Monday 7 May 2012

ఉడిపి హోటళ్ళు.. రాజకీయ విశ్లేషణ


సమయం ఉదయం తొమ్మిది గంటలు, ఈ సమయంలో రోజూ నేను 'హిందూ'లో వార్తలు చదువుతూ తీవ్రంగా ఆలోచిస్తుంటాను. 

ఇంతలో హడావుడిగా సుబ్బు వచ్చాడు.

వస్తూనే - "రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"ఇందాక  మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ కొడుకు కనిపించాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎట్లాంటి గుంటూరు ఎట్లా అయిపొయింది మావా! ఒకప్పుడు మైసూర్ కేఫ్, శంకర విలాస్ ఊరికి మకుటాయమానంగా ఉండేవి. ఇప్పుడవి మాయమైపొయ్యాయి, ఎంతైనా ఆ రోజులే వేరు." నిట్టూర్చాడు సుబ్బు.

"సుబ్బూ! ఆపుతావా నీ వెధవ హోటళ్ళ గోల. దేశ రాజకీయ పరిస్థితి అస్సలు బాలేదు. నీకేమో పొద్దస్తమానం తిండి, హోటళ్ళే ప్రపంచం. వాటిల్లోంచి కొద్దిగా బయటకి రా! ఆలోచనా స్థాయి పెంచుకో!" విసుక్కున్నాను.

సుబ్బుకి నా మాటలు నచ్చలేదు.

"ఏంటీ? నాది వెధవ గోలా! 'హిందూ' చదివి దేశ రాజకీయాలు అర్ధం చేసుకునే దుస్థితిలో నువ్వున్నావు - నేన్లేను. కాదేది కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ, కాదేది రాజకీయ విశ్లేషణ కనర్హం అంటున్నాడీ సుబ్బు. కాఫీ హోటళ్ళ చరిత్రతోనే దేశ రాజకీయాలు కూడా అర్ధం చేసుకోవచ్చు, కానీ - ఆ విషయం నీకు తెలీదు. ఐ పిటీ యు!" అన్నాడు సుబ్బు. 

'హిందూ' పక్కన పడేశాను.

"ఏంటి సుబ్బూ నువ్వు చెబ్తుంది? కాఫీ హోటళ్ళకి దేశ రాజకీయాలకి సంబంధం ఉందా? ప్రూవ్ ఇట్." చాలెంజింగ్ గా అన్నాను.

సుబ్బూ ఒక్కక్షణం ఆలోచించాడు.

"ఓకే! మనకి ప్రతి ఊళ్ళో ఉడిపి హోటళ్లున్నాయ్. ఉడిపి వారు కష్టజీవులు, వారిలో ఎక్కువమంది అడ్డ పంచెలతో, పొట్టచేత పుచ్చుకుని ఉడిపి నుండి వలస వచ్చినవారే. వచ్చిన కొత్తలో తమ ఉడిపి హోటళ్ళలోనే వంటవాళ్ళగానో, సప్లైయర్లుగానో పనిచేస్తారు. వ్యాపార మెళకువలు నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, స్నేహాలు పెంచుకుంటారు. కొంతకాలానికి హోటల్ వ్యాపారానికి అనువైన ప్రదేశం గుర్తిస్తారు. కొద్ది పెట్టుబడితో చిన్న టిఫిన్ సెంటర్ మొదలెడతారు. శుచి, శుభ్రత, రుచి మైంటైన్ చేస్తూ, చాలా కస్టమర్ ఫ్రెండ్లీగా, నిజాయితీగా వ్యాపారం చేస్తారు. సహజంగానే వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొంతకాలానికి ఆ టిఫిన్ సెంటర్ ఒక చిన్నహోటల్ గా, అటుతరవాత ఒక పెద్దహోటల్ గా అభివృద్ధి చెందుతుంది."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీని సిప్ చేస్తూ, ఆలోచిస్తూ మాట్లాడటం కోనసాగించాడు సుబ్బు.  

"ఇప్పుడు మనం ఈ హోటళ్ళ సక్సెస్ స్టోరీని రాజకీయాల్లోకి తీసుకొద్దాం. మనదేశంలో వామపక్షాలు, బిజెపికి (కనీసం ఆన్ పేపర్) కొన్ని సిద్ధాంతాలున్నాయ్. కాబట్టి వాటిని పక్కన పెడదాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకవ్యక్తి పార్టీలే. ఆ పార్టీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కులం, ప్రాంతం వంటి అంశాలని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయ్. ప్రజల అవసరాలు, అవస్థలకి ప్రతిభావంతంగా స్పందించిన పార్టీలకి సహజంగానే ప్రజాదరణ వస్తుంది, అధికారమూ వస్తుంది. కాబట్టి - ఒక రాజకీయ పార్టీ పుట్టుక, ఎదుగుదల ఉడిపి హోటల్ చరిత్రని పోలి ఉంటుంది."

ఇంతలో నాకు ఫోనొచ్చింది.

"డాక్టర్ గారు! మా అబ్బాయికి ఎల్కేజీ పబ్లిక్ పరీక్షలో అరమార్కు తగ్గింది, ఇంక నేను బ్రతకడం అనవసరం, చచ్చిపోవాలనిపిస్తుంది." అంటూ ఓ కన్నతల్లి ఏడవసాగింది.

"అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది! టెన్షనొస్తే వేస్కోమని ఓ మాత్రిచ్చా గదా? అది మింగి పడుకో తల్లీ!" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. 

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"మన ప్రాంతీయ పార్టీల పునాది, పెట్టుబడి ఆ పార్టీ స్థాపకునికి ఉన్న జనాకర్షణే. ఇందుకు ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లే ఉదాహరణ. కొన్నాళ్ళకి వాళ్ళు ముసలాళ్ళైపోతారు. మారుతున్న సమాజానికి కొత్త సమస్యలు ఎదురౌతుంటాయి. కుర్రఓటర్ల ఆలోచనలకి తగ్గట్లుగా ఈ పార్టీలలో మార్పులు రావాలి. అనగా ఓటర్లలో తరం మారినట్లే నాయకత్వంలో కూడా తరం మారాలి. అయితే ఈ మార్పు ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది. అంటే - నెమ్మదిగా తండ్రుల స్థానంలో కొడుకులు రంగంలోకి రావాలి, తండ్రి ఆస్థి చెందాల్సింది కొడుక్కే గదా!"  

ఇప్పుడింకో పేషంట్ దగ్గర్నుండి ఫోన్.

"డాక్టరు గారు! నాకు చేతబడి చేయించిన వాడెవడో తెలిసి పోయింది. వాడెవడో కాదు, మా బామ్మర్దే!" అవతలి గొంతు చాలా ఉత్సాహంగా ఉంది.

"ఇంత ముఖ్యమైన విషయం ఫోన్లో మాట్లాడుకుంటే కుదర్దు. మీరే రండి, మాట్లాడుకుందాం."అంటూ ఫోన్ పెట్టేశాను.

సుబ్బు చెప్పసాగాడు.

"నాకు తెలిసి హోటళ్లు మేన్ మేనేజ్మెంట్ కి గొప్ప ఉదాహరణ. క్లీనర్లు, సప్లయర్లు, వంటవాళ్ళు.. అనేక వయసులవారు నిరంతరం పన్జేస్తూనే ఉంటారు. కొందరు హోటల్ పుట్టుక నుండి విశ్వాసంగా ఉంటారు, ఇంకొందరు పనిదొంగలు. ఎవరేమిటి? అన్నది ఓనర్ గ్రహించాలి. హోటల్ కష్టమర్లూ రకరకాలు. ఎక్కువమంది రెగ్యులర్ కస్టమర్లు, వారితే సత్సంబంధాలు కలిగుండాలి. ఇదంతా చెయ్యాలంటే - ఎంతో తెలివి, ష్రూడ్ నెస్ కలిగుండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టాడు గనకనే మన మైసూర్ కేఫ్ శంకరనారాయణ అద్భుత విజయం సాధించాడు. నా అభిప్రాయం ఆయనకి బిజినెస్ మేనేజ్మెంటులో ఒక గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. అంతేకాదు - IIM లో ఉపన్యాసం ఇప్పించాలి." 

"సుబ్బూ! మనం మైసూర్ కేఫ్ లో సాంబారు కనీసం లక్షలీటర్లు తాగుంటాం కదూ!" తన్మయత్వంతో అన్నాను.

"లక్షలీటర్లు కాదు, లక్షగ్యాలన్లు అన్నది కరెక్ట్. శంకరనారాయణ ఏనాడూ ఓనరుగా ప్రవర్తించలేదు. పనివాళ్ళతో కలిసిపోయి హోటల్ని నడిపాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన పిల్లలు చదువుకున్నారు, అంచేత వాళ్లకి హోటల్ పని మోటుగా అనిపించింది. వయసు మీద పడటంతో తన హోటల్ వ్యాపారం కొడుకులకి అప్పజెప్పాడు శంకరనారాయణ. వాళ్ళవి రాంగ్ స్ట్రాటజీస్, అందుకే - డైరక్టుగా క్యాష్ కౌంటర్ ముందు కూర్చున్నారు. వంటగది వైపు తొంగి కూడా చూసేవాళ్ళు కాదు. ఫలితంగా ఇడ్లీ వేడి తగ్గింది, సాంబారు రుచి తగ్గింది, హోటలుకి బిజినెస్ తగ్గింది." అన్నాడు సుబ్బు.

"శంకరనారాయణ బిజినెస్ మోడల్ గూర్చి నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ దాంతో దేశ రాజకీయాలకేం సంబంధమేంటి?" ఆసక్తిగా అడిగాను.

"చాలా సంబంధం వుంది. ఉదాహరణకి - ఉత్తర ప్రదేశ్ లో మూలాయం మంచి హోటల్ నడిపాడు. మనిషి పాతబడ్డాడు, బిజినెస్ తగ్గింది. ఈలోగా కొడుకు అఖిలేష్ చేతికందొచ్చాడు. అఖిలేష్ హోటల్లో డైరెక్టుగా క్యాష్ కౌంటర్లో కూర్చోకుండా, ప్లేట్లు కడగడం దగ్గర్నుండి దోశెలెయ్యడం దాకా అన్నిరకాల పనులు చేశాడు. వ్యాపారంలో కష్టనష్టాలు అర్ధం చేసుకోడానికి సైకిల్ యాత్రంటూ కష్టపడ్డాడు, పార్టీకి కొత్తరక్తం ఎక్కించాడు. ఫలితంగా హోటల్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు తండ్రి కొడుక్కి క్యాష్ కౌంటర్ అప్పచెప్పాడు. కుర్ర కస్టమర్ల అభిరుచులు కొడుకు చూసుకుంటుంటే, ముసలి కస్టమర్ల కోసం తండ్రి ఎలాగూ ఉన్నాడు. ఇది డెడ్లీ కాంబినేషన్." అన్నాడు సుబ్బు.

"ఓకే! మరి మన ఆంధ్రా రాజకీయాలు?" అడిగాను.

"తెలుగు దేశం పార్టీ అనే ఉడిపి హోటల్ని చంద్రబాబు బాగానే నడిపాడు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. కుర్ర కస్టమర్లకి చంద్రబాబు మెనూ నచ్చడం లేదు. ఇప్పుడిక తెలుగు దేశం పార్టీ నాయకత్వ మార్పిడి స్మూత్ గా జరగవలసిన సమయం ఆసన్నమైంది." అన్నాడు సుబ్బు.

"మరింక లేటెందుకు? హాయిగా లోకేశ్ కుప్పం నుండి సైకిల్ యాత్ర మొదలెట్టెయ్యొచ్చుగా?" అడిగాను.

"వచ్చు, కానీ - ఇక్కడొక చిక్కుంది. తెలుగు దేశం హోటల్ ఓనర్షిప్ చంద్రబాబుది కాదు, ఆ హోటల్ ఆయనకి పిల్లనిచ్చిన మామది. వంటశాలలో ఓమూల ఇడ్లీలేసుకుంటూ బ్రతికేస్తానని మామని నమ్మబలికి, క్రమంగా మామ క్యాష్ కౌంటర్ కే ఎసరుబెట్టాడు చంద్రబాబు. అసలు ఓనరైన ఎన్టీఆర్ వారసులకి హోటల్ నడిపే ఓపికా, యోగ్యతా లేవు. కానీ - ఎప్పటికైనా ఆ హోటల్  తమమదేనని అప్పుడప్పుడు గర్జిస్తుంటారు. చంద్రబాబు మింగాలేడు, కక్కాలేడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి." అన్నాడు సుబ్బు.

"మరి జగన్ సంగతి?"

"రాజశేఖర రెడ్డి 'కాంగ్రెస్' అనే హోటల్ని అద్భుతంగా నడిపాడు. అయితే - ఆయన 'కాంగ్రెస్ హోటల్'కి యజమాని కాదు, బ్రాంచి మేనేజర్ మాత్రమే. గాంధీ కుటుంబానికి చెందిన ఆ హోటల్ హెడ్డాఫీసు ఢిల్లీలో ఉంది. సోనియా గాంధీకి తన హోటల్ హైదారాబాద్ బ్రాంచి మీద హక్కులు జగన్ లాగేసుకుంటాడనే భయం పట్టుకుంది. తమ హోటల్ కి వ్యాపారం తగ్గినా పర్లేదు గానీ, అన్ని హక్కులు తన ముద్దుల కొడుకు రాహులుడికి చెంది ఉండాలని నిశ్చయించుకుంది. అందుకే జగన్ కి మొండిచెయ్యి చూపింది." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"జగన్ తొందరపడ్డాడేమో?"

"నేనలా అనుకోవడం లేదు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డికి క్యాష్ కౌంటర్ అప్పచెప్పారో అప్పుడే జగన్ కి ఢిల్లీ తాత్పర్యం అర్ధమైపోయింది. అతనికి ఎదురుగా చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి కొడుకులు కనిపిస్తున్నారు. వాళ్ళు సంవత్సరాలు తరబడి సప్లయిర్లుగా పనిచేస్తూనే ఉన్నారు. సోనియాగాంధి వాళ్ళకి కనీసం జీతం పెంచిన పాపాన పోలేదు. ఆవిడ ఉద్దేశ్యం జగన్ని కూడా సప్లయిర్ గా నిరంతరం పని చెయ్యమనే!" అన్నాడు సుబ్బు.

"అవును గదా! ఈ పాయింట్ నాకు తట్టనేలేదు సుమీ!" అన్నాను.

"జగన్ క్యాష్ కౌంటర్ పోస్ట్ కి తప్ప దేనికీ ఒప్పుకోడు. అంచేత - అతనికిప్పుడు వేరే ఆప్షన్ లేదు. అందుకే ఫ్రెష్షుగా ఇడ్లీపాత్ర, పెనం కొనుక్కుని, కాంగ్రెస్ హోటల్ ఎదురుగానే చిన్నహోటల్ సొంతంగా మొదలెట్టాడు. తన తండ్రి వంట రుచి చూసి ఆదరించిన పాత కస్టమర్లు వస్తారని ఆశ. అలాగే కస్టమర్లక్కూడా జగన్ హోటల్ టిఫిన్ల గూర్చి అవగాహన ఉంది. సక్సెస్ కి అడ్డదారులు లేవు మిత్రమా! కష్టపడాలి, అందుకే - జగన్ కష్ట పడుతున్నాడు. ఎండనకా, వాననకా ఓదార్పు యాత్రంటూ తిరుగుతున్నాడు." అన్నాడు సుబ్బు. 

"కిరణ్ కుమార్ రెడ్డి?"

"మన ముఖ్యమంత్రికి ఇడ్లీకి, అట్టుకి తేడా తెలీదు. అతనికి ఇంతకుముందు రాజశేఖరరెడ్డి హయాంలో క్లీనర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ తెలీకపోవడమే అతని అర్హత, అదే అతనికి ప్లస్సయింది.. ఢిల్లీ పెద్దలకి భలే నచ్చింది. అందుకే ఇప్పుడు క్యాష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. అందుకే - ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో (సప్లయిర్లుగా) పన్జేసిన సత్తి బాబు, డి.ఎల్. రవీంద్రారెడ్డిలు కిరణ్ని చూసి గుర్రుమంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! బాగా చెప్పావు. ఉడిపి హోటళ్ళ చరిత్రని తెలుసుకుంటే దేశరాజకీయాలు కూడా అర్ధమైపొతాయన్నమాట! నీ హోటల్ రాజకీయ పురాణం బాగుంది." నవ్వుతూ అన్నాను.

సుబ్బూ టైమ్ చూసుకుంటూ లేచి నిలబడ్డాడు.

"రవణ మావా! నేవెళ్తున్నా. దార్లో అమ్మకి చింతలూరివారి మాదీఫల రసాయనం కొనుక్కెళ్ళాలి. నువ్వు నీ 'హిందూ' శ్రద్ధగా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకో. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(picture courtesy : Google)