Monday 31 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 3


సినిమాల్లోంచి సమాజంలోకి - 2 లో మన ఫ్యూడల్ ఆలోచనల గూర్చి రాశాను. ఇవ్వాళ మన ఆలోచనా ధోరణిలో రాచరిక వ్యవస్థ లక్షణాల గూర్చి రాస్తున్నాను. ఈ రాతలన్నీ సినిమాల్ని ఆధారంగా చేసుకుని రాస్తున్న ఆలోచనలు కాబట్టి, విషయ పరిమితులు గమనంలో ఉంచుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నాను.

అసలు రాచరిక వ్యవస్థ అంటే ఏంటి? మిత్రులారా! నేను చిన్నప్పుడు పరీక్షల కోసం 'మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?' లాంటి పనికిమాలిన విషయాల్ని బట్టీపట్టాను, మార్కులు కొట్టేశాను. కానీ - చరిత్ర అంటే తేదీలు, సంవత్సరాలు కాదని తరవాత తెలుసుకున్నాను, బట్ టూ లేట్. కావున నాకు చరిత్ర పాఠాలు తెలీదని మనవి చేసుకుంటున్నాను. అయితే - విఠలాచార్య సినిమాలు చాలా చూశాను, లెక్కలేనన్ని చందమామ కథలు చదివాను. ఇప్పుడా జ్ఞానాన్నే దుమ్ముదులిపి 'రాచరికవ్యవస్థ' అంటూ గంభీరంగా రాస్తున్నాను.

అనగనగా ఒక దేశానికి రాజు ఉంటాడు. అతను వంశపారంపర్యంగా ప్రజలని పాలించే హక్కు కలిగుంటాడు. రాజు రాజ్యరక్షణ కోసం శత్రుదేశ రాజుల్తో యుద్ధాలు చేస్తుంటాడు. ఇందుకోసం ఆయనకో పెద్ద సైన్యం ఉంటుంది. రాజ్యం లోపల్నుండి 'రాజద్రోహులు' పన్నే కుట్రలు, కుతంత్రాల్ని కూడా రాజు భగ్నం చేస్తూ ఉంటాడు. ఇందుకోసం అతనికో గూఢాచారి వ్యవస్థ ఉంటుంది. ఈ సంస్థల్ని మేపడానికి రాజు ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తుంటాడు.

మహారాజు తన దేశప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలకి బాధ్యత వహిస్తాడు (ఇయితే ఈ విధులన్నీ మన రాజకీయ పార్టీలు రాసుకునే ఎన్నికల మేనిఫెస్టోల వంటివి). రాజుకన్నా యోగ్యుడు ప్రజల్లో వందలమంది ఉండొచ్చు, కానీ ఎవరూ రాజుగారి అధికారాన్ని ప్రశ్నించరాదు, కనీసం ఆ ఆలోచన కూడా చేయరాదు. ఒకవేళ ఎవడైనా దౌర్భాగ్యుడు అటువంటి ప్రయత్నం చేసినచో, వాడిపై రాజద్రోహ నేరం మోపబడి బహిరంగ శిరఛ్చేదన చెయ్యబడును.

రాజుకి వందలమంది మల్టీ పర్పస్ దాసీజనులు ఉంటారు. ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు. వాళ్ళల్లో పెద్దరాణి వారి కడుపున పుట్టేవాడే రాజవుతాడు. అంచేత ఆవిడ గర్భం ధరించడం ఒక మెగా ఈవెంట్. ఆ గర్భం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించబడతాయి. ఆ సమయంలో - ఎవరో పిలిచినట్లు అడవుల్లోంచి మునులు, ఋషులు వచ్చి మంత్రించిన అరటికాయ, మామిడిపండు లాంటి తినే వస్తువులు రాణిగారికి ఇస్తుంటారు (ఎందుకో తెలీదు)!

మొత్తానికి ఏదోరకంగా రాణీ గర్భవతి అవుతుంది. 'రాణీగారి కడుపులో ఉన్నది ఆడామగా?' అనే టెన్షన్తో పురప్రజలు ఎదురుచూస్తుంటారు. కొడుకు పుట్టినచో, రాజావారు తన మెడలోని హారం అ వార్త చెప్పిన చెలికత్తెకి బహుమతిగా ఇచ్చెదరు. యువరాజావారు జన్మించినందుకు రాజ్యం యావత్తూ ఎగిరి గంతులేస్తుంది.. పండగ చేసుకుంటుంది.

అంతేనా? ప్రకృతి కూడా పులకించును. కోయిల 'కుహూ! కుహూ!'మని కూయును, నెమలి పురివిప్పి నృత్యము చేయును, మండుటెండ పున్నమి వెన్నెల వలె ప్రకాశించును, నీలాకాశం సువర్ణ వర్ణంగా మారి ధగధగా మెరియును, సూర్యచంద్రుల సాక్షిగా మేఘాలు వర్షపు తుంపరలను ఆనంద భాష్పాలుగా కురిపించును. ఇట్లాంటి దరద్రపుగొట్టు రాతలు రాజుగారి ఆస్థాన కవులు రచించెదరు, ప్రతిఫలముగా అగ్రహారాల్ని పొందెదరు (వీరు ఇవ్వాల్టి మన 'పద్మ', జ్ఞానపీఠాలకి మూలపురుషులు)!

ముసలి రాజు, తమ యువరాజులుంగారికి ఎప్పుడు పట్టాభిషిక్తుణ్ని చేస్తారా అని దేశపౌరులు యావత్తు హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు (అంతకన్నా చేసి చచ్చేదేమీ లేదు కనుక). వన్ ఫైన్ డే (ఒక శుభముహోర్తాన) యువరాజు బాబుకి పట్టాభిషేకం అనే ఒక గొప్ప వేడుక జరుగుతుంది. దేశప్రజల జన్మ ధన్యమౌతుంది. ఆ రోజు నుండి ప్రజలు కొత్తరాజుని భక్తిప్రవృత్తులతో కొలవనారంభిస్తారు. కథ మళ్ళీ షరా మామూలే!

మిత్రులారా! ఇప్పటిదాకా (నాకు తెలిసిన) రాచరిక వ్యవస్థ గూర్చి తెలుసుకున్నారు. ఇదంతా మీక్కూడా తెలిసిందే, కానీ రాయబోతున్న విషయం కోసం మీ మెమరీని కొద్దిగా రిఫ్రెష్ చేశాను, అంతే! ఇప్పుడు ఇక ఇదే అలవరసలపై (ఈ పదానికి కాపీరైట్ హక్కుదారు - మీనాక్షీ పొన్నుదురై, రేడియో సిలోన్) తెలుగు సినీచరిత్ర కూడా తెలుసుకుందాం.

ఒకానొకప్పుడు తెలుగు సినిమాకి 'రెండుకళ్ళు'లాగా ఇద్దరు హీరోలు ఉండేవారు. అవడానికవి రెండుకళ్ళే గానీ, ఆ రెండుకళ్ళు ఒకే వ్యక్తివని చెప్పలేం. ఎందుకంటే రెండుకళ్ళూ రెండు వేరువేరు సామ్రాజ్యాలు. ఎవరికీవాళ్ళే తమ దర్శకులు, రచయితలతో సొంత దుకాణాలు నడుపుకునేవాళ్ళు. అవిధంగా కళామతల్లి ముద్దుబిడ్డలు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా జీవుల్ని రంజింపజేశారు. తమ అభిమానుల కోరికపై వృద్దాప్యంలో కూడా రంగుల విగ్గులు, తగరపు కోట్లు వేసుకుని మనవరాలు వయసు హీరోయిన్లతో నర్తించారు.

రాజులు ముసిలాళ్ళైపొతుంటే, సామంతరాజులు బలపడుతుంటారు. కావున అరవైలలో ఇద్దరు కొత్త హీరోలు రంగప్రవేశం చేశారు. క్రమేపి వాళ్ళు సామంతరాజుకి ఎక్కువ, చక్రవర్తికి తక్కువ అన్నట్లుగా సినీరంగంలో స్థిరపడ్డారు. ఆ తరవాత కొన్నేళ్ళకి 'ఒక కొత్తవర్గం' కి చెందిన నటుడొకడు డేకుతూ, పాకుతూ కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు.. ఆపై పెద్ద హీరోగా ఎదిగాడు. 'కొత్తవర్గం' జనులు ఆనంద భాష్పాలు కార్చారు, తమ వర్గం నటుణ్ణి భుజానికెత్తుకున్నారు. ఆనాటి నుండి తెలుగు సినీ అభిమానుల్లో వర్గపోరాటం మొదలైంది (కార్ల్ మార్క్స్ చెప్పిన వర్గపోరాటం కాదు).

ఈలోగా తమ రిటైర్మెంటుతో ఇంతకాలం తాము యేలిన తమ తెలుగు సినీసామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందని, తమ అభిమానులకి దివాణం లేకుండా పోతుందని ముసలి నటులు మిక్కిలి దిగులు చెందారు. అంచేత ఆ రెండుకళ్ళ నటులు తమ తనయుల్ని యువరత్న, యువసామ్రాట్టులుగా తెరపైకి తెచ్చారు. తమ అభిమాన ముసలి హీరోల స్థానంలో వచ్చిన వారి సుపుత్ర కుర్రహీరోల్ని గాంచిన వెర్రి అభిమానులు ఆనందంతో తడిసి మోపెడయ్యారు. ముసలి హీరోల బాటలోనే, అరవైల హీరో కూడా తన అభిమానుల శ్రేయస్సుకై తన ఇద్దరు కొడుకుల్ని రంగంలోకి దించాడు, వారిలో చిన్నకొడుకు ప్రయోజకుడయ్యెను.

ఇక 'వేరే వర్గం' హీరో మాత్రం తక్కువ తిన్నాడా? అందుకే ముందుగా తమ్ముణ్నీ, తరవాతగా కొడుకునీ హీరోలుగా దించాడు. తమ్ముడు హీరో మిక్కిలి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, విప్లవకారుడు కూడా. అందుకే అభిమానులు ఆయనలో చెగువేరా, భగత్ సింగుల్ని దర్శించి తన్మయత్వం చెందుతారు. కిట్టనివాళ్ళు అతను 'జయసింహ'లో ఎస్వీరంగారావులా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నాడు అంటారు గానీ, నిజానిజాలు మనకి తెలీదు.. అనవసరం కూడా.

మిత్రులారా! ఎక్కడా పేర్లని ప్రస్తావించకుండా నే రాసిన తెలుగు సినిమా చరిత్ర మీకు అర్దమయ్యిందనుకుంటాను. రాజలు యుద్ధాలు చేస్తారు, ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదు కదా? అని మీకు అనుమానం రావొచ్చు. ఒకప్పుడు రాజ్యం చుట్టూ కోట ఋరుజు ఉండేది, మరఫిరంగులు ఉండేవి, కొట్టుకు చావడానికి సిపాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడవన్నీ రూపాంతరం చెందాయి. ఇవి ప్రపంచీకరణ రోజులు.. అన్నీ సామాన్యుల కంటికి కనపడని రక్షణ కవచాలు, యుద్ధాలే. ఇప్పుటి నటవారసులకి సొంత స్టూడియోలే రక్షణ కవచాలు, సొంత పంపిణీ వ్యవస్థే దుర్భేధ్య కోటగోడలు. ఇక్కడ అందరూ సమానులే.. కానీ కారు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న ఓ యువనటుడి సాక్షిగా ఇది రాస్తున్నాను.

ఇప్పుడు మనం రాచరిక వ్యవస్థ కోణం నుండి తెలుగు సినిమా చరిత్ర తెలుసుకున్నాం. తద్వారా - అనాదిగా మన 'ప్రజల జాతి' (అనగా పాలింపబడే జాతి) వంశపారంపర్యత పట్ల ఎంతటి భక్తి, ఆరాధన, వినయం కలిగున్నాయో కూడా అర్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఇవే ఆలోచనల్ని, ఇవే అలవరుసలపై (మళ్ళీ - థాంక్స్ టు మీనాక్షీ పొన్నుదురై) దేశ రాజకీయ రంగంలోకి మళ్ళిద్దాం.

'ఈ దేశానికి ప్రధానిగా అవతరించడానికి రాహుల్ గాంధీకున్న ఏకైక అర్హత నెహ్రూ వారసత్వం మాత్రమేనా?' అని నరేంద్ర మోడీ గర్జించి మరీ అడుగుతున్నాడు. నరేంద్ర మోడీకి వారసత్వం ఎడ్వాంటేజ్ లేకపోవడం మూలానే ఈర్ష్యతో అలా అడుగుతున్నాడని నా అనుమానం. లేదా - అతనికి విఠలాచార్య సినిమాలు, చందమామ కథలు, తెలుగు సినిమా చరిత్ర.. బొత్తిగా తెలీకపోవడం వల్లనైనా అలా అడుగుతూ ఉండుండాలి.

నిన్నగాక మొన్న, యువరాణి ఇందిరమ్మ యుద్ధవిద్యలో తండ్రి దగ్గరే కోచింగ్ తీసుకుని, ఆపై రాణిగా పట్టాభిషిక్తురాలయ్యారు కదా! ఇందిరమ్మ కొద్దిగా నయం, అసలు ఏ మాత్రం అనుభవం లేని యువరాజు రాజీవుల వారు సింహాసనాన్ని అధిష్టించారు కదా! ఏం చేస్తాం? దేశంలో క్లిష్టపరిస్థితులు అలా తన్నుకొచ్చాయి. అందుకే భార్య సోనియమ్మ వద్దంటున్నా రాజీవులవారికి రాజ్యాధికారం అనే ముళ్ళకిరీటం ధరించక తప్పలేదు.

ఒక్కసారి 'రాజమకుటం'లో కన్నాంబని గుర్తు తెచ్చుకోండి. పాపం! రాజుగారు హత్య కావించబడ్డ తరవాత రాజమాత, అధికారాన్ని కొడుక్కి అప్పచెప్పడానికి ఎన్ని కష్టాలు పడింది! షేక్స్పియర్ 'హేమ్లెట్' ఛాయలు కనిపించే రాజమకుటం సినిమాని మనం మెచ్చుకోలేదూ? ఇప్పుడు రాజమాత సోనియమ్మ సింహాసనంపై కొడుకుని కూర్చుండపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇందులో తప్పేంటి? మీరు మాత్రం మీ పొలాలు, ఇళ్ళూ మీ పిల్లలకి రాసివ్వరా? రాజులు అదే చేశారు, సినిమా హీరోలూ అదే చేశారు, రాజకీయ నాయకులందరూ అదే చేశారు.. ఇప్పుడు సోనియమ్మ కూడా చేస్తుందదే కదా!

మోడీకి వారసత్వంలో ఉన్న పవర్ అర్ధం కావట్లేదు. జవహర్ లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా, చరణ్ సింగ్, దేవీలాల్, బిజూ పట్నాయక్, విజయ రాజె సిందియా, ఎన్టీరామారావు, శరద్ పవార్, మూలాయం సింగ్ యాదవ్, దేవెగౌడ, కరుణానిధి.. ఇట్లా వారసత్వాల లిస్టు చాంతాడంత ఉంది. ఎమ్జీఆర్ కి వారసులు లేరు, అందువల్ల ఆయన అభిమానులకి జయలలితలో తమ నాయకుణ్ణి చూసుకుని తన్మయత్వం చెందలేదా? ప్రజల్లో వీళ్ళెవ్వరి పట్లా లేని అభ్యంతరం, సోనియా గాంధీ పట్ల మాత్రం ఎందుకుండాలి?

జనాలు సినిమాల్లో వారసత్వ పల్లకీలని మోసే బోయీలుగా ఉన్నారు, మరప్పుడు రాజకీయాల్లో మాత్రం నమ్మకంగా, భక్తిగా ఓట్లేసే కూలీలుగా ఎందుకుండరు? ఉంటారనే పేట్రిక్ ఫ్రెంచ్ అనే ఆంగ్లేయుడు భారత వారసత్వ రాజకీయాల గూర్చి ఓ పుస్తకంలో విపులంగా రాశాడు. తెలుగు ప్రజలకి వారసత్వం పట్ల ఎంత గౌరవం లేకపోతే ఒక మహానాయకుడి కొడుకునో, ఇంకో అధినాయకుడి అల్లుణ్నో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తూ, వారు తమని పాలించే శుభసమయం గూర్చి ఆశగా ఎదురుచూస్తుంటారు? వారి కోరిక త్వరలోనే తీరాలని కోరుకుందాం.. అంతకన్నా చేసేదీమీ లేదు కనక!

(picture courtesy : Google)

Wednesday 26 March 2014

రచయిత


"నమస్కారం రచయిత గారు! ఈమధ్య మీర్రాసిన కథ చదివాను, చాలా బాగుందండి." వినయంగా అన్నాడు అప్పారావు.

రచయితకి మూడాఫ్ అయిపొయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఉప్మాపెసరట్టులో చచ్చిన ఈగ కనిపించినట్లు వికారంగా ఫీలయ్యాడు. వంద గజ్జికుక్కల ఆకలి చూపుల మధ్య పెళ్లిభోజనం చేస్తున్నంత రోతగా అనిపించింది. జబ్బుతో తీసుకుంటున్న పేదవాడు మొహంమీద దగ్గినంత ఇబ్బందిగా అనిపించింది. కొత్తగా కొన్న పెద్దకారుకి చిన్నగీత పడితే కారు ఓనరయ్యకి కలిగే ఆందోళన లాంటిది కూడా కలిగింది. స్కాచ్ మాత్రమే తాగేవాడికి లోకల్ బ్రాండ్ ఆఫర్ చేస్తే వచ్చే చికాకులాంటి భావన కూడా కలిగింది.

ఇన్నిరకాల భావనలతో, దేశంలో ఉన్న సమస్త దరిద్రాన్నీ మూటకట్టి నెత్తిన పెట్టుకుని మోస్తున్నవాళ్ళా భారంగా నడుస్తూ ఇంటికి బయల్దేరాడు. మనసు మనసులో లేదు, ఆలోచనలు మునిసిపాలిటీవాడు దోమలమందు చల్లినా చావని దోమల గుంపుల్లా కమ్ముకుంటున్నయ్.

'నా కథ ఈ అప్పారావుకి ఎలా అర్ధమైంది? నా రచనలు కాఫ్కా కన్నా పైస్థాయిలో ఉంటాయి కదా! నా ఆలోచనలు మేధావులకే అంతుబట్టవు. నా కథల్లోని అర్ధాన్ని వెతకడానికి ప్రపంచవ్యాప్తంగా నా అభిమాన గణం నిరంతరంగా ప్రయత్నిస్తుంటుంది. నా రచనల్లోని అర్ధాలు, గూఢార్ధాల, నిగూఢార్ధాల గూర్చి వ్యాఖ్యానాలే అనేక పుస్తకాలుగా వచ్చాయి. నేను కథకులకి మాత్రమే కథకుణ్ణి కదా! మరి ఈ ఆఫ్టరాల్ అప్పారావుకి నా కథ ఎలా అర్ధమైంది? నా కథల స్థాయి ఇంతగా దిగజారిందా?" ఆలోచనలతో రచయిత బుర్ర అట్టు పెనంలా వేడెక్కింది.

వేడెక్కిన బుర్రని అంతకన్నా వేడిగానున్న ఫిల్టర్ కాఫీతో చల్లబరచ ప్రయత్నించాడు. ధర్మాసుపత్రిలో అధర్మ డాక్టరిచ్చిన మాత్రలేసుకుంటే ఉన్న రోగం పోకపోగా, కొత్తరోగం మొదలైనట్లు.. ఆలోచనలు మరింతగా పెరిగిపోయ్యాయి.

ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక శిష్యపరమాణువు నుండి ఫోన్.

"రచయిత గారు! ఫలానా కథలో సముద్రం ఎర్రబారిందనీ, అలలు ఘనీభవించాయనీ రాశారు. అలా ఎందుకు రాశారో చెప్తారా?"

మనం అప్పు పెట్టిన వడ్డీవ్యాపారస్తుడు వోల్వో బస్సు ప్రమాదంలో ఛస్తే వచ్చేంతటి బ్రహ్మానందం.. రచయితకి కలిగింది.

"ఆ కథలో సముద్రం అంటే సముద్రం అని కాదు, 'మనసు' అని అర్ధం." గర్వంగా అన్నాడు రచయిత.

"అలాగా! అయితే అప్పుడు అలలు అంటే అలలు కాదనుకుంటా." అన్నాడు శిష్యపరమాణువు.

"అక్కడ అలలు అంటే అర్ధం రెండురకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోస్ట్ మోడర్నిస్ట్ అర్ధం, రెండు మేజిక్ రియలిజం అర్ధం. అయినా ఆ కథని విశ్లేసిస్తూ ఓ రెండు వేల పేజీల పుస్తకాన్ని నా అభిమానులు ప్రచురిస్తున్నారు." అన్నాడు రచయిత.

"రచయిత గారూ! నే చచ్చేలోపు మీలాగా ఒక్కవాక్యం రాసినా చాలండీ, నా జన్మ ధన్యమౌతుంది, మీరు నిజంగా కారణజన్ములు." తన్మయత్వంగా అన్నాడు శిష్యపరమాణువు.

ఆ మాటల్తో, తన కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్న వెర్రి అభిమానుల్ని చూసినప్పుడు తెలుగు సినిమా హీరోకి కలిగేంత ఉత్సాహం వచ్చింది రచయితకి. ఫుల్లుగా మేకప్పేసుకుని పార్టీకి ఎటెండైన ఆంటీని 'మీరే కాలేజ్ స్టూడెంట్?' అనడిగితే వచ్చే గర్వానందము లాంటిది కలిగింది.

'అవును! తెలుగునాట 'మో' కవితల్ని అర్ధం చేసుకున్నవాడు ఉండొచ్చు, 'త్రిపుర' కథల్ని పరిచయం చేసేవాడూ ఉండొచ్చు, కానీ - నా రచనల్ని అర్ధం చేసుకున్నవాడు ఇప్పటిదాకా పుట్టలేదు (పుట్టకూడదని కూడా నా కోరిక)!' అని నర్తనశాలలో ఎస్వీరంగారావులా అనుకున్నాడు రచయిత.

కానీ - అంతలోనే అప్పారావు జ్ఞాపకం వచ్చాడు, నిస్సత్తువ ఆవహించింది. తన కథని బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టినంత బాధ కలిగింది. తన బార్లో రోజూ బిల్లు కట్టకుండా మందు తాగే పన్నుల అధికార్ని చూసి బారు ఓనరు లోలోపల నిశ్సబ్దంగా కుళ్ళుకుంటూ ఏడ్చినట్లు, రచయిత కూడా మనసులోనే రోదించసాగాడు.

'నా కథ అప్పారావుకి ఎలా అర్ధమైంది? ఇదెవరికైనా తెలిస్తే నాకెంత పరువు తక్కువ!' అనుకుంటూ అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన సూపర్ డైరక్టర్లా అవమాన భారంతో దీర్ఘాలోచనలో మునిగిపోయ్యాడు రచయిత.

రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రచయిత. ఎంత ఆలోచించినా.. అవి చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలా సాగుతూ, అక్కడక్కడే తిరుగుతున్నాయి గానీ, ఓ కొలిక్కి రావట్లేదు. అందువల్ల - మండే వేసవి ఎండలకి కరిగే గుంటూరు తారు రోడ్డు వలే.. రచయిత బుర్ర మరీ హీటెక్కిపోయింది.

'లాభం లేదు, ఒక కథ రాయడానిక్కూడా ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. ఈ విషయం తేల్చాల్సిందే.' అనుకుంటూ అప్పారావుకి ఫోన్ చేశాడు.

"రచయిత గారు నమస్తే!" అప్పారావు లైన్లోకొచ్చాడు.

"నువ్వు నాకో విషయం చెప్పాలయ్యా అప్పారావు. నా కథలో నీకేం నచ్చింది?" సూటిగా సుత్తి లేకుండా అడిగేశాడు రచయిత.

అప్పారావు వైపునుండి కొద్దిసేపు నిశ్శబ్దం.

"హ్మ్.. మీ కథ బాగుందండి." మొహమాటంగా అన్నాడు అప్పారావు.

"నేనడిగేదీ అదే, నీకాకథ ఎందుకు నచ్చింది?" రెట్టించాడు రచయిత.

అటువైపు నుండి మళ్ళీ నిశ్శబ్దం.

"అప్పారావు! అడిగేది నిన్నే! లైన్లోనే ఉన్నావా?" అసహనంగా అడిగాడు రచయిత.

"రచయిత గారు! క్షమించండి. వాస్తవానికి మీ కథ ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు." ఇబ్బందిగా అన్నాడు అప్పారావు.

"మరి బాగుందని ఎందుకు చెప్పావ్?" ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

"మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని ప్లీజ్ చెయ్యాలని ఒక చిన్న అబద్దం ఆడాను, అంతే!" తప్పు చేసినవాడిలా అన్నాడు అప్పారావు.

"థాంక్స్ అప్పారావ్."

లైన్ కట్ చేశాడు రచయిత. ఈ థాంక్స్ దేనికో అప్పారావుకి అర్ధమయ్యే అవకాశం లేదు.

మర్డర్ మిస్టరీని చేధించినప్పుడు షెర్లాక్ హోమ్స్, డిటెక్టివ్ యుగంధర్, పెర్రీ మేసన్ లకి కలిగే ఆనందం, తృప్తి లాంటివి.. రచయితక్కూడా కలిగాయి.

'అనవసరంగా పొద్దున్నుండి ఎంతలా ఆవేదన చెందాను!' సారా పేకెట్లు పంచకుండానే ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేలా సంతోషంతో పొంగిపోయ్యాడు రచయిత.

'అప్పారావుకి కథ నిజంగా అర్ధమైనట్లైతే అసలు రచన చెయ్యడమే మానేద్దును. ఇప్పుడా ప్రమాదం తప్పిపోయింది. ఇది తెలుగు జాతి అదృష్టం, తెలుగు సాహిత్యం చేసుకున్న పుణ్యం.'

రచయితకి ఒక్కసారిగా తన శిష్యకోటి, అవార్డులు, రివార్డులు, సన్మాన శాలువాలు గుర్తొచ్చాయి. గర్వాతిశయములతో గుండెల్నిండా గాలి పీల్చుకుని.. ఒక కొత్త రచనకి శ్రీకారం చుట్టాడు.

అంకితం :

పాఠకులకి అర్ధం కాకుండా రాస్తూ లబ్దప్రతిష్టులైపోయిన తెలుగు రచయితలందరికీ అభినందనలతో..

(picture courtesy : Google)

Monday 24 March 2014

పవన్ కళ్యాణ్ - ఎం.జె.అక్బర్


ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే తెలుగు సినిమా నటుడికి నరేంద్ర మోడీలో చెగువేరా కనిపించాట్ట, రేపు ఈయనకి చంద్రబాబు నాయుళ్లో భగత్ సింగ్ కనిపించొచ్చు. ఎవర్లో ఎవరు కనిపించినా, అది ఆ సినిమా నటుడి ఇష్టం. ఎందుకంటే ఒక నటుడికి రాజకీయాలు తెలియాల్సిన అవసరం లేదు, నటించడం తెలుసుంటే చాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నటుడి సమస్యని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఎం.జె.అక్బర్ అనే ఒక ఘనత వహించిన ఆంగ్ల కాలమిస్టు ఈమధ్య బీజేపిలో చేరాడు. ఇదేమంత విశేషం కాదు. కొందరు జర్నలిస్టులు ఎలక్షన్ల సమయంలో చాన్స్ (టిక్కెట్టు) దొరికితే రాజకీయపార్టీల్లో చేరిపోతుంటారు. ఈయన గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీతో సహా ఏవో పదవులు వెలగబెట్టాడు. అటుతరవాత ఈయనకే మొహం మొత్తిందో, కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టిందో తెలీదు గానీ.. బుద్ధిగా పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. 

ఎం.జె.అక్బర్ గుజరాత్ అల్లర్లకి మోడీని బాధ్యుణ్ణి చేస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, మోడీని హిట్లర్ తో పోలుస్తూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు. మంచిది, జర్నలిస్టుగా ఆయన నమ్మిన అభిప్రాయాలు నిష్కర్షగా రాసుకున్నాడు, అది ఆయన ఇష్టం. 

ఇప్పుడు బీజేపిలో చేరుతూ (నరేంద్ర మోడీ పంచన చేరుతున్న అన్ని వలస పక్షుల్లాగే) నరేంద్ర మోడీలో ఈ దేశాన్ని భీభత్సంగా అభివృద్ధి చెయ్యబోతున్న భావిప్రధాని కనిపిస్తున్నాడని వాకృచ్చాడు. సిట్, సుప్రీం కోర్టులు నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చాయి కావున నరేంద్ర మోడీ అమాయకుడని కూడా సెలవిచ్చాడు! 

అలాగా? మరి ఈయనగారు దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తమ పని పూర్తి కానిచ్చేవరకూ ఆగకుండా, ఈలోపుగానే అదేపనిగా నరేంద్ర మోడీని ఎందుకు తిట్టిపోసినట్లో! డబ్బు కోసమా? కీర్తి కోసమా?

పవన్ కళ్యాణ్ కి చెగువేరా, భగత్ సింగ్, గద్దర్, నరేంద్ర మోడీ.. వీళ్ళెవరూ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయన ఒక సినిమా నటుడు కాబట్టి. అయితే - చాలామంది (తమకి తెలీకపోయినా) కొందరు ప్రముఖుల పేర్లు అలవోకగా ప్రస్తావిస్తుంటారు.. తమక్కూడా ఒక 'మేధావి' అనే గుర్తింపు వస్తుందని. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ అర్ధమయ్యాడు. 

ఎం.జె.అక్బర్ మాత్రం పవన్ కళ్యాణ్ వంటి అమాయకుడు కాదు. ఆయన తెలివైనవాడు, మేధావి. అన్ని విషయాలు బాగా అధ్యయనం చేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు, కాలమిస్టు, రచయిత. ఆయనకి మోడీ నిన్నటిదాకా దెయ్యంలాగానూ, ఇవ్వాళ్టినుండి దేవుళ్ళాగానూ కనపడ్డంలో మాత్రం పూర్తిగా స్వార్ధప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పచ్చి అవకాశవాదం, పాత్రికేయ దిగజారుడుతనం.


(photos courtesy : Google)

Saturday 22 March 2014

అమాయకుని ఆలోచనలు


భారత దేశము నా మాతృభూమి. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంటుంది, అంచేత శాంతిభద్రతలు ప్రశాంతంగా పక్కేసుకుని నిద్రోతుంటాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటుంది, పురులు విప్పి నాట్యం చేస్తుంటుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి కేరాఫ్ ఎడ్రెస్ నా దేశం.. ఇక్కడ ప్రజలే పాలకులు, ప్రభువులు. కావున - ఇక్కడ అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంటారు.

నా దేశంలో ప్రజలు రెండురకాలు. ఒకరు స్వార్ధపరులు, రెండు నిస్వార్ధపరులు.

స్వార్ధపరులనగా ఎవరు? వీళ్ళు రోజు గడవటం కోసం చాకిరీ చేస్తుంటారు.. కొందరు పొలాల్లో, ఇంకొందరు ఫేక్టరీల్లో. మరికొందరు చిన్నాచితకా పనులు చేస్తుంటారు. వీళ్ళు ఎంత చేసినా, ఏం చేసినా తమ గూర్చి, తమ కుటుంబం కోసం మాత్రమే పాటు పడుతుంటారు. వీరికి దేశసేవ పట్ల ఆసక్తి ఉండదు. తమకంతటి పరిజ్ఞానం, సమయం, సొమ్ము లేదని అనుకుంటుంటారు.

మరి నిస్వార్ధపరులు ఎవరు? వారిని రాజకీయ నాయకులు అందురు. వీరికి తమ కుటుంబం కన్నా మాతృదేశమన్న మిక్కిలి ప్రీతి. వీరు స్వార్ధపరుల వలె చాకిరి చెయ్యరు, అసలు కనీస శ్రమ కూడా చెయ్యరు.. చెయ్యలేరు. అందుకు కారణం వారికి సమయం దొరక్కపోవడమే కానీ మరేదీ కాదు. ఏలననగా - రాజకీయ నాయకులు అనుక్షణం దేశం గూర్చే ఆలోచిస్తుంటారు, అనునిత్యం దేశప్రగతికై శ్రమిస్తుంటారు.. అందుకని!

భారత దేశం ఎంతో గొప్పదేశం. అందుకే ఇక్కడ దేశాన్ని సేవించుకొనుటకు తపన పడువారి సంఖ్య ఎక్కువ.. వారిలో వారికి పోటీతత్వమూ ఎక్కువే. ఒక మంచిపని చేయుటకు పోటీపడుతున్న ఇంతమంది నిస్వార్ధ రాజకీయ నాయకుల్ని చూస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది.

మాతృభూమి సేవ కొరకై దేశస్థాయిలో పోటీ పడుతున్న నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు ధన్యజీవులు, వారికి నా ధన్యవాదాలు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, తద్వారా నావంటి అర్భకుడి జీవన స్థితిగతుల్ని పెంపొందించుటకై తహతహలాడుతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన రెడ్డిల తపన, ఆత్రుత మిక్కిలి అభినందనీయం, వారికి నా నమస్కృతులు.

దేశాభివృద్ధికై నిరంతరాయంగా తీవ్రంగా పాటుపడుతున్న నాయకులందరికీ నమోన్నమః. అయ్యలారా! ఎందఱో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ స్వార్ధపరుడు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలడు? మీరందరూ నా సేవకులే, కానీ - నాకున్నదేమో ఒక్కటే ఓటు, ఏమి నా దుస్థితి! 

(picture courtesy : Google)

Wednesday 19 March 2014

డాక్టర్ కె.పి.మిశ్రా


ఇవ్వాళ హిందూలో డాక్టర్ కె.పి.మిశ్రా చనిపోయారన్న వార్త చదివాను. ఆయన గూర్చి ఎన్నో జ్ఞాపకాలు. అవి మీతో పంచుకోవాలని ఈ పోస్టు రాస్తున్నాను.  

డాక్టర్ కె.పి.మిశ్రా హార్ట్ స్పెషలిస్ట్. ఎక్కువకాలం చెన్నైలో పనిచేశారు. ఆయన ECG పాఠాలు నేను విన్నాను. ఆయనో గొప్ప టీచరని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. ఆయన టీచింగ్ స్కిల్స్ అద్భుతం.  

టీచర్లలో రకరకాలైన వాళ్ళుంటారు. కొందరు సరళమైన విషయాల్ని క్లిష్టంగా బోధిస్తారు, వీరిని చెడ్డ టీచర్లు అంటారు. ఇంకొందరు క్లిష్టమైన విషయాల్ని క్లిష్టంగానే బోధిస్తారు, వీరిని ఒకమాదిరి టీచర్లు అంటారు. మరికొందరు క్లిష్టమైన విషయాల్ని సరళ తరం చేసి బోధిస్తారు, వీరిని గొప్ప టీచర్లు అంటారు. 

డాక్టర్ కె.పి.మిశ్రా గొప్ప టీచర్ల కేటగిరీలోకి వస్తారు. 1980 లలో (గుండెకి సంబంధించిన గీతలైన) ECG (ఎలెక్ట్రోకార్డియోగ్రామ్) ని జెనరల్ మెడిసిన్ పీజీలకి, జెనరల్ ప్రాక్టీస్ డాక్టర్లకి, మాబోటి హౌజ్ సర్జన్లకి చక్కగా విడమరిచి చెప్పిన మహానుభావుడు. 

సాధారణంగా వైద్యవిద్యా బోధన మొనాటనస్ గా, డల్ గా ఉంటుంది. అందుకు పూర్తి విరుద్ధంగా డాక్టర్ కె.పి. మిశ్రా పాఠం సాగేది. ఆయన వాక్ప్రవాహం చాలా ఒరవడిగా ఉంటుంది. ఆ భాషా పటిమ, మాట విరుపు, నాటకీయత, బాడీ లాంగ్వేజ్.. ఎంతో విలక్షణం. 

మరీ ముఖ్యంగా, పాఠంలో అక్కడక్కడా సమయస్పూర్తితో ఆయన చొప్పించే జోక్స్ చాలా సరదాగా, ఆహ్లాదకరంగా ఉండేవి. ఆయన క్లాస్ వింటుంటే 'విషయం ఇంతేనా? ఇది చాల సింపుల్' అని అనిపించేది. క్లాస్ అప్పుడే అయిపోయిందా? అని కూడా అనిపించేది. ఇవన్నీ గొప్ప లెక్చర్ లక్షణాలు. 

గుంటూరు మెడికల్ కాలేజిలో కూడా గొప్ప మెడిసిన్ ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు (వారిలో డాక్టర్ సి.యం.రావు గారు ప్రముఖులు). వాళ్ళు కూడా చక్కగా చెప్పేవారు. కానీ డాక్టర్ కె.పి. మిశ్రాది మాత్రం స్టన్నింగ్ పెర్ఫామెన్స్. నేను ఆయన ECG క్లాసులు వినటం వలన మాత్రమే, ఈ రోజుకీ ECG బేసిక్స్ గుర్తున్నయ్యని నా నమ్మకం. 

నాలాంటి అజ్ఞానులెందరికో గుండెకి సంబంధిన 'గీత' గుట్టు రట్టు చేస్తూ, 'గీత'లోని మర్మాన్ని సరళంగా, సరదాగా మాకు బోధించిన మహోపాధ్యాయుల వారైన డాక్టర్ కె.పి.మిశ్రా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  

డాక్టర్ సాబ్! మీరెప్పుడూ మీ విద్యార్ధుల మదిలో చిరంజీవిగానే ఉంటారు. మీకు నా నివాళులు.  

(photo courtesy : Google)

Saturday 15 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 2


'ఫ్యూడల్ భావజాలం మన ఆలోచనా విధానం నుండి డిలీట్ అయ్యిందా? లేదా?' అనేది ఓ ధర్మసందేహం. ఈ ప్రస్తావన 'సినిమాల్లోంచి సమాజంలోకి' మొదటి భాగంలో వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం కోసం విజయవంతమైన రెండు తెలుగు సినిమాల గూర్చి మాట్లాడుకుందాం.

సుమారు ముప్పైయ్యేళ్ళ క్రితం 'బొబ్బిలి బ్రహ్మన్న' అనే సినిమా వచ్చింది. కృష్ణంరాజు అనే నటుడు హీరో. ఒక ఊళ్ళో బ్రహ్మన్న అనేవాడు ఉంటాడు. అతగాడిది అదేదో బొబ్బిలి వంశంట! గుండెల నిండా గాలి పీల్చుకుని, కళ్ళు మిటకరించి.. ఊళ్ళో జరిగే నేరాలకి ఎడాపెడా తీర్పులు తనదైన స్టైల్లో చెప్పేస్తుంటాడు. అవన్నీ హర్యానాలో జరుగుతున్న ఖాప్ పంచాయితీలు టైపు తీర్పులు. బ్రహ్మన్న ఊళ్ళో పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉండవు, సర్వం బ్రహ్మన్న బాబే! వాస్తవానికి ప్రజలు ఈ సినిమాని నిర్ద్వందంగా తిరస్కరించాలి, కానీ అలా జరగలేదు.

ఇరవైయ్యేళ్ళ క్రితం 'పెదరాయుడు' అని ఇంకో సినిమా వచ్చింది. ఈ కథ కూడా ఖాప్ పంచాయితీ కథే. ఊళ్ళో ఓ అగ్రకుల పెద్దమనిషి స్టైలుగా చుట్ట పీలుస్తూ కాలు మీద కాలు వేసుకుని తీర్పులు చెప్పేస్తుంటాడు. సాంఘిక బహిష్కరణ (ఇట్లాంటి తీర్పు చట్టరీత్యా నేరం) వంటి తీర్పులు కూడా ఇచ్చేస్తుంటాడు. పంచెకట్టు, మీసం మెలెయ్యడం, బంగారు కంకణం.. ఆ పాత్ర ఆహార్యం కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. పైగా అమ్మోరికి మేకని బలిస్తున్నట్లు బేక్ గ్రౌండ్ మ్యూజిక్కొకటి. ఫ్యూడల్ భావజాలాన్ని నిస్సిగ్గుగా ప్రమోట్ చేసిన ఈ సినిమా కూడా బాగా ఆడింది.

అనగనగా ఒకానొప్పుడు ప్రజలు తమకన్నా పెద్ద కులాల వారిని గౌరవించేవాళ్ళట, తక్కువ కులాల వారిపట్ల తేలికభావంతో ఉండేవాళ్ళట. అదంతా చరిత్ర కదా! కాదా? మరి ఈ రెండు సినిమాలు విజయవంతం అవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో సామాన్య ప్రజానీకంలో ఫ్యూడల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత లేదు అనా? ప్రేక్షకుల్లో చాలామంది అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్దిస్తున్నారు అనా? అందుకే - 'పెద్ద కులం పెద్దమనిషి, పాపం తీర్పులు చెబుతూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా!' అంటూ ఆ ఫ్యూడల్ మనిషితో empathize అయ్యారా?

మన తెలుగు జాతికి సాహిత్య స్పృహ తక్కువ, కాబట్టి సామాజిక స్పృహ కూడా అదే రేంజ్ లో ఉండటం సహజం. కాబట్టే.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తి, అంతస్తు, హోదా తప్ప ఇంకే అర్హతా లేని (ఒక్కరోజు కూడా శారీరక / మేధోశ్రమ చెయ్యని / చెయ్యలేని) అడ్డగాడిద లాంటి హీరో (దేవదాసు, ప్రేమనగర్, దసరా బుల్లోడు) పడే 'ప్రేమ' అనే మూలిగే సూడిపంది ప్రసూతి నొప్పుల బాధని ఆనందంగా, ఆరాధనగా చూస్తుండిపోతాం. ఎంతైనా పెద్దకులంవాడు, డబ్బున్నవాడు, కష్టం ఎరుగని సున్నితమైనవాడు కదా!

అందుకే - (నాకు తెలిసిన) చాలామంది అగ్రకులస్తులకి కారంచేడు, చుండూరు హత్యాకాండ చాలా సహజమైనదిగా కనిపించింది. చుండూరులో అగ్రకులస్తులు తమ ఆడపిల్లల్ని దళిత యువకులు ఇబ్బంది పెడుతున్నారని, వారి కుటుంబాల్ని వెంటాడి, వేటాడి నరికి చంపారు. శవాల్ని గోనె సంచుల్లో కుక్కి కాలవలోకి విసిరేశారు. 'మన ఆడపిల్లల జోలికోచ్చిన అంటరాని కులం వాళ్లకి ఆ మాత్రం బుద్ధి చెప్పకపోతే ధర్మం నాలుగు పాదాల మీద నడవద్దూ!' అని వారి వాదన. ఈ వాదన దళితులు కానివారికి నచ్చింది (బయటకి మాత్రం అందరూ తీవ్రంగా ఖండించారు, అది వేరే సంగతి).

ప్రజల ఆదరణ పొందిన సినిమాల నుండి, సమాజ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నాను. ఈ పధ్ధతిలో ఉన్న పరిమితుల గూర్చి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల నేను రాసిన విషయాలు జెనరలైజ్ చెయ్యరాదు. సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అన్నిరకాల మనుషులు ఎన్నోరకాల ఆలోచనా ధోరణిని కలిగుంటారు. అయితే - బూజుపట్టిన భావజాలంతో వచ్చిన సినిమాలు విజయవంతం అయ్యాయి కాబట్టి, ఆ ధోరణిని సమర్ధించేవారు (కొందరైనా) మనమధ్యన ఉన్నారని (వీళ్ళు మనకి ఎంత నచ్చకపోయినా) చెప్పడం మాత్రమే నా లిమిటెడ్ పాయింట్.

(picture courtesy : Google)

Tuesday 11 March 2014

కుప్పల చెత్తసామి


అది ఆంధ్రదేశంలోనున్న వేలాది మురికి వీధుల్లో ఒకటి. ఆ మూలగా ఓ చెత్త కుండీ. ఆ పక్కనే మురిక్కాలవ. దాని గట్టు మీద ఒక నడివయసు మనిషి. బక్కగా, నల్లగా, మాసిన గుడ్డల్తో, గెడ్డంతో.. చెత్తకుండీ, మురిక్కాలవకి మ్యాచింగ్ బోర్డర్లా ఉన్నాడు.

అతగాడు అరగంట క్రితం ప్రభుత్వంవారి చౌక మద్యం సేవించాడు. ఆ మద్యం కల్తీలేని స్వచ్చమైనదైయ్యుంటుంది, అందుకే నిఖార్సైన కిక్కుతో మత్తుగా జోగుతున్నాడు. ప్రశాంతంగా బీడీని కాల్చుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుచున్నాడు.

ఇంతలో అటువైపుగా వచ్చాడు ఓ పచ్చచొక్కా పెద్దమనిషి. పచ్చచొక్కాకి మురికి మనిషిని చూస్తుంటే నలిగిపోయిన ఓటులాగా కనిపించాడు.. ఎలక్షన్ల సీజను మరి!

"చూడు నాయనా! రేపు ఎలక్షన్లలో నీ ఓటు మా బాబు పార్టీకే వెయ్యాలి. అర్ధమైందా?" అంటూ పార్టీ ప్రచారం మొదలెట్టాడు.

మురికి మనిషి ఆనందానికి బ్రేకు పడింది. హఠాత్తుగా స్వర్గం అంచు నుండి జారిపడినట్లైంది. అంచేత చిరాగ్గా చూశాడు.

"ఏంది ఏసేది? ఎందుకెయ్యాల?" పెళుసుగా అన్నాడు మురికి మనిషి.

"ఎందుకా? అబివృద్ధి కోసం. రేపు కొత్త రాష్టం బాగుపడాలంటే మనమందరం బాబుకే ఓటెయ్యాలి. అసలు బాబు ఎంత గొప్పనాయకుడు? అబివృద్ధికి చొక్కా తొడిగి, గెడ్డం పెంచితే.. అది అచ్చు బాబు లాగే ఉంటుది." ఉపన్యాస ధోరణిలో అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"ఏంది ఉండేది? అందుకేగా అబిరుద్ది, అబిరుద్ది అంటూ సోమ్ములన్నీ ఐదరాబాదులో కుప్పగా పోసాడు?" కాలిపోయిన బీడిని విసిరేస్తూ చికాగ్గా అన్నాడు మురికి మనిషి.

"ఈసారట్లా చెయ్యళ్ళే. అన్ని ఊళ్లు సమానంగా అభివృద్ధి చేస్తాడు. నాదీ హామీ." అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అంటే ఈసారి అబిరుద్ది చిన్నచిన్న కుప్పలుగా సేస్తాడన్నమాట." ముద్దగా అన్నాడు మురికి మనిషి.

"అవును, అవునవును. నేచేప్పేదదే." సంతోషంగా అన్నాడు పచ్చచొక్కా మనిషి.

"అట్టాగా! అయితే ఇసయం ఆలోచిస్తాలే." అంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నాడు మురికి మనిషి.

'అమ్మయ్యా! ఈమాత్రం హామీ చాలు.' అనుకుంటూ అక్కణ్నుండి కదిలింది పచ్చచొక్కా.


రోడ్డు మలుపులో ఓ బడ్డీకొట్టు. కొట్లో ఓ పాతికేళ్ళ కుర్రాడు. గోళీ సోడా కొట్టించుకున్నాడు పచ్చచొక్కా పెద్దమనిషి. సోడా తాగుతూ కొట్లో కుర్రాణ్ణి అడిగాడు.

"తమ్ముడూ! ఇక్కడంతా శుభ్రంగా ఉందిగా. అతనెవరో ఇక్కడ కాకుండా ఆ చెత్తకుండీ దగ్గర ఉన్నాడెందుకు?"

"ఆడా? ఆడిది మునిసిపాలిటీలో చెత్త ఎత్తే ఉద్యోగం సార్. రోజూ పొద్దున్నే మునిసిపాలిటీ ఆడోళ్ళు చీపుళ్ళతో రోడ్డు మీద చెత్తని చిన్నచిన్న కుప్పలుగా చిమ్ముతారు. ఈడు ఎనకమాలగా ఆ చిన్న కుప్పల్ని తోపుడు బండిలోకి ఎత్తుతాడు." అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"అట్లాగా!"

"ఆడికి సొంతిల్లుందండి. కానీ ఆ చెత్త కంపు అలవాటైపోయిందనుకుంటా. అందుకే డ్యూటీ అయ్యాక్కూడా ఆడే కూర్చుంటాడు." అన్నాడు ఆ బడ్డీకొట్టు కుర్రాడు.

"బాగా తాగి ఉన్నట్టున్నాడు." పచ్చచొక్కా అబ్జర్వేషన్.

"ఆడు టొంటీఫోర్ అవర్సు ఫుల్లు ఆన్ లోనే ఉంటాడండి బాబు." నవ్వాడు బడ్డీకొట్టు కుర్రాడు.

"రాజకీయం బాగానే చెబుతున్నాడు." అన్నది పచ్చచొక్కా.

"ఆడి పేరు కుప్పుసామి. చేసేది చెత్త కుప్పల పని. అందుకే ఆడేది చెప్పినా చెత్త కుప్ప భాషలోనే చెబుతాడు, ఏ విషయాన్నైనా ఆ భాషలోనే అర్ధం చేసుకుంటాడు. అందుకే ఆణ్ణందరూ 'కుప్పల చెత్తసామి' అంటారు." నవ్వుతూ అన్నాడు బడ్డీకొట్టు కుర్రాడు.

పచ్చచొక్కాకి ఇప్పుడు తత్వం బోధపడింది. నిట్టూరుస్తూ చిన్నగా ముందుకు కదిలాడు.

(photo courtesy : Google)

Wednesday 5 March 2014

మోడీ.. ద సూపర్ మేన్


టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చానెల్ చూస్తున్నాను. నరేంద్ర మోడీ హిందీలో అనర్ఘళంగా ఉపన్యసిస్తున్నాడు. ఇంతలో సుబ్బు వచ్చాడు.

"కూర్చో సుబ్బూ! మొత్తానికి మోడీ చాలా ఘటికుడు సుమా!" టీవీలో మోడీని చూస్తూ అన్నాను.

"అంతేలే! సూపర్ మేన్ కూడా ఘటికుడే." అన్నాడు సుబ్బు.

"అబ్బబ్బా! మోడీకీ, సూపర్ మేన్ కి పోలికేంటి సుబ్బూ?" చికాగ్గా అన్నాను.

"మిత్రమా! నువ్వు సూపర్ మేన్ సినిమాలు చూశావుగా? సూపర్ మేన్ కి సాధ్యం కానిదేదీ ఉండదు. ఒక్క గుద్దుతో వందమందిని మట్టి కరిపిస్తాడు. గాల్లోకెగురుతాడు, భూమి చుట్టూ చక్కర్లు కొడతాడు, భూకంపాల్ని ఆపుతాడు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నేను సూపర్ మేన్ సినిమాలన్నీ చూశాను, నువ్వు మరీ అంత వివరంగా చెప్పనవసరం లేదు." అసహనంగా అన్నాను.

ఇంతలో కాఫీ వేడిగా పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ నిదానంగా సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"సూపర్ మేన్ అనేది ఓ పాపులర్ కార్టూన్ కేరక్టర్. ఓ హాలీవుడ్ స్టూడియో ఆధ్వర్యంలో కొన్ని డజన్ల మంది కొన్ని వందల గంటలు పాటు సూపర్ మేన్ కేరక్టర్ గూర్చి చర్చించుకుని, మరిన్ని మెరుగులు దిద్ది, సినిమా పాత్రగా తీర్చిదిద్దారు. తదనుగుణంగా ఓ నటుడు సూపర్ మేన్ పాత్ర పోషించాడు. ఇందుకోసం ఆ నటుడు ఆకుపచ్చని స్క్రీన్ ముందు వైర్ల సహాయంతో వేళ్ళాడుతూ, గాల్లో ఫైటింగులు చేశాడు."

"అవును, ఈమధ్య స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాలన్నీ ఇట్లాగే తీస్తున్నారు." నవ్వుతూ అన్నాను.

"అలా షూట్ చేసుకున్న ఫిల్మ్, ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్లో రకరకాల హంగులతో ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆ విధంగా ఎంతోమంది, ఎన్నోరకాలుగా కష్టపడి ఒక ఎండ్ ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఇంకో దశ. మళ్ళీ ఎంతోమంది కూడి, ఆలోచించుకుని.. రిలీజ్ టైమింగ్ ప్లాన్ చేసుకుని, సరైన పబ్లిసిటీ కోసం కృషి చేస్తారు. వీళ్ళందరూ ఆయా రంగాల్లో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్." అన్నాడు సుబ్బు.

"అవును, పబ్లిసిటీక్కూడా భారీ బజెట్ ఉంటుంది." అన్నాను.

"తెరపై సూపర్ మేన్ని చూసేవారికి ఇవేవీ పట్టవు, అనవసరం కూడా. వారు సూపర్ మేన్ చేసే అద్భుత విన్యాసాల్ని సంభ్రమంగా, ఆశ్చర్యంగా మైమరచి చూస్తారు. మిలియన్ల కొద్దీ డాలర్లని ఖర్చు పెట్టిన స్టూడియో వారికి కావాల్సింది కూడా అదే. ఎంత ఎక్కువమంది మైమరచిపోతే స్టూడియోకి అంత లాభం." అన్నాడు సుబ్బు.

"అవును, ఒప్పుకుంటున్నాను. కానీ మోడీకీ, సూపర్ మేన్ తో గల పోలిక ఏమిటి?" ఆసక్తిగా అడిగాను.

"సింపుల్. నిన్నటిదాకా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పాపులర్. అందుకే ఇవ్వాళ బీజేపీ అనే స్టూడియో మోడీని హీరోగా పెట్టి 'ప్రధానమంత్రి' సినిమా తీస్తుంది. ఇందుకు గాను కొన్ని వేలమంది, లక్షల కోట్ల బజెట్ తో, చర్చోపచర్చలు జరుపుతూ, అందుబాటులో ఉన్న అన్నిరకాల ప్రచార సాధనాలు ఉపయోగించుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. మోడీ ఈ దేశ దరిద్రాన్ని, నిరుద్యోగాన్ని ఉఫ్ మంటూ ఉదేస్తాడు. అభివృద్ధిలో దేశాన్ని అమెరికా కన్నా ముందుకు నడిపించేస్తాడు. పాకిస్తాన్, చైనాల్ని గడగడలాడించేస్తాడు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"గో ఆన్ సుబ్బూ! ఇంటరెస్టింగ్." అన్నాను.

"మోడీ రాకతో దేశం రామాయణం నాటి పుణ్యభూమిగా మారిపోతుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు, ఆనంద పారవశ్యంతో నృత్యాలు చేస్తారు. ఈ సినిమా బీజేపి పార్టీ తీస్తున్న ఓ మేగ్నమ్ ఓపస్. మనకి కనిపిస్తుంది మాత్రం నరేంద్ర మోడీ అనే ఓ నటుడు. కానీ అతని వెనక స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నవాళ్ళ బుర్రలు మాత్రం పనిభారంతో వేడెక్కి సెగలు పొగలు కక్కుతున్నాయి." అన్నాడు సుబ్బు.

"వర్కౌట్ అవుతుందంటావా?" అడిగాను.

"అది మనమెలా చెప్పగలం? ఎన్నికల సంఘం అన్ని పార్టీలకి, వారి సినిమాల విడుదల తేదీ ప్రకటిస్తుంది. కరెక్టుగా ఆ సమయానికి మోడీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటుంది, ఉండాలి కూడా. ఆ సినిమా బాగుందా, లేదా అనే సంగతి ప్రజలు నిర్ణయిస్తారు." అన్నాడు సుబ్బు.

"మరి కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీని సూపర్ మేన్ గా ప్రమోట్ చేసుకోవచ్చుగా?" అడిగాను. 

"వచ్చు. కానీ సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ.. బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఎన్టీఆర్ తో 'దేవదాసు' తీస్తే అట్టర్ ఫ్లాపయ్యేది. ఎఎన్నార్ తో 'బందిపోటు' తీస్తే నిర్మాతకి పోస్టర్ల డబ్బులు కూడా వచ్చేవి కావు. రాహుల్ గాంధీది చాక్లెట్ ఫేస్, లవర్ బాయ్ ఇమేజ్. కాబట్టి అతన్తో కాంగ్రెస్ పార్టీ అనే స్టూడియో 'రాముడు మంచి బాలుడు' టైపు పాత్రతో ఓ సినిమా తీస్తుంది. అందుకే ఆయన దళితుల పూరిపాకల్లో నిద్ర చేస్తాడు, గిరిజన మహిళల్తో ముద్దు పెట్టించుకుంటాడు. అధికారం అంటే ఇష్టం లేనట్లుగా, మనలో ఒకడుగా ప్రవర్తిస్తుంటాడు. ఇవన్నీ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సెర్సైజులు." అన్నాడు సుబ్బు.

"మరి రాహుల్ సినిమా హిట్టవుతుందా?" ఆసక్తిగా అడిగాను.

"తెలీదు. కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లొచ్చినా వాళ్ళ సినిమా సూపర్ హిట్టే. అయినా ప్రస్తుత పరిస్థితుల్లోఇంతకన్నా కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యగలిగిందేమీ లేదు." అంటూ రిస్ట్ వాచ్ చూసుకుంటూ నిలబడ్డాడు సుబ్బు.

"సుబ్బూ! కొన్ని కోట్ల మంది జీవితాల్తో ముడిపడున్న ఎన్నికల్ని నువ్విట్లా సినిమా భాషలో విశ్లేషించడం నాకు నచ్చలేదు, సిల్లీగా ఉంది." అన్నాను.

"అంతేనంటావా? సర్లే! నువ్వు సీరియస్ గా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకో. ఏం చేసేది? నాకు నీ అంత ఓపిక లేదు." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.


(photos courtesy : Google)

Monday 3 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 1


ప్రస్తుతం నడుస్తుంది ఎన్నికల సీజన్. రాజకీయ నాయకులకివి అత్యంత కీలకమైన రోజులు. కాబట్టే వాళ్ళు 'ప్రజలు తమని ఏమనుకుంటున్నారు?' అన్న సంగతి తెలుసుకోవాలనే ఆరాటంతో తెగ తంటాలు పడుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకో సర్వే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ స్పాన్సర్డ్ బాపతు అని అర్ధమవుతుంది. మరప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే సాధనం ఏంటి?

మిత్రులారా! నాకు నా భార్య ఎవరికి ఓటేస్తుందో కూడా అంచనా లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది పచ్చినిజం కావున ఈ సంగతి చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. కావున, 'నీ భార్య ఆలోచనే తెలీనివాడివి, నోర్మూసుకుని కూర్చోక సమాజం గూర్చి నీకెందుకు?' అని మీరు అనుకుంటున్నట్లైతే నాకే అభ్యంతరమూ లేదు. కానీ - ఎన్నికల సమయంలో పార్టీల జయాపజయాల గూర్చి చర్చించుకోవడం చిలక జోస్యం చెప్పించుకున్నంత సరదాగా ఉంటుంది. వాతావరణశాఖ ఋతుపవనాల్ని అంచనా వేసినంత వినోదంగా కూడా ఉంటుంది. ఈ సరదా, వినోదాన్ని నేను మాత్రం ఎందుకు కాదనుకోవాలి?

'ఏ సమాజంలోనైనా ప్రజల మనోగతాన్ని అంచనా వెయ్యడం ఎలా?' అనేది ఆలోచిద్దాం. మన దేశంలో రాచరిక వ్యవస్థ ఎప్పుడో రద్దైంది, ఫ్యూడల్ వ్యవస్థ కూడా పోయింది. రాజకీయంగా ఇట్లాంటివి చాలా అంతరించిపొయ్యాయి. కానీ ఇవన్నీ మన ఆలోచనా విధానంలోంచి కూడా డిలీట్ అయ్యాయా? అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేం. యూరోపియన్ దేశాల్లో (ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాల్లో) సోషల్ సైకాలజీ స్టడీస్ ఉన్నాయి. వారు ఆ స్టడీస్ ఆధారంగా సమాజాన్ని అంచనా వేసుకోగలుగుతారు (వారి సైంటిఫిక్ మెథడాలజీ కరెక్టా? కాదా? అన్నది వేరే విషయం).

చాలా పెద్దదైన మన దేశంలో అట్లాంటి స్టడీస్ చెయ్యాలంటే కష్టం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం మొదలైన అనేక అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి, విషయం సంక్లిష్టంగా మారిపోతుంది. పైపెచ్చు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రస్తుతం మనం ఆకలి చావులు, దోమల చావులు కూడా నివారించుకోలేని ప్రాధమిక దుస్థితిలో ఉన్నాం. కావున కనీసమైన శాస్త్రీయ పరిశోధన జరగని సోషల్ సైకాలజీ గూర్చి ఆలోచించ బూనడం వృధా ప్రయాస. కాబట్టి ఆ శాస్త్రాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం.

సరే! ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం. అసలు ఒక సమాజపు ఆలోచనా ధోరణిని అంచనా వెయ్యడం ఎలా? కోట్లు ఖర్చుపెట్టి పరిశోధనలు చేసే పధ్ధతి తప్ప వేరే సూచికలు లేవా? పోనీ - చదువుని అర్హతగా పరిగణించి అంచనా వేస్తే? ఉహూ! లాభం లేదు. మన చదువులు ఉద్యోగం సంపాదించడం కోసం పనికొచ్చేవే తప్ప జ్ఞానాన్ని ఇచ్చేవి కావు. ఈ దేశంలో చదువు వల్ల సంపాదించుకున్న 'సుఖమయ జీవన' మేధావులకి సామాన్య మానవుడి ఆలోచనా విధానం అర్ధం కావడం మానేసి చాలా కాలమైంది. కాబట్టి చదువుకున్నవారి సంఖ్యతో సమాజాన్ని అంచనా వెయ్యబూనడం సరైన విధానం కాదు.

పోనీ ప్రజల సాహిత్యాభిలాషతో సమాజాన్ని అంచనా వేసే ప్రయత్నం చెయ్యొచ్చా? అప్పుడు మంచి సాహిత్యం అంటే ఏంటనేది పెద్ద చర్చవుతుంది? నేను శ్రీశ్రీ అంటే ఇంకొకాయన విశ్వనాథ అంటాడు. నేను రావిశాస్త్రి అంటే ఇంకొకాయన ముళ్ళపూడి అంటాడు. ఒకళ్ళకొకళ్ళకి అస్సలు పడదు. అయినా ఒకళ్ళిద్దరు మంచి రచయితలు ఉన్నంత మాత్రాన, అది దేనికీ సూచిక కాదు. ఇది ఇందిరా గాంధీ ప్రధాని అయినందు వల్ల దేశంలో ఆడవారందరూ అభివృద్ధి చెందారని చెప్పడం వంటి గమ్మత్తైన వాదన.

అసలీ సూచికలన్నీ ఒక సమాజం నూటికి నూరుపాళ్ళు విద్యావంతమైతే తప్ప ఉపయోగపడని సాధనాలు, పద్ధతులు. అంచేత, సామాన్య ప్రజల ఆలోచనల్ని అంచనా వెయ్యడం ఎలా? అనే సబ్జక్ట్ కొద్దిగా కాంప్లికేటెడ్ వ్యవహారం. ఓటు వేసేవాడికి చదువు అవసరం లేదు - మనలో మెజారిటీకి చదువు లేదు. ఓటు వేసే వాడికి సాహిత్యంతో పన్లేదు - మనలో మెజారిటీ ఏదీ చదవరు. ఓటు వేసేవాడికి సోషల్ మీడియాతో పన్లేదు - మనలో మెజారిటీకి కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు.

పోనీ - సినిమా ఒక సూచిక అవుతుందా? అవ్వొచ్చునేమో! ముందుగా సినిమాలకీ, ఎన్నికలకి గల సారూప్యతల్ని పరిశీలిద్దాం. ఓటు వెయ్యడానికి ఏ అర్హతా అవసరం లేదు, సినిమా చూడ్డానిక్కూడా ఏ అర్హతా అవసరం లేదు (జేబులో టిక్కెట్టుకి సరిపడా డబ్బులుంటే చాలు). సినిమా ప్రేక్షకులు ఆయా హీరోల కులం బట్టి కూడా అభిమానులుగా ఉంటున్నారు, ఎన్నికల్లో కూడా కులం ప్రభావం ఉంటుంది. సినిమా హీరోలకి కొందరు ప్రేక్షకులు వీరాభిమానులు ఉంటారు, రాజకీయ నాయకులకి కూడా దాదాపు అదే స్థాయి అభిమానులు ఉంటున్నారు.

కాబట్టి - తరచి చూడగా.. అందుబాటులో ఉన్న సాధనాల్లో సినిమా అనేది 'కొద్దోగొప్పో' పోల్చడానికి దగ్గరగా ఉన్నట్లుగా తోస్తుంది. అయితే ఈ ప్రాధమిక అంచనాతో ఒక ఇబ్బంది ఉంది. ప్రేక్షకుల అభిరుచి బట్టి సినిమా విజయవంతం అవుతుందని అందరూ అంటారు. కానీ ఇక్కడ నేను చెయ్యబోతుంది విజయవంతమైన ఒక సినిమా ద్వారా ప్రజల అభిప్రాయం అంచనా వెయ్యబూనడం. ఇది ఒక బోర్లింపు సిద్ధాంతం (reverse hypothesis). ఇప్పుడు బోర్లింపు సిద్ధాంతాన్ని కూడా ఒక శాస్త్రంగా గుర్తిస్తున్నారు కాబట్టి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాం కాబట్టి, ఈ దోవలోనే ముందుకెళ్దాం.

(picture courtesy : Google)