Monday 25 March 2013

హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!


"ఉతికి ఆరవేయుట!"

"చీల్చి చెండాడుట!"

"చావగొట్టి చెవులు మూయుట!"

ఇవన్నీ అర్ధం చేసుకోవాలంటే ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' సాహిత్య వేదిక 'వివిధ'లో రంగనాయకమ్మ వ్యాసం "విప్లవాలు కుప్పకూలేది ఇందుకే!" చదవండి.

నా చిన్నప్పట్నించి రంగనాయకమ్మ సాహిత్య విమర్శ చదువుతున్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో అదే స్పష్టత, సూటిదనం! సాధారణంగా వయసు పైబడుతున్నవారి వాదనలో వాడి, వేడి తగ్గుతుంది. కలంలో పదును బండబారుతుంది. అయితే రంగనాయకమ్మ వీటన్నింటికీ అతీతం!

తెలుగు సాహిత్య విమర్శనా రంగం మర్యాదస్తుల వేదిక. అందుకే విమర్శకులు 'ఎందుకొచ్చిన గోల!' అనుకుంటూ తప్పుకుంటారు. అందుకు ఒక కారణం వారికి ఆ రచయితతో ఉండే సాన్నిహిత్యం. అంచేత మొహమాటం. అలాగే తెలుగు సాహిత్యంలో విమర్శల్ని సహృదయంతో స్వీకరించే వాతావరణం కూడా లేదు. పైగా విమర్శకులపై రచయిత ఎదురుదాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది (ఉదాహరణ.. డా.కేశవరెడ్డి 'మునెమ్మ').

'నామిని' రచనల్ని గోర్కీతో పోలుస్తూ ఎంతగానో మెచ్చుకోవడం.. అటు తరవాత అతని వ్యక్తిత్వం నచ్చక తీవ్రమైన విమర్శ చేయడం.. ఒక్క రంగనాయకమ్మకే చెల్లింది. సన్మానాల కోసం, పురస్కారాల కోసం వెంపర్లాడే రచయితలకి తెలుగు సాహిత్యం పుట్టినిల్లు. ప్రముఖ రచయితలు తమ భజన మండళ్ళని ప్రోత్సాహిస్తూ పీఠాధిపతులుగా చలామణి అవుతుంటారు. ఈ వాతావరణం కారణంగా నిష్కర్షగా, నిర్మొహమాటంగా రాసేవారి సంఖ్య రోజురోజుకీ చిక్కిపోతుంది.

రంగనాయకమ్మ 'విరసం'ని ఇంత తీవ్రంగా విమర్శించడం నాకు విశేషంగా అనిపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. రంగనాయకమ్మ రాసుకున్నట్లుగానే.. ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చలసాని ప్రసాద్ ఎంతగానో సహాయం చేశాడు. ఇవ్వాళ రంగనాయకమ్మ తీవ్రంగా విమర్శించిన కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాల ప్రచురణకి కారకుడు కూడా చలసాని ప్రసాదే! కానీ రంగనాయకమ్మకి దయాదాక్షిణ్యాలు ఉండవు!

సరే! కుటుంబరావు దయ్యాల వ్యాసాల పట్ల నా అభిప్రాయాల్ని "'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!" అంటూ ఇంతకు ముందే రాసేశాను. ఇప్పుడు ఈ టాపిక్ మీద కొత్తగా నే రాసేదేమీ లేదు.. ఒక్క రంగనాయకమ్మని అభినందించడం తప్ప!

"హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!"

(photos courtesy : Google)