Wednesday 20 March 2013

"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."


"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."

"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి."

"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద."

"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు."

"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును."

అదొక హై స్కూల్. ఆ స్కూల్ గోడల నిండా ఇట్లాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి.

ఒక పక్కగా హెడ్మాస్టర్ గారి ఆఫీస్. ఆ గదిలో ఇద్దరు కుర్రాళ్ళు గోడకుర్చీ వేసి ఉన్నారు. ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు గుంజిళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చేసిన నేరం.. పొరబాటున ఆ రోజు తెలుగు వార్తాపత్రిక చూశారు!

హెడ్మాస్టర్ గారు ఏవో కాయితాలపై సంతకాలు చేసుకుంటూ అంటున్నారు.

"వెధవల్లారా! ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? 'ఇంక జన్మలో తెలుగు పేపర్లు చదవం' అని రేపటికల్లా వందసార్లు రాసుకు రండి. అర్ధమైందా?"

ఏమిటీ అనర్ధం? ఎందుకీ అరాచకం? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది? హతవిధీ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా?

అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..

కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు. పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు.

'ఈ స్కూల్ బహు ముచ్చటగా యున్నది. పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా యుండునో?' అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు.

ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు.
"నీ పేరేంటి బాబూ?"

"నిఖిల్ రెడ్డి."

"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు.

"వై.యస్. రాజశేఖర రెడ్డి." తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు.

"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"

"చంద్రబాబు నాయుడు." ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు. బట్ట బుర్ర గోక్కున్నారు.

"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."

"వై.యస్. జగన్మోహన రెడ్డి." బుల్లెట్లా సమాధానం వచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు.

ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు.

"నీ పేరేంటి?"

"నవీన్ చౌదరి."

"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.

"ఎన్టీరామారావు." గర్వంగా చెప్పాడా కుర్రాడు.

ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి.

"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు. ఎవరాయన?"

"చంద్రబాబు నాయుడు." బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి.

ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది. నీరసంగా అడిగారు.

"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"

"వై.యస్.జగన్మోహన రెడ్డి." సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు. ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు. ఒక్క ఉదుటున లేచి.. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు.

పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు. మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్. హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు. ఆనక నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.

"మీ అమ్మ కడుపులు మాడ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం?" అంటూ ఫేనంత ఎత్తు ఎగిరారు.

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు.

"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"

"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి.

"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి.

హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిమ్మట ప్యూన్ పుల్లారావుతో ఆ రెండు పేపర్లు తెప్పించారు. పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు.

'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు. నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు.

అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు హెడ్మాస్టర్ గారు. ఆపై స్కూల్ విద్యార్ధులెవరూ తెలుగు వార్తాపత్రికలు చదవరాదనే నిబంధన పెట్టారు. ఆ నిబంధన కనుగుణంగా స్కూల్ గోడల నిండా కొత్త నీతివాక్యాలు రాయించారు. క్రమశిక్షణ తప్పిన పిల్లల్ని కఠినంగా శిక్షించసాగారు.

అయ్యా! అదండీ కథ!

(photos courtesy : Google)