Sunday 30 October 2011

జ్ఞానం - అజ్ఞానం


'పుస్తకపఠనం మంచి అలవాటు. తద్వారా సాహిత్య, సాంస్కృతిక, రాజకీయాల్లో టన్నులకొద్దీ జ్ఞానము, విజ్ఞానము సమూపార్జించుకొనవచ్చును. మేధావిగా కీర్తినొందవచ్చును.'

ఈ మాటలు సుబ్బారావు బుర్రలో బలంగా నాటుకుపొయ్యాయి. గొప్ప జీవితసత్యం బోధపడిపోయిందనిపించింది, తన కర్తవ్యం తెలిసిపోయింది.

'జ్ఞానం' అనబడే ఈ మహాసముద్రాన్ని - 'పుస్తకం' అనే చెంబుతో తోడెయ్యాలని నిర్ణయించేసుకున్నాడు. అంతే - బీరువాల కొద్దీ పుస్తకాలని చదివేసి అవతల పడెయ్యసాగాడు. అతనికి పుస్తక పఠనం అలవాటుగా, క్రమేపి ఒక వ్యసనంగా మారిపోయింది.

ప్రస్తుతం సుబ్బారావు ఏ విషయాన్నైనా రిఫరెన్స్ లేకుండా మాట్లాట్టం మానేశాడు. 'ఇప్పుడు రాత్రయింది' అని సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే సుబ్బారావుకి మాచెడ్డ చిరాకు. ఇప్పుడు రాత్రి ఎందుకైందో రిఫరెన్స్ చెప్పాలి, పగలు ఎందుక్కాదో కూడా  రిఫరెన్స్ లివ్వాలి.

సుబ్బారావుని అందరూ 'వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా' అని మెచ్చుకోడం మొదలెట్టారు. సుబ్బారావు మరింతగా రెచ్చిపోసాగాడు.

'ధరలు మండిపోతున్నయ్' అంటే అమెరికా ఎకానమీ గూర్చి, డాలర్ పతనం గూర్చి మాట్లాడతాడు. 'ఎండలు మండిపోతున్నయ్' అంటే గ్లోబల్ వార్మింగ్ గూర్చి ఉపన్యసిస్తాడు. 'ఫలానావాడు అప్పు చేశాడు' అంటే యే దేశం యే దేశానికి యెంత అప్పు పడిందో వడ్డీతో సహా లెక్కలు చెబ్తాడు.

సుబ్బారావు ధోరణి మొదట్లో ముచ్చట గొలిపినా, క్రమేపి మిత్రులకి విసుగొచ్చేసింది. ఒక్కొక్కళ్ళే అతనికి దూరం కాసాగారు. కొన్నాళ్లుగా సుబ్బారావు వొంటరి. ఇప్పుడు పుస్తక ప్రపంచానికీ, భౌతిక ప్రపంచానికీ తేడా మర్చిపొయ్యాడు.

రాత్రంతా తల్లి దగ్గుతూనే వుంది. "ఒరే సుబ్బడూ! దగ్గీదగ్గీ ప్రాణం పొయ్యేట్లుంది, డాక్టరుకి చూపించరా" దీనంగా అడిగింది. "అమ్మంటే యెలా వుండాలి? గోర్కీ అమ్మలా వుండాలి.  నువ్వేంటి పొద్దస్తమానం ఇట్లా దగ్గుతున్నావ్?" విసుక్కున్నాడు సుబ్బారావు. 

"పిల్లలు సరీగ్గా చదవట్లేదు, చాలా సమస్యగా వుంది" - భార్య మొత్తుకుంది. ఆమెని జాలిగా చూశాడు సుబ్బారావు - "పిచ్చిదానా! పిల్లల సమస్య కాశ్మీర్ సమస్య కన్నా పెద్దదా? ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ మీద జరిగిన ఒప్పందాలు తెలుసా?"

"నాన్నోయ్! తేజాగాడు నా బ్యాట్ లాక్కున్నాడు, అడిగితే తంతున్నాడు. బాబోయ్, నొప్పి." అంటూ ఏడుస్తూ వచ్చాడు కొడుకు. "ప్రశాంత్ భూషణ్ అంతటివాడే శ్రీరామసేనవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాడు, ఆఫ్టరాల్ నువ్వెంత? పో అవతలకి." ఆంటూ అరిచాడు.

భర్తతో తగాదాపడి పుట్టింటికొచ్చింది చెల్లులు. "అన్నయ్యా! మా ఆయన నన్ను ఒకటే తిడుతున్నాడు." సుబ్బారావు చెల్లెలి వైపు నిర్వికారంగా చూశాడు. "రంగనాయకమ్మ 'జానకి విముక్తి' చదువుకో. నీ సమస్య తీరిపోతుంది." చెల్లెలు తెల్లబోయింది.

ఉద్యోగం మానేశాడు సుబ్బారావు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది. అతనిప్పుడు రోజంతా శూన్యంలోకి చూస్తూ, తీవ్రంగా ఆలోచిస్తూ గదిలోనే గడిపేస్తున్నాడు.

దిగాలుగా చెప్పింది భార్య - "సరుకులన్నీ నిండుకున్నయ్, ఇవ్వాళ్టి నుండి మనందరికీ పస్తే."

శుష్కంగా నవ్వాడు సుబ్బారావు.

"ఇదిగో, ఇలా రా! ఈ పుస్తకాలు చూడు. ఇది ఎమిలీ జోలా 'ఎర్త్'. ఇదేమో పెర్లెస్ బక్ 'గుడ్ ఎర్త్'. వాళ్లీ రచనల్లో దరిద్రాన్ని ఎంతో అందంగా, మరెంతో రొమేంటిగ్గా రాశారు. నిజమే! ఆకలి దుర్భరమైనది. కాబట్టే 'క్రైమ్ అండ్ పనిష్‌మెంట్‌'లో  రాస్కల్నికోవ్‌, 'ఆఫ్ హ్యూమ  బాండేజ్‌'లో  ఫిలిప్‌లు అంతగా ఇబ్బందిపడ్డారు!"

భార్యాపిల్లలూ, తల్లీ ఏడుస్తూ తిట్టటం మొదలెట్టారు. 

"మీకు కోపం ఎందుకొస్తుందో తెలుసా? మన మెదడులో రసాయనాలు.. " చెప్పబొయ్యాడు సుబ్బారావు. 

కొడుక్కి మండిపొయ్యింది. తండ్రి ముంజేతిని కసిగా కసుక్కున కొరికాడు. సుబ్బారావుకి నొప్పెట్టింది. వెంటనే నొప్పి కలిగించే నాడీమండల వ్యవస్థ గూర్చి ఆలోచనలో పడ్డాడు.

ఒకరోజు -

సుబ్బారావు జ్ఞానసాగరంలో తేలుతూ.. ఆలోచనా తరంగాల్లో మునుగుతూ.. ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా.. స్పీడుగా వెళ్తున్న కారువాడు గుద్దేసాడు. 

తలకి పెద్దదెబ్బే తగిలింది. మూడ్రోజులు కోమాలో ఉన్నాడు. చుట్టపక్కాలు సుబ్బారావు అయిపోయాడనుకున్నారు.

భార్య పూజల వల్లనైతేనేమి, డాక్టర్ల ప్రతిభ వల్లనైతేనేమి - సుబ్బారావు చావు తప్పించుకున్నాడు. కొన్నాళ్ళకి ఆస్పత్రి నుండి డిశ్చార్జయ్యాడు. 'పుస్తకాల పిచ్చి వుంటేవుంది. మనిషి దక్కాడు, అంతే చాలు' అనుకుంది భార్య.

కొన్నాళ్ళ తరవాత -

దగ్గుతున్న తల్లి  దగ్గరకొచ్చాడు సుబ్బారావు - "అమ్మా! హాస్పిటల్‌కి  వెళ్దాం పద." అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది.

అటుగా వెళ్తున్న కొడుకుని  పిలిచి  మందలించాడు - "ఆటలు ఆడుకో, మంచిదే! కానీ చదువు చాలా ముఖ్యం." కొడుకు బిక్కమొహం వేశాడు.

టీవీ చూస్తున్న చెల్లెల్తో అన్నాడు - "బావకి కబురు చెయ్యమ్మా! నేనతన్తో మాట్లాడాలి." చెల్లెలి కళ్ళల్లో ఆనందం. 

వంటింట్లో వున్న భార్యని పిలిచాడు - "నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు, అయాం సారీ! త్వరలోనే ఉద్యోగంలో చేరుతున్నాను." ఆనందం పట్టలేక బిగ్గరగా ఏడ్చేసింది భార్య.

ఇంతలో - 

ఒక బట్టతల పెద్దమనిషి ఇంట్లోకి వచ్చాడు. మామిడిపండ్ల బుట్ట బల్లమీద పెట్టాడు. సుబ్బారావు భార్యకి రెండుచేతులు జోడించి నమస్కరించాడు. 

"అమ్మా! మీ ఆయన్ని గుద్దిన కారు నడిపింది నేనే. నాభార్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే హడావుడిలో.. క్షమించండమ్మా." 

కారు యజమానికి తిరిగి నమస్కరించింది సుబ్బారావు భార్య. 

"అయ్యా! మీరు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేం, మీరు మాపాలిట దేవుడు."

బట్టతల పెద్దమనిషికి విషయం అర్ధం కాలేదు, బుర్ర గోక్కుంటూ సెలవు తీసుకున్నాడు.

(posted in fb 15/7/2017)