Monday 30 June 2014

రావిశాస్త్రికి మందుల భీముడి చాలెంజ్!

మొదటి సంఘటన :

విశాలమైన హాలు, మెత్తటి ముఖమల్ పరుపులు, చల్లని వాతావారణం, బయట వర్షం చిరుజల్లుగా పడుతోంది. మంద్రస్థాయిలో కోకిల వంటి గానం మత్తుగా, మధురంగా వినవస్తుంది. ఆ గాత్రానికి అనుగుణంగా చక్కని లయతో ఒక అపురూప సౌందర్యవతి మయూరి వలె నర్తించుచున్నది. 

అహాహా! ఇదియే కదా స్వర్గమన్న! ఇవి నా జీవితంలో అత్యంత మధుర క్షణాలు. నా జీవితము ధన్యము. ఇన్నాళ్ళూ మెడికల్ జర్నల్సుల్లో, ప్రాక్టీసులో నా జీవితం ఎంతలా వృధా చేసుకున్నాను! 

సర్లే! ఏదోకటి, ఇప్పటికైనా సుఖపడే రోజులొచ్చాయి. దేవుడా! ఈ ఆనందం శాశ్వతంగా నాదయ్యేట్లు చూడు. ఇన్నాళ్ళూ నువ్వు లేవనుకుని నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇవ్వాల్టినుండి నేను అన్నమయ్య, రామదాసు రేంజిలో నీ భక్తుడిగా మారిపోబోతున్నాను. ఆశీర్వదించుము తండ్రీ!

ఇంతలో -

టప్పున తీగ తెగినట్లు ఏదో చిన్న శబ్దం. పాట వినబడ్డం మానేసింది. ఆ సుందరీమణి నాట్యం చెయ్యడం కూడా ఆపేసింది. ఎదురుగానున్న సుందర దృశ్యం, ఒక ఫొటో మాదిరిగా నిశ్చలంగా అయిపోయింది.

ఓ దివ్యవాణీ! పాడుము, పాడుము.

ఓ లలనామణీ! నర్తించుము, నర్తించుము.

హయ్యో! నేనెంత అర్ధించినా, అరిచి మొత్తుకుంటున్నా, అక్కడ చలనం లేదేమి? దేవుడా! నా స్వర్గం నాకు మళ్ళీ ప్రసాదించవయ్యా! ఇప్పుడేగా? నేన్నీకు భక్తుడిగా మారాను! అంతలోనే నాకు పరీక్షా! ఇదన్యాయం, అక్రమం.

                                                    
రెండో సంఘటన :

ఆకలి దంచేస్తుంది. నాకెంతో ఇష్టమైన మాసాలా దోసె తిందామని ఆనంద భవన్‌లోకి అడుగెట్టాను. కౌంటర్లో ఓనరుడు పురుషోత్తముడు లేడు, అతని కొడుకున్నాడు.

"చూడు నాయనా సర్వారావు! ఒక మంచి మసాలా దోసె దోరగా వేయించి, కొద్దిగా అల్లం పచ్చడి ఎక్కువేసుకుని తెచ్చుకో." ప్రేమగా ఆర్డరిచ్చాను. సర్వర్ నావైపు వింతగా చూస్తూ కిచెన్లోకెళ్ళాడు.

కొద్దిసేపటికి ఘుమఘుమలాడుతున్న మసాలా దోసె వచ్చింది. ఆ సువాసనకి నా ఆకలి రెట్టింపైంది. ఆత్రంగా, ఆబగా, కక్కుర్తిగా, మూడ్రోజుల్నుండి తిండిలేని వరద బాధితుళ్ళా.. ఆవురావురుమంటూ మసాలా దోసెపై దాడి మొదలెట్టాను.

అహాహా! ఏమి రుచి! 

ఏవోఁయ్ మైడియర్ వెంకటేశం! రాసుకో!

సృష్టిలో అతి రుచికరమైన పదార్ధమేమి? మసాలా దోసె!

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదేమి? మసాల దోసె!

కత్రీనాకైఫ్ కన్నా కమ్మనైనదేమి? మసాలా దోసె!

ఇంతలో -

ఎక్కణ్నించి ఊడిపడ్డాడో - సర్వరుడు నాముందున్న మసాల దోసె ప్లేట్ విసురుగా లాగేశాడు. ఏం జరుగుతుందో నాకర్ధమయ్యేంతలోనే, ఆ ప్లేట్‌ని కిచెన్లోకి హడావుడిగా తీసుకెళ్ళిపొయ్యాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనకి బిత్తరపొయ్యాను.

ఏమిటీ అన్యాయం? నోటి దగ్గర మసాలా దోసె లాగేసిన వీడు మనిషా? దున్నపోతా? సర్లే! వాడు మనిషైతే నాకేంటి? దున్నపోతైతే నాకేంటి? కానీ - చేసిన పని మాత్రం అత్యంత దుర్మార్గమైనది, దుష్టమైనది.

నాక్కోపం నషాళానికంటింది. నా సంగతి ఈ సర్వరు గాడికి తెలీదు. నేను శాంతంలో ఎ.నాగేశ్వరరావుని, రౌద్రంలో ఆర్.నాగేశ్వరరావుని.

కోపంగా బర్రున కుర్చీ వెనక్కి నెట్టాను. పురుషోత్తం కొడుకు కౌంటర్లో చిల్లర లెక్కబెట్టుకుంటున్నాడు.

'ఏమిటీ బుద్ధిలేని పని? నీ సర్వరుగాడు నే తింటున్న మసాలా దోసె మధ్యలోనే లాక్కెళ్ళిపొయ్యాడు తెలుసా? వాణ్ణి అర్జంటుగా డిస్మిస్ చెయ్యి.. నాకింకో మసాలా దోసె తెప్పించు.' అతన్ని డిమాండింగ్‌గా అడిగాను.

ఆ ఓనర్ కుర్రాడు నావైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడు. వెనకనుండి సర్వాధముడు పుసిక్కున నవ్వాడు.

'నా సంగతి మీకు తెలీదులా వుంది? ఏదో మెత్తగా కనిపిస్తున్నానని వెధవ్వేషాలు వెయ్యకండి. నాగ్గనక తిక్క రేగితే ఈ విషయం ముఖ్యమంత్రి స్థాయి దాకా పోతుంది.' అన్నాను గట్టిగా.

నా అరుపులు పట్టించుకునేవాడే లేడు! నా కోపం ఉక్రోశంగా మారింది.

'ఇప్పుడైనా సరే, ఇంకో ఫ్రెష్ మసాలా దోసె తెప్పించి 'సారీ' చెప్పినట్లైతే క్షమించి వదిలెయ్యడానికి నేను సిద్ధం.' నా గొంతు నాకే దీనంగా వినబడింది.

అయినా - నా రోదన ఓ అరణ్యరోదనలా మిగిలిపోయింది.

'ఓరి మీ అమ్మ కడుపులు మాడ! మసాలా దోసె తినకపోతే చచ్చేట్లున్నాను, కనీసం ఇందాక నాదగ్గర్నించి లాక్కెళ్ళిన ప్లేట్లో మిగిలిన ఆ సగం దోసెనైనా నా మొహాన కొట్టి చావండ్రా, దరిద్రులారా! అదైనా తిని ప్రాణాలు కాపాడుకుంటాను.' కంఠం రుద్దమవుతుండగా.. సిగ్గు, అభిమానం వదిలేసి వాళ్ళని వేడుకున్నాను.

అక్కడ పరిస్థితిలో మార్పేమీ లేదు. అందరూ కట్టగట్టుకునే నాకు మసాల దోసె ద్రోహం తలబెట్టారనే సంగతి అర్ధమైంది!


(జరగని) ఈ రెండు సంఘటనలకి మూలం :

రావిశాస్త్రి 'రాజు - మహిషి' చదవడం ముగించాను (ఎన్నోసారి? గుర్తులేదు). నాకీ నవల ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంది. బయటకి 'రావిశాస్త్రి అసంపూర్తిగా రాస్తే మాత్రమేం? అదే చదువుకుని తరించండి.' అని వాదిస్తాను గానీ, లోలోపల మాత్రం కథ (పుస్తకంలో పేజీలు చిరిగి ఊడిపోయినట్లు) ఆగిపోవడం నాకు దుఃఖంగా వుంటుంది. ఇంత మంచి నవల రాయడం మొదలుబెట్టి మధ్యలో ఆపెయ్యడం రావిశాస్త్రి తెలుగు పాఠకులకి చేసిన అన్యాయంగా అనిపిస్తుంటుంది. 

అందుకే - ఇవ్వాళ కూడా నాకు దిగులుగా వుంది (రావిశాస్త్రి సగం రాసి వదిలేసిన నవల అదేపనిగా చదవనేల? ఆపై ఇలా ఏడవనేల? అని మీరడిగితే నాదగ్గర సమాధానం లేదు). అంచేత, ఆ దిగుల్లో - బద్దలైన నా గుండెనీ, చెదిరిన నా హృదయాన్నీ ఉపశమన పరుచుకునేందుకు పై రెండు (ఊహా) సంఘటనలు రాసుకున్నాను. 


మందుల భీముడు నన్ను చికాకు పెట్టిన విధము :

'రాజు - మహిషి' ఎప్పుడు చదివినా నా అభిమాన పాత్ర మాత్రం గిరీశం ఛాయలున్న మందుల భీముడే. మరి - ఇంత తెలివైన మందుల భీముణ్ని గేదెల రాజమ్మ ఎలా దెబ్బ తీయగలదు? నాకీ ప్రశ్న ఎప్పుడూ మెదుల్తూనే ఉంటుంది. రావిశాస్త్రి మదిలో ఏదో మాస్టర్ ప్లాన్ వుండే వుంటుంది! ఏదేమైనా - ఆయన కథ మొత్తం రాస్తే ఈ విషయం తెలిసేది.

ఇంతలో కళ్ళు జిగేల్మనే మెరుపు.

ఎదురుగా కుర్చీలో ఒక సగం బట్టతలాయన! తాపీగా చుట్ట కాల్చుకుంటూ కూర్చునున్నాడు. ఆయనకి యాభయ్యేళ్ళుండవచ్చు. బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు.

ఎవరీ అగంతకుడు? వేళకానివేళలో ఏకంగా బెడ్రూములోకే వచ్చేశాడు! ఆయన.. ఆయన.. మందుల భీముడు!

మందుల భీముడు నన్ను చూసి మందహాసం చేసేడు. 

"సూడు డాట్టరు బాబూ! నువ్వెర్రోళ్ళకి వైజ్జిగం చేసేదాంట్లో మొగోడివే, ఒప్పుకుంటున్నా. అది నీ పెసల్ సబ్జిక్టు. కానీ గురుడా! ఆడదాన్ని సదవడం అంత వీజీ కాదు. అది నా పెసల్ సబ్జిక్టు. నన్నా విందిరాగాంధి ఒచ్చినా ఏటీ సెయ్యలేదు. ఒకేళొచ్చినా ఆయమ్మ నాతో ఏటంటదో తెల్సా? ఒరే భీమా! నువ్వు నా కాంగిరేసులో సేరిపోరా నైనా! నీకు ముక్యమంత్రి పోస్టింగిచ్చేస్తాన్రా నైనా అంటది! అప్పుడు మా బావ సైర్మన్ గోడి ఏడుపు మొకం సూడాలా! జొరవొచ్చిన గున్నేగులా గిలగిల్లాడిపోడూ! అట్టాంటిది - నన్నా పేడ పిసుక్కునే రాజమ్మ ముండేంజేస్తది? ఏదీ సెయ్యలేదు." దర్జాగా అన్నాడు మందుల భీముడు.

నాకు మందుల భీముడి పద్ధతి నచ్చలేదు.

"భీముడూ! నువ్వు తెలివైనవాడివే కావచ్చు. కానీ నువ్వు రావిశాస్త్రి అనే ఒక ప్రపంచస్థాయి రచయిత సృష్టించిన పాత్రవి. రాజమ్మ నిన్నే విధంగా దెబ్బ తీసేదో ఆయన రాస్తేనే కదా మాకు తెలిసేది?"

మందుల భీముడు నా మాట నచ్చినట్లు లేదు. సమాధానంగా విసురుగా చుట్ట కొస కొరికి తుపుక్కున ఊశాడు. కొద్దిసేపు ఏదో ఆలోచించి నక్కలా నిశ్శబ్దంగా నవ్వాడు.

"నువ్వో ఎర్రి డాట్టరువు, నీ గురుడా చాత్రిబాబు! సరీపోయింది. సన్నాసీ సన్నాసీ రాసుకుంటే బూడిద రాలిందంట! చాత్రిబాబు పేరేంది? ఇస్సనాదసాస్రి. అంటే ఎవురు? పరమ సివుడు. సివుడికి మన గేదెల గంగరాజుగాళ్ళా పర్సనాల్టీ ఉంటాదేగాని, తలకాయలో మా కర్రిరాద కున్నంత తెలివి కూడా వుండదు. అందుకే తపస్సు చేసిన పెతి కేడీ నాకొడుక్కీ పరమ వీజీగా సివుడు వరాలిచ్చేస్తాడు. అదే ఇష్ణుమూర్తులోర్నే సూడు. 'అసలెవుడీడు? ఈడిది నిజం తపస్సా? దొంగ తపస్సా? ఈడికి ఒరం ఇస్తే నాకేటొస్తాది?' ఇట్లా సేలా ఆలోసిస్తాడు. అబ్బే! సివుడికా తెలివేది? కమ్మలింటి రాజుగాళ్ళా తనో దానకర్నుడనుకుంటాడు. అందుకే నీ చాత్రిబాబు నాకు అప్పనంగా కొంపల్దీసే తెలివిచ్చాడు, కొంపల్నిలిపే లవుక్యవూ ఇచ్చాడు. మనం గనక కేసు టేకప్ చేసినాఁవంటే ఓ సుట్టు చూడందే వణ్ణం కూడా ముట్టవంతే! పట్టుదలొస్తే ఆడ అమిరికావోడు, ఈడ ఈ మందులోడు! చాత్రిబాబు తన కథ కోసం నాకన్నీ ఇచ్చేసి - ఇప్పుడు ఆ గేదెల రాజమ్మ లాంటి అణాకానీ లంజతో నన్ను దెబ్బ కొట్టాలని సూస్తన్నాడు. ఆయన ప్లీడరైతే ఎవుడిగ్గొప్ప? నాకాడ ఓల్ ఇసాపట్నాన్ని అదరేసే ప్లీడర్ ముకుందబాబే వున్నాడు! ఈ మందుల భీవుడు మంచితనానికి పేణాలిస్తాడు, తేడా ఒస్తే పేణం తీస్తాడు. అది చాత్రిబాబైనా సరే! ఎర్రిడాట్టరైనా సరే! బస్తీ మే సవాల్!" అని పులిలా గాండ్రించి, హైనాలా విషపు నవ్వొకటి నవ్వాడు. 

పాఠకులారా! ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. 'రాజు - మహిషి' మందుల భీముడు పాత్ర నాకు ఇష్టం లేదు. నాకెందుకో - రావిశాస్త్రి మందుల భీముడికి 'లార్జర్ దేన్ లైఫ్' పాత్రనిచ్చి తప్పు చేసినట్లనిపిస్తుంది. 

"ఇదో ఎర్రి డాట్టరు బాబూ! అన్నట్టు నీకో పెసల్ నూసు! నీ గురుడు చాత్రిబాబుకి నన్నెట్టా దెబ్బ తియ్యాలో తెలీక, కథ రాసీటవే ఆపు జేసేడు. అదీ మందెబ్బంటే! ఏంది డాట్టరు బాబు! పెద్ద తెలివైనోణ్ణంటావ్! ఆ మాత్తరం ఆలోసన సెయ్యకపోతే ఎట్టా?" అంటూ ఏదో రహస్యం చెప్పినట్లు పోజు కొట్టి నన్ను విసుక్కున్నాడు మందుల భీముడు.

రావిశాస్త్రిని విమర్శించేవాళ్ళంతా నా శతృవులే! ఇందులో నాకేవిధమైన కన్ఫ్యూజన్ లేదు. అంచేత (కోపంతో) - నేనేమీ మాట్లాడలేదు. చుట్ట తాగడం పూర్తిజేసిన మందుల భీముడు నాకేసి కొద్దిసేపు జాలిగా చూసి బెడ్రూములోంచి నిష్క్రమించాడు.

అమ్మయ్య! ఇప్పుడు నాకు హాయిగా వుంది. 


అంకితం :

రావిశాస్త్రి పాదపద్మములకి..  

Wednesday 25 June 2014

శ్రీదేవి బుక్‌స్టాల్


పుస్తకాలు అనేక రకాలు. వీటిని ప్రధానంగా రెండురకాలుగా వర్గీకరించవచ్చు. పరీక్షల చదువుకు సంబంధించిన పుస్తకాలు (వీటినే టెక్స్ట్ బుక్స్ అంటారు) ఒకరకం. ఉన్నతమైన జీవనం కోసం విద్యార్ధులు ఈ పుస్తకాల్ని కష్టపడి చదువుతారు, ఇంక దేనికీ చదవరు. మానసికోల్లాసానికి చదివే పుస్తకాలు రెండోరకం. ఈ రకం పుస్తకాలు చదివితే జ్ఞానం రావొచ్చునేమో గానీ, పరీక్షల్లో మార్కులు మాత్రం రావు. ఒక్కోసారి మానసికోల్లాసం కోసం చదివిన పుస్తకమే మానసిక క్షోభ కూడా పెట్టొచ్చు (అది మన అదృష్టం మీద ఆధారపడి వుంటుంది).

ఈ ప్రపంచంలో అసలేం చదువుకోనివారే ధన్యులని నా అభిప్రాయం, ఎందుకంటే - వాళ్ళసలే పుస్తకాలు చదవరు కనుక! ఇప్పుడొక కష్టమైన ప్రశ్న. పుస్తక పఠనం వల్ల కలుగు ప్రయోజనమేమి? విజ్ఞానవికాసములు దండిగా కలుగునని కొందరూ.. గాడిద గుడ్డేం కాదు? అదో వ్యసనం. పుస్తకాలు చదవడం వల్ల కళ్ళు మంటలు, తలనొప్పి తప్పించి మరే ప్రయోజనమూ లేదని మరికొందరూ వాదిస్తుంటారు. ఎవరు కరెక్టో చెప్పడం చాలా కష్టం! ఇదిప్పుడిప్పుడే తేలే వ్యవహారం కాదు కనుక, అసలు విషయంలోకి వచ్చేస్తాను.

ఇప్పుడంటే టీవీలు, కంప్యూటర్లు, స్మార్టు ఫోన్లు వచ్చేశాయి కాబట్టి కావలసింత కాలక్షేపం. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. కాలక్షేపం కోసం పుస్తకాలు, సినిమా వినా వేరే మార్గం వుండేది కాదు. కావున చాలామందికి చందమామ, బాలమిత్రలతో మొదలయ్యే 'చదివే అలవాటు' ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల మీదుగా నవలల వైపు సాగిపొయ్యేది.

పెళ్లి కెదిగిన ఆడపిల్లలు (వీళ్ళనే 'గుండెల మీద కుంపట్లు' అని కూడా అంటారు) యద్దనపూడి సులోచనారాణి, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి నవలలు.. పెళ్లి కెదగని కుర్రాళ్ళు కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావుల డిటెక్టివ్ నవలలు.. మేధావులం అనుకునేవాళ్ళు ప్రేమ్‌చంద్, శరత్ బాబుల నవలలు.. ఆంగ్లభాషా కోవిదులు ఇంగ్లీషు నవలలు.. ఇలా అనేక వర్గాలవారు రకరకాల పుస్తకాలు చదువుతుండేవాళ్ళు.

ఆ రోజుల్లో సమాజంలో డబ్బు తక్కువ. పుస్తకం కొని చదివేంత ఆర్ధికస్థితి కొద్దిమందికే వుండేది. ఉన్నా - పెద్దబాలశిక్ష, రామాయణ భారతాలు తప్పించి ఇంకే పుస్తకాలు కొనేవాళ్ళు కాదు. 'ఒక్కసారి చదివి అవతల పారేసేందుకు' ఒక పుస్తకం కొనడం దండగనే అభిప్రాయం చాలామందిలో వుండేది. అందువల్ల - రోజువారీగా నవలల్ని, పత్రికల్ని అద్దెకిచ్చే వ్యాపారం బాగానే సాగేది.

బ్రాడీపేట బ్రిడ్జి డౌన్లో అంబికా షో రూం పక్కన ఒక చిన్న సందుంది. ఆ సందులో 'శ్రీదేవి బుక్‌స్టాల్' అనే పేరుతొ ఒక అద్దె పుస్తకాల షాపు వుండేది. అదో చిన్నగది, మధ్యలో కరెంటు వైరుకి వేళ్లాడుతూ ఒక ఎలెక్ట్రిక్ బల్బు. ఆ గుడ్డి వెలుగులో, ఆ గదో మాంత్రికుని రహస్య స్థావరంలా వుండేది. గదినిండా నాసిరకం చెక్కతో చేసిన ర్యాకులు, వాటినిండా నిలువుగా కుక్కిన పాత పుస్తకాలు. ఓ పక్కగా తాడుతో కట్టలు కట్టిన పుస్తకాలు. ఇంకో పక్కగా కుప్పగా పోసిన పాడైపోయిన పుస్తకాలు.

ఆ పుస్తకాల మధ్యలో ఒక మనిషి నిలబడ్డానికి మాత్రమే చోటుండేది. కాబట్టి - దీపం స్తంభంలా ఎల్లప్పుడూ ఒక మనిషే నిలబడి వుండేవాడు. అతనే - 'శ్రీదేవి  బుక్‌స్టాల్ నాగేశ్వరరావు'గా అందరికీ సుపరిచితమైన బిజినేపల్లి నాగేశ్వరరావు.

'చూడు నాగేశ్వరరావు! యద్దనపూడి సెక్రెటరీ ఇవ్వు.'

'నాగేస్సర్రావ్! ఇంజన్ హీటెక్కించే వెచ్చని పుస్తకం ఒకటివ్వవోయి.'

'నాగేశ్రావ్! ఒక్క పుస్తకం కోసం నాల్రోజుల్నించి తిప్పుతున్నావ్! నాలుక్కాపీలు ఎక్కువ తెప్పించకపోయ్యావా?'

'నాగేశ్వరరావుగారు! మీదగ్గర ఆర్దర్ హైలీ పుస్తకాలు దొరుకుతాయాండీ?'

ఏ పుస్తకం అడిగినా ఆ పుస్తకాల గుట్టలు, రాసుల్లోంచి ఒక్కక్షణంలో పుస్తకం తీసివ్వడం నాగేశ్వరరావు స్పెషాలిటీ. విచిత్రమేమంటే నాగేశ్వరరావుకి ఇంగ్లీషు తెలీదు. కానీ - మనం అడిగితే పుస్తకాలు గుర్తు పట్టేవాడు. సిడ్నీ షెల్డన్ అనంగాన్లే ఒక బండిల్ మనముందు వుంచేవాడు. హెరాల్డ్ రాబిన్స్ ఎక్కడ? అంటే ఇంకో కట్ట మన ముందుంచేవాడు. డి.ఎచ్.లారెన్స్ కావాలంటే బాగా పాడైపోయిన పుస్తకాలు చూపించి అందులో వెతుక్కోమనేవాడు.

నాగేశ్వరరావు ప్రవర్తన ఎంత కస్టమర్ ఫ్రెండ్లీగా వున్నా, అద్దె వసూల్లో మాత్రం నిక్కచ్చిగా వుండేది. ఇవ్వాల్టి పుస్తకం రేపు ఉదయం పది గంటల కల్లా ఇచ్చెయ్యాలి. ఒక్క నిమిషం దాటినా, ఇంకో రోజు అద్దె ఆటోమేటిగ్గా పడిపోతుంది. మనం ఎన్ని కారణాలు చెప్పినా అద్దె విషయంలో మాత్రం నాగేశ్వరరావు రాతిగుండె కరిగేది కాదు! అందువల్ల పబ్లిక్ ఎక్జామ్స్ రాసేవాళ్ళలా మేం తొమ్మిదింటికే పరుగులు పెట్టేవాళ్ళం.

పెద్దపెద్ద మేధావులు పెద్దపెద్ద లైబ్రరీల్లో కూచుని పెద్దవాళ్ళయ్యార్ట! నేనెప్పుడూ ఏ లైబ్రరీకి పోయిందీ లేదు, చదివిందీ లేదు. కావున - నేను మేధావిననే కన్ఫ్యూజన్ నాలో ఏనాడూ లేదు. కానీ - చాలా విషయాల పట్ల నాకో అవగాహన కలిగించటంలో శ్రీదేవి బుక్‌స్టాల్ నాకు బాగా వుపయోయపడిందనేది నా నమ్మకం.

శ్రీదేవి బుక్‌స్టాల్ లేకపోయినట్లైతే - నాకేమయ్యేది?

తెలుగు డిటెక్టివ్‌లైన యుగంధర్, పరుశురామ్, వాలి, నర్సన్‌లు పరిచయం అయ్యేవాళ్ళుకాదు.

జేమ్స్ హేడ్లీ చేజ్‌తో ఇంగ్లీషు నవలల అరంగేట్రం జరిగేది కాదు.

షెర్లాక్ హోమ్స్, పెర్రీ మేసన్‌లు తెలిసేవాళ్ళు కాదు.

పిజి.వోడ్‌హౌజ్, అగాథా క్రిస్టీల్ని పట్టించుకునేవాణ్నికాదు.

'రమణి' కథల్ని భారంగా, బరువుగా, వేడి నిట్టూర్పులతో చదివగలిగేవాణ్నికాదు.

స్టార్‌డస్టుల్లో, డెబొనైర్లల్లో సెంటర్ స్ప్రెడ్‌లో బట్టల్లేని అందమైన అమ్మాయిల్ని - నోరు తెరుచుకుని అలా చూస్తుండిపొయ్యేవాణ్నికాదు.

ఇన్ని 'కాదు'లు వున్నాయి కాబట్టే శ్రీదేవి బుక్‌స్టాల్ నాకిష్టం!

అటుతరవాత ఒక్కొక్కళ్ళుగా స్నేహితులు దూరమయ్యారు. నాకు పుస్తకాలు కొని చదవడం అలవాటయ్యింది. ఇలా - అనేక కారణాల వల్ల, క్రమేపి శ్రీదేవి బుక్‌స్టాల్‌కి వెళ్ళడం తగ్గించేశాను.. ఆపై పూర్తిగా మానేశాను. కొన్నాళ్ళకి  ఆ బుక్‌స్టాల్ కూడా మూతబడింది. చాలా విషయాల్లాగే, శ్రీదేవి బుక్‌స్టాల్ కూడా నా జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోయింది.

కొన్నేళ్ళక్రితం శ్రీదేవి బుక్‌స్టాల్ నాగేశ్వరరావు తన భార్యా కూతురితో నా హాస్పిటల్‌కి వచ్చాడు. లోపలకి రాంగాన్లే గుర్తు పట్టాను, ఆప్యాయంగా పలకరించాను. నాగేశ్వరరావు చాలా సంతోషించాడు. అతనికి కస్టమర్ల మొహాలు తెలుసు గానీ, పేర్లు తెలీదు. అంచేత - కన్సల్టేషన్ రూమ్ లోపలకొచ్చేదాకా బయట బోర్డు మీద వున్న పేరు నాదని అతనికి తెలీదు!

అటుతరవాత అతను తరచుగా నా హాస్పిటల్‌కి వస్తూనే వున్నాడు. నాగేశ్వరరావుకి నేను చెయ్యగలిగిందంతా చేస్తూనే వున్నాను. అతను నాదగ్గరకి ఎందుకొస్తున్నాడో ఇక్కడ రాయడం అనవసరం, రాయాలనుకున్నా professional ethics అందుకు ఒప్పుకోవు.

దాదాపు ముప్పైయ్యైదేళ్ళ వయసున్న శ్రీదేవి బుక్‌స్టాల్  జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. నేను గుంటూరులోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చావబోతున్నాను కూడా. నాకిక్కడ ప్రతిదీ అందంగానే కనబడుతుంది.

మొన్న ఆస్పత్రిలో నాగేశ్వరరావుని ఫోటో తీశాను. తనగూర్చి రాయడానికి, తన ఫోటోగ్రాఫ్ పబ్లిష్ చేసుకోడానికి అనుమతి నిచ్చిన 'శ్రీదేవి బుక్‌స్టాల్ నాగేశ్వరరావు'కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ నాగేశ్వర్రావ్!

Saturday 21 June 2014

భాషా రుద్దుడు, గుద్దుడు


భాష యొక్క ప్రయోజనమేమి? భావప్రకటన. భావప్రకటన అనగానేమి? నావంటివాడికైతే 'సర్వర్ బాబూ! రెండిడ్లీ సాంబారు, సాంబారు వేడిగా వుండాలి సుమా'. కవులకైతే 'ఆహా! ఏమి ఈ లలనామణి హొయలొలుకు జఘన సౌందర్యము! ఈ నాట్యమయూరి పదఘట్టము బహుసుందరము, కడుసుకుమారము, అతిలాలిత్యము!'.

ఇలా మనకి మన భాషతోనే అన్నిపనులూ జరిగిపోతున్నప్పుడు, పరాయి భాష నేర్చుకొనుట ఎందుకు? సూటిగా చెప్పాలంటే - ఉపాధి అవకాశాల్ని మెరుగు పర్చుకునేందుకు మాత్రమే (ఒక భాష పట్ల ప్రేమతో నేర్చుకునేవాళ్ళు వేరే కేటగిరీ, ఇక్కడ చర్చ అది కాదు). అందుకే - తెల్లవాడి నౌకరీ కోసం ఇంగ్లీషు విద్య అవసరం అని అగ్నిహోత్రుడికి మన గిరీశం కూడా చెప్పాడు!

ఇప్పుడు కేంద్రం హిందీకి ప్రాముఖ్యతనివ్వాలంటుంది. హిందీ భాష అధికార భాషట! ఇంతకీ అధికార భాష అనగా యేమి? అధికారులు మాత్రమే మాట్లాడే భాషా? సర్లే! ఏదోటి, అధికార భాష కాబట్టి, ఆ భాషకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ప్రాముఖ్యత అంటే ఏమిటి? 'గుంటూరు రైల్వే స్టేషన్' అని తెలుగు, ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా వుండాలి. అలాగే - ఎల్లైసీ రశీదుల మీద, టెలిఫోన్ బిల్లుల మీద కూడా హిందీ ఉంటుంది. ఇక్కడిదాకా ఎవరికీ అభ్యంతరం వుండకపోవచ్చు (నాకు మాత్రం లేదు). ఇప్పటిదాకా జరుగుతుందీ ఇదే.

ప్రభుత్వం తన వెబ్ సైట్లలో ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా సమాచారం వుంచుతుంది. మంచిది. ఎంతైనా హిందీ 'అధికార భాష' కదా! తాజాగా సోషల్ సైట్లలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. ఇక్కడ మాత్రం నాకు పేచీ వుంది. సోషల్ సైట్లలో ఏ భాషకి ప్రాముఖ్యతనివ్వాలో చెప్పడం ప్రభుత్వాల పనికాదు.

ఇదే సూచన కాంగ్రెస్ పార్టీవాళ్ళు చేస్తే? భాష గూర్చి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ పట్టింపు లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ! పురాతనమైన పార్టీ! ప్రజాస్వామ్యం ఎక్కువగా వున్న పార్టీ! అందువల్ల - వాళ్లెప్పుడూ ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోలేదు. ఎందుకంటే - కాంగ్రెస్ వాళ్ళు 'స్కాము' వీరులే గానీ, బీజేపీ వాళ్ళలా 'సాంస్కృతిక' వీరులు కారు!

అసలు హిందీతో ఈ గొడవెందుకు వస్తుంది? కొన్ని రాష్ట్రాల్లో హిందీ మాతృభాష, కొన్ని రాష్ట్రాల్లో కాదు. హిందీ వాళ్ళు బాష పేరుతొ తమ మీద పెత్తనం చేస్తారేమోనని హిందీయేతరుల అనుమానం, భయం (నాకీ మాతృ, పితృభాషల్తో పేచీ వుంది. కానీ ఇంకెలా రాయాలో తెలీటల్లేదు). ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాల్లో హిందీ మాట్లాడే వారి ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది (అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా). ఢిల్లీ చుట్టుపక్కల గల్లీ లీడరు కూడా జాతీయ స్థాయి నాయకుడే!

మనం తెలుగు భాష మాట్లాడతాం, ఎందుకంటే - మనింట్లో అదే భాష మాట్లాడతారు కాబట్టి. స్కూళ్ళల్లోఇంగ్లీషు భాషలో సబ్జక్టులు చదువుకుంటాం, ఎందుకంటే - మనకి ఆ భాష అన్నం పెడుతుంది కాబట్టి. ఇప్పుడు కాలేజీల్లో ఇంటర్ స్థాయిలో పిల్లలు సంస్కృతం పరీక్ష రాస్తున్నారు. ఎందుకంటే - తెలుగులో కన్నా సంస్కృతంలో మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి!

మరప్పుడు హిందీ భాష నేర్చుకోవటం ఎందుకు? నాకు తెలిసి హిందీ వచ్చుండటం వల్ల ఒక్కటే ప్రయోజనం, ఎప్పుడన్నా ఉత్తర భారత దేశానికి వెళ్తే ఆటోవాళ్ళు మనని మోసగించకుండా కాపాడుకోగలం! ఇంతకుమించి హిందీ వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. మరి హిందీ భాషని మన పిల్లలు నేర్చుకునేలా చేసేదెలా? సింపుల్ - అమెరికా, ఇంగ్లాండుల్లో కూడా హిందీని 'అధికార భాష'గా చేసినట్లైతే, మన పిల్లలు ఆటోమేటిగ్గా హిందీ మీడియంలోనే చదువుతారు.. ఇంకే మీడియంలోనూ చదవరు!

మన ప్రధాని హిందీలో మాట్లాడతారు. అది ఆయన ఇష్టం, ఆయనకి ఏ భాషలో సుఖంగా, సౌకర్యంగా వుంటే ఆ భాషలో మాట్లాడవచ్చు. రేపాయన గుజరాతీలోనే మాట్లాడతాను అన్నా కూడా నేను స్వాగతిస్తాను. అది ఆయన హక్కు. కానీ, సోషల్ సైట్లలో ఫలానా భాషకి ప్రాధాన్యం ఇమ్మని మాత్రం చెప్పరాదు. ఎందుకంటే - అది ఇతరుల హక్కు. ఎవరికి ఏ భాష ఇష్టమైతే ఆ భాషే వాడుకునే స్వేచ్చ కల్పించటం ప్రజాస్వామిక స్పూర్తి అని నమ్ముతున్నాను.

హిందీ జాతీయ భాష కాదు, అధికార భాష మాత్రమే! ఒకవేళ జాతీయ భాషైనా మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. జాతీయ పక్షి నెమలిని అడవుల్లో వేపుడు చేసుకుని విస్కీలో నంజుకుంటున్నారు. జాతీయ క్రీడైన హాకీలో - జట్టుకి ఎందరుంటారో కూడా చెప్పలేని దుస్థితి! కాబట్టి - మనకి భావనలో జాతీయత వుంది కానీ, చేతల్లో జాతీయత ఉన్నట్లుగా తోచదు.

హిందీ భాషలో మాధుర్యం వుంది, మంచి సాహిత్యం వుంది.. ఇత్యాది ఊకదంపుడు మాటలు నేను నమ్మను. ఏ భాషకి మాత్రం ఏం తక్కువ? అన్నిట్లో అన్నీ వున్నాయి. కన్నడం తక్కువా? బెంగాలీ తక్కువా? అన్నీ సమానమే. ఏ భాష సొగసు ఆ భాషదే!

పీవీనరసింహారావుకి చాలా భాషలొచ్చుట. ఆయన అన్ని భాషలు ఎందుకు నేర్చుకున్నాడో మనకి తెలీదు కానీ, ఆయనా భాషల్ని ఎంతో ఇష్టంగా నేర్చుకునుంటాడు. అలాగే ఎందఱో విద్యావంతులు బహుభాషా పండితులు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం - ఒక భాషని ఇష్టపూర్వకంగా నేర్చుకోటం వేరు, రుద్దించుకోటం వేరు అన్నది.

నా భయమల్లా - ఈ రుద్దుడు కొంతకాలానికి గుద్దుడు స్థాయికి వెళ్తుందేమోనని!

(picture courtesy : Google)

Thursday 19 June 2014

ఆదివాసీలూ మనవాళ్ళే




మనిషి చదవగలడు, జంతువులు చదవలేవు. కావున జంతువులకి లేని ఎడ్వాంటెజ్ మనిషికి వుంది. మనిషికి చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, అర్ధం చేసుకునే శక్తినిస్తుంది. అట్టి జ్ఞానంతో మనిషి నిరంతరం తన కోసం, తన సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడు, పాటుపడతాడు. సమాజంలో తమ వాణి వినిపించలేని బలహీనుల్ని దయతో, ప్రేమతో అర్ధం చేసుకుంటాడు. వారి హక్కుల కోసం తపన పడతాడు, పోరాడతాడు. 

అట్టి బలహీనుల్లో ఆదివాసీలు ముందువరసలో వుంటారని నా నమ్మకం. ఎందుకంటే - వాళ్ళ హక్కుల గూర్చి వాళ్ళు సరీగ్గా మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. కారణం - వారికి సరైన చదువు వుండదు, మేధావుల్లా భాషా పటిమ వుండదు, సరైన భావప్రకటన వుండదు. అందువల్ల మనం వాళ్లకి అర్ధం కాము, వాళ్ళు మనకి అర్ధం కారు.

అనాదిగా అడవుల్లో జీవనం చేస్తున్న ఆదివాసీల మనుగడ ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం అడవుల్లో లభించే ఖరీదైన ఖనిజ సంపద. ఈ ఖనిజ సంపదే వారి మనుగడకి మృత్యుఘంటికలు మోగిస్తుంది. మైదానప్రాంత ప్రజల నాగరికతకి విద్యుత్తు చాలా అవసరం. కావున అణు విద్యుత్తు కేంద్రాలు నిర్మించాలి. అందుకు మారుమూల అడవులు కావాలి, ఎందుకంటే - ప్రమాదం జరిగినా నాగరికులు రేడియేషన్ బారి పడకుండా safe zone లో వుండాలి కదా! మైదాన ప్రాంత రైతుల వ్యవసాయం కోసం నీళ్ళు కావాలి, పట్టణ ప్రజల అవసరాలక్కూడా నీళ్ళు కావాలి. అందుకు అడవుల్ని ముంచేసే డ్యాముల్ని నిర్మించాలి. ఈ విధంగా అన్ని 'అభివృద్ధి' నమూనాలు ఆదివాసీలకి ఒక శాపంగా పరిణమించాయి.

ఏసీలలో 'split model' వుంటుంది. పెద్దగా శబ్దం చేసే కంప్రెసర్, వేడి గాలిని చిమ్మే ఫ్యాన్ కలిపి ఒక యూనిట్. ఇది దూరంగా బయటవైపు వుంటుంది. రూములోకి నిశ్సబ్దంగా చల్లని గాలిని పంపే యూనిట్ ఇంకోటి వుంటుంది. ఇవ్వాళ మన అభివృద్ధి మోడళ్లన్నీ ఈ split ఏసీలాగా ఉంటున్నాయి. వేడిగాలి, బొయ్యిన శబ్దం ఆదివాసీలకి.. చల్లగాలి మైదాన ప్రాంత ప్రజలకి. మన చల్లదనానికి వాళ్ళు వేడిని భరించాలి!

రాజ్ కపూర్ 'సంగం' తీశాడు. ఆ సినిమా చివర్లో రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్లు తాము ప్రేమించిన వైజయంతిమాల ఎవరికి చెందాలనే విషయంపై చాలాసేపు వాదించుకుంటారు.. నాకైతే విసుగ్గా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో నించున్న వైజయంతిమాల కూడా 'ఇంతకీ నేనెవర్తో వుండాలి?' అన్నట్లు టెన్షన్తో వాళ్ళ చర్చని ఫాలో అవుతుంటుంది! అయితే - ఎంతసేపూ హీరోలిద్దరే మాట్లాడుకుంటారు గానీ, వైజయంతిమాలని 'మాలో ఎవరితో జీవించడం నీకిష్టమో చెప్పు' అని మాత్రం ఒక్కమాట కూడా అడగరు!

ప్రస్తుతం మన పోలవరం నిర్వాసితుల దీనావస్థ వైజయంతిమాలని జ్ఞప్తికి తెస్తుంది. తాము ఉండాలా, ఊడాలా అన్నది ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల వివాదంగా మారింది. ఇప్పుడు వాళ్ళు నిస్సహాయంగా (కొంత ఆసక్తిగా) వీళ్ళిద్దర్నీ గమనిస్తున్నారు (అతకుమించి చేసేదేమీ లేక).

మన మధ్యతరగతి మేధావులు డ్యాములు, గనులు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని అంటారు. అందుకోసం - 'అడవులు ఖాళీ చెయ్యాల్సిందే, ఆదివాసీలు త్యాగం చెయ్యాలి.' అంటారు. సరే! ఒప్పుకుందాం. మరప్పుడు ఆదివాసీల పునరావాసం నిజాయితీగా, బాధ్యతగా జరగాలి కదా? గత అనుభవాలు అలా జరగట్లేదనే చెబుతున్నాయి.

ఆదివాసీలకి ప్రత్యామ్నాయంగా భూమినివ్వాలనీ, వాళ్ళకి ఆ ప్రాజెక్టులోనే ఉద్యోగం కల్పించాలనీ.. ఇత్యాది జాతీయ, అంతార్జాతీయ సూత్రాలు కాగితాల మీద మాత్రం ఎంతో ఘనంగా రాసుకున్నారు. కానీ - ఎక్కడ పాటించారు? ఎక్కువలో ఎక్కువ.. కొన్నిచోట్ల భూమినిచ్చారు గానీ, వాళ్ళకి ఆదాయ వనరు మాత్రం చూపించలేకపొయ్యారు.

కొందరు బుద్ధిజీవులు (అమాయకంగా) 'డబ్బిస్తే సరిపోతుంది కదా?' అని వాదిస్తారు. ఆదివాసీల జీవనం వేరుగా వుంటుంది, వారిలో కొందరు సంచార జీవులు కూడా. వాళ్ళకి డబ్బివ్వడమంటే చిన్నపిల్లాడి చేతికి డబ్బివ్వడంతో సమానం. చదువు లేకపోవడం, అమాయకత్వం వల్ల వారి భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. అందువల్ల - ఆదివాసీల పునరావాసం విషయంలో ప్రభుత్వాలు నిర్వాసిత చట్టాల్ని తుచ తప్పకుండా అమలు చెయ్యాలని మనలాంటివారు డిమాండ్ చెయ్యాలి. 

ఎన్నో విషయాల్లో ఎంతో నిక్కచ్చిగా వుందే ప్రభుత్వాలు ఆదివాసీల పునరావాసం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తాయి? ఎందుకంటే - ఈ దేశంలో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల పేర్లు మారతాయే గానీ.. ప్రభుత్వాల స్వరూపాల్లో మౌలికమైన తేడా వుండదు. ఏ ప్రభుత్వాన్నైనా ఆడించే శక్తులు వేరే వుంటాయి. ఈ శక్తులకి దేశప్రయోజనాల కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యం. అందువల్ల - ప్రభుత్వాలు ఆదివాసీలకి పునరావాసం కోసం కంటితుడుపుగా కొంతచేసి.. చెయ్యాల్సింది చాలా వదిలేస్తాయి.

కార్పొరేట్ మీడియా తెలివిగా తమ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్ళించి - రాజకీయ నాయకుల్ని సినీ హీరోల స్థాయిలో హైప్ సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయి. తమ ప్రయోజనాల్ని ఎవరు పరిరక్షించగలరో వారినే హీరోలుగా మీడియా ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ కార్పోరేట్ శక్తులే ఒకప్పుడు కాంగ్రెస్ ని ప్రమోట్ చేశాయి, ఇప్పుడు బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. వ్యాపారస్తుడైన సినిమా హాలువాడు.. సినిమా కలెక్షన్లు పడిపోతే, ఇంకో హీరో సినిమా వేసుకుంటాడు. ఇదీ అంతే!

ఒకప్పుడు బాలగోపాల్ ఆదివాసీలని కలుసుకుని వారి సమస్యల్ని వివరంగా తెలుసుకుని, వారి తరఫున రిపోర్టులు, వ్యాసాలు రాసేవాడు. అవసరం అనుకున్నప్పుడు కోర్టుల్లో కేసులు వేసేవాడు, వాళ్ళ తరఫున వాదించేవాడు. ఈ రంగంలో జయధీర్ తిరుమలరావు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయం. క్రమంగా నిబద్దత కలిగిన వ్యక్తులు తగ్గిపోతున్నారు (ground zero వ్యక్తుల్ని కలవకుండా - టీవీ స్టూడియోల్లో చర్చల్లో పాల్గొనేవారు ఈమధ్య ఎక్కువైపొయ్యారు).

సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది. ఈ వర్గాలు తమ వర్గంవారి ప్రయోజనాలు తప్ప ఇంకే విషయాన్ని సమస్యగా చూట్టం మానేశాయి. పైగా - తమకోసం పక్కవర్గంవాడు మాత్రమే త్యాగం చెయ్యాలనే స్వార్ధపూరిత వాదనల్ని తలకెత్తుకుంటున్నాయి. ప్రజల్లోని అనేక వర్గాలు తమ సొంత ప్రయోజనాల గూర్చే తప్ప, ఇంకే ఇతర సెక్షన్ గూర్చి పట్టించుకోరనే స్పష్టతకి ప్రభుత్వాలొచ్చేశాయి. ఇందువల్ల ప్రభుత్వాలక్కూడా హాయిగా వుంది.  ప్రజల్లో లేని సున్నితత్వాన్ని ప్రభుత్వాల్లో ఆశించడం దురాశే అవుతుంది.

ముగింపు :

ఎప్పుడూ త్యాగం చెయ్యాల్సింది ఆదివాసీలేనా?

For a change - ఈసారి మనమే త్యాగం చేద్దాం. ఆ అవకాశం ఇప్పుడు మనకి వచ్చింది కూడా!

గుంటూరు, విజయవాడ ప్రాంతం రాజధానికి అనుకూలం అంటున్నారు కదా? మన తెలుగుజాతి భావి ప్రయోజనాల కోసం, ఈ రెండు నగరాల్లోని ప్రజలం - మన ఇళ్ళూ, భూముల్ని స్వచ్చందంగా ఖాళీ చేసి ప్రభుత్వపరం చేసేద్దాం. ఆవిధంగా - ఒక అద్భుత నగర (సింగపూర్ని తలదన్నే) నిర్మాణానికి మన వంతు చేయందిద్దాం. ఒక జాతి విశాల ప్రయోజనాల కోసం ఎవరోకరు నష్టపోక తప్పదు కదా! అంచేత - ఆ నష్టమేదో మనమే భరిద్దాం. ఈ విధంగా చేసి - తమ నివాసాలపై మక్కువ చూపిస్తున్న ఆదివాసీలకి బుద్ధొచ్చేలా చేద్దాం. ఏమంటారు? 

(fb post on 23/8/2017)

Monday 16 June 2014

రావిశాస్త్రీ! థాంక్యూ వెరీ మచ్


సమయం రాత్రి పన్నెండు గంటలు, నిద్ర రావట్లేదు. పక్కన పడుకునున్న నా భార్య ఏదో మెడికల్ జర్నల్ చదువుకుంటుంది. రోజూ ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ఏదోటి తీక్షణంగా చదువుతూ, తీవ్రంగా ఆలోచిస్తూ, అంతకన్నా తీవ్రంగా నిట్టూరుస్తూ వుంటాను. తరవాతేం చేస్తావు? అబ్బే! పెద్దగా ఏమీ చెయ్యను, అలసిపొయ్యి నిద్ర పోతాను, అంతే! రోజుట్లా వార్తలు చదివి నిట్టూర్చడానికి ఇవ్వాళ మూడ్ బాలేదు.

పక్కనున్న టీపాయ్ మీద 'రావిశాస్త్రి రచనాసాగరం' వుంది. పుస్తకం అట్టమీదనున్న రావిశాస్త్రి రంగుల బొమ్మ నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్లనిపించింది. రావిశాస్త్రికి రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టుకుని (నాకు దేవుడి మీద నమ్మకం లేదు గానీ రావిశాస్త్రి మీద నమ్మకముంది), ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను. చేతికొచ్చిన ఒక పేజీ ఓపెన్ చేశాను.

వావ్! నా ఫేవరెట్ 'రాజు - మహిషి' వచ్చింది. గేదెల రాజమ్మ, బావ గంగరాజుతో కలిసి బంగారి కిళ్ళీకొట్టు ముందు.. కర్రిముండని (అమ్మలు), కమ్మలింటి రాజుని (భవానీ శంకర ప్రసాద్) రొట్లప్పిగాడి సాక్షిగా తన్నిన ఘట్టం. ఈ చాప్టర్ మొత్తం ఒకేఒక్క పేరాగ్రాఫ్‌లో పీనుగ్గుమాస్తాతో ఉపన్యాస ధోరణిలో చెప్పిస్తాడు రావిశాస్త్రి. ఇదో ఎపిక్ పేరాగ్రాఫ్. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంటుంది. కావున - చదవసాగాను.

"పొద్దస్తమానం ఆ రావిశాస్త్రినే చదువుతారు! బోర్ కొట్టదా?" నా భార్య ప్రశ్న విని తల పక్కకి తిప్పాను.

"ఏమో మరి! అస్సలు బోర్ కొట్టట్లేదు, పైగా రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతుంది కూడానూ." నవ్వుతూ అన్నాను.

నేను అనేక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కొత్తగా ఏదీ చదవలేదు. ఎందుకు? 'సమయం లేదు' అంటూ అబద్దాలు రాసుకోడానికి ఇదేమీ నా ఆత్మకథ కాదు కదా? కావున నిజాయితీగానే ఈ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.

జీవిక కోసం తప్పించి, ఏ మనిషీ కూడా తనకి నచ్చని పని చెయ్యడాని నా నమ్మకం. నాకు రావిశాస్త్రి రచనలు ఇష్టం. కావున అవే చదువుతుంటాను. రావిశాస్త్రి అన్నేసి కథలు, అన్నేసి పేజీలు  రాశాడు కదా? ఎందుకు? తనెందుకు రచనలు చేస్తున్నానో రావిశాస్త్రి చాలా స్పష్టంగానే చెప్పాడు. ఆయన ఎందుకోసం రాశాడో ఆ ప్రయోజనం నెరవేరిందా? ఆయన ఎవరి కోసం రాశాడో - వాళ్ళు ఆయన సాహిత్యం చదువుతున్నారా? చదివినట్లైతే వారిపై ఆయన ప్రభావం ఎంత? ఇత్యాది విషయాలు ఆలోచించి బుర్ర పాడు చేసుకోను.

మొన్నెక్కడో చదివాను 'రావిశాస్త్రి భవిష్యత్తరాలు కూడా స్మరించుకునే గొప్ప రచయిత.' అని. నాకు నవ్వొచ్చింది. రావిశాస్త్రిని ఎవరు, ఎందుకు, ఎప్పటిదాకా చదువుతారో మనమెలా చెప్పగలం? ఏ రచనైనా మారుతున్న సమాజానికి రిలెవెంట్ గా వుంటే నిలబడుతుంది, లేకపోతే లేదు. ఈ ముక్క రావిశాస్త్రే చెప్పాడు. నేను మాత్రం గత కొన్నేళ్ళుగా రావిశాస్త్రి రచనల్ని పూరీ పిండిలాగా పిసికేస్తున్నాను!

ఒకసారి నా మిత్రుడు అన్నాడు. 'ఒక సినిమా గానీ, రచన గానీ ఒకసారి ఎంజాయ్ చేస్తే రెండోసారి చెయ్యలేం.' అతని అభిప్రాయం కరెక్టు కావచ్చు. కానీ - అన్నిసార్లు కాదు. షెర్లాక్ హోమ్స్ నవల, హిచ్‌కాక్ సినిమా రెండోసారి ఎంజాయ్ చెయ్యలేకపోవచ్చు. కానీ - సోమర్సెట్ మామ్ ని ఎన్నిసార్లైనా చదవొచ్చు, 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' ని ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఇంకా చాలా పన్లు చాలాసార్లు చేసినా బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.

చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే పక్కన కూర్చుని గమనిస్తుండేవాణ్ని. కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక పదార్ధం తినడానికి పనికొచ్చే విధంగా తయారైపోవడం అనే అద్భుతాన్ని ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండి పొయ్యేవాణ్ని. ముఖ్యంగా - అమ్మ చక్రాలు చేసేప్పుడు చూస్తూ కూర్చోటం నాకెంతో ఇష్టం. చక్రాల గిద్దల్ని నొక్కుతుంటే కింద గిద్ద రంధ్రాల్లోంచి సన్నగా, మెత్తగా, ధారగా, దారంలా వచ్చే శెనగ పిండి - మరుగుతున్న నూనెని తాకంగాన్లే 'సుర్రు'మని శబ్దం చేస్తూ, హడావుడిగా నూనెలో అటూఇటూ పరిగెట్టడం చూస్తే గమ్మత్తుగా వుండేది. నేను కూడా చక్రాల గిద్దల్ని ఒత్తుదామని ప్రయత్నించేవాణ్ని గానీ, నా బలం సరిపొయ్యేది కాదు. నాకు చక్రాల రుచి కన్నా, అవి వండిన విధానం ఎంతగానో ఇష్టం.

అలాగే - చిన్నప్పుడు తిరుపతి చాలాసార్లు వెళ్లాను. రెండు మూడు కుటుంబాల వాళ్ళం కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి మా పటాలం పెద్దది. ముసలీ ముతకా, కొందరు సుకుమారులు కొండపైకి కార్లల్లో వెళ్లిపొయ్యేవాళ్ళు. నేను మాత్రం నడక బ్యాచ్‌లోనే వుండేవాణ్ని. ఆ అడవి, కొండలు, గుట్టలు, లోయలు, రాళ్ళూరప్పలు, కోతుల గుంపులు, కాళ్ళ నొప్పులు.. నాకు చాలా ఇష్టం. నా మటుకు నాకు తిరుపతి ట్రిప్ అంటే ఇంతే! దేవుడి దర్శనం చప్పగా (ఒక్కోసారి విసుగ్గా) అనిపించేది.

అమ్మ చేసిన వంట రుచి నాకు ముఖ్యం కాదు. తిరుపతి దేవుడి దర్శనం నాకు ప్రధానం కాదు. అలాగే - రావిశాస్త్రి రచనల్లో 'కథ' నాకు అనవసరం. నేను దాన్నెప్పుడూ పట్టించుకోలేదు, ఇకముందు పట్టించుకోను కూడా. నాకు రావిశాస్త్రి వాక్యం ఇష్టం, అక్షరం ఇష్టం, ఆయన రాసే స్టైల్ ఇష్టం. ఒకవేళ - రావిశాస్త్రి తను షేవింగ్ చేసుకునే విధానం గూర్చి రాసినా చదవడానికి నాకు ఆసక్తిగానే వుంటుంది. కొందరు కథావస్తువు, శిల్పం అంటూ ఏవో చెబుతారు గానీ.. నాకవేవీ అర్ధం కావు, అనవసరం కూడా. అయినా - అందరికీ అన్నీ నచ్చాలని రూలేమీ లేదు కదా?

ఈమధ్య ఒకళ్ళిద్దరు నన్ను విసుక్కున్నారు, ఆ ఒకళ్లిద్దరూ నా శ్రేయోభిలాషులే!

'నీ గూర్చి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? నీదంతా గుడ్డెద్దు వ్యవహారం. ఏదో ఒకదాన్ని ఇష్టపడతావ్. ఇంక అందులోనే కూరుకుపోతావ్. పైగా అదే స్వర్గం అనుకుని మురిసిపోతుంటావ్! నీ రావిశాస్త్రి అభిమానం వ్యసన స్థితికి చేరుకుంది, అందులోంచి అర్జంటుగా బయటకి రా! ఈ ప్రపంచం చాలా పెద్దది, కళ్ళుండి చూడాలే గానీ చాలా సుందరంగా వుంటుంది.'

నాకు మొండి కత్తితో గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. తెలుగు సినిమా హీరో అభిమానుల సరసన నించున్నంత అవమానంగా కూడా అనిపించింది. అవున్నిజమే! నేనెప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదే! నేనేమన్నా రావిశాస్త్రికి బానిసనా? ఆయనకేమన్నా అప్పున్నానా? అక్కటా! ఏల నేనిన్నాళ్ళూ బావిలో కప్పలా, బురదలో పందిలా, సందులో కుక్కలా జీవించితిని? నా హృదయం తడిసిన సిమెంటు బస్తాలా బరువుగా అయిపొయింది.

ధృతరాష్ట్రుడికంటే కళ్ళు కనిపించవు, ఆయనకి వేరే చాయిస్ లేదు. మరి ఆ పక్కన గాంధారి కళ్ళకి గుడ్డెందుకు కట్టుకుంది? గాంధారి భర్త కోసం కళ్ళగ్గుడ్డ కట్టుకుని (పాతివ్రత్యాన్ని పాటించి) ఎంతోకొంత పుణ్యం సంపాదించి వుండే వుంటుంది.. రావిశాస్త్రి వల్ల నాకాపాటి పుణ్యం కూడా లభించదు కదా! కావున - ఇకముందు నేనిలా వుంటానికి వీల్లేదు. వీరేశలింగం వితంతువుల్ని సంస్కరించినట్లు, నన్ను నేను సంస్కరించుకోవలసినదే!

అసలు తెలుగు సాహిత్యమన్న ఒక పవిత్ర జీవనది వంటింది. దాన్ని మనసారా చదివి ఆనందం పొందవలె! సీతాకోక చిలక అనేక పుష్పములపై వ్రాలి మకరందము గ్రోలుట నీవు కాంచలేదా? ఏం - ఆ కీటకం ఒక పువ్వు మీదే వాలి కడుపు నింపుకోవచ్చు కదా? కానీ - ఆ సీతాకోక చిలక అన్నిరకాల పూలపై వ్రాలుతూ  మకరందం కుంచెం కుంచెం రుచి చూస్తూంటుంది. దీన్నే సమన్యాయం అంటారు! అర్ధమైందా?

అయ్యో! ఒక అర్భక సీతాకోక చిలక్కి వున్నంత పాటి బుర్ర నాకు లేకపోయేనే! తప్పదు.. తక్షణమే తెలుగులో రాస్తున్న యితర రచయితల సాహిత్య పరిమళాన్ని అఘ్రూణించెద, తేనే వలే స్వీకరించెద, చింతలూరివారి మాదీఫల రసాయనము వలె నాకి వేసెద, నూజివీడు రసం వలె జుర్రు కొనెద, అమూల్ ఐస్‌క్రీం వలె చప్పరించెద.

నా స్నేహితుల సలహా మేరకు, పుస్తకాల షాపు కెళ్ళి, ఈ మధ్య కాలంలో తీవ్రమైన పేరు ప్రఖ్యాతులు పొందిన మాంచి జమాజ్జెట్టీల్లాంటి రచయితల పుస్తకాలు కొన్నాను. ఉత్తమ పాఠకుని లక్షణమేమి? పుస్తకం 'కొని' చదవటం. పుస్తకం కాజేసో, అరువు తెచ్చుకునో చదివినవాడు పాఠకుడో, పాతకుడో అగును కానీ.. ఉత్తముడు మాత్రం కాజాలడు.

ఒక చల్లని రాత్రి (వాస్తవానికి అది చల్లని రాత్రి కాదు, ఎండాకాలపు వెచ్చని రాత్రి, ఏసీ వల్ల గది లోపల మాత్రమే చల్లగా వుంది, కానీ - అనాదిగా తెలుగు కవులు వెచ్చని రాత్రిని శృంగార విషయాలకి మాత్రమే రిజర్వ్ చేసి ఉంచారు) పుస్తకం తెరిచి చదవడం మొదలెట్టాను.

ఒక పేజీ ఏదో చదివాను. రెండో పేజీ కష్టపడి చదివాను. మూడో పేజి చదువుతుంటే ఎంతకీ కదలట్లేదు! ఔరా! ఏమి ఈ మాయ! రాత్రికి రాత్రులు దిండ్ల కన్నా మందమైన, బండరాయి కన్నా బరువైన పుస్తకాల్ని 'ఉఫ్'మని ఊది పారేసిన నాకు పేజి కదులుట భారమగుటయా! ఏమి ఈ కాలమహిమ! కష్టపడి మూడో పేజి కూడా చదివాను. నాలుగో పేజి మొదట్లోనే ఇంజన్ మొరాయించింది.

ఎన్నో యేళ్ళుగా ఎంతోమందికి కౌన్సిలింగ్ చేశాను. పీనుగల్లాంటి వాళ్ళు ఏనుగుల్లాగా ఫీలయ్యేట్లు చేశాను. కర్కోటకుల్ని కరుణామయులుగా మార్చేశాను. తొమ్మిది మార్కుల వాళ్ళని తొంభై తొమ్మిది మార్కుల వాళ్ళగా తీర్చిదిద్దాను. ఆశ్లీలుల్ని సచ్ఛీలులుగా మార్చి సమాజానికి సేవ (డబ్బు తీసుకునే అనుకోండి) చేశాను. అట్టి నాకు, ఒక తెలుగు రచన ముందుకు కదలకపోవుటయా! ఇది కలయా? నిజమా? భ్రాంతియా?

ఎవరక్కడ? దుశ్శాసనా! ఈ అవమానం నేను భరింపలేకున్నాను. చితి పేర్పించు, వెంటనే ప్రాయోపవేశం చేస్తాను. 'రారాజా! ఆగుము. నీవే యిటుల ఆలోచించినచో మేమైపోవాలి? నీ తమ్ములం నూర్గురం వున్నాం, ఆజ్ఞాపించు. తక్షణం చతురంగ బలాలతో వెళ్లి ఆ దరిద్రపుగొట్టు తెలుగు సాహిత్యాన్ని భస్మీపటలం చేసేస్తాం.' అని ఎవరూ ఎంతకీ అనరేమి? ఒరేయ్! ఎవడోకడు వచ్చి నా ప్రాణాల్ని కాపాడండ్రా! ఆలీసం అయితే అన్యాయంగా చచ్చూరుకుంటాను. ఇంతలో మెలుకువొచ్చింది. ఔరా! ఇదంతా కలన్న మాట! పుస్తకం మహిమ! కొన్ని పుస్తకాలు నిద్ర మాత్రల్లా పంజేస్తాయి. వెంటనే పుస్తకం టపుక్కున మూసేసి పడుకున్నాను.

మర్నాడు ఇంకో రచయిత పుస్తకం, ఈసారి రెండో పేజి దాటలేకపోయ్యాను. అవమాన భారంతో, శోకంతో కృద్దుడనై మళ్ళీ మాగన్ను నిద్రలోకి జారుకుంటిని. మళ్ళీ దుర్యోధనుడు ప్రత్యక్షం! 'ఇక నీకు మరణమే శరణ్యం.' అంటూ ఎస్వీరంగారావులా వికటాట్టహాసం చేయుచుండగా మెలకువొచ్చింది.

ఇంక నాకు పట్టుదలొచ్చేసింది. 'ఇవ్వాళ - నేనో తెలుగు సాహిత్యమో తేలిపోవాలి' అని పట్టుదలగా ఇంకో రచయిత పుస్తకం తెరిచాను. ఈ పుస్తకం మొదటి పేజి దాటట్లేదు. హృదయం బరువెక్కింది, గుండె నీరయ్యింది, మనసు తల్లడిల్లింది. కంట్లో నీటిపొర! ఏమి నా దౌర్భాగ్యము? నా అఖండ పఠనాశక్తి ఏమయ్యింది? ఏమయ్యింది? ఎక్కడకి పోయింది? కహా గయా? అని మనసు ఘూర్ఘించింది.. దీనంగా, దిక్కు తోచక, బిత్తర చూపులు చూసింది.

ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ గటగటా తాగాను. కడుపు చల్లబడింది, తెలుగు సినిమాకి 'శుభం' కార్డు పడినప్పుడు కలిగే ప్రశాంతత వంటిది లభించింది. ఇప్పుడు బుర్ర ఆలోచించడం మొదలెట్టింది.

'నేనవర్ని? సగటు తెలుగు పాఠకుణ్ని. నేనెవర్ని? ప్రభుత్వ గ్రంధాలయంలో దుమ్ము కొట్టుకుపోయిన పాత పుస్తకం లాంటి వాడిని. నేనెవర్ని? పెద్దబాలశిక్షకీ, ఉరిశిక్షకీ తేడా తెలియని అజ్ఞానిని. నేనెవర్ని?  'ది హిందూ'ని హిందువులు మాత్రమే చదువుతారనుకున్న అమాయకుణ్ని. నేనెవర్ని? జీవన పరమార్ధాన్ని కాఫీ హోటళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో వెతుక్కున్న వ్యర్ధజీవిని. నేనెవర్ని? నేనెవర్నీ కాను, నేను నేనే!'

నువ్వో జ్ఞానివా? కాదు. నువ్వో సాహిత్య పాఠకుడివా? కానేకాదు. నేను చందమామ, విజయచిత్ర మాత్రమే చదువుకున్న అపాఠకుణ్ని. నువ్వో సాహిత్య విమర్శకుడవా? కాదు బాబూ కాదు, అసలు నాకా మాటకి అర్ధమే తెలీదు. మరి నీకెందుకీ ఆపసోపాలు? నీకు నచ్చింది తిను, నచ్చింది చూడు, నచ్చింది చదువుకో! ఈ భువనము నందు నీవొక నీటి బిందువువి, ఇసుక రేణువువి, అరిగిపోయిన కారు టైరువి, కాల్చి పడేసిన సిగరెట్టు పీకవి! కావున - ఆయాసపడుతూ అర్ధం కాని విషయాల జోలికి వెళ్ళడం మాని.. నీకు ఆనందం కలిగే పన్లు మాత్రమే చెయ్యి! దేశాన్ని ఉద్ధరించే ప్రయత్నం మానుకో!

అమ్మయ్య! మనసు ప్రశాంతంగా అయిపొయింది. నేనిప్పుడేం చెయ్యాలి? కొద్దిసేపు ఆలోచించిన మీదట, రావిశాస్త్రి 'బాకీ కథలు' తీసుకున్నాను. పక్కింటి అబ్బాయి, వెన్నెల, పాతదే కథ.. వరసగా కథలు చదువుతూనే వున్నాను. నిద్రా గిద్రా ఎగిరిపోయింది. మా చాత్రిబాబు మాటల మాయలో పడిపోయ్యాను, రచనా ప్రవాహ వేగానికి కొట్టుకు పోసాగాను. 'అబ్బా! తల దిమ్ముగా ఉందేంటి?' అనుకుంటూ టైమ్ చూశాను. తెల్లావారుఝాము నాలుగయ్యింది. అయినా ఏం పర్లేదు, నాకిప్పుడు తెలుగు కథలు చదవగలననే కాన్ఫిడెన్స్ వచ్చేసింది.

ఆ రోజున నేనో జీవిత సత్యం తెలుసుకున్నాను. పక్షులు మాత్రమే ఎగురుతాయి, పులి మాత్రమే వేటాడుతుంది, పోలీసులు మాత్రమే ఎన్‌కౌంటర్లు చేస్తారు, ప్రకృతి వైపరిత్యాల్లో పేదవాడు మాత్రమే చస్తాడు, కాఫీ మాత్రమే కమ్మగా వుంటుంది, విస్కీ మాత్రమే వెచ్చగా వుంటుంది, రావిశాస్త్రి మాత్రమే నాకు నచ్చిన కథ రాయగలడు.

తాజ్‌మహల్ అందముగా యుండును, సావిత్రి నటన అద్భుతముగా యుండును, కొత్తావకాయ ఘాటుగా యుండును, మండువేసవిలో తొలకరి జల్లు ఆహ్లాదముగా యుండును, కృష్ణమ్మ ప్రవాహము వేగముగా యుండును? ఈ 'యుండును'లకి ఇంకో వంద 'యుండును'లు కలిపి.. అవన్నీ ఎందులో యుండును? రావిశాస్త్రి రచనల్లో యుండును!

రావిశాస్త్రీ! థాంక్యూ వెరీ మచ్! యువార్ ద బెస్ట్! ఐ బో మై హెడ్ టు ఎ ట్రూలీ గ్రేట్ రైటర్.

(picture courtesy : Google)

Thursday 12 June 2014

ప్రాణం ఖరీదు


హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన విద్యార్ధుల మృతి చాలా దారుణమైనది. గత రెండు మూడ్రోజులుగా జాతీయ మీడియా కూడా ఈ ఘటనకి చాలా ప్రాధాన్యతనిచ్చి కవర్ చేస్తుంది. మా ఇంట్లో కూడా దీనిగూర్చే చర్చ. తూనీగల్లాంటి పిల్లలు! ఎంత ఆనందంగా, ఎంత సరదాగా వున్నారు! చదువుకునేప్పుడు స్నేహితుల్తో కలిసి ఫొటోలు తీసుకునే సరదా ఎంత మజాగా వుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే - నేను కూడా ఇట్లాగే, ఇంతకన్నా ఎడ్వెంచరస్‌గా - చెట్లూ, పుట్టలూ ఎక్కి ఫొటోలు దిగినవాణ్ని కాబట్టి! అంచేత - చాలా దిగులుగా అనిపిస్తుంది.

సంతోషంగా వున్నప్పుడు ఆలోచనలు రేసుగుర్రంలా పరిగెడితే, దిగులుగా వున్నప్పుడవి దుక్కిటెద్దులా నిదానంగా సాగుతాయి. ఆ దిగుల్లోనే నన్ను నేనో ప్రశ్న వేసుకున్నాను. నన్నీ ఘటన ఎందుకింత తీవ్రంగా కలచివేసింది?

నాకు తోచిన కారణాలు కొన్ని రాస్తాను. ఒకప్పుడు స్నేహితుల్తో నేనూ ఇలాగే ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఆ విద్యార్ధులు నా పిల్లల వయసువాళ్ళు, ముఖ్యంగా వారు పట్టణప్రాంత ప్రజలు. ఎలా చూసుకున్నా - వారు నాకూ, నా కుటుంబానికి ప్రతిబింబం లాంటివారు. అందువల్ల - నేనా పిల్లలతో, వారి కుటుంబాలతో చాలా సులభంగా ఐడింటిఫై అయిపొయ్యాను. 

ఇప్పుడు నాకింకో ప్రశ్న. నేను అన్ని మరణాలకి ఇంతే బాధగా స్పందిస్తానా? దీనికి సమాధానం కోసం కొంత ఆలోచన చెయ్యాలి. మానవ సమాజం అనేక పొరలతో compartmentalize అయింది. కులం, మతం, ప్రాంతం, జెండర్, సామాజిక ఆర్ధిక స్థాయి.. ఇలా అనేకమైన పునాదుల ఆధారంగా. వీటిల్లో కొన్ని భౌతికమైనవి, మరికొన్ని మానసికమైనవి. అందువల్ల అందరూ అన్ని సమస్యలపై ఒకే రకంగా స్పందించటం జరక్కపోవచ్చు. 

ఈ దేశంలో అనేకమంది, అనేక కారణాల వల్ల మరణిస్తూ వుంటారు. వాటిల్లో కొన్ని మరణాలు సభ్యప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన మరణాలు. వీటిల్లో మన హైదరాబాద్ విద్యార్ధుల మరణం కూడా ఒకటి. అయితే మన దృష్టికి రాని, వచ్చినా పెద్దగా పట్టించుకొని మరణాలు ఇంకా చాలానే వున్నాయి. ఉదాహరణకి ఈ రోజుకీ అనేకమంది ఆదివాసీలు మలేరియా, టైఫాయిడ్ వంటి సాధారణ జబ్బులక్కూడా సరైన వైద్యసహాయం అందక చనిపోతున్నారు.

రైతుల ఆత్మహత్యలైతే.. లెక్కే లేదు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల్తో.. చివరికి గిట్టుబాటు ధర లేక.. చేసిన అప్పులు తీరే మార్గం లేక.. రైతులు చనిపోతూనే వుంటారు. పంటపొలాలకి పన్జెయ్యని మందులు ప్రాణం తీసుకోడానికి మాత్రం చక్కగా పన్జేస్తుంటాయి! ఇంకో గమ్మత్తేమంటే, రైతులపై ఆధారపడి వ్యాపారం చేసే వ్యాపారస్తులు మాత్రం కోట్లకి పడగలెత్తుతారు!

దేవుడు మన్నందర్నీ సమానంగానే పుట్టించాడు కదా? మనమందరం మన అమ్మ పాలు తాగే పెద్దవాళ్ళం అయ్యాం కదా? మనందర్లో ప్రవహించే రక్తం రంగు ఎరుపే కదా? మనందరికీ రక్తమాంసాలు, మలమూత్రాలు ఒకటే కదా? ఇట్లాటి ప్రశ్నలు సంధిస్తూ చేంతాడులా చాలా రాయొచ్చు గానీ.. ప్రస్తుతానికి ఈ లిస్టు ఆపేసి, ఇంకో లిస్టు రాస్తాను.

మనందరికీ తినే ఆహరం ఒకటి కాదు. ఒక పాపడికి 'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ' అయితే, ఇంకో పాపడికి 'గంజి విత్ ఉల్లిపాయ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ'! ఒకడిది కేజీల చదువైతే, ఇంకోడిది కూలీ చదువు. ఈ లిస్టు కూడా చాలా పొడుగ్గా రాయొచ్చు కానీ.. ఇంతటితో ఆపేస్తాను. 

కుక్కల్లో బొచ్చుకుక్కలు, వీధి కుక్కలున్నట్లే.. మానవజన్మల్లో కూడా రకాలుంటాయి. అయితే కుక్కల్లో రూపం తేడా వుంటుంది.. మనుషుల్లో వుండదు, అంతే! ప్రస్తుతం మన ప్రభుత్వాల్ని బొచ్చుకుక్కలు పాలిస్తున్నాయి, వీధికుక్కలు పాలింప బడుతున్నయ్. ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్ల ప్రహసనంలో వీధికుక్కలకి రాయితీలంటూ కొన్ని బిస్కట్లని లంచాలుగా పడేసి తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయి.  

అయితే - ఈ మరణాల్ని మనం ఆపలేమా? ఆపటం సంగతేమో గానీ, తగ్గించటం మాత్రం చెయ్యొచ్చు. కానీ - మన ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీల్ని నడిపిస్తుంది వ్యాపార మాఫియా. కాబట్టి ప్రభుత్వాల నుండి చిత్తశుద్ధి ఆశించడం అమాయకత్వమే అవుతుంది. విద్యార్ధుల మరణం అనే ఘోర దుర్ఘటన వెనుక హిమాచల్ ప్రదేశ్‌లోని ఇసుక మాఫియా, ప్రైవేటు విద్యుత్తు మాఫియాల హస్తం వుందంటున్నారు. ఇకముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అక్కడి పాలకులు నొక్కి వక్కాణిస్తున్నారు. నమ్మక చేసేదేమీ లేదు. 

సరే! ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకం కష్టనష్టాల్ని చిత్తశుద్ధిగా పట్టించుకుంటాయనుకునే అమాయకులకి ఈ దేశంలో కొరత లేదు కావున, ప్రస్తుతానికి నేను కూడా ఆ అమాయకుల సరసన చేరి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నాను (ఇంతకుమించి చేసేదేమీ లేదు కాబట్టి).

అయ్యా! ప్రభుత్వాల పెద్దమనుషులూ! మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు - ఇకముందు ఇలా అర్ధంతరంగా, అసహాయంగా, సిల్లీగా, అకారణంగా, చెప్పుకోడానిక్కూడా సిగ్గుపడే విధంగా.. పైకి పోకుండా వుండేందుకు తగు చర్యలు తీసుకొమ్మని వినయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను. 

మీరు దయామయులు, కరుణా స్వరూపులు. ప్రజల్ని, ప్రజా ప్రయోజనాల్ని సలసల కాగే నూనెలో పకోడీల్లా వేయించుకు తింటుండే తమరు.. కొంచెం (మరీ ఎక్కువేం కాదులేండి) మీ ప్రయోజనాల్ని పక్కన పెట్టి మా గోడు కూడా పట్టించుకొమ్మని విన్నవించుకుంటున్నాను. తమరు తల్చుకుంటే ఇదేం పెద్ద ఇబ్బందైన పని కాదు. 

అదేమిటయ్యా? ఇంత ఛండాలంగా ప్రభుత్వాల్ని అడుక్కునేవాణ్ని నేనెక్కడా చూళ్ళేదు. నీ విన్నపం దేవుణ్ని ప్రార్ధించినట్లుంది!

అన్నా! ఇప్పటిదాకా దేవుణ్ని చూసినోడు లేడు. అయినా ఆ దేవుణ్ని ప్రార్ధిస్తూనే వుంటాం! ఎందుకు? 'దైవం' అనేది ఒక నమ్మకం. ఒకవేళ ఆ దేవుడే వుంటే.. మన ప్రార్ధనే ఆయన చెవుల పడితే.. మన కష్టాల గూర్చి ఆలోచిస్తాడనే ఆశ, నమ్మకం. ఇదీ అంతే!

(picture courtesy : Google)