Saturday 7 December 2013

అనాధరక్షకా! పాహిమాం పాహిమాం!!


(ఉపాధ్యాయులు ఈ పోస్టు చదవరాదు. చదివినచో వారి హృదయము గాయపడును.)

"చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా పాస్ మార్కులు కూడా రావట్లేదు. నేను ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి?" అడిగాడు ఎంబీయే చదువుతున్న విద్యాధమరావు.

అప్పుడప్పుడు నేను నా పోస్టుల్ని పేషంట్ల సంభాషణతో మొదలెడుతుంటాను. కారణం.. నా ఆలోచనలకి ఫస్ట్ గేర్ వేస్తుంది వాళ్ళే కాబట్టి. ఒక ఆలోచనకి క్రెడిట్ ఇవ్వకపోవడానికి నేనేమీ తెలుగు సినీరచయితని కాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్నివిషయాల్లోనూ నైతికతకి ప్రాణం పణంగా పెడతాను.

"బాగా చదువుతున్నానని మీరు అనుకుంటే కుదరదు. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ కీ ఫర్ సక్సెస్. రీడ్ అండ్ ఫర్గెట్. రీడ్ అండ్ ఫర్గెట్. బట్ డు నాట్ ఫర్గెట్ టు రీడ్......." సడన్ గా మూడాఫ్ అయిపోయింది. మాట్లాడాలనిపించలేదు. విద్యాధమరావుకి ఏదో చెప్పి పంపించేశాను.

నామీద నాకే చికాగ్గా అనిపించింది. అసలింతకీ నే చెప్పేది నేన్నమ్ముతున్నానా? లేదు కదా! మనకి నమ్మకం లేని విషయాల్ని ఎదుటివారికి చెప్పడం ఆత్మవంచన కాదూ? పేజీల కొద్దీ పాఠాల్ని బట్టీయం వేసి పరీక్షలు రాసే విధానానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఈ దేశానికి పట్టిన ఈ దరిద్రపు గొట్టు పరీక్షల పధ్ధతి వదిలేదెప్పుడో గదా!

ఇప్పుడు విద్యార్ధుల ప్రతిభని టన్నుల్లెక్కన పెంచి పరీక్షల్లో ప్రధమ స్థానంలోకి నెట్టడానికి వీధికో వ్యక్తిత్వ వికాస నిపుణుడున్నాడు. కానీ పుస్తకాలు వల్లెవేసి పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించడం అసలు ప్రతిభే కాదని నా అభిప్రాయం. ఆ విషయం గొంతు పోయ్యేలా అరిచి చెప్పినా వినే వెధవెవ్వడూ కనబడట్లేదు. ఈ రోజుల్లో సుభాషితాలు బోధించడం కూడా ఒక వృత్తిగా మారింది.

నాకు మొదట్నుండీ నీతులు చేప్పేవాళ్ళంటే ఎలర్జీ. ఎదుటి వాడికి నీతులు చెప్పేవాడు వాటిని పాటించడని నా నమ్మకం. తాము పాటించని నీతులు చెప్పడం నీతిబాహ్యమైన విషయం కూడా. యండమూరిని చదివి గురజాడ కబుర్లు చెప్పరాదు. ప్రస్తుతం మన తెలుగు దేశంలో సుభాషితాలు బోధిస్తున్నవారికి కొరత లేదు. విని ఏడవడం మించి మనం చేయగలిగింది లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నా 'కౌన్సెలింగు' కూడా ఆ కోవకే చెందుతుంది కాబట్టి.

సరే! అదలా ఉంచుదాం. అందరూ 'ప్రధమ స్థానం పొందడం ఎలా?' అనే రాస్తున్నారు. కానీ అధమ స్థానం వారిని పట్టించుకునేవాడేడి? ఎందుకు లేడు? నేనున్నాను! అందువల్ల ఇప్పుడు నేను 'వెంట్రుక వాసిలో పరీక్ష పాసవ్వడం ఎలా?' అన్న సబ్జక్టుపై కొన్ని టిప్స్ ఇస్తాను. చదివి బొటాబొటి మార్కుల్తో పాసైపోయి చరితార్ధులు కండి.
              
పరీక్షలు రాయటంలో ఒక్కోడిది ఒక్కో స్టైల్. బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకునేవాడి గూర్చి మనకనవసరం. వాణ్ని అవతల పెడదాం.ఇప్పుడు మూరెడు చదువుకి బారెడు మార్కులు కొట్టేయ్యడం ఎలా? అన్నది విషయం. అసలిదో ఆర్ట్. పాసుకీ, ఫైలుకీ వెంట్రుకవాశిలో ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తూ.. టి ట్వెంటీ మ్యాచిలోలా చివరి బంతికి గెలిచినట్లు.. చివరాఖరికి పాసై బయటపడటం అనేది ఒక గొప్ప విద్య.

మనం ముందుగా అధ్యాపకుల సైకాలజీ విశ్లేషించుకోవాలి. ఎక్కువమంది అధ్యాపకుల మనస్సు చిత్తూరు నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావుల మేలు కలయిక. అత్యంత ఉదార స్వభావులు. కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టని బుద్ధిజీవులు. ఈ విధంగా టీచర్ల సైకాలజీ గుర్తుంచుకునిన యెడల తలపెట్టిన కార్యము విజయవంతంగా ముగించ వచ్చును. 
                            
వెనకటొకడు ఆవు పాఠం మాత్రమే చదువుకుని పరీక్షల కెళ్ళేవాట్ట. ఏ ప్రశ్నకైనా తనకి తెలిసిన ఆవుపాఠం మాత్రమే రాయాలని డిసైడయిపొయ్యాడు. రైలు గూర్చి రాయమంటే.. రైలు, రైలు పక్కన ఆవు, ఆవు తెల్లగానుండును, ఆవు పాలిచ్చును. అని ఆవు పాఠం రాసేసేవాడు. వృక్ష ప్రయోజనాలు రాయమంటే.. 'వృక్షము, పక్కనే ఆవు, ఆవు తెల్లగానుండును.' అంటూ మళ్ళీ తన ఆవు పాఠం రాసేవాడు. అనగా.. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం ఒకటే!

చాలామంది ఈ ఆవుకథని ఒక జోకుగా భావిస్తారు. కానీ నాకు ఈ కథలో ఒక గొప్ప జీవితసత్యం కనిపిస్తుంది. ఇప్పుడు మీ సబ్జక్టులో మీకు నచ్చిన ఏవైనా నాలుగైదు ప్రశ్నలకి సమాధానాలు క్షుణ్ణంగా చదువుకోండి. ఓపికుంటే ఒకట్రెండు స్లిప్పులు రాసుకుని దాచుకోండి. ఇన్విజిలేటర్ కరుణామయుడైనట్లైతే ఈ స్లిప్పులే ఆదుకోగలవు. ఇప్పుడిక మీ ఆవు పాఠం రెడీ!
                    
మీరు ప్రశాంత చిత్తంతో పరీక్షా హాల్లోకి అడుగు పెట్టవలెను. పెద్దగా చదివి చచ్చింది లేదు కాబట్టి ఎలాగూ టెన్షన్ ఉండే అవకాశం లేదు. ప్రశ్నాపత్రాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదవవలెను. ఇప్పుడు చంద్రబాబు ఇంకుడు గుంట, రాజన్న జలయజ్ఞం స్థాయిలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. రాయాల్సిన సమాధానాల్ని మనసులోనే మూడు సెక్షన్లుగా విభజించుకోవాలి.

సెక్షన్ 1.

ఇది సమాధానాలు బాగా తెలిసి చక్కగా ఆన్సర్లు రాయగలిగిన సెక్షన్. ఈ సెక్షన్లో చక్కగా, నీటుగా రాసెయ్యాలి. ఎప్పుడు కూడా మనకి బాగా తెలిసిన ఆన్సర్లతోనే పరీక్ష రాయడం మొదలెట్టాలని గుర్తుంచుకోవాలి. దురద్రుష్టవశాత్తు.. మనకీ సెక్షన్ అతి చిన్నది. దిగులు చెందకు. సాహసమే నీ ఊపిరిగా ముందుకు (తరవాత ప్రశ్నకి) సాగిపొమ్ము. ఒక్క ప్రశ్నకి సమాధానం తెలిసినా చాలు. కానీ ఓపెనింగ్ మాత్రం అద్దిరిపోవాలి.   
                    
సెక్షన్ 2.

ప్రశ్న అర్ధమవుతుంది. ఆన్సర్ మాత్రం పూర్తిగా గుర్తు రాదు. గుర్తొచ్చినా.. అది పరిమాణంలో తెలుగు సినిమా కథలా కొంచెంగా మాత్రమే ఉంటుంది. అందువల్ల ఆన్సర్లు కూడా.. కాళ్ళు, కళ్ళు లేని మనిషి బొమ్మ గీసినట్లుగా రాసెయ్యాలి. అయితే పేపర్ కరెక్ట్ చేయు పెద్దమనిషి అమాయకుడు. 'పాపం! ఈ కుర్రాడెవడో క్వశ్చన్ సరీగ్గా అర్ధం చేసుకోలేకపొయ్యాడు. కానీ వీడికి ఆన్సర్ తెలుసు. తెలిసినా ఎందుకో సరీగ్గా రాయలేకపోయాడు.' అనే భావనతో మార్కులు వేసేస్తారు.

ఈ రకంగా రాయడం పేపర్ దిద్దే వ్యక్తిని మోసం చెయ్యడం అవదూ? ఆహా! ఎందుకవదు? ఇది ఖచ్చితంగా మోసం చెయ్యడమే. కానీ.. అట్లాంటి గిల్ట్ ఫీలింగ్స్ మనసులోకి రానీయకు. నథింగ్ పెర్సనల్. ఇదంతా ఆటలో భాగం. పరీక్ష పాసవ్వడమే నీ తక్షణ కర్తవ్యం. అంతలోనే మర్చిపోయ్యావా? 
                              
సెక్షన్ 3.

ఈ సెక్షన్ అతి ముఖ్యమైనది. అస్సలు అర్ధం కాని ప్రశ్నలు ఈ సెక్షన్లోనే ఉంటాయి. ఈ సెక్షన్ విడియో గేమ్ లో లాస్ట్ స్టేజ్ వంటిది. ప్రశ్నకి సమాధానం కనీసం ఏ చాప్టర్లో ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు మనం అతి జాగ్రత్తగా మన ఆవుకధని బయటకి తీసి రాయటం మొదలెట్టండి. సాలెపురుగు దారం మందాన సమాధానానికి, ప్రశ్నకి లంగరు వెయ్యండి. 
                            
ఈ ఆవుకధ సమాధానం రాయటంలో అండర్ కరెంట్ గా 'బాంచెన్! కాల్మొక్తా', 'అనాధ రక్షకా! పాహిమాం పాహిమాం' అని ఆర్తనాదాలు చేస్తూ మన దీనావస్థని ప్రదర్శిస్తున్నట్లుగానూ.. 'అయ్యా! మాదాకబళం తండ్రీ' అంటూ ముష్టెత్తుతున్నట్లుగానూ ద్వనింపచేయటం మంచిది. ఇక్కడ మన దురవస్థని ఎంత బాగా ప్రజంట్ చెయ్యగలిగితే అంత గిట్టుబాటు. అందుకే ఈ మూడో సెక్షన్ రాసేముందు మూడ్ కోసం 'నడిపించు నా నావా' మరియూ 'గాలివానలో వాననీటిలో' వంటి స్పూర్తిదాయకమైన పాటలు మనసులో పాడుకోండి.  
                    
ఆచార్యులవారు మన పేపర్దిద్దటం మొదలెట్టిన మొదట్లో ఎవడో distinction గాడి పేపేర్ దిద్దుతున్నానుకుంటారు. వారినలా అనుకోనిద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయనగారి దిద్దుడు సెకండ్సెక్షన్లోకి వచ్చినప్పుడు 'పాపం చాలా మంచి స్టూడెంట్ ఇలా తికమక పడ్డాడేమిటి?' అనే అశ్చర్యంతో మార్కులు వేస్తారు. చివరి సెక్షన్ కొచ్చేసరికి మన అసలు రంగు బయట పడుతుంది. మన సినేమా కబుర్లు చదివి.. ఈ దరిద్రుడికి సత్తా లేదనీ, సత్తు రూపాయ్ గాడనీ అర్ధమైపోతుంది. కానీ అప్పటికే రెండోసెక్షన్లో ఉదారంగా మార్కులేసేసి ఉండటం చేత.. తను మోసపోయినందుకు పిచ్చికోపం వస్తుంది .  
                          
మిత్రులారా! మరొక్కసారి చెబుతున్నాను. అనాదిగా ఉపాధ్యాయులు ఉత్తములు, దయామయులు, కరుణా స్వరూపులు, సహృదయులు, ధర్మప్రభువులు. వారి కోపం పాలపొంగు. వీడి ఆవుకధకి గుండుసున్నా వేసి విసిరికొడదాం అనుకుంటూనే.. అప్పటిదాకా మనం స్కోర్ చేసిన మార్కులు చూస్తారు. పాసుమార్కులకి కూతవేటు దూరంలో.. సరిహద్దు గాంధీ వలే పారాడుతూ ఉండుట గమనించి ఆలోచనలో పడతారు.

'ఇంకొన్ని మార్కులు.. తృణమో, పణమో' అంటూ జిడ్డుమొహంతో, బిక్షాపాత్రతో వీధులంట తిరిగే దీనబిక్షువు వలే తచ్చాడుతున్న మన దురవస్థకి జాలిపడి 'యూజ్ లెస్ ఫెలో, ఈడియట్, యు డొంట్ డిజర్వ్ టు బి పాస్డ్' అని విసుక్కుంటూ పాసుకి అవసరమయ్యే దోసెడు మార్కులు.. మన ఆవుకధకి వేస్తారు.  
                      
ఏం పర్లేదు, ఫీలవ్వకండి. మనని వాళ్ళెంత తిట్టినా మనక్కావాల్సింది పాసవ్వటం. పైగా.. మనకి వాళ్ళ తిట్లు అర్దమయ్యేంత ఇంగ్లీషు రాదు కాబట్టి.. వాళ్ళ తిట్లు వాళ్ళదగ్గరే ఉండిపోతాయి, మన మార్కులు మనకి పడిపోతాయి. అమ్మయ్య! ఇప్పుడు మీరు పాసైపొయ్యారు. రిలాక్స్! హాయిగా సెకండు షో సినిమాకెళ్లి, అన్నం తిని బబ్బొండి.

ఉపసంహారం :

'భలే చెప్పావు. నీ జ్ఞానాన్ని బిందెల కొద్దీ బోర్లించావు. టిప్పులు బానే ఉన్నాయి. థాంక్స్! ఇన్ని నీతులు చెప్పిన నువ్వు, విద్యాధమరావుకి ఫీజు వాపసు ఎందుకివ్వలేదు?'

'అయ్యా! నేనిందాకే మనవి చేసుకున్నాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను నిప్పులాంటి మనిషినని. పోస్టు ముందొక మాటా, వెనకొక మాట చెప్పే నిలకడలేని మనిషిని కాదు. ఫీజు వాపసిచ్చేసి నా కఠోర నియమాన్ని వదుకోలేను.'  
(pictures courtesy : Google)