Wednesday 30 July 2014

థియరీ అండ్ ప్రాక్టీస్


ఒక విషయాన్ని అర్ధం చేసుకోటం ఎలా? సింపుల్! ఆ విషయం గూర్చి దీక్షగా చదవడమే. ఇలా చదవడం మూలానా చాలా విషయాలు అర్ధం చేసుకోవచ్చు. మనం చదవగలం కాబట్టి ఇదేమీ పెద్ద సమస్య కాదు. అయితే - అన్ని విషయాలూ చదవడం ద్వారానే అర్ధం చేసుకోగలమా? చేసుకోలేమని నా అభిప్రాయం. కొన్ని విషయాలు దగ్గరగా వెళ్లి చూస్తే గానీ అర్ధం కావు.

ఇప్పుడు కొంతసేపు ఫ్లాష్‌బ్యాక్. నాకు ఇరవైయ్యేళ్ళ వయసుకి తెలుగు సాహిత్యంతో కొంత పరిచయం ఏర్పడింది. కొన్ని విషయాలు అర్ధమయ్యేవి, కొన్ని అర్ధమయ్యేవి కావు. ఆడవారి కష్టాలు, ఆకలి మొదలైవాటిగూర్చి టెక్స్ట్ బుక్ చదివినట్లు చదివానే గానీ, అవెలా ఉంటాయో నాకు తెలీదు. అందువల్ల ఆ రోజుల్లో (విషయంలోని సీరియస్‌నెస్ తెలీక) నాదంతా సరదా వ్యవహారమే.

నాకు మంచి స్నేహితురాళ్ళు వుండేవాళ్ళు. వారిలో 'స్త్రీకి పురుషుని సన్నిధే తరగని పెన్నిధి'గా భావించేవారి నుండి 'సృష్టిలోని సమస్త అనర్ధాలకి పురుషుడే కారణం'గా భావించేవారి దాకా ఉన్నారు. సీమటపాకాయ జడలాగా 'ఢబఢబ'మంటూ పేలే అమ్మాయిలు కొందరు - స్త్రీవిముక్తి సంఘటన, స్త్రీలపై అత్యాచారాల వ్యతిరేక కమిటీ లాంటి పేర్లతో పనిచేస్తూ.. చాలా యాక్టివ్‌గా వుండేవాళ్ళు.

నాదగ్గర ఒక కెమెరా వుంది. ఫోటోగ్రఫీలో కాలేజీ స్థాయిలో ప్రైజులు కూడా సంపాదించాను. ఆ రోజుల్లో ఒక ఫోటో తియ్యంగాన్లే అందరూ అడిగే మొదటి ప్రశ్న 'ఫోటో వస్తుందా?' అని! కారణం - తీసేవాడు గానీ, తీయించుకునేవాడు గానీ పొరబాటున కదిల్తే ఫోటో వచ్చేది కాదు. వీటికి తోడు నెగటివ్ 'కడిగే' స్టూడియోవాడి దయ కూడా అవసరమయ్యేది.

ఒకసారి నా స్నేహితురాళ్ళు ఏదో కేసు నిమిత్తం 'నిజనిర్ధారణ కమిటీ'గా ఏర్పడ్డారు. వాళ్లకి ఫోటోలు అవసరం, కానీ ఫోటోగ్రాఫర్‌ని భరించే శక్తి లేదు. అంచేత - ఫ్రీ (ఫ్రీలాన్స్ కాదు) ఫోటోగ్రాఫర్‌గా నన్ను రమ్మన్నారు. ఆ కమిటీలో ఒకమ్మాయి నా జూనియర్. 'నువ్వు ఫొటోగ్రఫీలో రఘు రాయ్ అంతటివాడివి' అని ఆ అమ్మాయి నన్ను పొగిడేసింది. అంతమాటనిపించుకున్నాక వెళ్ళకపోతే బాగుండదని మొహమాటంగానే (లోపల సంతోషిస్తూనే) ఒప్పుకున్నాను.

పేపర్లో వచ్చిన వార్త - అంతకు రెండ్రోజుల ముందు నగర శివార్లలో కాపురం వుంటున్న ఓ ఇరవైయ్యేళ్ళ యువతి కడుపునొప్పికి తట్టుకోలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 'విషయం ఇంత స్పష్టంగా ఉన్న తరవాత మళ్ళీ వీళ్ళు నిర్ధారించేదేమిటో?' అని అనుకుంటూనే వాళ్ళతో వెళ్ళాను.

అది రెండు గదుల ఇల్లు. ఇల్లంతా రక్తం కడిగిన మరకలు.. వికారమైన వాసన. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా వున్నాయి. ఇంటి ముందువైపు బావి వుంది. కానీ - ఆ బావి పెద్ద లోతుగా లేదు, అందులో మోకాలులోతు నీళ్ళు కూడా లేవు. ఆ బావిలో ఎవరన్నా దూకినా, మహా అయితే కాళ్ళు విరగడం మినహా మరే ప్రమాదం జరిగే అవకాశం లేదు.

మాతో వచ్చినవాళ్ళల్లో ఒకమ్మాయి చాలా హుషారు. క్రైమ్ ఎనాలిసిస్ షెర్లాక్ హోమ్స్‌ లెవల్లో చేసేస్తుంది. మావైపు అనుమానంగా, బెరుగ్గా చూస్తున్న ఇరుగుపొరుగుల్తో నెమ్మదిగా మాట కలిపింది. తమకి పోలీసుల్తో సంబంధం లేదనీ, తాము ఆడవాళ్ళకి న్యాయం కలిగించే సంఘం తరఫున వచ్చామని చెప్పి కన్విన్స్ చేసింది. ఆ ఆడవాళ్ళింక జరిగిన సంఘటనని పోటీపడి చెప్పారు.

అక్కడ జరిగింది అచ్చమైన స్వచ్చమైన నిఖార్సైన హత్య. ఆ ఇంటివాడికి భార్య మీద అనుమానం. ఆరోజు తాగొచ్చి తగాదా వేసుకున్నాడు. ఇద్దరికీ మాటామాటా పెరిగింది. రోకలిబండతో భార్య తల పగలగొట్టి చంపాడు. ఈ విషయం అతని బంధువులకి కబురెళ్ళింది. అందరూ కలిసి తెల్లవారు ఝాము దాకా మంతనాలు చేసుకుని (వాళ్ళల్లో ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కూడా వున్నాట్ట), శవాన్ని ఎత్తి బావిలో పడేశారు. అదీ జరిగింది.

ఒకమ్మాయి తన దగ్గరున్న పాత ఎల్లైసీ డైరీలో ఈ పాయింట్లు నోట్ చేసుకుంది. నేనో నాలుగైదు ఫోటోలు తీశాను. ఈలోపు ఐదారుగురు వ్యక్తులు హడావుడిగా మాదగ్గరకి వచ్చారు. 'ఎవరు మీరు? ఇక్కడ మీకేంటి పని?' అంటూ మమ్మల్ని నిలదీశారు. మా షెర్లాక్ హోమ్స్ వాళ్ళ ప్రశ్నల్ని మళ్ళీ వాళ్ళకే విసిరింది! వాళ్ళు ఆ ఇంట్లోవాళ్ళకి దగ్గిర చుట్టాల్ట. 'కేసుని పోలీసు స్టేషన్లో సెటిల్ చేసుకున్నాంగా! ఇంక మీ గోలేంటి?' అనేది వాళ్ళ దబాయింపు. మా అమ్మాయిలు ఇంకా గట్టిగా మాట్లాడ్డం మొదలెట్టారు. గొడవ అవుతుందనుకున్నాను గానీ, మొత్తానికి మర్యాదగానే బయటపడ్డాం.

ఆరోజు వరకు కుటుంబం, స్త్రీల సమస్యల పట్ల నాకున్న అవగాహనకి ఆధారం వార్తాపత్రికలు, సాహిత్యం మాత్రమే. కానీ - గ్రౌండ్ రియాలిటీ నేను ఊహించినదానికన్నా పరమ ఘోరంగా వుంది. ఇది నాకో పెద్ద షాక్. తిని అరక్క ఏవో నాలుగు పుస్తకాలు చదువుకుని పండితుల భాషలో సున్నితంగా చర్చించుకోవటం వేరు, కఠోర వాస్తవం వేరు. ఆరోజు - నాకున్న పరిమితి, పరిధులు తెలుసుకున్నాను.

ఇలా ఎవరికివారు తమ పరిమితి, పరిధుల్ని తెలుసుకోవటం కూడా జ్ఞానమే అనుకుంటున్నాను. ఎందుకంటే - ఒకరకం మేధావులు చదువుతారు, విపరీతంగా చదువుతారు. తలెత్తితే ఎదురుగా కనిపించే సముద్రాన్ని కూడా చూడకుండా సముద్రం గూర్చి చదివి తెలుసుకుంటారు. ఆ తరవాత సముద్రం గూర్చి వ్యాసం రాస్తారు! అదే మేధావి సముద్రం దగ్గరకెళ్లి, నాలుగు అలల్ని కాళ్ళకి తగల్నిస్తే అతని అవగాహన పెరగొచ్చు, దృక్పధం మారొచ్చు.

నా దృష్టిలో బాలగోపాల్ థియరీ అండ్ ప్రాక్టీస్ సమపాళ్ళలో కలగలిసిన మేధావి. ఆయన చదివాడు, రాశాడు, నిరంతరంగా ప్రజల మధ్యనే వుండి వారితో ప్రత్యక్ష సంబంధాలు కలిగున్నాడు. కాబట్టే ఆయన అభిప్రాయాలకి అంత ప్రాముఖ్యత. రైతుల సమస్యలు, ఆత్మహత్యల గూర్చి వాళ్ళమధ్యనే ఉంటూ రిపోర్ట్ చేస్తున్న 'హిందూ' పి.సాయినాథ్ ఇంకో అరుదైన ఉదాహరణ. అరుంధతి రాయ్ మావోయిస్టుల్తో కొన్నాళ్ళపాటు తిరిగి తన ఆలోచనలు రాసింది, ఎందఱో శత్రువుల్ని కూడా సంపాదించుకుంది.

కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో నా జ్ఞానం - వానపాముని చూడకుండా దాని గూర్చి బట్టీ వేసే కార్పోరేట్ విద్యాసంస్థల కుర్రాళ్ళ స్థాయిలో వుంటుంది, పేషంటుని చూడకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములో ఎంబిబియస్ చదివినట్లు హాస్యాస్పదంగానూ వుంటుంది. నాకీ స్పృహ ఉంది కాబట్టే - నావి సరదా రాతలనీ, ఎయిర్ కండిషన్డ్ రాతలనీ, కేస్ షీట్ ఆలోచనలనీ అప్పుడప్పుడూ చెబుతూనే వుంటాను. ఇలా చెప్పడం మాడెస్టీ కాదు.. నా పరిమితులు తెలియజేసే ఒక డిస్‌క్లైమర్‌గా మాత్రమే భావిస్తున్నాను.

ముగింపు -

పోస్ట్ సీరియస్‌ అయిపోయింది. కొంచెం లైట్‌గా రాసి బ్యాలెన్స్ చేస్తాను.

మా గుంటూరు ఎండల గూర్చి మీరు చదివేవుంటారు. ఈ ఎండల గూర్చి మీరు ఎంత చదివినా లాభం లేదు. ఒకసారి మే నెలలో కొంతసేపు మా గుంటూర్లో గడపి చూడండి. మీరు జన్మలో 'మర్చిపోలేని అనుభవం' చేకూరుతుందని గ్యారెంటీ ఇవ్వగలను. దీన్నే - 'బ్రిడ్జింగ్ ద గేప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్' అంటారు!

Updated and posted in fb

Friday 25 July 2014

గురువుగారికి నివాళి


శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు మా గురువుగారు. వారు మొన్న ఇరవైయ్యో తారీఖున మరణించారన్న వార్త చదవంగాన్లే మనసంతా భారంగా అయిపోయింది. గురువుగారు పెద్దవారైపొయ్యరు, ఆయనకి సమయం వచ్చింది, వెళ్ళిపొయ్యారు. అవున్నిజమే, వ్యక్తులు మనకి ఎంత ఇష్టమైనా (ప్రకృతి విరుద్ధంగా) మనకోసం ఎన్నాళ్ళైనా అలాగే వుండిపోరు కదా? ఈ విషయం నాకూ తెలుసు. కానీ నేనేం చెయ్యను? నాకు చాలా దిగులుగా వుంది.

మనకి జీవితంలో అనేకమంది తారసపడుతూనే వుంటారు. వారిలో అతి అరుదుగా మాత్రమే కొందరు వ్యక్తులు మనని ప్రభావితం చేస్తారు, మనసులో చెరగని ముద్ర వేస్తారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు ఒకరు (గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!). వారు నాకు పాఠాలు చెప్పి నలభయ్యేళ్ళు దాటింది. నేను వారి శిష్యుడినవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, వారితో ఇంటరాక్ట్ అయిన ప్రతిక్షణాన్నీ అపురూపంగా భావిస్తున్నాను.

నేను గుంటూరు గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాను. మా గురువుగారు నాకు వరసగా మూడేళ్ళపాటు సైన్స్ టీచర్. ఆయన తెల్లగా, బొద్దుగా, చిరుబొజ్జతో, జులపాల జుట్టుతో - తెల్లని పంచె, లాల్చీతో మెరిసిపోతుండేవారు. మా స్కూల్లో మంచి సైన్స్ లాబ్ ఉంది. గురువుగారికి సైన్స్ ప్రయోగాలు చేసి చూపించడం చాలా ఇష్టం. తెల్లటి జుబ్బాలోంచి తెల్లటి చేతులతో ఆ టెస్ట్ ట్యూబులు, పిపెట్లతో ఆయన చేసే విన్యాసాలు గమ్మత్తుగా అనిపించేవి.

ఒక్కోసారి ఆయన మమ్మల్నందర్నీ దూరంగా జరగమని, లక్ష్మీ ఔటు పేల్చేప్పుడు తీసుకునే జాగ్రత్తల్లాంటివి తీసుకుని, బర్నర్ మీద టెస్ట్ ట్యూబులోని ద్రవాల్ని వేడి చేస్తుండేవాళ్ళు. అప్పుడు టెస్ట్ ట్యూబులోంచి అన్నం ఉడుకుతున్నట్లు 'గుడగుడ'మని బుడగలొచ్చేవి, 'బుసబుస'మంటూ పొగలొచ్చేవి.

మాకా ల్యాబ్‌లోని కెమికల్స్ నుండి వచ్చే ఘాటైన వాసనలకి కళ్ళు మండేవి, దగ్గొచ్చేది. గురువుగారు మా అవస్థకి తెగ సంతోషించేవారు! 'ఒరే నానా! మీరీ ఘాటు అనుభవించి తీరాలి. ఇదో గొప్ప అనుభవం. గొప్పశాస్త్రవేత్తలు ఇట్లాంటి చోటే గొప్ప విషయాలు కనిపెట్టారు. మీకు బోర్డు మీద చాక్‌పీసుతో గీస్తూ ఎన్నిరోజులు పాఠాలు చెప్పినా, ఈ ల్యాబ్ అనుభవం రాదురా.' అనేవారు.

మా మాస్టారు ఒక్కోసారి మమ్మల్ని వెంటేసుకుని (మ్యూజియం చూపిస్తున్నట్లుగా) ల్యాబ్‌లోని వివిధ పరికరాల్ని, ద్రవాల్ని చూపిస్తూ వివరంగా చెప్పేవారు. నాకు ఆయనతో సమయం చాలా ఉత్సాహంగా ఉండేది. పాఠం మధ్యలో సడన్‌గా ఆపి 'నానా! ఈ నెల చందమామ చదివారా? చదవండి నానా. మీరు చందమామ రెగ్యులర్‌గా చదవాలిరా.' అనేవారు.

మా మాష్టారు పిల్లలతో సమయం గడపడం ఉద్యోగ ధర్మంగా భావించలేదు. నాకాయన పిల్లలకి పాఠాలు చెప్పడం, వారితో నిరంతరం వారి భాషలోనే కమ్యూనికేట్ చెయ్యడం.. బాగా ఎంజాయ్ చేశారనిపిస్తుంది. లేకపోతే వారు మాలో ఒకడిగా అంతలా కలిసిపొయ్యేవారుకాదు.

'ఈయన నోట్సు ఇవ్వడు, నోట్సు రాయనివ్వడు. టెక్స్టు బుక్కే చదవాలంటాడు, ఐఎంపి (important) చెప్పడు. పాఠాన్ని పాఠంలాగా కాకుండా ప్రశ్నలు, జవాబులు కార్యక్రమంలాగా విచిత్రంగా చెబుతాడు. చూసి అర్ధం చేసుకోవాలంటాడు, ఇప్పుడీ ల్యాబులో మనని చావగొడుతున్నాడు.' అని  వెనకనుండి సత్తాయ్‌గాడు, భాస్కరాయ్‌గాడు ఒకటే సణుగుతుండేవాళ్ళు.

ఆంజనేయశర్మగారు ఒకసారి మా తెలుగు క్లాసులోకి 'మాస్టారూ! విత్ యువర్ పర్మిషన్.. వన్ మినిట్.' అంటూ వడివడిగా క్లాసులోకి వచ్చారు. ఆయన తెల్లని లాల్చీ ముందు కొంత భాగం చుక్కల్లాగా బొక్కలు, మరకలు! కుడి బొటనవేలు, చూపుడు వేళ్ళు పసుపుగా వున్నాయి. ఆయన తన లాల్చీ, వేళ్ళని ప్రదర్శనగా చూపిస్తూ క్లాసంతా ఆ చివర్నుండి ఈ చివర దాకా హడావుడిగా తిరిగారు.

'నానా! ఇవ్వాళ C సెక్షన్ వాళ్ళకి ప్రయోగం చేసి చూపిస్తున్నప్పుడు టెస్ట్‌ట్యూబ్ పగిలింది. సల్ఫ్యూరిక్ ఏసిడ్ మీదకి చిందింది. అది మన వంటిమీద, బట్టల మీద పడితే ఏమవుతుందో మీరు పుస్తకంలో చదువుకున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఇంకా బాగా అర్ధమవుతుందని చూపించడానికి వచ్చాను.' అన్నారు. ఆపై తెలుగు మేస్టారుకి థాంక్స్ చెబుతూ నిష్క్రమించారు.

తెలుగు మాస్టారు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. మా గురువుగారి బాడీ లాంగ్వేజి కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు. కానీ - పిల్లలకి విషయం అర్ధమయ్యేట్లు చెప్పాలి అనే తపన తప్ప ఆయనికి ఇంకేవీ పట్టవు!

అన్నట్లు - గురువుగారు నాతో కథలు రాయించేవారు! అవి ఎక్కువగా రాజుగారి కూతుర్ని రాక్షసుడు ఎత్తుకుపోవటం, హీరో మంత్రశక్తుల సాయంతో రాజకుమారిని తీసుకొచ్చివ్వడం వంటి చందమామ కాపీ కథలే. అయితే అవి ఆయనకి నచ్చేవి! వాటిని క్లాసులో నాతో బిగ్గరగా చదివించేవారు. ఆయన అలా చెయ్యడం నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి దోహదపడింది. అంతకుముందు ముంగిలా మూలనుండే నేను ధైర్యంగా లేచి నిలబడి పాఠాల్లో డౌట్లు అడగడం ప్రారంభించాను. ఇది నాకు గురువుగారు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాను.

ఆ రోజుల్లో ఎటెండెన్స్ వుంటే చాలు, ప్రమోట్ చేసేవాళ్ళు. ఆయన నాకు తొమ్మిదో తరగతి క్లాస్ టీచర్. తొమ్మిది సంవత్సారాంతాన రిజిస్టర్లలో ఎటెండెన్స్ టాలీ చెయ్యటానికి నన్ను వారి ఇంటికి రమ్మన్నారు. అప్పుడు అరండల్‌పేటలోని వారి ఇంటికి వెళ్ళాను.

ఆయనా, నేనూ ఇంటి ముందున్న చెట్టు కింద, అరుగు మీద చాపేసుకుని కూర్చున్నాం. మాస్టారు మొత్తం రిజిస్టర్లు నాముందు పెట్టారు. ఒక్కో విద్యార్ధి పేరు రాసి ఆ పేరు ముందు వారి హాజరైన దినాలు టాలీ చేసి రాయమన్నారు. ఆయనకి ఒక పిల్లవాడు (వారి అబ్బాయనుకుంటాను) స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చిచ్చాడు. వారు కూనిరాగాలు తీస్తూ, చప్పరిస్తూ కాఫీని ఎంజాయ్ చెయ్యసాగారు.

నాపని - ఎటెండెన్స్ తక్కువైనవాడి పేరు మాస్టారుకి చెప్పాలి.

'శాస్త్రికి పదిరోజులు తగ్గాయండి.'

'ఒరెఒరె! మన శాస్త్రి లవకుశ పాటలు ఎంత బాగా పాడతాడ్రా! వాడికి ఆ పదిరోజులు ఎడ్జస్ట్ చెయ్యి నానా!' అన్నారు.

లవకుశ పాటలు చక్కగా పాడితే ఎటెండెన్స్ ఎందుకు సరిచెయ్యాలి? నాకర్ధం కాలేదు, బుర్ర గోక్కున్నాను. రిజిస్టర్లలో ఏబ్సెంట్ అయినచోట ఏబ్సెంట్ మార్క్ చెయ్యకుండా చుక్క పెట్టి వుంటుంది. అక్కడక్కడా ఒక పది చుక్కల్ని P గా మార్చాను.

'కృష్ణకి ఇరవై రోజులు తగ్గిందండి.'

'ఒరెఒరె! మన కృష్ణ ఎన్నముద్దాలె చాలా మంచివాడ్రా. పాపం! తండ్రి లేని పిల్లాడు, వాడిక్కూడా ఎడ్జస్ట్ చెయ్యి నానా!'

కృష్ణకి సరిచేశాను.

'సత్తాయ్, భాస్కరాయ్‌లకి బాగా తక్కువైందండి.'

వీళ్ళిద్దరి గూర్చి ఇంతకుముందు నా 'గురజాడ' కష్టాలు!  లో రాశాను. వీళ్ళు క్లాసులో చేసే గోల అంతింత కాదు.

ఇప్పుడు మాత్రం గురువుగారు ఖచ్చితంగా 'వెధవలకి బుద్ధి రావాలి. ఎడ్జస్ట్ చెయ్యకు.' అంటారు. క్లాసులుకి సరీగ్గా రాకుండా గొడవ చేసేవాళ్ళ పట్ల మాస్టారు ఎందుకు జాలి చూపుతారు? చూపరు. అదీగాక మొన్ననే వాళ్ళు గోడ దూకి పారిపోతూ మాస్టారుగారికి  పట్టుబడ్డారు కూడా.

'ఆ వెధవలకి తగ్గుతుందని ముందే ఊహించాను. వాళ్ళు క్లాసుకి వస్తే మనకి ఇబ్బంది గానీ, రాకపోతే మంచిదేగా? వాళ్ళక్కూడా ఎటెండెన్స్ సరిచెయ్ నానా!' అన్నారు గురువుగారు.

నేను ఆశ్చర్యపొయ్యాను.

'సత్తాయ్, భాస్కరాయ్‌లక్కూడానా.. ' నమ్మలేనట్లుగా అన్నాను.

ఆయన మొహమాటంగా నవ్వారు.

'నానా! మనమందరం కోతి నుండే వచ్చాం. ఈ వెధవాయిలిద్దరూ మనకి మన పూర్వీకుల్ని గుర్తు తెస్తుంటారు. అంతేగా! అయినా - పిచుకల మీద బ్రహ్మాస్త్రాలు దేనికి నానా?' అన్నారు.

ఆయనకి సత్తాయ్, భాస్కరాయ్‌ల పట్ల కూడా ప్రేమ చూపించడం (ఆరోజు) నాకు అర్ధం కాలేదు. గురువుగారి సమస్యల్లా తను కఠినంగా ఉండలేకపోవటమే! అది ఆయన బలహీనత! ఆయనకి బాగా చదివేవాడన్నా, చదవనివాడన్నా.. అందరూ ఇష్టమే! ఇదెలా సాధ్యం? ఇప్పుడు నాకనిపిస్తుంది - ఆయన మార్కుల్ని బట్టి విద్యార్ధుల్ని ప్రేమించలేదు. ఆయన విద్యార్ధుల్ని మనుషులుగా ఇష్టపడ్డాడు.

ఆరోజు అక్కడ జరిగిన కార్యక్రమం క్లాసులో వున్న అందరూ పాసయ్యేలా ఎటెండెన్స్ సరిచెయ్యడమే! నేను లేచి వచ్చేస్తుండగా 'పిల్లలకి చదువు పట్ల ఇంటరెస్ట్ వుండి స్కూలుకి రావాలి గానీ, ఈ పాడు రిజిస్టర్ల గోలేమిట్రా! గవర్నమెంటుకి బుర్ర లేదు.' అని విసుక్కున్నారు. అర్ధమైంది, ఆయనకిదంతా తప్పక చేస్తున్నారు.

పదో తరగతి - ఏదో ఇంటర్నల్ పరీక్ష. ఒకడు మా దుర్భాకుల సూరిగాడి దాంట్లోంచి తీవ్రంగా కాపీ కొట్టి రాస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న గురువుగారి కంట్లో ఇది పడింది. ఆయన హడావుడిగా లోపలకొచ్చారు.

'నానా! ఇక్కడ కాపీ కొట్టి రాస్తున్నావు. రేపు పబ్లిక్‌లో నీకు ఈ సౌకర్యం వుండదు కదా? అయినా ఈ పరీక్షల్లో ఎన్ని మార్కులొస్తే మాత్రం ఏముంది? ఒకపని చెస్తాను, నీ పేపర్ నేను కరెక్ట్ కూడా చెయ్యను, ఈ పరీక్షకి నీదే ఫస్ట్ మార్క్. సరేనా? చూడకుండా రాయి నానా! నీకెంత సబ్జక్ట్ వచ్చో, ఎంత రాదో తెలుస్తుంది.' చాలా ఇబ్బంది పడుతూ ఆ కాపీ కొట్టేవాడికి చెప్పారు గురువుగారు.

ఆయన గూర్చి ఇంకో ఉదంతం రాసి ముగిస్తాను. అప్పుడు నేను హౌస్ సర్జన్సీలో వున్నాను. వారి అబ్బాయికి హిందూ కాలేజి సెంటర్లో సిటీ బస్సు ఏక్సిడెంట్ అయ్యిందని విని ఆర్ధోపెడిక్ వార్డుకి వెళ్ళాను. ఆ బాబుని పలకరించి, దెబ్బల వివరాల కోసం కేస్ షీట్ చదువుతున్నాను.

అప్పుడు అక్కడున్న హెడ్‌నర్స్ అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను.

'నేను నా సర్వీసులో ఎందరో వీఐపీలని చూశాను. కానీ ఈ పేషంట్ గూర్చి వచ్చినన్ని ఎంక్వైరీలు ఎప్పుడూ చూళ్ళేదు. సూపర్నెంటుగారు, ప్రిన్సిపాల్‌గారైతే గంటగంటకీ ఫోన్లు.'

'ఈ పేషంటు మా గురువుగారి అబ్బాయి, స్టాఫ్!' అన్నాను నేను.

'ఏం గురువుగారో ఏమో! ఇక్కడ మేం టెన్షన్‌తో చస్తున్నాం. 'మా గురువుగారబ్బాయి' అంటూ డాక్టర్లు క్యూ కట్టినట్లు వచ్చి ఆ బాబుని చూసి పోతున్నారు.' అని నిట్టూర్చింది. అంటే మా గురువుగారికి నాలాంటి శిష్యపరమాణువులతో ఒక భక్తబృందమే ఉన్నదన్నమాట!

దేశసేవ అనగానేమి? యుద్ధంలో శతృసైనికులతో పోరాడుట, సమాజసేవ చేయుట అంటూ చెబుతుంటారు. అలాగే - సమాజానికి పనికొచ్చే వృత్తులు కూడా చాలానే వున్నాయి. అందులో ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్రతో, నాలాంటి ఎందరికో స్పూర్తిని ప్రసాదించి మా గురువుగారు కూడా దేశసేవ చేశారు. ఆయన ధన్యజీవి.

మాస్టారూ! మీకు నమస్సుమాంజలులు.

ముగింపు -

ఒరే వెధవాయ్! ఏవిట్రా ఇది? నాగూర్చి ఏవిటేవిటో రాసేశావు! అందరూ కులాసానేనా! నీ బ్యాచ్‌వాళ్ళు గోవిందరాజువాడు, గంటివాడు, దావులూరివాడు, మల్లాదివాడు, స్టేషన్ మాస్టరుగారబ్బాయ్.. అందర్నీ అడిగానని చెప్పు నానా! ఉంటా నానా! ఒరిఒరి! ఎందుకురా ఆ కన్నీళ్ళు? నేనెక్కడికి పోతాను? ఎక్కడికీ పోను, మీ అందరూ నన్నెప్పుడూ తల్చుకుంటూనే వుంటారుగా! నాకేం పర్లేదు నానా!

కృతజ్ఞతలు -

లలిత గారికి. 

Tuesday 22 July 2014

రాజు - పేద


ఈ ఫొటో చూడండి. ఈ బుడతడు బ్రిటీషు యువరాజుగారు! అబ్బ! ఎంత ముద్దొస్తున్నాడో కదా! ఎంతైనా డబ్బున్నోడి కళే వేరు. నో డౌట్! డబ్బు టన్నుల కొద్దీ అందాన్నీ, ఆహ్లాదాన్నీ ఇస్తుంది. కొందరు 'డబ్బు సుఖాన్నివ్వదు, డబ్బు శాశ్వతం కాదు' అంటూ వదరుతుంటారు. ఈ దిక్కుమాలిన దేశంలో దరిద్రాన్ని కూడా ప్రేమించే దరిద్రులున్నారు (వీళ్ళు కసబ్‌గాడి కన్నా డేంజరస్ ఫెలోస్). ఏదీ! వాళ్ళని నా ముందుకు తీసుకురాండి. షూట్ చేసి పారేస్తాను వెధవల్ని.

ఒరే అణాకానీ వెధవల్లారా! ఈ యువరాజుబాబు ముఖంలో కళని గమనించారా? దీన్నే 'డబ్బుకళ' అంటారు. కాదన్డం లేదు - మీలాంటి అడుక్కుతినే వెధవల మొహాల్లోకి కూడా గిన్నెడు గంజి దొరికినప్పుడు కళొస్తుంది. అయితే - దాన్ని 'గంజికళ' అంటారు! అర్ధమైందా? ఈ గంజికళ మీద కవిత్వం రాసి శాలువాలు కప్పించుకున్నవాడి మొహంలో కూడా కళ వుంటుంది. దీన్నే 'శాలువాకళ' అంటారు!

ఆ బ్రిటీషు చినబాబు మొహంలో చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూడండి. ఆహాహ! నా తండ్రే! నా బుజ్జే! తెల్లగా మీగడలా, ముట్టుకుంటే కందిపొయ్యేట్లున్నావు. ఎంత ముద్దొస్తున్నావురా నాయనా! జాగ్రత్త నాన్నా! జాగ్రత్త. ఎండపొడకి దూరంగా వుండు.. కందిపోగలవు. ఒంటిపై వర్షపుచుక్క పడనివ్వకు.. జలుబు చెయ్యగలదు. బిస్కత్తులు జాగ్రత్తగా తిను.. పొలమారగలదు.

ఇంతలో -

'అయ్యా! ఆకలేస్తందయ్యా! అన్నం తిని నాల్రోజులైంది బాబయ్యా! బిచ్చమెయ్యి దొరా!'

తోక తెగిన గజ్జికుక్క ఏడుస్తున్నట్లుగా, అమ్మోరికి బలవుతున్న మేకపిల్ల ఆర్తనాదంలా ఒక అరుపు లాంటి అర్దింపు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా బొచ్చెలో లయబద్దంగా చిల్లర ఎగరేస్తున్న మోత. చికాగ్గా అటువైపు తల తిప్పి చూశాను. ఒక చిన్న కుర్రాడు, పరమ మురికిగా ముదనష్టంగా అడుక్కుంటున్నాడు.

ఒరే దరిద్రుడా! నేనిక్కడ బ్రిటీషు దొరబాబు గూర్చి మాట్లాడుతుంటే నీ ఆకలి కేకలేంట్రా? అబ్బా! ముక్కు పగిలే ఈ కుళ్ళు వాసనేమిట్రా? నువ్వసలు స్నానం చెయ్యవా? ఏమన్నావు? అన్నం తిని నాల్రోజులైందా? మంచిది. ఇంకో నాల్రోజులు ఇలాగే వుండు. హాయిగా చచ్చూరుకుంటావు. నీ ఏడుపుగొట్టు మొహంలో ఆ దైన్యం, నిస్పృహ, అసహాయం చూస్తుంటేనే కడుపులో తిప్పుతుందిరా బాబూ.

చీచీ! దేశంలో మురికి ముండాకొడుకులు ఎక్కువైపొయ్యారు. ఈ దరిద్రుల వల్ల మన దేశానికి అంతర్జాతీయంగా ఎంత చెడ్డపేరు! కొంపదీసి నిన్ను ఏ ఫారిన్ టూరిస్టూ చూళ్ళేదు కదా? ఒకపక్క మన నాయకులు దేశాన్ని ముందుకు తీసుకెల్దామని అహోరాత్రులూ కష్టపడుతుంటే, ఈ కుళ్ళు గోచీ వెధవలు వెనక్కి లాగుతున్నారు. హమ్మా! ఎంత కుట్ర ముండాకొడుకులు!

పేదరిక నిర్మూలన అంటే పేదరికాన్ని నిర్మూలించడం అంటూ కొందరు అదర్శ పురుషులు మేధావి కబుర్లు చెబుతుంటారు. మీ ఆదర్శాలకో నమస్కారం. ఇవన్నీ జరిగే పన్లు కాదు సార్. అంచేత పేదల్ని నిర్మూలించడమే పేదరిక నిర్మూలనగా, ఒక పవిత్ర దేశసేవగా నేను భావిస్తాను.

అయితే - పేదల్ని నిర్మూలించడానికి హిట్లర్‌గాళ్ళా గ్యాస్ చాంబర్లు అవసరం లేదు. అవన్నీ పాతరోజుల్లో అమాయకులు చేసిన పని. పసిపాపడికి పాలు బంద్ చేసేస్తే ఏడ్చిఏడ్చి వాడే చావడా? అలాగే - ఈ దేశంలో పేదలు బ్రతికే అవకాశం లేకుండా చేస్తే సరి! వాళ్ళే చస్తారు! ఈ ఆదర్శం గాళ్ళు ఎట్లాగూ గుండెలు బాదుకుంటారు, పట్టించుకోకండి. వాళ్ళంతా విదేశీ సంస్థల నుండి డొనేషన్లు కొట్టేసే బాపతు.

కానీ - నా గొప్ప ఆలోచనల్ని అర్ధం చేసుకునే మేధావులేరి? ఈ రాజకీయ పార్టీల వెధవలక్కూడా పొద్దస్తమానం 'పేదల్ని ఉద్దరిద్దాం, ఆదుకుందాం' అనే నికృష్టపు ఆలోచనలే గానీ, 'పేదల్ని నిర్మూలిద్దాం' అనే పవిత్ర ఆలోచన రాదు కదా!

ఇలా తీవ్రంగా ఆలోచిస్తుండగా -

ఆయ్యా! ఇందాకట్నుండి మీరు గుండెలు బాదుకోవడం చూస్తూనే వున్నాను. అయినా - 'నాకెందుకులే' అనుకుని ఆ పక్కగా నిలబడ్డాను. ఇంకొంచెం సేపు మీరిలాగే ఆయాసపడితే బీపీతో చచ్చేట్లున్నారు. అంచేత - మీకిక వాస్తవం చెప్పక తప్పదు, వినండి.

మీ పేదల నిర్మూలన ఎజెండానే గత కొన్నేళ్ళుగా ఈ దేశంలో అమలవుతుంది. అయితే ఈ కార్యక్రమం చడీచప్పుడు లేకుండా, చాప కింద నీరులా జరుగుతుంటుంది. త్వరలోనే మీరు కలలు గంటున్న పేదలు లేని సువర్ణ భారతాన్ని కాంచగలరు. అప్పుడు మన పిల్లలందరూ బ్రిటీషు యువరాజు వలే బొద్దుగా, ముద్దుగా చిరునవ్వులు చిందించగలరు!

అంతట -

ఆ తీపి కబురు వినినంతనే.. నా హృదయం ఆనందంతో డిస్కో డ్యాన్స్ వేసింది. మనసు మైమరచి కథాకళి నృత్యం చేసింది. దూరంగా ఎక్కణ్ణించో 'ఉందిలే మంచికాలం ముందుముందునా.. ' అంటూ పాత సినిమా పాట వినిపిస్తుంది. అవును, ముందుంది మంచికాలమే!

Monday 21 July 2014

చేదునిజం


"గాజాపై ఇజ్రాయిల్ దాడిని ఖండించండి!"

ఎందుకు!?

ఒరే! అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా?

పులి జింకని వేటాడదా?

బలవంతుడు బలహీనుణ్ణి చితకబాదడా?

తేడాలొస్తే - పోలీసుకుక్క వీధికుక్కని చీరెయ్యదా?

సైకిల్ వెళ్లి కారుని గుద్దితే సైకిల్‌ గతేంటి?

ఇదంతా ప్రకృతి ధర్మం. కాదన్డానికి నువ్వెవరివి?

నువ్వేమన్నా - బ్రిటీషోడి బాబాయివా? అమెరికావాడు ఉంచుకున్నదాని తమ్ముడివా?

కాదుగదా? అయినా ఇట్లాంటప్పుడు చుట్టరికాలు కూడా పన్జెయ్యవురొరేయ్! జాగ్రత్త.

అంచేత - నే చెప్పొచ్చేదేమంటే, బుర్రకి కొంచెం పన్జెప్పి ఆలోచించమంటున్నాను.

నీలాంటోడు అన్యాయాలని ఖండిద్దామనుకుంటే ఖండించొచ్చు. ఆ మాత్రం వెసులుబాటు నీకెప్పుడూ వుంటుంది. కాకపోతే పులికి అడ్డం నిలబడకు. ఆ పక్కగా వున్న చెట్టెక్కి పులికి వినబడీ వినబడనట్లుగా 'తీవ్రంగా' ఖండించు. అప్పుడు పులికీ ఇబ్బందుండదు, నీ ఆనందం నీకుంటుంది.

బయట్నించి చూసేవాళ్ళకి మాత్రం నువ్వు జింక పక్షం వున్నట్లుగా అనిపించాలి, కానీ - పులికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింటు.

ఈ సంగతి తెలీని కొందరు అమాయక వెధవలు పులి ముందుకి వెళ్లి అడ్డంగా నిలబడి 'నువ్వు జింకని వేటాడరాద'ని పులికే సుద్దులు చెబుతుంటారు! (సహజంగానే) పులిక్కోపం వచ్చి, ఆ జింకని వదిలేసి ముందుగా ఈ వెధవల్ని వేటాడుతుంది!

నువ్వలా చావరాదని నీ మంచి కోరే ఇదంతా చెప్తుంటా!

ఈ లోకంలో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది తధ్యం. బలవంతుని పక్షం వహించినవారే బాగుపడతారు. ఇది సత్యం. అయితే - ఈ సత్యాన్ని గ్రహింపలేని కొందరు అజ్ఞానులు 'అన్యాయం, అక్రమం' అంటూ పోలికేకలు పెడుతుంటారు. కానీ - వాళ్లకి అర్ధం కానిది - రాజధర్మంలో న్యాయాన్యాయాలు, క్రమాక్రమాలు వుండవు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం, వాడు చెప్పిందే న్యాయం. విన్డానికి చేదుగా వున్నా, ఇక్కడిదే నిజం.

అంచేత - ఎవరికైనా, ఎప్పటికైనా బలవంతుని పక్షం వహించడమే లాభసాటిగా వుంటుంది.

అయితే - నీకు డైరక్టుగా బలవంతుడి పక్షం వహించాలంటే కొంత రాజకీయాలు, కొన్ని మొహమాటాలు అడ్డం కావచ్చు. ఏం పర్లేదు! నీ ఇబ్బందులు నేను అర్ధం చేసుకోగలను.

అప్పుడు నువ్వు జింకల పక్షమే వుంటున్నట్లు వుండు (కానీ పులి పర్మిషన్ తీసుకోవడం మాత్రం మర్చిపోకు). అవసరమైనప్పుడు మాత్రం (గుంటనక్కలాగా) పులికే సపోర్ట్ చెయ్యి. అంటే - పోలీసుల్లో ఐడీ పార్టీవాళ్ళుంటారే? అలాగన్నమాట!

ఒకరకంగా ఈ స్వజాతి ద్రోహమే నీకింకా గిట్టుబాటు. అధికార పక్షమూ, ప్రతిపక్షమూ కూడా నువ్వే అయితే ఏలినవారికి ఎంత హాయి!

అంచేత - గాజా, కూజా అంటూ నీ బూజుమాటలు కట్టిపెట్టు.

అమెరికావాడికి కొంచెం ఇబ్బంది కలిగించు.. తప్పులేదు. అదీ వాడి అనుమతితోనే సుమా! కానీ - వాడికి నష్టం కలిగించే పన్లు మాత్రం చెయ్యకు.

అసలు అమెరికావాడు చేసిన తప్పేంటి?

అమెరికావాడిదీ, ఇజ్రాయిలువాడిదీ ఆడామగా సంబంధం లాంటిది కదా! కట్టుకున్నదాన్నైనా, ఉంచుకున్నదాన్నైనా - తగాదాలొచ్చినప్పుడు నీ ఆడమనిషినే నువ్వు సపోర్టు చేస్తావు కదా? కదా! అంతేగానీ - రోడ్డు మీద పబ్లిగ్గా పదిమంది ముందూ పరువు తీసుకుంటావా? తీసుకోవు కదా! ఏం? నీకో న్యాయమూ, అమెరికావాడికో న్యాయమూనా! ఇదెక్కడి న్యాయం?

రాజు పక్షం వహించినవాడికి నష్టం కలిగినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఎదిరించినవాళ్ళు మాత్రం ఎప్పుడూ మిగల్లేదు. బ్రిటీషోణ్ని ఎదిరించిన భగత్ సింగు ఏమయ్యాడు? అల్లూరి సీతారామరాజు ఏమయ్యాడు?

బలవంతుణ్ణి ఎదిరించి అర్ధాంతరంగా చచ్చి కీర్తి నొందుతావా? లేక బలవంతుడి పక్షాన చేరిపొయ్యి శాశ్వతంగా 'అభివృద్ధి' చెందుతావా?

ఆలోచించుకో. చాయిస్ ఈజ్ యువర్స్!

Wednesday 16 July 2014

రెండు



జ్ఞానులు రెండురకాలు - ఒకరు అజ్ఞానులు, రెండు విజ్ఞానులు. అయితే - ఇక్కడో చిక్కుంది. ఎవరికివారు తామే విజ్ఞానఖనులమని అనుకుంటారు. అంతేకాదు - ఎదుటివారు అజ్ఞానగనులని కూడా అనుకుంటారు (బయటకి చెప్పకపోయినా). ఈ సూత్రాన్ని అనుసరించి (ఎట్లాగూ అందరూ నన్ను అజ్ఞానిగానే భావిస్తారు కాబట్టి) నన్ను నేనే ఒక విజ్ఞానిగా పరిగణించుకుంటుంటాను. నేనేమన్నా తక్కువ తిన్నానా? దెబ్బకి దెబ్బ, చెల్లుకు చెల్లు!

పనులు రెండురకాలు - ఒకటి పనికొచ్చే పని, రెండు పనికిరాని లేక పనికిమాలిన పని. భుక్తి కోసం చేసే పన్లన్నీ పనికొచ్చేవే. స్టాంపులు, సీసామూతలు సేకరించుట.. పైగా అందులకు గర్వించుట - పనికిరాని పనే. ఈ పన్లని ఇంగ్లీషులో 'హాబీ' అంటార్ట! అంటే - తిని అరక్క చేసే పనులక్కూడా ఇంగ్లీషువాడో పదం కనిపెట్టాడన్న మాట! ఎంతైనా ఇంగ్లీషోడు ఇంగ్లీషోడే! 

వాదులు రెండురకాలు - ఒకరు న్యాయవాదులు (ప్లీడర్లు కాదు), రెండు అన్యాయవాదులు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించి, తదనుగుణంగా ఎంతోకొంత హేతుబద్దంగా వాదించే మర్యాదస్తుల్ని న్యాయవాదులు అంటారు. తన అభిప్రాయాన్ని అందరూ ఒప్పుకోవాలనే కఠిన మనస్తత్వం కలిగుండి, తదనుగుణంగా అల్లూరి సీతారామరాజు స్పూర్తితో రాజీలేని పోరాటాన్ని సాగించేవారిని అన్యాయవాదులు అంటారు.

భర్తలు రెండురకాలు - ఒకరు నీటుభర్తలు, రెండు నాటుభర్తలు. భార్యతో అనేక రకాలుగా హింసింపబడుతూ, ఆ (గృహ)హింసని పళ్ళబిగువున భరిస్తూ, బయటకి చెప్పుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటూ భారంగా, భయంగా, అయోమయంగా సంసార సాగరాన్ని ఈదువారు నీటుభర్తలు. ప్రతి యువతీ తనకి ఇట్లాంటి భర్తే లభించాలని ఎన్నో పూజలు చేస్తుంటుంది. రోజూ  పీకల్లోతు తాగి, చేతులు తిమ్మిరెక్కో లేక సరదాగానో పెళ్ళాన్ని తుక్కుబడ తన్నుకునే సౌలభ్యం వున్నవారు నాటుభర్తలు (వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటాడు, చంపుకుంటాడు! మధ్యలో నీకెందుకు?). ప్రతి మగాడూ నాటుభర్తగా ఉందామనుకుంటాడు, కానీ - అదృష్టం కలిసిరాదు!

జ్ఞాపకశక్తి రెండురకాలు - ఒకటి అవసరమైనది, రెండు అనవసరమైనది. నా చిన్ననాటి స్నేహితుడు తెలివైనవాడు, అతనికి జ్ఞాపకశక్తి మెండు. ఫోన్ నంబర్లు, స్కూటర్ నంబర్లు శకుంతలాదేవి రేంజిలో గుర్తుంచుకునేవాడు. కానీ అతనికి పాఠ్యపుస్తకాల్లో వున్నదేదీ గుర్తుండేది కాదు! నాది పూర్తిగా ఆపోజిట్ సమస్య. నాకేదైనా గుర్తుండాలంటే అది పాఠ్యపుస్తకాల్లో వుండితీరాలి - లేకపోతే లేదు, అంతే! ఇందువల్ల నేను కొన్నిసార్లు నా స్కూటర్ తాళంతో, అదే రంగులో వున్న ఇంకొకడి స్కూటర్ తాళం తియ్యడానికి తీవ్రంగా ప్రయత్నించి తిట్లు తిన్న సందర్భాలు వున్నాయి. అయితే - నేనూ నా స్నేహితుడు ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం కాబట్టి, 'దోస్తి' సినిమాలో హీరోల్లా, ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుంటూ సింబయాటిగ్గా జీవించాం.

పరిచితులు రెండురకాలు - ఒకరు సుపరిచితులు, రెండు అపరిచితులు. ఈ సుపరిచుతులు అక్కినేని నాగేశ్వర్రావంత సౌమ్యులు, వినమృలు, మితభాషులు. చిరునవ్వుతో, దరహాసంతో 'మౌనమే నీ భాష ఓ మూగమనసా' అన్నట్లుగా వుంటారు. రెండు రౌండ్లు పడంగాన్లే జూలు విదిల్చిన సింహం వలె అపరిచితులుగా మారిపోతారు. ఆ తరవాత రౌండురౌండుకీ సీతయ్యలా గర్జిస్తారు, సమరసింహారెడ్డిలా గాండ్రిస్తారు!

వైద్యులు రెండురకాలు - ఒకరు వైద్యం చేసి డబ్బు తీసుకునేవారు, ఇంకొకరు డబ్బు కోసమే వైద్యం చేసేవారు. అనగా - రోగానికి సరైన వైద్యం చేసి, అందుకు డబ్బు వసూలు చేసేవాళ్ళు మొదటిరకం. వైద్యం తెలిసినా - తాము అనుకున్నంత బిల్లయ్యేదాకా రోగాన్ని పేరబెడుతూ వైద్యం చేసేవారు రెండోరకం. ఒకప్పుడు మొదటి రకం వైద్యులు ఉండేవాళ్ళుట! ఇప్పుడు వారు డైనోసార్లయ్యారు.

ఇలా చాలా రకాలు రాసుకుంటూ పోవచ్చుగానీ.. ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తాను.

(fb post 10/6/2017)

Tuesday 8 July 2014

వెలుగునీడల శ్రీశ్రీ


'వెలుగు నీడలు' అని ఒక పాత తెలుగు సినిమా వుంది. ఆ సినిమాని - నేను హైస్కూల్లో వుండగా రీరిలీజులో చూశాను. అందులో 'కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు' అనే పాట నాకు చాలా నచ్చింది. ఘంటసాల గానం కూడా సందర్భానికి తగినట్లు హృద్యంగా వుంది (అలా పాట్టం ఘంటసాల బలహీనత). ఎవరో శ్రీశ్రీ అనే ఆయన ఈ పాట రాశాట్ట. పేరు గమ్మత్తుగా వున్నా పాట మాత్రం చక్కగా రాశాడనుకున్నాను.

సినిమా మాత్రం టన్నుల కొద్ది సెంటిమెంటుతో కడు భారంగా వుంటుంది. అందులో ఈ పాట సందర్భం ఇంకా బరువైనది. నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమిస్తాడు. అతనికేదో రోగం వస్తుంది. అంతట నాగేశ్వరరావు తన ప్రేమని త్యాగం చేసి (ప్రేమ త్యాగాన్ని కోరుతుంది) సావిత్రికి జగ్గయ్యతో పెళ్లి జరిపిస్తాడు (ఇట్లాంటి stand by పెళ్ళికొడుకు వేషాలు జగ్గయ్య చక్కగా వేస్తాడు). జగ్గయ్య చాలా మంచివాడు కూడా! ఎందుకంటే - కథని ముందుకు నెట్టడానికి హఠాత్తుగా చచ్చిపోతుంటాడు.

తెలుగు సినిమా హీరోయిన్ కారణం లేకుండానే ఏడుస్తుంటుంది! అట్లాంటిది, భర్త పోయి - బాగా ఏడ్చేందుకు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది? అంచేత - కసిదీరా కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది (ఒక స్త్రీకి మొగుడు చచ్చినా, చావకపోయినా ఏడ్చే హక్కుంది. కాదండానికి నువ్వెవరివి?) అది చూసిన మహిళా ప్రేక్షకమణులు భోరున విలపించేవారు! మా చుట్టం ఒకావిడ 'చీపాడు! అదేం సినిమా? ఆ సినిమాలో అసలు ఏడుపే లేదు.' అనేది. అంటే - పిల్లలకి ఫైటింగ్ సీన్లు ఎంతిష్టమో, మహిళలకి ఏడుపు సీన్లు అంతిష్టం అని అర్ధమవుతుంది!

'ఇంతకీ భర్త చచ్చిపోతే అన్నిరోజులు పడీపడీ ఏడవటం దేనికి?' 

నా కూతురు అప్పుడప్పుడు పాత తెలుగు సినిమాలు కొంచెం సేపు చూస్తుంది, హఠాత్తుగా నన్నిట్లాంటి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుంటుంది. 

అప్పుడు నేను తల్లడిల్లిపోతాను - 

'అయ్యో! ఎంతమాటన్నావు తల్లీ? భగవంతుడా! నా కూతుర్ని క్షమించు. స్త్రీకి ఐదోతనమే (ఐదోక్లాసు కాదు) తరగని పెన్నిధి! భారతనారికి భర్తే దైవం (ఈ విషయాన్ని నా భార్యకి చెప్పమని దయగల పాఠకుల్ని అర్ధిస్తున్నాను)! ఆడదానికి భర్త లేని జీవితం సాంబారు లేని ఇడ్లీ వంటిది! ఇంకు లేని పెన్ను వంటిది! బొత్తాల్లేని చొక్కా వంటిది!' అనుకుంటూ గుమ్మడిలా మధన పడతాను, ఆపై - చిత్తూరు నాగయ్యలా నిట్టూరిస్తాను.

సరే! చనిపోయిన భర్త జ్ఞాపకాలతో రోదిస్తున్న సావిత్రిని ఓదార్చడానికి నాగేశ్వరరావు ఘంటసాల స్టోన్లో హెవీగా పాడతాడు. పాపం! నాగేశ్వరరావుకి సినిమాలు మారినా - భర్త చచ్చిన సావిత్రిని ఓదార్చడం మాత్రం తప్పదు (ఆ తరవాత వచ్చిన మూగమనసుల్లో కూడా నాగేశ్వరరావుకిదే డ్యూటీ)! ఎన్టీఆర్ పిండి రుబ్బాడు, రాజనాలతో కత్తియుద్ధాలు చేశాడు. కానీ - ఆయన ఆడవాళ్ళని ఓదార్చినట్లు నాకు జ్ఞాపకం లేదు. అసలీ రోగాలు, రొస్టులకి ఎన్టీఆర్ ఎప్పుడూ ఆమడ దూరం.

'కలకానిది, విలువైనది' పాట చాలా మీనింగ్‌ఫుల్లుగా వుంటుంది. దుఃఖంలో వున్న స్నేహితురాల్ని ఓదార్చడానికి హీరో వాడిన పదాలు, ఉపమానాలు, ఆలోచనలు చాలా అర్ధవంతంగా, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ చేసేంత స్థాయిలో చాలా ఎఫెక్టివ్‌గా వుంటాయి. పాట చూడనివాళ్ళ కోసం, చూసినా - మళ్ళీ చూద్దామనుకునేవాళ్ళ కోసం ఆ పాట యూట్యూబ్ లింక్  ఇస్తున్నాను.

నా చిన్నప్పుడు శ్రీశ్రీని 'మహాకవి' అని అంటుండగా వినేవాణ్ణి. సినిమా పాటలు అందరికన్నా బాగా రాస్తాడు కాబట్టి మహాకవి అంటున్నారేమోనని అనుకున్నాను. అలా అనుకోవడంలో నా తప్పేమీ లేదు.. అప్పటికి నాకు 'మహాప్రస్థానం' తెలీదు. అటు తరవాత శ్రీశ్రీని చదివాను. శ్రీశ్రీని 'మహాకవి' అని ఎందుకన్నారో అర్ధం చేసుకున్నాను.

శ్రీశ్రీ డబ్బునెప్పుడూ లెక్క చెయ్యలేదు. కానీ - ఆయనెప్పుడూ ద్రవ్యోల్పణంలో వుండేవాడు. ఎమర్జన్సీలో ఇందిరమ్మ పథకాల్ని కీర్తించాడు. ఎమర్జన్సీతో ఇందిరాగాంధీ దేశానికే కాదు, శ్రీశ్రీ వ్యక్తిత్వానిక్కూడా చీకటి రోజులు తెప్పించింది. అటుతరవాత శ్రీశ్రీ తన తప్పుకి భేషరతుగా క్షమాపణ చెప్పాడు. నాకిప్పుడనిపిస్తుంది - శ్రీశ్రీ అంతటివాడు క్షమాపణ చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ కలవాడు కాబట్టే క్షమించమన్నాడు. ఇది చాలా అభినందనీయం.

కొడవటిగంటి కుటుంబరావుకి దొరికిన 'చందమామ' నీడ గూర్చి శ్రీశ్రీ ఈర్ష్య పడ్డాడు. అయితే కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు, చక్రపాణిలది 'మీది తెనాలే! మాది తెనాలే!' బంధమని నా అనుమానం. అయినా - కుటుంబరావులా ఒకేచోట దశాబ్దాల తరబడి పనిచేసే మనస్తత్వం శ్రీశ్రీకి లేదనుకుంటున్నాను. శ్రీశ్రీతో చెడిన ఆరుద్ర శ్రీరంగం నారాయణబాబుని ప్రమోట్ చేద్దామని చూశాడు గానీ - వల్ల కాలేదు.

నాకో స్నేహితుడున్నాడు, అతనో బ్యాంక్ ఉద్యోగి. అతగాడికి జీవితం అంటే ఉద్యోగం, కుటుంబం మాత్రమే. పొద్దున్నే యోగాసనాలు వేస్తూ ఆయుష్షు పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. క్రమశిక్షణ లేని జీవితం బ్రేకుల్లేని కారు వంటిదని అతని నమ్మకం. అందువల్ల అతనికి శ్రీశ్రీ అంటే చిరాకు.

'శ్రీశ్రీ స్త్రీలోలుడు, అన్నపానముల కన్నా ధూమపానము, సురాపానమే మిన్న అని నమ్మినవాడు. తన అలవాట్లనే నియంత్రణ చేసుకోలేని కవి, ఇంక ప్రజలకి ఏం చెబుతాడు?' అనేది అతని లాజిక్. ఈ రకమైన లాజిక్‌తో - శ్రీశ్రీ 'దురలవాట్ల' మీద జరిగిన దాడి తెలుగు భాష కన్నా పురాతనమైనది!

నిజమే! శ్రీశ్రీ యోగాసనాలు వెయ్యడు, ఉద్యోగం చెయ్యడు, అది ఆయన ఇష్టం. నాకు తెలిసి శ్రీశ్రీ ఎక్కడా, ఎవరికీ వ్యక్తిగతమైన అలవాట్ల మీద సుద్దులు బోధించలేదు. శ్రీశ్రీ తన మందు తనే తాగాడు, తన సిగరెట్లు తనే (గుప్పిలి బిగించి మరీ) తాగాడు. తన ఆలోచనలతో తనే కవిత్వం రాసుకున్నాడు, అది చదివిన తెలుగు పాఠకులు వెర్రెక్కిపొయ్యారు.. ఊగిపొయ్యారు. అది శ్రీశ్రీ నేరం కాదు, అందుకు శ్రీశ్రీ బాధ్యుడు కూడా కాదు. ఇంకా నయం! శ్రీశ్రీ కూడా నా స్నేహితుళ్ళా ఆలోచించినట్లైతే 'మహాప్రస్థానం' రాయకుండా యోగాసనాలు వేసుకుంటూ మిగిలిపొయ్యేవాడు. నో డౌట్! అప్పుడు తెలుగు సాహిత్యం కుంటిదీ, గుడ్డిదీ అయిపొయ్యేది!

సినిమా రచనలకి సాహిత్య స్థాయి గానీ, గౌరవం గానీ ఉండనవసరం లేదని నా అభిప్రాయం. దర్శకుడు ఏదో సందర్భం చెబ్తాడు, సంగీత దర్శకుడు ఇంకేదో ట్యూను చెబ్తాడు. వారి అభిరుచికి తగ్గట్టుగా నాలుగు ముక్కలు కెలికితే అదే సినిమా పాట! కొందరు ప్రముఖ కవులు భుక్తి కోసం ఏవో కొన్ని సినిమా రచనలు చేశారు. ఎందుకంటే - వారికి కవిత్వం తిండి పెట్టలేదు, ఆ లోటు సినిమా పాట తీర్చింది.

ఈ మధ్య సమగ్ర సాహిత్యం అంటూ ఒక రచయిత రాసిన ('నాకు జలుబు చేసింది, నా భార్యకి దగ్గొస్తుంది' లాంటి వ్యక్తిగతమైన లేఖలతో సహా) ప్రతి అక్షరాన్ని పబ్లిష్ చెయ్యడమే మహత్కార్యంగా కొందరు పబ్లిషర్లు పూనుకున్నారు (ఎందుకో తెలీదు). తత్కారణంగా శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు కూడా ఆయన సమగ్ర సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ కంప్లీట్ వర్క్స్ పట్ల నా అభిప్రాయం 'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే! అంటూ ఇంతకుముందొకసారి రాశాను.  సరే! పబ్లిషర్ల దగ్గర డబ్బులున్నాయి, ముద్రణా యంత్రాలున్నాయి. వాళ్ళిష్టం! వద్దంటానికి మనమెవరం?

నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరినప్పుడు అక్కడి ప్రొఫెసర్ చెప్పే రోగి మంచం పక్కన పాఠాలు (bedside teaching) విని చాలా ఇంప్రెస్ అయిపొయ్యాను. చిన్న సంగతిక్కూడా ఎన్నో జర్నల్స్‌ని రిఫరెన్సులుగా అలవోకగా కోట్ చేస్తూ ఆయన పాఠాలు చెప్పే విధానం బహు ముచ్చటగా అనిపించింది. అటు తరవాత ఆయనకి సైకియాట్రీ జ్ఞానం టన్నుల కొద్దీ వుందనీ, నేను మొదట్లో విన్నది కొన్ని గ్రాములు మాత్రమేననీ తెలుసుకున్నాను. అంతేకాదు - ఆయన ఆ జ్ఞానంతోనే మన తాట తీస్తాడనీ, డొక్కా చించి డోలు వాయిస్తాడని కూడా అనుభవ పూర్వకంగా అర్ధం చేసుకున్నాను ( ఆయన నా థీసిస్ గైడ్ కూడా - అందువల్ల).

అట్లాగే శ్రీశ్రీ సినిమా పాటలు కూడా శ్రీశ్రీ సాహిత్యంలో టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అనీ, అవి శ్రీశ్రీ బ్రతువు తెరువు కోసం రాసిన అద్దె పంక్తులే (దర్శకుడి ఆలోచనల మేరకు రాసిన) తప్ప, శ్రీశ్రీ సాహిత్యస్థాయికి ఏ మాత్రం సరితూగవని అనుకుంటున్నాను. అంతేకాదు - ఆ పాటల్ని పబ్లిష్ చెయ్యడం (శ్రీశ్రీ అభిమానుల్ని తృప్తి పరచడం తప్పించి) తెలుగు సాహిత్యానికి పెద్దగా ప్రయోజనం లేదని నా అభిప్రాయం. 'నా అభిప్రాయం' అంటూ ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నానంటే - శ్రీశ్రీ అభిమానులు, సినీప్రేమికులు నామీద 'గయ్యి'మనకుండా వుండటానికి (ముందు జాగ్రత్త చర్యన్నమాట)!

గొప్పరచయితలు అన్నీ గొప్పగా రాయరు, ఒక్కోసారి చెత్తగా కూడా రాస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రచయితలందరికీ వర్తిస్తుంది. తెలుగు రచయితలకి మరీ వర్తిస్తుంది. చలం, కుటుంబరావు, గోపీచంద్, పద్మరాజు, అడవి బాపిరాజు, కాళీపట్నం రామారావుల రచనలు కొన్ని చదువుతుంటే అమృతాంజనం ఎడ్వర్టైజ్‌మెంట్ కోసం రాసినట్లుంటాయి!

మరప్పుడు ఈ సమగ్ర సాహిత్యాల వల్ల కలుగు ప్రయోజనమేమి? పోతన పద్యాల్లో పదవిన్యాసము, గురజాడ రచనల్లో గురుత్వాకర్షణశక్తి అంటూ డాక్టరేట్ల కోసం యూనివర్సిటీల్లో జరిగే పరిశోధకులకి ఉపయుక్తంగా ఉండటం ఒక ప్రయోజనం. లబ్దప్రతిష్టులైన రచయితలు కూడా - మనకి తెలిసిన మంచి రచనలతో పాటు మనకి తెలీని (చదవాల్సిన అవసరం లేని) రచనలు కూడా చాలా చేశారని తెలుకోవటం మరో ప్రయోజనం. భగవంతుని సృష్టిలో ఉపయోగపడని వస్తువంటూ ఏదీ లేదని ఎవరో చెప్పగా విన్నాను.. నిజమే అయ్యుంటుంది!

ముగింపు -

ఈ మధ్య ఫలానా తెలుగు కవి లేక రచయిత 'వందేళ్ళ జయంతి' అంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు గవర్నమెంటు డబ్బుల్తో జాతరలు నిర్వహిస్తున్నారు. ఇదోరకంగా కుటీర పరిశ్రమ, ఇంకోరకంగా గిట్టుబాటు వ్యవహారం. అయినా ఊరుకోలేక 'గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది' అంటూ రాశాను (నాకు బుద్ధి లేదు). 

అయితే - శ్రీశ్రీ వందేళ్ళ పండగని సీపీఐ పార్టీ వారు ఘనంగా నిర్వహించారు! సీపీఐ వారికి శ్రీశ్రీతో కనెక్షనేంటబ్బా? అర్ధం కాక, నాకు తెలిసిన కొంతమందిని అడిగాను. పాపం! వాళ్ళూ తెల్లమొహం వేశారు.

ఇందుకు నా బ్యాంక్ స్నేహితుడు (బ్యాంకు ఉద్యోగస్తులకి లాభనష్టాల లెక్కలు బాగా తెలుసు) చెప్పిన సమాధానం - 'ఇందులో ఆలోచించడానికేముంది? విశాలాంధ్ర వారు శ్రీశ్రీ చేతిలో పదోపరకో పెట్టి ఆయన మహాప్రస్థానాన్ని లెక్కలేనన్ని ఎడిషన్లు వేసుకుని విపరీతంగా అమ్ముకున్నారు. బహుశా ఆ కృతజ్ఞతతో ఈ శ్రీశ్రీ పండగ చేసుకుంటున్నారేమో!'

ఏమో - అయ్యుండొచ్చు! నాకైతే తెలీదు!

Thursday 3 July 2014

బాలగోపాల్ చెప్పిన 'జలపాఠాలు'


టి.యం.సి. / క్యూసెక్ అంటే ఏంటి?

నదీజలాల మీద ప్రజలకి హక్కులు ఉంటాయా?

జలవివాదాల పరిష్కారానికి చట్టం ఏం చెబుతుంది?

నికర జలాలు / మిగులు జలాల లెక్కలు ఎలా వేస్తారు?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కె.ఎల్.రావు 'ఘనత' ఏమిటి?

బచావత్ అనే సుప్రీం కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు (బచావత్ అవార్డు) మనకే ఎందుకు అనుకూలం?

రాష్టాలు సెంట్రల్ ట్రైబ్యునల్ దగ్గర ఎలాంటి (ఏడుపు) వాదనలు చేస్తాయి?

ప్రిస్క్రిప్టివ్ రైట్ అంటే ఏమిటి?

'తెలుగు గంగ'తో మొదలైన మన అక్రమ ప్రాజెక్టుల పరంపర ఎలా కొనసాగింది?

పోతులపాడు గ్రామం పోతిరెడ్డిపాడుగా ఎలా మారింది?

బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ దగ్గర రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వినిపించిన (అసంబద్ధ) వాదన ఏమిటి?

జలయజ్ఞం రైతుల కోసమా? కడప కాంట్రాక్టర్ల కోసమా?

పులిచింతలకి నికర జలాల కేటాయింపు ఎందుకు? అందువల్ల నల్గొండకి జరుగుతున్న నష్టం ఏమిటి?

పోలవరం ప్రాజెక్టు ఆలోచన సరైనదేనా?

కృష్ణాజల 'పునఃపంపిణీ' జరక్కుండా రాయలసీమ కరువు సమస్య తీరుతుందా?


మొన్నామధ్య విజయవాడ బుక్ ఎక్జిబిషన్లో బాలగోపాల్ పుస్తకం 'జలపాఠాలు' కొన్నాను. ఆ తరవాత చదువుదామని తెరిస్తే - పుస్తకంలో చాలా మ్యాపులు, టేబుల్స్, అంకెలు! భయపడిపోయాను. చిన్నప్పటి సోషల్ సబ్జక్టు గుర్తొచ్చింది. నేనేమీ నీటి పారుదల శాఖలో ఇంజనీర్ని కాను, కనీసం రైతుని కూడా కాను. నాకీ విషయాలు తెలీకపోయినా కొంపలేవీ మునిగిపోవు. కావున - పుస్తకాన్ని భద్రంగా బీరువాలో (చదవాల్సిన పుస్తకాల మధ్యన) పెట్టేశాను.

నాల్రోజుల క్రితం నా భార్యతో నాగార్జున సాగర్ గూర్చి మాట్లాడుతున్నప్పుడు తడబడ్డాను, కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ సాగునీరు టాపిక్ నాకెంత సంబంధం లేని విషయమైనా, నా పాండిత్యం అజ్ఞానం కన్నా అధమస్థాయిలో వున్నట్లుగా తోచి.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

అప్పుడు నాకు బాలగోపాల్ 'జలపాఠాలు' పుస్తకం గుర్తొచ్చింది. పుస్తకం అట్టమీద బొమ్మ - బాలగోపాల్ ఏదో వయోజన విద్యాకేంద్రంలో పాఠం చెబుతున్నట్లుగా వుంది. కావున - వయోజనుడనైన నేను కూడా విషయం అర్ధం చేసుకునేందుకు ఒక ప్రయత్నం చేద్దామనిపించింది. 'పుస్తకం ఎక్కడ విసుగు పుడితే అక్కడ మూసేసి, మళ్ళీ బీరువాలోకి నెట్టేస్తే సరి!' అని గట్టిగా నిర్ణయించుకుని 'జలపాఠాలు' పుస్తకం తెరిచి - చదవడం మొదలెట్టాను.

'క్లిష్టమైన విషయాన్ని సరళంగా రాసేవాడు ఉత్తముడు, క్లిష్టాన్ని సంక్లిష్టం చేసేవాడు మధ్యముడు, సరళాన్ని క్లిష్టం చేసేవాడు అధముడు' అని ఇంతకుముందోసారి రాశాను. ఆ లెక్కన చూస్తే బాలగోపాల్ అత్యుత్తముడు! ఎంతో బద్దకంగా పుస్తకం చదవడం మొదలెట్టిన నాచేత పుస్తకం మొత్తాన్ని ఏకబిగిన చదివించేశాడు.

ఈ పుస్తకం చదివిన తరవాత మనం (చదవక ముందు కన్నా) చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాం. నదులు, నీళ్ళు, ప్రాజెక్టులు, డ్యాములు, కాలువలు, ఆయకట్టు సాగులెక్కలు, రాష్ట్రాల మధ్య నీళ్ళ తగాదాలు.. ఇదంతా చాలా డ్రై సబ్జక్ట్. అయితే - ఈ సబ్జక్ట్ బాలగోపాల్ చేతిలో పడి చందమామ కథలా మారిపోయింది. పిల్లలక్కూడా అర్ధమయ్యేంత సులభమైన భాషలో రాసిన బాలగోపాల్ శైలి (దీన్ని కొడవటిగంటి కుటుంబరావు శైలి అనవచ్చునేమో) చాలా హాయిగా వుంది.

దాదాపు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్దకి వెళ్ళి అక్కడి స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ (బాలగోపాల్ పనిరాక్షసుడు).. ప్రభుత్వం చెప్పే లెక్కలతో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అవగాహన చేసుకుంటూ అధ్యయనం చేసి.. సాధికారంగా, సవివరంగా (వివిధ సందర్భాల్లో) రాసిన వ్యాసాల సంపుటి ఇది. 

బాలగోపాల్ 'లెక్కల పండితుడు'. సాధారణంగా లెక్కల మనుషులకి మనకన్నా బుర్ర ఎక్కువ అని నా అభిప్రాయం. అందుకే బాలగోపాల్ విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, విశ్లేషణా సామర్ధ్యం - సాహిత్యం గూర్చి రాసినా (రూపం - సారం), మానవ హక్కుల గూర్చి రాసినా.. నన్ను అబ్బుర పరుస్తుంది. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ ఇరిగేషన్ ఇంజనీర్‌లాగా ఈ పుస్తకం! (బాలగోపాల్ గూర్చి తెలీనివాళ్ళు ఆయన్నొక ఇంజనీరుగా భావించే ప్రమాదముంది!)

తెలుగునాట ఈమధ్య మేధావులు ఎక్కువైపొయ్యారు. ఆంధ్రా మేధావులు, తెలంగాణా మేధావులు అంటూ ప్రాంతీయ మేధావులు కూడా ప్రాచుర్యంలోకి వచ్చారు. మేధావులకి ఈ స్థానికత ఏంటో మనబోటి సామాన్యులకి అర్ధం కాదు. ప్రాంతం, భాష వంటి సంకుచిత పరిమితి గీతలు లేని అసలు సిసలు మేధావి బాలగోపాల్. అందుకే ఆయన మన రాష్ట్రం వల్ల మహారాష్ట్ర, కర్ణాటకలకి జరిగిన నష్టాన్ని కూడా నిర్భయంగా, నిజాయితీగా రాయగలిగాడు.

బాలగోపాల్ అభిప్రాయాల్తో అందరూ ఏకీభవించాలని లేదు, అలా ఏకీభవించాలని బహుశా బాలగోపాల్ కూడా అనుకోకపోవచ్చు. కానీ - ఇది ప్రజల ముందు కఠోర వాస్తవాలు ఉంచి ఆలోచింపజేసే పుస్తకం. బ్రిటీషువాడి ఆనకట్టల నిర్మాణం దగ్గర్నుండి పోలవరం దాకా చాలా నిక్కచ్చిగా నిజాల్ని మనముందు వుంచిన 'విషయం వున్న' పుస్తకం. రాజకీయ నాయకులు ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తారో బట్టబయలు చేసే పుస్తకం.

చివరగా - 

మొదట్లో మ్యాపులు, టేబుల్స్ చూసి భయపడ్డాను. కానీ - అవీ పుస్తకానికి చాలా అవసరం, అవే లేకపోతే నాకీ పుస్తకం ఇంత సులభంగా అర్ధమయ్యేది కాదు. అందుకు కారకులైన వేమన వసంతలక్ష్మి, మన్నం బ్రహ్మయ్యలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.