Saturday 17 May 2014

ఎన్నికల ధర్మం


అది ఎన్నికలానందస్వామి వారి ఆశ్రమం. ఆశ్రమం అంటే 'లవకుశ'లో వాల్మీకి మహర్షి టైపు పూరిపాకల ఆశ్రమం అనుకునేరు.. కాదు. అక్కడ అన్నీ విశాలమైన పాలరాతి కట్టడాలు, బహుళ అంతస్తుల సముదాయాలు.. ఆశ్రమమంతా కూడా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్. ఆశ్రమానికి ఒకవైపు విశాలమైన పంట పొలాలు, ఆ పొలంలో పండించిన ధాన్యాన్ని, కూరగాయల్ని మాత్రమే ఆశ్రమవాసులు వండించుకుంటారు. ఇంకోవైపు మరింత విశాలమైన పండ్ల తోటలు, ఆ తాజాఫలాల్నే ఆశ్రమవాసులు భుజిస్తారు.

అక్కడి ఆశ్రమవాసులు అత్యంత ధనికులు. వయసులో తెగ సంపాదించేసి, సంపాదన యెడల విసుగు పుట్టి, పిమ్మట జీవితం పట్ల వైరాగ్యం కలిగి (డబ్బు సంపాదించినవాడికే వైరాగ్యం కలుగును), ఆపై ఆస్తుల్ని పిల్లలకి పంచేసి (ఇది చాలా ముఖ్యం).. 'తుచ్చమైన ఈ మానవ జీవితానికి అర్ధం ఏమిటి?' అనే జీవిత సత్యాన్ని కనుగొనుటకు స్వామివారి దగ్గర శిష్యలుగా చేరారు. వారికి స్వామివారి పద్ధతులు తెగ నచ్చేసి ఆశ్రమానికి తెగ డొనేషన్లు ఇచ్చేశారు (డొనేషన్లు ఇవ్వలేనివారు స్వామివారి కృపకు అనర్హులు). ఆ సత్యశోధకులకి నిత్యమూ స్వామివారి ప్రవచనములు వినుటయే తప్ప.. వేరే పన్లేదు (ఈ దేశంలో కోట్లాదిమందికి కూలి చేస్తేగానీ కడుపు నిండదు, అందుకే - వారికి వైరాగ్యం కలిగేంత జ్ఞానం ఉండదు).

డాక్టర్లలో గుండెజబ్బులకి, మెదడుజబ్బులకి స్పెషలిస్టులు ఉంటారు. ప్లీడర్లలో సివిల్, క్రిమినల్ కేసులకి స్పెషలిస్టులు ఉంటారు. దొంగల్లో పట్టపగలు దొంగలు, అర్ధరాత్రి దొంగలు అంటూ స్పెషలిస్టులుంటారు. అదే విధంగా - స్వామీజీలలో కూడా స్పెషలిస్టులుంటారు. ఎన్నికలానందస్వామి వారిది ఎలక్షన్ల స్పెషాలిటీ, ఆయన పేరు కూడా అలా వచ్చిందే. ఈ రంగంలో వారిది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్.

మునిసిపాలిటీ వార్డు మెంబర్ నుండి మంత్రుల దాకా స్వామివారి శిష్యులున్నారు. వారంతా ఆయన చెప్పిన పార్టీలో చేరతారు (ఒక ఊరు చేరడానికి బస్సెక్కుతాం, రైలెక్కుతాం, ప్లేనెక్కుతాం.. దేంట్లో ప్రయాణించినా గమ్యం చేరడం ముఖ్యం. చట్టసభ అనే గమ్యాన్ని చేరడానికి రాజకీయ పార్టీలనేవి వాహనాల వంటివని స్వామివారి శిష్యుల అభిప్రాయం), చెప్పిన సమయానికి నామినేషన్ వేస్తారు, చెప్పిన సమయానికి ప్రచారం ప్రారంభిస్తారు. నిన్న ఆంద్రదేశంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. గెలిచిన శిష్యులు స్వామివారి దర్శనానికి వరస కట్టారు. పొద్దున్నుండి ఒకళ్ళ తరవాత ఒకళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు.

వినాయకరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మునిసిపల్ చైర్మెన్ గా రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయనకిది మూడోసారి, ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు. ఆయనకి నమ్మకాలు ఎక్కువ, అందుకే ఆయన పేరు Viinaaayka Ravuu గా రాసుకుంటాడు.. తెలుగు పేరుకి ఇంగ్లీషు అక్షరాల అలంకారాలేవిటి అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే, అదో శాస్త్రం! ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వినాయకరావు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వచ్చాడు.

అది స్వామివారి పూజా సమయం. ఆ సమయంలో ఆయన్ని డిస్టర్బ్ చెయ్యడం దేనికని, పూజామందిరం పక్కగా ఉండే స్వామివారి ఏకాంత మందిరంలో వెయిట్ చేయ్యసాగాడు వినాయకరావు. ఆ మందిరం విశాలంగా ఉంది, నేల మీద పరిచిన ఎర్రటి తివాచీ గదిని నెత్తుటితో కడిగినట్లుగా అందంగా, భయంకరంగా ఉంది. ఈ నెత్తుటి మడుగులోంచి పొడుచుకొచ్చిన దెయ్యప్పిల్లల్లా ఒక పక్కగా మెత్తటి సోఫాలున్నాయి. గది మధ్యలో వెండితో చేసిన పెద్ద సింహాసనం ఆ దెయ్యప్పిల్లలకి తండ్రిలాగా ఉంది. ఆ గది మిక్కిలి ఖరీదుగా ఉంది, భయం కొలిపేదిగానూ ఉంది. ఆ గది ఆధ్యాత్మికతకి నిలయంగా లేదు, దొంగల ముఠాలు దోచుకున్న సొమ్ము వాటాలేసుకునే హెడ్డాఫీసులా ఉంది.

వినాయకరావు ఒక సోఫాలో కూర్చున్నాడు. ఆయన ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, లావుగా కూడా ఉంటాడు. విశాలమైన నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టు, చేతివేళ్ళకి రకరకాల రంగురాళ్ళ ఉంగరాలు.. చూడ్డానికి రాజకీయవేత్తకి, అధ్యాత్మికవేత్తకి పుట్టిన అక్రమ సంతానంలా అగుపిస్తాడు. ఆతను చూపులకి బహుసౌమ్యుడు, చేతల్లో బహుక్రూరుడు. అతని భాష చాలా కల్చర్డ్ గా ఉంటుంది, ఆలోచనలు అతి అన్ కల్చర్డ్ గా ఉంటాయి.

వినాయకరావుకి ధన బలం ఉంది, కుల బలం ఉంది, కండ బలం ఉంది, మంది బలం ఉంది. తద్వారా - రాజకీయ బలం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని బలాలు ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కానీ - ఇప్పుడు వినాయకరావు అంత సంతోషంగా లేడు.. అన్యమస్కంగా ఉన్నాడు. అసలాయన వాలకం ఎన్నికల్లో గెలిచినట్లు లేదు - డిపాజిట్ కోల్పోయినట్లుంది. చిటికెన వేలుతో తన నియోజక వర్గాన్ని శాసించగలిగే వినాయకరావు దిగాలుగా ఉన్నాడు!

అందుకు కారణమేమి? వినాయకరావు ఒక్కగానొక్క కూతురు, పెళ్లై అమెరికా వెళ్ళిపోయింది (రాజకీయ నాయకుడి సంతానం - అయితే రాజకీయ నాయకులయినా అవుతారు, లేదా అమెరికాలోనైనా స్థిరపడతారు). ఒక్కగానొక్క కొడుకు, కొడుకుది అచ్చు తన పోలికే. రూపంలోనే కాదు గుణంలో కూడా! అంచేత చిన్న వినాయకరావు కూడా మందు, మగువల సాంగత్యంతో జీవిత సత్యాన్ని కనుగొనే ప్రయత్నంలో తల మున్కలయ్యాడు.

ఆ విధంగా అన్నివిధాలుగా తన వారసుడిగా ఎదుగుతున్న పుత్రరత్నాన్ని గాంచిన వినాయకరావు మిక్కిలి గర్వించాడు. ఈసారి ఎన్నికల్లో - కొడుకుని అసెంబ్లీకి పంపి, తను పార్లమెంటుకి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ - విధి బలీయమైనది. కొన్నాళ్ళక్రితం - వన్ ఫైన్ డే ఫుల్లుగా మందుకొట్టి, అత్యంత ఖరీదైన కారుని అత్యంత వేగంగా నడిపిన కారణాన యాక్సిడెంటై అసువులు బాశాడు ( విధి క్రూరమైనది కూడా).

వినాయకరావు పుట్టెడు పుత్రశోకంతోనే ఎన్నికల్లో పోటీ చేశాడు (తప్పదు మరి.. ఒక్కసారి టిక్కెట్టొదులుకుంటే మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు). ఈసారి ఎగస్పార్టీవాడు ఏదో పారిశ్రామికవేత్తట, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేశాడు. వినాయకరావుకి చిర్రెత్తింది. డాక్టర్లు చచ్చేదాకా వైద్యవృత్తిలోనే ఉంటారు, ప్లీడర్లు ప్లీడరీ వృత్తిలోనే ఛస్తారు. కానీ ఈమధ్య నాలుగు డబ్బులు సంపాదించిన ప్రతి ముండాకొడుకు రాజకీయ నాయకులకి కాంపిటీషన్ కొచ్చేస్తున్నాడు.. రాజకీయం మరీ చవకైపొయ్యింది. అంచేత - పోయినసారి కన్నా ఈసారి మెజారిటీ కొంత తగ్గినా, మొత్తానికి గెలుపొందాడు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పబ్లిక్ పరీక్షల్లాంటివి. అందుకే గెలుపెప్పుడూ గొప్ప కిక్కునిస్తుంది. కానీ చెతికందొచ్చిన కొడుకు లేకుండా పొయ్యాడు. ఎన్నికలు, ఫలితాలు.. ఈ వాతావరణం కొడుకుని మరీమరీ జ్ఞప్తికి తెస్తున్నాయి వినాయకరావుకి. అంచేత - మనసులో బాధ, దుఃఖం తుఫానులో కారుమబ్బుల వలె ఆవహించి.. నైరాశ్యంలో కూరుకుపొయ్యాడు.

ఎన్నికలానందస్వామి వారి పూజ అయిపోయినట్లుంది.. ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు. వినాయకరావు స్వామివారిని చూడంగాన్లే లేచి నిలబడి నమస్కరించాడు. స్వామివారు గుండ్రంగా, గుండుగా తొక్కు తీసిన పనసపండులా ఉన్నాడు. ఆయన శరీరం నిన్ననే పాలిష్ చేసిన బలార్షా టేకు చెక్క వలె తళతళలాడుతుంది. ఆయన మొహం అప్పుడే కోసిన దోసకాయలా నవనవలాడుతుంది. స్వామివారు గది మధ్యలోనున్న వెండి సింహాసనంపై ఆశీనులయ్యారు. అది వారి ఉచితాసనం (అనగా - శిష్యులు ఉచితంగా ఇచ్చిన ఆసనం అని అర్ధం).

వినాయకరావు సోఫాలో తల దించుకుని కూర్చున్నాడే గానీ ఏమీ మాట్లాడలేదు. అతను అశాంతిగా ఉన్నాడని గ్రహించారు స్వామివారు. ఇజ్రాయిల్లో వర్షాలు పడకపోతే అమెరికా వాడు కలత చెందినట్లు, స్వామివారి తన భక్తుని బాధని గాంచి ఆందోళన చెందారు.

"ఏం చిన్నా? ఈసారి కూడా గెల్చావు కదా! అలా ఉన్నావేం?" అంటూ ప్రేమగా పలకరించారు.

ఎన్నికలానందస్వామి వారు డబ్బు, పలుకుబడి ఉన్న భక్తుల్ని మాత్రమే ఆప్యాయంగా 'చిన్నా!' అని సంబోధిస్తారు. అవేమీ లేనివాళ్లని అసలేవీ సంబోధించరు - కుసింత బూడిద మాత్రం ప్రసాదిస్తారు.

స్వామివారి పలకరింపు - ఎస్సైగారు దొంగగాడి కష్టాల్ని సానుభూతిగా కనుక్కుంటున్నట్లుగా అనిపించింది వినాయకరావుకి. కావున - ఒక్కసారిగా బేలగా అయిపొయ్యాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా, కష్టంగా కూడదీసుకుంటూ అన్నాడు.

"దొంగనోట్లు మార్చాను, మానభంగాలు చేశాను, హత్యలు చేయించాను. డబ్బు కోసం, పదవి కోసం, పలుకుబడి కోసం నే చెయ్యని అక్రమం లేదు. నేను మహాపాపిని. నా పాపాలు నన్ను కాల్చేస్తున్నాయి. నాకందరూ ఉన్నారు, కానీ ఒంటరిని. నాకన్నీ ఉన్నాయి, కానీ ఏవీ నావి కావు. భయంగా ఉంది స్వామీ. నా బ్రతుకే ఒక బొంకు. ఈ ఎన్నికలు, అది నేను గెలవడం అంతా మోసం. ఎందరి ఉసురు పోసుకున్నానో? నా బిడ్డ నాక్కాకుండా పొయ్యాడు...... " ఇంక మాట్లాడలేక నిశ్శబ్దంగా రోదించసాగాడు వినాయకరావు.

అడవిలో అర్ధరాత్రిలా, పేదవాడి నీరసంలా.. గదంతా నిశ్శబ్దం. కొంతమందికి కొన్ని నప్పవు, అవి మనం చూళ్ళం. ఉదాహరణకి గుమ్మడి ఫైటింగులు, అమెరికావాడి నీతులు ఎబ్బెట్టుగా ఉంటాయి. వినాయకరావు దుఃఖం కూడా స్వామివారికి అలాగే అనిపించింది.

అర్ధమైందన్నట్లుగా తల పంకిస్తూ.. స్వామివారు చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు.

"చిన్నా! జీవితం బుద్బుదప్రాయం, నీ బిడ్డడికి నూరేళ్ళు నిండాయి, వెళ్ళిపొయ్యాడు. మన్చేతిలో ఏముంది? ఏమీ లేదు - అంతా దైవనిర్ణయం. ఇకపోతే - నువ్వు అన్యాయం, పాపం అంటూ ఏవో చెబుతున్నావు. నాకైతే నువ్వు చేసిన పాపలేమిటో బోధపడటం లేదు." అన్నారు.

దుఃఖిస్తూనే ఆశ్చర్యపొయ్యాడు వినాయకరావు.

"ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి పర్పస్ ఒకటి ఉంటుంది చిన్నా! ఇప్పుడు నువ్వు కూర్చున్న సోఫా ఎంత మెత్తగా ఉన్నా, అది డైనింగ్ టేబుల్ గా పనికిరాదు. అలాగే - సకల జీవచరాలకి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మం ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించటమే ఆ జీవి పరమార్ధం. నేల నుండి సారాన్ని గ్రహించి గడ్డి పెరుగుతుంది, గడ్డిని తిని జింకలు, దున్నలు జీవిస్తాయి. ఆ జింకల్ని, దున్నల్ని తిని పులులు జీవిస్తాయి. ఆ పులుల్ని వేటగాడైనా చంపేస్తాడు, లేదా అవే కొంతకాలానికి అవే చస్తాయ్.. ఎట్లా చచ్చినా నేలలో కలిసిపోవాల్సిందే. అంటే నేల నుండి పుట్టింది అనేక రకాలుగా రూపాంతరాలు చెంది తిరిగి ఆ నేలలోనే కలిసిపోయింది. ఇదొక సృష్టి చక్రం!" అంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్లుగా ఆగారు.

కొద్దిసేపటికి కళ్ళు తెరిచి వినాయకరావుని చూస్తూ మళ్ళీ చెప్పసాగారు స్వామి.

"చిన్నా! ఇప్పుడు నీ సంగతే చెబుతాను. నువ్వు స్వశక్తితో అంచెలంచెలుగా పైకొచ్చిన వ్యక్తివి. నీ అవకాశాల కోసం ఇతరుల్ని హింసించావు, మోసగించావు. నువ్వేది చేసినా నీ భవిష్యత్తు కోసమే చేశావు, సరదా కోసం చెయ్యలేదు. మెడికల్ సీటు కోసం విద్యార్ధి కోచింగు తీసుకుని ఎమ్సెట్ పరీక్ష రాస్తాడు, తనకే డాక్టర్ సీటు రావాలని కోరుకుంటాడు. రాజకీయ నాయకుడికి ఎలక్షన్లో పార్టీ టిక్కెట్ సంపాదించడం, పోటీ చెయ్యడం కూడా ఎమ్సెట్ వంటిదే! నువ్వు చేసింది తప్పైతే ఎమ్సెట్ పరీక్ష కూడా తప్పే! పులి ఆహారం కోసం జింకని చంపడం న్యాయం, అదే పులి అదే జింకని వినోదం కోసం చంపడం మాత్రం పాపం.. నువ్వలాంటి పాపాలేవీ చెయ్యలేదు."

'అవును కదా!' అనుకున్నాడు వినాయకరావు.

"నువ్వు నిజాయితీగా ఉన్నావనుకుందాం. నీ పార్టీవాళ్లు 'ఫండ్స్' తీసుకోకుండా నీకు టిక్కెట్టు ఇస్తారా? ఇవ్వరు. కార్యకర్తల్ని రోజు కూలీ ఇచ్చి ప్రచారం చేయిస్తావ్. నీ పార్టీ సిద్ధంతాన్నో, నీ నాయకత్వాన్నో చూసి వాళ్ళేమన్నా ఫ్రీగా సర్విస్ చేస్తారా? చెయ్యరు. ఎలక్షన్ల ముందు ఓట్లు కొనడానికి పార్టీ ముఖ్యులకి డబ్బు పంపిణీ చేస్తావ్. వాళ్ళేమన్నా నిజాయితీగా డబ్బు పంచుతారా? పంచరు. మధ్యలో ఎవరికి అందినంత వాళ్ళు కాజేస్తారు." అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నారు స్వామివారు.

స్వామివారిలో భగవద్గీతని ప్రవచిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని గాంచాడు వినాయకరావు.

"ఈ ప్రజలు అత్యాసపరులు. నువ్వు నిజాయితీగా ప్రజాసేవ చెయ్యాలంటారు. కానీ - ఎలక్షన్లో డబ్బు లేకుండా పన్జరగదు. పోనీ - నువ్వు నిజాయితీగా 'నా నియోజకవర్గ ప్రజలారా! ఎన్నికల కోసం నాకింత ఖర్చయ్యింది, ఇంత తీసుకుంటున్నాను.' అని చెబితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నీకు ప్రజాధనం నీ ధనంగా మార్చుకోడానికి మించి వేరొక మార్గం ఉందా? లేదు."

'అవునవును!' అనుకున్నాడు వినాయకరావు.

"చిన్నా! నే చెబుతున్నా విను! నువ్వు అవినీతికి పాల్పడలేదు, భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో కాబోయే ఖర్చు కోసం నిధులు సమకూర్చుకున్నావు, ఎన్నికల సమయంలో ఆ నిధులు ఉపయోగించావ్. నేలలోంచి పుట్టిన జీవి చివరాకరికి మళ్ళీ నేల్లోనే కలిసిపోయినట్లు.. ప్రజల సొమ్ము అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే చేరింది. ఇది ఎన్నికల ధర్మం, ప్రజాస్వామ్య చక్రం." అన్నారు స్వామివారు.

"కానీ.. కానీ.. నేను రిగ్గింగులు చేయించాను, ప్రత్యర్ధులపై దొంగ కేసులు పెట్టించాను, ఒకట్రెండు మర్డర్లు చేయించాను." గిల్టీగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు దరహాసంతో ఇలా సెలవిచ్చారు.

"చిన్నా! దేవుడు గుళ్ళో ఉంటేనే పూజలందుకుంటాడు. రాజకీయ నాయకుడు పదవిలో ఉంటేనే రాణిస్తాడు. నాయకుడు ఎన్నికల్లో గెలవకపోతే ప్రజలు వాణ్నో చిత్తుకాయితంలా చూస్తారు. చిత్తుకాయితాల్ని కనీసం తూకానికైనా అమ్ముకోవచ్చు, ఓడిన నాయకుడు అందుక్కూడా పనికి రాడు. అదే ప్రజలు గెల్చిన నాయకుడికి బ్రహ్మరథం పడతారు. కావున ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే నీ ధర్మం. వేటాడే పులి ధర్మాధర్మాల గూర్చి బేరీజు వేస్తూ కూర్చుంటే ఆకలి చావు చస్తుంది. కావున - నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయాన్యాయాల ప్రసక్తి అనవసరం. నీ గెలుపు అడ్డం అనుకున్నవాడి మీద దొంగ కేసు పెట్టించడం కూడా ధర్మమే. అడ్డం కానప్పుడు మాత్రం దొంగ కేసు పెట్టించడం చాలా అన్యాయం, అటువంటి పాపపు పనులు నువ్వు చెయ్యకు."

వినాయకరావు మొహంలో కొద్దిగా కళ కనిపించింది.

"కానీ నావల్ల కాంట్రాక్టర్లు, మాఫియా తప్ప లాభపడిన వారెవ్వరూ లేరు. ప్రజల కనీసావసారాల కోసం కనీసంగా కూడా పాటు పళ్ళేదు." సందేహంగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు మొహం చిట్లించారు.

"ప్రజల గూర్చి ఆలోచించాలా? ఎందుకు!? పేషంట్ల గూర్చి డాక్టర్లు ఆలోచిస్తున్నారా? కక్షిదారుల గూర్చి న్యాయవాదులు ఆలోచిస్తున్నారా? కస్టమర్ల గూర్చి వ్యాపారస్తులు ఆలోచిస్తున్నారా? శాంతిభద్రతల గూర్చి పోలీసులు ఆలోచిస్తున్నారా? లంచాలు మింగకుండా ఆఫీసర్లు పని చేస్తున్నారా? వాళ్ళెవ్వరికీ లేని వృత్తిధర్మం మీ రాజకీయ నాయకులకి మాత్రం ఎందుకు?"

వినాయకరావు భ్రమలు తొలగిపోయ్యాయి. ఆయన స్వామివారి పాదాలకి మొక్కాడు.

"చిన్నా! నీకు దిష్టి తగిలింది, అందుకే ఇట్లాంటి రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. సాధారణంగా ఇట్లాంటి ఆలోచనలు రచయితలకి వస్తుంటాయి! వాళ్లొట్టి పనికిమాలినవాళ్ళు. కావునే - ఏ కథో, కవితో రాసుకుని ఆత్మానందం పొందుతారు." దరహాసంతో అన్నారు స్వామివారు.

వినాయకరావు చిరునవ్వు నవ్వాడు.

"చిన్నా! కొన్నాళ్ళపాటు ప్రశాంతంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకో, దేవుడికి తలనీలాలు సమర్పించు. నెత్తిమీద ఉన్నది నాలుగు వెంట్రుకలే కదాని మొహమాటపడకు! దేవుడు కరుణామయుడు, చిన్నవిషయాలు పట్టించుకోడు. హుండీలో కానుకలు వెయ్యి, గట్టిగా ప్రార్ధించు. ఎన్నికల్లో 'నువ్వు చేశాననుకుంటున్న' పాపం పరిహారం అయిపోతుంది." అంటూ కర్తవ్యాన్ని బోధించారు స్వామివారు.

వినాయకరావుకి ఇప్పుడు హుషారుగా ఉంది. హాయిగా నవ్వసాగాడు.

"చిన్నా! నువ్వు తెలివైనవాడివి, చురుకైనవాడివి. ముందుముందు మంచి భవిష్యత్తు ఉన్నవాడివి. ఈసారి నీకు మంత్రి పదవి ఖాయం. ముఖ్యమంత్రితో చెప్పి మంత్రివర్గంలో మంచి శాఖొహటి ఇప్పిస్తా. ఇహ ప్రశాంతంగా ఉండు." అంటూ చిన్నగా నవ్వుతూ అన్నారు స్వామివారు.

స్వామివారు ఎన్నికల్ని ఎందుకు అంతలా స్పెషలైజ్ చేశారో అర్ధమైంది వినాయకరావుకి.

"సరే స్వామి! ఇంక సెలవు. ఆ వందెకరాల ప్రభుత్వ భూమి మీ ఆశ్రమం పేరుకి మార్చేలా కృషి చేస్తాను." అన్నాడు వినాయకరావు.

స్వామివారు చిరునవ్వు నవ్వారు.

"చిన్నా! ఆ విషయం ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడాను, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింతరవాత ఆయన చేసే మొదటి సంతకం మన ఫైల్ మీదే!"

"స్వామీ! యువార్ గ్రేట్!" అంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు వినాయకరావు.

disclaimer :

అంతా కల్పితం.. పాత్రలు కూడా. ఎవరినీ ఉద్దేశించి రాయలేదు.

(picture courtesy : Google)