార్ధం వీడి ప్రజాక్షేమం కోసం అడుగుతున్నాను. ఇంతకీ నా కోరికలు తీరుస్తారా? తీర్చరా?"

"హయ్యో! యెంత పన్జేశావు కైకా! అసాధ్యమైన కోరికలు కోరి మన రఘవంశం పరువు తీసేశావు. భగవాన్! ఇప్పుడు నాకేది దారి?"

(fb post)

Wednesday 2 August 2017

యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!

కాఫీ ఆలోచన (కాఫీ తాగేప్పుడు వచ్చిన ఆలోచన) :

నేను చదూకునే రోజుల్లో మెడికల్ కాలేజిలో చెట్లు, క్రోటన్స్‌తో అందమైన తోట వుండేది. ఆ తోటలో సిమెంట్ బెంచీఅ మీద కూచుని రకరకాల కబుర్లు, చర్చలు. ఆరోజు థియరీ క్లాసులో ముఖ్యమైన పాయింట్లు.. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ దురాగతాలు.. వియత్నాంలో అమెరికా దుర్మార్గాలు.. అయోధ్యలో రామాలయం తలుపులు.. అమెరికా సోవియట్ల కోల్ద్ వార్.. అదొక ఓపెన్ ఫోరం.

1970 లలో యెంతో చైతన్యంతో కళకళ్లాడిన విద్యార్ధిలోకం ఆ తరవాత అనేక ఆటుపోట్లకి గురైంది.

టీవీలొచ్చేశాయ్, లైవ్ ప్రసారాలతో వల్ల క్రికెట్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింద్. టీవీలో వార్తలు వస్తుంటే న్యూస్‌పేపరెందుకు దండగ అనే ఆలోచన మొదలైంది. ఇంకొన్నాళ్లకి కార్పొరేట్ విద్యాసంస్థలొచ్చేశాయ్, కేజీల చదువులు మొదలైనయ్. విద్యార్ధిలోకం చదువుల్తో, క్రికెట్‌తో బిజీబిజీ.. పుస్తకాలు చదవడం తగ్గిపోయింది.

"ఇరాక్ మీద అమెరికా యుద్ధం సరికాదు!"

"యెక్కడోవున్న ఇరాక్ గూర్చి నీకెందుకు? చదువుకో, బాగుపడతావ్!"

సెల్ ఫోన్లొచ్చేశాయ్!

"గుజరాత్ మారణకాండ దారుణం!"

"గుజరాత్ గూర్చి మనకెందుకు బ్రదర్? సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చుగా!"

స్మార్ట్ ఫోన్లొచ్చేశాయ్!

"పాకిస్తాన్ తన దేశప్రజల్ని యేమార్చడానికి మతరాజకీయాల్ని ప్రమోట్ చేస్తుంది."

"పాకిస్తాన్‌ ముస్లిం దేశం, ఒక ఆటం బాంబ్ వేసేస్తే పీడా విరగడవుతుంది."

ఇవ్వాళ యెవరికీ యెవర్తో సంబంధాల్లేవ్. సమాజం గూర్చి కాదు, పక్కింటివాడి గూర్చి ఆలోచించే ఆసక్తి లేకుండాపోయింది.

ఆధిపత్య కులాల ఆరాటం, వారి అణచివేత ఆలోచనలూ మర్యాదస్తుల భావజాలంగా మారిపోయింది. రాజకీయ పార్టీ నాయకులు, సినిమా హీరోలు కులాలవారిగా తమవారిని ప్రమోట్ చేసుకోడం మొదలెట్టారు.

ఫలితంగా -

యువత సినిమా హీరోల వెంట పడ్డారు. తమ హీరో రాజకీయాల్లోకొచ్చి తమని ఉద్ధరించాలనే పనికిమాలిన వాదం మొదలైంది. బహుశా రాజకీయ భావజాలంలో ఇంతకుమించిన భ్రష్టత్వం మరేదీ లేదు.

తెలుగునాట తెలుగు తగ్గుతుందని బాధపడుతున్నారు కొందరు. అసలు ఆలోచించే సమాజమే కుంచించుకుపోయిందని నా ఆవేదన.

'యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!'

(fb post)

Monday 31 July 2017

దేవుడున్నాడా? లేడా?


తొమ్మిదో క్లాసు చదివేప్పుడు ఫస్ట్ మార్కు కోసం నాకూ, పుచ్చా పవన్‌గాడికీ మధ్య తీవ్రమైన పోటీ వుండేది. పవన్‌గాడిని మార్కుల్లో యెలాగైనా వోడించాలనే కుట్రబుద్ధితో నెల్రోజులపాటు పరమ నిష్టాగరిష్టుడనై దేవుణ్ని ప్రార్ధించాను, పూజించాను, వేడుకున్నాను. కానీ ఈసారి పరీక్షల్లో నా మార్కులు దారుణంగా తగ్గిపొయ్యాయి.

ఆనాడు నాకు జ్ఞానోదయం అయ్యింది - 'దేవుడున్నాడా? లేడా? వొకవేళ దేవుడున్నా, ఆ దేవుడికి నాపట్ల ఆసక్తి లేదు, ఉపయోగపడే ఉద్దేశం లేదు. నాకు ఉపయోగపడని దేవుడి గూర్చి నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి?' - ఆరోజు నుండి దేవుణ్ని పట్టించుకోడం మానేశాను.

అయితే కొన్నాళ్లుగా మదీయ మిత్రుడు .. "ఆ దేవదేవుడు కరుణామయుడు, వొక్కసారి నీ కోరిక తీర్చలేదని పక్కన పెట్టేస్తావా? సెకండ్ ఛాన్స్ యివ్వావా? నీ తొమ్మిదోక్లాసు పవిత్ర హృదయాన్ని బయటకి లాగు, దేవుణ్ని భక్తితో ప్రార్ధించి కావల్సింది కోరుకో." అని చెప్పసాగాడు. నాకు మావాడి లాజిక్ నచ్చింది.

నా చదువైపోయింది, ప్రాక్టీసూ బానే వుంది. ఇంకేం కోరుకోను? ఆలోచించగా - నా దగ్గర సింగిల్ మాల్ట్ స్టాక్ నిండుకుందని గుర్తొచ్చింది. ప్రస్తుతం నాకిదే అవసరం, అదేదో దేవుణ్నే అడిగి చూద్దాం.

"దేవుడా! నాకు రెండు Glenmorangie 18 ప్రసాదించు, రేప్పొద్దున్నే అవి హాల్లో టీపాయ్ మీద వుండేలా చూడు." రాత్రి పడుకోబొయ్యే ముందు పవిత్రంగా, తీవ్రంగా దేవుణ్ని ప్రార్ధించాను.

తెల్లారింది -

ఆశ్చర్యం! హాల్లో టీపాయ్ మీద రెండు సింగిల్ మాల్టులు!

'దేవుడున్నాడు! అయ్యో ఇంతకాలం దేవుణ్ని నిర్లక్ష్యం చేశానే! దేవుడా! ఈ దుష్టపాపిని మన్నించు.' అని పరితప్త హృదయంతో పశ్చాత్తాపపడబోతుండగా -

హోల్డాన్!

ఇవి సింగిల్ మాల్టులే గానీ, బ్రాండ్ మాత్రం Glefiddick cask collection!

యెందుకిలా జరిగింది? నా ప్రార్ధన దేవుడికి సరీగ్గా వినబళ్లేదా? దేవుడికి ఇంగ్లీషు రాదా? దేవుడికి బ్రాండ్ కాన్షస్‌నెస్ లేదా?

మహిమగల దేవుడైతే యేదడిగితే అదే ఇవ్వాలి. అంతేగానీ దొండకాయలడిగితే బెండకాయలిచ్చినట్లు, నేనడిగింది కాకుండా ఇంకోటి ఇవ్వడంలో దేవుడి అంతరార్ధం యేవిఁటి?

కాబట్టి -

విషయం మళ్లీ మొదటికొచ్చింది.

'దేవుడున్నాడా? లేడా?'

(fb post)

Sunday 9 July 2017

డా.వి.చంద్రశేఖరరావు


డాక్టర్ వి. చంద్రశేఖరరావు నాకు గుంటూరు మెడికల్ కాలేజిలో క్లాస్మేట్, 'చంద్రశేఖర్‌'గా పరిచయం. కారణం తెలీదు, అతన్ది లేట్ ఎడ్మిషన్. అందువల్ల ఎనాటమీలో నా బాడీమేట్ (ఒకే శవంపై డిసెక్షన్ చేసేవారిని బాడీమేట్స్ అంటారు) అయ్యాడు.

చంద్రశేఖర్ ఒకేడాది మెడికల్ కాలేజీ మేగజైన్ బాధ్యతల్ని చూశాడు. యెవరో రావిశాస్త్రిట, గొప్పతెలుగు రచయితట, ఇంటర్వ్యూ చేస్తానన్నాడు! 'కనీసం వొక్క పేజిలోనైనా నవ్వొచ్చేట్లు చూడరా' అన్నాను. అనుకున్నట్లే మేగజైన్‌లో ఒక్కనవ్వు కూడా లేదు!

మా కాలేజీలో జయప్రకాష్ నారాయణ అనే అతను సివిల్స్ రాసి ఐయేఎస్ అయ్యాడు. దాంతో ఈ సివిల్స్ రోగం కొందరికి గజ్జిలా పట్టుకుంది. ఒకపక్క దేశానికి డాక్టర్ల కొరత వుంది, ఇంకోపక్క వీళ్లిలా మెడికల్ సీట్లు వేస్ట్ చెయ్యడం సరికాదని నా అభిప్రాయం. ఆ రోగం మా చంద్రశేఖరుకీ పట్టి అదేదో రైల్వే ఉద్యోగంలో చేరాడు.

మా క్లాస్మేట్ సమూహం గమ్మత్తైనది. వీరికి కొన్నివిషయాలు బాగా తెలుసు, ఇంకొన్ని విషయాలు బొత్తిగా తెలీదు. ఈ బొత్తిగా తెలీని విషయాల్లో తెలుగు సాహిత్యం ఒకటి. నేను మా బ్యాచ్‌లో ఆవఁదం వృక్షాన్ని!

"మీకు తెలుసా? మన రైల్వే చంద్రశేఖర్ కథలు రాస్తున్నాట్ట!" వొక క్లాస్మేట్స్ పార్టీలో అన్నాను.

"ఎందుకు?" అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యపోయారు.. నేను బిత్తరపొయ్యాను. 

ఆపుడప్పుడు నా హాస్పిటల్‌కి వచ్చేవాడు, తన పుస్తకం యేదోటి ఇస్తుండేవాడు. మా సంభాషణ యెక్కువగా స్నేహితుల గూర్చే వుండేది.

చంద్రశేఖర్ కథలు కొన్ని చదివాను గానీ, నాకవి సాధారణ కథలుగా అనిపించాయి, అటుతరవాత వాణ్నెప్పుడు చదవడానికి ప్రయత్నించలేదు. 

నా క్లాస్మేట్, నా స్నేహితుడు చంద్రశేఖర్ మరణానికి బాధ పడుతూ.. 

గుంటూరు మెడికల్ కాలేజి 1976 బ్యాచ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాను. 

(fb post)

Friday 30 June 2017

గోరక్షక దాడులు ఆగేనా?


రాజ్యంగం ప్రకారం భారద్దేశం సెక్యులర్ దేశం. అనగా రాజ్యానికి అన్ని మతాలూ సమానమని అర్ధం. ఈ దేశంలో అనేక మతాలున్నయ్. ఒక్కో మతానికి ఒక్కో జంతువు పవిత్రం లేదా అపవిత్రం. ఇవన్నీ ఆయా మతాల్ని తుచ తప్పకుండా అనుసరించేవారి సమస్య. సామాన్య ప్రజలకి విద్య, వైద్యం, ఉద్యోగం మొదలైనవి సమస్య (ఇవి ఒకదానికి ఇంకోటి interchangeable కాదు). 

మొన్న సార్వత్రిక యెన్నికల్లో సంఘపరివార్ శక్తులు అధికారంలోకి వచ్చాయి (ఇందుగ్గానూ వారు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పాలనకి కృతజ్ఞులై వుండాలి). సంఘపరివార్‌కి ఈ దేశ ముస్లిములు శత్రువులు. ముస్లిముల్ని అణచడానికి వారికి దొరికిన చక్కని ఆయుధం 'గోరక్షణ'. ఇప్పుడు వారు చేస్తుంది - ఆవుగూర్చి విపరీతమైన హైప్ క్రియేట్ చెయ్యడం, గోరక్షక దళాల ద్వారా ముస్లిముల జీవించే హక్కు కాలరాయడం. ఈ వ్యవహారాలన్నీ పకడ్బందీ వ్యూహంతో నిరాటంకంగా అమలవుతున్న కుట్రపూరిత హత్యలు.

మన్ది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజలచే యెన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే పన్జెయ్యాలి, ప్రజలకి జవాబుదారీతనం వహిస్తూ పాలన సాగించాలి. మహమ్మద్ అఖ్లాక్ హత్య దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కొన్ని నెలల నిశ్శబ్దం తరవాత గోరక్షకులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని తీవ్రంగా హెచ్చరించారు. గోరక్షకులు నేరస్తులనీ, వారి గూర్చి రాష్ట్రాల నుండి నివేదిక తెప్పిస్తామని సెలవిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి కఠినంగా మాట్లాడ్డంతో నేను చాలా సంతోషించాను. ప్రధాని స్థాయి వ్యక్తి తల్చుకుంటే ఈ గోరక్షక హత్యలు చిటికెలో ఆగిపోతాయని ఆశించాను.

యే దేశంలోనైనా, దేశాధినేత స్థాయి వ్యక్తి హామీ ఇచ్చాక, ఆ దిశగా కొన్ని చర్యలు మొదలవుతాయి. అందువల్ల ప్రధాని ప్రసంగం తరవాత కేంద్రం రంగంలోకి దిగాలి. శాంతిభద్రతలు రాష్ట్రాల సబ్జక్ట్ అయినప్పటికీ కేంద్ర హోమ్ శాఖ రాష్ట్రాలకి సూచన జారీ చేసే అధికారం వుంటుంది. గోరక్షకుల కదలిక పట్ల నిఘా, ప్రజాసంఘాల యేర్పాటు తదితర చర్యలతో కూడిన పలు సూచనల్ని కేంద్రం యివ్వొచ్చు. కానీ కేంద్ర హోమ్ శాఖ ఆ దిశగా యెటువంటి చర్యలూ తీసుకోలేదు, సహజంగానే రాష్ట్రప్రభుత్వాలూ పట్టించుకోలేదు. ఆ విధంగా ప్రధాని దేశప్రజలకి ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయింది.

ఇప్పుడు సబర్మతి ఆశ్రమంలో గోరక్షక ముఠాల హత్యల్ని ప్రధాని (మళ్లీ) తీవ్రంగా ఖండించారు. అందుగ్గానూ వారికి (మళ్లీ) ధన్యవాదాలు. అయ్యా! ఈ సారైనా మీ ఆగ్రహం నరహంతక గోరక్షక ముఠాల నిర్మూలనకి దారి తియ్యాలనీ, తద్వారా ఈ దేశంలో మరే యితర మూక దాడుల హత్యలు జరక్కుండా ఆగిపోవాలని కోరుకుంటున్నాను.

(fb post)

Wednesday 28 June 2017

మిలిట్రీ బాబాయ్

ఈమధ్య యే టీవీ చానెల్ చూసినా మా మిలిట్రీ బాబాయే! పొడుగాటి ముక్కుతో, తీక్షణమైన కళ్ళతో, బొర్రమీసాల్తో - కోపానికి మనిషి వేషం వేసినట్లుంటాడు మా మిలిట్రీ బాబాయ్. రిటైరయ్యాక కాలక్షేపంగా వుంటుందని కొన్నాళ్లుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్నాడు. 

"కాశ్మీర్ లోయని కార్పెట్ బాంబింగ్ చెయ్యాలి."

"కాశ్మీరీ ప్రజల్ని థార్ యెడార్లో వదిలెయ్యాలి."

"స్టోన్ పెల్టర్స్‌ని బహిరంగంగా ఉరి తియ్యాలి."

"పాకిస్తాన్‌పై ఆటమ్ బాంబ్ పేల్చేందుకు ఇదే సరైన సమయం."

"కాశ్మీరీ స్త్రీల యాపిల్ బుగ్గల్ని పైనాపిల్ బుగ్గలుగా చేసెయ్యాలి."

మా మిలిట్రీ బాబాయ్ కోపం వణికిపోతున్నాడు.

పిన్నికి ఫోన్ చేశాను.

"పిన్నీ! ఈ వయసులో బాబాయ్ అరవకూడదు. ఆయనకసలే బీపీ, యెంత ప్రమాదమో తెలుసా?" అన్నాను.

"నేనేం చెయ్యను? అలా అరుస్తుంటే ఆయనకి సరిహద్దులో యుద్ధం చేసినంత మజా వస్తుందిట. ఆయనింట్లో వుంటే నన్నరుస్తాడు, ఆ టీవీ స్టూడియోల్లో వుంటేనే నాకు హాయి." అంది పిన్ని.  

(fb post)

Friday 16 June 2017

సిన్మా లాజిక్

'సిన్మా ఎంజాయ్ చెయ్యాలంటే ప్రేక్షకుడు లాజిక్ అప్లై చెయ్యకూడదు' - వొప్పుకుంటున్నాను. కానీ లాజిక్‌ని అప్లై చెయ్యడం, చెయ్యకపోవడం ప్రేక్షకుడి చేతిలో వుండదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రేక్షకుడు అంటే నేనే కనుక, నా సంగతే రాస్తాను.

నా లాజిక్ కండిషన్డ్‌గా, బయాస్డ్‌గా, సెలక్టివ్‌గా వుంటుంది. 

చార్లీ చాప్లిన్, రాజ్ కపూర్ సినిమాల్లో లాజిక్ నాతోపాటుగా (with rapt attention) సిన్మా చూస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్ సిన్మాలకి నిద్రపోతుంది.  కె.రాఘవేంద్రరావు BA సినిమాలకి లాజిక్ హాల్లోక్కూడా రాదు, బయట క్యాంటీన్ దగ్గర తచ్చాడుతుంటుంది.

అందువల్ల నా లాజిక్ కొన్ని సిన్మాల్లో డాక్టర్ పేషంట్ పల్స్ చూసి 'కంగ్రాచ్యులేషన్స్! మీరు తల్లి కాబోతున్నారు' అంటే నవ్వేసుకుంటుంది, ఇంకొన్ని సినిమాల్లో అదే సీన్ వుంటే వొప్పుకోదు - కోపం తెచ్చుకుంటుంది.  

'అమర్ అక్బర్ ఆంథోని'లో ఒకేసారి ముగ్గురు హీరోలు తల్లికి రక్తదానం చేస్తారు. మన్మోహన్ దేశాయ్ సిన్మా కాబట్టి లాజిక్‌గాడు పట్టించుకోలేదు. ఇదే సీన్ యే శ్యామ్ బెనెగల్ సిన్మాలోనో వుంటే లాజిక్‌గాడు చిందులేసేవాడు. 

అలాగే -

అందరూ సిన్మాల్ని ఒకేరకంగా చూడరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దృష్టికోణం వుంటుంది. 'ఆకుచాటు పిందె తడిసె' పాటలో తడిసిన శ్రీదేవి కోసం ఆరుసార్లు సినిమా చూశా (భరించా)! నా క్లాసమ్మాయిలు 'అసలు 'వేటగాడు' ఆరుసార్లు చూసే సినిమానేనా?' అంటూ నన్ను విసుక్కున్నారు, వాళ్ళకెలా చెప్పేది? 

నాకు నచ్చిన ప్రేక్షకుడు -

నా చిన్ననాటి స్నేహితుడు మాతోపాటు అన్ని సినిమాలకీ వచ్చేవాడు, సిన్మా మొదలవ్వంగాన్లే నిద్రపొయ్యేవాడు. 'శుభం' కార్డు పడ్డాక లేపుకొచ్చేవాళ్ళం. శంకరాభరణం సిన్మాక్కూడా నిద్రపోయిన ఘనత నా స్నేహితుడిది. మరప్పుడు సిన్మాకెందుకు రావడం? 'స్నేహధర్మం' అని సమాధానం చెప్పేవాడు!  

(fb post)

Wednesday 14 June 2017

'ఖోపం మూడ్'


"ఆ ఏంకరబ్బాయ్ ఖోపంతో ఊగిపోతున్నాడు? బీపీ పెరిగి చస్తాడేమో!"

"డోంట్ వర్రీ! అది ఉత్తుత్తి ఖోపమే!"

"ఉత్తుత్తి ఖోపమా! యెందుకు?"

"అతను రోజూ న్యూస్ డిబేట్ చేస్తాడు, కానీ వాస్తవానికి అది న్యూస్ కాదు. యేదోక పనికిమాలిన విషయం తీసుకుని, అతిధులుగా పెయిడ్ ఆర్టిస్టుల్ని పిలిపించి, వారిపై అరుపులు కేకల్తో మనకో ఏక్షన్ సినిమా చూపిస్తాడు!"

"గ్రేట్."

"ఏం గ్రేటో ఏమో, పాపం - 'ఖోపం మూడ్' కోసం అతను చాలా ప్రిపేర్ అవుతాడు, అందుకోసం అతనికో స్పెషల్ స్టాఫ్ కూడా వుంది."

"స్పెషల్ స్టాఫ్! వాళ్ళేంచేస్తారు?"

"న్యూస్ డిబేట్‌కి ఓ అరగంట ముందు అతనికి ఒళ్ళంతా ఉప్పూకారం రాస్తారు, ముక్కులో నిమ్మరసం పిండుతారు. 'బాబోయ్ మంట' అంటూ అతనెంత మొత్తుకున్నా వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతారు. ఆ విధంగా అతను 'ఖోపం మూడ్' తెచ్చేకుంటాడు."

"అప్పటికీ 'ఖోపం మూడ్' రాకపోతే?"

"నథింగ్ టు వర్రీ! పిచ్చికుక్కల్తో కరిపించుకుంటాడు, డ్యూటీ పట్ల అతని కమిట్మెంట్ అలాంటిది!"

"పిచ్చికుక్కలా? వార్నాయనో! రేబీస్ వస్తుందేమో?"

"నో, నో.. ఒక పిచ్చికుక్క ఇంకో పిచ్చికుక్కని కరిస్తే రేబీస్ యెలా వస్తుంది?! రాదు."

(fb post)

Tuesday 13 June 2017

గర్భ విజ్ఞాన సంస్కారం

మీకు తెల్లగా, పొడుగ్గా వుండే పురుష సంతానం కావాలా? అట్లైన ఈ క్రింది సూత్రములు పాటించవలెను.  

- ముందుగా దంపతులు మూణ్నెళ్లపాటు 'శుద్ధికరణం' పాటించాలి (అంటే బ్రహ్మచర్యం).

- దంపతుల తమతమ జాతకరీత్యా గ్రహస్థితుల్ని అనుసరించి పండితుల్తో పెట్టబడిన ముహూర్త సమయాన ఒక్కటవ్వాలి ('సెక్స్' పదం అత్యంత అసభ్యకరం, అంచేత వాట్టానికి వీల్లేదు). 

- దంపతులు కలిసే ముహూర్తానికి ముందు ఒక మాసంపాటు బాబా రామ్ దేవ్ ఫార్మసీవారి  'దివ్యపుత్రజీవక్' ఔషధం సేవించాలి (లేనట్లైనా స్త్రీ సంతానం కలిగే ప్రమాదం కలదు). 

- గర్భం ధరించిన స్త్రీ యెట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టరాదు, శాకాహారం మాత్రమే తీసికొనవలెను (ఇంగ్లీషు వైద్యులు మాంసాహారంలో చక్కటి ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఉంటాయని చెత్తకబుర్లు చెబుతారు - వారిది విదేశీ అజ్ఞానం అని గ్రహించగలరు) 

- పురుషుని గూర్చి అసభ్య ఆలోచనలు (అనగా స్త్రీపురుష సంయోగ ఆలోచనలు) మనసులోకి రానివ్వరాదు, ఇందుకు భర్త అతీతుడు కాదు (ఇంగ్లీషు వైద్యులు గర్భం నాలుగో నెల నుండి సంయోగం చేసుకోవచ్చునని అంటారు - వారిది విదేశీ విచ్చలవిడి జ్ఞానం అని గ్రహించవలెను). 

- గర్భం సమయాన చెడ్డవారికి, ముఖ్యంగా భర్తకి, దూరంగా వుండవలెను (వాడు మిమ్మల్ని సంయోగం కొరకై కెలకవచ్చును). 

- గదినిండా రాముడు, కృష్ణుడు కేలండర్లు వేలాడదీసి వాటినే చూస్తుండవలెను (మహేశ్ బాబు, ప్రభాస్‌ల కేలండర్లు నిషిద్ధము). 

- ఎల్లప్పుడూ ఘంటసాల భగవద్గీత, సుబ్బులక్ష్మి సుప్రభాతంలను మాత్రమే వినవలెను (సినిమా పాటలు నిషిద్ధము). 

- నెలలు నిండాక మంత్రసానికి కబురంపండి. పవిత్రమైన మంత్రోచ్చరణ కావిస్తూ 'స్వదేశీ డెలివరీ' చేయించుకోండి. 

ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి - దబ్బపండులా, తెల్లని మేనిఛాయలో కిలకిలా నవ్వుతున్న (పవిత్ర పసిపాపలు యేడవరాదు) మీ బిడ్డని గాంచండి. 

మేరా భారత్ మహాన్! భారత్ మాతా కీ జై!!

(fb post 14/6/2017)

Tuesday 6 June 2017

బండబారిన బుర్రలు

మనుషులకి మెదడు వుంటుంది, బుర్ర వుంటుంది, ఆలోచనలుంటయ్. అయితే ఆ ఆలోచనల్ని యే స్థాయికి తీసుకెళ్ళాలనేది ఆ మనిషి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. బుర్రకి కత్తితో సారూప్యత వుంది. రెండూ కూడా సాను పెట్టిన కొలదీ పదును దేరుతాయి. వాడకం తగ్గిస్తే రెండూ తుప్పట్టి బండబారిపోతాయి.

ఈమధ్య బండబారిన బుర్రలు యెక్కువయ్యాయి. మన దేశం గొప్పది, మన సైన్యం గొప్పది, మన మతం గొప్పది, మన ప్రాంతం గొప్పది, మన భాష గొప్పది, మన కులం గొప్పది. 'మనది' అన్నది ప్రతిఒక్కటీ గొప్పదే! అన్నింటిలో బల్లగుద్ది మొహం మీద చరిచే 'స్పష్టమై'న భావాలు. ఈ అభిప్రాయాల్ని ప్రశ్నిస్తే ఖోపం వస్తుంది!

ఉదాహరణకి -

కాశ్మీర్ లోయలో రాళ్లు విసిరేవాళ్ళు టెర్రరిస్టులు, కాదన్నవాళ్ళు టెర్రరిస్ట్ సమర్ధకులు! హురియత్ నాయకుల్తో మాట్లాడాలనేవాళ్ళు దేశద్రోహులు (ఈ లెక్కన నెహ్రు నుండి వాజపేయి దాకా అందరూ దేశద్రోహులే)! సమస్యని అర్ధం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించుకుందామనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు సూడో-సెక్యులరిస్టులు! కాశ్మీర్ సమస్యని క్రిటికల్/రేషనల్ గా ఆలోచించమన్నవాళ్ళు సూడో-మేధావులు!

ఒక క్లిష్టమైన సమస్యని yes or no స్థాయికి దించెయ్యడం రాజకీయ అవకాశవాదం. అధికారానికి మోకరిల్లి బాకాలూదే నేటి బ్రతక నేర్చిన మీడియా ప్రజల్ని దేశభక్తి మత్తులో ముంచి తన పబ్బం గడుపుకుంటుంది. ఇక్కడ కొందరికి బుర్ర ఉపయోగించడం తెలీదు, ఇంకొందరికి తెలిసినా చెప్పరు. మనమీ దుస్థితి నుండి బయటపడే అవకాశం ఇప్పుడప్పుడే లేదని అనుకుంటున్నాను.

(fb post 6/6/2017)

Sunday 4 June 2017

మీడియా దొంగాట

యుద్ధం పాశవికమైనది, మానవాళికి నష్టదాయకమైనది. అనాదిగా ఈ ప్రపంచం యుద్ధాలకి పరిహారాన్ని చెల్లించుకుంటూనే వుంది. చిన్నపాటి పొలంగట్టు తగాదాలే వైరిపక్షాలకి కోలుకోలేని దెబ్బ తీసేస్తాయి. రెండుదేశాల మధ్య తగాదాలు ఆ రెండుదేశాల అభివృద్ధిని అడ్డుకుంటాయి, తీవ్రసంక్షోభంలోకి నెట్టేస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని యెన్నుకుంటారు. ప్రభుత్వం ప్రజల తరఫున, ప్రజల కొరకు పనిచెయ్యాలి. ప్రభుత్వం పనిచెయ్యడంలో తేడాలు రాకుండా ప్రజల పక్షాన నిలబడ ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన పాత్ర మీడియాది. 

ఇవ్వాళ దేశప్రజలకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలేదు, యెందుకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యెందుకు? విద్యారంగంలో లోపాలు సవరించుకోలేకపోతున్నాం, యెందుకు? నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, యెందుకు? వినిమయ వస్తువుల ధరలు తగ్గట్లేదు, యెందుకు? ఈ 'యెందుకు?'కి సమాధానం దిశగా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. మీడియా తన బాధ్యతని యెందుకు విస్మరిస్తుంది? 

టీవీ చర్చలు - ఒకప్పుడు రాత్రిళ్ళు మాత్రమే జరిగేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్‌లాగా రోజంతా కొనసాగుతున్నయ్! యెక్కువ శాతం యెడతెగని ఊకదంపుడు కాశ్మీర్ చర్చలే! పోనీ చర్చల్లో 'కాశ్మీర్ సమస్యని పరిష్కరించేందుకు కేంద్ర హోమ్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలేంటి?' అంటూ చర్చించరు. యెంతసేపటికీ - 'దేశద్రోహ హురియత్', 'రాళ్లు విసుర్తున్న ముష్కర మూకలు' వంటి చౌకబారు టాగ్ లైన్లతో రెచ్చగొట్టే కేకలే!

'పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, యుద్ధం చెయ్యాలి, అవసరమైతే అణుబాంబు పేల్చాలి!' ఇట్లాటి భీభత్సమైన ఆలోచనల్తో మిలిటరీ నిపుణుల సలహాలు! 'యుద్ధం వద్దు' అంటే - ఆర్మీ నైపుణ్యాన్ని కించపరుస్తున్నావంటూ హేళన! ప్రస్తుతం మన టీవీ చానెళ్ల పరిస్థితి ఇదీ!

ప్రజల రోజువారీ సమస్యలకి వందోవంతు ప్రాధాన్యతనిస్తూ, సరిహద్దు సమస్యని వందరెట్లు పెద్దదిగా చూపిస్తున్న మీడియా విశ్వాసనీయత ఏంటి? ప్రభుత్వం 'అసలు' సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొన్ని నకిలీ సమస్యల్ని సృష్టిస్తుంది. మీడియా ఈ అప్రధాన నకిలీ వార్తలకి వత్తాసు పలకడంలో బయటకి కనపడని కోణం ఇంకేదైనా వుందా? అసలు ఇండియా కాశ్మీర్‌లో అంతర్భాగమా? కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా? 

ఆదివారం పదినిమిషాలు టీవీ చూస్తేనే ఇన్నేసి ప్రశ్నలొస్తున్నయ్! ఈ ప్రశ్నలకే కాదు, యే ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సినవాళ్ళు చెప్పరు. మనం మాత్రం రోజువారీ మీడియా తమాషాని గుడ్లప్పగించుకుని చూస్తూనే ఉంటాం, ఇంతకన్నా దురదృష్టమేముంది!

(fb post 4/6/2017)

Friday 2 June 2017

గొప్పసినిమాకి నా క్రైటీరియా

సినిమాలు అన్నీ అందరికీ నచ్చవు. నచ్చిన సినిమాలోనూ అందరికీ ఒకే విషయం నచ్చదు. మృదువైన సింగిల్ మాల్ట్, ఘనమైన ఉప్మాపెసరట్టులు కూడా కొందరికే నచ్చుతాయి. నాకు 'డాక్టర్ చక్రవర్తి'లో జగ్గయ్య అర్ధమయ్యాడు, నాగేశ్వరరావు చిర్రెత్తించాడు. 'ముత్యాలముగ్గు'లో సంగీత బోరు కొట్టించింది, హలం భలేగా నచ్చింది! 

ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - మొన్నటిదాకా తెలుగు సినిమాలు భీభత్సంగా చూసేశానని అనుకున్నాను. కానీ - విశ్వనాథ్ ఫాల్కే ఎవార్డ్ సమయంలో, దాసరి మరణం సందర్బంగా నాకు అర్ధమైందేమనగా.. నేను గొప్ప సినిమాలు అతితక్కువ చూశానని!

సినిమా అనేది పూర్తిగా కాలక్షేపం వ్యవహారం - పన్లేనివారు అదేపనిగా చూస్తారు, లేకపోతే లేదు. కానీ - యెన్నో సినిమాలు చూసిన నేను గొప్ప సినిమాలకి కిలోమీటర్ల దూరంలో యెందుకుండిపొయ్యాను? నాకు వెంటనే తట్టిన సమాధానం.. 'నా సినిమా జానర్ వేరు' అని. 

గొప్పసినిమాకి నా క్రైటీరియా యేమనగా -

శ్రీదేవి సినిమాలన్నీ గొప్ప సినిమాలే! సినిమాలో జ్యోతిలక్ష్మి లేక జయమాలిని డ్యాన్స్ వుంటే అది మరింత గొప్ప సినిమా అవుతుంది. కథకి అవసరం కాబట్టి హీరో వుంటాడు గానీ నా దృష్టిలో హీరో విలువ పూచికపుల్ల కన్నా తక్కువ. అదీగాక - ఒక మగాడు ఒక మగ నటుణ్ని తీవ్రంగా అభిమానించి, ప్రేమించడం latent homosexuality అయ్యుండొచ్చనే అనుమానం నాకుంది.  

పచ్చని పారాణి, ఎర్రని కుంకుమ, ప్రాచీన సాంప్రదాయాలు, పవిత్ర కళలు నా వొంటికి సరిపడవు.. విశ్వనాథ్ ఔట్. పరిషత్తు నాటకాల్లా చాంతాడు డైలాగులంటే భయం.. దాసరి ఔట్! కుదిర్తే పౌరాణిక శ్రీరాముడు, కుదరకపోతే సాంఘిక శ్రీరాముడు - ఆసక్తి లేదు.. బాపు ఔట్!  

నేనిలా నాదైన exclusion criteria ఫాలో అయిపోవడం వల్ల ప్రజలు మెచ్చిన అనేక గొప్ప చిత్రరాజముల్ని మిస్సైతిని. ఇందుకు నేనేమీ చింతించడం లేదు, కారణం - నాక్కావాల్సిన సినిమాలు నే చూసుకున్నాను, అందుగ్గానూ మిక్కిలి సంతోషిస్తున్నాను!

(fb post .. )

Saturday 27 May 2017

'సూపర్ కాప్'



పంజాబ్ 'సూపర్ కాప్' గిల్ వృద్దాప్యంతో చనిపొయ్యాట్ట. ఈ సూపర్ కాప్‌ల పట్ల మధ్యతరగతి మేధావుల్లో ఆరాధనా భావం వుంది. అయితే వారి ఆరాధనలో కొంతభాగం సూపర్ కాప్ సృష్టించినవారికి చెందాలని డిమేండ్ చేస్తున్నాను. యెవరా సృష్టికర్తలు? యేమా కథ?

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగర్ బత్తీ అయితే పాలకులకీ ప్రజలకీ అనుసంధానమైనది పోలీసు వ్యవస్థ. కాబట్టే పోలీసు వ్యవస్థని పాలకులు తమ కనుసన్నల్లో నడుచుకునేట్లు చూసుకుంటారు. అప్పుడు పోలీసు వ్యవస్థ నేరాల్ని అదుపు చేస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' అదుపు అయ్యుంటుంది, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' నిస్పాక్షికత అయ్యుంటుంది.

రాజకీయ వ్యవస్థలో అధికార పక్షం, ప్రతిపక్షం వైరిపక్షాలని అనుకుంటాం గానీ, వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకటే! చదరంగంలో నలుపు తెలుపు పావులకున్న తేడా మాత్రమే వుంటుంది. అధికారంలో ఉన్నవారిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికార పక్షం  రాజకీయ చదరంగం అడుతుంటాయి. ఇవన్నీ దాయాదుల మధ్య పొలం గట్టు తగాదాలు.. ప్రజలకి యే మాత్రం సంబంధం లేని వ్యవహారాలు.

ఇలా రాజకీయ పక్షాలు ఒకళ్ళకొకళ్ళు హేపీగా నిప్పెట్టుకొంటుండగా.. ఒక్కోసారి నిప్పు కాస్తా మంటగా మారి.. ఆపై అగ్నిప్రమాదంగా మారిపోయి.. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది (ఇందుకు ఇందిరా గాంధీ - భింద్రన్‌వాలె ఉదంతం ఒక ఉదాహరణ). 

అప్పుడు పాలకులు కొత్త ఎత్తుగడలేస్తారు. అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్‌ని దించుతారు. ఆ ఫైర్ ఫైటరే కనిపించని నాలుగో సింహమైన సాయికుమార్! బోనులోంచి బయటకొచ్చిన ఈ నాలుగో సింహానికి సింహం హక్కుల పట్ల తప్పించి ఇతరుల హక్కుల పట్ల నమ్మకం వుండనందున.. మానవ హక్కుల్ని విచ్చలవిడిగా హరించేస్తూ.. యథేచ్ఛగా మారణ కాండ సాగిస్తూ.. పరిస్థితిని 'అదుపు'లోకి తెస్తుంది. 

ఇప్పుడో ధర్మసందేహం. అసలీ కనిపించని నాలుగో సింహం సాయికుమార్ దేనికి? పాలకులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగొచ్చుగా? దిగొచ్చు, కానీ సాయికుమార్ పద్ధతుల్తో ప్రభుత్వాలకి ఇబ్బందులున్నాయ్, తేడా వొస్తే వ్యవహారం బెడిసికొడుతుంది. అలాంటి తేడానే వస్తే సాయికుమార్‌నే బలిపశువు చేసి ప్రజాస్వామ్య విలువల్ని 'కాపాడొచ్చు' - ఇదొక win win situation, అందుకని!

పాలకులకి పోలీసు వ్యవస్థని వాడటంలో ఖచ్చితమైన పద్దతులున్నాయి. పోలీసు వ్యవస్థ పద్ధతిగా - అస్మదీయుల పట్ల అక్కినేని నాగేశ్వరరావు కన్నా సున్నితంగా వుంటుంది, తస్మదీయుల పట్ల ఆర్.నాగేశ్వరావు కన్నా క్రూరంగా వుంటుంది. ఈ సూత్రం గుర్తుంచుకుంటే పోలీసు వ్యవస్థ - గోరక్షకులు, శ్రీరామసేన, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పట్ల వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

'సూపర్ కాప్' సాయి కుమార్ బోనులో సింహంలాంటివాడు, రాజ్యం అవసరమైనప్పుడు మాత్రమే బోను తలుపులు తెరుస్తుంది. అందుకే అతను 1984 లో ఢిల్లీలో కనపళ్లేదు, 2002 లో గుజరాత్‌లోనూ కనపళ్లేదు. ఎందుకు కనపళ్ళేదో ఈ పాటికే మీకు అర్ధం అయ్యుంటుంది, కాబట్టి విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.

(fb post 27/5/2017)

Friday 26 May 2017

అరుంధతీ రాయ్


చూడమ్మాయ్ అరుంధతీ రాయ్!

చక్కటి పేరు, మొహంలో లక్ష్మీదేవి కళ, మొదటి రచనతోనే అంతర్జాతీయ గుర్తింపు. ఆడపిల్లకి ఇంతకన్నా ఇంకేం కావాలి?

బోల్డన్ని బుక్ రిలీజు ఫంక్షన్లు, శాలువా సన్మానాలు, సినిమా అవకాశాలు, పద్మ ఎవార్డులు నీకోసం యెదురుచూస్తుంటే.. నువ్వేం చేశావ్?

యేమాత్రం తెలివి లేకుండా -

నర్మదా బచావో అన్నావ్! నక్సలైట్లతో తిరిగావ్! ఆదివాసీ హక్కులన్నావ్! కాశ్మీర్ ప్రతిపత్తి అన్నావ్!

ఆహ్లాదకర జీవితాన్ని వద్దనుకుని రాజ్యానికి వ్యతిరేకంగా మారిపొయ్యావెందుకు?!

ఇప్పుడు నీకర్ధమైందా?

ఈ దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తాం, మాతృమూర్తిగా గౌరవిస్తాం.

కానీ -

స్త్రీ "అభిప్రాయాలు" కలిగుంటే మాత్రం తాట తీస్తాం, బూతులు తిడతాం, బెదిరిస్తాం, అణగదొక్కడానికి యెంత స్థాయికైనా దిగజారతాం!

(fb post 26/5/2017)

Wednesday 24 May 2017

తీవ్రవాద గొట్టంగాళ్ళు


సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. సినిమాగా ఓ కథని అనుకుంటారు, నెలల తరబడి ప్రణాళికలేస్తారు, తరవాతే తాపీగా సినిమా తీస్తారు. ఈ సౌకర్యం టీవీల వాళ్లకి లేదు, ఎందుకంటే వాళ్లకి ప్రతిరోజూ ఒక సినిమానే! రోజూ ఏదొక juicy story పట్టుకోవాలి, దాన్నుండి రోజంతా జ్యూస్ పిండుతూ టెంపో maintain చెయ్యాలి.

వాస్తవానికి మనం న్యూస్ చానెల్స్ అని పిల్చుకుంటున్నవి న్యూస్ చానెల్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ - వీటిల్లో ఆవేశం ఉంటుంది గానీ వార్తలుండవు. న్యూస్ ఏంకర్లుగా మనం పీల్చుకుంటున్నవాళ్ళు ఏంకర్లు కాదు, బఫూన్లు!

యెలా చెప్పగలవ్? 

సింపుల్! ఈ దేశంలో యేటా వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపాల్తో చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి చాలా పెద్దవార్తలు కావాలి. కానీ టీవీల వాళ్లకి ఇవసలు వార్తలే కాదు!

మరి వీరికి వార్తలేమిటి?

పేజ్ 3 వారి అసహజ మరణాలు! ఇవి మాత్రం వారాల తరబడి లాగుతారు. వీటితో ప్రజలకేం సంబంధం? తెలీదు!

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా టీవీల వాళ్ళు 'మర్డర్' మిస్టరీని తమదైన శైలిలో పీకి  పాకం పెట్టారు. తరవాత పోలీసులు కేసు కోర్టుకి పంపారు. విషయం అక్కడితో అయిపొయింది. 

ఈమధ్య అర్ణబ్ గోస్వామి అనే కేకాగ్రేసరుడు సొంతదుకాణం పెట్టాడు. ఈ దుకాణానికి అధిపతి ఎన్డీయే నాయకుడు, శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ సీటుపై కన్నేసినవాడు. అందువల్ల మన కేకల మాంత్రికుడు అర్జంటుగా సునంద పుష్కర్ కేసు యెత్తుకున్నాడు, ఆధారాలంటూ  యేవో పాత టేపులు వినిపించి శశి థరూర్ ఒక 'హంతకుడు' అని తేల్చేశాడు. 

తేల్చేసిన దరిమిలా - గోస్వామి తన తీవ్రవాద గొట్టం గాళ్లనీ థరూర్ మీదకి తోలాడు. గొట్టాలకి సమాధానం చెప్పకపోతే శశి థరూర్ పారిపోతున్నాడు అంటాడు! చెబితే మీడియాపై దాడి అంటాడు! అంటే ఇదో win-win situation అన్నమాట!

ప్రభుత్వ సేవలో పూర్తి స్థాయిలో పునీతం అయిపోడం, సైన్యాన్ని కీర్తించడమే దేశభక్తికి పరాకాష్టగా ప్రచారం చెయ్యడం కేకాధాముడి ఛానెల్ పాలసీ! అందుకే సంఘపరివార్ శక్తులు అరుంధతి రాయ్ ఇచ్చిందని ప్రచారం చేసిన (లేని) ఇంటర్వ్యూ ఆధారంగా, ఆమెపై తట్టల కొద్దీ బురద చల్లే ప్రోగ్రామ్ రోజువారీగా తలెత్తుకున్నాడు. 

అర్ణబ్ గోస్వామి వాచాలత్వాన్నీ, రౌడీయిజంనీ గొప్ప జర్నలిజంగా భావించేవాళ్లు.. ఈ చౌకబారు ట్రిక్కుల్ని ఆసక్తిగా చూసే చౌకబారు వీక్షకులు వున్నంతకాలం మనం ఈ చెత్తని భరించక తప్పదు. ఆలస్యంగానైనా ఈ చెత్త కొట్టుకుపోతుంది భావిస్తున్నాను.

(fb post 24/5/2017)

Sunday 21 May 2017

కేరళ అమ్మాయి సర్జికల్ స్ట్రైక్


కేరళలో ఒక యువతి తనపై సంవత్సరాలుగా రేప్ చేస్తున్న ఒక దొంగసన్నాసి గాడి  penis ని కత్తిరించేసింది. ఇది సరైన చర్యనీ, ఈ అమ్మాయిని role model గా తీసుకుని దుష్టులైన అబ్బాయిలకి penis అనేదే లేకుండా కత్తిరించి పడెయ్యాలని టీవీల్లో 'మీడియా' సంఘ సంస్కర్తలు యెలుగెత్తి ఘోషించారు. వారి ఆవేశం చూసి ఆందోళన చెందాను.

ఎందుకు?

బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతుందంటారు. సిగ్మన్డ్ ఫ్రాయిడ్ చెప్పిందీ నిజమయ్యిందనిపిస్తుంది! ఫ్రాయిడ్ developmental psychology లో phallic stage గూర్చి చెబుతూ castration anxiety గూర్చి మాట్లాడాడు. ఆయన ఒకందుకు చెప్పినా, మనకి ఇంకొకందుకు నిజమవుతుంది!

ఇకపై - స్త్రీలు / అమ్మాయిలు మగవాడి penis కత్తిరించేసి, మాపై అత్యాచారం జరిగిందంటే అందరూ (ముఖ్యమంత్రితో సహా) చప్పట్లు కొడతారు. పైగా ఆ penis కోల్పోయినవాడు యేదో యాక్ట్ క్రింద జీవితాంతం జైల్లో మగ్గిపోతాడు (వాడి చావు వాడు చస్తాడు).

మన సమాజం ఈ 'మీడియా' సంఘసంస్కర్తల చప్పుడు సాయంతో, తొందర తొందరగా lynch-mob mentality ని adopt చేసుకుంటుందని అనుకుంటున్నాను.

సరే! అత్యాచారాలకి penis కత్తిరించెయ్యడం సరైన శిక్ష అన్నవారి అభిప్రాయాన్ని గౌరవిద్దాం.

ఈ దేశంలో అత్యాచారాలకి గురయ్యేవారిలో అత్యధికులు దళిత, ఆదివాసీ మహిళలు. ఈ బాధిత మహిళలు కత్తిరించడం మొదలెడితే చాలామంది 'అగ్రకుల' మగవాళ్ళకి, పోలీసులకి penises వుండవు! అప్పుడు కూడా వీరు ఇదే vehemence తో instant justice ని సమర్ధించాలని కోరుకుంటున్నాను!

(fb post 21/5/2017)

Saturday 20 May 2017

అభిమానుల బానిసబుద్ధి


మనం ఇనుప వస్తువుల్ని వాడకపోతే అవి తుప్పట్టిపోతాయి. అలాగే - శరీరంలో యేదన్నా భాగాన్ని సరీగ్గా వాడకపోతే అది atrophy అయిపోతుంది. కొత్తవిషయాల్ని తెలుసుకోవడం, ఆలోచించడం, మనని మనం refine చేసుకోవడం.. ఇవన్నీ నిరంతర ప్రక్రియలు. ఇలా చెయ్యకపోతే మెదడుకి పని తక్కువవుతుంది.. బద్దకంగా అయిపోతుంది.. ఆలోచించడం మానేస్తుంది.

మన సినిమా హీరోల అభిమానులు మెదడు వాడటం మానేసిన శాపగ్రస్తులని నా నమ్మకం. బానిస వ్యవస్థ రద్దైనా, బుర్రలో కొండంత బానిసబుద్ధితో బ్రతికేసే ఈ అమాయకుల్ని చూసి జాలి పడదాం!

యెందుకు?

మనిషితో పోలిస్తే కుక్క మెదడు సైజ్ తక్కువ, అంచేత కుక్కకి బుర్ర తక్కువ, కాబట్టే అది తన యజమాని పట్ల విశ్వాసంగా వుంటుంది. ఇలా విశ్వాసంగా పడుండటం తప్ప కుక్కకి వేరే చాయిస్ లేదని మనం గుర్తుంచుకోవాలి. మెదడు సైజ్ పెద్దదిగా వుండి, ఆలోచించే చాయిస్ వుండికూడా కుక్కలా విశ్వాసపాత్రంగా జీవించడం దురదృష్టం కాక మరేమిటి?!

అంచేత ఈ సినిమా హీరోల అభిమానుల్ని చూసి మనం జాలిపడాలే తప్ప విసుక్కోకూడదని నా అభిప్రాయం.

(fb post 20/5/2017)

Friday 5 May 2017

న్యూస్ చానెళ్ళ వ్యాపారతత్వం


ఇండియా టుడే టీవీలో రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్భయ తలిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. తన కూతురు కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష వెయ్యాలనేది బాధితుల డిమేండ్. నిర్భయ చనిపోవడం కన్నా చంపేసిన విధానం అత్యంత పాశవికం. ఒక వ్యక్తి మరణం యే కుటుంబానికైనా తీరని నష్టం, దాన్ని ఏం చేసినా భర్తీ చెయ్యలేం. కాబట్టి ఆ తలిదండ్రుల వేదనా, కోపం అర్ధం చేసుకోవచ్చు.  

కొద్దిసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. 

రాచరికాలు పొయ్యాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చాయి. ఫలానా నేరానికి ఫలానా శిక్ష అని రాజ్యాంగబద్దంగా రాసుకున్నాం. దీన్ని Code of Criminal Procedure (CrPC) అంటారు. ఒక నేరం జరుగుతుంది, అప్పుడు పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగి నేరాన్ని పరిశోధిస్తుంది, నిందితులపై నేరారోపణ చేస్తూ ఛార్జ్ షీట్ తయారుచేసి జుడీషియరీ వ్యవస్థకి సమర్పిస్తుంది. కోర్టు సాక్ష్యాధారాలతో నేరవిచారణ చేస్తుంది. నేరం రుజువైతే నిందితుడు నేరస్తుడవుతాడు, ఆయా సెక్షన్లని బట్టి కోర్టు శిక్ష విధిస్తుంది. తాము నిరపరాధులమనో, శిక్ష మరీ యెక్కువనో పైకోర్టులో అప్పీల్ చేసుకునే అధికారం నేరస్తులకు ఉంటుంది. 

పోలీసుల కేసు పరిశోధన, కోర్టు విచారణ మొదలైన ప్రొసీజర్లు (డాక్టర్లు ఆపరేషన్ చేసినట్లుగా) పూర్తిగా సాంకేతికమైనవి. అవి ఆయా సంస్థలు మాత్రమే చెయ్యగలిన నిపుణతతో కూడుకున్న వ్యవహారం. యే వ్యవస్థా లోపాలకి అతీతం కాదు, ఆయా వ్యవస్థల్లోని లోపాలు కూడా రాజ్యాంగబద్ధంగానే సవరింపబడాలి, ఇంకే రకంగా కాదు. అంచేత CrPC లో కూడా దేశకాల పరిస్థితుల బట్టి, ప్రజాభిప్రాయం మేరకు రాజ్యాంగబద్ధంగా సవరణలు జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణ ఢిల్లీ ఆందోళన తరవాత వచ్చిన Nirbhaya Act

ఇప్పటిదాకా - నేను రాసింది చిన్నవిషయం, పురాతన విషయం. కానీ ఈ మాత్రం జ్ఞానం లేకుండా మన టీవీ చానెళ్లు వార్తల్నీ, చర్చల్నీ వినోదస్థాయికి దించేశాయి, కనీస బాధ్యత లేకుండా తయారయ్యాయి. చిల్లరకొట్టు వ్యాపారం లాగే టీవీ చానెళ్లదీ వ్యాపారమే, వ్యాపారం తప్పు కాదు. కానీ - పోటీతత్వం వ్యాపారతత్వాన్ని యెంత హీనానికైనా దిగజార్చేస్తుందా?!

కోర్టు నిర్భయ కేసు నిందితుల్ని దోషులుగా తేల్చింది. శిక్ష విషయంలో పైకోర్టు ఖరారు చేసింది. ఇది పూర్తిగా సాంకేతిక అంశం. ఈ సమయంలో నిర్భయ తలిదండ్రుల్ని టీవీ స్థూడియోల్లో కూర్చోబెట్టి రెచ్చగొట్టడం రాజదీప్ సర్దేశాయ్ ఆడుతున్న TRP నాటకం, మధ్యతరగతి మేధావుల కోసం వండిన మసాలా కూర. 

టీవీ స్థూడియోలో హత్యల్ని ప్రోత్సాహిస్తాయనేదానికి మన రాష్ట్రంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ మంచి ఉదాహరణ. ఇలాంటి విషయాల్ని అర్ధం చేసుకోవాలంటే కన్నాభిరాన్, బాలగోపాల్, బొజ్జా తారకం వంటి నిపుణులు రాసిన వ్యాసాలు చదవాలి. అయితే ఇవ్వాళ యెక్కువమందికి అభిప్రాయాలే ఉంటున్నాయి కానీ విషయాన్ని చదివి అర్ధం చేసుకునే ఓపిక ఉండట్లేదు. సరీగ్గా వీరికోసమే టీవీ చానెళ్లు చర్చావినోదాన్ని వండి వారిస్తున్నాయి.

'జబర్దస్త్' కామెడీ షో పట్ల ఎవరికీ భ్రమలు ఉండవు, కాబట్టి సమాజానికి హానికరం కాదు. అయితే ఈ టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాలు ఒక హిడెన్ ఎజెండాతో సాగుతుంటాయి, కాబట్టే ఇవి చాలా హానికరం. నాకీ టీవీ చర్చల పట్ల అప్పుడప్పుడూ కోపం వస్తుంటుంది. అలాంటప్పుడు నేను రెండు పన్లు చేస్తాను. ఒకటి - ఇట్లా నాలుగు వాక్యాలు కెలకడం, రెండు - చిత్తూరు నాగయ్యలా దీర్ఘంగా నిట్టూర్చడం!

Sunday 19 March 2017

చక్ బెర్రీ


నాకు నిన్నంతా చక్ బెర్రీ మ్యూజిక్‌తో గడిచిపోయింది. చక్ బెర్రీ తొంభయ్యేళ్ళ వయసులో నిద్రలో చనిపొయ్యాడు. రాకెన్ రోల్ సంగీతానికి కేరాఫ్ ఎడ్రెస్ బీటిల్స్, రోలింగ్ స్టోన్స్.. వీళ్ళకి స్పూర్తి చక్ బెర్రీ! నేను హెవీ మెటల్ అభిమానినైనా.. సాఫ్ట్ రాక్ కూడా వింటుంటాను. వయసు మహిమేమో తెలీదు కానీ రాక్ మ్యూజిక్‌ని ఇంతకుముందు కన్నా యెక్కువగా వింటున్నాను! 

యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక నాకు చక్ బెర్రీ మరింత దగ్గరవాడయ్యాడు. ఆయన్ని చూస్తూ పాటలు వినడం గొప్ప అనుభూతి. చక్ బెర్రీ తన సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా అలవోకగా పాడేస్తాడు! గిటారుతో విన్యాసాలు చేస్తూ గమ్మత్తుగా నడిచే చక్ బెర్రీ duck walk యెన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.

మైడియర్ చక్ బెర్రీ! నీ సంగీతం వింటూ చాలా ఆనందించాను. నువ్వు భౌతికంగా వెళ్ళిపోయినా నీ సంగీతం నన్ను వెంటాడుతూనే వుంటుంది. అందుకోసం నీకు టన్నుల కొద్దీ థాంక్సులు చెప్పుకుంటున్నాను.  

Saturday 25 February 2017

ప్రొఫెసర్ కోదండరాం


'Appearances are deceptive' అన్నారు పెద్దలు. అందుకు మంచి ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం! ఈయన చూడ్డానికి ఎవర్నైనా సులువుగా నమ్మేసే అమాయకుళ్లా అగుపిస్తాడు. యెదుటివాడు చెప్పేది ఓపిగ్గా వింటాడు. యెంత ప్రవోక్ చేసినా ఆ మొహంలో కోపం కనపడదు. క్లిష్టమైన ప్రశ్నలక్కూడా క్లాస్ రూములో పాఠం చెప్తున్నట్లు ప్రశాంతంగా, నిదానంగా మృదువుగా, చక్కటి పదాలతో సమాధానం చెబుతాడు! కోదండరాంలో ఎడ్రినలిన్ లెవెల్స్ తక్కువని నా అనుమానం.

నాకు కోదండరాం పరిచయం టీవీ ద్వారానే. ఈ మందపాటి కళ్ళజోడు వ్యక్తి మెత్తగా కనిపించే గట్టివాడు అని అప్పుడే గ్రహించాను. సరే! అటు తరవాత తెలంగాణా ఉద్యమంలో కోదండరాం నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే.

తెలంగాణా వచ్చాక - కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణా మేధావుల్లో అధికుల్ని పదవుల్లో నింపేసింది. మిగిలిన కొందర్ని అవార్డులు, రివార్డుల్తో ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. కేసీఆర్‌కి వీరవిధేయత చూపించకపోవడమో మరేదో తెలీదు కానీ కోదండరాం మాత్రం పదవుల్లేకుండా తెలంగాణా రాష్ట్రంలో అలా మిగిలిపొయ్యాడు.

రాజకీయ పార్టీలు గెలవడానికి అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటాయి (అలా చెయ్యటం అనైతికం అని ఎన్నికల కమిషన్ కూడా అనుకోవట్లేదు). తెలివైన ప్రజలు డబ్బులో, బ్రాందీసీసానో తీసుకుని ఓట్లేస్తారు (దేశంలో వీళ్ళే ఎక్కువ అని నా అనుమానం). తెలివి తక్కువ్వాళ్లు నాయకుల మాటలు నమ్మి ఓట్లేస్తారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు బోల్డన్ని ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మా ఉద్యోగాల సంగతేంటని తెలంగాణా యువత అడుగుతుంది. అసలు మాకు సమైక్య ఆంధ్ర రాష్ట్రానికీ, తెలంగాణా రాష్ట్రానికి తేడా తెలీటల్లేదని ఉస్మానియా విద్యార్థులు వాపోతున్నారు. రోహిత్ వేముల సంఘటనతో దళితులకీ తెలంగాణలో తమ స్థానం అర్ధమైంది.

కొన్నాళ్లుగా ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తున్న కోదండరాం ఇప్పుడు స్పీడు పెంచాడు. నిరుద్యోగుల తరఫున గళం విప్పాడు. నా చిన్నప్పుడు ఈ అసంతృప్తుల్ని ప్రభుత్వాలు పట్టించుకునేవి, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అగత్యం తప్పింది. అధికారంలో ఉన్నవాళ్లు రాజులు, వారి కొడుకులు యువరాజులుగా చలామణి అయిపోతున్నారు.

అంచేత సహజంగానే ప్రభువుల్లో అసహనం పెరిగింది. ఈ అసహనంలో రాష్ట్రప్రభుత్వాలకీ, కేంద్రప్రభుత్వానికీ పోటీ వుంది. ప్రభుత్వాలకి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా కనపడసాగాయి. తమని ప్రశ్నించేవారు ఉగ్రవాదులుగా నమ్మసాగాయి. కాబట్టి నిరసన తలపెట్టిన కోదండరాంని ఇంట్లోనే అరెస్ట్ చేసేసి, తెలంగాణా ప్రభుత్వం తన ప్రజానీకాన్ని 'కోదండరాం' అనే పెనుప్రమాదం నుండి రక్షించింది.

ఇందుకు ప్రభుత్వం చెపుతున్న కారణాలు గమ్మత్తుగా ఉన్నాయి.

"ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు ఇస్తుంటే కోదండరాం నిరుద్యోగుల్ని రెచ్చకొడుతున్నాడు!"

అంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే ఇక కోదండరాం మాట నిరుద్యోగులు మాత్రం ఎందుకు వింటారు? కోదండరాం వెనక్కి తిరిగి చూసుకుని, తన వెనుక యెవరూ లేకపోతే ఇంట్లోనే వుండిపోతాడు కదా! అప్పుడు ప్రభుత్వానికి ఇంకా హాయి కదా!

"కోదండరాం కాంగ్రెస్ ఏజంట్!"

అయితే ఏంటీ? అదేమన్నా నేరమా? కాంగ్రెస్ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ ఏజంట్లకి నిరసన తెలిపే హక్కు ఉండదా?!

"కోదండరాం సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది, అందుగ్గానూ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు."

సో వాట్? ఈ దేశంలో అందర్లాగానే ఆయనకీ పార్టీ పెట్టుకునే హక్కుంది! ఆ పార్టీ పెట్టుకునేందుకు ఒక ప్లాట్‌ఫాం యేర్పాటు చేసుకుంటున్నాడు! చేసుకోనీండి, ఎవరైనా పార్టీ పెట్టేముందు చేసేదదే కదా!

ప్రస్తుతం తెలంగాణాలో మీడియా అధికారానికి దాసోహం అంటుంది. అందుక్కారణం మీడియా ఆస్తులు హైదరాబాద్‌లో ఉండటం, ఆ హైదరాబాద్ తెలంగాణలో ఉండటం కావచ్చు. యేదియేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కెయ్యడం ప్రభుత్వాలకి ఒక విధానంగా మారిపోయింది.

తెలంగాణా ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న పాటగాళ్లు, రాతగాళ్ళు, గీతగాళ్ల ఎడ్రెస్ ఎక్కడుందో కూడా తెలీడం లేదు. ఇటువంటి సమయంలో కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీయడం సాహసోపేతమైన చర్యగా భావించాలి.

నా ఉద్దేశం - అసలు కోదండరామ్ అవసరం తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యెక్కువగా వుంది. కానీ - మొదట్నుండీ ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సంపాదనపరులు తప్ప మేధావులు లేరు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల దురదృష్టం!

(picture courtesy : Google)