Tuesday 26 July 2011

నాడు గిరీశం - నేడు నిత్యానందం


నిత్యానందుని శృంగారం,  కల్కివారి మత్తుమందులు, విజ్ఞుల ఆక్రందనలు - టీవీ గోలగోలగా ఉంది. ఒకప్పుడు బాబాలు - తగ్గని రోగాలకీ, రాని ఉద్యోగాలకీ, పుట్టని పిల్లలకీ తాయెత్తులు కట్టేవాళ్ళు. ప్రస్తుతం ఈ బాపతు మునిసిపాలిటీ బడుల్లాగా పేదోళ్ళకే పరిమితమయ్యారు. 

ఇప్పుడు అమెరికా అనకాపల్లి కన్నా దగ్గరైపోయింది. డాలర్లు మురిక్కాలవల్లా ఏరులై పారుతున్నాయ్. మన అవసరార్ధం కార్పోరేట్ ఆసుపత్రులూ, షాపింగ్ మాల్సూ, పబ్బులూ, క్లబ్బులూ వెలిశాయి. యోగా, భక్తిమార్గం corporatise చేసుకొన్నాం. యోగం, ధ్యానం, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మలను కలగలుపుతూ ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించే కొత్తదేవుళ్ళని సృష్టించుకొన్నాం.

మన career prosperity కి వారి పాలరాతి మందిరాల్లో, భక్తిప్రసాద రిసార్టుల్లో ముక్తి నొసంగెదరు, మనకి గుండెల నిండా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పించెదరు, మనసులోని కుళ్ళు వదిలించెదరు. డబ్బున్నబాబులకి ఈ భక్తి టూరిజం ఓ ముక్తిమార్గం.. కాదన్డానికి మనవెవరం? 

ప్రజల అవసరార్ధం గిరీశాలు పుట్టుకొస్తారు. సొమ్ము చేసుకొంటారు. గిరీశాన్ని నమ్మి లేచిపోయిన బుచ్చమ్మది తప్పవుతుందిగానీ.. తన వాక్చాతుర్యంతో బుచ్చమ్మని నమ్మించిన గిరీశానిది తప్పెలా అవుతుంది?! 

గిరీశం నాలుగు బొట్లేరు ఇంగిలీసు మాటలతో (గిరీశం పట్ల గల అసూయతో రామప్ప పంతులు బొట్లెరింగ్లీషంటాడే గానీ గురజాడవారు గిరీశంతో మంచి ఇంగ్లీషే మాట్లాడించారు.) బుచ్చమ్మని పడేశాడు. వైధవ్యం నుండీ అగ్నిహోత్రుని అగ్ని నుండీ విముక్తి లభిస్తుందని బుచ్చమ్మ నమ్మింది. అయినా లేవదీసుకుపోయిన గిరీశానికీ, లేచిపోయిన బుచ్చెమ్మొదినకీ లేని బాధ మనకేల? 

మోసం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వస్తుమార్పిడి వంటిది. చదరంగం ఆట లాంటిది కూడా. మనమెవ్వరి పక్షమూ వహించనక్కర్లేదు. కానీ నాకు గిరీశాలన్నా, నిత్యానందులన్నా అసూయ - ఎందుకు? మోసం చెయ్యడానికి తెలివి కావాలి. ఆ తెలివి లేనివాడు మాత్రమే భవిష్యత్తు కోసం, భుక్తి కోసం చదువనో, వ్యాపారమనో నానా కష్టాలు పడతాడు. నేను రెండో కేటగిరీకి చెందినవాణ్ణి, అందుకు! 

(picture courtesy : Google)

Thursday 14 July 2011

మీ (మా) వారపత్రిక

చిన్నప్పటి జ్ఞాపకాలు యెవరికైనా మధురానుభూతులే! మొదటిసారి సినిమా చూసినప్పుడు, హోటల్లో ఇడ్లీసాంబార్ లాగించిన్నప్పుడు.. ప్రతి అనుభవం చుట్టూ అనేక జ్ఞాపకాలు పెనవేసుకునుంటయ్. నా సైకిల్ టక్కడం వెనుక కూడా పెద్ద కథే వుంది. సైకిల్ కలిగుండటం అదృష్టంగానూ, దాన్ని తొక్కేవారిని గంధర్వులుగానూ భావించేవాణ్ణి. సైకిల్ తొక్కే అవకాశం కోసం అనేక కుట్రలూ పన్నేవాణ్ణి! 

విశ్వం నాకు ఆరోక్లాసులో స్నేహితుడు, చాలా మంచివాడు. విశ్వం అన్నకో డొక్కుసైకిలుంది. సరీగ్గా కాళ్లందని విశ్వం ఆ సైకిల్ని ఎగిరెగిరి పడుతూ తొక్కేవాడు. విశ్వాన్ని చూసి కుళ్ళుకున్నాను, సైకిల్ తొక్కే అవకాశం కోసం విశ్వానికి దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నాను.  
                         
స్కూలు టైము తరవాత పేరట్లో ఉన్న ఉసిరి (చెట్టు) కాయలు తీసుకెళ్లి యివ్వటం, వాడి చేతిరాత చాలా బాగుంటుందనడం, నాకన్నా వాడికే లెక్కలు బాగా వచ్చని పొగడటం.. ఇత్యాది ప్రణాళికలు రచించి అమలుపర్చాను. కష్టేఫలి! మొత్తానికి కొన్నాళ్లకే విశ్వానికి మంచి స్నేహితుణ్నైపొయ్యాను. తద్వారా ఆ సైకిల్ తొక్కే అర్హత సంపాదించాను.

సైకిల్ విహారం మబ్బుల్లో తేలిపోతున్నట్లుండేది. ఒకడు సైకిల్ తొక్కుతుంటే ఇంకొకడు సైకిలు సీటు ముందున్న కడ్డీమీద కూర్చోవాలి. నిమిషానికొకసారి పడే చైన్ వేసే బాధ్యత కడ్డీమీద కూర్చునేవాడిది! ఆవిధంగా డివిజన్ ఆఫ్ లేబర్నీ పాటించేవాళ్ళం.
                         
విశ్వం అన్న (సైకిలు సొంతదారుడు) అప్పటికే డిగ్రీలాంటిదేదో చదువుకుని ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన మాకో పన్జేప్పేవాడు. అదేమంటే - ప్రతివారం (శుక్రవారమా?) పొద్దున్న రైల్వే స్టేషన్‌కి సైకిల్ తొక్కుకుంటూ పోయి హిగ్గిన్ బోథమ్స్‌లో ఆంధ్రపత్రిక (సచిత్రవారపత్రిక) కొనే పని. సైకిల్‌కి తాళం లేదు కావున ఒకడు రైల్వే స్టేషన్లోకి వెడితే ఇంకోడు సైకిలుకి కాపలాగా బయటే ఉండాల్సొచ్చేది.    
                 
ఆంధ్రపత్రిక కొని సైకిల్ని వాయువేగంతో, శరవేగంతో తొక్కుతూ (తొందరగా తొక్కేవాళ్ళం అని రాస్తే సరిపోతుంది, కానీ - అంత కష్టపడి తొక్కిన తొక్కుణ్ణి విశేషణాలేమీ జోడించకుండా సింపుల్‌గా రాయటం నాకిష్టం లేదు) ఇంటికి తెచ్చి విశ్వం అన్నకి ఇచ్చేవాళ్ళం. అతను అప్పటికే పోస్టు కార్డుతో రెడీగా ఉండేవాడు. పత్రిక ఒక అరనిమిషం ముందుకీ, వెనక్కీ తిరగేసేవాడు. ఆ తరవాత ఒకే నిమిషంలో ముత్యాల్లాంటి అక్షరాలతో ఆంధ్రపత్రిక సంపాదకులవారికి ఉత్తరం రాసేవాడు.

ప్రతివారం ఒకటే మేటర్! మీ (మా) వారపత్రికలో ఫలాన కధ అద్భుతం. సీరియల్ తదుపరి భాగం కోసం ఇంట్లో అందరం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. వంటింటి చిట్కాలు అమోఘం, అందులో ప్రచురించిన ఫలానా వంటకం మా చెల్లెలు (ఆయనకసలు చెల్లెల్లేదు) తయారుచేసింది. ఆ రుచిని తట్టుకోలేకపోతున్నాం. ఇట్లా పోస్టు కార్డులో వ్యాసం లాంటిది రాసేవాడు.
                             
ఆయన రాసిన పోస్టు కార్డుని తీసుకుని - మళ్ళీ వాయువేగంతో, శరవేగంతో (ఈ విశేషణాలని మీరు తప్పించుకోలేరు) సైకిల్ తొక్కి.. పెద్ద పోస్టాఫీస్ ముందుండే పెద్ద పోస్టుడబ్బాలో వేసేవాళ్ళం. ఇదంతా చాలా పద్ధతిగా నిమిషాల్లో జరిగిపోయేది.
                             
విశ్వం అన్న రాసిన ఉత్తరాలు అప్పుడప్పుడు పబ్లిషయ్యేవి. కానీ - ఆ ఉత్తరం 'పాఠకుల ఉత్తరాలు' శీర్షికలో రెండోదిగానో, మూడోదిగానో ఉండేది! మా ఉత్తరం కన్నా స్పీడుగా యింకెవరన్నా యెలా ఇచ్చేవాళ్లో  నాకర్ధమయ్యేది కాదు. నా శ్రమకి తగ్గ ఫలితం లభించట్లేదని బాధ కలిగేది.  


ఒకరోజు విశ్వం అన్న నాకు అసలు రహస్యం చెప్పాడు.
                             
ఆంధ్రపత్రిక బెజవాడ నుండి పబ్లిషవుతుందిట. బెజవాడవాళ్ళు పత్రిక రిలీజు కాకముందే ఒక కాపీ సంపాదించి, గబగబా ఉత్తరం రాసేసి పత్రిక ఆఫీస్ ముందున్న పోస్ట్ డబ్బాలో వేసేస్తారట, లేదా డైరక్ట్‌గా ఆఫీస్‌లోనే ఇచ్చేస్తార్ట. అంచేత బెజవాడ వాళ్ళు మా గుంటూరు వాళ్ళకన్నా ఎంతో ముందుంటారు. ఔరా! ఈ బెజవాడవాళ్ళు ఎంత తొందరపాటు మనుషులు!!  

Saturday 9 July 2011

కొ.కు. 'ఐశ్వర్యం' - చలం ప్రస్తావన

గుంటూరులో రాతగాళ్ళ వాతావరణం నాకంతగా కనిపించలేదుగానీ తెనాల్లో బాగా కనిపించింది. ఎదురింటి శేషాచలం దగ్గిర చలం పుస్తకం ఒకటి తీసుకున్నాను చదువుదామని.
       
"చదవక చదవక ఆ బూతు కథలే చదువుతున్నావ్?" అన్నాడు బాబాయి.
       
"బూతులేని సాహిత్యం ఎక్కడుంది బాబాయ్? నీ బీరువాలో ఆ మనుచరిత్ర ఏమిటి? బూతుకథలు కావూ ?" అన్నాను .
       
"అవి అంత తేలిగ్గా అర్ధమవుతాయా? వసుచరిత్ర, ఆముక్తమాల్యదా తీసి చదివి అర్ధం చెప్పు చూద్దాం."
       
"అందులో వాటికన్న ఇది మంచిది. ఇందులో ఉండే బూతు చక్కగా అందరికీ అర్ధమవుతుంది."
                     
బాబాయి కొంచెం ఆలోచించి "బూతు ఉంటే ఉంది. నీతి కూడా ఉండాలిగా. ఆ చలం కథల్లో నీతి లేదు." అన్నాడు.
                     
"నీతి లేకేం బాబాయ్? ఉంది. నువ్వొప్పుకునే నీతి కాదేమో?"
                     
"ఒప్పుకోవటానికి వీల్లేని నీతిని అవినీతి అంటారు. ఆమాత్రం తెలీదురా?" అన్నాడు బాబాయ్.
                   
"నిజమే బాబాయ్, కాని ఒకరి నీతి ఒకరికి అవినీతి కావచ్చు. నన్నడిగితే పురాణాలన్నీ బూతూ, అవినీతీనూ. కుంతి అడ్డమైనవాళ్ళకూ పిల్లల్ని కనటమూ నాకు బాగాలేదు. వ్యాసుడు వెధవముండలకు కడుపులు చెయ్యటమూ, వాళ్ళ సంతానం దేవతాంశంతో పుట్టినవాళ్ళని చెప్పటమూ నా బుద్ధికి దారుణంగా ఉంది. ద్రౌపదికి అయిదుగురు మొగుళ్ళు! ఈ ఛండాలమంతా ఉంది కనక భారతం సాహిత్యం కాదని నేనంటున్నానా? చలం కథల్ని నువ్వు కొట్టెయ్యకూడదు."
                   
"అయితే ఈ దిక్కుమాలిన కథలను భారతంతో పోలుస్తావా?"
                   
"ఎందుకు పోలుస్తానూ? భారతంలో ఉండే మనుషులూ, వాళ్ళ బుద్ధులూ, కష్టాలూ, సుఖాలూ, ఆచారాలూ - ఏవీ నాకర్ధం కావు. ఇందులో నాకు తెలిసిన మనుషుల జీవితమూ, బుద్ధులూ, ఆచారాలూ ఉన్నాయి. నాకిదే మంచి సాహిత్యంగా కనిపిస్తుంది."
                       
"నీతో మాట్లాడుతూ కూర్చుంటే అయినట్టే. అవతల పేపర్లు దిద్దుకోవాలి." అంటూ బాబాయి తప్పుకున్నాడు. నాకు ప్రశాంతంగా కూర్చుని "పాపం!" చదువుకునే అవకాశం దొరికింది.

(కొడవటిగంటి కుటుంబరావు నవల 'ఐశ్వర్యం' నుండి)
   కుటుంబరావు సాహిత్యం.
   మొదటి సంపుటం.
   ప్రధమ ముద్రణ - జనవరి, 1982.  
   పేజీలు .. 143 - 144  
   రచనా కాలం .. 1965 - 66 .  
   సంపాదకుడు - కేతు విశ్వనాథరెడ్డి .
   విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ .

(photos courtesy : Google)

Friday 1 July 2011

రావిశాస్త్రిని గాంచిన వేళ


(ఈ పోస్టులోని ప్రతి వాక్యాన్నీ చాలా యిష్టంతో రాసుకున్నాను. దీన్ని రావిశాస్త్రి పుట్టిన్రోజున 'సాక్షి'లో వేశారు. అందుగ్గానూ - పూడూరి రాజిరెడ్డిగారు నాకు ఫోన్ చేసి 'ఒక్క అక్షరం కూడా మార్చను, ప్రచురణకి అనుమతివ్వండి' అని అడగడం నన్ను సంతోష/ఆశ్చర్య పరిచింది.)
రావిశాస్త్రిని గాంచిన వేళ :
"ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలోసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒకుడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలోసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజిరు!.."
ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇలా రాయడం వొక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది 'మూడుకథల బంగారం'లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం.
ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌస్ సర్జన్సీలో వుండగా 'ఆరుసారా కథలు' చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం.. దిమ్మ తిరిగిపోయింది.
అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరవాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! 'పీజీ ఎంట్రన్స్‌కి ప్రిపేరవ్వాలిగానీ నీకీ రావిశాస్త్రి పిచ్చేమిటి?' అంటూ నా మిత్రులు విసుక్కునేవారు.
ఆరుసారా కథల్తో యెక్కిన మత్తు దిగలేదు, యింకా యెక్కువైంది! ముత్యాలమ్మ, నరసమ్మ, సింహాచలం, మందుల భీముడు, గేదెల రాజు, పీనుగ్గుమాస్తా, అడ్డబుర్ర, దూదిపులి, లచ్చయ్యమ్మ, రాజయోగి పెదనాయన, సూర్రావెడ్డు, సిత్తరలేగ్గాడు, కుక్కమూతి పంతులు.. రావిశాస్త్రి పాత్రలు స్వార్ధంగా, మురికిగా, దుర్మార్గంగా, దారుణంగా, పేదగా, దొంగగా, కంత్రీగా, కసిగా, కుట్రగా, లేకీగా, అలగాగ, అసహ్యంగా, దుఃఖంగా, బాధగా వుంటాయి.
బంగారిగాడి చెల్లి శవం బావిలో తేలినప్పుడూ, వియత్నాం విమల గుడిమెట్ల మీద చనిపోయినప్పుడూ, లచ్చయ్యమ్మ తల్లిని జనాలు రాళ్లతో కొట్టి చంపినప్పుడూ.. అనేక సందర్భాల్లో నన్ను ఘోరంగా యేడిపించిన రావిశాస్త్రి రచనలకి గులామునైపొయ్యాను. ఇంత అద్భుతంగా రాసిన రావిశాస్త్రి యెలా వుంటాడు?
యిప్పుడు నాలో కొత్త ఆలోచన మొదలైంది. విశాఖపట్నం వెళ్ళాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్ళడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను నాకెవరు సాయం చెయ్యగలరు? ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య.
'రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?' నా స్నేహితుడి ప్రశ్న.
'దేవుణ్ని దర్శనం చేసుకోవాలి, కుదిర్తే కాళ్ళ మీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!' నా సమాధానం.
రావిశాస్త్రిని కలవాలనే నా భీభత్స ప్రయత్నాలు కొనసాగుతుండగా - ఒకరోజు రాత్రికిరాత్రే హడావుడిగా విశాఖపట్నం ప్రయాణం! కారణం - నాకు అత్యంత ఇష్టుడైన మా గురువుగారు, సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్బీశర్మగారి అవసానదశ. పనిలోపని, రావిశాస్త్రిని కలవడానికి వీలైనంత ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
విశాఖలో ఉదయం ప్రొఫెసర్ శర్మగారినీ, (శర్మగారి సతీమణి, మైక్రోబయాలజీ ప్రొఫెసర్) అన్నపూర్ణ మేడంగారినీ కలిశాను. మనసంతా బరువుగా అయిపొయింది. పొరబాటు చేశాను, శర్మగారిని ఆ స్థితిలో చూడకుండా వుండాల్సింది. ఇహ నా రెండోపని - రావిశాస్త్రిని చూడ్డం. గుండెల్లో బరువు స్థానం ఉత్సాహం ఆవహించింది. దురదృష్టం - ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు కాపలా కాసినా ఆయన్ని చూళ్లేకపొయ్యాను.
కొన్నాళ్ళకి అదృష్టం ధనలక్ష్మి లాటరీ టిక్కెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను 'భలే మంచిరోజు, పసందైన రోజు' అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు దగ్గరకి చేరుకున్నాను.
అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనో పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురు చూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభస్థలానికి చేరుకుంటున్నారు.
'రావిశాస్త్రి రాలేదా?' కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ, బోల్డంత ఆత్రుత.
ఓ పదినిమిషాలకి అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేం కళ్ళద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తిని పోల్చుకున్నాను, ఆయన నాకు అనేక ఫోటోల ద్వారా చిరపరిచితం.. ఆయన రావిశాస్త్రి!
అక్కడున్నవారిలో కొందరు ఆయనకి నమస్కరించారు, ఆయన ప్రతి నమస్కారం చేసుకుంటూ నాకు రెండడుగుల దగ్గర్లోకి వచ్చాడు. క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురు చూసిన నేను - తీరా ఆయన అంత దగ్గరగా వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను.
కొందరు రావిశాస్త్రితో మాట్లాడ్డం మొదలెట్టారు. నేను గుడ్లప్పగించి రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సమీపంలోనే నిలబడిపొయ్యాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్నని ఆయనకెవరో చెప్పారు.
నావైపు చూస్తూ "మా చెల్లెలు నిర్మల తెలుసా?" నిదానంగా అడిగారు.
"తెలుసు, నిర్మలా మేడమ్ నాకు ఫార్మకాలజి పరీక్షలో ఎక్ష్టర్నల్ ఎక్జామినర్." అని గొంతు పెగుల్చుకుని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే!
రావిశాస్త్రి ప్రక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను), ఒక్కమాటా మాట్లాడలేదు. అక్కడున్నవారు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. 'రాజు - మహిషిని ఎప్పుడు పూర్తిచేస్తారు? 'రత్తాలు రాంబాబుని పూర్తి చెయ్యకుండా ఎందుకు వదిలేశారు?' వంటి రొటీన్ ప్రశ్నలే యెక్కువ. అవన్నీ నా మనసులోనూ మెదలాడే ప్రశ్నలే!
నేను తెలివైనవాణ్ని, అందుకే మాటల్తో నా సమయం వృధా చేసుకోదల్చలేదు. కళ్ళు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు, ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తినీ కలిగిస్తుంది.
ఇప్పుడనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను!? ఆయన రాసిన ప్రతివాక్యం నాకెంతో యిష్టం. పరిసరాల వర్ణనలూ, సంఘటనలూ, పాత్రలూ, సిమిలీలు.. అన్నీ నాకు కొట్టిన పిండి. ఆయన్తో సంభాషణ కలుపుకోడం చాలా చిన్నవిషయం. మరి నేనెందుకు నోరు మెదపలేకపొయ్యాను?!
ఒక అద్భుత సంఘటన చూస్తున్నప్పుడు, మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు.. ఆ దృశ్యసౌందర్యానికి స్పెల్‌బౌండ్ అయిపోయి.. చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆరోజు నాస్థితి అట్లాంటిదేనా?
అయ్యుండొచ్చు!
(posted in fb on 30 Dec 2017)