Monday 18 June 2012

సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ


'గుండమ్మకథ' సినిమా యాభయ్యేళ్ళ క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ తెలుగువాళ్ళ హృదయాల్లో గుండమ్మ స్థానం పదిలం. ఒకప్పటి సామాజిక స్థితిగతులు అంచనా వెయ్యడానికి ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక కొలమానం. ఇందుకు మంచి ఉదాహరణ గురజాడ 'కన్యాశుల్కం'. ఒక సినిమాకి సాహిత్యం స్థాయి లేకపోయినా, ఆనాటి సమాజాన్ని అర్ధం చేసుకోడానికి యెంతోకొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.

ఒక సినిమా యెలా పుడుతుంది? రచయిత తన ఆలోచనలతో ఒక పాత్ర సృష్టిస్తాడు. ఆ పాత్రకి దర్శకుడు - టెక్నీషియన్లు, నటీనటుల సహకారంతో ప్రాణం పోస్తాడు. ఇక్కడ అందరూ కలిసి చేసేది ఒకటే వంటయినా, ఎవరి వాటా వారికి ఉంటుంది. ఏ పాత్రనైనా ఒక సాధారణ ప్రేక్షకుడు identify చేసుకోకపోతే.. ఎవరూ చెయ్యగలిదేమీ ఉండదు. ఇప్పుడు గుండమ్మ పాపులారిటీకి కారణాలు ఆలోచిద్దాం.

ఈ సమాజం అనేక వ్యక్తుల, విభిన్న వ్యక్తిత్వాల సమాహారం. భిన్నఆలోచనల సంక్లిష్ట కలయిక. ప్రతి వ్యక్తి తన ప్రవర్తనని (అది ఎంత అసంబద్దమయినప్పటికీ) conscious mind తో సమర్ధించుకుంటాడు. కానీ అతని అసలు ఆలోచనల మూలాలు unconscious mind లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ unconscious mind ని బయటకి రానీకుండా అనేక defense mechanisms తొక్కిపెట్టి ఉంచుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'సైకోఎనాలిసిస్'గా ప్రాచుర్యం కల్పించాడు.

మానవ మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆలోచనాధోరణి నలుపు తెలుపుల్లో (flat గా) ఉండదు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తుల మధ్యగల సంబంధాలు.. ఇలాంటి అనేక variables ఒకవ్యక్తి యొక్క ఆలోచనలని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచనే మన ప్రవర్తననీ శాసిస్తుంది. ఈ నేపధ్యంలో గుండమ్మని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

గుండమ్మకి కూతురంటే చాలా అభిమానం, ఒకరకంగా గుడ్డిప్రేమ. ఎందుకు? మధ్యతరగతి కుటుంబాల్లో భర్త చనిపోయిన తరవాత ఒక స్త్రీ పడే social and emotional trauma దారుణంగా ఉంటుంది. ఆ తరవాత వాళ్ళు చాలా insecurity కి కూడా గురవుతారు. తమని ప్రేమించే తోడులేక, మనసులోని భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశంలేక, మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు.

'ప్రేమ' అనేది ప్రతివ్యక్తికీ ఒక మానసిక అవసరం. దేన్నీ ప్రేమించనివారికి బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. మానసికంగా ఏకాకిగా మిగిలిపోయినవారు.. తమ ప్రేమకి ఒక symbol గా ఒక వ్యక్తినో, జంతువునో, వస్తువునో ఎన్నుకుని తమ శక్తియుక్తులు ధారబోస్తూ అమితంగా ప్రేమిస్తారు. ఆ symbol పట్ల చాలా possessive గా కూడా ఉంటారు. ఆ సింబల్ని వదులుకోడానికి అస్సలు ఒప్పుకోరు. ఆ symbol చేజారితే depression లోకి వెళ్ళిపోతారు.

ఈ నేపధ్యంలో కూతురంటే గుండమ్మకి ఎందుకంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే తనకి ఇల్లరికపుటల్లుడు కావాలనుకుంటుంది గుండమ్మ. కూతురు భర్తని ఇంట్లోనే ఉంచుకోటంలో జమున సుఖం కన్నా, గుండమ్మ అవసరమే ఎక్కువన్నది మనం గుర్తించాలి.

గుండమ్మని గయ్యాళి అంటారు. అసలు ఈ 'గయ్యాళి' అన్న పదమే అభ్యంతరకరం. ఇది నోరున్న ఆడవారిని defame చెయ్యడానికి సృష్టించిన పదం అయ్యుండొచ్చు. గుండమ్మకి సంపద విలువ తెలుసు. సంపద ఎవరి దగ్గరుంటే వారిదే అధారిటీ అన్న కేపిటలిస్టు ఫిలాసఫీ కూడా తెలుసు! అందుకే తాళంచెవుల గుత్తి బొడ్లో దోపుకుని పెత్తనం చలాయిస్తుంటుంది.

గుండమ్మ సవతి కూతురి పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? ఈ సమాజం తనకి చేసిన అన్యాయానికి ప్రతిగా సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టడం ద్వారా కసి తీర్చుకుని sadistic pleasure పొందిందా? ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే ఇందుకు సమాధానం దొరుకుతుంది.

ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు. చాలాసార్లు కాన్పు కష్టమై తల్లి చనిపోవడం (maternal deaths) జరుగుతుండేది, అందుకే పిల్లల్ని కనడం స్త్రీకి పునర్జన్మ అనేవారు. వితంతువైన భర్త (నాకు ఇంతకన్నా సరైన పదం తోచట్లేదు) మరణించిన భార్య కన్న పిల్లల్ని సాకడనికి (బయటకి ఇలా చెప్పేవాళ్ళు గానీ, కుర్రపిల్లతో సెక్సు దురదే అసలు కారణం అని నా అనుమానం) రెండోపెళ్ళి చేసుకునేవాడు. ముసలి వెధవలు చిన్నపిల్లల్ని రెండోభార్యగా చేసుకోవటం ఆరోజుల్లో నిరాటంకంగా సాగిన ఒక సామాజిక అన్యాయం.

రెండోపెళ్ళివాడిని చేసుకునే అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, గతిలేని పరిస్థితుల్లో compromise అయ్యి ముసలాణ్ని చేసుకునేవాళ్ళు. ఈ అసంతృప్త అభాగినుల గూర్చి సాహిత్యంలో బోల్డన్ని ఆధారాలు ఉన్నయ్. (అయితే 'దేవదాసు'లో పార్వతి గంపెడు పిల్లల్ని 'చక్కగా' చూసుకుంటుంది. శరత్ కథల్లో మనలా నేలమీద నడిచే మనుషులకి తావులేదు. అందరూ ఆదర్శమూర్తులు, త్యాగధనులే).

తీవ్రమైన అసంతృప్తితో కాపురానికొచ్చిన యువతికి దిష్టిపిడతల్లాగా మొదటిభార్య సంతానం కనబడతారు, ఇంక తన కోపాన్ని పిల్లల మీదకి మళ్ళిస్తుంది. దీన్నే సైకాలజీ పరిభాషలో frustration - aggression - displacement  theory అంటారు. అంటే మనలోని నిస్పృహ, నిస్సహాయత క్రోధంగా మారుతుంది. ఆ aggression ని ఎదుటి మనిషిపై చూపే అవకాశం లేనప్పుడు.. అమాయకుల వైపు, అర్భకుల వైపు మళ్ళించబడుతుంది.

ఈ థియరీ ప్రకారం మనం గుండమ్మని అంచనా వేస్తే ఆమె సవతి కూతురు పట్ల యెందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అర్ధమవుతుంది. ఇక్కడ victim సవతి కూతురు. గుండమ్మని పుట్టింటివారు, భర్త కలిసి చేసిన అన్యాయానికి సవతి కూతురు బలయ్యింది. గుండమ్మని ఆపడానికి భర్త లేడు, సవతి కూతురు నిస్సహాయురాలు. ఇంతకన్నా soft target గుండమ్మకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే తన aggression కి ventilation కోసం సవతి కూతురు అనే soft target ని ఎంచుకుంది.

aggression theory లో ventilation కోసం soft targets ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. భార్య తాగుబోతు భర్తపై కోపంతో, ఏంచెయ్యాలో తోచక - పిల్లల్ని చావగొడుతుంది. 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' అనే సామెత ఉండనే ఉందిగదా!

సరే! గుండమ్మ ముసలి మొగుడు ఇద్దరు పిల్లల్ని పుట్టించి వెళ్ళిపోయాడు. మరప్పుడు భర్తమీద కోపం తన కూతురు, కొడుకుల మీద కూడా వుండాలి గదా? కానీ అలా ఉండదు. ఎందుకని? గుండమ్మది narcissistic personality. తాను, తన పిల్లలు మాత్రమే మనుషులు. 'తనది' అన్నదేదైనా అత్యంత ప్రీతిపాత్రం. 

అసలు గుండమ్మ ఎందుకలా నోరు పారేసుకుంటుంది? ఇక్కడ మనం ఫ్రాయిడ్ చెప్పిన reaction formation అనే defense mechanism ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో 'మగదిక్కు' లేని సంసారం అంటే అందరికీ అలుసు. గుండమ్మ తన ఆస్తిపాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అభద్రతా భావంలోంచి పుట్టుకొచ్చిన ప్రవర్తనే 'గయ్యాళితనం'. తన అశక్తతని, అమాయకత్వాన్ని బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండటం కోసం.. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటానికి గుండమ్మ 'గయ్యాళితనం' అనే ఆభరణం ధరించింది!

ఆ రోజుల్లో సమాజంలో గల సవతి లేక మారుతల్లి అనే stereotyping కూడా గుండమ్మ 'గయ్యాళి'తనానికి కారణం కావచ్చు. తెలిసోతెలీకో మనంకూడా ఒక్కోసారి ఈ సమాజంలో stereotypes గా మారతాం. మతం, కులం పట్ల కొందరి భావాలు ఒకే మూసలో ఉండటం ఈ stereotype కి ఒక ఉదాహరణ. గుండమ్మ కూడా చక్కగా ఈ stereotype లోకి దూరిపోయింది.

గుండమ్మలో మనకి projection కూడా కనిపిస్తుంది. 'సవతితల్లి రాచిరంపాన పెడుతుందంటారు గానీ.. నేను ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో!' అని గంటన్నతో అంటుంది. అంటే తన కఠినత్వానికి కూడా కారణం సావిత్రేననేది గుండమ్మ థియరీ! ఈ రకంగా తనకున్న అవలక్షణాలని, వికృత ఆలోచనలని ఎదుటివారికి ఆపాదించి సంతృప్తి చెందడాన్ని projection అంటారు.

సవతి కూతుర్ని ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వున్న పనివాడికిచ్చి పెళ్ళి చేస్తూ కూడా.. తనేదో ఆ తల్లిలేని పిల్లని ఉద్దరిస్తున్నట్లు పోజు కొడుతుంది. వాస్తవానికి గుండమ్మ సవతి కూతురికి చేసింది అన్యాయం. తాము చేసే తప్పుడు పనుల్ని అసంబద్ధ వాదనలతో సమర్ధించుకోవడాన్ని ఫ్రాయిడ్ భాషలో rationalization అంటారు. మన రాజకీయ నాయకులు ఈ కోవకి చెందినవారే!

గొప్ప సంబంధం అనుకుని నాగేశ్వరరావుని అల్లుడుగా చేసుకుంటుంది. అతనొట్టి తాగుబోతని, తాను మోసపోయ్యానని తెలుసుకుని హతాశురాలవుతుంది. మోసపోయిన కూతురి బాధ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు గుండమ్మ చాలా conflict కి గురవుతుంది. మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది, కానీ అతనంటే కూతురికి ఇష్టం.

ఇందాక చెప్పిన projection గుర్తుందికదూ? అల్లుడిని తిడితే కూతురు బాధ పడుతుంది. అది గుండమ్మకి ఇష్టం లేదు, కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అల్లుడి పట్ల కఠినంగా ఉండాలా? కూతురు భర్త కాబట్టి, కూతురు బాధపడుతుంది కాబట్టి, సహించి ఊరుకోవాలా? ఈ ద్వైదీభావాన్ని ambivalence అంటారు. ఈ ambivalent state లో ఉండి, నాగేశ్వరరావుని మందలిస్తున్న రామారావుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వాస్తవానికి గుండమ్మ కోపం రామారావుపై కాదు, నాగేశ్వరరావు మీద. మళ్ళీ displacement!

కూతురు దూరమై సగం చచ్చిన గుండమ్మని చాయాదేవి కొట్టి గదిలో బంధిస్తుంది. అప్పుడు గుండమ్మలో realization వస్తుంది. సావిత్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు guilt complex తో బాధ పడుతుంది. సావిత్రిని చూడంగాన్లే ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమించమని అడుగుతుంది. 'నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు.' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

గుండమ్మ వంటి egocentric personality ని catharsis స్థాయికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మంచి ఎత్తుగడలతో సన్నివేశాల్ని సృష్టించాడు. అందుకోసం చాయాదేవిని (నాకు ఈపాత్ర కూడా చాలా ఇష్టం) చక్కగా వాడుకున్నాడు. అందుకే గుండమ్మతో కూతుర్ని క్షమాపణ అడిగించిన మరుక్షణం ప్రేక్షకులంతా గుండమ్మ పక్షం వహిస్తారు. ఇది గుండమ్మ పాత్రపోషణలో నటిగా సూర్యకాంతం సాధించిన విజయం.

ఇంతకీ గుండమ్మ నెగటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఏదీ కాదు. మన మధ్యన తిరుగుతూ, మనతో పాటు జీవించిన ఒక సజీవ క్యారెక్టర్. మనలో, మన సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ గుండమ్మకి కూడా ఉన్నాయి, అందుకే ఈపాత్ర అంతలా పాపులర్ అయింది.

ఈ సినిమా సమయానికి సూర్యకాంతం గయ్యాళి అత్తగా career peak లో ఉంది, కోడళ్ళని పీడించే అత్తగార్లూ వీధివీధికీ ఉండేవారు. అంచేతనే - మనం సూర్యకాంతంతో identify చేసుకోగలిగాం, అత్తగా సూర్యకాంతానికి ఒక stardom ఇచ్చేశాం.

అయితే మనకిప్పుడు గుండమ్మలు కనిపిస్తారా? కనిపించరు. కారణం - ఇప్పుడు  వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మధ్యతరగతి వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. అందువల్ల స్త్రీలు కాన్పు సమయంలో చనిపోవడం లేదు.

ఆ రోజుల్లో ఆడామగా మధ్య భారీవయసు తేడాతో పెళ్ళి జరిగేది, ఇప్పుడలా జరగట్లేదు. ఒకప్పుడు మగవారి సగటు జీవితం ఆడవారి సగటు జీవితం కన్నా తక్కువ. ఇప్పుడు జీవితకాలాన్ని పెంచేసుకుని మగవారు కూడా ఆడవారితో సమానత్వం సాధించారు! అందువల్ల కూడా క్రమేణా గుండమ్మలు కనుమరుగయ్యారు.

'కన్యాశుల్కం' మొదటిసారి చదివినప్పుడు కన్యాశుల్కం అంటే ఏమిటో అర్ధం కాదు. అట్లాగే - వేగంగా మారుతున్న మన సమాజ పరిణామంలో కొంతకాలానికి మన ఉమ్మడి కుటుంబాలకి ట్రేడ్మార్క్ అయిన గయ్యాళి అత్తలు కనుమరుగై.. అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఇది సమాజానికి మంచిది కూడా!

(picture courtesy : Google)