Monday 24 February 2014

కాలక్షేపం వార్తలు


"ఆ రెండు దెయ్యాల దుర్మార్గమే"

ఈ వార్త ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' ఐదో పేజిలో వచ్చింది. తెలుగు వార్తా పత్రికల స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది. ఇంకా జారటానికి అక్కడ మిగిలిందేమీ లేదు. ఒక వార్తని అర్ధవంతంగా రిపోర్ట్ చెయ్యటం వీరికి చేతకాదు. అందుకే వార్తలో సాధ్యమైనంతవరకూ తిట్లూ, బూతులు వెతుక్కుని.. వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

నెల్లూరు జిల్లాకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే ఓ చిన్నపాటి తెలుగు దేశం నాయకుడు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ లపై ఫైర్ అవుతూ చేసిన 'దెయ్యం' కామెంట్ ఇది. ఆ నాయకుడికి తన రాష్ట్రం విడిపోయినందుకు కోపం, బాధ ఉండి ఉండొచ్చు, లేదా తన నియోజక వర్గ ప్రజల దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ఈ భాష వాడి ఉండొచ్చు. కానీ ఆ వార్తని రిపోర్ట్ చెయ్యడానికి పత్రిక వాడిన శీర్షిక అభ్యంతరకరంగా ఉంది.  

తెలుగు దేశం నాయకుడు చేసిన విమర్శ రాజకీయమైనది. వాస్తవానికి ఈ వార్తని రాసేప్పుడు పత్రికలు దేవుళ్ళు, దెయ్యాల భాష (ఆ నాయకుడు అలా మాట్లాడినప్పటికీ) వాడకూడదు. అది పత్రికల బాధ్యత. ఎందుకంటే ఆయన దెయ్యాలుగా రిఫర్ చేసిన వ్యక్తులు స్త్రీలు, ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే రెండు పెద్ద రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన స్థానంలో ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వారివారి పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయం. అప్పుడు వారిపై విమర్శలు కూడా రాజకీయంగానే ఉండాలి, పత్రికలు అటువంటి విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ, వ్యక్తిగత దూషణలకి కాదు. 

ఆ తెలుగు దేశం నాయకుడు చాలా విషయాలు చెబుతూ, మధ్యలో ఒక మాటగా ఈ దెయ్యాల భాష వాడి ఉంటాడు. కానీ పత్రిక వారికి దెయ్యాల ప్రస్తావన ఆకర్షణీయంగా ఉందనిపించింది. అందుకే అన్నీ వదిలేసి 'దెయ్యాలు' అంటూ హైలైట్ చేశారు. ఇట్లాంటి తిట్ల భాష వాడితేనే పత్రికల్లో ప్రచారం లభిస్తుందని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రస్థాయి నాయకులు. 

చంద్రబాబు నాయుడంతటి నాయకుడే తన రాజకీయ ప్రత్యర్ధుల్ని 'మొద్దబ్బాయ్, దొంగబ్బాయ్' అంటూ సంబోధించడం ఒక విషాదం. ఇదెక్కడి రాజకీయ భాష! జుగుప్సాకరమైన ఇట్లాంటి భాషని పెద్దస్థాయి నాయకులు మాట్లాడటం వల్లనే చిన్నస్థాయి నాయకులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది రాజకీయాలకే నష్టం. 

ఇక ఆంధ్రజ్యోతి ఓనర్ గారు తమ పత్రిక విలువలకి కట్టుబడి నిస్వార్ధంగా నిలబడుతుందని (వారికి ప్రతి ఆదివారం ఇదో తంతు) గర్వంగా చెప్పుకున్నారు. మంచిది, ఆయన అభిప్రాయం ఆయనిష్టం. ఆ పత్రికకి తెలుగు దేశం పార్టీలో అంతా నిస్వార్ధమైన మంచే కనిపిస్తుంది, జగన్మోహనుడి పార్టీలో అంతా స్వార్ధపూరిత చెడ్డే కనిపిస్తుంది. తన పత్రికకి - తెలంగాణా జిల్లాల ఎడిషన్లలో సమైక్య దుర్మార్గం కనిపిస్తుంది, సీమాంధ్ర ఎడిషన్లలో విభజన దుష్టత్వం కనిపిస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతం మనకి బాగానే పరిచయం. కాబట్టి - ఆ పత్రిక ఓనరు గారి ద్వంద్వవిధానం వారి నిజాయితీగానే మనం భావించాల్సి ఉంటుంది. 

ప్రజలు తెలివైనవారని నా నమ్మకం. అందుకే వాళ్ళు మీడియా వండే మసాలా వార్తల్ని పట్టించుకోవటం మానేశారు. కొందరు మరీ పనిలేని వాళ్ళు టీ స్టాల్లో టీ తాగుతూ కాలక్షేపంగా ఏదో మాట్లాడుకుంటారు. అంచేత వీటిని కాలక్షేపం వార్తలుగా అనుకోవచ్చు. అంతకుమించి ఈ వార్తలకి ప్రాధాన్యం లేదు. 'మరి ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ వార్తల్ని ఎందుకంతగా చదువుతారు? చూస్తారు?' సినిమాలో చివరికి గెలిచేది హీరోనే అని తెలిసినా, ఆ ఫైటింగుల్ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. వారికదో సరదా. ఈ వార్తల గతీ అంతే!

(photo courtesy : Google)

Thursday 20 February 2014

తిక్క కుదిరింది


తెలంగాణా బిల్లు పాసైపోయింది. 

ఇదేంటి! ఇంకా భూమి బ్రద్దలవ్వలేదు, ఆకాశం చిల్లు పడలేదు, కరెంట్ పోయి అంధకారం ఆవహించలేదు, నక్కలు ఊళ వేయలేదు, కనీసం పిల్లులైనా 'మ్యావ్' మనలేదు. 

నిన్న రాత్రంతా దోమలు కుడుతూనే ఉన్నయ్! ఇప్పుడు సూర్యుడు కూడా తూర్పునే ఉదయించాడు. పొద్దున్నే చలిచలిగా, మంచుమంచుగా ఉంది. 

రోజూ చేసే పనే - నేను నిద్ర లేచి స్నూపీని మొద్దునిద్ర లోంచి లేపాను. 'అప్పుడే తెల్లారిందా?' అన్నట్లు స్నూపీ బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది. దాన్ని బలవంతంగా మేడ మీదకి తీసుకెళ్ళాను. 

కాలకృత్య నిమత్తం పిట్టగోడ వైపు తిరిగి వెనక కాలెత్తింది.

"స్నూపీ! తెలంగాణా బిల్లు పాసైంది." అన్నాను.

సమాధానంగా తోక ఊపుతూ 'భౌభౌ' మంది. నాకు కుక్క భాష రాదు కావున ఆ అరుపుకి అర్ధం తెలీలేదు.

స్టడీ రూంలో మా అబ్బాయి ఇంటర్ పరీక్షలకి చదువుకుంటున్నాడు.

"బుడుగు! తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను.

మావాడు నావైపు చూస్తూ ఓ క్షణం ఆలోచించాడు.

"ఎక్జామ్స్ postpone అవుతాయా?" ఆసక్తిగా అడిగాడు.

"అవ్వవు." అన్నాను.

మొహం చిట్లించుకుని పుస్తకంలోకి తల దూర్చాడు.

మా అమ్మాయి కాలేజికి వెళ్లేందుకు హడావుడిగా రెడీ అవుతుంది.

"నాన్నా! ఇవ్వాళ స్టేట్ బంద్ లేదా?"

"బంద్ పిలుపైతే ఇచ్చారు."

"ఏవిటో! ఈమధ్య బందంటూ పిలుపులే ఇస్తున్నారు, ఏదీ బంద్ చెయ్యట్లేదు." అంటూ విసుక్కుంటూ కాలేజికి వెళ్ళిపోయింది.

నా భార్య సీరియస్ గా ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటుంది.

"తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను. 

"అవును. లేటుగానైనా తెలంగాణా వాళ్లకి న్యాయం జరిగింది. నాకీ తెలంగాణా విషయం చదువుతున్నప్పుడల్లా, 'అద్దెకుంటున్న ఇంటికి నేను రిపైర్లు చేయించాను కాబట్టి ఇల్లు నాదే' అనే దబాయింపు వాదం గుర్తొస్తుంది." అన్నదావిడ.

"అయితే నీకు బాధగా లేదన్నమాట." అన్నాను.  

"నాకెందుకు బాధ! బాధ పడాల్సింది మీడియా వాళ్ళు. ఇన్నాళ్ళూ వాళ్ళు తెలంగాణా మోత మోగించారు. ఇంక వాళ్లకి చెప్పడానికి విషయం ఉండదు. జర్నలిస్టులు చాలామంది ఉపాధి కోల్పోతారు." అన్నది.

"మీడియా వాళ్ళకేనా? నా బ్లాగుక్కూడా దెబ్బే! ఇంక రాయడానికి నాక్కూడా పెద్దగా విషయాలుండవ్." దిగాలుగా అన్నాను.

"తిక్క కుదిరింది." కసిగా అంది నా భార్య!

(photo courtesy :Google)

Sunday 16 February 2014

భరతమాత ముద్దుబిడ్డలు


ఇప్పుడు ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఉద్యమం అంటే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఒక బాధిత ప్రజా సమూహం చేసే పోరాటం అని అర్ధం. అయితే ఇప్పుడు ఉద్యమం అనే పదానికి అర్ధం మారిపోయింది. తమకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నవారి హక్కుని కాదనడం కూడా ఉద్యమమే అంటున్నారు. అంగబలం, అర్ధబలానికి అధికారం కూడా తోడైతే శబ్దం ఎక్కువగానే ఉంటుంది.. లక్ష్మీ ఔటు మోత కూడా AK 47 పేల్చినట్లుగా వినిపిస్తుంది. 

ఉద్యమాలు ప్రజలు నడిపించడం పాత పధ్ధతి. ఇప్పుడంతా మారిపోయింది. ఉద్యమాలు కూడా ఔట్ సోర్స్ చేయబడ్డాయ్! అందుకే ఇప్పుడు ప్రైవేట్ టీవీ చానెళ్ళు ఉద్యమాల్ని నడిపిస్తున్నాయి. ఈ టీవీ చానెళ్ళ ప్రధాన లక్ష్యం తమ ప్రయోజనాలు, తమ వర్గం వారి ప్రయోజనాల్ని పరిరక్షించడమే. అందుకే ఈ చానెళ్ళు సమాజంలో ఉన్న కొన్నివర్గాలకి మాత్రమే గొంతునిస్తాయి, కొమ్ము కాస్తాయి, బాకాలూదుతాయి. తమవాడికి వీపు దురద పుడితే ప్రజలందరికీ దురద పుడుతుందన్నట్లు హడావుడి చేస్తాయి. 

ఒకప్పుడు బీహార్లో కులప్రాబల్యం ఎక్కువనీ, కులాలే రాజకీయ శక్తుల్ని నియంత్రిస్తాయని చెప్పుకునేవారు. ఇప్పుడు మనం బీహార్ వైపు చూడనక్కర్లేదు. మనని మనం చూసుకుంటే చాలు! పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలలో పార్టీకొక పత్రిక ఉంది. వాళ్ళది చాలా సింపుల్ వ్యవహారం. 

మనవి కులరాజకీయాలు కాదు, రాజకీయాలే కులాల్ని అనుసరించి సాగుతున్నయ్. అందుకే పత్రికలు ఒకే వార్తని వారివారి కులదృష్టితో, ప్రాంతదృష్టితో రిపోర్ట్ చేస్తున్నాయ్. కాబట్టే ఒక రాజకీయ నాయకుడు బరి తెగించి ప్రవర్తిస్తే.. అతను 'మనవాడు' కాబట్టి భగత్ సింగ్ తో పోల్చుకుని ఆనందిస్తున్నాం. 

మంచిది, భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని ప్రస్తుతానికి ఆనందిద్దాం. ఈ రకంగా అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీలు కూడా జన్మించే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రేటున దేశానికి వన్నె తెచ్చిన ముద్దుబిడ్డలంతా మన మధ్యనే తిరుగాడుతుంటారు. అప్పుడా దృశ్యం కన్న భరతమాత ఉద్వేగంతో కార్చే ఆనందభాష్పాలు తుడవటానికి ఎవరి చేతిరుమాళ్ళూ సరిపోవు, పెద్దపెద్ద టర్కీటవల్సే కావాల్సి ఉంటుంది. కాబట్టి - అవేవో ఇప్పుడే రెడీగా ఉంచుకుందాం. 

(picture courtesy : Google)

Saturday 15 February 2014

సీమాంధ్రులారా! ఏడవకండేడవకండి


"నాకు ఏడుపొస్తుంది." 

"ఎందుకు?" 

"ఇక హైదరాబాదు మనది కాదు."

"మనకి మన చంద్రబాబున్నాడు. ఇట్లాంటి హైదరాబాదులు పది నిర్మిస్తాడు."

"మెట్రో మనకి కాకుండా పోతుంది."

"పొతే పోనీ, మనకి మన జగన్బాబున్నాడు. ఇట్లాంటి మెట్రోలు పది కట్టిస్తాడు."

"నిమ్స్ కూడా మనకుండదు."

"మనకి మన కిరణ్బాబున్నాడు. ఇట్లాంటి నిమ్సులు పది తెప్పిస్తాడు."

"శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోతుంది."

"వెళ్తే వెళ్ళనీ, మనకి మన కావూరి ఉన్నాడు. ఇట్లాంటి శంషాబాదు విమానాశ్రయాల్ని పది కట్టిస్తాడు."

"మనకిక ఔటర్ రింగు రోడ్డు ఉండదు."

"మరేం పర్లేదు, మనకి మన టీజీ వెంకటేశ్ ఉన్నాడు. ఇట్లాంటి ఔటర్ రింగు రోడ్డులు పది నిర్మిస్తాడు."

"హైటెక్ సిటీ ఇంక మనది కాదు."

"మనకి మన లగడపాటి ఉన్నాడు. ఇట్లాంటి హైటెక్కు సిటీలు పది సృష్టిస్తాడు."

"అవును కదా! గొప్ప లీడర్లంతా మనవైపే ఉన్నారన్న సంగతి మరిచిపొయ్యాను."

"తెలంగాణా వాళ్లకి బోడి హైదరాబాదే వెళ్ళింది. గొప్పగొప్ప లీడర్లంతా మనవైపుకే వచ్చేశారు."

"అయ్యయ్యో! అనవసరంగా ఏడిచానే." 

(photo courtesy : Google)

Monday 10 February 2014

టెన్షన్.. టెన్షన్.. టెన్షన్!


"టెన్షన్.. టెన్షన్.. టెన్షన్! టెన్షన్తో చచ్చేట్లున్నాను."

"ఎందుకు?"

"సమైక్యాంధ్ర కోసం ఓ ఎంపీ సభలోనే ప్రాణత్యాగం చేస్తాట్ట."

"చేసుకొనీ. అది ఆయన ఇష్టం. మధ్యలో నీకెందుకు టెన్షన్?"

"అంతమంది మధ్యలో చావడం కష్టం గదా! కత్తితో పొడుచుకుంటాడా? ఉరేసుకుంటాడా?"

"అది ఆయన సమస్య. స్పీకర్తో చర్చించి ఏదోక మార్గం ఎంచుకుంటాళ్ళే."

"అంతేనంటావా? సమైక్యాంధ్ర కోసం ఇన్ని వేలమంది 5 కె రన్ అంటూ పరిగెత్తినా కేంద్రం దిగి రావట్లేదు. ఇది అన్యాయం."

"సమైక్యాంధ్ర ఒక రాజకీయ సమస్య.. అది పరిగెత్తితే తేలదు."

"అన్నింటికీ ఏదోలా సమాధానం చెప్పేసి తేల్చేస్తున్నావే! సరే, తెలంగాణా బిల్లు పాసవుతుందా? లేదా? అదైనా చెప్పి నా టెన్షన్ తగ్గించు."

"కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజ్మెంట్ సరీగ్గా చెయ్యగలిగితే తెలంగాణా బిల్లు పాసవుతుంది, లేకపోతే లేదు."

"బిల్లు పాస్ అవుతుందా? లేదా?"

"ఆ సంగతి చూస్కోడానికి వెంకయ్య నాయుడు, దిగ్విజయ్ సింగులు ఉన్నార్లే. మొన్నెప్పుడో అమ్మకి జ్వరం అన్నావు, తగ్గిందా?"

"ఇంకా లేదు."

"డాక్టర్ ఏమన్నాడు?"

"డాక్టర్ దగ్గరకి ఇంకా తీసికెళ్ళలేదు."

"ఏవిటీ! ఇన్నిరోజులుగా జ్వరం ఉన్నా అంత పెద్దావిణ్ని ఇంకా డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళలేదా!"

"అవును, కుదర్లేదు."

"నీకసలు బుద్ధుందా? పనికిమాలిన సంగతుల గూర్చి టెన్షన్ పడుతున్నావు, కన్నతల్లి జ్వరం నీకు పట్టదా?"

"నేను నీలా స్వార్ధపరుణ్ణి కాను. నాకు ఇంట్లోవాళ్ళ ఆరోగ్యం కన్నా రాష్ట్రప్రజల శ్రేయస్సే ఎక్కువ. అందుకే టెన్షన్ పడుతుంటాను."

(photo courtesy : Google)

నరేంద్ర మోడీ.. నమోన్నమః


"నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని కావాలన్నదే నా కోరిక."

"ఓ! నువ్వు నరేంద్ర మోడీ అభిమానివా?"

"నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అన్నాను గానీ, నేనతని అభిమానినని అన్లేదు. నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదు.. పైగా వ్యతిరేకిస్తాను కూడా."

"మహానుభావా! నా బుర్ర చాలా చిన్నది, కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పవా?"

"ష్.. ఇది పరమ రహస్యం. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొప్ప స్కెచ్ వేశాను."

"కొంపదీసి బీజేపీ వాళ్ళ మీటింగుల్లో బాంబులూ గట్రా పెడతావా ఏమిటి?"

"అది కాదులే. ముందు నువ్వు నాకో మాటివ్వు. నా ఓటు బీజీపీకే, నువ్వు కూడా బీజేపీకే ఓటెయ్యి."

"ఎందుకు?"

"ఎందుకేమిటీ? మనందరం ఓట్లేస్తే గానీ బీజేపీకి రెండొందల సీట్లు రావు."

"వస్తే?"

"అప్పుడు బీజేపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది."

"అయితే?"

"ఆ మాత్రం తెలీదా? అప్పుడు బీజేపి చచ్చినట్లు జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు తీసుకుని గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు. అదీ నా స్కెచ్. ...................... "

"చెప్పడం ఆపేశావేం?"

"చెప్పడానికి ఇంకేం లేదు."

"అర్ధం కాలేదు."

"ఆ విధంగా మోడీకి జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు చాలా కీలకం అవుతుంది. ఈ ముగ్గుర్నీ శాంతింప చేస్తూ ప్రధానిగా కొనసాగడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. ఈ ఆడవాళ్ళ మధ్య నరేంద్ర మోడీని ఊహించుకో. భలే కామెడీగా ఉంటుంది కదూ."

"నేనలా అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు."

"గాడిద గుడ్డేం కాదు. నరేంద్ర మోడీ కమ్యూనిస్టుల్తోటీ, కాంగ్రెస్తోటీ యుద్ధం చేసి గెలవగలడు గానీ.. ఈ ముగ్గురు ఆడవాళ్ళని గెలవలేడు, అది అసాధ్యం."

"నీ ఆలోచన శాడిస్టిక్ గా ఉంది."

"నాకు మాత్రం ఆ ముగ్గురు ఆడవాళ్ళ మధ్యన నలిగిపోతున్న నరేంద్ర మోడీ ఊహే ఆనందాన్నిస్తుంది. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక మోడీ పని 'నమోన్నమః' అయిపోతుంది. అర్జంటుగా ప్రధాని పదవిని అద్వానీకి 'త్యాగం' చేసేసి, మళ్ళీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతాడు."

"ఆరి దుర్మార్గుడా! ఎంత దూరం ఆలోచించావు!"

"నేనెప్పుడూ అంతే. విశ్వనాథన్ ఆనంద్ టైపు, చాలా స్టెప్పులు ముందే ఆలోచిస్తాను!"

అంకితం :

MACALLAN కి ప్రేమతో..

(photo courtesy : Google)

Tuesday 4 February 2014

'మూగమనసులు' అంతుపట్టని అమ్మాయిగారి మనోగతం


సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, విమర్శ సాహిత్యాన్ని విశ్లేషిస్తుందనీ.. తెలుగులో సాహిత్యానికి తగినంత స్థాయిలో సాహిత్య విమర్శ లేదనీ.. చాలాయేళ్ళ క్రితం కొడవటిగంటి కుటుంబరావు చేసిన ఆరోపణ. ఈ ఆరోపణ తెలుగు సినిమాలక్కూడా వర్తిస్తుందని నా అభిప్రాయం. అయితే - సాహిత్యం వేరు, సినిమా వేరు. సాహిత్యాన్ని పాఠకుడు చదువుతాడు, సినిమాని ప్రేక్షకుడు చూస్తాడు.

కానీ ఈ రెండు ప్రక్రియలు చేసే పని ఒకటే.. కథ చెప్పడం. ఒక మంచి రచన విమర్శకుల్ని కూడా ఆకర్షిస్తుంది, అప్పుడే ఆ రచన మంచిచెడులు కూలంకుషంగా చర్చింపపడతాయి. ఇందుకు తెలుగులో పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన', కాళీపట్నం రామారావు 'యజ్ఞం' లాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

'కథ చెప్పడం' అనే ప్రక్రియే ప్రధానంగా ఉన్నప్పటికీ సినిమాకథకి సాహిత్యస్థాయి లేదు. అయితే - ఒక మంచి సినిమాకథకి 'సాహిత్యస్థాయి' ఇచ్చి కథాపరమైన మంచిచెడులు విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? కానీ ఎందుకో తెలుగులో ఆ ప్రయత్నం జరగలేదు (నాకు తెలిసినంతమేరకు).

'సినిమాకథంటే కొందరు నటుల్ని దృష్టిలో ఉంచుకుని, వారి వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా, పామరజనుల వినోదం కోసం అల్లుకునే కథ మాత్రమే, అట్టి కథలు సీరియస్ విశ్లేషణకి అనర్హం' అనే అభిప్రాయం విమర్శకుల్లో ఉండటం కావచ్చు. లేదా సినిమాలో కథని ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు కూడా ముడిపడి వున్నందున, కథ నొక్కదాన్నే బయటకి లాగి చర్చింపబూనడం సరికాదనే అభిప్రాయం కావచ్చు.

కారణం ఏదైనప్పటికీ.. తెలుగు సాహిత్య విమర్శతో పోల్చి చూసుకుంటే తెలుగు సినిమా కథలకి అసలు విమర్శే లేదు. ఈ ప్రపంచంలో ఏదీ విమర్శకి అతీతం కాదు, కారాదు. ఒక విమర్శకుడు ఒక రచనని తన విమర్శకి యెంచుకోవడమే ఆ రచనకి గొప్పగౌరవం అని నా అభిప్రాయం. 

సరే! అసలు విషయంలోకొస్తే -

ఈమధ్య 'మూగమనసులు' విడుదలై యాభైయ్యేళ్ళు పూర్తైన సందర్భాన.. యధావిధిగా పత్రికలు, టీవీలవాళ్ళు సినిమాకి సన్మానపత్రాలు సమర్పించారు. నేనీ సినిమాని హాల్లో కొన్నిసార్లూ, ఇంట్లో మరికొన్నిసార్లూ చూశాను. నాకు బాగా నచ్చిన సినిమాల్లో మూగమనసులు ఒకటి. ఎలాగూ సినిమా కథ, విమర్శ అంటూ చెబుతున్నాను కాబట్టి.. ఇప్పుడు నేను మూగమనసులు కథ గూర్చి నా అభిప్రాయాలు రాస్తాను.

అనగనగా ఒక జమీందారు. ఆయనకి ఒక కూతురు, పేరు రాధ. ఈ రాధ ప్రతిరోజూ పడవలో గోదావరి దాటి ఆవలి ఒడ్డునున్న కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ పడవ నడిపేవాడు గోపీ. చాలా పేదవాడు, అమాయకుడు, అర్భకుడు. గోపీ రాధని 'అమ్మాయిగారు' అంటూ వెర్రిగా అభిమానిస్తాడు, ఆరాధిస్తాడు. అతనికి పొద్దస్తమానం అమ్మాయిగారి ధ్యాసే. గోపీని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని గౌరీ అనే అల్లరి అమ్మాయి ఎదురు చూస్తుంటుంది.

గోపీ ప్రతిరోజూ అమ్మాయిగారికి బంతిపువ్వునిచ్చి తన భక్తిని చాటుకుంటూ, ఆమెని దేవతా సమానంగా పూజిస్తాడు. ఈ వెర్రి అభిమానం.. మన తెలుగు సినిమా హీరోల వెర్రి అభిమానుల్ని తలపిస్తుంది. రాధ గోపీ వీరాభిమానం వల్ల ఏ మాత్రం ఇబ్బంది పడకపోగా.. ఆ పడవ్వాడి ఆరాధనని ప్రోత్సాహిస్తుంది, ఎంజాయ్ చేస్తుంటుంది.

కథ కొంచెం ముందుకు సాగి, రాధకి రాంబాబు అనేవాడు రాసిన ప్రేమలేఖ జమీందారు కంట పడుతుంది. కూతురు కూడా రాంబాబుని ప్రేమించిందనుకుని పెళ్లి నిశ్చయం చేస్తాడు జమీందారు. వాస్తవానికి రాధ రాంబాబుని ప్రేమించలేదు, అతన్ని పెళ్లి చేసుకునేంత ఆసక్తీ చూపదు. నాకా రాంబాబు నచ్చలేదు అని తండ్రికి చెప్పొచ్చు. అలా చెబితే తండ్రి పెళ్లి ప్రయత్నం చేసేవాడు కాదు. అయినా చెప్పదు, ఎందుకో తెలీదు!

తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే.. తన కోసం గోపీ బెంగ పడతాడని రాధకి తెలుసు. గోపీని పెళ్లి చేసుకోటానికి గంపెడంత ప్రేమతో గౌరీ ఎదురు చూస్తుందనీ తెలుసు. అమాయకుడైన గోపీని, గడుసైన గౌరీతో కట్టబెట్టేస్తే గోపీ జీవితం హాయిగా వెళ్ళిపోతుందని తెలుసు. తనమాట గోపీకి వేదవాక్కు. 'నువ్వు గౌరీని పెళ్లి చేసుకోరా గోపీ' అని ఒక్కమాట అన్నట్లయితే, అరనిమిషంలో గౌరీని పెళ్లి చేసుకుంటాడనీ తెలుసు. కానీ గోపీ భవిష్యత్తు గూర్చి అమ్మాయిగారు ఒక్కక్షణం కూడా ఆలోచించదు. ఎందుకో తెలీదు!

రాధ హాయిగా పెళ్లి చేసుకుని, గోపీతో ఘంటసాల గొంతుతో ఒక పాట పాడించుకుని, భర్తతో కాపురానికి వెళ్ళిపోతుంది. భర్తకేదో రోగం రాబట్టి గానీ, లేకపోతే మొగుడికి డజను మంది పిల్లల్ని కనుండేది, ఈ ప్రేమ కథకి ముగింపు కార్డూ పడేది. కానీ ఇదో గొప్ప ప్రేమ కథ! కావున కథకోసం రాధ మొగుడు అర్జంటుగా ఏదో రోగం తెచ్చుకుంటాడు.

కొన్నాళ్ళకి రాధ భర్త (చచ్చిపొయ్యి) కథకి అడ్డు తొలుగుతాడు. వైధవ్యంతో పుట్టింటికి తిరిగొస్తుంది రాధ. పెద్దగా ఇష్టం లేని పెళ్లి, మూణ్నాళ్ళ ముచ్చటగా ముగిసిన కాపురం. అయినా రాధ దుఃఖం అత్యంత భీభత్సంగా ఉంటుంది! తిండి కూడా మానేస్తుంది. సహజంగానే అమ్మాయిగారి భక్తుడైన గోపీ తల్లడిల్లిపోతాడు. ఆవిడకి బత్తాయి తొనలు తినిపిస్తూ, (మళ్ళీ ఘంటసాల గొంతుతో) పాటలు పాడుతూ ఓదారుస్తుంటాడు గోపీ.

పాపం! గోపీ కడుపేదవాడు, గోదావరి తిరనాళ్లలో అవ్వకి దొరికిన దిక్కూమొక్కు లేని అనాధ, పెళ్ళీపెటాకులు లేని బ్రహ్మచారి. జీవితంలో ఏ ఆనందమూ అనుభవించని వాడు. ఏరకంగా చూసుకున్నా అమ్మాయిగారి కన్నా పరమ హీనస్థితిలో ఉన్నవాడు. అయినా కూడా భర్త చనిపోయిన బాధలో ఉన్న అమ్మాయిగారిని ఓదార్చడానికి శక్తికి మించి తాపత్రయపడతాడు.

నేను మెడికల్ స్టూడెంటుగా ఉన్నప్పుడు కష్టమైన కేసుకి diagnosis సీనియర్స్ నుండి ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా పేషంట్ ఎక్జామినేషన్ ఫైండింగ్స్‌తో కేసు రాసేసి, నేనే ఆ డయాగ్నోసిస్ చేసినట్లుగా ప్రొఫెసర్లకి కేస్ ప్రెజెంట్ చేసేవాణ్ణి. మూగమనసులు రచయిత కూడా నాలాంటివాడేననిపిస్తుంది (అందుకే ముగింపు ముందే అనుకుని, అందుకు తగ్గట్టు కథ రాసుకున్నాడు).

అంచేతనే - రాబోయే అమ్మాయిగారి కష్టాన్ని ఓదార్చడానికి, అటుపై ఆవిడతో కలిసి చనిపోవడానికి వీలుగా.. కావాలనే గోపీకి పెళ్లి చెయ్యకుండా రచయిత గోపీని రిజర్వులో ఉంచినట్లుగా అనిపిస్తుంది. ఊళ్ళోవాళ్ళు తమ స్నేహాన్ని చెడుగా అనుకుంటున్నారని బాధపడుతుంది రాధ. గౌరీ మీద కోపంతో అలిగి పడవ మీద పడి ఏడుస్తున్న గోపీని బలవంతంగా నదిలోకి తీసుకెళ్తుంది.

రాధకి ఎప్పుడూ తన సొంతగోలే గానీ, గోపీ గూర్చి అస్సలు ఆలోచన ఉండదు. తను చావాలి, తనతోపాటు తన భక్తుడు గోపీ కూడా చావాలి. ఆవిడ దృష్టిలో గోపీ ప్రాణానికి విలువ లేదు. ఇదీ ఆమె ధోరణి! ఉన్నత కుటుంబాలవాళ్ళు తమకన్నా బాగా స్థాయి తక్కువ వాళ్ళ పట్ల ఇలాగే ఆలోచిస్తారేమో! ఆ విధంగా తన చావుకి తోడుగా ఆ అమాయక పడవవాణ్ని వెంట తీసుకెళ్తుంది రాధ. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యవిషయమేమంటే, ఈ suicide pact లో గోపీకి ఏమాత్రం ప్రమేయం లేదు. అతను చేసిన తప్పల్లా అమ్మాయిగార్ని దేవతలా ఆరాధించడమే.

'మూగమనసులు' ఒక మంచి కథ. కథలో అన్ని పాత్రలకీ వ్యక్తిత్వం ఉంటుంది, పర్పస్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇవేవి లేనిదల్లా ఒక్క రాధకి మాత్రమే. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక మంచి కథలో పాత్రల ఔచిత్యం దెబ్బ తినదు. ఏ పాత్ర దృష్టికోణం నుండి చూసినా కథనం దెబ్బతినదు, తినకూడదు. కానీ మూగమనసులులో అతి ప్రధానపాత్రకి వ్యక్తిత్వం ఉండదు! కారణం యేమయ్యుంటుంది?

నాకు తోచిన కారణాలు రాస్తాను. ఏ రచయితైనా పాత్రల ద్వారా సన్నివేశాల్ని సృష్టించి కథ చెబుతాడు. అయితే ఎంత గొప్ప రచయితైనా ఏదోక పాత్ర ద్వారా మనకి కనబడతాడు. ఆ పాత్రకి extra care తీసుకుని స్పెషల్‌గా తీర్చి దిద్దుతాడు. కన్యాశుల్కం చదువుతుంటే మనకి మధురవాణిలో గురజాడ కనిపిస్తాడు. ఇలా చెయ్యటం కథనం రీత్యా కూడదు గానీ, రచయిత కూడా మనిషేగా!

'మూగమనసులు' కథకి గౌరీది మకుటాయమానమైన పాత్ర. ఈ పాత్రకి రచయిత extra care తీసుకున్నాడు. అందుకే గౌరీ కోణంలోంచి ఈ కథని ఫాలో అయితే కథలో చిన్న పొరబాటు కూడా కనబడదు. గౌరీ అమాయకురాలు, మనసున్న మనిషి, ప్రేమమయి, గడుసుది, కోపిష్టిది, ఈర్ష్యాసూయలు కలది, త్యాగశీలి. ఈ భూమ్మీద బ్రతుకుతున్న అనేకమందిలా ఒక సాధారణ మనిషి.

గోపీ కోణం నుండి కూడా ఎక్కడా వంక పెట్టటానికి వీలులేని కథ మూగమనసులు. అతనిది సింగిల్ పాయింట్ ఎజెండా.. అమ్మాయిగారి ఆరాధన. అందుకోసమే జీవించాడు, తన బ్రతుకుని నిర్లక్ష్యం చేసుకున్నాడు. చివరకి అమ్మాయిగారి కోరిక ప్రకారమే మరణించాడు కూడా.

రచయిత జన్మ, పునర్జన్మ అంటూ ఒక థియరీ చెబుతాడు. ఈ పునర్జన్మల థియరీ కోసమే రచయిత రాధాగోపీల్ని హడావుడిగా ఒకేసారి చంపేసి ఉండొచ్చు. అలా వాళ్ళిద్దరూ ఒకేసారి చావకపోతే రచయిత చెప్పదల్చుకుంది పల్చబడిపోతుంది. కాబట్టి ఇద్దర్నీ కలిపి ఒకేసారి చంపేద్దామని నిర్ణయించుకున్న రచయిత, చావడానికి రాధకి గట్టి కారణం సృష్టించగలిగాడు. కానీ - రాధ గోపీని కూడా ఎందుకు చావులొకి లాక్కెళ్తుందో బలమైన కారణం చెప్పలేకపొయ్యాడు.

సమస్య రాధది, ఆవిడకి ఊళ్ళోవాళ్ళు అన్న మాటలు అవమానంగా తోస్తే ఆవిడ ఒక్కతే చనిపోవడం న్యాయం. గుడిపాటి వెంకట చలం నాయకిలా గోపీతో లేచిపొయ్యే ధైర్యం చెయ్యకపోయినా, కనీసం తను చచ్చి గోపీని వదిలేస్తే పొయ్యేది. నేను ఈ సినిమా చిన్నతనంలో చూసినప్పుడు 'ఆ పడవ నడిపేవాడు సుబ్బరంగా రాధని పెళ్లి చేసుకోవచ్చుకదా' అని అనుకున్నాను. నాకప్పుడు మన వ్యవస్థలో ఉండే సామాజిక అంతరాల గూర్చి అవగాహన లేదు.

అంతకుముందు ఎన్నోయేళ్ళ క్రితం 'మాలపిల్ల' వచ్చింది. దళిత యువతిని పెళ్ళాడిన హీరో కథతో 'రోజులు మారాయి' వచ్చింది. మూగమనసులు కథలో జమీందార్ల అమ్మాయిని ఆరాధించిన హీరో సామాజికంగా బలహీన వర్గం వాడు. అందుకే అతనికి పొరబాటున కూడా అమ్మాయిగారి గూర్చి 'చెడు' తలంపులు రావు. ఈ విధంగా రచయిత 'కులసంకరం' కాకుండా కథాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ కులం మగవాడు, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించవచ్చును గానీ.. తక్కువ కులం మగవాడు, పైస్థాయి అమ్మాయిని కోరుకోకూడదా? ఏమో, ఆ రోజున్న సామాజిక పరిస్థితుల్లో అది తప్పేమో!

ఈ కథ పేరు మూగమనసులు. అయితే ఇందులో ఉన్నది ఒకటే మూగమనసు! అది రాధది. మిగిలిన అన్ని పాత్రలకి చక్కటి ఆలోచనలు ఉంటాయి, హాయిగా వ్యక్తీకరిస్తూనే ఉంటాయి, ముఖ్యంగా గౌరీ. ఒక్క రాధని పక్కన పెడితే అన్ని పాత్రలు, చాలా సహజంగా ప్రవర్తిస్తుంటాయి. నా దృష్టిలో ఈ కథకి వీకేస్ట్ లింక్ రాధ. క్రికెట్ భాషలో చెప్పాలంటే కథలో రాధ పాత్ర ఎప్పుడూ non striker's end లోనే ఉంటుంది. రన్స్ మొత్తం గౌరీ, గోపీలు తీసేశారు, మ్యాచ్ గెలిపించేశారు.

సినిమా ఎప్పుడో వచ్చింది, తెలుగువాళ్ళకి నచ్చింది. వీలైతే నాలుగు మంచిమాటలు రాయాలి గానీ, విమర్శించాల్సిన అవసరం ఇప్పుడేంటి? అనేది కొంతమంది అభిప్రాయం కావచ్చు. అదీ నిజమే, ఒప్పుకుంటున్నాను. అయితే - చాలామంది 'కన్యాశుల్కం' లోపాల్ని కూడా ఆ నాటకంపై ఎంతో ఇష్టంతోనే చర్చించారు, నచ్చక కాదు.

ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక గొప్ప కథ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆ గొప్ప కథలో నచ్చని కొన్ని పాయింట్లని రికార్డ్ చెయ్యడం కూడా ఆ కథకి గొప్ప ట్రిబ్యూట్ అనుకుంటున్నాను. లేకపోతే ఇంత కష్టపడి ఇదంతా రాయను కదా!


(photos courtesy : Google)