Friday 31 October 2014

చెత్తమనిషి


"అయనెంత పెద్దనాయకుడు! ఏ మాత్రం భేషజం లేకుండా రోడ్లూడుస్తున్నాడే! ఇన్నాళ్ళూ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అపరిశుభ్రత. అది ఆయన చెబ్తేగానీ మనం తెల్సుకోలేపొయ్యాం! దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికిదే రాచమార్గం. రా! నువ్వూ ఓ చీపురు తీసుకుని ఊడువు!"

"ఈ రోడ్లూడవడానికి పారిశుధ్య కార్మికులున్నారు. పర్యవేక్షించడానికి మునిసిపాలిటీ వుంది. ఆ వ్యవస్థని మెరుగు పరిచే ఆలోచన తరవాత చేద్దాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది - మనూరి చెరువు సమస్య. ఆ మందుల కంపెనీవాడు వదిలే కాలుష్యంతో చెరువు విషంగా మారిపోతుంది. ఈ సంగతి ఆ పెద్దనాయకుడుగారికి చెప్పి కాలుష్యాన్ని ఆపించరాదా?"

"అదెలా కుదురుతుంది? మందుల కంపెనీవాణ్ని ఇబ్బంది పెడితే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పోవా? రేపు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారు? అన్ని నిబంధనలు తూచా పాటించేట్లైతే ఆ కంపెనీవాడు వాళ్ళ దేశంలోనే మందులు తయారుచేసుకునేవాడు కదా! మన్దేశంలో మందుల ఫ్యాక్టరీ ఎందుకు పెడతాడు?"

"ఒకపక్క జనాలు చస్తున్నా పట్టించుకోనప్పుడు - రోడ్ల మీద చెత్తకాయితాలు ఊడవడం దేనికి?"

"పిచ్చివాడా! చెత్త అనునది అనారోగ్య హేతువు, దేశానికి దరిద్రం. నీ అధర్మ సందేహాలు వీడి - నువ్వూ ఓ చీపురు చేత బుచ్చుకో! నీక్కూడా ఓ ఫొటో తీయిస్తాలే!"

"ముందా కాలుష్యం సంగతి తేల్చు, అప్పుడూడుస్తా!"

"అన్నా! వీడితో మాట్లాడేదేంది? వీడెవడో చెత్తమనిషిలా వున్నాడు. అరేయ్! రోడ్డు మీద చెత్త సంగతి తరవాత - ఎట్లాగూ ఫోటోగ్రాఫర్ రావడానికి ఇంకా టైముంది. ఈలోపు ఈ చెత్తనాకొడుకుని ఎత్తి ఆ చెత్తకుండీలో నూకండిరా!" 

Tuesday 28 October 2014

ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది? పరపీడణ పరాయణత్వం!


పొద్దుట్నుండి టీవీ చూళ్ళేదు. ఇవ్వాళ రోజంతా పేషంట్లతోనే గడిచిపోయింది. అందువల్ల - దేశంలో ఎక్కడ ఏ రైలు పడిపోయిందో, ఎవరు ఎవర్ని తిట్టారో తెలుసుకోవడంలో చాలా వెనకబడిపొయ్యాననే అందోళనతో, ఆత్రుతతో టీవీ ఆన్ చేసి ఓ ఇంగ్లీషు చానెల్ నొక్కాను. ఆశ్చర్యం! దేశం ప్రశాంతంగానే వుంది.

టీవీ చానెళ్ళు నానా రకాలు. కొన్ని చానెళ్ళు అదే పనిగా ప్రకటనలు గుప్పిస్తూ, ఆ ప్రకటనల మధ్యన లేటెస్ట్ హిట్ సినిమా వేసుకుంటూ కళకళలాడుతుంటాయి. పాపం! కొన్ని చానెళ్ళు దివాళా తీసిన బట్టల కొట్టులా, ఐసీయూ పేషంటులా అలిసిపోయి, వెలిసిపోయి బ్రతుకీడుస్తుంటాయి.

నా ఖర్మ కాలి - అట్లాంటి ఒక దిక్కుమాలిన ఛానెల్నే నొక్కాను. ఆ చానెల్లో మైసూరుమహారాజ పేలెస్‌లో జరుగుతున్న దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నారు! దీపావళి అయింతరవాత కూడా దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నాడంటే ఈ చానెల్‌వాడు ఎంత దరిద్రంలో వున్నాడో అర్ధమవుతుంది! అది మైసూరు పేలెస్.. ఒక క్షణం అలానే చూస్తుండిపొయ్యాను.

పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను - సౌత్ ఇండియా సైకియాట్రీ కాన్ఫెరెన్సుకి మైసూరు వెళ్ళాను. సాధారణంగా కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు (విడి సమయంలో) హోటల్ రూం వదిలి బయటికి పోను. టీవీ చూసుకుంటూనో, ఏదో పుస్తకం చదువుకుంటూనో కాలం గడిపేస్తాను. వీలైనంత మేరకు కాన్ఫరెన్సు జరిగే హోటల్లోనే రూం బుక్ చేసుకుంటాను కాబట్టి ఇబ్బంది వుండదు.

మైసూరుకి కుటుంబ సమేతంగా వెళ్లాను. కావున - 'చచ్చినట్లు' సైట్ సీయింగ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. కాన్ఫరెన్సు నిర్వాహకులే మైసూరు మహారాజా పేలెస్ అంటూ తోలుకెళ్ళారు. చూస్తున్నవాళ్ళల్లో కొందరు 'ఆహా! ఓహో!' అంటూ పేలెస్ అందాల్ని చూసి మురిసిపోతున్నారు. నాకు మాత్రం ఆ పేలెస్ డబ్బు, అధికార దర్పానికి వికృత నిదర్శనంగా కనిపించింది.

నాకప్పుడు జాన్ రీడ్ రాసిన 'టెన్ డేస్ దట్ షూక్ ద వరల్డ్' కూడా గుర్తొచ్చింది. నేనా పుస్తకం చదివాను, కొన్నాళ్ళకా సినిమా కూడా చూశాను. బోల్షివిక్కులు అధికార భవనాన్ని ఎంత చక్కగా ఆక్రమించుకున్నారు! మనం మాత్రం ఇక్కడ రాజుల సంపదని, వైభోగాన్ని దర్శిస్తూ ముచ్చట నొందుతున్నాం! పైగా - దసరా ఉత్సవాలు బాగా చేస్తాడని మెచ్చుకోళ్ళు!

నా ఈ గొప్ప ఆలోచనని నా భార్యతో పంచుకున్నాను. ఆవిడ నా అభిప్రాయాన్ని (ఎప్పటిలాగానే) పట్టించుకోలేదు.

అప్పుడు గుర్తొచ్చింది. హైస్కూల్లో వుండగా క్యూలో నించుని సాలార్‌జంగ్ మ్యూజియం చూశాను (ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ చూళ్ళేదు). అప్పుడు నాకో ధర్మసందేహం వచ్చింది.

'ఈ సాలార్‌జంగుకి ఇన్ని డబ్బులెక్కడివి?'

సమాధానం అప్పుడు నాకు తెలీలేదు గానీ - ఇప్పుడు తెలుసు.

రాజులు ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తారు. నిజాం నవాబు పక్కనుండే సాలార్‌జంగుల్లాంటి అసిస్టెంట్లు - ద్రాక్షా సారాయము సేవిస్తూ, అంతఃపుర నర్తకిల నృత్యగానముల్ని తిలకిస్తూ.. మానసికోల్లాసానికి దేశవిదేశాల నుండి ఖరీదైన వస్తువులు సేకరించెదరు. అందువల్ల ప్రజలు శాశ్వతముగా గోచీపాతరగాళ్ళలా మిగిలిపోవుదురు, రాజులు మాత్రం హాయిగా నుందురు.

నాకీ సందేహం ముప్పైయ్యేళ్ళ క్రితం తాజ్ మహల్‌ని చూసినప్పుడు కూడా వచ్చింది.

'ఈనాడైనా, ఆనాడైనా, ఏనాడైనా - సగటు మనిషి జీతం జీవితం ఒక జీవన పోరాటం! ఇక కూలీజనులు కష్టాల జీవితం కడు దుర్భరం. ఈ రాజు ముండాకొడుకులు మాత్రం ప్రజల వద్ద పన్నులు పిండడం - చచ్చిన పెళ్ళాలకి, ప్రియురాళ్ళకి పాలరాతి మందిరాలు కట్టించడం! పైగా - అదేదో ప్రేమకి నిదర్శనమని మనలాంటి బుద్ధి లేని గాడ్డె కొడుకులు మురిసిపోవడం! అసలీ షాజహాను గాణ్ని ఈ తాజ్ మహల్ ఓపెనింగ్ రోజున పైకెక్కించి తోసేస్తే పొయ్యేది. చచ్చి - వెంటనే ముంతాజుని కలుసుకునేవాడు. అసలు నిజమైన ప్రేమంటే అదే!'

'నువ్వు రాసేది తప్పు. ఈ రాజులు చాలా మంచివాళ్ళు. అందునా ఒక మతం రాజులు మరీ మంచివారు. వాళ్ళు రహదారుల పక్కన వృక్షములని నాటించారు, బాటసారుల కోసం సత్రాలు కట్టించారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో నువ్వు చదువుకోలేదా?'

కవులు నానావిధములు. ఒకరకం కవులు కడదాకా ప్రజల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'ప్రజాకవులు'. ఇంకోరకం కవులు నిక్కముగా, నిక్కచ్చిగా ప్రభువుల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'గిట్టుబాటు కవులు'. మరోరకం కవులు - ప్రజల పక్షాన వున్నట్లుగానే వుంటూ - ప్రభువులు విదిలించే అవార్డులకీ, రివార్డులకీ ఆనందంతో వొళ్ళు పులకించగా, కృతజ్ఞతతో శిరస్సు వొంగిపోతుండగా - ప్రభువుల పక్షాన చేరతారు. అది వారి బలహీనతట! ఈ మూడోరకం కవుల్ని 'ఉభయచర జీవులు' అనాలని రంగనాయకమ్మ రాయంగా చదివాను.

మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న చెత్తని టన్నుల కొద్దీ కుమ్మరించినవారు గిట్టుబాటు కవులు మరియూ ఉభయచర జీవులు అని నా అనుమానం! రాజుల కన్నా ఆ రాజుల్ని కీర్తించిన కవులే పెద్ద దొంగాముండాకొడుకులని నమ్ముతున్నాను.

ముగింపు -

అసలు మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర చరిత్రేనా? చరిత్ర రాసిన పండితులు రాజులకి ప్రాముఖ్యతనిస్తూ - వారి వంశపాలన ఆధారంగా కాలాన్ని అధ్యాయాలుగా విడగొట్టారు. రాజుల చరిత్ర ప్రజల చరిత్ర ఎలా అవుతుంది? కాంగ్రెస్ చరిత్ర దేశచరిత్ర అవుతుందా? కాదు కదా! ఇది చాలా అసంబద్ధం, అన్యాయం కూడా. ప్రజల వైపు నుండి, ప్రజల తరఫున, ప్రజల కోసం రికార్డ్ చేసిన వాస్తవాలే చరిత్ర అవుతుంది తప్ప - అసత్యాలు, అతిశయోక్తుల సమాహారం చరిత్ర కాజాలదు.

ముగింపుకి ముగింపు -

"ఈ విషయంతోనే మహాకవి శ్రీశ్రీ డెబ్భైయ్యైదేళ్ళ క్రితమే 'దేశచరిత్రలు' అంటూ ఒక మహప్రస్థాన కవిత రాశాడు. ఆ కవిత కాన్సెప్ట్ కాపీ కొట్టేశావేమిటి?"

స్వగతముగా -

'వీడి దుంప దెగ, విషయం పట్టేశాడే!'

ప్రకాశముగా -

"అయ్యో! అలాగా? నాకా శ్రీశ్రీ ఎవరో తెలీదు! ఆయన 'మహప్రస్థానం' అసలే తెలీదు. అయినా - నే పుట్టక ముందు రాసిన కవిత నాకెలా తెలుస్తుంది!? కావున ఇది అచ్చంగా నాకొచ్చిన సొంత ఆలోచనే! శ్రీశ్రీకీ, నాకూ ఒకే ఆలోచన రావడం కేవలం యాదృచ్ఛికం! ఇది మీరు నమ్మాలి."

Sunday 26 October 2014

రెహనే జబ్బారి! సారీ తల్లీ!


నిన్న ఇరాన్‌లో రెహనే జబ్బారి అనే అమ్మాయిని ఉరి తీశారు. ఆ అమ్మాయి ఒకణ్ని కత్తితో పొడిచి చంపిందట! గల్ఫ్ దేశాల్లో శిక్షలు కౄరంగానూ, అమానవీయంగానూ వుంటాయి. ఇందుకు వాళ్ళేవో కారణాలు చెబుతారు కానీ - అవి మనకి అర్ధం కావు. 

'నేరము - శిక్ష' అన్నవి ఆయా సమాజాల పురోగతిని తెలియజేస్తాయని అనుకుంటున్నాను. చైనాలో మరణ శిక్షలు ఎక్కువ. యూరోప్‌లో మరణ శిక్షలే లేవు. ఈ yardstick తో చూస్తే - యూరోపియన్ దేశాలు మంచివనీ, చైనా చెడ్డదనీ అనుకోవచ్చు. అలాగే - అమెరికావాడి కన్నా మనం చాలా మంచివాళ్ళం.

అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. 'శిక్షల శాసనాలు ఆయా దేశాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల్ని అనుసరించి నిర్ణయించబడతాయి. అటువంటప్పుడు - అన్ని దేశాలకీ ఒకే yardstick ఎలా ఉంటుంది?' అని. ఇందులో వాస్తవం వుంది కూడా.

అన్ని మతాల్ని, సంస్కృతుల్ని గౌరవించినట్లుగానే ఆయా దేశాల శిక్షాస్పృతుల్ని గౌరవించాలని కొందరు వాదించొచ్చు. ఒప్పుకుంటున్నాను. నేరవిచారణ, శిక్షాస్పృతి వంటి విషయాలు చర్చించాలంటే బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం కావాలి. నాకది లేదు కాబట్టి ఇక్కడితో ఈ విషయం వదిలేస్తాను.

అయితే - 'భార్యపై అనుమానం వస్తే ఆమె పీక నులిమి చంపేసుకోవచ్చు. అరటిపండు దొంగిలించినవాడి అరిచెయ్యి అందరిముందు కులాసాగా నరికేసుకోవచ్చు.' ఇలాంటి శిక్షలు విన్నప్పుడు నా కడుపులో తిప్పుతుంది. ఇలా నా కడుపులో తిప్పడం - ఆ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదనీ, వారి మతవిశ్వాసాల్ని అగౌరవపర్చడం కాదనీ నమ్ముతున్నాను. 

ఒకదేశంలో మలేరియా, టైఫాయిడ్‌తో జనాలు చస్తున్నారంటే ఆ దేశంలో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ దారుణంగా వుందని చెప్పొచ్చు. ఒకదేశంలో చిల్లుచెంబులు కూడా దొంగతనానికి గురవుతున్నాయంటే, ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ మరీ పేదగా వుందని చెప్పొచ్చు. ఒకదేశంలో కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టి చంపడాలు లాంటి కౄరమైన శిక్షలు అమలవుతున్నాయంటే, ఆ దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టం ఆటవికంగా వుందని చెప్పొచ్చు. 

'రెహనే జబ్బారి ఇరాన్ పౌరురాలు. ఆ దేశంవాళ్ళు వాళ్ళ చట్టాలని అనుసరించి విచారించారు, నేరస్తురాలిగా తేల్చారు, చట్టప్రకారం ఉరి తీశారు.' అని నేను అనుకోలేను. నేరస్తుల్ని - వాళ్ళు చేసిన నేరానికి తూకం సరిపొయ్యేంత కౄరంగా శిక్షించాలనే ఆలోచన నాకు వెగటుగా వుంటుంది.  

ఒక విశ్వమానవుడిగా (సాటి మనిషిగా) ఇలా అనుకుంటున్నాను - 

"రేహనే జబ్బారి! సారీ తల్లీ!"

(picture courtesy - Google)

Monday 20 October 2014

పవిత్ర భారతనారి




"ఇది హిందూదేశం, పవిత్ర భారత దేశం. స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆదిపరాశక్తి. ప్రపంచంలో స్త్రీని దేవతగా పూజించే దేశం ఏదన్నా వుందీ అంటే - అది మన భారత దేశమే. ఇట్టి సర్వోన్నతమైన దేశంలో జన్మించినందుకు నాకు గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయం ఆనందంతో ఆవిరైపోతుంది. ఒక్కోసారి సంతోషం ఎక్కువై కళ్ళు తిరుగుతుంటాయి, నరాలు పీకుతుంటాయి కూడా!"

"అవునా? మరి ఈ దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కదా!"

"అవును. ఇది మిక్కిలి ఖండనీయము, శోచనీయము. కొందరు దుర్మార్గుల వల్ల మన పవిత్ర భారద్దేశానికి చెడ్డ పేరొస్తుంది. ఈ దుస్థితి తల్చుకుని రోజూ కనీసం ఒక గంటయినా గుక్కపెట్టి ఏడుస్తుంటాను."

"అయితే మీ భార్య చాలా అదృష్టవంతురాలు. ఇంతటి ఉన్నతమైన భావాలు కలిగిన మిమ్మల్ని భర్తగా పొందిన ఆమె స్వేచ్ఛగా హేపీగా వుండి వుంటారు! యామై రైట్?"

"అవును! నా భార్య ఎంతో స్వేచ్ఛగా, హేపీగా నాకు సేవ చేస్తుంటుంది."

"నే చెప్పే స్వేచ్ఛ అది కాదు. మీ భార్య తనకిష్టమైన పన్లు తనకిష్టమొచ్చిన రీతిలో చేసుకోవచ్చని!"

"కొంచెం విడమర్చి అడిగితే సమాధానం చెబుతాను."

"అలాగే! ఉదాహరణకి - మీ భార్య చీర కొనుక్కోవాలనిపించిందనుకోండి, హాయిగా షాపుకెళ్ళి తనకిష్టమైన చీర కొనేసుకోవచ్చు."

"నోనో! నా భార్యో పిచ్చి మొద్దు. దానికి ఒళ్ళు కనపడే పల్చటి చీరలు కట్టుకోకూడదని తెలీదు, తనకే రంగు చీర నప్పుతుందో కూడా తెలీదు, ఎంత రేటులో కొనుక్కోవాలో అస్సలు తెలీదు. అందుకే దాన్ని వెంటబెట్టుకుని మరీ షాపుకి తీసుకెళ్ళి - నేనే దగ్గరుండి చీరలు సెలెక్ట్ చేస్తాను. అయినా భారత నారికి పతియే ప్రత్యక్ష దైవం. అంచేత ఆ దైవం సెలెక్ట్ చేసిన బట్టలే కట్టుకోవాలి. అది రూలు!"

"మరి - మీ భార్యకి స్నేహితుల్తో సరదాగా కబుర్లు చెప్పుకునే స్వేచ్ఛ... "

"నా భార్య పరాయి మగాణ్ని కన్నెత్తి చూడదు. ఇక ఆడ స్నేహితులంటారా? ఈ వీధిలో ఆడవాళ్ళ నడత మంచిది కాదు. అందరూ లూజ్ కేరక్టర్లే! నా భార్య నిప్పే! కానీ మనం జాగర్తగా లేకపోతే ఆ నిప్పుక్కూడా చెదలు పడతాయి! అందుకే నా భార్యని వాళ్ళతో కలవనివ్వను!"

"..................................."

"అడగడం ఆపేశారేం? ఇంకా అడగండి!"

"అడగడానికింకేం లేదు."

"సర్లేండి! నా హృదయంలోంచి ఉప్పొంగుతున్న భావాల్ని మరొక్కసారి చెప్పనివ్వండి. ఇది హిందూదేశం, పవిత్ర భారత దేశం. స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆదిపరాశక్తి. ప్రపంచంలో స్త్రీని దేవతగా పూజించే దేశం ఏదన్నా వుందీ అంటే - అది మన భారత దేశమే. ఇట్టి సర్వోన్నతమైన దేశంలో జన్మించినందుకు నాకు గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయం ఆనందంతో ఆవిరైపోతుంది. ఒక్కోసారి సంతోషం ఎక్కువై కళ్ళు తిరుగుతుంటాయి, నరాలు పీకుతుంటాయి కూడా!"

(posted in fb on 4/5/2018)

Friday 17 October 2014

అందం అందరికీ ఆనందమే! నాకు మాత్రం ఏడుపు!!


నాకు సమయం దొరికినప్పుడు పాత తెలుగు సినిమా పాటల్ని యూట్యూబ్‌లో చూస్తూ ఆనందించడం అలవాటు. ఇవ్వాళ కూడా ఓ పాత పాట చూడ్డం మొదలెట్టాను.

అది నాగేశ్వర్రావు, సావిత్రిల 'అందమే అనందం, ఆనందమె జీవిత మకరందం' పాట. ఆడియో బాగుంది గానీ - వీడియో స్పష్టంగా లేదు.

అహాహా! ఘంటసాల స్టోనే స్టోనే గదా! సావిత్రి అందమే అందం కదా! నాగేశ్వర్రావు స్టైలే స్టైలు కదా!

తన్మయత్వం చెందుతూ (అలవాటు చొప్పున) మైమరచిపోదామనుకుంటుండగా -

గుండె కలుక్కుమంది, హృదయం భళుక్కుమంది. మనసులో ముల్లు గుచ్చుకుంది, కంట్లో నలక పడింది. బాధ, దుఃఖం, దిగులు, ఏడుపు జమిలిగా మనసుని ఆవహించాయి.

ప్రేమానుభూతిని ఇట్లాంటి పాటల్లో చూసి ఆనందించడమే గానీ, నేనెప్పుడూ అనుభవించి ఎరుగను. వలపు అనునది మైసూరు పాకము వలే తీయగానూ, విరహం అనునది మైసూరు బోండా వలే వేడిగానూ వుండునని కృష్ణశాస్త్రి, ఆత్రేయలు రాస్తే - సైన్సు పాఠంలాగా చదువుకున్నానే గానీ.. అనుభవిస్తే ఎలా వుంటుందో తెలీదు. ఆఖరికి మిస్సమ్మలో మిస్ మేరీ కూడా రామారావు పుణ్యమాని సినిమా చివర్లో వెన్నెల మహిమని అనుభవించింది, మంచి పాట కూడా పాడింది. నాకాపాటి అదృష్టం కూడా లేదు!

ఈ లోకంలో కొందరు వెధవలుగా పుడతారు, వెధవలుగానే బ్రతుకుతారు, వెధవలుగానే ఛస్తారు. అట్టి వెధవాయిల్లో నేను ముందు వరసలో వుంటాననే (వున్నాననే) అనుమానం (ఒక్కోసారి నమ్మకం) నన్ను హచ్ కుక్కలా వెంటాడుతుంది.

నేనేం పాపం చేశాను?

బరువుగా, భారంగా నిట్టూర్చాను. దీనంగా, దీర్ఘంగా ఆలోచించసాగాను.

ఓయీ దురదృష్ట మానవా! ఒక్కసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని రివ్యూ చేసుకో. ఇప్పుడు నీకో క్లిష్టమైన ప్రశ్న! నీదసలు జీవితమేనా?

ముక్కుతో గాలి పీల్చుకోడం, కళ్ళతో ప్రపంచాన్ని చూడ్డమే జీవితం అయితే నీది జీవితమే! నోటితో అడ్డమైన గడ్డీ తిండం, చేతుల్తో వీపు గోక్కడం జీవితమైతే నీది జీవితమే!

మహాకవి శ్రీశ్రీ 'మనదీ ఒక బ్రతుకేనా? కుక్కలవలె నక్కలవలె!' అంటూ ఒక చేదుపాట రాశాడు. అది నీలాంటి వాళ్ళ గూర్చే! చదువుకోలేదా?

నీ జీవితం అడవి గాచిన వెన్నెల! బూజు పట్టిన నిమ్మకాయ పచ్చడి! అమ్ముడుపోని సినిమా టిక్కెట్టు! ముక్కు తుడుచుకుని అవతల పడేసిన టిష్యూ పేపర్!

జీవితంలో నువ్వు సాధించిందేమిటి? నీకు మిగిలిందేమిటి?

శంకర విలాస్ సెంటర్లో మిరపకాయ బజ్జీలు, ఆనంద భవన్లో మసాల దోసెలు, బాబాయ్ హోటల్లో నేతి ఇడ్లీలు.. ఛీఛీ వెధవా! నీ జీవితానికి అర్ధం లేదు.

జ్యోతీలక్ష్మి డ్యాన్సుల కోసం, రామారావు కత్తియుద్ధం కోసం సినిమాలు చూడ్డం.. మునిసిపాలిటీ వర్క్ ఇన్‌స్పెక్టర్లాగా రోడ్లన్నీ బలాదూరుగా తిరగడం.. ఛీఛీ దరిద్రుడా! నీ బ్రతుకు వృధా!

ఓయీ కుళ్ళికుళ్ళి ఏడ్చు కుళ్ళు మానవా! కాలము గుంటూరు రియల్ ఎస్టేట్ భూమివలె విలువైనది! భానుమతి పాటవలె అపురూపమైనది! ఇక నీవెంత విలపించిననూ, దుఃఖించిననూ ఊడిన నీ జుట్టు రాదు, వచ్చిన నీ కీళ్ళరోగం పోదు. రాహుల్ గాంధీ వలె స్వప్నములో విహరింపకుము! యధార్ధము గ్రహింపుము. కర్తవ్యోన్ముఖుడవు కమ్ము.

(కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుని.. దీర్ఘముగా గుండెల నిండా నాలుగుసార్లు గాలి తీసుకుని)

ప్రార్ధన -

భగవాన్! వచ్చే జన్మలోనైనా నన్ను పియానో వున్న కొంపలో పుట్టించు. నాకా పియానో పలికించగలిగే సంగీతానివ్వు. నాగేశ్వర్రావుకున్న రొమేంటిక్ ఫేసునివ్వు. జూనియర్ సముద్రాలకున్న కవిత్వాన్నివ్వు. ఘంటసాలకున్న మధుర గంభీర తేనెలూరు స్టోన్‌ని ఇవ్వు.

ఇక చివరి కోరిక -

నా పాట వింటూ - మత్తెక్కించే ఓరచూపుతో అలవోకగా చూస్తూ పిచ్చెక్కించే బూరెబుగ్గల సావిత్రిని నాకు గాళ్ ఫ్రెండుగా ఇవ్వు (నా అసలు కోరిక ఇదే).

ఇంకో ముఖ్యమైన కోరిక - 

ఆ నాగేశ్వర్రావు నా చుట్టుపక్కల లేకుండా చూడు (నాకు కాంపిటీషన్ లేకుండా చెయ్యి)!

ముగింపు -

నీ ఏడుపు ఓపిగ్గా చదివాం. ఒక డౌటు. వచ్చే జన్మ కోరికల్ని ఇప్పుడే రాసుకోడం దేనికి?

దేనికంటే - 

వచ్చే జన్మలో ఈ బ్లాగు మళ్ళీ నేనే చదువుకున్నట్లైతే - అప్పుడీ సంగతులన్నీ జ్ఞాపకం వస్తాయని! మూగమనసులు సిన్మా చూళ్ళేదా?

Wednesday 15 October 2014

నేరం - రాజ్యస్వభావం


'మనుషులంతా ఒక్కటే!' అనే నినాదం నా చిన్నప్పుడు వినపడేది. ఇప్పుడు వినపడ్డం మానేసింది. మనుషులంతా ఒక్కటయ్యారో లేదో తెలీదు కానీ - మతాల వారీగా, కులాల వారీగా, వృత్తుల వారీగా మాత్రం ఒక్కటయ్యారు.

న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు - వివిధ వర్గాలలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలున్నా - బయట నుండి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం 'మనమంతా ఒక్కటే!' అనే నినాదంతో కలిసి పోరాడుతారు. ఆ పోరాటం న్యాయానికి వ్యతిరేకమా? అన్యాయానికి అనుకూలమా? అన్నది వారికి అనవసరం. ఇక - ప్రైవేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, కాంట్రాక్టర్లు.. మొదలైన కార్పోరేట్ వ్యాపార వర్గాల వాళ్ళు 'కలసి వుంటే కలదు సుఖం!' అన్న నానుడిని గట్టిగా నమ్మారు. అందుకే వాళ్ళు మంత్రులు, ప్రజాప్రతినిథులుగా కూడా రూపాంతరం చెందారు!

ఈ దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. అధికారంలోకి పాతమొహాల స్థానంలో కొత్తమొహాలు వస్తుంటాయి. పాత ప్రభుత్వాల అసమర్ధత, అవినీతి మీద కోపంతో, కసితో - కొత్త ప్రభుత్వాల్ని ఆహ్వానిస్తారు ప్రజలు. కానీ - వాళ్ళు ఆశించినంతగా పాత ప్రభుత్వ అవినీతి బాధ్యులపై నేరారోపణ గానీ, విచారణ గానీ జరగదు (మీడియాలో మాత్రం రోజువారీగా తిట్టుకుంటారు). కారణం - సింపుల్! రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ఒక్కటే!

కొందరు అమాయకులు చౌతాలా, లాలూ యాదవ్, జయలలిత వంటి నాయకులకి శిక్ష పడింది కదా! మన రాజ్యంగ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని అనుకుంటారు. ఇది కొంత నిజం, కొంత అబద్దం! ఎందుకంటే రాజ్యంగ వ్యవస్థ నేరాల్ని పూర్తిగా నిరోధించదు, రాజ్యంగ యంత్రానికి అవసరమైనంత మేరకు కంట్రోల్ చేస్తుందంతే!

ఈ రాజ్యంగ యంత్రం నేరాన్ని ఎంతమేరకు ఎందుకు అదుపు చేస్తుందో, ఎందుకు వదిలేస్తుందో - 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగ యంత్రం' అనే వ్యాసంలో బాలగోపాల్ చక్కగా వివరించాడు. నాకీ వ్యాసం గొప్ప జ్ఞానాన్నిచ్చింది.

"ఈ పరస్పరత రెండురకాల అమాయకులకు అర్ధం కాదు. అమాయకులయిన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యంగయంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు. రండవ రకంది దుస్సాహిసక అమాయకత్వం. రాజ్యంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.

అసలు సంబంధం ఇదీ కాదు, అదీ కాదు. బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.

సూక్ష్మీకరించి చెప్పాలంటే, నేరం బూర్జువా సమాజపు సంక్షోభాలకి ఒక సేఫ్టీవాల్వు లాంటిది. అవసరమయినపుడు దాన్ని తెరవకపోతే ఒత్తిడికి తట్టుకోలేక ఇంజను పగిలిపోతుంది. అలాగని సేఫ్టీ వాల్వుని ఎప్పుడూ తెరిచే వుంచితే ఇంజను అసలు పనిచేయదు. అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. అదుపులో వుంచుకోవాలి. సరీగ్గా అదే (నేరానికి సంబంధించి) రాజ్యంగ యంత్రం కర్తవ్యం.

దీనంతటి అర్ధం, రాజ్యంగ యంత్రం నేరాలలో ఏ 20 శాతాన్నో పరిష్కరిస్తుందనీ, నేరస్తులలో ఏ 20 శాతాన్నో శిక్షిస్తుందనీ ఎంతమాత్రం కాదు. నేరం కంట్రోల్‌లో వుంచుకున్నట్లు జనానికి కనిపించడం అసలు విషయాలు. అసలు నేరాలని పరిష్కరించాల్సిన అవసరంగాని, నిజమయిన నేరస్తులను నిజమయిన నేరాలకు శిక్షించాల్సిన అవసరం ఎంతమాత్రం లేవు."

బాలగోపాల్ తన విశ్లేషణ కోసం రావిశాస్త్రి రాసిన 'తలుపు గొళ్ళెం'  అనే కథని (ఋక్కులు సంపుటం), 'మాయ'  అనే కథని (ఆరుసారాకథలు సంపుటం) ఎక్కువగా ప్రస్తావించాడు. చర్చ రావిశాస్త్రి రచనల గూర్చి కాబట్టి బాలగోపాల్ లుంపెన్ వర్గాల నేరాల్ని, పోలీసుల సహకారాన్ని ప్రస్తావించాడు. ఇదే విశ్లేషణని రాజకీయ అవినీతికి కూడా అన్వయించుకోవచ్చు. అప్పుడు ఈ దేశంలోని అంతులేని రాజకీయ అవినీతిలో కొందరు మాత్రమే ఎందుకు శిక్షించబడతారో తెలుస్తుంది.

కావున ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు జైలు కెళ్ళంగాన్లే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని (నాకీ 'ధర్మం - నాలుగు పాదాలు' కాన్సెప్ట్ ఏంటో తెలీదు) మనం ఆనందపడనక్కర్లేదు. ఆ ధర్మం అప్పుడప్పుడూ కుంటుతూ ఒంటికాలుపై నడుస్తుంది - అది రాజ్యంగ యంత్రం అవసరం. ఆ మేరకైనా ఎంతోకొంత మేలు జరుగుతుందని కొందరు ఆశాజీవులు ఆనందించవచ్చు! వారిని అభినందిస్తున్నాను.

Monday 13 October 2014

విజన్ 2099


"అయ్యా! మీ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ అదేంటో - ఇన్నాళ్ళైనా మా దరిద్రపుగొట్టు జీవితాల్లో కొంచెం కూడా మార్పు కనబడట్లేదు!"

"గత ప్రభుత్వంతో పోలిస్తే మేం ప్రజలకి ఎంతో మేలు చేశాం. వంద రోజుల్లోనే మా ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలు సాధించింది."

"అవునా?"

"అందుకు ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను. గత ప్రభుత్వంలో హత్యల సంఖ్య 567. అదే మా ప్రభుత్వంలో 566 మాత్రమే. గత ప్రభుత్వంలో మానభంగాలు 199. మా ప్రభుత్వంలో మానభంగాలు 198 మాత్రమే. చూశావా? శాంతిభద్రతలు ఎంతగా ఇంప్రూవ్ అయ్యాయో!"

"అవును కదా!"

'ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 102 కోట్లు. మా ప్రభుత్వం ఖర్చు 103 కోట్లు. ఆరోగ్యం కోసం గత ప్రభుత్వం బిచ్చమేసినట్లు 10 కోట్లు ఖర్చు చేస్తే, మా ప్రభుత్వం 10.5 కోట్లు ఖర్చు చేసింది! ఇప్పుడు చెప్పు - అభివృద్ధి పట్ల మాకు ఎంతటి నిబద్ధత వుందో!'

'అవునవును - మీరు కొంచెం నయమనే అనిపిస్తుంది. కానీ ఈ లెక్కన మా జీవితాలు బాగుపడేదెప్పుడు?'

'నీకు తెలీదా? మాది విజన్ 2099. నువ్వప్పటిదాకా ఆగాలి.'

'కానీ ఐదేళ్ళకోసారి ఎన్నికలొచ్చేస్తాయిగా?'

'అవును, వచ్చేస్తాయి. అందువల్ల మేం చెప్పేదేమనగా - 2099 దాకా మీరు మాకు అధికారం ఇస్తూనే వుండాలని! అర్ధమైందా?'

'అర్ధమైంది! కానీ - ఇట్లా అంటున్నానని ఏమీ అనుకోకండి. అప్పటిదాకా మీరుండాలిగా?'

'ఇందులో అనుకోడానికేముంది! అందుకేగా ఇవ్వాళ మా అబ్బాయిని రెడీ చేస్తున్నాను. మీ ఆదరణ వుండాలే గానీ - రేపు నా మనవడు, ఎల్లుండి నా మునిమనవడు కూడా ముఖ్యమంత్రులవుతారు. వాళ్ళ తరఫున కూడా నేనే హామీ! మాట తప్పని వంశం మాది!'

'అయ్యా! ఎంతైనా మీది గొప్ప ముందు చూపండి. అంటే - మీ మునిమనవడు సాధించే అభివృద్ధిని నా మునిమనవడు అనుభవిస్తాడన్నమాట!'

'అవును. చూడ్డానికి అమాయకుళ్ళా వున్నా విషయం మాత్రం చక్కగా అర్ధం చేసుకున్నావ్. అదే మా విజన్ 2099!'

Friday 10 October 2014

పాపం! సునంద పుష్కర్


"అయ్యో! సునంద పుష్కర్ని చంపేశారా! ఎంత ఘోరం! నేనప్పుడే అనుకున్నాను - ఆ శశి థరూరే ఈ పన్జేసుంటాడని! ఆ చిప్పమొహంగాడు అమాయకంగా కనిపిస్తూ తడిగుడ్డతో గొంతు కోసే రకం!" 

అయ్యుండొచ్చు!

"ఆ డాక్టరు వెధవలు అప్పుడేమో సునందకి ఏవో రోగాలున్నాయన్నారు, నిద్రమాత్రల ఓవర్ డోసన్నారు. ఇప్పుడేమో ప్లేటు మార్చి విషప్రయోగం అంటున్నారు!"

రోజులు మార్లేదూ? అప్పుడు శశి థరూరుడు మంత్రి, ఇప్పుడు కాదు.

"అయినా శశి థరూర్‌గాడికి పెళ్ళాం ప్రవర్తన నచ్చకపోతే విడిపోవాలి గానీ - నోట్లో విషం పొయ్యడం అన్యాయం కదూ?"

ఇందాకట్నుండి ఓ ఒకటే ఆయాసపడుతున్నావ్! ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ తాగి పడేసిన ఖాళీ స్కాచ్ బాటిళ్ళంత విలువ చెయ్యదు నీ జీవితం. పెద్దవాళ్ళ భాగోతం నీకవసరమా?

"అవసరమే! అందుకే మీడియా కోడై కూస్తుంది."

ఓరి వెర్రి నాగన్నా! మీడియా ఎప్పుడూ కోడే! ఆ కోడికి కుయ్యడానికి రోజూ ఏదోక సంచలనం కావాలి. అప్పుడే మీడియావారి కోళ్ళ వ్యాపారం వర్ధిల్లుతుంది.

"శశి థరూర్ కాంగ్రెస్ వాడవడం వల్లే బీజేపివాళ్ళు రాజకీయంగా కక్ష సాధిస్తున్నారేమో?"

నేనలా అనుకోడం లేదు. ఒకళ్ళ నేరాలు ఒకళ్ళు కప్పి పుచ్చుకోడంలో అన్ని రాజకీయ పార్టీలు చక్కని సహకారం అందించుకుంటాయి. అయినా - ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీకే దిక్కు లేదు. ఇంక శశి థరూర్ గూర్చి ఎవడు పట్టించుకుంటారు?

"సునంద పుష్కర్‌కి న్యాయం జరగాలి."

అవును. న్యాయం జరగాలి. అలాగే - ఈ దేశంలో సామాన్యులక్కూడా నేరపరిశోధన, విచారణ నిస్పక్షపాతంగా జరగాలి. నేరస్తులు శిక్షించబడాలి. ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు. సునంద పుష్కర్ కేసు సరైన రీతిలో పరిష్కరించబడుతుందని ఆశిద్దాం.

"అమ్మయ్యా! కనీసం ఈ పాయింటైనా ఒప్పుకున్నావ్! థాంక్స్!"

ఈ విషయం నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు. ఇదొక హై ప్రొఫైల్ నేరం. మహా అయితే 'నేరాలు - ఘోరాలు'లో ఒక ఎపిసోడ్‌కి సరిపోనూ మసాలా వుంది. బహుశా రాంగోపాల్‌వర్మ ఒక సినిమా తియ్యడానికి పనికొస్తుందేమో. అంతకుమించి - ఈ విషయానికి రాజకీయంగా, సామాజికంగా అసలు ప్రాధాన్యతే లేదు!

Thursday 9 October 2014

మానసిక రోగుల ప్రత్యేక సమస్య


ఆ కుర్రాడికి పదిహేడేళ్ళు. దుప్పటి కప్పి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. కన్సల్టేషన్ రూములోకి వచ్చాక దుప్పటి తీశాడు తండ్రి. ఎడమ వైపు భుజం దగ్గర్నుండి పొట్ట దాకా శరీరం కాలిపోయుంది.

"ఏమైంది?" ఆందోళనగా అడిగాను. 

"పది రోజుల్నించి మళ్ళీ తేడా పడ్డాడు, మందులు మానేశాడు. నేనే దేవుణ్ననీ, తల్చుకుంటే ఏదైనా చెయ్యగలననీ ఒకటే రోల్లుడు." తండ్రి చెప్పసాగాడు. 

"అద్సరే! వొళ్ళెందుక్కాలింది?" అసహనంగా అడిగాను. 

"ఊళ్ళో కుర్రోళ్ళతో అగ్గి ముట్టించినా తన వొళ్ళు కాలదని పందెం కాశాడు. చొక్కా ముట్టించుకున్నాడు. వొళ్ళు తగలబడింది." దిగాలుగా చెప్పాడు తండ్రి. 

"అతనికి ఒంట్లో బాగోక ఏదో అంటాడు. అతనితో పందెం ఎలా కడతారు?" కోపంగా అన్నాను. 

"మా ఊళ్ళో కుర్రోళ్ళు ఈడిని ఎదవని చేసి ఆడిస్తారండి. చెప్పినా వినరు." అన్నాడు తండ్రి. 

నాకా కుర్రాణ్ణి చూస్తుంటే చాలా జాలేసింది. ఒక మానసిక వ్యాధి వున్న రోగితో ఇంత అమానవీయంగా ఎలా వుండగలరు!

ఆ కుర్రాడు నావైపు చూస్తూ గర్వంగా నవ్వాడు. 

"నేను తల్చుకుంటే చిటికినేలుతో రైలు నాపేస్తా, బస్తీ మే సవాల్! నాలో సాంబశివుడున్నాడు. మూడో కన్ను తెరిస్తే సచ్చిపోతావ్!" అంటూ అరవడం మొదలెట్టాడు. 

తండ్రితో ఇంకొంచెం సేపు మాట్లాడాక తెలిసింది - ఈ అబ్బాయిని రెచ్చగొట్టింది అతని వయసువాళ్ళు కాదు, అతనికన్నా పెద్దవయసు వాళ్ళే. ఇతని ప్రవర్తన వాళ్లకి వినోదంగా అనిపించింది. సరదా కోసం రెచ్చగొట్టారు!

ఆ అబ్బాయి కొన్నాళ్ళుగా నా పేషంట్. బైపోలార్ డిజార్దర్ అనే మానసిక సమస్యకి మందులు వాడుతున్నాడు. ఆ జబ్బులో తాము ఎంతో ఉన్నతులమనీ, తమకి సాధ్యం కానిదేదీ లేదనీ, తమలో దైవశక్తులున్నాయని ఊహించుకుంటారు. 

మనలో చాలామందికి మానసిక సమస్యల పట్ల అవగాహన వుండదు. బహుశా అందువల్లనే కావచ్చు - మానసిక రోగుల పట్ల ఉండవలసినంత సున్నితంగా వుండం. ఇందుకు చదువుకున్నవాళ్ళేమీ మినహాయింపు కాదు. కావాలంటే భూతవైద్యుల దగ్గరకెళ్ళి చూసుకోండి - ఎంతమంది చదువుకున్నవాళ్ళుంటారో!

మనసిక సమస్యల గూర్చి ఏ మాత్రం అవగాహన లేనివాళ్ళు మానసిక రోగుల్ని అర్ధం చేసుకుంటారని ఆశించడం దురాశే. పోనీ - కనీసం కంటికి కనపడే అంగవైకల్యంతో ఇబ్బంది పడేవారి పట్లనైనా మన ప్రవర్తన మెరుగ్గా వుంటుందా? వుండదు. 

మా బంధువుల్లో ఒకమ్మాయికి చూపు లేదు. కొన్నాళ్ళ క్రితం ఒక పెళ్ళిలో ఒక ముసలాయన అరుస్తున్నట్లుగా మాట్లాడుతూ (ఆయనకి సరీగ్గా వినపడదు) ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, నానా ప్రశ్నలతో వేధిస్తున్నాడు. 

"ఏమ్మా! నువ్వు పుట్టు గుడ్డివా? మధ్యలో గుడ్డివా? డాక్టర్లు లాభం లేదని చెప్పారా? నీకు రాత్రికి పగలు క్కూడా తేడా తెలీదా? నీ పన్లు నువ్వు చేసుకోగలవా?" 

ఆ ముసలాయన తన ప్రశ్నల పరంపరతో ఆ అమ్మాయిని వదలట్లేదు. నాకా అమ్మాయితో ఏదో పని వున్నట్లు చెయ్యి పట్టుకుని ఇవతలకి తీసుకొచ్చేశాను. 

"అందుకే నేను ఎక్కడకి రాను. రానన్నా వినకుండా - ముఖ్యమైన పెళ్లి అంటూ డాడీ తీసుకొచ్చారు." దుఃఖంగా అంది ఆ అమ్మాయి. 

నాకు సిగ్గుగా అనిపించింది. 

చిన్నప్పుడు నాక్కూడా ఈ విషయాలు తెలిసేవి కావు. మా వీధిలో వుండే అంగ వికలుల్ని అనుకరిస్తూ ఇంట్లోవాళ్ళకి వినోదం పంచేవాణ్ని. స్నేహితుల్లో కూడా - వ్యక్తుల ఆకారాల్ని బట్టి బండోడు, బక్కోడు అని పిల్చుకునేవాళ్ళం, పైగా అదేదో జోకులాగా ఫీలయ్యేవాళ్ళం.

సినిమావాళ్ళు కూడా వినికిడి సమస్య వున్న వ్యక్తుల్ని, సాఫీగా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే వ్యక్తుల్ని ఎగతాళి చేస్తూ తమ వంతు సేవ చేస్తుంటారు. తెలుగు సినిమా దర్శకులకి క్రియేటివిటీ తక్కువ కాబట్టి హాస్యం కోసం ఇట్లాంటి వెకిలి చేష్టల్ని ఆశ్రయిస్తారు.

ఒక సమాజం ఎంతమేరకు ఎడ్యుకేట్ అయిందో ఎలా తెలుసుకోవాలి? 'ఎంతమందికి టెన్త్ క్లాసు సర్టిఫికెట్లున్నాయి? యూనివర్సిటీ డిగ్రీలున్నాయి?' మొదలైన వివరాలతోనే కాదు - 'ఒక సమస్యని ఏ విధంగా అర్ధం చేసుకుంటున్నారు, ఆ సమస్య పట్ల ఎలా స్పందిస్తున్నారు' అన్నది కూడా ఒక ముఖ్య ప్రమాణం కావాలి.

ముగింపు -

మన సమాజం మానసిక రోగాల పట్ల అవగాహన పెంచుకోవాలనీ.. మానసిక రోగంతో ఇబ్బంది పడేవారి పట్ల సానుభూతి, సున్నితత్వంతో వ్యవహరించాలని ఆశిద్దాం.

అంకితం -

చిన్నారి జె.అఖిల్‌కి. మొన్న మూడో అంతస్తులోంచి 'ప్రమాదవశాత్తు' పడి చనిపొయ్యాడు. ADHD కి ట్రీట్‌మెంట్ ఇస్తున్నాను. ఆ బాబు హైపర్ యాక్టివిటీ అతనికి శత్రువయ్యింది. వైద్యం గూర్చి నన్ను అనేక సందేహాలు అడిగిన ఆ బాబు తల్లికి నా ప్రగాఢ సానుభూతి.

సందర్భం -

నేడు World Mental Health Day. 

Friday 3 October 2014

యేసుదాసుని సూక్తులు


అందరికీ అన్నీ తెలియాలా? అవసరం లేదు. అలా తెలుకోవడం అనవసరం కూడా. నాకు పందుల పెంపకం గూర్చి తెలీదు, వీణ వాయించడం రాదు, టీవీ రిపైర్ చెయ్యడమూ రాదు. అందుకు నేనేమీ సిగ్గు పడట్లేదు. ఆయా రంగాల్లో ఆయా నైపుణ్యం కలవారు వున్నారు, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు - నాకనవసరం. 

అందువల్ల నాలాంటి సాధారణ మానవుణ్ని - ఏదైనా తెలీని రంగం గూర్చి ప్రశ్నడిగితే టక్కున - 'తెలీదు'  అని చెప్పేస్తాడు. 

అదేవిధంగా -

'ఆడవాళ్ళ దుస్తుల పట్ల నీ అభిప్రాయం ఏంటి?' అనడిగితే -

'ఎవరికేది సౌకర్యంగా వుంటే అదే ధరిస్తారు. ఇందులో నాకెందుకు అభిప్రాయం వుండాలి!' అని ఆశ్చర్యపోతాను.

'ఆడవారి దుస్తుల బట్టి మగవాళ్ళు రెచ్చగొట్టబడి అత్యాచారాలకి పాల్పడుతున్నారా?' అనడిగితే -

కొద్దిసేపు - 'ఏం చెప్పాలా?' అని ఆలోచిస్తాను. ఎందుకంటే - ఆడవాళ్ళ దుస్తులకీ, నేరాలకి గల సంబంధం నాకు తెలీదు. అటువంటి పరిశోధన ఏదైనా దేశంలో జరిగిందేమో కూడా నాకు తెలీదు. తెలీనప్పుడు నోర్మూసుకుని వుండటం ఉత్తమం అని మాత్రం తెలుసు. అందువల్ల - 'తెలీదు' అనే సమాధానం చెబ్తాను. 

అయితే - మనుషులందు సెలబ్రిటీలు వేరు. ఈ సెలబ్రిటీలకి సన్మానాలు, భక్త పరమాణువులు ఎక్కువ. అంచేత వారు ఆవడల దగ్గర్నుండి ఆఫ్రికన్ చింపాంజీల దాకా అన్ని విషయాలు తమకి తెలుసుననే భావనలోనే వుంటారు. అదీగాక వారికి 'తెలీదు' అని సమాధానం చెప్పడం నామోషీగా వుంటుంది. కావున వారు అన్ని విషయాల్లో నోటికొచ్చిందేదో చెప్పేసి చప్పట్లు కొట్టించుకుంటారు.

మొన్నామధ్య ఒక టీవీ రియాలిటీ షోలో ఒక ప్రముఖ తెలుగు గాయకుడు రావిశాస్త్రి ఇంటి పేరు 'రావి' అనే భీభత్సమైన నిజాన్ని సెలవిచ్చార్ట! అందుకు మనం ఆయన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు - ఆయనకి తెలిసిందది! తెలీని విషయాల్ని 'తెలీదు' అని చెప్పుకోడానికి ఆయనేమీ మనలా సామాన్యుడు కాదుగా!

యేసుదాస్ మళయాళీ. చాలా భాషల్లో సినిమా పాటలు పాడాడు. శాస్త్రీయ సంగీతం కూడా పాడతాట్ట. శాస్త్రీయ సంగీతం పట్ల నాకు ఆసక్తి లేదు - కావున విన్లేదు. నేను ఏసుదాస్ సంగీతం వినకపోవడం వల్ల యేసుదాసు కొచ్చిన నష్టం లేదు. ఆయన ఎక్కడో అమెరికాలో వుంటాడు. అప్పుడప్పుడు మన దేశానికొచ్చి సంగీతాన్ని పాడి వెళ్తుంటాడు.

అయితే - నిన్న యేసుదాసుల వారికి ఆడవారు జీన్సు ధరించడం పట్ల చికాకు కలిగింది. శుభ్రంగా సంగీతం పాడుకునే ఆయన గారికి వున్నట్లుండి ఈ డ్రెస్సుల గోలెందుకో తెలీదు. పాపం! ఆయన వాలకం చూస్తుంటే అక్కడున్న సంగీతం పెద్దమనుషుల్తో నాలుగు మార్కులేయించుకోడానికి మాట్లాడినట్లుంది గానీ - వేరే ఉద్దేశం ఉన్నట్లు లేదు. ఉద్దేశం వుండేంత అవగాహన కూడా ఆయనకి వున్నట్లు లేదు. 

ఈమధ్య కొందరు ప్రముఖులు తామే రంగంలో నిష్టాతులమో - ఆ రంగం గూర్చి తప్ప మిగిలిన అన్ని విషయాల గూర్చి లెక్చర్లిస్తున్నారు, ముఖ్యంగా ఆడవారికి సలహాలివ్వడంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఇంతకుముందు ఉదయాన్నే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సూక్తి గీత ముక్తావళి అనే కార్యక్రమం వచ్చేది (ఇప్పుడు కూడా వస్తుందేమో తెలీదు). ఇప్పుడా బాధ్యత సెలబ్రిటీలు నెత్తినెత్తుకున్నట్లుగా వుంది. ఎబోలా లాగా ఇది కూడా ఒక కొత్త రోగం అనుకుంటా! 

Thursday 2 October 2014

పన్నీర్ సెల్వం (మా హౌజ్ హస్బెండు గాడి కథ కూడా)


తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్‌ సెల్వంని అభినందిస్తున్నాను. రాజకీయాలు అత్యంత క్రూరమైనవి. ఛాన్సు దొరికితే నమ్మినవారే నట్టేట ముంచేస్తారు. బ్రహ్మానందరెడ్డిని నమ్మిన ఇందిరా గాంధీకి ఏమైందో మనకి తెలుసు. అందుకే నాయకులందరూ తమ కొడుకుల్నీ, కూతుళ్ళనీ రంగంలోకి దించుతున్నారు. ఈ నేపధ్యంలో - తన నాయకురాలు కోసం, క్రికెట్‌లో నైట్ వాచ్‌మెన్‌లాగా ముఖ్యమంత్రి కుర్చీకి కుక్క కాపలా కాస్తున్న పన్నీర్ సెల్వం ధన్యజీవి. నాకు తెలిసి - పన్నీర్ సెల్వంతో పోల్చదగ్గ వ్యక్తి పాదుకా పట్టాభిషేకం చేసిన భరతుడు ఒక్కడే.

పుస్తకాల్లో, పత్రికల్లో - ఫలానావాడు గొప్పనాయకుడు అంటూ ఏదేదో రాస్తుంటారు. ఎందరో నాయకులు! అందరికీ వందనములు! మరి గొప్పనాయకుడు కానివాడికి చరిత్ర వుండదా? ఈ ప్రశ్నకి సమాధానం చరిత్ర పుస్తకాల్లో దొరకదు. ఎందుకంటే వారి చరిత్రని ఎవరూ రాయరు. ఒక రాజ్యాన్ని సమర్ధవంతంగా యేలాలంటే గొప్పనాయకుడొక్కడే సరిపోడు. ఆ నాయకుడికి విశ్వాసపాత్రత, భక్తి ప్రవృత్తత కలిగిన అనుచర గణం కూడా వుండాలి. ఇటువంటి లక్షణాలు పుష్కలంగా వున్న పన్నీర్ సెల్వం దొరకడం పురచ్చి తలైవి అదృష్టం.

పన్నీర్ సెల్వం గూర్చి రాస్తుంటే నా స్నేహితుడొకడు గుర్తొస్తున్నాడు. అసలు పేరేదైతేనేం? అతగాడు 'హౌజ్ హస్బెండ్‌'గా ప్రసిద్ధుడు. దించిన తల ఎత్తకపోవడం, ముక్తసరిగా మాట్లాడ్డం మంచితనపు లక్షణాలే అయినట్లైతే అతను మంచివాడే! ఎంతో కష్టపడి డిగ్రీ అయిందనిపించాడు. ఉద్యోగం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించినా - ఉద్యోగం అతనికో ఎండమావిలా మిగిలిపోయింది.

ఇంతలో - వన్ ఫైన్ డే - నా స్నేహితుడు పెళ్ళి చేసుకున్నాడు! భార్యది బాగా కలిగిన కుటుంబం, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు బోల్డెంతమంది వున్నార్ట. అందుకే - పెళ్ళైన సంవత్సరం లోపే భార్య తరఫువాళ్ళు మావాడికి ఏదో గవర్నమెంటు ఉద్యోగం కూడా వేయించుకున్నారు. ఈడ్చి తన్నినా పైసా రాలని మావాడిని చేసుకోడానికి ఆ పిల్లెలా ఒప్పుకుంది?!

ఈ ప్రశ్నకి సమాధానం మాకు మావాడి పెళ్ళిలోనే దొరికింది. పెళ్లికూతురు పొట్టిగా వుంది, లావుగా వుంది, దళసరి కళ్ళద్దాలతో వుంది. ప్యూను పెళ్ళికొచ్చిన అయ్యేయస్ ఆఫీసర్లా - నొసలు చిట్లిస్తూ చిటపటలాడుతూ చిరాగ్గా వుంది. పెళ్ళయ్యాక మావాడి పరిస్థితేంటి? బండకేసి బాది ఉతికి ఆరేస్తుందా? ముక్కలుగా కోసి మిక్సీలో పడేసి జ్యూసుగా చేసుకుంటుందా? గాడిపొయ్యిలో పడేసి బాగా కాల్చి తందూరీగా చేసుకుంటుందా?

ఉండబట్టలేక మా సుబ్బు అడగనే అడిగాడు - 'ఏరా నాన్నా! పెళ్ళికూతుర్ని సరీగ్గా చూసుకున్నావా?'

మావాడు తలెత్తకుండా తొణక్కుండా స్థిరంగా చెప్పాడు - 'మనకి పిల్లనివ్వడమే గొప్ప! ఇంక సరీగ్గా చూట్టం కూడానా?'

అటుతరవాత మావాడి కాపురం విశేషాలు అడపాదడపా మా సుబ్బు నా చెవిలో వేస్తూనే వున్నాడు. మావాడి భార్య ఇంటిపని చెయ్యదు. పనిమనిషినీ పెట్టలేదు. మావాడు రోజూ తెల్లారగట్టే లేచి ఇల్లు చిమ్మి, వంట చేసి, పిల్లల్ని స్కూలుకి రెడీ చేస్తాడు. ఆఫీసు పని అవ్వంగాన్లే - ఇంటికొచ్చి బట్టలుతికి, మళ్ళీ వంటపన్లో పడతాడు. ఒక్క మంగళ సూత్రం మాత్రమే తక్కువ - మావాడు మంచి గృహిణుడు (గృహిణికి పు.లింగం).

మరి మావాడి భార్యేం చేస్తుంది? ఆవిడకి పొద్దస్తమానం నీరసంట! అంచేత - నీరసం తగ్గడానికి బోర్నవిటా, బూస్టులు తాగుతుంది. పడక్కుర్చీలో పడుకుని నవలలు చదువుతుంది, సోఫాలో జార్లగిలబడి టీవీ చూస్తూంది, డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ చేస్తుంది. ఇన్ని పన్లు చేసినందున అలసిపొయ్యి డబుల్ కాట్ మీద దుప్పటి తన్ని నిద్రోతుంది.

మావాణ్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి సుబ్బు తీవ్రంగా శ్రమించాడు.

'ఇంట్లో కుక్కలాగా బండెడు చాకిరీ చేస్తున్నావు. సిగ్గులేదా?'

'మన పని మనం చేసుకోడానికి సిగ్గెందుకు!'

'ఏం? నీ భార్యెందుకు పనందుకోదు?'

'పని కావడం ముఖ్యం గానీ - ఎవరు చేస్తే ఏముంది!'

'కదా? మరావిడ పనెందుకు చెయ్యదు?'

'పోన్లేద్దూ! ఆవిడకి నీరసంట!' వెధవ నవ్వుతో నంగి సమాధానం.

కందకి లేని దురద కత్తిపీటకేల? - ఈ విషయం ఇంతటితో వదిలేద్దామనుకున్నాం, మా వల్ల కాలేదు.

ఇప్పుడంటే భర్తల గ్రాఫు పడిపోయింది గానీ - మన తాతల కాలంలో భర్తలంటే ఎలా వుండేవాళ్ళు? అచ్చు సింహాల్లా వుండేవాళ్ళు. మా తాత గాండ్రింపుకి మా అమ్మమ్మ వణికిపొయ్యేది. ఆయనకి నిద్ర పట్టకపోతే - నిద్రొచ్చేదాకా మా అమ్మమ్మని, ఆవిడ పుట్టింటివాళ్ళని తెగ తిట్టి పోసేవాడు. ఆయన నిద్ర పోయ్యాకే మా అమ్మమ్మ నిద్ర పోవాలి. అది రూలు! మా అమ్మమ్మ మహాఇల్లాలు! కావున మా తాత తిట్లని వినయంగా గుడ్ల నీరు గుక్కుకుని భరించేది!

అట్టి సింహాల వంటి భర్తల స్థాయిని - ఎట్లాగూ మా తరం వాళ్ళం గ్రామసింహాల స్థాయికి దిగజార్చాం. పైగా సంసారానికి భార్యాభర్తలు రెండు స్కూటర్ చక్రాల్లాంటివాళ్ళని దరిద్రపుగొట్టు సుభాషితాల్తో సమర్దింపులు! కానీ - మావాడు భర్తలకి కనీసం ఆ స్థాయైనా మిగల్చలేదు. భార్యకి చరణదాసిగా మారిపొయ్యి మగజాతికే మాయని మచ్చగా మిగిలిపోయ్యాడు. పైగా ఏదో ఘనకార్యం సాధినవాళ్ళా ఆ వెధవ నవ్వొకటి! మావాణ్ని చూస్తుంటే మాకు మండిపొయ్యేది. అందువల్ల కసిదీరా సూటిపోటి మాటలని తృప్తినొందేవాళ్ళం.

'మేమందరం హస్బెండులం మాత్రమే! నువ్వు మాకన్నా ఎక్కువ - హౌజ్ హస్బెండువి!'

'బట్టల మురికి పోవాలంటే రిన్ బాగుంటుందా? సర్ఫ్ బాగుంటుందా?'

'మా ఆవిడ పుట్టింటి కెళ్ళింది. ఓ సారలా వచ్చి వంట చేసి పోరాదూ?'

అన్నింటికీ సమాధానంగా మళ్ళీ అదే వెధవ నవ్వు! వీణ్నీ, ఈ దేశాన్ని బాగు చెయ్యడం మన వల్లకాదు అనుకుని వదిలేశాం. తరవాత వాడికేదో ఊరికి బదిలీ అయ్యి వెళ్ళిపొయ్యాడు.

చాల్రోజుల తరవాత మొన్నో పెళ్ళిలో మావాడు కనిపించాడు. కొంచెం లావయ్యాడు, జుట్టు సగం పైగా రాలిపోయింది.

'ఏరోయ్ హౌజ్ హస్బెండూ! బాగున్నావా?' పలకరించాను. సమాధానంగా ఓ వెధవ నవ్వొకటి నవ్వాడు. వీడికీ జన్మకి ఆ నవ్వు పోదనుకుంటా!

'పెళ్ళికి మన హౌజ్ హస్బెండుగాడొచ్చాడు. వాడి ట్రేడ్‌మార్కైన ఆ వెధవ నవ్వు మాత్రం అలానే వుంది. నీక్కనబడ్డాడా?' భోజనాల తరవాత బయట లాన్‌లో కనబడ్డ ఇంకో స్నేహితుణ్ని అడిగాను.

'వాడిది వెధవనవ్వవొచ్చు గానీ - మనం మాత్రం అసలు సిసలు వెధవలం!' సీరియస్‌గా అన్నాడతను.

ఆశ్చర్యపోతూ క్వశ్చన్ మార్కు మొహం పెట్టాను.

'మనం వాడి మీద ఎన్నెన్నో జోకులేసుకున్నాం. వాడు తెలివైనవాడు కాబట్టే మన కుళ్ళుజోకుల్ని పట్టించుకోలేదు.' అన్నాడు.

'అసలు సంగతి చెప్పు.' అసహనంగా అన్నాను.

'నా భార్య నేను ఆఫీసు నుండి రాంగాన్లే కాఫీ ఇస్తుంది, భర్తగా నన్ను గౌరవంగా చూస్తుంది. అయితే ఏంటి లాభం? గానుగెద్దులా ఉద్యోగం చేశాను. అప్పు చేసి మరీ మా అబ్బాయిని పెద్ద చదువు చదివించాను. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ తీర్చాల్సిన సమయానికి - ఆ దరిద్రుడు పక్క సీటులో అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపొయ్యాడు. రూపాయి పంపించడు - ఇక్కడ అప్పులకి వడ్డీ కట్టలేక ఛస్తున్నాను.' దిగులుగా అన్నాడతను.

'అలాగా!' సానుభూతిగా అన్నాను.

'అదే ఆ హౌజ్ హస్బెండుగాణ్ని చూడు. మావఁగారితో పెద్ద ఇల్లు కొనిపించాడు. పిల్లల భారం మొత్తం బావమరుదులకి వొదిలేశాడు. ఆ పిల్లలిప్పుడు మంచి పొజిషన్లో సెటిలయ్యారు. పైసా ఖర్చు లేదు. వాడి జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా చిన్నపాటి ఉద్యోగం కూడా వచ్చేది కాదు. వాడు చేసిందల్లా ఏమిటి? వంట చేసి బట్టలుతకడమే కదా!' దాదాపు ఏడుస్తున్నట్లుగా అన్నాడు నా మిత్రుడు!

ఇక్కడితో మా హౌజ్ హస్బెండు గాడి కథ సమాప్తం.

ఈ కథ చదువుతుంటే మీకు పన్నీర్ సెల్వం గుర్తొస్తే సంతోషం. పన్నీర్ సెల్వం కూడా మా హౌజ్ హస్బెండు గాడిలాగే తెలివైనవాడు. ఒక ఎమ్మెల్యే కావాలంటేనే అనేక ఖర్చులు, వెన్నుపోట్లు, నక్కజిత్తులు. అట్లాంటిది కేవలం అమ్మ భక్తుడిగా వుంటూ - అదేపనిగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ - రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా అయ్యాడంటే ఎంత అదృష్టవంతుడు!

రాజకీయాల్లో అందరూ చంద్రబాబు, మమతా బెనర్జీల్లాగా కష్ట పడనక్కర్లేదు. హాయిగా మా హౌజ్ హస్బెండు గాడిలాగా వినయంగా, విధేయంగా, తల వంచుకుని లేదా దించుకుని - పని చేసుకుంటూ పొతే చాలు. అదృష్టం కొంచెం తంతే మంత్రి కుర్చీలోకి, గట్టిగా తంతే ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్లి పడతాం!

ప్రమాణ స్వీకారం సమయాన పన్నీర్ సెల్వం ఉద్వేగంతో కన్నీరు కార్చాడు. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదనే మోటు సామెతల జోలికి వెళ్ళను గానీ - నాకెందుకో పన్నీర్ సెల్వంలో అంట్లు తోమి, బట్టలుతికి జీవితంలో విజయం సాధించిన మావాడు కనిపిస్తున్నాడు! వీళ్ళకి తమ అయోగ్యత, బలహీనతల గూర్చి సంపూర్ణమైన అవగాహన వుంది. అందుకే విజయలక్ష్మిని వరించారు!

పన్నీర్ సెల్వం! హ్యాట్సాఫ్ టు యువర్ తెలివి తేటలు మేన్ ! కీపిటప్!