Thursday 28 May 2015

చట్టం అను ఒక దేవతా వస్త్రం!


‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’
‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’
‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’
‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.
శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.
క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!
ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –
ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.
అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.
పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.
మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.
వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.
“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!
చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.
ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2015 May 28)

Monday 4 May 2015

మారిపోవురా కాలము..




"ఏవిఁటో! ఆ రోజులే వేరు. పెళ్ళంటే పదిరోజులపాటు చుట్టపక్కాల్తో ఇల్లు కళకళ్లాడిపొయ్యేది. ఇవ్వాళ పెళ్లంటే తూతూమంత్రంగా ఒక్కరోజు తతంగం అయిపోయింది." కాఫీ చప్పరిస్తూ గొప్ప జీవితసత్యాన్ని కనుక్కున్నట్లు గంభీరంగా అంది అమ్మ.

నాకు నవ్వొచ్చింది. 'పాతరోజులు అంత మంచివా? పెళ్లి పదిరోజులు జరిగితే గొప్పేంటి? అయినా పనీపాటా లేకుండా ఆఫ్టరాల్ ఒక పెళ్లి కోసం అన్నేసి రోజులు వృధా చెయ్యాలా? ' అనుకుని మనసులోనే నవ్వుకున్నాను!

'మా రోజుల్లో అయితేనా.. ' అంటూ ఉత్సాహంగా జ్ఞాపకాలు నెమరేసుకునే వృద్ధాప్యం బ్యాచ్ చాలా ఇళ్లల్లో వుంటుంది. నోస్టాల్జియాని ప్రేమిస్తూ.. సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు, భాష అంతరించిపోతున్నాయని బాధపడేవాళ్లని 'గతం' ప్రేమికులు అనవచ్చునేమో! కాలంతో పాటు సమాజం కూడా నిత్యం మారుతూనే వుంటుంది. కొత్తని గ్రహిస్తూ పాతని వదిలించుకోవడం దాని లక్షణం. ఈ సంగతి 'గతం' ప్రేమికులకి తెలీదు, తెలిసినా బయటకి రాలేరు.

ఇందుకు నా చిన్నప్పటి పౌరాణిక నాటకాల్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కడ తెల్లవార్లు పద్యాలే పద్యాలు! ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు.. వరసపెట్టి గంటలకొద్దీ రాగాలు తీస్తూ పద్యాలు పాడుతూనే వుండేవాళ్ళు, 'వన్స్ మోర్' అనిపించుకునేవాళ్ళు. క్రమేపి ఈ 'వన్స్ మోర్' నాటకాలు మూలబడ్డాయి. వీటిని మళ్ళీ బ్రతికించడం కోసం కొందరు ఔత్సాహికులు నడుం బిగించారు గానీ - అరకొరగా ప్రభుత్వ నిధులు పొందడం మించి వారేమీ సాధించినట్లు లేదు.

అందరికీ అన్నీ ఇష్టం వుండవు, కొందరికి కొన్నే ఇష్టం. తరాల అంతరం పూడ్చలేం. ఒకప్పటి మన ఇష్టాల్ని వర్తమానంలోకి తెద్దామనుకోవడం అత్యాశ. నా పిల్లలకి సావిత్రి సినిమా చూపిద్దామనీ, ఘంటసాల పాట వినిపిద్దామనీ విఫల యత్నాలు చేసిన పిమ్మట - 'ఇష్టాయిష్టాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, మన ఆలోచనలు ఇంకోళ్ల మీద రుద్దరాదు' అనే జ్ఞానోదయం కలిగింది. ఆపై నా ఆలోచనని మార్చేసుకుని - నేనూ నా ఇష్టాల చుట్టూ గిరి గీసుకున్నాను.

నాకు మసాలా దోసె ఇష్టం, ఫిల్టర్ కాఫీ ఇష్టం, సింగిల్ మాల్ట్ ఇష్టం, రావిశాస్త్రి ఇష్టం. ఈ ఇష్టాలన్నీ పూర్తిగా నాకు మాత్రమే సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. ఇవన్నీ ఇంకా ఎంతమందికి ఇష్టమో తెలీదు, ఇవి నాకుతప్ప ఇంకెవరికీ ఇష్టం లేకపోయినా నేను పట్టించుకోను. నా ఇష్టాలన్నీ చట్టవిరుద్ధమైపోయి, సౌదీ అరేబియాలోలా కౄరంగా శిక్షించే ప్రమాదం వస్తేతప్ప - వాటిని రివ్యూ చేసుకునే ఉద్దేశం కూడా లేదు!

ఇలా నా ఇష్టాల్ని నేను మాత్రమే అనుభవించేస్తూ, వాటిలోని "గొప్పదనాన్నీ", "మంచితనాన్నీ" నలుగురికీ పంచని యెడల కొన్నాళ్ళకి అవి అంతరించపోవచ్చును గదా? పోవచ్చు! నేను పొయ్యాక నా ఇష్టాలు ఏమైపోతే మాత్రం నాకెందుకు? నేను చచ్చి పిశాచాన్నయ్యాక ఏం చేస్తానో నాకు తెలీదు కదా!

అన్నట్లు - 

పిశాచం మనిషిగా వున్నప్పటి అలవాట్లనే కంటిన్యూ చేస్తుందా? సమాధానం తెలిసినవారు చెప్పగలరు. 

(posted in fb on 25/1/2018)

Friday 1 May 2015

బాబాగారికో విన్నపం


వారు యోగాసనాల గురువు. ఆయన ఉన్నత వర్గాల వారికి గుండెల నిండుగా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తారు. ఆపై కాళ్ళూ చేతులతో అనేక విన్యాసాలు చేయిస్తారు. మంచిది, సుఖమయ జీవనానికి అలవాటైనవారికి కూసింత కొవ్వు కరిగించుకోడానికి గురువుగారు సాయం చేస్తుంటే ఎవరికి మాత్రం అభ్యంతరం?

వారికి రాజకీయ రంగం పట్ల ఆసక్తి వుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావాలని తెగ తాపత్రయ పడ్డారు. అందుకోసం గొప్ప ఉద్యమం కూడా చేశారు. మంచిది, ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. ఇప్పుడెందుకో ఆయన తను డిమాండ్ చేసిన నల్లదనం ఇంకా మన్దేశానికి రాలేదన్న విషయం మర్చిపొయ్యారు. బహుశా పని వొత్తిడి కారణం కావచ్చు!

వారికి ఆయుర్వేద మందుల వ్యాపారం వుంది. మంచిది, వ్యాపారం టాటా బిర్లాల సొత్తు మాత్రమే కాదు. 'కృషి వుంటే మనుషులు ఋషులౌతారు' అని ఏదో సినిమా ఒక పాట కూడా వుంది కదా! అంచేత - ఋషులు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నందుకు సంతోషిద్దాం. 

వందల కోట్ల విలువ చేసే వారి ఫార్మసీలో మగపిల్లల్ని పుట్టించడానికి ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు. ఇది నేరం అని కొందరు గిట్టనివాళ్ళు ప్రచారం చెయ్యొచ్చు. కానీ, సమాజంలో మగబిడ్డల కోసం ఆరాటం ఇప్పటిది కాదు. దశరథుడి కాలం నుండే వుంది. దశరథ మహారాజు పుత్రుల కోసం యజ్ఞం చేశాడే గానీ పుత్రికల కోసం చెయ్యలేదు. 

మెడికల్ సైన్సు క్షుద్రమైనది. అది - మన పవిత్ర తాళపత్ర గ్రంధాల్ని, అందుగల అమోఘమైన శాస్త్రీయ విషయాల్ని తొక్కిపట్టడానికి పాశ్చాత్యులు పన్నిన కుట్రలో భాగం. అందుకే పిల్లలు కావాలన్నప్పుడు పొటెన్సీ, మోటిలిటీ, ఫెర్టిలిటీ అంటూ ఏదో చెత్త చెబుతుంటారు. అబ్బాయే కావాలంటే క్రోమోజోముల లెక్క చెబుతారు. అవన్నీ మనం పట్టించుకోరాదు. 

మగపిల్లాణ్ని పుట్టించుకోడం కోసం యజ్ఞం చెయ్యడం అనేది ఖరీదైన వ్యవహారం, అందుకే అది ప్రజల సొమ్ముతో సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే రాజులకి మాత్రమే పరిమితమైంది. ఇవ్వాళ మనకి అంత ఆర్భాటం, ఆయాసం లేకుండా ఇన్స్టంట్ ఫుడ్ మాదిరిగా మగపిల్లల్ని పుట్టించే మందుని యోగాసనాల స్వామిగారు సరసమైన ధరకి మార్కెట్లో అమ్మిస్తున్నారు. అందుకు మనం బాబాగార్ని అభినందించాలి. 

బాబాగారికో విన్నపం. అయ్యా! తమరు మీ రీసెర్చిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సామాన్య మానవులకి మరింత మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల మీ మందుల్తో పుట్టబొయ్యే మగబిడ్డ భవిష్యత్తు గూర్చి తలిదండ్రులు ఆందోళన చెందకుండా - ఆ పుట్టినవాడు అయ్యేఎస్ అయ్యేందుకు అయ్యేఎస్ లేహ్యం, అమెరికాలో స్థిరపడేందుకు అమెరికా తైలం లాంటి మందుల్ని కూడా జనబాహుళ్యంలోకి తేవాలని కోరుకుంటున్నాను!