Thursday 29 August 2013

'వేతనశర్మ' ఉద్యమం

ఒక సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఒక సమాజాన్ని అడవిగా భావించుకుని, మనుషుల్ని అడవిలో నివసించే జంతువులుగా మార్చి ఊహించుకుంటే.. సమాజాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది. అందుకే 'పంచతంత్రం' కథలు ఈనాటికీ నిత్యనూతనంగా ఉంటాయి. బహుశా అందుకేనేమో జార్జ్ ఆర్వెల్ జంతువుల్ని పాత్రలుగా చేసుకుని 'ఏనిమల్ ఫామ్' రాశాడు.

ఒక అడవిలో రక్షణ కోసం (జీవించే హక్కు కోసం) జంతువులు ఉద్యమం చేస్తుంటాయి. అందులో జింకలు ఉంటాయి. వాటి పక్కనే అవే స్లోగన్లిస్తూ పులులు కూడా ఉంటాయి. దూరం నుండి చూసేవారికి ఆ రెండు జంతువుల ఐకమత్యం చూడ ముచ్చటేస్తుంది. కానీ వాటి ఉద్యమ లక్ష్యం ఒకటి కాదు.

పులులకి కావలసింది వేటగాడి నుండి రక్షణ. జింకలకి రక్షణ కావలసింది వేటగాళ్ళ నుండే కాదు.. పులుల నుండి కూడా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ సంగతి తెలీని అమాయక జింకలు.. తమలో పులుల్ని కూడా కలిపేసుకుని ఉద్యమం చేస్తాయి. ఉద్యమం విజయవంతమైన తరవాత పులులు జింకల్ని ప్రశాంతంగా భోంచేస్తాయి.

'వేతనశర్మ కథ'. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన ఈ కథ ఎంతో ప్రసిద్ధి గాంచింది. ప్రస్తుతం ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో 'వేతనశర్మ కథ' గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందువల్ల ఇంతకుముందు నేన్రాసిన రావిశాస్త్రి 'వేతనశర్మ కథ'  మరొక్కసారి చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను.  

(photo courtesy : Google)