Wednesday 22 February 2012

వైద్యో నారాయణో హరి!!

"వీడు మా రెండోవాడండీ, ఏడోక్లాసు. కనబడ్డ అడ్డమైన గడ్డీ తింటుంటాడు. ఇప్పుడు పరీక్షల మధ్యలో విరోచనాలు తెచ్చుకున్నాడు, పొద్దుట్నించి దొడ్లోనే పడి యేడుస్తున్నాడు."

ప్రపంచంలో ఏ డాక్టరుకి ఒక పేషంట్ గూర్చి ఇంత గ్రాండ్ ఇంట్రడక్షన్ ఉండదేమో! నాకంత నీరసంలోనూ నాన్నమీద కోపమొచ్చింది. ఆయన ఒక పెద్దమనిషి, అందునా డాక్టరు ముందు ఇలా నా పరువు దారుణంగా తీసేస్తాడని ఊహించలేదు.

అదో విశాలమైన గది. గది మధ్యన పాతకాలపు టేకుబల్ల, కుర్చీ. పక్కన అద్దాల చెక్కబీరువాలు, వాటినిండా ఏవో పుస్తకాలు. గోడకి ఒకవైపు గాంధీ, నెహ్రూ, నేతాజీ మొదలైన దేశనాయకుల పటాలు. ఇంకోవైపు లక్ష్మి, సరస్వతి, రాముడు, శివుడు వగైరా దేవుళ్ళ పటాలు. గదంతా ఆయుర్వేద మందుల తాలూకా ఘాటైన వాసన.

ఆ పాతకుర్చీలో ప్రశాంత వదనంతో, హుందాగా ఒక అరయ్యేళ్ళ వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన శరీరఛాయ తెలుపు, జుట్టు తెలుపు, లాల్చీ తెలుపు. మెడలో రుద్రాక్షలు, నుదుట కుంకుమ బొట్టు. వారు మాఊళ్ళో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.

ఆయన నావైపు గంభీరంగా చూశారు. నా కుడిచెయ్యి తనచేతిలోకి తీసుకుని నాడి పరీక్ష చేశారు. 

"ఎప్పట్నించి?" సూటిగా నాకళ్ళల్లోకి చూస్తూ అడిగారు.

"ఉదయాన్నించి." నీరసంగా నేను.

"ఎన్నిసార్లు?"

ఐదా? ఆరా? గుర్తులేదు, సర్లే! ... "ఐదు."

వైద్యులవారు ఒక్కక్షణం ఆలోచించారు.

"బయటి పదార్ధాలేమన్నా తిన్నావా?"

చచ్చితిని! ఊహించని మలుపు! జవాబేం చెప్పాలి? నిజం చెబితే ఇంట్లోవాళ్ళతో తంటా, చెప్పకపోతే వైద్యానికి తంటా! మందు వికటించి కొత్తరోగానికి దారి తియ్యొచ్చు. హే భగవాన్! ఏమిటి నాకీ క్లిష్టపరిస్థితి!

నాకూ, అక్కకి పాకెట్ మనీ రోజుకి ఐదుపైసలు. ఆరోజుల్లో రిఫ్రిజిరేటర్ల కాన్సెప్ట్ లేదు. చల్లటినీళ్ళ కోసం మట్టికూజాలు, కుండలు కొనేవాళ్ళు. వీటితోపాటు పిల్లలు చిల్లర దాచుకోటానికి మట్టిముంతలు కూడా కొనేవాళ్ళు. పిల్లలు తమ పాకెట్ మనీ మరియూ నాన్నల జేబుల్లో కొట్టేసిన చిల్లర ముంతలో వేసుకునేవాళ్ళు. రోజుకి పదిసార్లైనా ఆ ముంత బరువు ఫీలవుతూ, ముంతని పైకి కిందకి ఆడిస్తూ, నాణేల గలగల శబ్దాన్ని తృప్తిగా, గర్వంగా ఫీలయ్యేవాళ్ళు.

నాకంటూ చిల్లర వేసుకొఏదానికి ఒక ముంత వున్నా, నేనెప్పుడూ అందులో డబ్బులేసుకోలేదు. అలా పైసలు ముంతలో వేసుకుని దాచేసినచో భారత ఆర్ధిక వ్యవస్థ కుంటుబడునని గట్టిగా నమ్మిన కారణాన, నేనెప్పుడూ పొదుపు సలహాలు పాటించలేదు. పైగా పెద్దలమాట విని బుద్ధిగా ముంతలో డబ్బులు దాచుకుంటున్న అక్క ముంత నుండి చీపురుపుల్ల సాయంతో ఐదుపైసల బిళ్ళలు లాగేసేవాణ్ణి. ఎన్నిరోజులు డబ్బులేసినా ముంత నిండట్లేదని పిచ్చిఅక్క తెగ ఫీలయిపోయేది. కొంతమంది అంతే! ఈ పాడులోకంలో దొంగలుంటారనీ, అందునా ఇంటిదొంగలు పరమ డేంజరస్సనీ తెలుసుకోలేని అజ్ఞానప్పక్షులు!

ఇంతేగాక - నా తెలివితేటలతో ఇంకొన్నిట్రిక్కులు డెవలప్ చేశాను. ఇంటికి బంధువులొచ్చినప్పుడు, వాళ్ళ ముందు అమ్మని 'ఐదుపైసలియ్యమ్మా! కొనుక్కుంటా.' అని బ్రతిమాలేవాణ్ణి. విడప్పుడు పైసాకూడా విదల్చని అమ్మ, చుట్టాల ముందు పరువు పోతుందనే భయంతో, పోపులడబ్బాలోంచి ఐదుపైసలు తీసిచ్చేది. ఆ వచ్చిన చుట్టం ఆ ఐదుపైసలకి ఇంకో ఐదుపైసలు జతచేసి 'బాగా చదువుకో బాబూ!' అనేవాడు (అసలు విషయం, ఆయన ఇచ్చేదాకా నేను అక్కణ్ణించి కదిలేవాణ్ణి కాదు).

నిన్న ఇంటికి మా మేనమామ వచ్చాడు. అరిగిపోయిన నా పాత ట్రిక్కు ప్లే చేసి పదిపైసలు గిట్టిచ్చాను. ఒక ఐదుపైసలు పీచుమిఠాయి నోట్లో పెట్టుకుంటుంటేనే కరిగిపోయింది. ఐదుపైసలు కలరు డ్రింకు తియ్యగా, చల్లగా గొంతులోకి జారిపోయింది. కానీ - కొద్ది సమయానికే కడుపులో గుడబిడ, తదుపరి చిత్రవిచిత్ర శబ్దాలు. ఆపై తరచూ పాయిఖానా సందర్శన భాగ్యం. ఇదీకథ! ఇప్పుడు సత్యహరిశ్చంద్రుళ్ళా నిజం చెపితినా, నా పాకెట్ మనీకి కోతపడే అవకాశం ఉంది.

కోర్టులో సాక్ష్యం ఖచ్చితత్వంతో చెప్పాలి. 'ఫలానా సుబ్బారావు నాకు తెలుసు గానీ, వాడిపళ్ళు రాలగొట్టింది మాత్రం నేనుకాదు.' అంటే కోర్టు నమ్మదు. అందుకే అసలా సుబ్బారావెవడో నాకు తెలీదని బల్ల గుద్దాలి. అప్పుడే సాక్ష్యం నమ్మబుల్‌గా ఉంటుంది, కోర్టు కూడా నమ్ముతుంది. అంచేత - నిజాలంటూ చెప్పటం ప్రారంభిస్తే, ఒకటొకటిగా అన్నీ బయటపడతాయని, పొద్దున్నించి ఎవరెన్నిరకాలుగా అడిగినా నేను బయటి తిండి అస్సలు తిననే తినలేదనీ.. తల్లితోడనీ, సరస్వత్తోడనీ నొక్కి వక్కాణిస్తున్నాను.

ఇప్పుడీ వైద్యులవారి వాలకం.. ఆయన లాల్చీ, బొట్టు, పెద్దమనిషి తరహా చూస్తుంటే.. పిల్లలు అబద్దాలు చెబ్తారనీ, అంచేత వాళ్ళని ప్రశ్నలతో వేధించకుండా బుద్ధిగా వైద్యం చేసుకోవాలనే తెలివి వున్నవాడిగా అనిపించట్లేదు. అంచేత - ఇప్పుడు నేను నా తిండి విషయం చెప్పకపోయినట్లయితే, ఇంకేదో మందు ఇచ్చేట్టున్నాడు.

వైద్యులకి రోగలక్షణాలన్నీ చెబితేనే అంతంత మాత్రం వైద్యం చేస్తున్నారు, అట్లాంటిది వాళ్ళని తప్పుదోవ పట్టిస్తే ఇంకే వైద్యం చేస్తారో గదా! అప్పుడు అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. కావున ఒట్టుతీసి గట్టుమీద పెట్టి.. నంగినంగిగా, నసుగుతూ పీచు మిఠాయి, కలరు డ్రింకు రహస్యాన్ని బయటపెట్టాను. నా వెనక నించుని కోపంతో బుసలు కొడుతున్న నాన్నని ఓరగా గమనించాను. ఇప్పుడు నాకు నా రోగిష్టి పొట్టని రక్షించుకోవడమే ప్రధమ కర్తవ్యం. కావున నాన్నకోపం నాకేమంత భయం కలిగించలేదు. 

వైద్యులవారు అర్ధమయ్యిందన్నట్లు తల పంకించారు.

"శివుడూ!" అంటూ పిలిచారు.

శివుడు అనబడే శాల్తీ అప్పటిదాకా గది గుమ్మానికి బల్లిలాగా వేళ్ళాడుతున్నాడు. ముతక పంచె, ఖద్దరు బనీను, స్కేలు బద్దలా పల్చగా ఉన్న ఆవ్యక్తి.. నాకెందుకో ప్రాణమున్న జీవిలా అనిపించలేదు. ఆ గదిలోని బల్ల, కుర్చీ, పటాల్లో ఒకడిగా అగుపించాడు. శివుడికి డాక్టరుగారు ఏదోమందు పేరు చెప్పారు. శివుడు యాంత్రికంగా పక్కగది లోపలికెళ్ళి రెండునిమిషాల్లో ఒక చిన్నపొట్లంతో వచ్చాడు. డాక్టరుగారు పొట్లం విప్పారు. అందులో అచ్చు మిరియాల గింజల్లా ఆరేడు గుళికలు ఉన్నయ్. 

"నోరు తెరు." అంటూ రెండు గుళికలు నానోట్లో వేశారు వైద్యులవారు.

గుళికలు వగరుగా, చేదుగా ఉన్నయ్.

"ఒకగంటలో తగ్గిపోవాలి, తగ్గకపొతే గంట తరవాత ఇంకోరెండు. మజ్జిగన్నం తప్పించి ఏమీ పెట్టొద్దు." అని ఆ పొట్లం నాన్న చేతికిచ్చారు. 

ఇంటికొచ్చే దారంతా నాన్న తిట్లతో నిండిపోయింది.

"దొంగగాడిద కొడకా (కోపంలో నాన్న తననితనే తిట్టుకుంటున్నాడు)! ఈసారి ఐదుపైసలంటూ అడుగు, తాట తీస్తా!" అంటూ తిట్లతో సరిపుచ్చాడు, తన్నలేదు. అమ్మయ్య! నా రోగిష్టి స్టేటస్ నన్ను తన్నుల బారినుండి రక్షించింది.

వైద్యులవారి గుళికలు ఇంటికి చేరుకునేలోపే గుణం చూపించనారంభించాయి. ఉదయం నుండి కడుపులో వస్తున్న రణగొణ ధ్వనులకి తెర పడింది, కొంతసేపటికి వికారం తగ్గిపోయింది, ఇంకొంతసేపటికి ఆకలి కూడా వెయ్యనారంభించింది.

వంటింట్లో అక్క భోంచేస్తుంది. అక్క కంచంలో నాకిష్టమైన దోసకాయ పప్పు, వంకాయ కూర! నాకు ఏడుపొచ్చింది, తరవాత భలే కోపమొచ్చింది. అసలు నాకు రోగమొచ్చినప్పుడు నాకిష్టమైన కూరలు వండటం ఎంతన్యాయం! ఎంత దుర్మార్గం! అన్నం తింటున్న అక్కకేసి కొంచెంసేపు కుక్కచూపులు చూస్తూ కూర్చున్నాను. ఇంక తట్టుకోవటం నా వల్లకాలేదు.

"అమ్మా! ఆకలేస్తుంది. నాక్కూడా పప్పు, వంకాయ కూర." అంటూ వంటింట్లో అక్క పక్కనే పీటేసుక్కూర్చున్నాను.

"విరోచానాలకి పత్యం చెయ్యాలిరా, మజ్జిగన్నం తిను." అంది అమ్మ.

"లేదమ్మా! పత్యం అవసరం లేదుట. డాక్టరుగారు అన్నీ తినొచ్చని చెప్పారు. ఒట్టు, దేవుడితోడు." అన్నాను, అమ్మ నమ్మింది (ఏవిఁటో - ఈ ఒట్లు, ప్రమాణాలు నేను తప్పితే అందరూ నమ్ముతారు)! ఆపై - నాసామిరంగా! దోసకాయ పప్పు, వంకాయకూరతో ఒక పట్టుపట్టాను. కొద్దిసేపటికి నీరసం కూడా తగ్గిపోయింది. 

అటుతరవాత రోగం సంగతే మర్చిపొయ్యాను. యధావిధిగా ముప్పొద్దులా పూర్ణకుంభాలు లాగిస్తూ పరీక్షలు రాశాను. మూడ్రోజులు ఇట్టే గడిచిపొయ్యాయి. క్రమేపి నాపొట్ట ఉబ్బుతూ, అనతికాలంలోనే గుమ్మడికాయ పరిమాణం పొందింది. నిండుగర్భిణీ వలె రొప్పుతూ, ఆపసోపాలు పడసాగాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, గత కొన్నిరోజులుగా నాకు ప్రకృతి నుండి పిలుపు రాలేదు. పొట్టలోకి లోడింగ్ చేస్తున్నానే గాని, అన్‌లోడింగ్ చెయ్యట్లేదు. కారణమేమి చెప్మా? ఓ! అర్ధమైంది, ఇదంతా వైద్యులవారి గుళికల మహిమ. విరోచనాలు కట్టించమంటే అసలు విరోచనమే లేకుండా చేసేశారు!

నా సంకటస్థితిని అమ్మానాన్నలకి చెప్పాను. నాన్న 'శిష్ట్లావారి దగ్గరికి పద' అనంగాన్లే వణుకు పుట్టింది. ఆయన వైద్యం అతివృష్టి, అనావృష్టి టైపేమేమో అని ఓ తీవ్రమైన అనుమానం. ఈసారి మందుగుళికలకి మళ్ళీ వరదలోస్తాయేమో! ఆ నీరసాన్ని భరించడం నావల్ల కాదు, కానీ వెళ్ళక తప్పేట్టు లేదు.

మిత్రులారా! ఆరోజుల్లో నాన్నలు ఈరోజుల డాడీల్లాగా డెమాక్రటిగ్గా ఉండేవాళ్ళు కాదు. వారు చండశాసనులు, పిల్లల హక్కుల్ని నల్లుల్లా నలిపేసే విలన్లు. బెట్టుచేస్తే బాది పడేసేవాళ్ళు, మొండికేస్తే మాడు పగలకొట్టేవాళ్ళు. అమ్మలు మనకి  మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళే గానీ, ఫిజికల్ సపోర్ట్ (అనగా తన్నకుండా అడ్డు పడటం) ఇచ్చేవాళ్ళు కాదు. మహా ఐతే తన్నుల సెషన్ అయిన తరవాత రాజకీయ నాయకుల్లా నాన్న తన్నుల్ని ఖండిస్తారు, అంతే!

బాలల హక్కుల ఉల్లంఘనలో ఘనత వహించిన నా తండ్రి మాట విననిచో, కలుగు విపరిణామములు నాకు అనుభవ పూర్వకముగా తెలియును. కావున నోరు మూసుకుని నా నిర్దయ తండ్రితో వైద్యులవారి వద్దకేగితిని. వారు నన్ను (మళ్ళీ) గంభీరంగా చూశారు. నాన్న నా కొత్తకష్టం చెప్పాడు, ఆయన నా గుమ్మడికాయ బోజ్జని నొక్కినొక్కి చూశారు. 

"పత్యం చెయ్యలేదా?" సూటిగా చూస్తూ అడిగారు.

హతవిధీ! మళ్ళీ క్లిష్టపరిస్థితి. ఈయన నాతో రహస్యాలు కక్కించిగానీ యే వైద్యం చెయ్యడేమో!

"లేదు." నంగిగా నసిగాను.

"శివుడూ!"

స్కేలుబద్ద శివుడు మళ్ళీ రంగంలోకి వచ్చాడు. లోపలి గదిలోకెళ్ళి యేదో పొట్లం తెచ్చాడు. ఈసారి నా నోట్లో ఒక గుళిక మాత్రమే వెయ్యబడింది. ఈ గుళిక అత్యంత తీవ్రమైన చదుగా వుంది. 

"ఇవ్వాళ చారన్నం తప్పించి ఇంకేం పెట్టొద్దు." ఆదేశాలు జారీ చెయ్యబడ్డాయ్.

అటు తరవాత రాయడానికి పెద్దగా ఏమీలేదు. ఈసారి నాన్న నన్ను పెద్దగా తిట్టలేదు, కాకపొతే వీపుమీద విమానం మరియూ హెలికాప్టర్ మోతలు మోగించాడంతే!

ఇంటికొచ్చిన కొద్దిసేపటికే ప్రకృతి పులకించింది. నాకు సుఖప్రసవం అయ్యింది, సంచి ఝాఢించింది. గుమ్మడికాయ ఖాళీ అయ్యి గాలితీసిన బెలూన్లా అయిపొయింది. 'లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్' అని ఎందుకంటారో అర్ధమైంది.

అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా భక్తప్రహ్లాద సినిమాలో మంగళంపల్లి మేఘాల్లో తేలియాడుతూ పాడిన 'ఆదియూ అంతము నీవే దేవా' అనే పాట నోట్లోంచి తన్నుకుంటూ వచ్చింది. నారదుడికి అంత ఆనందం ఎందుకో కూడా అర్ధమైంది.

బుద్ధి ఉన్నవాడెవడూ జన్మలో మళ్ళీ పీచుమిఠాయిలు, కలరు డ్రింకులు తాగడు, తాగకూడదు కూడా. కానీ - నాకు బుద్ధి లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఒకసారి జైలుకెళ్తే జైలన్నా, పోలీసులన్నా భయం పోతుందిట. అట్లే - కడుపుని ఎంత ఛండాలం చేసుకున్నా, తగ్గించడానికి వైద్యులవారున్నార్లెమ్మని భరోసా వచ్చేసింది. ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అయ్యింది.

నా ప్రస్థానం పీచుమిఠాయి, కలరు సోడాల్ని దాటుకుని బజ్జీమసాల, ముంతకింద పప్పుల మీదుగా కారం రాసిన మామిడి ముక్కలు, తాటిచాప, జీళ్ళు, పప్పుచెక్కల దాకా కొనసాగింది. నాకు బూతదయ మెండు, స్నేహశీలిని కూడా. అందుకే - ఈ పదార్ధాలపై వాలే ఈగల్ని నా సహచరులుగానూ, నా సహపంక్తిదారులుగానూ భావించాను!

ఇవ్విధముగా నానావిధములైన శ్రేష్టము మరియూ బలవర్ధకమైన పదార్ధాలతో ఆహార నియమాల్ని శుచిగా పాటిస్తూ, బ్రతుకు నిచ్చెనమెట్లు ఒకటొకటిగా ఎక్కుతూ, ఇదిగో - ఇవ్వాళ ఈ స్థాయికి చేరుకున్నాను!

Thursday 16 February 2012

హుస్సేన్.. నా ప్రియనేస్తం


"మీరు.. నువ్వు.. హుస్సేన్ కదూ! నన్ను గుర్తు పట్టలేదా?" రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఉత్సాహంగా అడిగాను.

ఎర్రగా, పొడుగ్గా, బక్కపల్చటి ఆకారం. మాసిన గడ్డం, నలిగిన చొక్కా, వెలసిన లుంగీ. నిర్వేదంగా, నిరాశగా, నిర్లిప్తంగా నాకేసి చూశాడు. అతని కళ్ళలో జీవం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ తనే అనుభవిస్తున్నట్లున్నాడు. 

"మిమ్మల్నెలా మర్చిపోతాను?" అన్నాడు.

"హుస్సేన్! నన్ను మీరు అంటున్నావేమిటి! ఇవ్వాళ నిన్ను వదలను. నీతో చాలా కబుర్లు పంచుకోవాలి. పద, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం." అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీయబోయాను.

"లేదు, లేదు. ఇప్పుడు నాకు అర్జంటు పనుది. ఈసారి తప్పకుండా.. " అంటూ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హుస్సేన్.. నా ప్రియనేస్తం.


హుస్సేన్, నేను మూడోక్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. పరీక్షల్లో హుస్సేన్ది ఎప్పుడూ ప్రధమ స్థానమే. ఆ ప్రధమ స్థానానికి, రెండో స్థానానికి మధ్య బోలెడన్ని మార్కుల అంతరం. ఆ రెండో స్థానం కోసం నాకూ, బాబ్జీకీ మధ్య తీవ్రమైన పోటీ. ఈ పోటీ కారణంగా బాబ్జికి నాకు పడేది కాదు. హుస్సేన్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ బాయ్. ఎర్రగా, సన్నగా ఉండేవాడు. లూజు నిక్కరు, నలిగిపోయిన చొక్కా. అల్లరికి ఆమడ దూరం. తక్కువ మాట్లాడేవాడు, అడిగినదానికి సమాధానం చెప్పేవాడు, అంతే.

కొద్దికాలంలోనే నేనూ, హుస్సేన్ మంచి స్నేహితులమైపోయాము. హుస్సేన్ పెన్సిల్ ఎప్పుడూ అంగుళానికి మించి వుండేది కాదు. నా పెన్సిల్ హుస్సేన్ కి ఇచ్చేవాణ్ని. ఇంట్లో పెన్సిల్ పోయిందని అబద్దం చెప్పి, కొత్తపెన్సిల్ కొనుక్కునేవాణ్ని. హుస్సేన్ దగ్గర అన్ని సబ్జక్టులకి పుస్తకాలు వుండేవి కావు. నా టెక్స్ట్‌బుక్స్ హుస్సేన్‌తో పంచుకునేవాణ్ణి. హుస్సేన్ నాకు చదువులో ఎంతో సహాయం చేసేవాడు. 

మా స్కూలు పక్కనే ఒక ఆఫీసు, ఆఫీసు వెనక విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలంలో ఒక బిల్డింగ్ మొదలు బెట్టి.. పిల్లర్స్, స్లాబ్ వేసి వదిలేసారు. ఆ వదిలేసిన కట్టడమే హుస్సేన్ ఇల్లు. చుట్టూతా గోనెపట్టాలతో కుట్టిన పరదాలు. ఒక మూలగా మూడు రాళ్ళు. ఆ రాళ్ళ మీద మసిబారిన గిన్నె, పొయ్యిలో మంట కోసం పుల్లలు, చిన్న కిరసనాయిలు బుడ్డి, పక్కన రెండు సత్తుప్లేట్లు. పొయ్యికి నాలుగడుగుల పక్కగా పాత రేకుపెట్టె. ఇదీ హుస్సేన్ ఇంటి ఫర్నిచర్!

రేకుపెట్టె పక్కనే ఒక చింకిచాప. ఆ చాపమీద పొద్దస్తమానం ఒక మహిళ పడుకునుండేది. మనిషి అందంగా ఉంటుంది, కానీ ఎముకల గూడుతో తెల్లగా పాలిపోయి వుంటుంది. నీరసంగా, అప్పుడప్పుడూ మూలుగుతూ ఉండేది. ఆవిడ హుస్సేన్ తల్లి. హుస్సేన్ తల్లికి టీ కాచి ఇచ్చేవాడు. ఆవిడ టీ తాగుతుంటే కాళ్ళు పట్టేవాడు. హుస్సేన్ తల్లి ఉర్దూ బాషలో ఏదో చెబుతూ ఏడుస్తుండేది. హుస్సేన్ తమ్ముడు రెండేళ్ళ క్రితం 'విష జెరం' తో చచ్చిపోయాట్ట, బహుశా చనిపోయిన కొడుకు గుర్తొచ్చి ఏడుస్తుందేమో.

హుస్సేన్ స్నేహం నాకు ఎన్నో కొత్తవిషయాలు నేర్పింది. హుస్సేన్ ఇంటి వెనక దట్టమైన తుప్పలు, పొదలు ఉండేవి. ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు కూడా ఉండేవి. హుస్సేన్ ఉసిరిచెట్టు కొమ్మల్ని బలంగా ఊపేవాడు. బోల్డన్ని ఉసిరికాయలు రాలి పడేవి. అవన్నీ ఏరి ఉప్పూ, కారం అద్దుకుని తినేవాళ్ళం. నేరేడు చెట్టెక్కి కాయలు కోసేవాడు. నేరేడుకాయల తినేప్పుడు నాలుక బయట పెట్టి ఎవరి నాలుక ఎక్కువ రంగు మారిందో చూసుకునేవాళ్ళం.

హుస్సేన్ బొంగరం ఆటలో స్పెషలిస్ట్. నాకు బొంగరం అరచేతిలో తిప్పడం నేర్పించాడు. నాకు నలికీసు పాములు, తొండలు అంటే భయం. అవికూడా మనలాంటివేనని, మనని చూసి అవే ఎక్కువ భయపడతాయని ధైర్యం చెప్పాడు. ఆ పక్క ఇంటివాళ్ళ మామిడిచెట్టుకి కాయలు విరగకాసి వేల్లాడుతూ ఉండేవి. చేయి పెడితే చాలు, కనీసం పదికాయలు అందుతాయ్. నేను ఆ మామిడి కాయలు కోసేద్దామని ఉబలాటపడేవాణ్ణి. అలా చెప్పకుండా కాయలు కొయ్యడం దొంగతనం అవుతుందని, దొంగతనం తప్పని హుస్సేన్ వారించేవాడు. నాకన్నా వయసులో కొద్దినెలలు మాత్రమే పెద్ద అయిన హుస్సేన్ నాకు గురువుగా మారిపొయ్యాడు.

మూడోక్లాసు పరీక్షలు దగ్గర పడ్డాయ్. రోజుట్లాగే హుస్సేన్, నేను నేరేడు చెట్టు కొమ్మమీద కూర్చున్నాం. నేరేడు కాయలు తింటూ, హుస్సేన్ చెబుతున్న పాఠాన్ని బద్దకంగా వింటున్నాను. హుస్సేన్ పాఠం చెప్పే విధం అద్భుతంగా వుంటుంది. ముందుగా పుస్తకంలో ఉన్నది పెద్దగా పైకి చదువుతాడు, ఆ తరవాత అర్ధాన్ని వివరిస్తాడు. నాకు ఆ వివరణ చందమామ కథలాగా ఉండేది.

హఠాత్తుగా హుస్సేన్ ఇంట్లోంచి పెద్దగా శబ్దాలు, కేకలు, అరుపులు వినిపించాయ్. హుస్సేన్ మెరుపు వేగంతో చెట్టు దిగి ఇంట్లోకి పరిగెత్తాడు. వెనకగా నేను కూడా హుస్సేన్ తో పాటు పరిగెత్తాను. ఇంట్లో దృశ్యాన్ని చూసి చలించిపోయాను. చాపమీద పడున్న హుస్సేన్ తల్లిని ఆమె భర్త ఎగిరెగిరి డొక్కల్లో తంతున్నాడు. ఆవిడ పెద్దగా ఏడుస్తుంది. ఏడుస్తూనే ఉర్దూలో అతన్ని ఏదో తిడుతుంది. ఆతను ఊగుతున్నాడు, తూగుతున్నాడు, మాటలు ముద్దగా వస్తున్నాయ్. అతను ఏదో కోపంతో భార్యని కొడుతున్నట్లుగా లేడు. భార్యని చంపేంత కసి, క్రోధం అతని కళ్ళల్లో నాకు కనిపించాయి.

పరుగున వెళ్లిన హుస్సేన్ తల్లిమీద బోర్లాపడి, ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన్నులు హుస్సేన్ వీపుమీద పడుతున్నయ్. ఆ తన్నుల ధాటికి బాధతో విలవిలలాడిపోతూ, తల్లికి దెబ్బలు తగలకుండా కాస్తున్నాడు. హృదయవిదారకమైన ఆ సంఘటన చూసి భయపడిపోయాను, ఏడుపొచ్చింది.

ఒక్కసారిగా ఇంటికి పరుగు తీశాను. తన్నులు తింటున్న హుస్సేన్ మొహమే కళ్ళ ముందు కదులాడుతుంది. నేనెప్పుడూ ఒకమనిషి ఇంకోమనిషిని అంత దారుణంగా కొట్టటం చూళ్ళేదు. తండ్రి తన్నుల ధాటికి అసలే బక్కగా, పీలగా ఉన్న హుస్సేన్ చచ్చిపోతాడా? దుఖం ఆగట్లేదు. ఏడుస్తున్నాను, పరిగెత్తుతూనే ఏడుస్తున్నాను, ఏడుస్తూనే పరిగెత్తాను.

అటు తరవాత హుస్సేన్ స్కూలుకి రాలేదు. నాకు హుస్సేన్ ఇంటికి వెళ్లాలని ఆరాటంగా ఉండేది. కానీ హుస్సేన్ తండ్రి గుర్తొస్తేనే వణుకొచ్చేది. ఆ భయమే నన్ను వెళ్ళనీయలేదు. పరీక్ష ముందురోజు హుస్సేన్‌ని పరీక్షలకి రమ్మని చెప్పటానికి మా టీచర్ నలుగురు పిల్లల్ని వాళ్ళింటికి పంపించారు. వాళ్ళల్లో నేనూ ఒకడిగా బిక్కుబిక్కుమంటూ వెళ్లాను.

ఇంట్లో హుస్సేన్ లేడు, హుస్సేన్ తండ్రి కూడా లేడు. చాపమీద శవంలా పడున్న తల్లిని హుస్సేన్ గూర్చి అడిగాం. ఆవిడ లోగొంతుకతో నీరసంగా హుస్సేన్ ఏదో 'బేరం'కి వెళ్ళాడని చెప్పింది. బేరం అంటే ఏంటో మాకు అర్ధం కాలేదు. అదే ముక్కని మా టీచర్ కి చెప్పాం. ఆవిడ 'చూశారా! దేవుడు వాడికి గొప్ప తెలివితేటలిచ్చాడు, కానీ చదువుకునే అవకాశం లేకుండా చేశాడు.' అంటూ బాధపడ్డారు. ఆ తరవాత హుస్సేన్ మళ్ళీ ఎప్పుడూ స్కూలు గుమ్మం తొక్కలేదు.

ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకసారి మార్కెట్ సెంటర్లో కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోనట్లు వెళ్లిపొయ్యాడు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా వెళ్లిపొయ్యాడు.


ఈమధ్య ఒక పెళ్ళిలో కలిశాడు బాబ్జి. ఐఐటీ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాట్ట. పక్కన పొట్టిగా, లావుగా వున్న వ్యక్తిని చూపిస్తూ - 

"ఈ శాల్తీని గుర్తుపట్ట్లేదా? మన వాసుగాడు." నవ్వుతూ అన్నాడు బాబ్జి. 

"హల్లో మైడియర్ వాసూ! వెంటనే గుర్తుపట్టనందుకు సారీ బ్రదర్!" అంటూ సంతోషంగా కౌగలించుకున్నాను. 

వాసుకి గుంటూర్లో పుస్తకాల షాపు వుందిట. నాగూర్చి వివరాలు చెప్పాను. తరవాత మా టీచర్ల గూర్చి కొంత సంభాషణ నడిచింది.

"వాసు! నీకు హుస్సేన్ ఎక్కడున్నాడో తెలుసా?" ఉన్నట్టుండి అడిగాడు బాబ్జి.

ఒక్కసారిగా వాసు మొహం మారిపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ -

"లేదు. మన మూడోక్లాసు పరీక్షలప్పుడే హుస్సేన్ తండ్రి యెటో వెళ్లి పొయ్యాడు. పాపం! ఆ వయసులో తల్లిని  పోషించాటానికి నానా తిప్పలు పడ్డాడు హుస్సైన్. అరటి కాయలు అమ్మాడు, సున్నం బొచ్చెలు మోశాడు. కొన్నాళ్ళకి తల్లీకొడుకుల్ని బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయించాడు, తల్లిని తీసుకుని ఎక్కడికెళ్ళాడో! ఆమధ్య సత్తెనపల్లిలో ఫుట్‌పాత్ మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటే చూశానని మా తమ్ముడన్నాడు, నాకయితే తెలీదు." అన్నాడు వాసు.

"పాపం! హుస్సేన్." అన్నాడు బాబ్జి.

"హుస్సేన్ చదువులో మీఇద్దరికన్నా ముందుండేవాడు, వాడే గనక చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడు కదూ." నెమ్మదిగా అన్నాడు వాసు.

"అవును వాసు! నువ్వు చెప్పింది నిజం. హుస్సేన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకూ అదే అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి గిల్టీగా కూడా ఉంటుంది. ఇదంతా హుస్సేన్ కే చెప్పాలనిపిస్తుంది. కానీ హుస్సేన్ ఎందుకో నన్ను ఎవాయిడ్ చేస్తున్నాడు బాబ్జి." అన్నాను.

బాబ్జి ఒక్కక్షణం ఆలోచించాడు.

"నువ్వూ, వాసు కేవలం అతని చదువు గూర్చే మాట్లాడుతున్నారు, కానీ చదువొక్కటే జీవితం కాదు గదా. ఇంటర్తో చదువాపేసిన వాసు కూడా హాపీగానే ఉన్నాడు. కానీ నా బాధల్లా హుస్సేన్ బాల్యం గూర్చే. అతని బాల్యం చాలా ఘోరంగా చిదిమెయ్యబడింది. తండ్రి చేసిన తప్పులకి హుస్సేన్ జీవితం బలైపోయింది, సో సాడ్. అన్నివిధాలా అర్హత వుండికూడా, జీవితంలో ఏ అవకాశం లేకుండా చేసిన సమాజం పట్ల ద్వేషం పెంచుకున్నాడేమో. హుస్సేన్ నిన్నెందుకు ఎవాయిడ్ చేస్తున్నాడో నేనర్ధం చేసుకోగలను." అన్నాడు బాబ్జి.

ఇంటికి వస్తూ బాబ్జి చెప్పిన పాయింట్ ఆలోచించాను.

హుస్సేన్ ఆలోచనలు కూడా బాబ్జి చెప్పినట్లే ఉన్నాయా? మా అందరికన్నా తెలివైనవాడై ఉండికూడా ఎన్నో బాధలు పడ్డాడు. తనకి జరిగిన అన్యాయానికి ఈ సమాజం పట్ల ఏహ్యభావం ఏర్పర్చుకున్నాడా? నేనూ ఆ సమాజంలో భాగాన్నే కదా. అందుకనే నాతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదా? నా శుష్కవచనాలు హుస్సేన్‌కి సంతోషం కలిగించకపోవచ్చు. పైగా చికాకు, కోపం తెప్పించవచ్చునేమో కూడా.

చదువు నాకు సమాజంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది. నా జీవితం సంతోషమయం. ఇప్పుడు నాకు నా చిన్ననాటి స్నేహితులతో అలనాటి మధుర క్షణాలు నెమరువేసుకోవడం హాయినివ్వవచ్చు. కానీ - హుస్సేన్ కి మానిన గాయం మళ్ళీ రేపినట్లు అవ్వచ్చు. కడుపు నిండినవాడు ఆహ్లాదంగా, సరదాగా కబుర్లు చెప్పగలడు. కానీ నాతో కబుర్లు పంచుకోవటానికి హుస్సేన్‌లో కొద్దిపాటి ఆనందం అయినా మిగిలుండాలి గదా. అసలంత విశాల హృదయం హుస్సేన్‌కి ఎందుకుండాలి?

నేను హుస్సేన్ నా ప్రియనేస్తం అనుకున్నాను. కానీ హుస్సేన్‌ని బాబ్జిలాగా అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే, ఇప్పుడు హుస్సేన్ గూర్చి వాకబు చెయ్యడం మానుకున్నాను.  

(picture courtesy : Google)

Wednesday 8 February 2012

శేషమ్మగారు - 'అపర ధన్వంతరి'

"అమ్మా! అబ్బా!" కడుపు చేత్తో  పట్టుకుని, కళ్ళు గట్టిగా మూసుకుని, పళ్ళ బిగువున బాధ భరిస్తున్నాను.

"కొంచెం ఓపిక పట్టు నాన్నా, ఒక్కనిమిషం." అంటూ తులసికోట నుండి రెండు తులసి దళాల్ని తుంచారు శేషమ్మగారు.

పొట్టిగా, తెల్లగా, బొద్దుగా, నుదుట రూపాయంత కుంకుమ బొట్టుతో ప్రశాంతంగా కనిపించే శేషమ్మగారంటే మావీధిలో అందరికి గౌరవం. విశాలమైన శేషమ్మగారిల్లు మా ఇంటికి రెండిళ్ళ ఆవతలగా ఉంటుంది.

ఆ తులసి దళాల్ని దోసిలిలో పెట్టుకుని సూర్యుని వైపు చూస్తూ ఏవో మంత్రాలు జపించారు. నెమ్మదిగా కళ్ళు తెరచి ఆ తులసి ఆకుల్ని నాపొట్ట మీద ముందుకీ వెనక్కి సున్నితంగా మూడుసార్లు రాశారు. 

"ఇంటికెళ్ళి పడుకో నాన్న, కొంతసేపటికి తగ్గిపోతుంది." హామీ ఇచ్చారు శేషమ్మగారు.

ఆవిడ చెప్పినట్లే కొద్దిసేపటికి నా కడుపునొప్పి 'హుష్'మంటూ ఎగిరిపోయింది! దటీజ్ శేషమ్మగారు.. అపర ధన్వంతరి!

నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టి పెరిగాను. ఐదోక్లాసు దాకా శారదానికేతనంలో చదువుకున్నాను. అక్క నాకు ఒక సంవత్సరం సీనియర్, స్కూలుకి రెగ్యులర్‌గా వెళ్ళేది. నాకు మాత్రం స్కూలుకెళ్ళడం అత్యంత దుర్భరంగా ఉండేది. మా స్కూలు భూకంపంలో కూరుకుపోయినట్లూ, వరదల్లో కొట్టుకుపోయినట్లూ మధురమైన కలలొచ్చేవి (ఆవిధంగా కలలు నిజం కావని చిన్నప్పుడే గ్రహించాను).

స్కూలు ఎగ్గోడదామని అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేసేవాణ్ణి. ఆ ప్రయత్నాలు విఫలమవడమే గాక తన్నులు బోనసుగా లభించేవి. ఆవిధంగా నాపై నిర్భంద విద్యాబోధన కార్యక్రమం కర్కశంగా, నిర్విఘ్నంగా అమలు జరపబడింది. దీన్నే 'చదువుకోవటం' అనంటారని పెద్దయ్యాక అర్ధమైంది.

అమ్మకి చుట్టుపక్కల ఇళ్ళల్లో స్నేహితులుండేవారు. వాళ్ళల్లో ఎదురింటి విజయ అతి ముఖ్య స్నేహితురాలు. మేం ఆవిడని 'విజయక్కయ్య' అని పిలిచేవాళ్ళం. విజయక్కయ్య వయసులో అమ్మకన్నా పదేళ్ళు చిన్నది. ఆవిడ భర్త ఆఫీసుకి, పిల్లలు బడికి వెళ్ళిన తరవాత అమ్మతో చాలాసేపు కబుర్లు చెప్పేది.

ఇద్దరు కలిసి బియ్యంలో రాళ్ళు యేరేవాళ్ళు, మినుమలు తిరగలి పట్టేవాళ్ళు, ఆవకాయ పట్టేవాళ్ళు. కబుర్లు కూడా వెరైటీ సబ్జక్టుల మీద చెప్పుకునేవాళ్ళు. 'సుబ్రమణ్యం పెళ్లిసంబందం యెందుకు తప్పిపోయింది? సుబ్బలక్ష్మికి పెళ్ళయి నాలుగేళ్ళైనా ఇంకా కడుపెందుకు రాలేదు?' నాకు వాళ్ళ కబుర్లు అర్ధమయ్యేవి కాదు. 

కుక్కలకి వాసనశక్తి స్పెషల్ పవర్, అది ఆ జాతి లక్షణం. కుక్కజాతివలే నాలోనూ ఒక స్పెషల్ పవర్ ఉంది. అది - అమ్మ, విజయక్కయ్యల సినిమా ప్రోగ్రాం ముందుగా పసిగట్టెయ్యడం. సినిమా ప్రోగ్రాం వున్ననాడు వీళ్ళద్దరూ కళ్ళతో సైగలు చేసుకుంటారు, తక్కువగా మాట్లాడుకుంటారు. నాకు వీళ్ళ బాడీ లాంగ్వేజి అర్ధమైపొయ్యేది.

ఈ విషయం తెలీని అమాయక అక్క మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ స్కూలుకెళ్లిపొయ్యేది. అన్నం పీకల్దాకా దట్టించి, నా కడుపునొప్పి నటన ప్రారంభించేవాడిని (అన్నం తినకముందే కడుపునొప్పి యాక్షన్ మొదలెడ్తే ఆ తరవాత ఆకల్తో చస్తాం, అందుకే నటనలో టైమింగ్ ముఖ్యం అంటారు పెద్దలు).

స్కూలుకెళ్ళే ముందు - 'అమ్మా, నొప్పి' అంటూ డొక్క నొక్కుకుంటూ కూలబడిపొయ్యేవాణ్ని. నా ఈ గొప్ప ఐడియాని (నేను పుట్టకముందే) కాపీ కొట్టేసి ఎల్వీ ప్రసాద్ 'పెళ్ళిచేసి చూడు'లో పాటగా పెట్టేశాడు - ఆ విషయం పెద్దయ్యాక తెలిసింది!

స్కూల్ టైమ్ దాటిపొంగాన్లే ఈ ఓవర్ యాక్షన్ శృతి కొంత తగ్గించాలి. స్కూలు అనే ప్రధమ గండం గడిచింది గదా, అని పూర్తిగా రిలాక్స్ అయితే నాది ఉత్తుత్తి కడుపునొప్పని తెలిసిపోతుంది. ఇది మన భవిష్యత్తు నాటకాలకి దెబ్బ (దురాలోచన చేసేవాడు దూరాలోచన కలిగుండాలి).

అమ్మ, విజయక్కయ్య కొద్దిసేపు మంతనాలు సాగించేవారు. ఇద్దర్లోనూ నా కడుపునొప్పి వాళ్ళ సినిమాకి ఎసరు తెస్తుందేమోననే ఆందోళన కనిపించేది. మా ఫ్యామిలి డాక్టరు వాడపల్లి వెంకటేశ్వరరావుగారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే అరవై పైసలు ఖర్చు. అంత డబ్బు అమ్మ దగ్గర ఉండేది కాదు.

అంచేత - వయా మీడియాగా నన్ను శేషమ్మగారి దగ్గరకి తీసికెళ్ళేవాళ్ళు. ఈ కథకి హీరోయిన్ శేషమ్మగారు కావున ఆవిడ వైద్యవిధానం ముందే తెలియజేశాను.

శేషమ్మగారి తులసిదళ వైద్యానంతరం నా కడుపునొప్పి సహజంగానే తగ్గిపొయ్యేది!

అమ్మ ప్రేమగా నాతల నిమురుతూ - "కళ్ళు మూసుకుని పడుకో, కొద్దిగా పనుంది, విజయతో పాటు అలా బజారు దాకా వెళ్ళొస్తా." అనేది.

"భయమేస్తుందమ్మా, మళ్ళీ నొప్పి వస్తుందేమో." అని దీనంగా అనేవాణ్ణి.

అమ్మ, విజయక్కయ్యలు మళ్ళీ మరికొద్దిసేపు మంతనాలు.

కొద్దిసేపటికి అమ్మ నెమ్మదిగా చెప్పేది - "సినిమాకెళ్దామని విజయ ఒకటే గొడవ, నువ్వూ వస్తావా?"

"వస్తానమ్మా"

"సరే, రా! ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా నాన్నకి." అని ఒట్టేయించుకుని నన్ను సినిమాకి తీసుకెళ్ళేది.

మా ఇంటికి దగ్గరగా రెండు సినిమా హాళ్ళుండేవి. ఒకటి ఆనందభవన్ పక్కగా ఉండే లక్ష్మీ పిక్చర్ పేలెస్, ఇంకోటి ఓవర్ బ్రిడ్జ్ అవతలగా శేషమహల్. అమ్మ, విజయక్కయ్యలతో పాటు నడుచుకుంటూ వెళ్లి, నా కడుపునొప్పి సినిమాలన్నీ ఈ హాళ్ళలోనే చూశాను.

తిరపతమ్మకథ, సతీసక్కుబాయి, నాదీ ఆడజన్మే, మాతృదేవత, ఆడపడుచు.. దాదాపుగా అన్నీ మూడుగంటల ఏడుపు సినిమాలే. నాకేమో ఫైటింగు సినిమాలు ఇష్టం, కానీ ఆ సినిమాల్లో భూతద్దంతో వెదికినా ఒక్క ఫైటింగ్ కూడా ఉండేది కాదు. అసలు నాకా సినిమాలల్లో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్ధమయ్యేది కాదు.

స్టిల్ నో రిగ్రెట్స్, నాది డబుల్ ధమాకా! స్కూలు ఎగ్గొట్టాను, సినిమా చూస్తున్నాను. ప్రపంచంలో ఇంతకన్నా లక్జరీ ఏముంటుంది? ఆశ్చర్యమేమంటే - హాల్లో చాలామంది మావీధి ఆడవాళ్ళుండేవారు. సినిమాహాల్లోనే 'పిన్నిగారు, వదినగారు' అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకిరించుకునేవారు.

సినిమా మొదలెట్టిన అరగంటకి హాలు వాతావరణం బరువెక్కేది, ఆపై వేడినిట్టూర్పులతో ఉక్కపోత వాతావరణం మరింత వేడెక్కేది. చిన్నగా మొదలైన ఏడ్పులు, క్రమంగా నిశ్శబ్ద వెక్కిళ్ళుగా రూపాంతరం చెందేవి. రాన్రాను ఏడుపు, పెడబొబ్బలతో హాలు దద్దరిల్లేది. ఆవిధంగా ఆ సామూహిక రోదనా కార్యక్రమం అప్రతిహతంగా గంటలపాటు సాగిపోయ్యేది.

మధ్యలో బుర్రుబుర్రున ముక్కుచీదుళ్ళు, సూర్యాకాంతాన్ని చూస్తూ మెటికల విరుపులు, తిట్లు, శాపనార్ధాలు. హీరోయిన్ కష్టాలకి పెద్దవాళ్ళు ఏడుస్తుంటే, ఉక్కపోత భరించలేక పసిపిల్లలు ఏడ్చేవాళ్ళు. ఆవిధంగా వాతావరణం రోదనాభరితంగా, శోకపూరితంగా ఉండేది. సినిమా అయిపొయ్యేప్పటికి అందరి ఆడవాళ్ళ మొహాలు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయేవి, జుట్టు రేగిపోయేది, కళ్ళు వాచిపోయేవి.

సినిమాని వినోదసాధనం అంటారు, డబ్బిచ్చి ఏడవటం వినోదం కిందకి వస్తుందా?! సమాధానం నాకు తెలీదు గానీ, మొత్తానికి నా కడుపునొప్పి నాటకంతో చాలా సినిమాలే గిట్టిచ్చాను. ఇంటికి వెళ్ళంగాన్లే హడావుడిగా మంచమెక్కి, దుప్పటి కప్పుకుని, నీరసంగా పడుకునేవాణ్ణి - అక్క స్కూల్ నుండి వచ్చే వేళయింది గదా!

'నీ బోడి కడుపునొప్పి నటన గూర్చి తెగ డబ్బా కొట్టుకుంటున్నావ్, ఆమాత్రం మా చిన్నప్పుడు మేమూ వెలగబెట్టాం.' అని అంటారా? సర్లేండి, కాకిపిల్ల కాకికి ముద్దు. నా నటన నాకు మాత్రం గొప్పే. మంచినటనకి కొలమానం ఎదుటివారిని నమ్మించడమే అయితే, నాకందులో నంది అవార్డు రావాలి. కారణం - నా కడుపునొప్పి నాటకాన్ని అమ్మ గానీ, శేషమ్మగారు గానీ, ఎప్పటికీ గ్రహించలేకపోయారు.

శేషమ్మగారి తులసిదళ మంత్రం కడుపునొప్పికి అద్భుతంగా పన్జేస్తుందని అమ్మ ప్రచారం చేసింది. శేషమ్మగారికి కూడా కాన్ఫిడెన్సు పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో తన వైద్యాన్ని జ్వరాలు, దగ్గు, గజ్జి పుళ్ళు, పంటినొప్పి వగైరా రోగాలకి విస్తరింపజేసి ప్రాక్టీసు పెంచుకున్నారు. రోజూ సాయంత్రం నాలుగింటికి తులసికోట పక్కన కూర్చుని పేషంట్లని చూసేవారు. శేషమ్మగారి మంత్రం చాల పవర్ఫుల్లనీ, కొన్నిరోగాలకి వాడపల్లి వెంకటేశ్వరరావుగారి కన్నా ఆవిడే మెరుగనీ చెప్పుకునేవారు. ఆవిడ 'అపర ధన్వంతరి' అనీ, దేవీ ఉపాసకురాలు కావడం చేతనే ఆవిడ వైద్యానికి గొప్పమహత్తు కూడా ఉందని ప్రచారం వచ్చింది.   

నేను తన వైద్యం నూటికి నూరుశాతం పనిచేసిన పేషంటుని కావటంచేత శేషమ్మగారు నాపట్ల అవ్యాజ వాత్సల్యాన్ని కురిపించేవారు.

"ఏం నాన్నా! ఈ మధ్యేం కడుపునొప్పి రావట్లేదు గదా!" అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.

ఆ పిలుపులో నాకు అనేకరకాల భావాలు గోచరించేవి. ఏ డాక్టరైనా తన మొదటి పేషంట్ పట్ల కృతజ్ఞతా భావం, ప్రేమానురాగాలు కలిగుంటాడు. తన వైద్యం వల్ల రోగం తగ్గి నార్మల్ అయిన పేషంట్లని చూస్తే డాక్టర్లకి అపరిమితమైన తృప్తి, గర్వం! నీకు ఏ రోగమొచ్చినా తగ్గించటానికి నేనున్నానుగా అనే భరోసా, అభయ హస్తం కూడా శేషమ్మగారి పలకరింపులో నాకు కనబడేవి!

ఏడు పెంకులాట, పిచ్చిబంతి మొదలైన సందుగొందుల క్రీడలు ఆడుతుండగా, శేషమ్మగారి పెరట్లో బంతి పడ్డప్పుడు, దాన్ని తెచ్చుకోటానికి వారి ఇంటి ప్రహరీ గోడ దూకి (ఇంటి తలుపులు తెరిచున్నా గోడ దూకాలనే పాలసీ నాది) పెరట్లో బంతికోసం వెతుకుతున్నప్పుడు.. చేతిలో చిన్న బెల్లంముక్కో , గుప్పెడు శనగపప్పులో పెట్టేవారు. ఎంతయినా నేనావిడ బెస్ట్ పేషంటుని గదా!

నా 'కడుపునొప్పి' తగ్గించి, నాకు దుష్టదుర్మార్గ స్కూలు నుండి తాత్కాలిక విముక్తి కల్పించి, నేను అనేక సినిమాలు చూడ్డానికి కారణభూతురాలైన 'అపర ధన్వంతరి' శేషమ్మగారికి శతకోటి వందనాలు!

Saturday 4 February 2012

కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం

"కా.. కా.. " ఒక కుర్రకాకి ఆవేశంగా నృత్యం చేస్తుంది.

ఆ శబ్దానికి ఆ పక్కనే వున్న చెట్టుతొర్రలో నిద్రోతున్న కాకికి నిద్రాభంగం అయింది. ఆ కాకి ముసల్ది. పైగా దానికి షుగరు, బిపి. ఆ రోగిష్టి ముసలికాకి కుర్రకాకిని మందలిస్తూ "కా.. కా.. " అని అరిచింది.

లిపి లేని ఈ కాకుల 'కా' భాష మీకు తెలీదు కావున మీ కోసం 'కా' భాషని అనువదిస్తూ - ఇది స్వేచ్చానువాదం అని మనవి చేసుకుంటున్నాను. 

అది ఖమ్మం పట్టణం, సిపియం రాష్ట్రమహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పట్టణం నెత్తురుగడ్డయిపోయింది. వీధులన్నీ ఎర్రరంగులోకి మారిపోయాయి. నాయకుల ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా విన్నది ఒక కుర్రకాకి. నేతల ప్రసంగాలకి ఉర్రూతలూగిపోయింది, ఉద్రేకపడిపోసాగింది.

"విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్." అని అరుస్తూ గద్దర్ స్టైల్లో డ్యాన్స్ ప్రారంభించింది.

ముసలికాకి కుర్రకాకికి వరసకి తాతవుతాడు.

"ఒరే మనవడా! ఆగాగు, యాభయ్యేళ్ళ క్రితం నేనూ నీలాగే డ్యాన్స్ చేశా. అప్పుడు మహానాయకులైన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి - చూస్తేనే వొళ్ళు పొంగిపోయేది. ఆరోజుల్లో ఎర్రరంగంటే ప్రభుత్వాలు గజగజలాడేవి. అప్పట్నించి డాన్స్ చేస్తూనే ఉన్నా. డాన్స్ చేసీచేసీ కీళ్ళనొప్పులు మాత్రం మిగిలాయి. అవే ఉపన్యాసాలు, వినీవినీ చెవుల్లోంచి నెత్తురొచ్చింది. కానీ వీళ్ళు చెబ్తున్న విప్లవం మాత్రం రావట్లేదు." అంటూ 'కా.. కా..' అని దగ్గాడు ముసలికాకి.

కుర్రకాకికి  చిర్రెత్తింది.

"తాతా! నువ్వు పెసిమిస్టువి. ఆ ఎర్రచొక్కాలు చూడు, ఆ చిందులు చూడు. ఆ వేలమంది కార్యకర్తల్ని చూస్తే 'ఉందిలే మంచికాలం ముందుముందునా' అనిపిస్తుంది." అంటూ మళ్ళీ గంతులెయ్యడం మొదలెట్టింది కుర్రకాకి. 

"మనవడా! ఈ పార్టీకి ఈ ఎర్రచొక్కా వాళ్ళు మాత్రమే ఓటర్లు. వీళ్ళే పాడతారు, ఆడతారు. వొక్కోటు కూడా బయట్నుండి పడదు. చారిత్రక తప్పిదాలు చెయ్యటం వీళ్ళకి ఫేషన్. వీళ్ళు బయటకి ఎర్రచొక్కా వేసుకున్నా, లోపల హృదయం మాత్రం పచ్చటి పసుపు."

"నువ్వు కాంగ్రెస్ పార్టీవాడివి. నువ్వు చెప్పేది నేన్నమ్మను. ఉభయ కమ్యూనిస్టులు కలిసి ప్రభంజనం సృష్టించబోతున్నారు."

"కమ్యూనిస్టు పార్టీలు కలవబోతున్నాయా!" అంటూ బోసినోరుతో భళ్లున నవ్వింది ముసలికాకి. కుర్రకాకిని జాలిగా చూస్తూ -

"ఒరే కుర్రఅజ్ఞాని! విను. ఈ కమ్యూనిస్టు పార్టీలకి మునిశాపం వుంది, ఎలక్షన్లలో సీట్లు సర్దుబాటు కాకూడదని! మంగళగిరి అసెంబ్లీ స్థానం, ఖమ్మం పార్లమెంట్ స్థానం వీళ్ళకి రణస్థలం. ఈ రెండు నియోజక వర్గాల్లో గెలుపు అనేది వీళ్ళ లక్ష్యం కాదు. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవటమే వీరి ఆశయం. ఓడిన తరవాత ఎవరికెక్కువ ఓట్లొచ్చాయో లెక్కలేసుకుని ఊరేగింపులు తీస్తారు! వీళ్ళ సంగతి బాగా గ్రహించిన మిగిలిన పార్టీలు వీళ్ళనసలు పట్టించుకోవటమే మానేశారు."

కుర్రకాకి బాగా డీలా పడింది.

ఇప్పటికే ఎక్కువ మాట్లాడిన రోగిష్టి ముసలికాకి రొప్పసాగింది.

"మనవడా! నాకు కొమ్మ పొమ్మంటుంది, చెట్టు రమ్మంటుంది. నాలిక రుచి చచ్చింది. మటన్ మస్తాన్ దగ్గరకెళ్ళి నే చెప్పానని చెప్పి ఒక మెత్తటి మాంసం ముక్క పట్రా." అంటూ నీరసంగా కళ్ళు మూసుకుంది.

దానికి ప్రతిగా కుర్రకాకి ఏదో అంటుంది.... 

కానీ - ఇప్పటికే చాలా రాశాను, ఇంతటితో నా 'కా భాష' అనువాదం ముగిస్తాను. ఇంకా రాస్తే నన్ను బూర్జువా అనీ, పెట్టుబడిదారుల ఏజంటనీ నాకు అర్ధం కాని గతితార్కిక భౌతిక వాద భాషలో తిడతారు.

నమస్తే! వణక్కం!!

Friday 3 February 2012

విగ్రహామా! భవిష్యత్తు నీదే

టీవీలో విగ్రహాల కూల్చివేత దృశ్యాల్ని చూస్తున్నాను. శ్రీశ్రీ విగ్రహం దెబ్బతింది, గుండె బరువెక్కింది.

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ సుడిగాలిలా వచ్చాడు సుబ్బు.

"సుబ్బూ! శ్రీశ్రీ విగ్రహం ధ్వంసం చేశారు, దిగులుగా వుంది." అన్నాను. 

ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.

"నాకీ విగ్రహాల సంస్కృతి పట్ల గౌరవం లేదు. అందుకే శ్రీశ్రీ  విగ్రహంపై దాడి నన్ను బాధించట్లేదు. సమాజానికి రిలవెంట్ అయినంత కాలం శ్రీశ్రీ ప్రజల గుండెల్లో వుంటాడు, లేకపోతే లేదు. పని గట్టుకుని  శ్రీశ్రీ విగ్రహాన్ని టాంక్ బండ్ పై పోషించడం అనవసరమని నా అభిప్రాయం."

ఇంతలో కాఫీ  వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ మాట్లాడసాగాడు సుబ్బు.

"ఈ విగ్రహాలనేవి ఒక ప్రాంతానికీ, కాలానికీ సంబంధించిన సాంఘిక, రాజకీయ భావాల ఆధిపత్య ప్రదర్శన. పుస్తకాల్లో లిఖించబడే చరిత్ర వలే విగ్రహాలు కూడా శిల్పులతో చెక్కించబడే చరిత్ర. స్టాలిన్, సద్దాం విగ్రహాలు ఇందుకు ఉదాహరణ. రాజ్యాధికారం మారినప్పుడు ఈ విగ్రహాలు సహజంగానే నేలకొరుగుతాయి. బుద్దుడి విగ్రహాన్ని కూలగొట్టి తాలిబన్లు అప్పటి దేశరాజకీయాన్ని చరిత్రలో లిఖించారు." 

"అయితే ఈ విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వంసం.. అంతా చరిత్రేనంటావ్." అన్నాను.

"కరెక్ట్, అంతేకాదు.. ఈ విగ్రహాల నిర్మాణం, కూల్చివేతలు భవిష్యత్తులో మరింతగా యెక్కువవుతయ్." అన్నాడు సుబ్బు.

"ఎందుకని?" అడిగాను. 

"విగ్రహ నిర్మాణం వ్యక్తిపూజ, కూల్చివేత వెంటిలేషన్ ఆఫ్ ఏంగర్. ఈ రెంటిదీ హీరోకీ, విలన్ కీ వున్న సంబంధం. విలన్ లేని హీరో వుండడు, హీరో లేని విలన్ వుండడు. నిర్మాణ సంస్కృతి వుంటేనే ధ్వంస సంస్కృతీ వర్ధిల్లుతుంది." అంటూ ఆగాడు సుబ్బు. 

"అంటే ఈ రెండు సంస్కృతులూ ఘర్షిస్తూ వుంటాయన్నమాట." అన్నాను. 

"అవును. విగ్రహంలో చాలా సెంటిమెంట్ వుంటుంది, ఎమోషనూ వుంటుంది. భవిష్యత్తులో విగ్రహాల రాజకీయాలు ఇలా కూడా వుండొచ్చు.. ఒకచోట ఒక వర్గం విగ్రహ ముట్టడి, ప్రతిగా ఇంకో వర్గం ఇంకో విగ్రహం ముట్టడి. బందీలైన విగ్రహాలు గజగజ. హోస్టేజ్ క్రైసిస్. టీవీ లైవ్ షోలు, టాక్ షోలు. ఉద్రిక్త పరిస్థితులు, పోలీస్ లాఠీ చార్జ్, కాల్పులు, హాహాకారాలు, మృతులు, నష్ట పరిహారాలు."

"రోజూ ట్రాఫిక్ జామ్ లన్నమాట!"

"ఇంకెక్కడి ట్రాఫిక్! ప్రజలు నగరాల్ని ఖాళీచేసి ఊరు బయట  గుడారాల్లో నివసిస్తుంటారు. నగరాలన్నీ ఖాళీ, నిర్మానుష్యం, వీధులన్నీ వందల విగ్రహాలు. కుక్కలు, కాకులు కూడా చంపబడతాయ్!"

"మధ్యలో అవేం చేశాయి?" ఆశ్చర్యపొయ్యాను.

"కుక్కలు కాలెత్తి విగ్రహాల్ని అపవిత్రం చేస్తాయి. కాకులకి విగ్రహాల తలలంటే భలే ఇష్టం. అందుకే వాటిపై రెట్టలేసి తమ ఆనందాన్ని చాటుకుంటయ్." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నీకింత ఇమేజినేషన్ వుందనుకోలేదు." మెచ్చుకోలుగా అన్నాను.

"గాడిద గుడ్డేం కదూ! విల్ స్మిత్  సినిమా 'అయామ్ లెజెండ్' నేపధ్యంతో, జాక్ లండన్ 'ఐరన్ హీల్' క్లైమేక్స్ ని వినిపించాను. అంతే!" అంటూ టైమ్ చూసుకున్నాడు.

"ఔరా! కాపీ క్యాట్! " అన్నాను.

"మధ్యలో పిల్లులేం చేశాయి మిత్రమా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు!

updated and published in FB on 9/3/2018