అదొక సైకియాట్రీ కాన్ఫరెన్స్ రోజు. పగలంతా ఎకడెమిక్ కార్యక్రమాలతో వేడెక్కిన బుర్రని చల్లబరచడానికి సాయంకాలం ఓ పార్టీ. పేద్ద హాల్, అందులో పెద్దసైజు అప్పడాల్లా - తెల్లటి గుడ్డతో ముసుగేసుకున్న గుండ్రటి టేబుళ్ళు. సరదా కబుర్లు. వెచ్చని గ్లాసులు, చల్లని మగ్గులు.
ఓ టేబుల్ చుట్టూ సీనియర్ సైకియాట్రిస్టులు. వాళ్ళల్లో ఒకాయన నన్ను చూడంగాన్లే దగ్గరగా రమ్మని సైగ చేశాడు, ఆప్యాయంగా యోగక్షేమాలు విచారించాడు.
వున్నట్టుండి పక్కనున్నవారితో - "మనవాడికి తెలుగు సాహిత్యంలో మంచి నాలెడ్జ్ వుంది." అన్నాడు.
ఇట్లాంటి స్టేట్మెంట్ నేనూహించలేదు. అందువల్ల బోల్డెంత సిగ్గుగా అనిపించింది.
"అబ్బే! అదంతా ఒకప్పుడు లేండి, ఇప్పుడు కాదు." మొహమాటంగా అన్నాను.
"అదేంటయ్యా? ఆరోజు మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగు రచయితల గూర్చి చెప్పావుగా!?" పెద్దాయన ఆశ్చర్యపొయ్యాడు.
"ఆ రోజు మీకు రావిశాస్త్రి, పతంజలి గూర్చి మాత్రమే చెప్పానండీ!" సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు చెప్పాను.
ఒక సీనియర్ డాక్టర్ నా వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడు.
"ఐసీ! వాళ్లిప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాదులోనా?"
"వాళ్ళిప్పుడీ లోకంలో లేరు." ఇబ్బందిగా అన్నాను.
"తెలుగు రైటర్స్ ఇంగ్లీష్ లిటరేచర్ని కాపీ కొట్టి రాస్తారంటారు, నిజమేనా?" ఇంకో సీనియర్ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.
నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. వారి సైకియాట్రీ జ్ఞానం పట్ల నాకు గౌరవం వుంది. వారికి తెలుగు సాహిత్యం గూర్చి అసలేమీ తెలీదని అర్ధమవుతుంది. ఏదో నేను దొరికాను కదాని - కాలక్షేపంగా ధర్మసందేహాలు అడుగుతున్నారు.
"అంత లోతైన విషయాలు నాకు తెలీదండీ!"
ఇంకా అక్కడే వుంటే ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయంతో - "ఎక్స్యూజ్ మి" అంటూ ఏదో పనున్నవాళ్ళా అక్కణ్నుండి పారిపొయ్యాను.
అయితే - నేనిప్పుడు ఇంతకుముందులా సిగ్గు, మొహమాటం ఫీలవ్వట్లేదు! ఇక్కడ - పాతికేళ్ళ క్రితం ఓ పాతిక తెలుగు పుస్తకాలు చదివిన నేనే గ్రేట్!
దీన్నే 'ఏ చెట్టు లేని చోట ఆవఁదం చెట్టే గొప్ప' అంటారనుకుంటాను. అయితే - తన చుట్టూతా ఏ చెట్టూ లేకపోవడం ఆవదం చెట్టు తప్పు కాదని మనవి చేసుకుంటున్నాను!