Sunday 31 January 2016

రోహిత్ మరణం.. కొన్ని ఆలోచనలు


పుట్టినవాడు గిట్టక మానడు, చావు పుట్టుకలు ప్రకృతి సహజం అంటారు. అయితే - కొన్ని మరణాలు చరిత్ర సృస్టిస్తాయి, మనలోని మనిషిని కొరడాతో చెళ్ళుమని కొట్టి ఉలిక్కిపడేలా చేస్తాయి. రోహిత్ మరణం అనేక ప్రశ్నల్ని మనముందుంచింది. ఒక విద్యార్ధి మరణం దేశవ్యాప్తంగా ఇంత సంచనలం సృష్టించడం ఈ మధ్య కాలంలో జరగలేదు (ఎమర్జెన్సీ సమయంలో రాజన్ అనే కేరళ విద్యార్ధి encounter కూడా ఇలాంటి తుఫానునే సృష్టించింది).

రోహిత్ మరణం గూర్చి జరుగుతున్న ఆందోళనలు కొన్నాళ్ళకి సద్దుమణగొచ్చు. అయితే - రోహిత్ మరణం భవిష్యత్తులో ఒక మంచి కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రోహిత్ కేవలం ఒక SC కులానికి చెందినవాడైతే ఇంత చర్చ జరిగేది కాదు. అప్పుడది కారంచేడు, చుండూరు మాదిరిగా దళిత vs అగ్రకుల పోరాటంగా మిగిలిపోయ్యేదేమో.

ఒక SC పసిపిల్లని BC కుటుంబం పెంచి పెద్ద చెయ్యడం, తదుపరి తమ BC కులంలో వ్యక్తికి పెళ్లి చెయ్యడం అరుదుగా జరుగుతుంది. ముగ్గురు పిల్లల్ని కన్నాక భార్య SC అన్న 'నిజం' తెలుసుకుని భర్త గృహహింసకి పాల్పడటం, ఆపై విడాకులు తీసుకోవడం కూడా ఆసక్తికరమే. వీళ్ళకి పుట్టిన పిల్లాడు అనేక కష్టాలు ఎదుర్కుని యూనివర్సిటీ స్థాయికి ఎదగడమూ అసాధారణమే. ఈ కుర్రాడు అంబేద్కర్ ఆలోచనలకి ప్రభావితుడై యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం.. ఇదంతా ఓ సినిమా కథలా వుంది కదూ! అవును - రోహిత్ కేసు అనేక విధాలుగా చాలా అరుదైనది. సామాజిక శాస్త్రం చదువుకున్నవారికి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలు.

రోహిత్ తల్లి చట్టపరంగా భర్త నుండి విడాకులు తీసుకుని విడిపొయ్యింది. అందువల్ల ఆయా కుటుంబాల్లో సహజంగానే కొన్ని రాగద్వేషాలు వుండొచ్చు. అయితే రోహిత్ తండ్రి వైపు వారి కోపాన్ని పదేపదే చూపించి హైలైట్ చెయ్యడంలో మీడియా కుట్ర వుందని భావిస్తున్నాను. భర్త నుండి విడిపోయిన భార్య character assassination చెయ్యడం - మీడియాకున్న 'అధికారానికి కొమ్ము కాయడం' అనే పవిత్రమైన ఎజెండాలో భాగం. Women empowerment గూర్చి ఆలోచించాల్సిన ఈ రోజుల్లో - బూజు పట్టిన భావాలకి ఎంత ప్రచారం! 

పిల్లల్ని పెంచడం అన్నది చాలా సీరియస్ వ్యవహారం. Disturbed family environment లో పెరిగే పిల్లల మనస్తత్వం చాలా delicate గా వుంటుంది. తాగుబోతు తండ్రి తమ తల్లిని అవమానించడం, హింసించడం పసివాళ్ళ మససు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేదరికానికి అవమానం, అభద్రత తోడైతే అది చాలా deadly combination. ఈ అమానవీయ నేపధ్యంలో రోహిత్ JRF సాధించగలిగాడంటే అది ఎంతైనా అభినందనీయం.

మధ్యతరగతి భావజాలంలో దేశభక్తి అత్యంత పవిత్రమైనది. మరణశిక్షని రద్దు చెయ్యాలని బలమైన వాదన నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో మెమెన్ ఉరిశిక్షని వ్యతిరేకించడం అన్నది నేరం ఎలా అవుతుంది!? కానీ - సంఘపరివార్ దృష్టిలో ఇదో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేకమైన తీవ్రమైన నేరం. అందుకే ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రోహిత్ మరణం justified అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో వీరు ఎంతమేరకు విజయం సాధించారో కొన్నాళ్ళు ఆగితే గానీ తెలీదు.

మన్దేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లైనా కులాలకీ, మతాలకీ అతీతంగా ఆలోచించలేరని అర్ధమైపోయింది. ఇందుకు ప్రధాన కారణం - వీరిలో ఎక్కువమంది (అందరూ కాదు) ప్రభుత్వాలకి సాగిలపడి కులాన్ని అడ్డుపెట్టుకుని, పైరవీలు చేసి ప్రమోషన్లు సంపాదించుకున్న బాపతు. ఇంక వీరు నిస్పాక్షికంగా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం! ఈ రేటున ఈ దేశానికి కులం నుండి ఇప్పడప్పుడే విముక్తి లేనట్లుగా అర్ధమౌతుంది.

రోహిత్ మరణం పట్ల స్పందనల్ని స్థూలంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. మొదటి రకం - బిజెపి అనుకూల హిందూమత రాజకీయుల వాదన. వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, అంబేద్కర్ వాదనకి వ్యతిరేకులు. కాబట్టి వీరికి (సహజంగానే) రోహిత్ దేశద్రోహిలా కనబడతాడు. చదువుకోవాల్సిన చోట రాజకీయాలు (తమకి నచ్చనివి) చెయ్యడం వల్ల  చనిపొయ్యాడు. అయితే ముసుగు తొలగిపొయ్యి తమ దళిత వ్యతిరేకత నగ్నంగా ప్రదర్శించబడటం సంఘపరివార్‌కి రాజకీయంగా నష్టం. అంచేత తమ escape plan లో భాగంగా 'రోహిత్ దళితుడు కాదు' అనే ప్రచారం మొదలెట్టింది. ABVP రాజకీయాలు సూటిగా, స్పష్టంగా వుంటాయి.   

రెండోరకం స్పందన - దళితవాదుల ప్రకటనలు. మనవాడు, మన ఇంట్లోవాడు అన్యాయంగా చనిపోతే దుఃఖం, కోపం కలుగుతాయి. వీరి ప్రకటనలు ఇదే స్థితిని తెలుపుతున్నాయి. తమవాడి మరణం వీరిని రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. వీరి వాదనా స్పష్టంగా అర్ధమవుతుంది. 

ఇంక మూడోరకం - మధ్యతరగతి మేధావుల స్పందన. వీరు 'మంచివారు'. పాతకాలం ప్రజానాట్య మండలి నాటకాల్లా - పేదరికాన్ని, బలహీనుణ్నీ romanticize చేస్తారు. వీరిది - ధనికుడు vs పేదవాడిలో పేదవాడే కరెక్ట్, ఆడ vs మగ సమస్యల్లో ఆడవారే కరెక్ట్, కుల సంఘర్షణలో తక్కువ కులమే కరెక్ట్ అనే stereotype అవగాహన. సామాజిక విషయాల్ని over simplify చేసుకుని అర్ధం చేసుకోడానికి అలవాటు పడిపోయినందున - రోహిత్ కేసులో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కారణం - కేసులో నిందితుడైన ABVP కుర్రాడు BC అయిపొయ్యాడు! ఇటువంటి సమయాల్లో ఈ తాత్విక గందరగోళాన్ని తగ్గిస్తూ (ఎడ్యుకేట్ చేస్తూ) బాలగోపాల్ అనేక వ్యాసాలు రాశాడు. నాకివ్వాళ బాలగోపాల్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.        

సరే! వాదన కోసం రోహిత్ SC కాదు, OC అనుకుందాం. అసలు గొడవ ఎక్కడ ఎందుకు మొదలైంది? అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి, ABVP మధ్య జరిగిన, జరుగుతున్న ఘర్షణ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ రాజకీయాలకైనా భావజాలమే ప్రధానం. దళితుడైనా ABVP సభ్యుడైతే అతను బ్రాహ్మణీయ భావజాల ప్రతినిధిగానే చూడాలి. అలాగే అగ్రకులస్తుడైనా అంబేద్కర్ విద్యార్ధి సంఘ సభ్యుడైతే అంబేద్కరిస్టుగానే చూడాలి. కాబట్టి - ఇది రెండు రకాల పరస్పర వ్యతిరేక ఆలోచనలని ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్ధి సంఘాల ఘర్షణ. అందుకే ABVP తరఫున కేంద్రమంత్రులు దిగారు. విషయం ఇంత స్పష్టంగా వుంటే - మధ్యతరగతి మేధావులకి రోహిత్ SC నా లేక BC నా అనేది ప్రధానమైపోయింది. రోహిత్ పట్ల గానీ, అతని తల్లి పట్ల గానీ కనీస మానవత్వంతో స్పందించాలన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు.

నిర్భయ చట్టం రాకముందు అనేక దుర్మార్గమైన రేపులు జరిగాయి. కానీ నిర్భయ కేసు సంచలనం సృష్టించడం వల్ల నిర్భయ చట్టం వచ్చింది. రోహిత్ కన్నా ముందు యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులు అనేకులు ఆత్మహత్య చేసుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని చర్చిస్తున్నది ఇప్పుడే. నిర్భయ చట్టం లాగా, దళిత విద్యార్ధులకి రక్షణగా ఒక రోహిత్ చట్టం వస్తే ఈ మొత్తం ఆందోళనకి ఒక మంచి ముగింపు కాగలదు. అప్పుడైనా ఉన్నత విద్యాలయాల్లో కొంతలో కొంత వివక్ష తగ్గే అవకాశం వుంది. అయితే అటువంటి చట్టాలు ఇప్పుడు అధికారంలో వున్నవారి నుండి ఆశించడం అత్యాశేమో!

Tuesday 19 January 2016

దళిత ప్రజాప్రతినిథుల దివాళాకోరుతనం


అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది. 

కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా స్థానంలో దళిత సంఘాలు క్రియాశీలకంగా ముందుకొచ్చాయి. వీరికి రాజకీయంగా సహజ శత్రువు బ్రాహ్మణీయ ABVP కాబట్టి అనేకచోట్ల ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనుంది. ఇదిలా వుండగా - కేంద్రంలో బీజేపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మతవాద శక్తులకి అధికారం తోడైతే ఇంక ఎదురుండదు. కావున ఇవ్వాల్టి ABVP ఒకప్పటి ABVP కాదు, చాలా బలం సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఆలోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

సంఘపరివారానికి ABVP కార్యకర్తలు, VHP నేతలు, కేంద్రమంత్రులు.. అందరూ బిడ్డలే. ఎవరు ఎంత స్థాయిలో వున్నా అన్నదమ్ములు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాబట్టి యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఆధిపత్య పోరుగా మారింది. ఈ పోరులో సంఘపరివారానికి చెందిన కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి చురుకైన పాత్ర వహించడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. 

మతతత్వ విద్యార్ధి సంఘానికి కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు - వివక్షతకి గురవుతూ, తీవ్రమైన కష్టాల్లో వున్న దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు ఎందుకు అండగా నిలవలేదు!? ఎందుకంటే - మనది నిచ్చెన మెట్ల మనువాది వ్యవస్థ. ఇది ఖరీదైన ముసుగు కప్పుకుని అమాయకంగా కనిపిస్తుంది. అధికారం అందరి చేతిలో వున్నట్లుగానే కనబడుతుంది గానీ - కొందరి చేతిలోనే వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని కాదన్నవాడికి మంచినీళ్ళు పుట్టవు. బీజేపిలో RSS విధేయుడిగా లేనివారు వార్డు స్థాయి నాయకుడిగా కూడా ఎదగలేరు. కెరీర్ రాజకీయాల్లో పదవే పరమావిధి. అందుకు చట్ట సభల్లో ఎన్నిక కావడం కీలకం. అందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అవసరం. అందుకు పార్టీకి విధేయుడిగా వుండటం అవసరం.

ఈ సీక్వెన్స్ అర్ధం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు అండగా ఎందుకు నిలబడలేదో అర్ధమవుతుంది. దళిత రిజర్వేషన్ వాడుకుని ప్రజాప్రతినిథులుగా ఎన్నికైనవారు 'పైనుండి' ఆదేశాలు రాకపోతే తమవారి వైపు కన్నెత్తి చూడరు (అలా చూస్తే ఏమవుతుందో తెలిసిన బ్రతకనేర్చిన నేతలు కనుక). అధికారం, పదవులు, డబ్బుకున్న పవర్ అట్లాంటిది!

మనువాది పార్టీలు దళితులకి ఎలాగూ శత్రువులే. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకారి. తమ పక్షాన నిలబడని (నిలబడలేని) దళిత ప్రజా ప్రతినిథులకి బుద్ధి చెప్పగలిగి, వారిని శాసించే స్థాయికి దళిత సంఘాలు చేరుకున్న రోజున - అవి శత్రువుని మరింత సమర్ధతతో ఎదుర్కొనగలవు. ఆ విధంగా దళిత చైతన్యం పురోగమించగలిగితే, రోహిత్ వంటి యువకులు మరింత ఉత్సాహంగా పోరాడగలరు. ఆ రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశాభావంతో వుందాం (అంతకుమించి చేసేదేమీ లేదు కనుక).

Wednesday 13 January 2016

రిజర్వేషన్ - ప్రతిభ


సాయంత్రం ఆరుగంటలు. కాఫీ చప్పరిస్తూ టీవీ వార్తలు చూస్తుండగా -

"నాన్నా! మన కంట్రీ వెనకబడి ఎందుకుందో తెలుసా? రిజర్వేషన్స్ వల్ల! మనకి నైంటీ పర్సెంట్ వచ్చినా సీటు రాదు. ఆ బీసీ, యస్సీలకి తక్కువ మార్కుల్తో సీటొచ్చేస్తుంది!" - నా కూతురి స్టేట్మెంట్!

నాకు నా కూతుర్లో ఒకప్పటి నా అజ్ఞానం కనపడింది.

"తప్పమ్మా, అలా అనకు. ఇక్కడ 'వాళ్లు, మనం' అంటూ యెవరూ లేరు. అంతా 'మనమే'." అన్నాను.

"ఛాన్సులన్నీ వాళ్లే కొట్టేస్తున్నారు." మా అమ్మాయికి నా మాట నచ్చలేదు.

"ముందసలు రిజర్వేషన్లు ఎలా వచ్చాయో తెలుసుకో. యెన్నో యేళ్లుగా కులం పేరుతో కొన్నివర్గాల్ని తొక్కేశారు. వారిని అభివృద్ధిలో భాగం చెయ్యాలన్నా.. సమాన అవకాశాల్ని కల్పించాలన్నా.. " అంటూ చెప్పబోతుండగా -

మొహం చిట్లించుకుంటూ నా కూతురు తన బెడ్రూములోకి వెళ్ళిపోయింది!

మెడిసిన్ సీటొచ్చేదాకా రిజర్వేషన్ల గూర్చి నాకు తెలీదు. అక్కడే మొదటిసారిగా బీసీ, ఎస్సీ అనే పదాలు విన్నాను. రిజర్వేషన్ల వల్ల ప్రతిభకి నష్టం జరుగుతుందని మా (ఓపెన్ కేటగిరీ) సీనియర్లు చెబుతుండేవాళ్ళు. వారి మాటలు నాకు బాగా నచ్చాయి. కొన్నాళ్ళకి - రిజర్వేషన్ల వల్ల ఓపెన్ కేటగిరీ పేదవిద్యార్ధులకి తీవ్రమైన అన్యాయం జరిగిపోతుందని నమ్మడం మొదలెట్టాను. ఆ తరవాతగానీ అసలు విషయం అర్ధం కాలేదు.

ఇదంతా ఒక పరిణామ క్రమం. యే విషయాన్నైనా అవగాహన చేసుకోడంలో ఒక్కొక్కళ్లు ఒక్కోదశలో స్థిరపడిపోతారు. రిజర్వేషన్ల గూర్చి ఒకప్పటి నా అవగాహన ఆనాడు నాకున్న పరిమితుల్ని సూచిస్తుంది. నాకు రిజర్వేషన్ లేకపోవడం, రిజర్వేషన్ వల్ల సీటొచ్చిన విద్యార్థుల్తో పెద్దగా స్నేహం లేకపోవడం నాకున్న పరిమితులు.

"రిజర్వేషన్ ప్రతిభని గండి కొడుతుంది."

ఈ వాదన సరికాదు. ఉదాహరణకి - మెడిసిన్ సీటుకి కావలసిన కనీస అర్హత ఇంటర్మీడియేట్ బయాలజీ సబ్జక్టుల్తో పాసవ్వడం. కానీ మనకి మెడిసిన్ సీట్లు తక్కువ, అర్హులైన విద్యార్ధుల సంఖ్య యెక్కువవడం మూలాన మళ్లీ వడపోత కోసం ప్రవేశ పరీక్ష పెట్టారు. ఇందుకోసం విద్యార్ధులు ఇంటర్ సబ్జక్టుల్నే తీవ్రంగా చదువుతారు, ఈ జ్ఞానం మెడిసిన్ సీటు వొచ్చేవరకే. ఆ తరవాత పాము కుబుసం విడిచినట్లు ఆ సబ్జక్టుల్ని వదిలేస్తారు.

మెడికల్ ఎడ్యుకేషన్ కోర్సులో మొదటి సంవత్సరం కొత్త సబ్జక్టులు మొదలవుతాయి. ఎంబీబీఎస్ కోర్సులో సబ్జక్టులు పాసవడానికి రిజర్వేషన్ వర్తించదు. అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద. కాబట్టి - సామాజికంగా వెనకబడిన విద్యార్ధులకి మెడికల్ కాలేజిలోకి ప్రవేశానికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని, ఆ తరవాత ఇంకే విధమైన రాయితీలు వుండవని మనం గుర్తుంచుకోవాలి.

అదేవిధంగా - పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ. పీజీ సీట్లు తక్కువ కాబట్టి మళ్లీ ప్రవేశ పరీక్ష. ఒక్కసారి పీజీ కోర్సులో చేరాక పాసవ్వడానికి రిజర్వేషన్ వర్తించదు. అంటే ఆపరేషన్ చెయ్యడానికి ఎమ్మెస్ పాసైన డాక్టర్లందరిదీ సమాన ప్రతిభ అవుతుంది. కావున రిజర్వేషన్ డాక్టర్, ఓపెన్ కేటగిరీ డాక్టర్ అంటూ వేర్వేరు ప్రతిభలుండే అవకాశం లేదు.

మన దేశ ఆరోగ్య వ్యవస్థలో ప్రధానమైన పాత్ర ప్రభుత్వాలది. గ్రామీణ పేదల అవసరాలు ఇవ్వాళ్టికీ ప్రభుత్వాసుపత్రులే తీరుస్తున్నాయి. ఈరోజుకీ టైఫాయిడ్, కలరా, మలేరియా, డయేరియాలే మన ప్రధాన శత్రువులు. ఈ రోగాలకి వైద్యం అందేది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే. ఇక్కడ పన్జేసే వైద్యుల్లో ఎక్కువమంది రిజర్వేషన్ వల్ల డాక్టర్లైనవాళ్లే!

మంచి డాక్టర్ కావాలంటే గొప్ప తెలివితేటలు కావాలనుకుంటారు, అస్సలు అవసరం లేదు. మంచి డాక్టర్ కావాలంటే కావలసింది కమిట్మెంట్. నాలుగ్గోడల మధ్యా, లైబ్రరీల్లో కూచుని మెడిసిన్ సబ్జక్టుల్ని మధించడం సరైన వైద్యవిద్య కాదు. వార్డుల్లో పేషంట్లని అధ్యయనం చేస్తూ రోగాల్ని అర్ధం చేసుకోవడం వైద్యవిద్యకి సరైన పునాది.

కాబట్టి -

"రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుంది." అన్నది పసలేని వాదన అని నా అభిప్రాయం.

(fb post on 13 jan 2018)

Tuesday 5 January 2016

తీస్తా సెతల్వాడ్


ముప్పయ్యేళ్ళ క్రితం - 

ఢిల్లీలో గుర్తు తెలీని మూకలు సిక్కుల్ని వెతికి వెతికి వేటాడి చంపాయి. చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు కాగ్రెస్ నేతలపై నేరారోపణ చేశారు. సహజంగానే ఆ కేసులు చివరిదాకా నిలబళ్ళేదు.

పదమూడేళ్ళ క్రితం - 

గుజరాత్‌లో గుర్తు తెలీని మూకలు ముస్లింలని వెతికి వెతికి వేటాడి చంపాయి. షరా మామూలే - చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు బీజేపీ నేతలపై నేరారోపణ చేశారు. ఆ కేసులు పండుటాకులు రాలిపోతున్నట్లుగా ఒకటొకటిగా వీగిపోతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుందంటారు. అంటే ఇదే కాబోలు! 

మన్దేశంలో అధర్మం, అన్యాయం - గర్వంగా, పొగరుగా, నిర్లక్ష్యంగా రొమ్ము విరుచుకుని నాలుగు పాదాల మీదా నడుస్తున్నాయని దిగులు చెందాను. మన్దేశంలో న్యాయం, ధర్మం - అవమానంతో, సిగ్గుతో కుంటినడక నడుస్తున్నాయని దుఃఖించాను. మన్దేశంలో నేరపరిశోధన, నేరవిచారణ అనే పదాలకి అర్ధం లేకుండా పోయిందని ఆందోళన చెందాను. ఇప్పుడు మన్దేశంలో వ్యవస్థలు చూపుతున్న ఫ్యాక్షనిస్టు మైండ్‌సెట్ పట్ల భీతి చెందుతున్నాను!

శ్రీమతి తీస్తా సెతిల్వాడ్ ఒక సామాజిక కార్యకర్త. మానవ హక్కుల కోసం ఉద్యమం చేస్తుంది. గుజరాత్ హత్యాకాండలో చనిపోయినవారి కుటుంబాల తరఫున కేసులు వేసింది. ఆ కేసుల్లో విచారణ ఇంకా కొనసాగుతుంది.

తీస్తా సెతిల్వాడ్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌లకి ఒక NGO వుంది. సంస్థ తరఫున విరాళాలు సేకరించారు. ఆ డబ్బుల్లో కొంత ఖరీదైన సారాయి బుడ్లు, సెంటు బుడ్ల కోసం సొంతంగా వాడుకున్నారని అభియోగం. ఇలా చెయ్యడం నేరం కాబట్టి అందుకు సంబంధిన ప్రతి లొసుగునీ బయటకి లాగాల్సిందే. నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లభిస్తే కేసు బుక్ చెయ్యాల్సిందే, న్యాయస్థానాల్లో నిరూపించాల్సిందే. అప్పుడు నేరస్తురాలైన తీస్తాని ఎవరూ సమర్ధించరు. 

కానీ జరుగుతున్నదేమిటి?!

తీస్తా సెతిల్వాడ్, ఆమె భర్తనీ CBI అనేకసార్లు ప్రశ్నించింది. వాళ్ళ ఆఫీసులో సోదాలు చేసింది, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఒకటి నుండి రెండు కోట్ల దాకా నిధులు దుర్వినియోగం అయ్యాయని తేల్చింది. మరింక తీస్తాని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సింది ఏముంది? CBI ఎందుకంతలా ఉవ్విళ్ళూరుతుంది? 

ఎందుకంటే - తమకి నచ్చని వారి పట్లా, తమని ఇబ్బంది పెట్టే వారి పట్లా రాజ్యం కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం. కక్ష తీర్చుకోవడానికి ఫాసిస్టులకి ఎటువంటి మొహమాటాలు వుండవు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే ప్రక్రియ త్రాచుపాము జరజరా పాకుతున్నంత మెత్తగా, మెథాడికల్‌గా సాగుతుంది. మొడస్ ఒపరాండై ఏదైనా ఫలితం మాత్రం ఒకటే!

ఏ విషయాన్నైనా ఒక పాజిటివ్ నోట్‌తో ముగించాలని అంటారు. కాబట్టి - 

నేర పరిశోధనా సంస్థల వారు తీస్తా కేసుపై చూపిస్తున్న ఆత్రుత, ఉత్సాహం అన్ని కేసుల పైనా చూపించాలని ఆశిస్తున్నాను (ఇలా ఆశించడం ఎంత హాస్యాస్పదం అయినా 'ఆశించడం' మినహా చెయ్యగలిగిందేమీ లేదు కాబట్టి)! 

Sunday 3 January 2016

'కూడలి' మూసివేత - ఒక మంచినిర్ణయం


తెలుగులో కొందరు బ్లాగులు రాస్తుంటారు, ఇంకొందరు చదువుతుంటారు. ఈ రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ 'కూడలి' అంటే అభిమానం. బ్లాగుల్ని ఒక పట్టీలా తయారుచేసి, ఎప్పటికప్పుడు అందించే సైట్‌ని ఎగ్రిగేటర్ అంటారు. ఈ ఎగ్రిగేటర్లలో కూడలి చాలా ప్రముఖమైనది. ఈమధ్య కూడలిని మూసేశారు. ఇది లేటుగా తీసుకున్న మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. 

మీరీ ఎగ్రిగేటర్లని ఒక్కరోజు గమనించినా నానారకాల చెత్తకి కేరాఫ్ ఎడ్రెస్ తెలుగు బ్లాగులు అని అర్ధమైపోతుంది. వ్యక్తిగత వివాదాలు, దాడులు, ప్రతి దాడులు, తిట్లు (అప్పుడప్పుడు బండబూతులు) తెలుగు బ్లాగుల ప్రత్యేకత! మరప్పుడు ఈ చెత్తని సపోర్ట్ చెయ్యడానికి ఎగ్రిగేటర్లు ఎందుకు!?

ఇప్పుడు 'మాలిక' అని ఒక ఎగ్రిగేటర్ వుంది. ఈ సైట్ నిర్వాహకులు హిందుత్వవాదులు, వామపక్ష రాజకీయాల పట్ల తీవ్రమైన ఏవగింపు కలవారు. తమకి నచ్చని అభిప్రాయాలున్న సహబ్లాగర్లని తిట్టడానికే బ్లాగులు నడిపిన, నడిపిస్తున్న ఘనులు! ఇలా తిట్లూ, బూతులూ రాసినంత కాలం మాలిక తెగ ఎంజాయ్ చేస్తూ తనవంతు 'ప్రోత్సాహం' ఇస్తూనే వుంటుంది. బెస్టాఫ్ లక్ టు మాలిక!

(picture courtesy : కూడలి)

తెలుగు వార్తలకి జర్నలిస్టులెందుకు!?


మనిషి స్వేచ్ఛాజీవి. ఇష్టం లేని పన్లు మానెయ్యొచ్చు. అలాగని అన్నిపన్లూ మానెయ్యలేం. ఉదాహరణకి - నాకు గెడ్డం చేసుకోడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ - దురద వల్ల చచ్చినట్లు చేసుకుంటాను. కొన్నిపన్లు మాత్రం మానేశాను - ఎంతోకాలంగా తెలుగు న్యూస్‌పేపర్లు చదవడం మానేశాను, తెలుగు న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. ఉదయాన్నే టీ చప్పరిస్తూ రెండుమూడు ఇంగ్లీషు పేపర్లు తిరగేస్తాను. 

నేను తెలుగు భాషకి వ్యతిరేకిని కాను. అయితే - ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, ఎదుటి పార్టీ నాయకుణ్ణి దుమ్మెత్తి పోసే 'వార్తల' కరపత్రాల్ని డబ్బిచ్చి కొనడం దండగ అని నా అభిప్రాయం. అలాగే ప్రతి న్యూస్ చానెల్‌కీ ఒక ఎజెండా వుంది. ఏ చానెల్లోనూ ఏ వొక్క వార్తా వొకే విధంగా రాదని అర్ధమయ్యాక న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. 

మరప్పుడు తెలుగు జర్నలిస్టులు ఎవరు? రాజకీయ బ్రోకర్లైన యాజమాన్యాల అభిరుచికి తగ్గట్టుగా వార్తలు వండి వార్చే కార్మికులే జర్నలిస్టులు! వీళ్ళని జర్నలిస్టులని అనాలంటే మనసొప్పదు గానీ, ఇంకో పదం దొరకట్లేదు. టౌన్ స్థాయి జర్నలిస్టులైతే ఒక ముఠాగా ఏర్పడి, వృత్తిరీత్యా ఏర్పడ్డ పరిచయాల్తో పైరవీలు చేసుకుంటూ సంపాదిస్తారు. ఈ సో కాల్డ్ జర్నలిస్టులు ప్రయాణాల్లో రాయితీ పొందుతారు, ప్రభుత్వంతో లాలూచీ పడి చౌకగా ఇళ్ళ స్థలాలు కొట్టేస్తారు. ఇంక వీళ్ళేం 'వార్తలు' రాస్తారో అర్ధం కాదు! 

సరే! ఈ దేశంలో నడిచే అనేక అక్రమ వ్యాపారాల్లాగానే ఈ న్యూస్‌పేపర్ వ్యాపారం కూడా వొకటి. వీటిని ఎవాయిడ్ చెయ్యడం మినహా మనం చెయ్యగలిందేంలేదు. కొన్ని పత్రికలు ఎడిట్ పేజిలో కొంత స్పేస్ వ్యాసాల కోసం వదిలేస్తాయి. ఈ స్పేస్‌లో మన తెలుగు మేధావులు వ్యాసాలు రాసి తరిస్తుంటారు! ఒక అనైతికమైన వ్యాపార పత్రికలో తమ వ్యాసాల్ని అచ్చేయించుకునే ఈ మేధావుల డొల్లతనం ఆశ్చర్యం కలిగిస్తుంది! 

తెలుగు న్యూస్‌పేపర్లకి ఎడిటర్లు వుంటారు గానీ - వాళ్ళది సెక్షన్ ఆఫీసర్ స్థాయి. జీతం కోసం తల వొంచుకుని పన్జేయ్యడం వీరి స్పెషాలిటీ మరియూ అర్హత. మరి వీళ్ళకి 'ఎడిటర్' అని ట్యాగ్ ఎందుకబ్బా! విలువలు లేని ఈ పత్రికల వార్తలు కొందరికి నచ్చొచ్చేమో గానీ - నాకు మాత్రం రోత. అందువల్ల ఈ 'గొప్ప' పేపర్లని చదవడం మానేశాను. 

కొంతసేపటి క్రితం - కొన్ని టీవీ చానెల్స్ సరీగ్గా రావడం లేదని నా కూతురు చెప్పింది. టెస్ట్ చేస్తూ చానెల్స్ మారుస్తుండగా.. యాక్సిడెంటల్‌గా ఒక తెలుగు రిపోర్ట్ కంటబడింది (నా ఖర్మ). ఆ మధ్య ఓటుకి నోటు కేసు నిమిత్తం కొన్నాళ్ళు జైల్లో గడిపిన ఒక యువనాయకుడు దేవుడి దర్శనానికి తిరుమల వెళ్ళాట్ట - గొప్పగా హైలైట్ చేసి ఆయన సౌండ్ బైట్స్ తీసుకుంటున్నారు. ఇదీ మన తెలుగు జర్నలిస్టుల పనితీరు! 

హమ్మయ్యా! నా నిర్ణయం కరెక్టే - తెలుగు వార్తల రిపోర్టింగ్ అత్యంత హీనం, హేయం. అవి చూడ్డం కన్నా, మురిక్కాలవలో పందుల సౌందర్యాన్ని వీక్షించడం ఎంతో ఉత్తమం.  

(picture courtesy : Google)