Thursday 24 May 2012

ధారుణి రాజ్యసంపద (బీడీలబాబు కథ)

"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి" పద్యం భీకరంగా మొదలయ్యింది. వింటున్న కొద్దీ గుండెలు ఉప్పొంగసాగాయి, మరుగుతున్న రక్తం మరిపోసాగింది, హృదయం ఉరకలు వెయ్యసాగింది. భుజంమీద గద వుంచుకుని, ఠీవీగా మీసం మెలేస్తున్న భీముడు కళ్ళముందు నిలిచాడు.

నాకు పద్యాలు అంటే యేంటో తెలీదు, అర్ధం అసలే తెలీదు, పాడిందెవరో కూడా తెలీదు. మరేం తెలుసు? భీముడు తెలుసు! తల్చుకుంటే ఆ సభలోని వాళ్ళనందరినీ గదతో మోది క్షణంలో చంపేయగలడు. కానీ - చంపనీకుండా ధర్మరాజు ఆపుతున్నాడు. ఆవేశం కంట్రోల్ చేసుకోలేక భీముడు పద్యాలు పాడేశాడు, పాపం! అంతకన్నా భీముడు మాత్రం ఏం చెయ్యగలడు?

నా చిన్నతనంలో ఇప్పట్లా సంస్కృతిని, సంప్రదాయాన్ని పరిరక్షించే సంస్థలు లేవు. కళాబంధువులు, కళాసేవకులు అసలే లేరు. ఈ పనంతా ఒంటిచేత్తో శ్రీరామనవమి పందిళ్ళు చేసేవి. పాట కచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. అన్నీ కూడా శ్రీరామనవమి చలవే.

గుంటూర్లో వీధివీధికీ పోటాపోటీగా పందిళ్ళు ఉండేవి. రవి కాలేజీ ముందున్న పందిరి మా ఇంటికి బాగా దగ్గర. ఈ పందిరి నిర్వాహకులకి అక్కడ బడ్డీకొట్టుంది. వీరిది ఆ ఏరియాలో ఏకైక ముస్లిం కుటుంబం, అంచేత ఈ కొట్టుని 'సాయిబు కొట్టు'గా వ్యవహరించేవాళ్ళం. వీళ్ళు ఐదుగురు సోదరులు. వీరిలో సత్తార్, రజాక్ ముఖ్యులు.

ఈ పందిళ్ళల్లో - ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటకచేరీలు, డ్యాన్సులు, నాటికలు, నాటకాలు.. ఇలా రకరకాల ప్రోగ్రాంలు వుండేవి. రాత్రిళ్ళు భోంచేసి చాపలు తీసుకెళ్ళి స్టేజ్ ముందర పరిచేసేవాళ్ళం. ఒక్కొక్క చాప ఒక్కో కుటుంబానిది. వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం, పాండవోద్యోగ విజయాలు, చింతామణి.. చాలా నాటకాలు పడుకునే చూసేవాళ్ళం. నాటక కళాకారులు యాంత్రికంగా ఎవరి పద్యం వాళ్ళు పాడేసేవాళ్ళు. పాత్రధారుల మేకప్ దట్టంగా వున్నందున మొహంలో ఫీలింగ్స్ కనబడేవి కాదు, అక్కడ నటన కన్నా పద్యాలకే ప్రాధాన్యం. కృష్ణుడు, బ్రహ్మంగారు స్టేజ్ వెనుక బీడీలు తాగడం విచిత్రంగా అనిపించేది.

ఇప్పుడు మళ్ళీ అసలు కథలోకొద్దాం. పాండవ వనవాసము సినిమా రికార్డులో భీముడి పద్యాలు సైడ్ 'బి'లో ఉండేవి. సైడ్ 'ఎ' ద్రౌపది పాడిన ఏడుపుగొట్టు పాట - "దేవా! దీనబాంధవా! అసహాయురాలరా.. కావరా" వుండేది. నాకీ పాటంటే చిరాకు, అస్సలు  నచ్చదు. అయితే - సైడ్ 'ఎ' పాట తరవాతే, సైడ్ 'బి' పద్యాలు వేసేవాళ్ళు. నాకా  మూణ్నిమిషాలు మూడుగంటల్లాగా అనిపించేది.

అయితే - ఈ ఏడుప్పాట వల్ల ఒక ప్రయోజనముంది. లౌడ్ స్పీకర్లో ఆ పాట మొదలవ్వంగాన్లే ఇంట్లోంచి  పరుగందుకుని పందిట్లో వాలేవాణ్ణి. పందిట్లో మూలనున్న సీతారాములకి ఒక దణ్ణం పడేసి, ప్రసాదం నోట్లో వేసుకుని, భీముడి పద్యాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుండేవాణ్ణి. "ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి.. " మొదలు. మళ్ళీ గుండెలు.. రక్తం.. హృదయం.. షరా మాములే!

నాకీ పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేదికాదు. రోజంతా వినాలని చాలా కోరిగ్గా ఉండేది. కానీ ఏం చెయ్యను? ఆ రికార్డులు వేసే వ్యక్తిని అడిగే ధైర్యం లేదు. అతని పేరు షేక్ బాబు. ఎర్రగా, పొడుగ్గా, పీలగా నలిగిపోయిన వానపాములా ఉండేవాడు. అతను పొద్దస్తమానం బీడీలు తాగుతుండేవాడు, దగ్గుతుండేవాడు. దగ్గుతూ కూడా దీక్షగా బీడీలు కాలుస్తుండేవాడు! అంచేత కొందరతన్ని 'బీడీలబాబు' అనేవాళ్ళు.

గ్రామఫోన్ రికార్డులు మట్టివి. అవి పెట్టడానికి వీలుగా నిలువు అరలతో భోషాణం లాంటి చెక్కపెట్టె. పక్కన రికార్డ్ ప్లేయెర్. ప్లేయర్‌కి మూల బుల్లిఅరలో సూదులు. 'కీ' ఇవ్వడానికి 'జెడ్' ఆకారపు స్టీల్ పరికరం. బాబు రికార్డుల్నీ, గ్రామ్ ఫోన్‌నీ సున్నితంగా, ఎంతో నైపుణ్యంతో హేండిల్ చేసేవాడు. రికార్డుల్ని ప్లే చెయ్యడంలో అతనికేదో క్రమం వుంది, అన్ని రికార్డులు సమానంగా అరిగిపోవాలనే నియమం అయ్యుండొచ్చు.

బీడీలబాబు పద్యాలు మళ్ళీ ఎప్పుడు పెడతాడు? ఆ పద్యాల కోసం ఎదురుచూస్తూ అక్కడే ఎంతసేపు పడిగాపులు కాయాలి? పోనీ ఒక గంటదాకా ఆ పద్యాలు వెయ్యడా? అదేంలేదు, ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ పద్యాల్ని వెయ్యమంటే ఔటాఫ్ ఆర్డర్లో వేసేస్తాడు. అప్పటికే ఇంట్లోంచి నాలుగుసార్లు పరిగెత్తుకుంటూ వచ్చా. కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు ఏడుపొచ్చింది. 

అప్పటికి వందోసారి నిర్ణయించుకున్నాను. పెద్దయ్యాక నేనూ బీడీలబాబులా రికార్డులేసే ఉద్యోగంలోనే చేరతాను. పిల్లలు అడిగిన పాటలన్నీ వేస్తాను. భీముడి పద్యాలు వెంటవెంటనే వేసే బుద్ధి బాబుకి ప్రసాదించమని.. ద్రౌపది పాడినట్లు నేను కూడా 'హే కృష్ణా!' అంటూ ప్రార్ధించుకునేవాణ్ని. మనమెంత ప్రార్ధించినా ప్రయోజనం లేదని, బాబు సాయిబు అయినందున మన హిందుదేవుళ్ళు బాబు మనసు మార్చలేరని ఎదురింటి రాము అనేవాడు. పైన మబ్బుల్లో దేవుళ్ళంతా ఒకటేననీ, అక్కడ మన దేవుళ్ళు అల్లాకి రికమండ్ చేస్తారని పక్కింటి ఫణి వాదించేవాడు.

నా "ధారుణి రాజ్య సంపద.. " వీరాభిమానం కేవలం విన్డానికే పరిమితమా? కానేకాదు, ఇంట్లో భీముడుగా మోనో ఏక్షన్ చేసేవాణ్ని. పొయ్యి పక్కనున్న సరివికట్టె నా గదాదండము, దారం కట్టిన అట్టముక్క కిరీటం. ఈ రెండూ వొంటి మీదకి రాంగాన్లే నన్ను భీముడు పూనేవాడు. (లేని) మీసం మెలేస్తూ, తొడ కొడుతూ ఆవేశంతో ఊగిపొయ్యేవాణ్ణి.

"ఓరోరీ మాయాజూద వినోదా, మధు మదోన్మత్తా, దుర్యోధనా! నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా!" అని పెడబొబ్బలు పెట్టి, తొడ గొట్టుకుంటూ "ధారుణి రాజ్యసంపద" అంటూ గర్జిస్తూ పద్యం అందుకునేవాణ్ణి. ఇంటికి ఎవరొచ్చినా వారికి భీముణ్ణి చూపేవాణ్ణి. కొన్నిసార్లు నా ప్రదర్శనకి రెండుపైసలు పారితోషకం కూడా లభించేది. ఒకరోజు ప్రదర్శనలు ఎక్కువైనందున, తొడ వాచిపోయి ఏడుస్తుంటే అమ్మ కొబ్బరినూనె రాసి ఓదార్చింది.

కొన్నాళ్ళకి దేవుడు నా మొర ఆలకించాడు - మా పక్కింటి సత్తిగాడి రూపంలో! సత్తిగాడు నాకన్నా ఒకేడాది పెద్ద. లావుగా, పొట్టిగా గుండ్రాయిలా ఉంటాడు. తండ్రికి పక్కవీధిలో కిరాణా కొట్టుంది. సత్తిగాడు మధ్యాహ్నం తండ్రి కోసం భోజనం కేరేజ్ తీసుకెళ్ళేవాడు. తండ్రి అటుతిరిగి అన్నం తింటుంటే మనవాడు గల్లాపెట్టె వద్ద తన హస్తలాఘవం చూపేవాడు.

వచ్చేప్పుడు కేరేజ్ ఖాళీది తెచ్చేవాడు, జేబులు మాత్రం నిండుగా ఉండేవి. కొట్టుకొచ్చిన డబ్బుల్తో మాకు నిమ్మతొనలు, నువ్వు జీళ్ళు, తాటి చాపలు, కలరు డ్రింకులు ఇప్పిస్తుండేవాడు. మేం వాడి వంధిమాగధులం. వీధి మూలనున్న పొట్టి చెట్టుకున్న వంకర కొమ్మ మీద విలాసంగా పడుకుని మాతో పనులు చేయించుకునేవాడు. ఎంతయినా డబ్బుకున్న దర్జా దేనికీ లేదు!

పాండవవనవాసము, భీముడి పద్యాలు అంటూ సత్తిగాణ్ణి ఊదరగొట్టేశాను. నా అదృష్టవశాత్తు మా సత్తిగాడిక్కూడా భీముడి పద్యాలు తెగ నచ్చేశాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? సత్తిగాడు ఆర్డర్ పాస్ చేసేవాడు. బీడిలబాబు వినయంగా, డ్యూటిఫుల్గా 'ధారుణి రాజ్య సంపద' వేసేవాడు. చెవులారా వింటూ మైమరచిపొయ్యేవాణ్ని.

ఇంతకీ బీడీలబాబు సత్తిగాడి బంటు ఎలా అయ్యాడు? సింపుల్! బాబుకి, సత్తిగాడికి మధ్య బీడిల ఒప్పందం కుదిరింది. ఆ పద్యాలు ఒకసారి ప్లే చేస్తే రెండు హస్తం బీడీలు ఫ్రీ. లెక్కలు ఖచ్చితంగా ఉండేవి. ఆ విధంగా భావిభారత పౌరులమైన మేం దొంగతనానికి, లంచం కలిపితే చాలా ఎఫెక్టివ్‌గా పనులవుతాయని గుర్తించితిమి.

ముగింపు -

చిన్నప్పటి నా యాంబిషన్ అయిన మట్టిరికార్డులు ప్లే చేసే ఉద్యోగం సంపాదించలేక ఇంకేదో అయిపొయ్యాను. ఏం చేస్తాం? తలరాత, మనమందరం విధి చేతిలో పావులం!

మొన్న టీవీలో 'ధారుణి రాజ్యసంపద' పద్యాలు వచ్చాయి. చేస్తున్న పని ఆపేసి గుడ్లప్పగించేశాను. నాకు టీవీలో బీడీలబాబు, సత్తిగాళ్ళే కనిపించారు. ఔరా! కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది!